మున్సిపల్ సేవలకు ఆధార్ లింక్!
జీవో 179 జారీ చేసిన చంద్రబాబు ప్రభుత్వం
సర్కారు తీరును తప్పుపడుతున్న పౌరసంఘాలు
సంక్షేమ పథకాలలో కోత విధించేందుకేనంటూ ఆరోపణలు
సాక్షి, అమరావతి: పౌరుల వ్యక్తిగత గోప్యతపై చంద్రబాబు సర్కారు దాడి చేస్తూనే ఉంది. ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛను హరించే కూటమి ప్రభుత్వ తీరుపై పౌర సంఘాలు మండిపడుతున్నాయి. తాజాగా మున్సిపల్ సేవలకు ఆధార్ లింక్ పెట్టడాన్ని తప్పు పడుతున్నాయి. భవిష్యత్తులో సంక్షేమ పథకాలకు కోతపెట్టడానికే ప్రభుత్వం ఈ జీవో తెచ్చిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆన్లైన్ పౌరసేవలకు ఆధార్ను లింక్ చేయాలని ఆదేశిస్తూ ప్రభుత్వం శుక్రవారం జీవో 179 జారీ చేసింది.
దీని ప్రకారం మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో ఆన్లైన్ సేవల కోసం వెళ్లే పౌరుల ఆధార్ నంబర్ను లింక్ చేయనున్నారు. దీంతో పౌరుల వ్యక్తిగత వివరాలు సర్కారు చేతుల్లోకి వెళతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. పౌర సేవలు పారదర్శకంగా అందించడంతో పాటు మోసపూరిత లావాదేవీలను నిరోధించేందుకు ఈ విధానం తెచ్చినట్టు ప్రభుత్వం చెబుతున్నప్పటికి పౌరుల వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లే ప్రమాదం లేకపోలేదనే విమర్శలు వస్తున్నాయి.
స్వచ్ఛందం అంటూనే...
మున్సిపల్ సేవలలో ఆధార్ ధ్రువీకరణకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం తెలివిగా స్వచ్ఛందం అనే పదం ఉపయోగించింది. ఆధార్ ద్వారా «ధ్రువీకరణకు పౌరుడి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని పేర్కొంది. ఒక వేళ ఆధార్ ధ్రువీకరణకు అంగీకరించకపోయినా, అందుకు ప్రత్యామ్నాయంగా పాస్పోర్ట్, రేషన్ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి పత్రాలు అందించాలని స్పష్టం చేసింది.
డిజిటలైజేషన్ పేరుతో...
మున్సిపల్ సేవల డిజిటలైజేషన్ పేరుతో ఆధార్ ఆధారిత ధ్రువీకరణ తీసుకువచ్చినట్టు ప్రభుత్వం పేర్కొనడం గమనార్హం. ఆన్లైన్ సేవలు అందించడానికి విశ్వసనీయమైన డిజిటల్ గుర్తింపు «ధ్రువీకరణ వ్యవస్థ అవసరమని చెబుతోంది. ఆధార్తో పాటు ప్రత్యామ్నాయ గుర్తింపు విధానాల వల్ల సేవలు సమగ్రంగా అందుతాయని పేర్కొనడం విశేషం.
ఆన్లైన్ సేవలు ఇప్పటికే ఉన్నా...
రాష్ట్రంలో ఇప్పటికే వివిధ మున్సిపల్ సేవలు ఆన్లైన్లో అందుతున్నాయి. మన మిత్ర వంటి యాప్లు కూడా ఉన్నాయి. అయినా ఆధార్ ఆధారిత గుర్తింపు ధ్రువీకరణతో పౌరులు పదేపదే గుర్తింపు పత్రాలు సమర్పించాల్సిన అవసరం తగ్గతుందని పేర్కొనడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ వైపు ఆధార్ ధ్రువీకరణకు అనుమతి ఇస్తూనే.. మరో వైపు పౌరుడి సమ్మతి తీసుకోవాలని మెలిక పెట్టడంలోనే ప్రభుత్వం ఉద్దేశం బహిర్గత మవుతోందని చెబుతున్నారు. ఐచ్ఛికమే అనుకుంటే దాని కోసం ప్రత్యేకంగా జీవో తేవాల్సిన అవసరం ఏంటి అని పౌర సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
జీవో సమంజసం కాదు
ఓటుకు ఆధార్ లింక్ చేయడానికి ప్రభుత్వం ముందుకు రాలేదు. పౌరసేవలు అందించడానికి మాత్రం ఆధార్ అనుసంధానానికి చంద్రబాబు ప్రభుత్వం హడావుడిగా జీవో జారీ చేయడం సమంజసం కాదు. జీవోలో పేర్కొన్న పలు అంశాలు ప్రజలతో పాటు మున్సిపల్ కార్మికులను గందరగోళానికి గురి చేసే విధంగా ఉన్నాయి. ఇలాంటి జీవోలు తెచ్చే ముందు పాలకులు అన్ని రాజకీయ పార్టీలతో పాటు మున్సిపల్ ఉద్యోగ సంఘాలతో చర్చించాలి. పారదర్శక సేవల పేరుతో పౌరుల వివరాలు డేటా బేస్లో నిక్షిప్తం చేయడం తగదు. ప్రభుత్వం జారీ చేసిన జీవో179పై ఉద్యమ కార్యాచరణ చేపడతాం.
– తాటిపాక మధు, ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు


