రామదాసుకండ్రిగ భూ వ్యవహారంపై సోమిరెడ్డి అండ్ కో దుష్ప్రచారంపై కాకాణి నిప్పులు
పచ్చపత్రిక ఈనాడులో వండివార్చిన కథనంపై విమర్శలు
దమ్ముంటే ఆధారాలు చూపాలని సవాల్
నెల్లూరు (వేదాయపాళెం): రామదాసుకండ్రిగ భూ దోపిడీకి 2016లో సోమిరెడ్డి అండ్ కో చేసిన యత్నాన్ని తాను అడ్డుకున్నానన్న కడుపుమంటతో.. ఇప్పుడు అదే భూములకు సంబంధించి తనపై పచ్చపత్రిక ఈనాడులో తప్పుడు రాతలు రాయిస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి తీవ్రంగా విమర్శించారు. తప్పుడు రాతలకు దమ్ముంటే ఆధారాలు చూపాలని ఆయన సవాలు విసిరారు. పార్టీ నెల్లూరు జిల్లా కార్యాలయంలో శుక్రవారం కాకాణి మీడియాతో మాట్లాడుతూ, ‘సదరు భూముల వ్యవహారంపై సీబీఐ విచారణకు నేను సిద్ధంగా ఉన్నాను. అధికార పార్టీ నేతలకు ఈ దమ్ములేదు. సీబీఐ విచారణ జరిపితే తాము చేసిన తప్పులు బయటకు వస్తాయని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అండ్ కో భయపడడమే దీనికి కారణం.
సీబీఐ విచారణ జరపాలని నేను స్వయంగా హైకోర్టులో వేసిన పిటిషన్ను సైతం కొట్టివేయాలని అధికారుల చేత కౌంటర్ వేయించడం ఇక్కడ ప్రస్తావించాల్సిన అంశం. రామదాసుకండ్రిగ వద్ద వంద ఎకరాల భూ దోపిడీకి 2016లో సోమిరెడ్డి ప్రయత్నించారు. ఎకరా రూ.15 లక్షల భూమికి గాను రూ.6 లక్షలు రైతుల చేతిలో పెట్టి మిగిలిన రూ.9 లక్షల మొత్తాన్ని మింగేయడానికి కుట్ర పన్నారు. అలాంటి సందర్భంలో నా వద్దకు వచ్చినప్పుడు వారికి అండగా నిలిచి న్యాయ పోరాటం చేశాను. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్ణయించిన ధర ప్రకారం రూ.15 లక్షల పరిహారం అందేలా చర్యలు తీసుకున్నాను.
సోమిరెడ్డి అండ్ కో.. తమ మాట వినలేదని పేర్లు తొలగించిన రైతులకు సైతం పరిహారం అందించాం. మా ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క రైతయినా తాను మోసపోయానని స్టేట్మెంట్ ఇస్తే దానికి సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మేము అధికారంలో ఉన్నప్పుడు మొత్తం 100 ఎకరాల భూమిలో 50 ఎకరాలను మాత్రమే పరిశ్రమ కోసం ఇవ్వగలిగాం. మిగిలిన 50 ఎకరాలు ఇప్పటికీ ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేసి పరిశ్రమలు తీసుకురావాలి. మీరు చెబుతున్నట్లుగా ఎకరాకు రూ.కోటి చొప్పున రైతుకు పరిహారం అందేలా చర్యలు తీసుకోండి.
కనుపూరు గ్రామంలోని దేవదాయశాఖ భూములను ఆక్రమించి వైఎస్సార్సీపీ నాయకులు ఇళ్లు కట్టుకున్నారంటూ వచ్చిన కథనాలు పూర్తి అవాస్తవం. నవరత్నాలు– పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఆ భూముల్లో పేదలకు ఇళ్లు కట్టించాం. దేవదాయశాఖకు పరిహారం చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది’ అని స్పష్టం చేశారు. సర్వేపల్లిలో ప్రభుత్వ భూ దోపిడీ వివరాలను త్వరలో ఆధారాలతో సహా బయటపెడతానని కాకాణి స్పష్టం చేశారు.


