పాట్నా: బీహార్లోని గయా జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. బావిలోని మోటార్ను రిపేర్ చేయడానికి బావిలోకి దిగి విషవాయువులు పీల్చి తాత, తండ్రి, మనువలు చనిపోయారు. ఈ విషాద ఘటన నిన్న (శుక్రవారం) గయా జిల్లా డోభీ పోలీస్ స్టేషన్ పరిధిలోని గర్ కర్మౌనీ గ్రామంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. బావిలో మోటార్ను మరమ్మతు కోసం తండ్రి, కుమారుడు సహా చమారీ మాంఝీ, ఆయన కుమారులు దిల్చంద్ మాంఝీ, వికాస్ చౌదరి, విజయ్ చౌదరి అందులోకి దిగారు. ఈ క్రమంలో మోటార్ను మరమ్మతు చేస్తుండగా విషవాయువులు విడుదలయ్యాయి దీంతో ఊపిరాడక వారు మృతి చెందారు. వివరాలు తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు.
ఈ విషయమై గయా జిల్లా ఎస్ఎస్పీ సుశీల్ కుమార్ మాట్లాడుతూ, "బావిలో విషవాయువు కారణంగా ఊపిరాడక నలుగురు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం వెల్లడిస్తుంది.పోలీసులు బావిలో నుంచి నలుగురి మృతదేహాలను వెలికితీశారు. ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. బావి వంటి మూసివున్న ప్రదేశాల్లో ప్రమాదకర వాయువులు పేరుకుపోయి ఉండే అవకాశం ఉండటంతో, సరైన భద్రతా చర్యలు లేకుండా లోపలికి వెళ్లడం ప్రమాదకరం" అని అన్నారు.
ఈ ఘటనపై బీహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గయాజీలో బావిలో విషవాయువుకు గురై నలుగురు మృతి చెందిన వార్త ఎంతో బాధాకరంగా ఉందని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు తక్షణమే ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని అధికారులను ఆదేశించారు.


