మహాభారత కర్త, అష్టాదశ పురాణకర్త వేదవ్యాసుడు వేదాలకు వ్యాఖ్యానంగా, కలియుగంలో మానవులకు సరళ సుబోధకంగా ఉండేటట్లు ప్రతి ఆశ్రమంలోను పాటించవలసిన విధి విధానాలను చెప్పాలనుకున్నాడు. కానీ భావస్ఫూర్తి, వ్యక్తీకరణలలో స్తబ్ధత ఏర్పడింది. ఎందుకలా జరిగిందో తెలియలేదు. వెంటనే వ్యాసుడు సత్యలోకానికి వెళ్లి, బ్రహ్మ పాదాలకు ప్రణమిల్లి, ఈ స్తబ్ధతకు కారణం తెలపమని, దాని నుంచి బైటపడి కార్య సాఫల్యం జరిగే మార్గం తెలపమని ప్రార్థించాడు.
అప్పుడు బ్రహ్మ వ్యాసునితో, ‘నువ్వు వేద విభాగ కార్యారంభంలో, ఈ సృష్టికి ఆద్యుడు, సర్వ కార్యాలకు కర్త, త్రిమూర్తులమైన శివుడు, విష్ణువు, నేను కూడా ప్రణవస్వరూపంగా ధ్యానించే మూర్తి, ముఖ్యంగా నమ్మినవారికి కార్య సాఫల్యం కూర్చేవాడు అయిన గజాననుని పూజించలేదు. ఆ వినాయకుని సర్వ కార్యారంభాలలోనూ, స్మరించుట చేతనూ, భక్తితో పూజించటం వల్లనూ సకల విఘ్నాలు దూరమవుతాయి. గణపతి ప్రసన్నుడైతే నీ కార్యం సాను కూలమవుతుంది. వెంటనే ఆ దేవదేవుని పూజించి శరణు పొందు’ అని బ్రహ్మ చెప్పాడు.
అప్పుడు వ్యాసుడు బ్రహ్మను ‘ఆ విఘ్నహరుడు ఎలా ఉంటాడు? ఇంతకు మునుపు ఎవరెవరిని అనుగ్రహించాడు? ఆయన చేసిన మహత్తర కార్యాలేవి?’ అని ఆసక్తిగా ప్రశ్నించాడు. గణేశుని పూజించి తరించిన అనేక భక్తుల కథలను బ్రహ్మ వినిపించి, వ్యాసునికి కార్యసిద్ధి ప్రదం అయిన ఏకాక్షర గణపతి మంత్రాన్ని ఉపదేశించి, అనుష్టాన క్రమాన్ని వివరించి, గణేశుని ప్రసన్నుని చేసుకుని వరం కోరుకొమ్మన్నాడు. అలాగైతేనే ‘నీకు సమస్త గ్రంథ రచనా శక్తి కలుగుతుం’దని చెప్పాడు. కారణం తెలిసింది. వ్యాసుని నిర్వేదం తొలగింది. గణపతి ఆదిదైవం. అందుకే ఏ పూజనైనా, ఏ శుభ కార్యాన్నైనా గణపతి పూజతోనే ప్రారంభిస్తాం.
– డా. చెంగల్వ రామలక్ష్మి
ఇదీ చదవండి: తెలివైన చలికోడి


