భూముల వివరాలపై ఆరా తీస్తున్న మల్లురవి, చామల, అనిల్, రఘురాంరెడ్డి, అద్దంకి తదితరులు
సిద్దపేటలో హరీశ్ అక్రమాలు చూపించాం... నేడు జన్వాడలో కేటీఆర్ అక్రమాలు చూపిస్తాం
హరీశ్రావు భూములను పరిశీలించిన కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్సీల బృందం
సాక్షి, తెలంగాణ: మాజీ మంత్రి హరీశ్ రావు వ్యవసాయ క్షేత్రం, అతని మామ అయిన హన్మంతరావుకు చెందిన భూములను కాంగ్రెస్ పార్టీ ఎంపీల బృందం, ఎమ్మెల్సీలు శుక్రవారం పరిశీలించారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులో సిద్దిపేట జిల్లా కొండపాక మండలం వెలికట్ట గ్రామంలో హరీశ్రావు మామ హన్మంత రావుకు చెందిన ఆరు ఎకరాల భూమిని, చిన్నకోడూరు మండలం రామంచలో హరీశ్రావుకు చెందిన 13ఎకరాలలో ఉన్న వ్యవసాయ క్షేత్ర పరిసర ప్రాంతాలను పరిశీలించారు.
వెలికట్ట గ్రామంలో ఎక్స్సర్వీస్మెన్లకు చెందిన భూమిని హన్మంతరావుకు ఎలా మార్చారు? అని కొండపాక తహసీల్దార్ మల్లికార్జున్ను అడిగి తెలుసుకున్నారు. అలాగే చిన్నకోడూరు మండలం రామంచ గ్రామశివారులో 13 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న హరీశ్రావు వ్యవసాయ క్షేత్రం భూమిని రంగనాయక సాగర్ రిజర్వాయర్కు కేటాయించే స్థలాన్ని తప్పించి కొనుగోలు చేశారా? అని ఆర్డీఓ సదానందంను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆ భూము లకు సంబంధించిన మ్యాప్లు, వివిధ పత్రాలను అధికారులకు అందజేసి పరిశీలించాలని ఎంపీలు, ఎమ్మెల్సీ విజ్ఞప్తి చేశారు.
అధికార దుర్వినియోగంతో పేరు మార్పిడి
బీఆర్ఎస్ నేతల భూ వ్యవహారాలపై వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని వచ్చామని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కొండపాక మండలం వెలికట్ట గ్రామంలో ఎక్స్సర్వీస్మెన్లకు ఇచ్చిన 271 సర్వేనంబర్లోని భూమిలావాదేవీలు జరగవద్దని ఉన్నప్పటికీ 2010, 2011 సంవత్సరాలలో అక్రమంగా కొనుగోలు చేశారన్నారు.
ఆ భూమికి ఎన్ఓసీ కలెక్టర్ ఇవ్వాల్సి ఉన్నా ఆర్డీఓ నుంచి తీసుకున్నారన్నారు. అసైన్డ్ భూమిని అధికార దుర్వినియోగం చేసి తమ పేరుమీద బదలాయించుకున్నారని ఆరోపించారు. 131 సర్వే నంబర్ భూమిని చూపించి భూమిని బదలాయించుకున్నారన్నారు. ఇప్పుడు ఎన్ఓసీ దొరికే పరిస్థితి లేదని, అసలు భూమిని కేటాయించినప్పుడు హద్దులు సైతం లేవని మండిపడ్డారు. హరీశ్రావు తీసుకున్న భూమి చుట్టూ సుడా పార్క్ను ఏర్పాటు చేశారన్నారు.
బీఆర్ఎస్ నేతల భూదందాలు..
భూదందా ఫేస్–1లో ఎక్కడో ఉన్న భూమిని గోల్డ్ బిస్కెట్లాగా వాళ్ల మామకు హరీశ్ రావు అప్పగించారని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఆరోపించారు. అసైన్డ్ భూమిని దళితులకు, ఎక్స్ సర్వీస్మెన్లకు ప్రభుత్వం ఇస్తే బీఆర్ఎస్ నేతలు భూదందా చేశారన్నారు. భూదందా ఫేస్–2లో రిజర్వాయర్లో భూమి కోల్పోతే ప్రభుత్వం పరిహారం రూ.6లక్షలు ఇస్తే.. హరీశ్ రావుకు రైతు రూ.2లక్షలకే ఎకరం ఎలా విక్రయిస్తాడు? బెదిరిస్తే ఇచ్చాడా? బ్లాక్మనీతో కొనుగోలు చేశారా? దీనిపై ఈడీ ఎంక్వైరీ చేయాల్సిన అవసరముందన్నారు.
అధికార దుర్వినియోగానికి హరీశ్ రావు పాల్పడటం స్పష్టంగా కన్పిస్తోందన్నారు. బీఆర్ఎస్ నేతలు ఉద్యమం, అధికారంలోకి వచ్చిన తర్వాత భూ దందాలు చేశారని ఆరోపించారు. హరీశ్రావు మామకు చెందిన భూమి ఆరు ఎకరాలు ఆక్రమమని తేలిందని, ఈ భూమిని తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఇవ్వాలని సీఎంను కోరుతున్నామన్నారు.
సిద్దిపేటలో హరీశ్ అక్రమాలు చూపించాం...నేడు(శనివారం) జన్వాడకు పోయి కేటీఆర్ ఆక్రమాలను చూపిస్తామని, అలాగే రోజుకో ప్రాంతానికి వెళ్లి రోజుకో నాయకుడి అక్రమాలను బయట పెడుతామన్నారు. సందర్శించిన వారిలో ఎంపీలు మల్లు రవి, వేం నరేందర్ రెడ్డి, వంశీ, కడియం కావ్య, బలరాం నాయక్, సురేష్ షెట్కార్, అనిల్ కుమార్, రఘురాంరెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిలతో పాటు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
ఇదీ చదవండి: వ్యవసాయ భూమిలో ఫామ్ హౌస్ లేదు: హరీశ్రావు


