విజయవాడ పటమట పోలీసు స్టేషన్ ఎదుట దంపతులు ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. పురుగుల మందు తాగి వాసు, గీత దంపతులు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ వల్లే ఆత్మహత్యాయత్నం చేశామని దంపతులు పేర్కొనడం సంచలనం కలిగించింది.
ఆర్పీ ఠాకూర్తో పాటు పృథ్వీరాజు అనే వ్యక్తి కూడా తమను వేధింపులకు గురి చేశారని వాసు దంపతులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే పోలీస్ స్టేషన్ ఎదుట వాసు దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. అయితే పోలీసులు వారి నుంచి పురుగుల మందు డబ్బాను లాక్కొని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. 2025లో బంగారు ఆభరణాల మోసం కేసులో పోలీసులు వాసు ,గీత దంపతులపై కేసు నమోదు చేశారు.
మాపై అక్రమ కేసులు: సురేంద్ర
గీత తండ్రి సురేంద్ర మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ వల్లే నా కూతురు, అల్లుడు చావుబతుకుల మధ్య ఉన్నారు. అక్రమ కేసులు పెట్టీ ఇద్దరిని వేధిస్తున్నారు. 42 రోజులు జైల్లో పెట్టీ నా కూతురు అల్లుడును వేధించారు. రెండెకరాల పొలం రాయించుకొని బెదిరిస్తున్నారు. ఇప్పుడు బంగారం ఇవ్వాలని ఏసీపీ దామోదర్ బెదిరించాడు.
మేము బతకడం కంటే చావడం బెటర్ ఏమో అనిపిస్తుంది. మా దగ్గర ఏమి లేవు ఉన్నవి మొత్తం లాక్కున్నారు ఫ్లాట్ కూడా బలవంతంగా రాయించుకున్నారు. వ్యాపారం కోసం డబ్బులు తీసుకుంటే అధిక వడ్డీలు వసూలు చేశారు. ఈ అంశంతో సంబంధం లేకపోయినా గుంటూరులో కేసు పెట్టించి అరెస్టు చేశారు. ఆస్తుల కోసమే మమ్మల్ని టార్గెట్ చేశారు.’’అని వాపోయాడు.
ఇదీ చదవండి: తిరుమల ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవలేదు: ఈడీ


