విజయవాడ: గాదె సాయికృష్ణ లాకప్డెత్ కేసులో సిట్ కీలక ప్రకటన వెలువరించింది. పోలీసుల దెబ్బలకే సాయికృష్ణ చనిపోయాడని సిట్ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని A-4 సురేష్ రిమాండ్ రిపోర్ట్లో సిట్ పేర్కొంది. పోలీసులు కొట్టి చంపారని కోర్టుకు సిట్ నివేదించింది. సీఐ నాగరాజు, కానిస్టేబుళ్లు కలిసి మృతదేహాన్ని దహనం చేశారని, ఆధారాలు మాయం చేశారని కోర్టుకు సిట్ తన రిపోర్ట్లో పేర్కొంది.
నిన్న(గురువారం) సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో A4 నిందితుడిగా ఉన్న సురేష్ సిట్ ఎదుట లొంగిపోయాడు. సాయికృష్ణ మృతదేహాన్ని మాయం చేయడంలో సురేష్ కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఉన్నాయి. సురేష్ లొంగుబాటు విచారణకు కీలకంగా మారడంతో పాటు పోలీసులే కొట్టి చంపారనే విషయాన్ని సిట్ ధృవీకరించింది.
కాగా, సాయికృష్ణ మృతి అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో సెటిల్మెంట్ చేసేందుకు సురేష్ ప్రయత్నించినట్లు సమాచారం. ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజుకు సురేష్ అత్యంత సన్నిహితుడిగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, సాయికృష్ణ లాకప్ డెత్ అనంతరం ఈ వ్యవహారంలో సురేష్ పాత్ర ఉన్నట్లు గుర్తించిన సిట్ అధికారులు కేసు నమోదు చేశారు. సిట్ విచారణ తర్వాత ఆయన పరారీలో ఉండగా, నిన్న లొంగిపోయి కీలక విషయాలను వెల్లడించాడు.
సిట్ రిపోర్ట్లో ముఖ్యాంశాలు..
మే 7వ తేదీన పీఎస్లో సాయికృష్ణను విచారించారు
రాణిగారితోటలోని పాడుబడడ్డ భవనానికి తీసుకెళ్లి కొట్టారు
మే 12వ తేదీన సాయికృష్ణ మృతి చెందాడు
అర్థరాత్రి బైక్పై మృతదేహానని శ్మశానికి తరలించారు
స్వర్గపురి శ్మశాన వాటికలో మృతదేహాన్ని కాల్చేశారు
సాయికృష్ణపై దాడికి సంబంధించిన ఫోటోలు డిలీట్ చేశారు
సాయికృష్ణ బంధువులను పోలీసులు బెదిరించారు
హెబియస్ కార్బస్ పిటిషన్ విత్ డ్రా చేసుకోవాలని బెదిరించారు
సాయికృష్ణ బంధువులను పోలీసులే ప్రలోభపెట్టారు
కాగా, ఈనెల మొదటి వారంలో తన కుమారుడు సాయికృష్ణ ఆచూకీ తెలియడం లేదని, అతడిని కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ విజయలక్ష్మి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ దాఖలు చేసిన తరువాత సాయికృష్ణ పోలీసుల లాకప్డెత్లో మృతిచెందినట్లు రూఢీ అయింది. దీంతో విజయలక్ష్మి తన కుమారుడి లాకప్డెత్ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. తరువాత ఈ వ్యాజ్యంలో పలు పరిణామాలు చోటుచేసుకున్నాయి. సీబీఐ దర్యాప్తు కోసం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ను ఉపసంహరించుకుంటున్నట్లు ఓసారి, ఉపసంహరించుకోవడంలేదని మరోసారి విజయలక్ష్మి చెబుతూ వచ్చారు. ఆమె తరఫున హాజరవుతున్న న్యాయవాదుల విషయంలో కూడా వివాదం తలెత్తిన విషయం తెలిసిందే.
2026 మే 6న మార్కాపురంలో అదుపులోకి తీసుకుని, కృష్ణలంక పోలీస్స్టేషన్కు తరలించి, ఆ తర్వాత ఇన్స్పెక్టర్కు అప్పగించినట్లు ప్రతివాదులైన పోలీసులు తమ కౌంటర్ అఫిడవిట్లో అంగీకరించారు.
అయితే, ఆ తర్వాత సాయికృష్ణ ఆచూకీ ఏమైంది అనే అంశంపైనే ఎక్కువ చర్చ జరుగుతూ వచ్చింది. అతన్ని లాకప్డెత్ చేసి ఆ తర్వా త దహనం చేయడం, ఆధారాలు మాయం చేయడం వంటివి జరిగిన విషయం తాజా సిట్ రిపోర్ట్తో బహిర్గతమైంది.
ఇదీ చదవండి: ఏపీకి భారీ వర్ష హెచ్చరిక.. ఆరెంజ్ అలర్ట్ జారీ


