విజయవాడ: ముస్లింల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్లక్ష్యం వహిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జలీల్ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లింలకు కేవలం చిన్న చిన్న నామినేటెడ్ పోస్టులతో మాత్రమే సరిపెడుతున్నారన్నారని విమర్శించారు. ఈ క్రమంలోనే చంద్రబాబుకు జలీల్ఖాన్ అల్టిమేటం జారీ చేశారు. ఈసారి కచ్చితంగా విజయవాడ మేయర్ సీటు ముస్లింలకే ఇవ్వాలన్నారు.
‘విజయవాడ మేయర్గా మైనార్టీలకు అవకాశం కల్పించాలి. మేయర్ సీటు మహిళలకు రిజర్వ్ అయితే నా కుమార్తెకు అవకాశం ఇవ్వాలి. బీజేపీ మైనార్టీల ఇంపార్టెన్స్ ను గుర్తించింది. కానీ చంద్రబాబు వైఖరి నాకు నచ్చడం లేదు. అనుభవం ఉండి కూడా చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు సరికాదు. విజయవాడలో పార్టీ గెలవాలన్నా...పార్టీ క్యాండెట్ గెలవాలన్నా మైనార్టీల సహకారం అవసరం.
ముస్లింలకు మేయర్గా అవకాశం ఇస్తే పోటీ ఉండదు. నాకు ఊహతెలిసినంత వరకూ విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే టిక్కెట్ ముస్లింలకే ఇచ్చేవారు. మొన్నటి ఎన్నికల్లో జిల్లాలోనే ముస్లింలకు ఎమ్మెల్యే సీటు లేకుండా చేశారు. ఆ రోజే నాకు బాధ కలిగినా నాలోనే దాచుకున్నా. ముస్లింలకు ఎమ్మెల్సీ ఇవ్వడం లేదు ...రాజ్యసభ సభ్యుడు ఇవ్వడం లేదు. చిన్న చిన్న నామినేటెడ్ పదవులతో సరిపెట్టేస్తున్నారు.
2019లో నా కుమార్తెను కోరి తెచ్చుకున్నారు. ఇండిపెండెంట్ను బరిలోకి దించి నా కుమార్తెను ఓడించారు. నా కుమార్తె ఓటమిలో కూడా కుట్ర జరిగిందికానీ నేను పేర్లు చెప్పలేదు ... చెప్పినా ఉపయోగం ఉండదని చెప్పలేదు. టీడీపీలోయాక్షన్ ఉండదరు..రియాక్షన్ అసలే ఉండదు’ అని మండిపడ్డారు.

ఇదీ చదవండి: ‘చంద్రబాబు ఆ ఆలోచన నుంచి బయటకు రావాలి’


