సాక్షి, తాడేపల్లి: రాష్ట్ర రైతులకు చంద్రబాబు తీవ్ర అన్యాయం చేశారని.. కృష్ణా, గోదావరి నీటి నిర్వహణను లోపభూయిష్టంగా మార్చారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత సాకే శైలజానాథ్ మండిపడ్డారు. ఆ ఫలితంగా రాష్ట్ర మంతటా రైతులకు అన్యాయం జరిగిందని.. వ్యవసాయం దండుగ అనే ఆలోచనలో నుండి చంద్రబాబు బయట పడాలన్నారు. ఇంకా అదే ఆలోచనలో ఉన్నందునే రైతుల కష్టాలను పట్టించుకోవటం లేదని దుయ్యబట్టారు.
‘‘శ్రీశైలం ప్రాజెక్టు కింద సాగయ్యే పంట భూములన్నీ బీడులుగా మారాయి. రాయలసీమలో చంద్రబాబు పర్యటిస్తే రైతుల కష్టాలు, కన్నీళ్ళు కనపడతాయి. ఇది ఎల్నినో కాదు.. ముమ్మాటికీ ఎల్లోనినోనే. తీవ్ర కరువు ఏర్పడినా ఎల్లో మీడియా చంద్రబాబుకు భజన చేస్తోంది. శ్రీశైలానికి భారీగా వరద అనీ, జలకళతో రాయలసీమ రిజర్వాయర్లు అంటూ వార్తలు రాశారు. అంత జలకళ ఉంటే.. మరి గ్రేటర్ రాయలసీమకు నీళ్లు ఎందుకు ఇవ్వటం లేదు?
..కనీసం ఆరుతడి పంటలకు కూడా ఎందుకు నీరివ్వటం లేదు?. శ్రీశైలంలో పూర్తిస్థాయి నీటిమట్టం నీరు ఉన్నా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఎందుకు నీరు ఇవ్వటం లేదు?. రాయలసీమ ప్రజలు ఏం ద్రోహం చేశారని ఇంత కక్ష చంద్రబాబూ?. శ్రీశైలంలో 840 అడుగులకు చేరితే ఇక పోతిరెడ్డిపాడు ద్వారా నీరు ఇవ్వలేరు. అనాలోచిత నీటి నిర్వహణ కారణంగానే నీటి ఎద్దడి. నెల్లూరు బ్యారేజి కింద వేలాది ఎకరాల వరి పైరు ఎండిపోతోంది. శ్రీశైలం కింద సాగు చేసే రైతులు పూర్తిగా నష్టపోయారు
..వెలిగొండ, పోలవరం వద్ద చంద్రబాబు సాష్టాంగ నమస్కారం చేశారు. అయినా పంట పొలాలకు సాగు నీరు ఇవ్వలేదు. పోలవరం ప్రాజెక్టును సైతం చివరికి రిజర్వాయర్ నుండి బ్యారేజిగా మార్చేశారు. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు తీవ్ర అన్యాయం చేశారు. రాయలసీమ ప్రాంత ప్రజాప్రతినిధులు స్పందించాలి. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నీటి విడుదల చేయించాలి. ఎండిపోతున్న చీనా చెట్లు, అరటి తోటలు, వరిపైరు, శనగ తోటలు కనపడటం లేదా?. రోడ్డున పడుతున్న రైతుల కష్టాలు కనపడటం లేదా?. కర్ణాటక, తెలంగాణాలో సాగు నీరు ఇస్తుండగా లేనిది ఏపీలో ఎందుకు ఇవ్వరు?. చంద్రబాబు రాయలసీమలోని పొలాలు చూస్తే రైతుల కష్టాలు కనపడతాయి?. వ్యవసాయం దండగ అనే ఆలోచనలో నుండి చంద్రబాబు బయటకు రావాలి’’ అని శైలజానాథ్ హితవు పలికారు.
ఇదీ చదవండి: ఏపీ సరిహద్దులు దాటిన రెడ్ బుక్ అరాచకం


