సాక్షి,అమరావతి: మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2029 ఎన్నికల్లో చీపురుపల్లి నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు. చీపురుపల్లిలో వైఎస్సార్సీపీ శ్రేణుల సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ.. ‘గౌరవంగా ఉన్న ఏ కుటుంబమూ టీడీపీలోకి వెళ్లలేదని, లాలూచీ రాజకీయాలు కాకుండా గౌరవప్రదమైన రాజకీయాలు చేయాలని హితవు పలికారు. నేను మంత్రే అయితే.. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ మంత్రే అని వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందని, రాష్ట్రానికి మళ్లీ మంచి రోజులు వస్తాయని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు.
అనంతరం బొత్స సత్యనారాయణ కుమార్తె, వైఎస్సార్సీపీ నేత బొత్స అనూష మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిన్న శీనుపై బొత్స అనూష కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి రోజు మీరు చిన్న శీను అపాయిట్మెంట్ కోసం ఎదురు చూసేవారు. ఆ ఒకరు పోయారు. ఇప్పుడు మీకు ఇద్దరు వచ్చారు. నేను తమ్ముడు ఉన్నాం. నాన్న ఉన్నారు. పార్టీ మారిన వారికి వచ్చే ఎన్నికల్లో ఓటుతో బుద్ది చెప్పాలి. ఇప్పటివరకు అందరూ బొత్స 1.0 చూశారు.. ఇక నుంచి బొత్స 2.0 చూస్తారు. చీపురుపల్లి కార్యకర్తల వల్లే మా నాన్నకు ఈ బ్రాండ్ వచ్చింది అని అన్నారు. గ్రామాల్లో ఏకగ్రీవాలు జరగకూడదని వైఎస్ జగన్ చెప్పారని, ఆయన పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు.


