డెస్టినేషన్ వెడ్డింగ్లని, ఆకాశంలో పెళ్లి, నీటి అడుగుభాగన పెళ్లి తంతు వంటి వగైర విభిన్న పెళ్లిళ్ల గురించి విన్నాం. సమాధుల వద్ద పెళ్లి తంతు అదీకూడా భారతీయ వైవాహక పద్ధతిలో చేసుకుందో జంట. అయినా శుభకార్యం, అమంగళకరమైన ప్రదేశంలోనా అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే అత్యంత పర్యాటక ఆకర్షణగా పేరుగాంచిన గిజా పిరమిండ్ల వద్ద చేసుకుంది ఈ జంట. అలా అని అక్కడ వివాహం చేసుకోవడం ఏమంత ఈజీ కాదు.
అక్కడ పెళ్లి చేసుకోవాలనుకుంటే.. పెళ్లి మండపం బుక్ చేసుకున్నంత ఈజీ కాదు. అందుకోసం పురావస్తు శాఖ అధికారుల తోపాటు ఈజిప్టు అధికారులను నుంచి కూడా ప్రత్యేకంగా అనుమతి తెచ్చుకోవాలి. ఈ కార్యక్రమం జరిగే రోజుల్లో సందర్శకులకు నిషేధం విధించాల్సి ఉంటుంది. అయితే ఈ జంట ఆ పర్మిషన్లన్నీ తెచ్చుకుని మరి ఆ ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ ప్రాంతంలోనే గ్రాండ్గా వివాహం చేసుకుంది. వాళ్లే డాక్టర్ మోనికా నాయర్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ వివేక్ నందా దంపతులు. పిరమిడ్ల వద్ద ఇలా ఒక వ్యక్తిగత వేడుకను నిర్వహించుకున్న ముగ్గురు జంటల్లో ఈ దంపతులు ఒకరుగా నిలిచారు.
అలాగే అలాంటి చోట పెళ్లి తంతుని ఏర్పాటు చేసుకున్న తొలి భారతత సంతతి జంటగా ఈ వధువరులిద్దరూ నిలిచారు. అంతేగాదు వారి వేడుకలో ప్రతి అంశం ప్రభుత్వ పర్యవేక్షణలో సమీక్షించబడి, ఆమోదించడం జరుగుతుంది. ప్రతి సాయంత్రం సందర్శకుల కోసం మూసివేసి, ఆ తర్వాత ఈ జంట వేడుక కోసం వేదికను ఏర్పాటు చేస్తుంటారు అక్కడ అధికారులు. ఇలా మొత్తం పది రాత్రులు అక్కడే గడిపారు. వేదికలు, వంటశాలలు, లైటింగ్తో సహా తాత్కాలిక మౌలిక సదుపాయాలను రాత్రికి రాత్రే ఏర్పాటు చేసి, వేడుకలు ముగిసిన తర్వాత తొలగించడం చేస్తుంటారు.
అలా మూడు రోజుల పాటు జరిగిన ఈ వివాహా వేడుకలో స్ఫింక్స్ (ఈజిప్ట్లోని గిజా పిరమిడ్ల సమీపంలో నెలకొన్న ఈ శిల్పం ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందింది) పాదాల వద్ద ఏర్పాటు చేసిన విందు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పిరమిడ్ల ప్రవేశంపై కఠినమైన నియంత్రణలు ఉన్న తరుణంలో ఈ జంట వివాహ వేడుక అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. ఈ కార్యక్రమానికి పలు దేశాల నుంచి అతిథులు హాజరయ్యారు.
పిరమిడ్ల వద్ద ఈ వేడుకలు జరగడానికి ముందే ఈ జంట కైరోలో సాంప్రదాయ పద్ధతిలో వివాహ వేడుకలు జరుపుకున్నారు. అయినా మరి అక్కడ వేడుకలు ఎందుకంటే.. పిరమిడ్లకు ఉన్న చారిత్రక ప్రాముఖ్యత, ఆ దేశంతో ఉన్న వ్యక్తిగత అనుబంధం తదితర కారణాల రీత్యా దీన్ని ఎంచుకున్నామని చెబుతున్నారు ఆ దంపతులు. కాగా నందా తన కెరీర్ తొలినాళ్లలో ఇక్కడే పనిచేశారట.
ఇదీ చదవండి: గులాబీలు పండిస్తూ.. నెలకు రూ. 2.5 లక్షలు..!


