సాక్షి,హైదరాబాద్: మాజీ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ నార్ల సుమంత్ భార్య మీడియా ద్వారా ఓ వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తమ కుటుంబం ఎదుర్కొంటున్న మానసిక క్షోభను వెల్లడించారు. మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవాలను మాత్రమే ప్రసారం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
తప్పుడు కేసుల కారణంగా తమ కుటుంబం పూర్తిగా అస్తవ్యస్తమైందని, తన భర్త సుమంత్ జీవితం సర్వనాశనమైందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సుమంత్ ఐఐఎంలో చదువుకున్నాడని, మంచి కార్పొరేట్ ఉద్యోగాన్ని వదులుకుని కొండా సురేఖ వద్ద ఓఎస్డీగా చేరాడని తెలిపారు.
సుమంత్ను ఉద్దేశపూర్వకంగా టార్చర్ చేయడం, విపరీతమైన ఒత్తిడికి గురిచేయడం వల్ల తట్టుకోలేకపోయిన తన మామయ్య (సుమంత్ తండ్రి నార సుబ్రహ్మణ్యం) ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. గురువారం రాత్రి ఆయన 40 నిద్రమాత్రలు మింగగా.. కుటుంబసభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారని, ప్రస్తుతం ఆయన చావుబతుకుల మధ్య చికిత్స పొందుతున్నారని తెలిపారు. రాజకీయ కక్షల కారణంగా తమ కుటుంబాన్ని బలి చేయవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.
ఇదిలా ఉండగా.. హైదరాబాద్లోని మేడిపల్లి ప్రాంతానికి చెందిన హరికృష్ణపై దాడి చేశారనే ఆరోపణలతో సుమంత్తో పాటు మరికొంత మందిపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ కేసులో ఏ-1గా ఉన్న సుమంత్ హైకోర్టును ఆశ్రయించగా ముందస్తు బెయిల్ లభించింది.
👉ఇదీ చదవండి : కొండా సురేఖ బర్తరఫ్కు ఇదే అసలు కారణం : కేటీఆర్


