సాక్షి, ఢిల్లీ: అసెంబ్లీలో ప్రజల కోసం కొట్లాడితే తమపై దాడి చేశారని 500 మంది పోలీసులతో అణిచివేత చేశారని జాతీయ మహిళా కమిషన్ ఛైర్పర్సన్కు ఎదుట ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కమిషన్ ఛైర్ పర్సన్ విజయ రహత్కర్ను ఈ రోజు శుక్రవారం ఆమె కలిశారు. అసెంబ్లీ ఆవరణలో మగ పోలీసులు సైతం తమపై భౌతిక దాడులకు తెగపడ్డారని జుట్టు, చీర పట్టి లాగారని ఛైర్ పర్సన్ ఎదుట సబితా ఆవేదన వ్యక్తం చేశారు.
ఆమె మట్లాడుతూ.. పోలీసులు దుశ్శాసన పర్వాన్ని తలపించారు. ద్రౌపదికి జరిగిన అవమానమే మాకు జరిగింది. కౌరవ సభలో జరిగిన తరహాలోని తెలంగాణ అసెంబ్లీ వద్ద జరిగింది .ఒక కుట్ర ప్రకారమే మా పై దాడులు జరిగాయి. అసెంబ్లీకి వెళ్తుంటే యుద్ధ వాతావరణం సృష్టించారు. మేము లేవనెత్తుతున్న సమస్యల పైన మాది అరణ్య రోదన గా మారింది. ముఖ్యమంత్రి, శాసనసభ స్పీకర్ మాపై జరిగిన దాడులపై కనీసం స్పందించలేదని ఛైర్పర్సన్ ఎదుట వాపోయారు.
మమ్మల్ని ఆపమని అధికారం వారికి ఎవరిచ్చారని ప్రభుత్వం శిఖండి రాజకీయాలు చేస్తోందని మహిళా పోలీసులను ముందుపెట్టి శిఖండి రాజకీయాలు చేశారని మహిళలుగా మాకు అవమానం చేసి, గాయపరిచి తిరిగి మా పైన కేసులు పెట్టారు. మాకు న్యాయం చేయాలని మహిళా కమిషనర్కు ఫిర్యాదు చేశామని మా ఎమ్మెల్యేల పైన లైంగిక వేధింపుల కేసులు పెట్టడం దారుణమన్నారు.స్పీకర్ని తాము అవమానపరచలేదని స్పీకర్ ని దూషించిన దూషించకపోయిన విచారం వ్యక్తం చేయాలని కేసీఆర్ ఆదేశించారు.
కేసీఆర్ ఇంటి ముందు చావు డప్పు కొట్టడం ఏం సంస్కారమని కేసిఆర్ చావు కోరుతున్న ఎమ్మెల్యేల పైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. మా ఆవేదన చెప్పుకునే అవకాశం లేకుండా అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని మా పై జరిగిన దాడికి కనీసం ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం అన్యాయమన్నారు. తెలంగాణ మహిళల ఆత్మ గౌరవాన్ని కాపాడే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పి విచారణ చేయించాలని సబితా ఇంద్రారెడ్డి అన్నారు.


