సాక్షి, కాకినాడ: కాకినాడ జిల్లాలో ఏఈ నూకరాజు అల్లుడు జగదీశ్రెడ్డి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో నిందితుడు సాధిక్ ఖాన్ విచారణలో కీలక విషయాలు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. రూ.25 కోట్ల విలువైన ఆస్తిపై కన్నేసిన సాధిక్.. జగదీశ్ను హత్య చేసి, ఆయన భార్య సౌజన్యను పెళ్లి చేసుకోవాలని పథకం వేసినట్లు విచారణలో వెలుగులోకి వచ్చింది. ఇందుకు పలు ప్రణాళికలు వేసినట్టు తెలిసింది.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. హత్యకు ముందే జగదీశ్ రెడ్డికి కాకినాడలో సాధిక్ స్లో పాయిజన్ ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనారోగ్యానికి గురైన జగదీశ్ రెడ్డి హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం చివరిసారిగా కొబ్బరి నీళ్లలో సైనైడ్ కలిపి ఇచ్చి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిపారు. ఈ కేసులో సాంకేతిక ఆధారాల ఆధారంగా స్లో పాయిజన్ కెమికల్, సైనైడ్ సరఫరా చేసిన వ్యక్తులను పోలీసులు గుర్తించి విచారించినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా.. జగదీశ్ రెడ్డితో పాటు ఏఈ నూకరాజుకు సంబంధించిన ఆస్తిని కూడా దక్కించుకోవాలని సాధిక్ కుట్ర పన్నినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే నూకరాజు కుటుంబం ఇందుకు అంగీకరించకపోవడంతో వారిని కూడా చంపేస్తానని సాధిక్ బెదిరించినట్లు విచారణలో వెల్లడైనట్లు సమాచారం. ఈ పరిణామాలతో తీవ్ర భయాందోళనకు గురైన నూకరాజు కుటుంబం రాజమండ్రిలో గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
మరోవైపు సాధిక్ ఖాన్ మూడు రోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. ఇవాళ అతడిని అమలాపురం కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నారు. అంతకుముందు వైద్య పరీక్షల కోసం సర్పవరం పోలీస్ స్టేషన్ నుంచి ఆస్పత్రికి తరలించారు. నూకరాజు అల్లుడు జగదీశ్రెడ్డి హత్య కేసులో సాధిక్ ఖాన్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.
సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా..
తాజా దర్యాప్తులో భాగంగా సాధిక్ను గుడారిగుంటలోని ప్రో రైఫిల్ షూటింగ్ అకాడమీతో పాటు నూకరాజు, సౌజన్య నివాసాలకు తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహించినట్లు సమాచారం. అక్కడి నుంచి కీలక ఆధారాలను సేకరించినట్లు పోలీసులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: దొంగ పెన్షన్ల కోసం టీడీపీ పన్నాగం


