జగ్గంపేట: అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ వ్యక్తిని అరెస్టు చేసి, రూ.5.50 లక్షల విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జగ్గంపేట పోలీస్ సర్కిల్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో పెద్దాపురం డీఎస్పీ కేజీబీ తిలక్ ఈ వివరాలు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. జగ్గంపేట సీఐ బి.తిరుపతిరావు, గండేపల్లి ఎస్సై శివనాగబాబుకు వచ్చిన సమాచారం మేరకు.. ఉదయం 10 గంటల ప్రాంతంలో గండేపల్లి మండలం పరిణయ ఫంక్షన్ హాలు సమీపాన జెడ్.రాగంపేట శివారులో 16వ నంబర్ జాతీయ రహదారిపై పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో రెండు నల్లటి బ్యాగ్లతో ఉన్న ఓ వ్యక్తి పారిపోతూండగా అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద రెండు సూట్కేసులలో 13 ప్యాకెట్లలో ఉన్న 10.50 కేజీల గంజాయిని, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని బెంగళూరుకు చెందిన అబ్దుల్ కరీంగా గుర్తించారు. అతడు విశాఖపట్నం ప్రాంతంలో గంజాయి కొనుగోలు చేసి, వేరే వ్యక్తికి అందించేందుకు బెంగళూరు తరలిస్తూండగా పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటనలో గంజాయి అమ్మిన, కొనుగోలు చేసేవారిని, కేసుతో సంబంధం ఉన్న వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తామని, దర్యాప్తు జరుగుతోందని డీఎస్పీ చెప్పారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసు సిబ్బందికి ఆయన రివార్డులు అందజేశారు. విలేకర్ల సమావేశంలో సీఐ తిరుపతిరావు, గండేపల్లి ఎస్సై శివనాగబాబు, జగ్గంపేట ఏఎస్సై మాణిక్యం, ఈగల్ టీమ్ సభ్యులు పాల్గొన్నారు.
విఘ్నేశ్వరుని హుండీ ఆదాయం రూ.51.47 లక్షలు
అయినవిల్లి: విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానంలో హుండీల ఆదాయాన్ని గురువారం లెక్కించారు. మొత్తం వంద రోజులకు ఆలయ హుండీల ద్వారా రూ.49,93,177, అన్నప్రసాదం హుండీ ద్వారా రూ.1,54,347 కలిపి రూ.51,47,524 ఆదాయం సమకూరిందని ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. దీంతో పాటు 2.4 గ్రాముల బంగారం, 86 గ్రాముల వెండి, 40 విదేశీ కరెన్సీ నోట్లు లభించాయన్నారు.


