breaking news
Kakinada District News
-
ముదురుతున్న రజకుల చెరువు వివాదం
● చేప పిల్లలను వేయడాన్ని అడ్డుకున్న ఓ వర్గం ● రూ.1.50 లక్షల విలువైన చేప పిల్లల మృతి దేవరపల్లి: పేరం చెరువు వివాదం రోజు రోజుకూ ముదురుతోంది. ఈ చెరువులో శుక్రవారం చేప పిల్లలను వేయడానికి రజకులు ఏర్పాట్లు చేయగా, దళితులు అడ్డుకున్నారు. దీంతో రజకులు చనిపోయిన ఆ చేప పిల్లలను పంచాయతీ కార్యాలయం ప్రధాన ద్వారం ముందు రాశిగా పోసి ఆందోళన చేశారు. రజక నాయకులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవరపల్లి – బుచ్చియపాలెం రోడ్డులో సుమారు 3.96 ఎకరాల విస్తీర్ణంలో పేరం చెరువు ఉంది. దీన్ని దాదాపు 20 ఏళ్ల క్రితం రజకులకు ప్రభుత్వం కేటాయించింది. చెరువులో రజక వృత్తితో పాటు చేపలు పెంచుకుని ఫలసాయం పొందడానికి డివిజినల్ పంచాయతీ అధికారి ఉత్తర్వులు ఇచ్చారు. అయితే చెరువులో చేపల పెంపకం విషయంలో రజకులు, దళితులకు మధ్య వివాదం ఏర్పడింది. చెరువులో దుస్తులు ఉతకటానికి మాత్రమే హక్కు ఉందని, చేపలు పెంచడానికి వీలు లేదని చెరువు సమీపంలోని దళితులు అభ్యంతరం తెలిపారు. దీంతో రెండు వర్గాల మధ్య వివాదం తారస్థాయికి చేరుకుంది. కాగా.. రజక సంఘం అధ్యక్షులు కొంజర్ల పాలిరాజు, గౌరవాధ్యక్షులు కడెల్లి సుబ్బయ్య, కార్యదర్శి నేతునూరి సుబ్బారావు మాట్లాడుతూ చెరువును శుభ్రం చేసుకుని చేపపిల్లలను వేయడానికి వెళ్లగా, కొందరు అడ్డుకుని ఇబ్బందులు పెడుతున్నారన్నారు. ఈ చెరువులో చేపలు పెంచుకోవడానికి, బట్టలు ఉతకడానికి పూర్తి హక్కులు తమకు ఉన్నాయని తెలిపారు. సుమారు 1.50 లక్షల విలువైన 1.5 టన్నుల చేపపిల్లలు చనిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎన్.రవి కిషోర్ను ‘సాక్షి’ వివరణ కోరగా చెరువులో రజక వృత్తి చేసుకోవడానికి, చేపలు పెంచుకుని ఫలసాయం అనుభవించడానికి రజకులను హక్కు ఉందని చెప్పారు. ఈ సమస్యను రెండు సామాజక వర్గాలూ సామరస్యంగా పరిష్కరించుకోవాలని కోరారు. -
అన్నవరం @ 4వ స్థానం
● ఐవీఆర్ఎస్ సర్వేలో మెరుగుపడిన ర్యాంకు ● భక్తులకు అందించే సేవలలో పుంజుకున్న వృద్ధి ● డిసెంబర్లో 67.9 శాతం మంది సంతృప్తి అన్నవరం: రాష్ట్రంలోని ఏడు ప్రముఖ పుణ్య క్షేత్రాలలో భక్తులకు అందుతున్న సేవలపై గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అభిప్రాయ సేకరణలో అన్నవరం వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం నాలుగో స్థానంలో నిలిచింది. నవంబర్లో నిర్వహించిన సర్వేలో ఆరో స్థానంలో నిలిచిన దేవస్థానం ఈ సారి నాలుగో స్థానానికి ఎగబాకింది. ఆ స్థానాన్ని దక్కించుకున్నప్పటికీ దేవస్థానంలో నవంబర్లో నిర్వహించిన సర్వేలో 33 శాతం మంది భక్తులు అసంతృప్తి వ్యక్తం చేయగా ఈ సారి 32.1 శాతం మాత్రమే అసంతృప్తి వ్యక్తం చేశారు. ● గత ఏప్రిల్ నెలలో నిర్వహించిన సర్వేలో దేవస్థానం అట్టడుగు స్థానం పొందడంతో జిల్లా లెక్టర్ షణ్మోహన్ ఆలయంలో తనిఖీలు చేసి ఎలాగైనా ఆలయాన్ని మొదటి స్థానంలో నిలపాలని సిబ్బందిని ఆదేశించిన విషయం తెలిసిందే. తరువాత కొంత మెరుగుపడినా మళ్లీ ఆరో స్థానానికి పడిపోయింది. నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలవడం కూడా ఆలయ ప్రతిష్టను దిగజార్చినట్టు చెప్తున్నారు. ● గత నవంబర్ 25 నుంచి డిసెంబర్ 25వ తేదీ వరకు వాట్సాప్, ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించింది. సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, విజయవాడ, శ్రీకాళహస్తి, శ్రీశైలం, కాణిపాకం దేవస్థానాలలో నిర్వహించిన ఈ సర్వేలో శ్రీకాళహస్తి 71.2 శాతంతో ప్రధమ స్థానంలో నిలవగా 67.9 శాతం భక్తుల సానుకూల స్పందనతో అన్నవరం నాలుగో స్థానంలో నిలిచింది. 66 శాతం సానుకూల స్పందనతో కాణిపాకం ఏడో స్థానంలో నిలిచింది. నెల వారీగా భక్తుల సంతృప్త స్థాయిలు ఇవీ ● సత్యదేవుని దర్శనం విషయంలో డిసెంబర్లో 69.9 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. జూన్లో 73, జూలైలో 74, ఆగస్టులో 75.8, సెప్టెంబర్లో 74.1, అక్టోబర్లో 68, నవంబర్లో 69.7 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. ● మౌలిక వసతుల కల్పనలో డిసెంబర్ నెలలో 61.9 శాతం మంది మాత్రమే సంతృప్తి వ్యక్తం చేశారు. జూన్లో 66 శాతం, జూలైలో 65, ఆగస్టులో 64.9, సెప్టెంబర్లో 66, అక్టోబర్లో 63, నవంబర్లో 61.6 శాతం సానుకూలంగా స్పందించారు. ● స్వామివారి గోధుమ నూక ప్రసాదం నాణ్యతపై డిసెంబర్ నెలలో 78.6 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. జూన్లో 77, జూలైలో 78, ఆగష్టులో 76.9, సెప్టెంబర్లో 79.2, అక్టోబర్లో 76, నవంబర్లో 77.6 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. ● పారిశుధ్య నిర్వహణలో డిసెంబర్లో 63.1 శాతం మాత్రమే సంతృప్తి వ్యక్తం చేవారు. జూన్లో 70, జూలైలో 68, ఆగస్టులో 66.5, సెప్టెంబర్లో 64.5, అక్టోబర్లో 63, నవంబర్లో 64.2 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. మొత్తం మీద డిసెంబర్లో 67.9 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేయగా, 32.1 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. పారిశుధ్యం, మౌలిక వసతులపై అసంతృప్తి దేవస్థానంలో పారిశుద్యం, మౌలిక వసతుల కల్పన ఆశించిన మేర లేదని భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దేవస్థానంలో గత మూడు నెలలుగా చిత్తూరుకు చెందిన పద్మావతి సంస్థ పారిశుధ్య నిర్వహణను చూస్తోంది. వయోపరిమితి పేరుతో అనుభవజ్ఞులైన 50 మంది సిబ్బందిని తొలగించారు. వారి స్థానంలో రాజకీయ ఒత్తిళ్లతో నియామకమైన కొత్తవారి అనుభవ లేమి వల్ల ఈ అసంతృప్తి నెలకొన్నట్టు చెప్తున్నారు. ధోబీలతో దుప్పట్లు ఉతికిస్తున్నారు ఆలయంలోని సత్రాలలొని మంచాలపై దుప్పట్లు, గలేబులు తదితర వస్త్రాలను వాషింగ్ మెషీన్లతో కాకుండా ధోబీలతో ఉతికిస్తుండడం వల్ల శుభ్రత లోపిస్తోందని తెలుస్తోంది. గతంలో కేఎల్టీసీ సంస్థ శానిటరీ మిషన్లతో వాటిని ఉతికేవారు. అలాగే నాణ్యమైన మెటీరియల్తో పారిశుధ్య పనులు చేస్తుండడం వల్ల కూడా నాణ్యత లోపానికి కారణంగా తెలుస్తోంది. ఈ విషయమై పద్మావతి సంస్థ ప్రతినిధులు వాషింగ్ మెషీన్ ఏర్పాటుకు తాము సిద్ధమేనని కానీ అందుకు అవసరమైన షెడ్డు లేదని చెప్తున్నారు. దీనిపై ఆలయ ఈఈ రామకృష్ణ వివరణ ఇస్తూ షెడ్డు నిర్మాణం పూర్తయ్యిందని త్వరలో ఆ సంస్థకు షెడ్డును అప్పగిస్తామని తెలిపారు. ప్రసాదం విషయంలో ఊరట స్వామివారి ప్రసాదం విషయంలో భక్తులు 78.6 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేయడం కొంత ఊరట కలిగే విషయం. వాస్తవానికి గోధుమ నూక ప్రసాదంలో నూటికి నూరు శాతం భక్తులు సంతృప్తి వ్యక్తం చేయాల్సినంత నాణ్యతగా ఉంటుంది. కాని 21 శాతం మంది అసంతృప్తికి కారణం ఎవరికి అర్ధం కావడం లేదు. స్వామివారి దర్శనం కోసం భక్తులు ఎక్కువ సేపు క్యూ లైన్లలో నించోవడం వల్ల అసంతృప్తి, మౌలికవసతులు, పారిశుధ్యం బాగా లేకపోవడం వంటి వాటి ప్రభావం ప్రసాదంపై పడి ఉండవచ్చనే అభిప్రాయం అధికారులలో వ్యక్తమవుతోంది. వయసు మీరిందనే తొలగించాం శానిటేషన్ విభాగంలో 55 ఏళ్లు దాటిన వారిని కొనసాగించ వద్దని ప్రభుత్వం నిబంధన విధించడంతో ఆలయంలో 50 మందిని తొలగించాం. వారి వారసులలో ఎవరైనా సమర్ధులుంటే వారి స్థానంలో నియమిస్తాం. అటువంటి వారు ఉంటే దేవస్థానంలో తమ సూపర్వైజర్లను కలిస్తే పరిశీలిస్తాం. – భాస్కరనాయుడు, ఎండీ, పద్మావతి శానిటరీ సంస్థ -
● రయ్ రొయ్య మంటూ..
రయ్ రొయ్యమంటూ మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళుతున్నారు. పల్లిపాలెం కేంద్రంగా సముద్రంపై వేట సాగించే వారికి అరుదైన భారీ సైజు ల్యాబ్స్టర్ రకం రొయ్యలు చిక్కుడమే దీనికి కారణం. వలకు చిక్కి ఫిషింగ్ హార్బర్కు చేరిన వీటిని కొనుగోలు చేయడానికి ప్రజలు పోటీపడుతున్నారు. ఒక్కో ల్యాబ్స్టర్ రొయ్య సుమారు 750 గ్రాములు బరువు తూగుతూ, రూ.800కు తక్కువ గాకుండా అమ్ముడుపోతోంది. సాధారణంగా ఈ రకమైన ల్యాబ్స్టర్ రొయ్యలు కన్యాకుమారి, మండపం, కేరళ వంటి కొన్ని తీర ప్రాంతాల్లో మాత్రమే లభిస్తాయని, అంతర్వేది సముద్ర తీరంలో ఈ రకం భారీ సైజులో రొయ్యలు దొరకడం అరుదని వారు చెబుతున్నారు. - సఖినేటిపల్లి -
చా...ర్జ్!
అధిక చార్జీలు వసూలు చేస్తే చర్యలు సంక్రాంతి పండుగ సీజన్లో ప్రైవేటు ట్రావెల్ యాజమాన్యాలు అధిక చార్జీలకు టిక్కెట్లు విక్రయించకూడదు. రవాణాశాఖ అధికారులను బృందాలుగా ఏర్పాటు చేసి ముఖ్యమైన కూడళ్లలో బస్సులను ఆపి ప్రయాణికుల నుంచి టిక్కెట్ చార్జీల వివరాలను తెలుసుకుంటారని, ఏ ప్రాంతం నుంచైనా ప్రయాణికుల నుంచి నిర్దేశించిన చార్జీల కంటే అధిక ధరలకు విక్రయించినట్టు ఎవరైనా ఫిర్యాదు చేస్తే బస్సు యాజమాన్యంపై చర్యలు తీసుకుంటాం. – కె.శ్రీధర్, డీటీఓ, కాకినాడ స్నేహితులతో కారులో వస్తున్నాం హైదరాబాద్ నుంచి సంక్రాంతి పండగకు సొంతూరు వచ్చేందుకు కుటుంబమంతా బస్సులో బయలుదేరదామనుకున్నాం. ప్రైవేటు బస్సుల్లో చార్జీలు రెండింతలు పెరిగిపోయాయి. కుటుంబమంతా కలిసి ఊరు రావడానికి రూ.15 వేలు పైనే అవుతుంది. రానూ, పోను బస్సు చార్జీలకే సుమారు రూ.30 వేలు అవుతోంది. ఇంత భరించలేక పొరుగున ఉన్న స్నేహితుల కుటుంబంతో కలిసి కారులో రావాలని నిర్ణయించుకున్నాం. కారులో రావడానికి రూ.10 వేలతో సరిపోతుంది. – ఎన్.లావణ్య, హైదరాబాద్ చార్జీల మోత మోగించే వ్యవస్థలు రెండే రెండు. ఒకటి పోలీసు వ్యవస్థ.. రెండోది రవాణా వ్యవస్థలు. శాంతిభద్రలకు భంగం కలిగిస్తున్నారనో.. మరే కారణంగానో పోలీసులు చా..ర్జ్ అని అరిస్తే.. ప్రయాణికుల అవసరాన్ని ఆసరాగా తీసుకుని పండగలు.. పబ్బాలు.. వేసవి సెలవులు.. ఐదేళ్ల క్రితం కరోనా కష్టకాలమని కూడా చూడకుండా రవాణా సంస్థలు చా..ర్జ్ అని అరిచి భారీ దోపిడీలకు పాల్పడుతుంటాయి. పండగలు.. పుట్టిళ్లు.. బంధువర్గాల కలయికలు.. భావోద్వేగాలే ఆయా ఆపరేటర్ల పెట్టుబడి. రాకరాక వచ్చే సెలవులను అయినవాళ్లతో గడపాలని ఒకరు.. రాకరాక వచ్చే అవకాశాన్ని సొమ్ముచేసుకోవాలని మరొకరు.. వారి నడుమ నడ్డి విరిగి నలిగిపోతున్న సగటు జీతగాడి పరిస్థితి.. అతగాడు మాత్రమే కుటుంబ ప్రేమల మాటున జేబులకు చిల్లులు పెట్టుకుంటున్నాడు. సాక్షి ప్రతినిధి, కాకినాడ: సంక్రాంతికి సొంతూరు రావాలంటే జేబులు గుల్లవడం ఖాయం. బస్సులు, రైళ్లు సీట్లన్నీ ఫుల్ అయిపోయాయి. పెద్ద పండగ సంక్రాంతి మూడు రోజులు సొంతూరులో సరాదాగా బంధువులతో గడుపుదామంటే టిక్కెట్ చార్జీలు గుండెలు గుభిల్లుమనిపిస్తున్నాయి. సంక్రాంతికి రెండు వారాల ముందే ప్రైవేటు ట్రావెల్స్ దోపిడీ మొదలైపోయింది. ఏ ట్రావెల్స్లో అడిగినా అడ్వాన్స్ బుకింగ్లు అయిపోయాయనే సమాధానం ఎదురవుతోంది. సహజంగా సంక్రాంతి పండగకు వారం రోజుల ముందు అంటే వారాంతం సెలవులు చూసుకుని ఈ నెల 9న ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. చిరుద్యోగుల నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగుల వరకు, చిరు వ్యాపారుల నుంచి బడా వ్యాపారుల వరకు జిల్లా వాసులు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే స్థిరపడ్డారు. హైదరాబాద్ తరువాత బెంగుళూరు, ఆ తరువాత స్థానంలో చైన్నె ఉంటాయి. అత్యధికులు హైదరాబాద్ నుంచే రావాల్సి ఉంది. వీరంతా సంక్రాంతి పండగకు పిల్లా పాపలతో కలసి వస్తుంటారు. ఇలా 20 వేల మంది వరకు జిల్లాకు వస్తుంటారని అంచనా. వీరిలో మూడు వంతుల మంది ఒక్క హైదరాబాద్, పరిసర ప్రాంతాల నుంచి వచ్చే వారే ఉంటారు. మిగిలిన వారు బెంగళూరు, చైన్నె, నెల్లూరు, కృష్ణా, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వస్తారు. ఏటా మాదిరిగానే ప్రైవేటు ట్రావెల్ ఏజెన్సీలు బస్సు చార్జీలను రెండు నుంచి మూడింతలు పెంచేసి ప్రయాణికుల అవసరాన్ని సొమ్ము చేసుకుంటున్నాయి. వేలాదిగా వచ్చే వారితో బస్సులు, రైళ్లలో విపరీతమైన రద్దీ ఉంటాయి. టిక్కెట్టు చార్జి ఎంత పెంచినా అవసరాన్ని బట్టి తప్పడం లేదంటున్నారు. ప్రతి పండగకూ ప్రైవేటు బస్సులలో సీటుపై 10 నుంచి 15 శాతం పెంచుకోవడం సహజం. ఇందుకు ప్రయాణికులు కూడా మానసికంగా సిద్ధపడిపోయారు. ఈసారి సంక్రాంతి పండగకు 15 రోజుల ముందుగానే 60 నుంచి 80 శాతం వరకూ అడ్డగోలుగా రేట్లు పెంచేశారు. ఏసీ, స్లీపర్ కోచ్లలో సీట్లను డబుల్ రేట్లకు అమ్ముకుంటున్నారు. ఇవేం చార్జీలు అని అడుగుతుంటే వాహనాల తనిఖీలు, ఇతర ఖర్చులు భరించడం ఎలా అని ఎదురు ప్రశిస్తున్నారు. ప్రైవేటు ట్రావెల్స్ అడ్డగోలుగా చార్జీల పెంచేస్తున్నా రవాణా శాఖ చూసీచూడనట్టు పోతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ నుంచి కుటుంబం అంతా కలిసి బయలుదేరడమంటే రూ.15 వేల పై మాటగానే కనిపిస్తోంది. ఒక కుటుంబం రాను, పోను రూ.30 వేలు భరించడం మాటలా అంటున్నారు. పక్షం రోజుల క్రితమే సీట్లు ముందస్తు రిజర్వేషన్లు చేసుకున్నా చార్జీల మోత తప్పలేదని హైదరాబాద్ నుంచి వచ్చే ప్రయాణికులు చెబుతున్నారు. విమాన టిక్కెట్ ధరలతో పోటీ పడుతూ టిక్కెట్ ధరలను అమాంతం పెంచేశారు. ఆర్టీసీ సర్వీసులు, రైళ్లు ఖాళీ లేక ప్రైవేట్ ట్రావెల్స్ను ఆశ్రయించక తప్పని పరిస్థితి నెలకొంది. సంక్రాంతికి ముందు వారాంతం శనివారం 10 తేదీ కావడంతో హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి రావడానికి ఆ రోజుకే ఎక్కువగా రిజర్వేషన్లు చేయించుకున్నారు. ఆ రోజు ప్రైవేటు ట్రావెల్స్లో సీటు దొరకడమే గగనమైపోయింది. ఏ ట్రావెల్స్లో సీటు అడిగినా ఫుల్ అయిపోయాయి.. ఖాళీ లేవనే సమాధానం చెబుతున్నారు. సంక్రాంతి మూడు రోజులు 14, 15, 16 తేదీల్లో భోగి, సంక్రాంతి, కనుమ, వారాంతం శనివారం 17, ఆదివారం 18 వచ్చింది. జిల్లా నుంచి తిరుగు ప్రయాణానికి 18 తేదీకే డిమాండ్ ఎక్కువగా ఉంది. కారణాలేవైనా ఎక్కువ మంది ఆర్టీసీ కంటే ప్రైవేటు ట్రావెల్స్కే మొగ్గు చూపుతున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని ప్రైవేటు ట్రావెల్స్ అడ్డగోలుగా చార్జీలు పెంచేసి ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. నలుగురు సభ్యులున్న కుటుంబం బస్సు ఎక్కాలంటే చార్జీలకు రూ.15 వేలు పెట్టుకోవాల్సి వస్తోందని పలువురు గగ్గోలు పెడుతున్నారు. మరోవైపు తిరుగు ప్రయాణానికి అప్పుడే అడ్వాన్స్ బుకింగులు పెరిగిపోయాయని, టిక్కెట్లు లేవని ట్రావెల్స్ నిర్వా హకులు చెప్పేస్తున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ కాకినాడ–హైదరాబాద్ మధ్య ప్రతి రోజూ 30 బస్సులు నడు పుతున్నాయి. బెంగళూరు, చైన్నె వంటి ప్రాంతాలకు ఆరేడు సర్వీసులు నిర్వహిస్తున్నారు. సాధారణంగా జిల్లా నుంచి ప్రతి రోజూ 1,500 నుంచి 2,000 మంది హైదరాబాద్ వంటి దూర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. సంక్రాంతి సీజన్లో ఇంతకు ఆరేడు రెట్లు అదనంగా ప్రయాణిస్తుంటారు. సాధారణ రోజుల్లో ప్రైవేటు ట్రావెల్స్ చార్జీలు నాన్ ఏసీ రూ.900, ఏసీ రూ.1,100, స్లీపర్ రూ.1,500 చార్జీలు ఉండేవి. సంక్రాంతి పండుగ పేరు చెప్పి నాన్ ఏసీ రూ.1,500 నుంచి రూ.2000, ఏసీకి రూ.2,500, స్లీపర్ రూ.3,500, అవకాశాన్ని బట్టి రూ.4000 వరకూ పెంచేశారు. ఇలా బస్సులు చార్జీలు చూసి రైళు ఎక్కుదామంటే అక్కడ కూడా బెర్త్లు నిండుకున్నాయంటున్నారు. సామర్లకోట జంక్షన్ మీదుగా రాకపోకలు సాగించే గౌతమి, గోదావరి సహా అన్ని రైళ్లలో ఈ నెల తొమ్మిది నుంచి 18 తేదీ వరకు దాదాపు రిజర్వేషన్లు క్లోజ్ అయిపోయాయి. ప్రత్యేక రైళ్ల పరిస్థితి కూడా అంతంత మాత్రమే. ప్రయాణికులపై పండగ మోత ప్రభుత్వ ప్రజా రవాణా ఒకలా.. ప్రైవేటు ఆపరేటర్లు మరోలా.. రైళ్లు ఇంకొకలా బాదుడే బాదుడు ఓ కుటుంబానికి రాను పోను ప్రయాణ ఖర్చు రూ.30 వేల పైమాటే! -
ఆర్టీసీ డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలి
రామచంద్రపురం రూరల్: అనేక మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ బస్సుల డ్రైవర్లు నిత్యం అప్రమత్తంగా ఉండాలని రామచంద్రపురం మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ రెడ్డి రాజేంద్ర ప్రసాద్ సూచించారు. రామచంద్రపురం ఆర్టీసీ డిపో గ్యారేజీలో శుక్రవారం జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాన్ని పురస్కరించుకుని కార్యక్రమం నిర్వహించారు. డిపో మేనేజర్ పేపకాయల భాస్కరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎంవీఐ రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. డిపో మేనేజర్ భాస్కరరావు మాట్లాడుతూ డ్రైవర్లకు మంచి శిక్షణతో కూడిన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రమాదాలను ఎలా నివారించవచ్చు అనే అంశంపై వివరించారు. బస్సు కండిషన్ను ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఉండాలన్నారు. సమావేశంలో సీనియర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కె.రవికుమార్, అసిస్టెంట్ మెకానిక్ ఫోర్మెన్ జి.రవిబాబు తదితరులు పాల్గొన్నారు. -
త్యాగరాజ ఆరాధనోత్సవాలు ప్రారంభం
అనపర్తి: అనపర్తి శారదా సంగీత కళా సమితి ఆధ్వర్యంలో 27వ త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు శుక్రవారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. స్థానిక టీటీడీ కల్యాణ మండపం ప్రాంగణంలో 8 రోజుల పాటు ఈ ఉత్సవాలు వైభవంగా జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. రాజమహేంద్రవరానికి చెందిన వీఎల్ తులసీ విశ్వనాథ్ గాత్ర కచేరీతో మొదటి రోజు కార్యక్రమాలు మొదలయ్యాయి. మారెళ్ల పురుషోత్తమశర్మ, సీతామహాలక్ష్మి దంపతుల జ్ఞాపకార్థం, వారి కుమారుడు, ఆడిటర్ మారెళ్ల గంగరాజుశర్మ సౌజన్యంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. మల్లిడి మాలతి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. కుమారి వి.నీరజ సహకార గానంతో పి.నందకుమార్ వయోలిన్, బి.సురేష్ బాబు మృదంగం సహకారం అందించారు. కార్యక్రమంలో కళాసమితి అధ్యక్షుడు తమలంపూడి చిన ఆదిరెడ్డి, ఉపాధ్యక్షుడు నల్లమిల్లి మురళీమోహన్ బాలకృష్ణారెడ్డి, సహాయ కార్యదర్శులు కొవ్వూరి సత్యనారాయణరెడ్డి, మారెళ్ల శ్రీకృష్ణ ఫణీంద్ర, సభ్యులు పాల్గొన్నారు. -
రత్నగిరి వనదుర్గ ఆలయంలో ఖడ్గమాల పూజ
● ఫిబ్రవరి 20 నుంచి ప్రారంభం ● ప్రతి శుక్రవారం నిర్వహణ ● టిక్కెట్ ధర రూ.1,116గా నిర్ణయం అన్నవరం: స్థానిక వీర వేంకట సత్యనారాయణస్వామి దేవస్థానంలోని వనదుర్గ అమ్మవారి ఆలయంలో మరో కొత్త పూజకు శ్రీకారం చుడుతున్నారు. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఖడ్గమాల స్తోత్రంతో శ్రీచక్రంపై కుంకుమపూజ నిర్వహించే కార్యక్రమాన్ని (ఖడ్గమాల పూజ) ఫిబ్రవరి 20 నుంచి ప్రారంభించనున్నట్లు దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వేండ్ర త్రినాథరావు శుక్రవారం తెలిపారు. వనదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రతి శుక్రవారం ఉదయం 7.30 నుంచి 8.30 వరకూ ఈ పూజ జరుగుతుంది. ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం ఉదయం తొమ్మిది నుంచి 11 గంటల వరకు నిర్వహించే చండీహోమం, పౌర్ణమి, అమావాస్య రోజుల్లో నిర్వహించే ప్రత్యంగిర హోమాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఖడ్గమాల పూజలకు టిక్కెట్ ధరను రూ.1,116గా నిర్ణయించారు. ఈ పూజలో భార్యాభర్తలు పాల్గొనవచ్చు. విధి విధానాలపై చర్చ ఖడ్గమాల పూజ విఽధి విధానాల రూపకల్పనపై పండితులతో చర్చిస్తున్నారు. విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో జరిగే ఖడ్గమాల పూజ మాదిరిగానే నలుచదరంగా ఉండే పలక మీద గల శ్రీచక్రానికి భక్తులతో పూజలు చేయించి, అనంతరం రాగి శ్రీచక్రం గల డాలర్, పూజ చేసిన కుంకుమ, ప్రసాదం ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. శ్రీచక్రం గల పలకను దేవస్థానం వెనక్కి తీసుకుని మరో భక్తుని పూజలో ఉపయోగిస్తారు. అయితే దీనిపై దేవస్థానం ఆస్థాన సిద్దాంతి తంగిరాల వెంకటకృష్ణ పూర్ణ ప్రసాద్, ఆగమ సలహదారు త్రివేది కపిలవాయి రామశాస్త్రితో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని దేవస్థానం అధికారులు తెలిపారు. -
శివలింగం ఘటనపై బీజేపీ మాట్లాడదేం?
● దేవదాయశాఖ మంత్రి విచారణ జరపాలి ● మాజీ ఎంపీ భరత్ రామ్ రామచంద్రపురం రూరల్: ప్రసిద్ధ శివాలయంలో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన కపాలేశ్వరస్వామి శివలింగం ధ్వంసమైతే బీజేపీ ఎందుకు నోరు మెదపడం లేదని రాజమహేంద్రవరం మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ ప్రశ్నించారు. ఆయన శుక్రవారం ద్రాక్షారామ భీమేశ్వరాలయ ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడారు. గతంలో శ్రీకాకుళంలోని శ్రీరామపాద క్షేత్రంలో శివలింగం ధ్వంసమైనప్పుడు, అంతర్వేదిలో రథం దగ్ధమైన ఘటనల్లో తెలుగుదేశం పార్టీ రాద్ధాంతం చేసిందన్నారు. ప్రస్తుతం శివలింగం ధ్వంసమైతే కాతేరు నుంచి మరో శివలింగాన్ని తీసుకుని వచ్చి మూఢంలో నిబంధనలు పాటించకుండా ప్రతిష్ఠించడం సరికాదన్నారు. దీనిపై హిందువులకు ప్రభుత్వం బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేవదాయశాఖ మంత్రి ఇక్కడికి వచ్చి, సమగ్ర విచారణ చేసి ప్రజలకు వివరణ ఇవ్వాలన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ రామచంద్రపురం కో ఆర్డినేటర్, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు పిల్లి సూర్యప్రకాశ్, వైస్ ఎంపీపీ శాకా బాబీ, ఉప సర్పంచ్ వల్లు శివ, నాయకులు కర్రి రవీంద్ర, రెడ్డింశెట్టి శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
వెలుగు చుక్కలు
విద్యాబోధన మామూలు విద్యార్థులకూ అంధులైన ఉపాధ్యాయులు పాఠాలు చెప్పగలరు. సాధారణ ఉపాధ్యాయుల మాదిరిగానే సేవలు అందించగలరు. వీరి కోసం పాఠ్య పుస్తకాలను ప్రత్యేక బ్రెయిలీ లిపిలోకి ముద్రిస్తారు. వాటిని స్పర్శిస్తూ విద్యార్థులకు పాఠాలు చెబుతారు. వారి సందేహాలను నివృత్తి చేస్తారు. ● అంధులకు ఆసరాగా బ్రెయిలీ లిపి ● ఆరు చుక్కలతో సమస్త విజ్ఞానం ● అన్ని రంగాల్లో ముందంజ ● రేపు ప్రపంచ బ్రెయిలీ లిపి దినోత్సవం రాయవరం: వారంతా అంధులు. పుట్టుకతోనే కొందరు, ప్రమాదవశాత్తూ మరి కొందరు చూపు పోగొట్టుకున్నారు. అయితే కళ్లు లేవని కలత చెందకుండా కేవలం స్పర్శ, శబ్దం, వాసనల ఆధారంగానే వారు అన్ని పనులు సమర్థంగా చేసుకుంటున్నారు. నేత్రాలను కోల్పోయినా తమ జ్ఞాన నేత్రానికి పదును పెడుతూ అన్ని రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్నారు. ఆరు చుక్కల లిపితో తమ జీవితాల్లో వెలుగులు నింపుకొంటున్నారు. అంచలంచెలుగా.. సాధారణంగా చదువు కోవాలంటే పుస్తకాలు తప్పనిసరి. కానీ అంధులు చూడలేని కాబట్టి వారికి స్పర్శతో చదువు చెప్పే విధానం కావాలి. దీని కోసం స్పెయిన్కు చెందిన ఫ్రాన్సిస్కో లూకాస్ 16వ శతాబ్దంలో చెక్క మీద ఎత్తుగా ఉబ్బి ఉండే అక్షరాలను చెక్కే పద్ధతిని రూపొందించాడు. అనంతరం పారథస్ అనే అంధుడైన సంగీతజ్ఞుడు, అతడి మిత్రుడు హెయిలీ కలిసి పేపరు మీద ఎత్తుగా ప్రింటు చేసే విధానం కనుగొన్నారు. అయితే అంధులకు లిపిని కనుగొన్న ఘనత బ్రెయిలీకి దక్కింది. ఆరు చుక్కల లిపి కేవలం చేతి వేళ్లతో ఆరు చుక్కలను స్పర్శించి అక్షర జ్ఞానాన్ని పొందడానికి అనువుగా లూయిస్ బ్రెయిలీ ఈ లిపిని రూపొందించారు. అన్ని భాషలకు ఆరు చుక్కలే ఆధారం. కుడి పక్కన 1, 2, 3 చుక్కలు, ఎడమ వైపున 4, 5, 6 చుక్కలు ఉంటాయి. ఈ ఆరు చుక్కల్లోనే ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క నంబరు ఉంటుంది. అంధులు ఆ నంబర్లను గుర్తు పెట్టుకుని, మనో నేత్రంతో చదువుతూ విద్యను అభ్యసిస్తున్నారు. లూయిస్ బ్రెయిలీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏటా జనవరి 4న ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం జరుపుకొంటున్నారు. పట్టుదలతో.. పారిస్ సమీపంలోని కూపేవ్రేలో 1809 జనవరి 4న లూయిస్ బ్రెయిలీ జన్మించారు. మూడేళ్ల వయసులో తండ్రి దుకాణంలో పనిముట్లతో ఆడుకుంటుండగా, ఒక పనిముట్టు ఆయన కుడి కంటికి తగలడంతో చూపును కోల్పోయారు. అయినా పట్టుదలతో ప్రసిద్ధ సంగీత విద్వాంసుడిగా మారాడు. తనలా బాధపడుతున్న వారి కోసం బ్రెయిలీ ఒక లిపిని కనిపెట్టారు. కేవలం పదిహేనేళ్ల వయసులో ఫ్రెంచ్ వర్ణమాల ఆధారంగా బ్రెయిలీ కోడ్ను అభివృద్ధి చేశారు. ఆత్మ విశ్వాసంతో.. పుట్టుకతోనే అంధత్వంతో జన్మించాను. తల్లిదండ్రులైన మంగమ్మ, వెంకన్నలు నన్ను కంటి పాపలా కాపాడారు. మండపేట అంధుల పాఠశాలలో బ్రెయిలీ లిపి ద్వారా విద్యాభ్యాసం చేశాను. డిగ్రీ పూర్తి చేసిన అనంతరం టీచర్ శిక్షణ పొంది ఉపాధ్యాయుడిగా స్థిరపడ్డాను. బ్రెయిలీ లిపితో నాకు ఆత్మవిశ్వాసం పెరిగింది. – వేల్పూరి వీరబాబు, ఎంపీయూపీ స్కూల్ ఉపాధ్యాయుడు, వెదురుమూడి, కపిలేశ్వరపురం మండలం కళ్లు లేవని బాధపడలేదు కళ్లు లేవని బాధపడకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాను. పుట్టుకతోనే నా రెండు కళ్లకూ చూపు లేదు. లూయిస్ బ్రెయిలీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలనే పట్టుదలతో చదివాను. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. – పి.దొరబాబు, ఉపాధ్యాయుడు, ఎస్పీఎస్ఆర్ మున్సిపల్ స్కూల్, రాజకోట, రామచంద్రపురం, -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 30,000 గటగట (వెయ్యి) 27,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 26,500 గటగట (వెయ్యి) 23,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 15,000 – 16,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)15,000 – 16,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 6,000 కిలో 400 -
ఎలా చేస్కోవాలి పండగ?
● జిల్లాలో 5.60 లక్షల రేషన్ కార్డులు ● అమలాపురం పట్టణానికే గోధుమపిండి పరిమితం ● 11,634 కార్డుదారులకు మాత్రమే.. ● చంద్రబాబు ప్రభుత్వ వచ్చిన తర్వాత నిలిచిన కందిపప్పు పంపిణీ ● ఆగిపోయిన ఇంటింటికీ రేషన్ సరఫరాప్రతి ఒక్కరికీ గోధుమపిండి అందించాలి పేద, మధ్య తరగతికి మేలు చేసే ప్రతి నిత్యావసర వస్తువును ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందరికీ అందించాలి. కేరళ ప్రభుత్వం 16 రకాల నిత్యావసర వస్తువులను అందిస్తోంది. గోధుమ పిండి ప్రతి లబ్ధిదారునికి అందించాలి. మేలైన బియ్యంతోపాటు కందిపప్పు ఇతర వస్తువులు అందించేందుకు చర్యలు తీసుకోవాలి. – కారెం వెంకటేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడురేషన్ దుకాణాల్లో కందిపప్పు కనుమరుగుసాక్షి, అమలాపురం: పావలా పనికి.. ముప్పావలా ప్రచారం అనే నానుడికి చంద్రబాబు ప్రభుత్వ పాలన నిదర్శనమనే విమర్శలు వస్తున్నాయి. పండగ సమయంలో చౌక ధరల దుకాణాల ద్వారా పేదలకు, మధ్య తరగతి వర్గాలకు మేలు చేసేందుకు చెక్కి గోధుమ పిండి పంపిణీ చేస్తామని ప్రభుత్వ పక్షం రోజులుగా ఊదరగొడుతోంది. దీనిపై అధికారుల సమీక్షలు సాగిస్తుండగా, సొంత మీడియా, సామాజిక మాధ్యమాలలో ప్రచారం హోరెత్తిస్తోంది. ఇంతా చేసి కేవలం జిల్లా ప్రధాన కేంద్రం ఉన్న నగరాలకు, పట్టణాలకు మాత్రమే గోధుమపిండి పంపిణీ అని ఇప్పుడు చల్లగా చెబుతోంది. ప్రచారానికే పరిమితం సంక్రాంతి పండగనాడు పేదలకు చెక్కి గోధుమ పిండి ఇస్తామని ప్రభుత్వం చెబుతూ వచ్చింది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ కార్డుపై కేజీ చొప్పున గోధుమ పిండి ఇస్తామని చంద్రబాబు ప్రభుత్వం చెబుతోంది. కేజీ రూ.20 చొప్పున ఇస్తామని ప్రకటించింది. బహిరంగ మార్కెట్లో కేజీ క్వాలిటీ గోధుమ పిండి రూ.60 నుంచి రూ.65 వరకు పలుకుతోంది. సంక్రాంతి నాడు పేదలకు మేలు చేసేందుకు ఇలా పంపిణీ చేస్తున్నామని చెప్పుకొచ్చింది. దీనిపై పక్షం రోజులుగా ప్రచారం హోరెత్తిస్తోంది. తీరా అమలు చేయాల్సిన సమయానికి వచ్చేసరికి జిల్లా కేంద్రమైన అమలాపురం మున్సిపాలిటీ పరిధిలోనే ఇస్తామని చెప్పడం గమనార్హం. మున్సిపాలిటీ పరిధిలో కేవలం 11,634 కార్డు దారులకు మాత్రమే పరిమితం చేశారు. దీనికి కూడా శుక్రవారం పట్టణ పరిధిలో ఉన్న 19 రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తామని జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి ప్రకటించారు. అయితే అమలాపురం పట్టణంలో గురువారం నుంచి పంపిణీ మొదలయ్యింది. మండిపడుతున్న వినియోగదారులు చెక్కి గోధుమపిండి కేవలం అమలాపురం పట్టణవాసులకు మాత్రమే పరిమితం అని తెలిసి జిల్లాలోని రేషన్ కార్డుదారులు కంగుతిన్నారు. జిల్లాలో మండపేట నియోజకవర్గంతో కలిపి సుమారు 5.60 లక్షల రేషన్ కార్డుదారులు ఉన్నారు. అంటే మొత్తం లబ్ధిదారులలో కేవలం 2 శాతం మందికి మాత్రమే గోధుమ పిండి అందుతుందని అంచనా. జిల్లాలో మండపేట, రామచంద్రపురం మున్సిపాలిటీలు, ముమ్మిడివరం నగర పంచాయతీతోపాటు 23 మండలాల్లో ఈ గోధుమ పిండి పంపిణీ లేదు. దీనిపై వినియోగదారులు మండిపడుతున్నారు. పండగ అమలాపురం పట్టణవాసులకేనా అని ప్రశ్నిస్తున్నారు. బాబు ప్రభుత్వంలో రేషన్ వ్యవస్థ చిన్నాభిన్నం చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రజా పంపిణీ వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నాణ్యమైన బియ్యం (ఫోర్టిఫైడ్ రైస్) అందించేవారు. అరకేజీ పంచదార, కేజీ చొప్పున కందిపప్పు, గోధుమ పిండిని వినియోగదారులకు అందజేసేవారు. రేషన్ను ఇంటింటికీ మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్(ఎండీయూ)ల ద్వారా పంపిణీ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత నెమ్మది నెమ్మదిగా ఈ వ్యవస్థను తొలగించారు. ఇప్పుడు వృద్ధులు, వితంతువులు కూడా రేషన్ దుకాణాల వద్ద పడిగాపులు పడుతున్నారు. ఎండీయూలను తొలగించడంతో సుమారు 250 మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. వీరు రోడ్డు ఎక్కి ఆందోళన చేసినా బాబు ప్రభుత్వం కనికరం చూపలేదు. పలు సందర్భాలలో రేషన్ ద్వారా ముతక బియ్యం ఇస్తుండడంతో లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. అలాగే కందిపప్పును నిలిపివేశారు. కేవలం గత ఏడాది జనవరి కందిపప్పు రూ.67 చొప్పున అందించారు. ఇప్పుడు ఇది నిలిపివేయగా బహిరంగ మార్కెట్లో కేజీ కందిపప్పును రూ.120 నుంచి రూ.135 చేసి కొనుగోలు చేయాల్సి వస్తోంది. గత ప్రభుత్వంలో గోధుమపిండి ప్రతి లబ్ధిదారునికి అందించగా, బాబు ప్రభుత్వం నిలిపివేసింది. తాజాగా దీనిని అమలాపురం పట్టణ పరిధిలో కేజీ రూ.20 చేసి అందించాలని నిర్ణయించారు. -
ఉత్తరాది భక్తులదక్షిణాయనం
● వందలాది టూరిస్టు బస్సులలో వేలాదిగా రాక ● అన్నవరంలో సందడి● బస్సుల వద్దనే బస.. నిత్యకృత్యాలుఅన్నవరం: సూర్యుడి గమనం ఉత్తర దిశగా ఉంటే ఉత్తరాయనమని.. దక్షిణ దిశగా జరుగుతూంటే దక్షిణాయనమని వ్యవహరిస్తారు. సరిగ్గా ఇదే విధంగా ఉత్తరాది భక్తులు ప్రస్తుతం దక్షిణాయనం మొదలుపెట్టారు. దక్షిణ భారతదేశంలోని వివిధ పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ.. ఆ క్రమంలో అన్నవరం పుణ్యక్షేత్రానికి వేలాదిగా తరలి వస్తున్నారు. ఉత్తర ప్రదేశ్లోని వారణాశి, అయోధ్య, ప్రయాగరాజ్, ఉత్తరాఖండ్లోని హరిద్వార్, రుషికేశ్, బద్రీనాథ్, కేదార్నాథ్ వంటి పుణ్యక్షేత్రాలకు దక్షిణాది భక్తులు ముఖ్యంగా తెలుగువారు ఎక్కువ సంఖ్యలో వెళ్తూంటారు. అటువంటిది.. ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు దక్షిణాదిలోని పుణ్యక్షేత్రాల సందర్శనకు టూరిస్టు బస్సులలో తరలి వస్తున్నారు. పది రోజులుగా వారు వస్తున్న బస్సులతో రత్నగిరి దిగువన ఉన్న కళాశాల మైదానం సందడిగా మారుతోంది. ఫిబ్రవరి వరకూ.. ఉత్తర భారతంలోని హర్యానా, రాజస్థాన్, బిహార్, జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్తో పాటు మధ్య భారత్లోని ఉన్న మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్ రాష్ట్రాల్లో పంటల సాగు సాధారణంగా డిసెంబర్లో పూర్తవుతుంది. అనంతరం, అక్కడి భక్తులు అధిక సంఖ్యలో ప్రత్యేక బస్సులలో దక్షిణ భారత తీర్థయాత్రలకు బయలుదేరుతారు. ఎక్కువగా మధ్య తరగతికి చెందిన నడి వయస్కులే ఈ యాత్రలు చేస్తూండటం విశేషం. రత్నగిరికి డిసెంబర్లో మొదలైన ఉత్తరాది భక్తుల రాక ఫిబ్రవరి వరకూ కొనసాగుతుంది. గతంలో భక్తులు సాధారణంగా టూరిస్టు బస్సులలోనే తీర్థయాత్రలు చేసేవారు. కొన్నేళ్లుగా రైళ్లు, కార్లలో యాత్రలు చేసేవారు ఎక్కువయ్యారు. కానీ, ఉత్తరాది భక్తులు మాత్రం ఇప్పటికీ టూరిస్టు బస్సులలోనే యాత్రలు చేస్తూండటం విశేషం. వీరు సమూహాలుగా వందల వేల కిలోమీటర్లు బస్సులలోనే ప్రయాణిస్తూంటారు. కనీసం పదికి తక్కువ కాకుండా గరిష్టంగా 50 వరకూ కూడా టూరిస్టు బస్సులలో భక్తులు వచ్చిన సందర్భాలున్నాయి. సొంతంగా వంట వీరు వంట సామగ్రి, పొయ్యిలు, గ్యాస్ సిలిండర్లు తమ వెంట తెచ్చుకుంటున్నారు. బస్సులు ఆగినచోటనే వంటలు చేసుకుని, అందరూ కలసి, ఒక వరుసలో కూర్చుని భోజనాలు చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడా బయటి హోటళ్లలో కొనుక్కుని తినరు. ఫలహారమైనా, చపాతీలైనా, పూరీలైనా సొంతంగా తయారు చేసుకోవలసిందే. ప్రతి బస్సులో ఒక వంట మేస్త్రి, ఇద్దరు సహాయకులు ఉంటారు. వీరికి మరి కొంత మంది భక్తులు సహాయం చేస్తారు. ఎక్కువగా చపాతీలు, పూరీలు, టమాటా, బంగాళాదుంప కూర తయారు చేసుకుంటారు. దీనికి అవసరమైన గోధుమ పిండి, నూనె, బంగాళా దుంపలు, టమాటాలు, ఇతర కూరగాయలు కూడా తమ వెంట తెచ్చుకుంటారు. ఇవి అయిపోతే స్థానికంగా కొనుక్కుంటారు. దగ్గరలో సత్రాలుంటే వాటిలో హాల్స్ అద్దెకు తీసుకుని బస చేస్తారు. లేకపోతే బస్సుల వద్దనే విశ్రమించడం వీరికి అలవాటు. వారి వస్త్రాలు కూడా బస చేసిన ప్రదేశం వద్దనే ఉతుక్కుని ఆరబెట్టుకుంటారు. దర్శనానికి కాలి నడకనే.. గతంలో ఉత్తరాది భక్తులు తమ బస్సులను రత్నగిరిపై నిలుపు చేసి సత్యదేవుని దర్శనానికి వెళ్లేవారు. అయితే, కొండ దిగువన కళాశాల మైదానంలో దేవస్థానం అన్ని వసతులూ కల్పించడంతో వీరు కొన్నాళ్లుగా కొండ దిగువనే తమ బస్సులు నిలిపి, సత్యదేవుని దర్శనానికి వెళ్తుతున్నారు. ఎక్కువ మంది కళాశాల మైదానంలోని బాత్ రూములలో స్నానాలు చేసి, ఘాట్ రోడ్ మీదుగా కాలి నడకనే ఆలయానికి చేరుకుంటున్నారు. సత్యదేవుని దర్శనానంతరం, తిరిగి తమ బస్సుల వద్దకు వస్తూంటారు. ఉపయోగపడుతున్న షెడ్లు టూరిస్టు బస్సులలో వచ్చే భక్తుల కోసం కళాశాల మైదానం వద్ద 2023లో అప్పటి ఈఓ చంద్రశేఖర్ అజాద్ హయాంలో 5 విశ్రాంతి షెడ్లు, ఒక వంట షెడ్డు నిర్మించారు. వీటిలో అవసరమైన సౌకర్యాలను ఆ తరువాతి ఈఓ కె.రామచంద్ర మోహన్ హయాంలో కల్పించారు. ఇప్పుడు ఆ షెడ్లు ఉత్తరాది భక్తులకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఆ మెట్ల దారి ప్రారంభిస్తే వీరికి మేలు ప్రస్తుతం ఉన్న మెట్ల దారిని తొలి పావంచా నుంచి రత్నగిరిపై ఆలయం వరకూ గతంలో నిర్మించారు. కళాశాల మైదానం నుంచి ఆ మెట్ల దారికి చేరుకోవాలంటే సుమారు కిలోమీటరు దూరం నడవాల్సి వ స్తోంది. ఈ నేపథ్యంలో కళాశాల మైదానంలోని మొద టి ఘాట్ రోడ్డు నుంచి రత్నగిరి పైకి కొత్త మెట్ల మా ర్గం నిర్మించారు. దీని ప్రారంభంలో ఆర్చి, మెట్లకు ఇ రువైపులా పిట్ట గోడ నిర్మాణానికి త్వరలో టెండర్లు పి లవనున్నారు. ఆ పనులు పూర్తయి, నూతన మెట్ల మా ర్గం ప్రారంభమైతే ఉత్తరాది భక్తులతో పాటు దేవస్థా నం కళాశాల మైదానంలో వాహనాలను నిలుపు చేసి, కాలి నడకన వచ్చే భక్తులకు ఎంతో మేలు జరుగుతుంది. టూరిస్టు బస్సులలో వచ్చే భక్తుల కోసం దేవస్థానం నిర్మించిన షెడ్లు కళాశాల మైదానంలో ఉత్తరాది భక్తుల టూరిస్టు బస్సులు -
ఆధ్యాత్మిక జ్ఞానశక్తితో ఆశయ సాధన
పిఠాపురం: జీవితాశయ సాధనకు మానసిక శక్తి, మనోధైర్యం, సంకల్పంతో కూడిన ఆధ్యాత్మిక, తాత్త్విక జ్ఞానశక్తి అవసరమని విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠాధిపతి ఉమర్ ఆలీషా అన్నారు. నూతన ఆంగ్ల సంవత్సర ఆరంభం సందర్భంగా పీఠంలో గురువారం నిర్వహించిన జ్ఞాన మహాసభలో ఆయన అనుగ్రహ భాషణం చేశారు. మనసును స్థిరపరచుకునే తత్వమే ఆధ్యాత్మిక తత్వమని, దీని ద్వారా జీవితంలో చిన్న చిన్న వివాదాలు తొలగించుకుని, నిరంతరం సుఖసంతోషాలతో జీవించడానికి, మంచి చెడుల విశ్లేషణతో కూడిన మానసిక స్థితిని ఏర్పరచుకోవాలని అన్నారు. మనలోని లోపాలను సవరించుకోకుండా ఎన్ని చేసినా ప్రయోజనం ఉండదన్నారు. ఆ లోపాలను తొలగించుకునే విధానమే ఆధ్యాత్మిక తత్త్వమన్నారు. మానవత్వాన్ని బోధించేదే మతమని, మానవత్వాన్ని హరించేది మతం కాదని, రాక్షసత్వమని అభివర్ణించారు. మనసును తాత్త్విక జ్ఞానశక్తితో నింపుకోవడానికి సద్గురు మార్గంలో త్రయీ సాధన ఆచరించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ నిమిత్తం ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటి, గురు దక్షిణగా ప్రకృతిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న అమెరికాకు చెందిన కిరణ్ ప్రభ మాట్లాడుతూ, పీఠం నిర్వహిస్తున్న బాలవికాస్ కార్యక్రమాలను కొనియాడారు. డాక్టర్ కొండా నరసింహారావు, అలివేలు మంగాదేవి తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో తాత్త్విక బాల వికాస్ చిన్నారుల ప్రసంగాలు అందరినీ అలరించాయి. ఉమా ముకుంద నేతృత్వంలో సంగీత విభావరి రంజింపజేసింది. ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ఉమర్ ఆలీషా మహిళా యువతకు వస్త్రాలు, దంగేటి రామకృష్ణ సహకారంతో పీఠాధిపతి చేతుల మీదుగా ధాన్యపు కుచ్చులు పంపిణీ చేశారు. -
రత్నగిరికి పోటెత్తిన భక్తులు
అన్నవరం: నూతన ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా రత్నగిరికి గురువారం వేలాదిగా భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ సత్యదేవుని ఆలయానికి భక్తుల రాక కొనసాగింది. ఆలయ ప్రాంగణం, వ్రత, విశ్రాంతి మండపాలన్నీ భక్తులతో నిండిపోయాయి. ఉచిత దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట పట్టింది. సుమారు 25 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించారు. సత్యదేవుని వ్రతాలు 1,800 జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.25 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో 5 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. రత్నగిరి వనదేవత వనదుర్గ అమ్మవారికి శుక్రవారం ఉదయం 9 గంటలకు చండీహోమం నిర్వహించనున్నారు. రూ.750 టికెట్టుతో భక్తులు ఈ హోమంలో పాల్గొనవచ్చు. ఉత్సాహంగా సైన్స్ రంగోలీ పోటీలు పెద్దాపురం (సామర్లకోట): నూతన ఆంగ్ల సంవత్సరాదిని పురస్కరించుకొని పట్టణ చిల్ట్రన్స్ క్లబ్ ఆధ్వర్యాన పెద్దాపురం యాసలపు సూర్యారావు భవనంలో విద్యార్థులకు గురువారం జిల్లా స్థాయి సైన్స్ ముగ్గుల పోటీలు నిర్వహించారు. జూనియర్, సీనియర్స్, సూపర్ సీనియర్స్ విభాగాల్లో 300 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారని క్లబ్ గౌరవాధ్యక్షుడు బుద్దా శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో అధ్యక్షురాలు కూనిరెడ్డి అరుణ, ప్రతినిధులు అనూష, అంజలి, జస్విత, సాయి బంగారం, నేహా, రేణుకా, పవన్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. రాచపల్లిలో స్క్రబ్ టైఫస్ కేసు ప్రత్తిపాడు రూరల్: మండలంలోని రాచపల్లిలో స్క్రబ్ టైఫస్ కేసు నమోదైంది. స్థానిక నంది సెంటర్కు చెందిన 64 ఏళ్ల నాగభూషణం అనే మహిళకు ఈ వ్యాధి సోకినట్లు గుర్తించామని రాచపల్లి పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ గీతా సుధ గురువారం తెలిపారు. బాధిత మహిళను చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. జిల్లా వ్యవసాయ అధికారిగా రాబర్ట్ పాల్ రాజమహేంద్రవరం రూరల్: జిల్లా వ్యవసాయ అధికారిగా కె.రాబర్ట్ పాల్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ ఈ స్థానంలో ఉన్న మాధవరావు బుధవారం ఉద్యోగ విరమణ చేశారు. పాల్ ఉమ్మడి జిల్లా ఆత్మ ప్రాజెక్ట్ మేనేజర్గా వ్యవహరిస్తూ, ఇన్చార్జి జిల్లా వ్యవసాయ అధికారిగా నియమితులయ్యారు. ఆయనకు రాజమహేంద్రవరం ఏడీఏ సూర్యరమేష్, ఏఈఓ సంఘం అధ్యక్షుడు వేణుమాధవ్, పలువురు వ్యవసాయ అధికారులు అభినందనలు తెలిపారు. -
కలెక్టరేట్లో నూతన సంవత్సర వేడుకలు
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు గురువారం ఆనందోత్సాహాలతో ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి తూ ర్పు గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, కలెక్టర్ షణ్మోహన్, జాయింట్ కలెక్టర్ అపూ ర్వ భరత్, అసిస్టెంట్ కలెక్టర్ మనీషా, డీఆర్వో జె.వెంకటరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. దేవదాయ శాఖ ఆధ్వర్యాన అన్నవరం దేవస్థానం పు రోహితులు, వేద పండితులు కలెక్టర్కు వేదాశీర్వచనా లు అందించారు. అనంతరం రాయుడుపా లెం ఉమా మనోవికాస కేంద్రం, సామర్లకోట సిరి మానసిక దివ్యాంగుల పాఠశాల చిన్నారులతో కలసి కలెక్టర్ నూ తన సంవత్సర వేడుకలు జరుపుకొన్నారు. కేక్ కట్ చేసి, చిన్నారులకు పంచారు. నూతన సంవత్సరంలో జిల్లా ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు కనీస వసతులు కల్పించే ఉద్దేశంతో తాను చేసిన విజ్ఞప్తి మేరకు జిల్లాలోని దాతలు, వ్యాపార, వాణిజ్య, పారిశ్రామికవేత్తలు, అధికారులు, ఉద్యోగ సంఘాలు సుమారు రూ.30 లక్షల విరాళాలు అందించారన్నారు. తన సంకల్పానికి సహకరించిన అందరికీ కలెక్టర్ షణ్మోహన్ ధన్యవాదాలు తెలిపారు. రత్నగిరిపై... అన్నవరం: రత్నగిరిపై నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఏడాది అందరికీ శుభం జరగాలని వేద పండితులు ఉదయం స్వామి, అమ్మవార్ల సమక్షంలో వేదాశీస్సులు అందజేశారు. కొండ దిగువన ఉన్న దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్ బంగ్లాలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించా రు. రోహిత్, ఈఓ వేండ్ర త్రినాథరావులకు దేవస్థానం సిబ్బంది, గ్రామస్తులు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పారు. -
● ప్రకృతి మ‘హిమ’
సొంత కాన్వాసుపై ప్రకృతి స్వయంగా గీచిన చిత్రం నేత్రానందాన్ని కలిగిస్తుంది. నూతన సంవత్సరం ప్రారంభం రోజైన గురువారం.. గోకవరంలో అటువంటి చిత్రమే ఆవిష్కృతమైంది. దట్టంగా కమ్ముకున్న పొగమంచు తెరలు.. శీతల వాతావరణం ప్రజలను గిలిగింతలు పెట్టింది. ఉదయం పది గంటలవుతున్నా మంచు పరదాలను ఛేదించలేక సూర్యుడు సైతం చిన్నబోయాడు. – గోకవరం -
పగలు రెక్కీ... రాత్రి నక్కి...
● ఒక్కడే... 13 దొంగతనాలు ● పోలీసులకు చిక్కిన దొంగ కాకినాడ క్రైం: ఒక్కడే దొంగ, 13 దొంగతనాలు అవలీలగా చేసేశాడు. అన్ని చోట్ల కేసులు నమోదవడమే కానీ, ఎక్కడా పట్టుబడలేదు. తాజా చోరీలో మాత్రం కాకినాడ రూరల్ ఇన్స్పెక్టర్ డీఎస్ చైతన్యకృష్ణ బృందానికి చిక్కి కటకటాల పాలయ్యాడు. సంబంధిత వివరాలను కాకినాడ ఏఎస్పీ, ఎస్డీపీవో దేవరాజ్ మనీష్ పాటిల్ బుధవారం కాకినాడలోని డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. కరపలోని నీలయ్యతోట ప్రాంతంలో ఓ భారీ చోరీ జరిగింది. ఇన్స్పెక్టర్ చైతన్యకృష్ణ బృందం కేవలం ఒక్క రోజులోనే కేసు ఛేదించి నిందితుడ్ని పట్టుకొని నగలు, నగదు రికవరీ చేసింది. కాకినాడ పర్లోవపేటకు చెందిన 22 ఏళ్ల సుంకర తేజ ఈ దొంగతనానికి పాల్పడ్డాడు. చిన్న వయసులోనే దొంగతనాల్లో ఆరితేరిన తేజ పగలు రెక్కీ నిర్వహించి, రాత్రి వేళల్లో నక్కి ఇళ్లు కొల్లగొట్టేవాడు. తాళాలు వేసి ఉన్న ఇళ్లే ఇతడి లక్ష్యం. ముందు అక్కడే ఉన్న కిటికీలు, షూలో తాళం చెవులు వెతుకుతాడు. దొరకకపోతే దొడ్డి దారిలో వెళ్లి తలుపులు బద్దలు కొట్టి తెరుస్తాడు. లోపలికి చొరబడి ఇళ్లు గుల్ల చేస్తాడు. ఇదే తీరులో 13 దొంగతనాలు చేశాడు. కాకినాడ అర్బన్, గ్రామీణ మండలాల్లోని దాదాపు అన్ని స్టేషన్లలోనూ అతడిపై కేసులు ఉన్నాయి. నిందితుడిని సాంకేతికత సాయంతో ఒక్క రోజులోనే పర్లోవపేటలో పట్టుకున్నట్లు ఏఎస్పీ తెలిపారు. సీఐ చైతన్యకృష్ణ బృందానికి ఎస్ఐ టి.సునీత, క్రైం బృందం సహకరించాయని ఏఎస్పీ అన్నారు. -
మహిళపై కత్తితో దాడి
సామర్లకోట: కొంత కాలంగా తనతో సహజీవనం చేస్తున్న మహిళపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేసిన ఘటనపై కేసు నమోదైంది. స్థానికుల కథనం ప్రకారం స్థానిక రైల్వే స్టేషన్లో సమోసాలు విక్రయించే కాయ రాజుతో స్టేషన్లో పువ్వులు విక్రయించే లక్ష్మి ఏడాదిగా సహజీవనం చేస్తోంది. స్థానిక సత్యనారాయణపురంలో ఒక అద్దె ఇంటిలో రాజు నివసిస్తున్నాడు. నర్సీపట్నానికి చెందిన లక్ష్మి ప్రతి మూడు రోజులకు రాజు ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం హోటల్ నుంచి భోజనం తెచ్చుకుని ఇద్దరు ఇంటిలోకి వెళ్లిన తరువాత కేకలు వినిపించాయి. అంతలోనే రాజు రక్తం వస్తున్న కత్తితో రైలు పట్టాలపై నుంచి పరుగుతీసి పారిపోయాడని స్థానికులు తెలిపారు. రాజు ఉంటున్న ఇల్లు కౌన్సిలర్ సేసెని సురేష్కు చెందినది కావడంతో స్థానికులు ఆయనకు సమాచారం ఇచ్చారు. స్థానికులు, కౌన్సిలర్ ఇంటిలోకి వెళ్లి చూసే సరికి లక్ష్మి రక్తపు మడుగులో పడి ఉంది. కౌన్సిలర్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని లక్ష్మిని ఆటోలో సామర్లకోట సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. రెండు కాళ్లు నరికి వేయడంతో పాటు మెడపై కత్తి వేటు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. పరిస్థితి విషయంగా ఉండటంతో ఆమెకు ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. లక్ష్మికి ఇద్దరు పిల్లలు ఉన్నారని, భర్త వృద్ధుడు కావడంతో రాజుతో ఉంటున్నట్టు స్థానికులు తెలిపారు. సామర్లకోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అలుపెరగని బోధకునికి అభినందన
ఒక్క సెలవూ పెట్టని ఉపాధ్యాయినికి డీఈఓ సత్కారం అయినవిల్లి: మండలంలోని ముక్తేశ్వరం మండల ప్రాథమిక పాఠశాల సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడు కుడుపూడి నాగేశ్వరరావును జిల్లా విద్యాశాఖ అధికారి పి.నాగేశ్వరరావు అభినందించారు. పాఠశాల పర్యవేక్షణకు బుధవారం వచ్చిన డీఈఓ సదరు ఉపాధ్యాయుడు కుడుపూడి నాగేశ్వరరావు ఐదేళ్లుగా ఒక సెలవు తీసుకోకపోవడాన్ని తెలుసుకుని అభినందించారు. డీఈఓ మాట్లాడుతూ వృత్తి పట్ల అంకిత భావం, నిబద్ధతలతో పనిచేసే ఉపాధ్యాయుల్లో నాగేశ్వరరావు ఒకరన్నారు. ఇలాంటి ఉపాధ్యాయుల వల్లే ప్రభుత్వ ఉపాధ్యాయుల పట్ల సమాజంలో గౌరవం ఉందన్నారు. అనంతరం నాగేశ్వరరావును దుశ్శాలువాతో సత్కరించి, పూల మొక్కను బహూకరించారు. ఆయన వెంట డీసీసీబీ కార్యదర్శి బి హనుమంతరావు, ఎంఈఓ మెల్లం శ్రీనివాసరావు, పెచ్చెట్టి శ్రీనివాసు తదితరులు ఉన్నారు. -
ఇంటర్మీడియెట్ బోర్డు ఆర్ఐవోగా శారద
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): తూర్పుగోదావరి జిల్లా ఇంటర్బోర్డు రీజినల్ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్గా (ఆర్ఐవో) ఐ.శారద నియమితులయ్యారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు కమిషనరేట్ నుంచి ఆమెకు బుధవారం ఉత్తర్వులు అందాయి. రాజమహేంద్రవరంలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఆమె గురువారం విధుల్లో చేరనున్నారు. ఆమె ఇప్పటి వరకు కాకినాడ జిల్లా డీవీఈవో గా పని చేశారు. గతంలో జోన్ 2 పరిధిలో ఇంటర్బోర్డు ఆర్జేడీగా విధులు నిర్వర్తించారు. శారద నియామకంపై జిల్లాలోని అధ్యాపకులు, కళాశాల యాజమాన్యాలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఆమె సాక్షితో మాట్లాడుతూ తాను గతంలో మాదిరే పనిచేస్తానని, కొద్ది నెలల్లో రాబోతున్న ఇంటర్ పరీక్షల నిర్వహణలో పూర్తి అంకితభావంతో పనిచేస్తూ, ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు ర్యాంకులు సాఽధించే దిశగా కృషి చేస్తానని తెలిపారు. -
ప్రలోభాలతో పరమాత్ముని వశం చేసుకోలేము
సమన్వయ సరస్వతి సామవేదం ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): పాండవుల పక్షాన ద్యూతగా వస్తున్న కృష్ణపరమాత్మకు రత్నాలు, వాహనాలు, ఇతర సంపదలు ఏమడినా ఇవ్వాలని ధృతరాష్ట్రుడు విదురుని ఆదేశిస్తాడు. దానికి సమాధానంగా విదురుడు ప్రలోభాలతో పరమాత్మను వశం చేసుకోలేమని ధృతరాష్ట్రునికి వివరించినట్టు సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. బుధవారం హిందూ సమాజంలో ఆయన కృష్ణరాయబారం ఇతివృత్తాన్ని వివరించారు. నీవు ఇచ్చే పూర్ణకలశంతోనో, పాదోదకంతోనే, కుశల ప్రశ్నలతోనో తప్పించి కృష్ణుడు ఇతర సంపదలవైపు కన్నెత్తి కూడా చూడడని విదురుడు చెబుతాడు. దుర్యోధనుడు కృష్ణునితో నీ కోసం ఏర్పాటు చేసిన అన్నపానీయాలను, శయ్యను అంగీకరించమని కోరతాడు. కృష్ణుడు దుర్యోధనుని ఆహ్వానాన్ని తిరస్కరిస్తూ పాండవులను ద్వేషించిన వాడు నన్ను ద్వేషించినట్టే, వారిని ఆదరిస్తే నన్ను సత్కరించినట్టేనని చెబుతాడు. భగవంతునికీ, భాగవతులకీ తేడా లేదని ఆయన మాటల నుంచి మనం గ్రహించాలని సామవేదం అన్నారు. బాల్యం నుంచి వారి పట్ల దుర్భావంతో ఉన్న నీవు పెట్టే అన్నం కలుషితమైనదని చెప్పి, విదురిని ఇంటికి వెడతాడు శ్రీకృష్ణుడు. దుర్యోధనుడు మూఢుడు, వాడి పట్ల నీవు చెప్పే మంచి మాటలు వ్యర్థం అవుతాయని విదురుడు కృష్ణునితో చెబుతాడు. ఇరుపక్షాల వారికీ నేను కావలసినవాడిని, జ్ఞాతుల మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడితే సరిద్దిడానికి ప్రయత్నించకపోతే, లోకం నన్ను నిందిస్తుంది. నేను నిష్కపటంగా సంధి కోసం ప్రయత్నిస్తానని చెప్పాడు కృష్ణుడు. విదురుడు ప్రీతితో పెట్టిన అన్నాన్ని స్వీకరిస్తాడు. అనంతరం కృష్ణుడు కుంతిని కలసి పాండవుల క్షేమవార్తను తెలియచేస్తాడు. క్షత్రియకాంత ఏ ప్రయోజనాన్ని ఆశించి సంతానాన్ని కంటుందో, ఆ ప్రయోజనం నెరవేర్చే సమయం ఆసన్నమయిందని ధర్మరాజుకు చెప్పమని కుంతి కృష్ణుని కోరుతుంది. అనేక మంది మహర్షులు, రాజర్షులు, దేవర్షులు కృష్ణుని సందేశం వినడానికి సభకు వస్తారు. ముందుగా వారికి ఆసనాలు ఏర్పాటు చేయండి, వారు కూర్చోకుండా మనం ఆసీనులం కారాదని కృష్ణుడు సూచిస్తాడని సామవేదం అన్నారు. -
కోడి కత్తుల తయారీదారు అరెస్టు
దేవరపల్లి: గోపాలపురం మండలం హుకుంపేటలో కోడి కత్తులు తయారు చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి అతని నుంచి 40 కత్తులను స్వాధీనం చేసుకున్నట్టు సీఐ బీఎన్ నాయక్ బుధవారం తెలిపారు. పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కోడి కత్తులను తయారు చేసి విక్రయిస్తున్నట్టు ఎస్సై మనోహార్, ట్రైనీ ఎస్సై శివగణేష్కు అందిన సమాచారం మేరకు హుకుంపేటలో కోడికత్తులు తయారు చేస్తున్న బొల్లం హరికృష్ణను అదుపలోకి తీసుకున్నట్టు ఆయన తెలిపారు. అతని నుంచి 40 కోడి కత్తులు, కత్తులను సానపట్టే యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నట్టు ఆయన వివరించారు. సంక్రాంతి సందర్భంగా వీటిని తయారు చేస్తున్నట్టు ఆయన చెప్పారు. గతంలో కోడిపందేల్లో అరెస్టయిన వారిని, కోడిపందాలు, పేకాటలు నిర్వహించి కేసులు నమోదైన వారందని బైండోవర్ చేసినట్టు ఆయన చెప్పారు. గోపాలపురం పోలీస్ స్టేషన్లో 350 మంది, దేవరపల్లి పోలీస్ స్టేషన్లో 350 మంది పాత నేరస్తులు ఉన్నట్టు ఆయన చెప్పారు. మూడు రోజులుగా పాత నేరస్తులను బైండోవర్ చేస్తున్నట్టు ఆయన చెప్పారు. గోపాలపురం పోలీస్ స్టేషన్లో ఇప్పటికి 70 మందిని బైండోవర్ చేసినట్టు ఆయన తెలిపారు. 21 కిలోల గంజాయి స్వాధీనం -
పార్కింగ్ చేసిన కార్లే అతడి లక్ష్యం
రూ.25 లక్షల విలువైన ఆభరణాల స్వాధీనం లబ్బీపేట (విజయవాడ తూర్పు): దేవాలయాల వద్ద పార్క్ చేసిన కార్ల డోర్లు చాకచక్యంగా తెరిచి లోపల ఉన్న ఆభరణాలు చోరీ చేసే అంతర్ జిల్లా నేరస్తుడిని సీసీఎస్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. అతని నుంచి రూ.25 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. సీసీఎస్ స్టేషన్లో ఏడీసీపీ ఎం.రాజారావు తెలిపిన వివరాల మేరకు కోనసీమ అంబేడ్కర్ జిల్లా అల్లవరం మండలం మొగళ్లమూరు గ్రామానికి చెందిన చింత గణేష్ ఏడో తరగతి వరకూ చదివి కారు డ్రైవర్గా పనిచేసేవాడు. 15 ఏళ్లు ఖతార్ దేశంలో డ్రైవర్గా చేసి 2019లో దేశానికి తిరిగి వచ్చాడు. ఇక్కడ డ్రైవర్గా చేస్తూ దురలవాట్లకు బానిస కావడంతో వచ్చే డబ్బులు చాలక సులభంగా డబ్బులు సంపాదించేందుకు నేరాలకు పాల్పడుతున్నారు. తారాపేటలో అరెస్టు 2025 ఏప్రిల్లో దుర్గగుడి ఓం టర్నింగ్ వద్ద పార్క్ చేసి ఉన్న కారు డోర్లు తెరిచి లోపల బ్యాక్ సీట్లో ఉన్న ఆభరణాలు చోరీ చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో అక్కడ సేకరించిన ఆధారాలు, సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టి చింత గణేష్ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడు నేరం అంగీకరించడంతో అతని నుంచి రూ.25 లక్షల విలువైన బంగారు ఆభరణాలు రికవరీ చేశామన్నారు. -
వన విహారికో విడిది..
● పర్యాటకుల కోసం ప్రత్యేక హట్లు ● ఆధునిక వసతులతో నిర్మాణం ● సర్వాంగ సుందరంగా వసతి గృహాలు తాళ్లరేవు: తూర్పున ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఖ్యాతి గడించిన కోరంగి అభయారణ్యాన్ని సందర్శించే పర్యాటకుల కోసం అటవీ శాఖ ప్రత్యేక హట్లను (వసతి గృహాలు) అందుబాటులోకి తీసుకువచ్చింది. దేశంలో పశ్చిమ బెంగాల్లోని సుందరబన్ అడవుల తరువాత రెండో అతిపెద్ద మడ అటవీ ప్రాంతమైన కోరంగి అభయారణ్యాన్ని వేలాది పర్యాటకులు సందర్శిస్తుంటారు. అయితే దూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు విడిది చేసేందుకు అటు కాకినాడ కానీ, ఇటు యానాం, అమలాపురం కానీ వెళ్లవలసి వచ్చేది. అయితే కోరంగిలోనే పర్యాటకులు సేద తీరడంతో పాటు అక్కడ బస చేసేలా అత్యాధునిక సౌకర్యాలతో అటవీ శాఖ వసతి గృహాలను ప్రారంభించింది. కోరంగి పంచాయతీలోని ఫారెస్ట్ కాంప్లెక్స్ ప్రాంగణంలో ఉన్న మూడు హట్లతో పాటు మరొక అటవీ శాఖ భవనాన్ని సైతం పర్యాటకులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రతి రూములోనూ డబుల్ కాట్ బెడ్, ఏసీ, టీవీ, ఇన్వర్టర్ సౌకర్యాలను కల్పించారు. పర్యాటకులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు పూర్తిస్థాయిలో రక్షణ ఉండేలా చర్యలు చేపట్టారు. అంతే కాకుండా ప్రాంగణంలో ఉన్న బయో డైవర్సటీ భవనాన్ని సందర్శిస్తే కోరంగి మడ అభయారణ్యం విశేషాలను తెలుసుకోవచ్చు. ప్రకృతి ఒడిలో సేదతీరాలనుకునే వారికి ఈ హట్లు ఒక వరంగా చెప్పవచ్చు. అందుబాటు ధరలలోనే అద్దెలు.. అటవీశాఖ ఏర్పాటు చేసిన ఈ హట్లలో ఒక రోజు బస చేసేందకు రూ.1500 చెల్లించాల్సి ఉంటుంది. ఫారెస్ట్ కాంప్లెక్స్లో ఉన్న అటవీ శాఖ అధికారులను సంప్రదిస్తే ఈ రూములను కేటాయిస్తారు. పిల్లా, పాపలు, కుటుంబ సభ్యులతో అధిక సంఖ్యలో వచ్చే పర్యాటకుల సౌకర్యార్ధం ఒకప్పటి ఫారెస్ట్ బంగ్లాను వీఐపీ రూముగా సాధారణ పర్యాటకులకు సైతం అద్దెకు ఇవ్వనున్నారు. ఈ బంగ్లాకు రోజుకు రూ.3,000 చార్జి చేస్తారు. కోరంగి మడ అటవీ ప్రాంతాన్ని సందర్శించి ఒకరోజు ప్రకృతి ఒడిలో సేదతీరడం మరపురాని అనుభూతినిస్తుందని చెపుతున్నారు. కోరంగిలో సర్వాంగ సుందరంగా ఏర్పాటు చేసిన పర్యాటక హట్లు కోరంగి ఫారెస్ట్ కాంప్లెక్స్ హట్లలో ఏసీ, టీవీ తదితర సౌకర్యాలు ఆన్లైన్లో సైతం బుకింగ్ కోరంగి ఫారెస్ట్ కాంప్లెక్స్ ప్రాంగణంలో పర్యాటకుల సౌకర్యార్ధం ఏర్పాటు చేసిన హట్లను ఆన్లైన్లో కూడా బుక్ చేసుకునే సౌకర్యాన్ని అటవీశాఖ కల్పించింది. నేరుగా వచ్చిన పర్యాటకులకు తమ సిబ్బంది ద్వారా గదులను కేటాయిస్తున్నాం. అలాగే ఏపీ టూరిజం వెబ్సైట్ ద్వారా కూడా ఆన్లైన్లో బుక్ చేసుకునే వీలు కల్పించాం. జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రాలను సందర్శించి అక్కడ బస చేయాలనుకునే వారికి ఇదొక చక్కటి అవకాశం. ఇతర వివరాల కోసం 89859 52875 నెంబరులో సంప్రదించగలరు. – ఎస్ఎస్ఆర్ వరప్రసాద్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, కోరంగి అభయారణ్యం -
పోలీసుల అదుపులో పాత నేరస్తుడు
కాకినాడ క్రైం: స్థానిక గంజాం వారి వీధిలో ఉన్న అన్నపూర్ణ మార్కెటింగ్ దుకాణంలో రూ.19 లక్షల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. క్రైం సీఐ కృష్ణ, కాకినాడ వన్ టౌన్ సీఐ నాగదుర్గారావు బృందాలు నిందితుడిని పట్టుకున్నాయి. సంబంధిత వివరాలను ఏఎస్పీ దేవరాజ్ మనీష్ పాటిల్ బుధవారం నగరంలోని డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు, కాకినాడ సూర్యనారాయణపురానికి చెందిన పాత నేరస్తుడు కాకర్ల లోవరాజుపై 19 కేసులు ఉన్నాయి. పోలీసు రికార్డుల్లో ఉండడంతో పట్టుబడతానన్న భయంతో తన బంధువైన నగరానికి చెందిన 14 ఏళ్ల బాలుడిని చేరదీసి దొంగతనాలు చేయడం, గంజాయి విక్రయించడం నేర్పాడు. ఈ నేపథ్యంలో చేసిన దొంగతనం దర్యాప్తులో భాగంగా సీసీ ఫుటేజీలు, సాంకేతికత ఉపయోగించి బుధవారం బుడంపేటలో నేరస్తులను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. వారి నుంచి రూ.19 లక్షల నగదుతో పాటు రూ.55 వేల విలువైన 22 కిలోల గంజాయిని పట్టుకున్నామని అన్నారు. కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన ఏఎస్పీ పాటిల్, ఎస్బీ డీఎస్పీ కేవీవీ సత్యనాయణ, సీఐలు కృష్ణ, నాగదుర్గారావు, ఎస్ఐలు వినయ్ ప్రతాప్, స్వామినాయుడు ఎస్పి బిందుమాధవ్ అభినందించారు. అన్నపూర్ణ మార్కెటింగ్ దుకాణంలో చోరీ అతడి పనే 14 ఏళ్ల బాలుడితో కలిపి చోరీలు రూ.19 లక్షల నగదు.. 55 కిలోల గంజాయి స్వాధీనం -
విగ్రహం ఏర్పాటుతో ఉద్రిక్తత
రావులపాలెం: స్థానిక ఎంకేఆర్ సెంటర్లో శ్రీకృష్ణదేవరాయల విగ్రహం వివాదం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకునే వరకు దారితీసింది. వివరాల్లోకి వెళితే టీడీపీ నాయకుడు ఆకుల రామకృష్ణ ఆధ్వర్యంలో ఆ సామాజిక వర్గ నాయకులు స్థానిక ఎంకేఆర్ కల్యాణ మండపం సెంటర్లో మంగళవారం రాత్రి ఇటుకలతో దిమ్మ నిర్మించి శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం పెటేందుకు యత్నించారు. దీనిపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ జిల్లా ఎస్పీకి 100 ద్వారా ఫోన్ చేసి వివరించారు. ఆయన ఆదేశాలతో పోలీసులు ఆ ప్రాంతాన్ని తదుపరి నిర్మాణ పనులు నిలిపివేసి పికెట్ ఏర్పాటు చేశారు. అయినప్పటికీ బుధవారం ఉదయం రామకృష్ణ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ దేవరాయల ఫొటో పెట్టి దండ వేశారు. సాయంత్రం స్థానికులు ఈ విషయాన్ని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డికి వివరించగా ఆయన వచ్చి ఏ విగ్రహాలు పెట్టకూడదని పంచాయతీ తీర్మానించాక ఆ ప్రాంతంలో విగ్రహం పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. గతంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం పెట్టాలనే ప్రతిపాదన రాగా స్థానికులు మారుతీ నగర్గా నామకరణంచేసి ఆంజనేయస్వామి విగ్రహం పెట్టాలని కోరారన్నారు. ఆ మేరకు ఆంజనేయస్వామి బొమ్మను, అంబేడ్కర్ చిత్రపటాన్ని తీసుకుని వెళ్లి వాటిని కూడా పెట్టాలని జగ్గిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ గందరగోళంలో కొందరు శ్రీకృష్ణ దేవరాయలు బొమ్మను దిమ్మపై పెట్టేశారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలు పెరగకుండా పోలీసులు జగ్గిరెడ్డిని పోలీసు స్టేషన్కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ శ్రేణులు రావులపాలెం పోలీస్ స్టేషన్కు చేరుకుని జగ్గిరెడ్డికి మద్దతుగా నినాదాలు చేశారు. ఈలోగా డీఎస్పీ సుంకర మురళీమోహన్ అక్కడకు చేరుకుని జగ్గిరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులతో చర్చించి ఆ ప్రాంతం తమ అధీనంలో ఉందని తెలిపారు. అయినప్పటికీ చిత్రపటాన్ని, ఇప్పుడు ఏకంగా విగ్రహాన్నీ పెట్టారంటే ఇదంతా మీ మద్దతుతోనే జరిగిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. చివరకు పోలీసులు విగ్రహానికి ముసుగు వేశామని, సంక్రాంతి పండగ వరకు అలానే ఉంచుతామని, ఆ తరువాత కోర్టు నిర్ణయం మేరకు నిర్ణయం తీసుకోవచ్చని సర్దిచెప్పారు. చర్చల్లో మాజీ ఎంపీ చింతా అనూరాధ, జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్, మాజీ ఎమ్మెల్యేలు పొన్నాడ వెంకటసతీష్, పాముల రాజేశ్వరి, కోర్డినేటర్లు పినిపే శ్రీకాంత్, గన్నవరపు శ్రీనివాసరావు, నేతలు జున్నూరి బాబి, గొల్లపల్లి డేవిడ్రాజు, కర్రి పాపారాయుడు, కర్రి నాగిరెడ్డి, ముసునూరి వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీ సభ్యుడు కుడుపూడి శ్రీనివాస్, తహసీల్దార్ ముక్తేశ్వరరావు, ఎంపీడీఓ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పోలీసులే దగ్గరుండి విగ్రహం పెట్టించారని ధ్వజం పోలీస్ స్టేషన్ను ముట్టడించిన పార్టీ శ్రేణులు -
బుచ్చయ్య వ్యాఖ్యలు హాస్యాస్పదం
● పొట్టేళ్ల నరికివేత మొదలైంది చంద్రబాబు ప్రభుత్వంలోనే.. ● విలేకరులతో మాజీ మంత్రి వేణు రాజమహేంద్రవరం రూరల్: సోషల్ మీడియా, ఏఐను అడ్డుపెట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ జనసేన పార్టీకి చెందిన దేవరాజ్ ఆయన వదినను తోస్తే దానిని వైఎస్సార్ సీపీ నాయకుడు చేశాడంటూ హోంమంత్రి అనిత తప్పుడు ప్రచారం చేశారన్నారు. మరుసటిరోజు స్వయాన అతని అక్క తన తమ్ముడు దేవరాజ్ జనసేన పార్టీ కార్యకర్త అని, చేతిపై పవన్ కల్యాణ్ టాటూ ఉంటుందని తెలిపిందన్నారు. అలాగే వైఎస్సార్ సీపీకి చెందిన రవిచంద్రారెడ్డి బీజేపీలో చేరితే అతడి మూడేళ్ల క్రితం కేక్ కటింగ్ వీడియోను చూపించి హోంమంత్రి తప్పుడు ప్రచారం చేశారన్నారు. పొట్టేళ్ల నరికివేత మొదలైంది చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చినప్పుడేనన్నారు. 2024 జూన్ ఏడున బాలకృష్ణ చిత్రపటానికి 25 పొట్టేళ్ల తలకాయలను దండగా వేశారన్నారు. అలాగే చంద్రబాబు, పవన్ కల్యాణ్ చిత్రపటాలకు గొర్రె, పొట్టేలును నరికి రక్తాభిషేకం చేసిన వీడియోలను సైతం చెల్లుబోయిన వేణు చూపించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజున గొర్రెపోతును నరికారని చట్ట ప్రకారం కొందరిని అరెస్టు చేశారన్నారు. కానీ పోలీసులు చట్టాన్ని చేతిలోకి తీసుకుని వారిని కొట్టి హోంమంత్రికి వీడియో చూపించడంతో పాటు రోడ్డుపై నడిపించడం జరిగిందన్నారు. చివరకు వెహికల్స్ లేకపోవడంతో నడిపించాల్సి వచ్చిందని డీజీపీతో చెప్పించారన్నారు. మేము కానీ తలుచుకుంటే రోడ్డుమీద తిరగగలరా అంటూ బుచ్చయ్య వ్యాఖ్యానించడం దారుణమన్నారు. చెలరేగిపోతున్న మాఫియా నియోజకవర్గంలో మట్టి, ఇసుక, మద్యం, రేషన్ బియ్యం మాఫియా విచ్చలవిడిగా చెలరేగిపోతోందన్నారు. ఉచిత ఇసుక ఎక్కడా లభించడం లేదన్నారు. ఏ ఇసుక లారీని అడిగిన బుచ్చయ్య తాలూకా అంటూ సమాధానం ఇస్తున్నారన్నారు. అలాగే మధ్యం ధరలు అధికంగా అమ్మడంతో బెల్టుషాపులు విచ్చలవిడిగా పెరిగిపోయాయన్నారు. గంజాయిని అరికట్టామంటూ చెబుతున్నారని, కానీ విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నాయన్నారు. దీని వల్ల సమాజ వ్యతిరేక కార్యకలాపాలు పెరిగిపోయాయన్నారు. వైఎస్ జగన్ను తిడితే లోకేష్ దృష్టిలో పడి ఉన్నతమైన అవకాశం వస్తుందని గోరంట్ల ఆశపడుతున్నారన్నారు. యువత నిరుద్యోగభృతి, మహిళలు ఆడబిడ్డ నిధి, రైతులు పంటకు గిట్టుబాటు ధర కోసం ఎదురుచూస్తున్నారన్నారు. -
తగ్గిన న్యూ ఇయర్ జోష్
సాక్షి ప్రతినిధి, కాకినాడ: 2025కు వీడ్కోలు పలుకుతూ 2026కు స్వాగతం పలుకుతూ నూతన సంవత్సర వేడుకలు ఒక మోస్తరుగా సాగాయి. నగదు మారకం తగ్గి జనంలో కొనుగోలు శక్తి పడిపోవడంతో నూతన సంవత్సర వేడుకలలో జోష్ తగ్గింది. కొత్త సంవత్సరంతో పాటు సంక్రాంతికి రెండు వారాలు మాత్రమే మిగిలి ఉండటంతో వస్త్ర వ్యాపారంలో కొంతలో కొంత ఊపు కనిపించింది. జిల్లా కేంద్రం కాకినాడ సిటీ, కాకినాడ రూరల్ సహా పిఠాపురం, పెద్దాపురం, సామర్లకోట, తుని పట్టణాలు, మండలాల్లో డిసెంబరు 31 బుధవారం రాత్రి మందుబాబులు అప్పులు చేసి మరీ మద్యం మత్తులో ఊగిపోయారు. మందు, ముక్క లేకుండా నూతన సంవత్సర వేడుకలు ఏమిటంటూ మద్యం దుకాణాల వద్ద ఎగబడ్డారు. స్వీట్ షాపులు, న్యూ ఇయన్ గ్రీటింగ్స్ దుకాణాలలో అమ్మకాలు ఒక మోస్తరుగానే జరిగాయి. ఎక్కడా లేని హడావుడి, హంగామా మద్యం దుకాణాల వద్ద స్పష్టంగా కనిపించింది. లిక్కర్ షాపుల నిర్వాహకులు మూడు రోజులు ముందుగానే ఇండెంట్లు పెట్టుకుని మద్యం నిల్వ చేసుకున్నారు. జిల్లాలో కాకినాడ నగరం, కాకినాడ రూరల్, తుని, పిఠాపురం నియోజకవర్గాల్లో లిక్కర్ షాపుల్లో మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా జరిగాయి. పొగమంచును సైతం మందుబాబులు లెక్క చేయలేదు. బుధవారం సాయంత్రం ఐదు గంటల నుంచే మద్యం దుకాణాల వద్ద హడావుడి మొదలైంది. మందుబాబుల హంగామా అర్ధరాత్రి 12 గంటల నుంచి ఒంటి గంట వరకు మద్యం దుకాణాల వద్ద కనిపించింది. నూతన సంవత్సర వేడుకల్లో రోడ్లపై ఇష్టమొచ్చినట్టు బైక్ రేస్లు చేస్తే తాటతీస్తామంటూ ఎస్పీ బిందుమాధవ్ హెచ్చరించారు. అయినా యువకులు అర్ధరాత్రి సమయంలో బైక్లపై హల్చల్ చేశారు. పీకల దాకా మందు తాగి యువకులు మెయిన్రోడ్డు, టెంపుల్ స్ట్రీట్ తదితర రోడ్లపై బైక్ రేస్లతో హంగామా చేశారు. ‘మూడు బ్రాందీ బాటిళ్లు, ఆరు బీరు బాటిళ్లు’ అన్న చందంగా మద్యం వ్యాపారం సాగింది. జిల్లావ్యాప్తంగా మద్యం దుకాణాల వద్ద అర్ధరాత్రి వరకు మందుబాబులు బారులు తీరి కనిపించారు. మద్యం షాపుల వద్ద కోలాహలం కాకినాడ నగరం, కాకినాడ రూరల్లో కొండయ్యపాలెం ఫ్లై ఓవర్ జంక్షన్, టీటీడీ కల్యాణ మండపం, సర్పవరం, వలసపాకలు, ఏటిమొగ తదితర ప్రాంతాల్లో బ్రాందీషాపులు కోలాహలంగా కనిపించాయి. జిల్లాలో బ్రాందీ షాపుల నిర్వాహకులు సామర్లకోట డిస్టిలరీ నుంచి మూడు రోజులు ముందు నుంచే దుకాణాలకు బ్రాందీ, బీర్లు తరలించారు. గడచిన మూడు రోజులుగా డిస్టిలరీ నుంచి జరిగిన లావాదేవీలు గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. కల్లుగీత కార్మికులకు కేటాయించిన దుకాణాలతో కలిపి జిల్లావ్యాప్తంగా ప్రభుత్వం అధికారికంగా కేటాయించిన మద్యం దుకాణాలు 170 వరకు ఉన్నాయి. జిల్లాలో అత్యధికంగా 37 దుకాణాలు కాకినాడ నగరంలోనే ఉన్నాయి. కాకినాడ సిటీతో కలసి ఉన్న కాకినాడ రూరల్ నియోజకవర్గం పరిధిలో 12 మద్యం దుకాణాలు నడుస్తున్నాయి. వాస్తవానికి రోజు వారీ రూ.3 లక్షలకు తగ్గకుండా కౌంటర్ సేల్ ఉంటేనే దుకాణాలు లాభదాయకంగా ఉంటాయి. సాధారణ రోజు ల్లో ఈ బెంచ్ మార్క్ దాటే దుకాణాలు జిల్లాలో 20 నుంచి 30 షాపులు మాత్రమే ఉంటాయని చెబుతున్నా రు. మిగిలిన షాపుల్లో డైలీ కౌంటర్ సేల్ రూ.2లక్షలు లోపేనంటున్నారు. డిసెంబర్ 31 నూతన సంవత్సర వేడుకల పేరుతో మద్యం ఏరులై పారింది. మద్యం దుకాణాల వద్ద సాయంత్రం నుంచే సందడి వాతావరణం మొదలై రాత్రి 9 గంటలకు ఊపందుకుని అమ్మకాలు పెరిగాయి. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో షాపులలో బాటిల్పై రూ.10 పెంచి అమ్మకాలు చేశారని బ్రాందీ షాపుల వద్ద మందుబాబులు కిక్కెక ్కిన తరువాత శాపనార్థాలు పెట్టడం కనిపించింది. కాగా, నూతన సంవత్సర వేడుకల కోసం జిల్లా కేంద్రం కాకినాడ సహా ఎక్కడబడితే అక్కడ ఇన్స్టెంట్ బిర్యానీ సెంటర్లు పుట్టుకొచ్చాయి. రోడ్లపక్కన కాంబో ప్యాక్ అంటూ ప్రత్యేక ఆఫర్లతో కౌంటర్లు పెట్టి వివిధ రకాల బిర్యానీలు విక్రయించారు. జనంలో కొనుగోలు శక్తి పడిపోవడమే కారణం తగ్గిన నగదు మారకం అయినా మద్యం అమ్మకాలదే పైచేయి! మూడు రోజుల ముందే నిల్వలు అప్పోసొప్పో చేసి మందుబాబుల జల్సా మూడు రోజులుగా జిల్లాలో అమ్మకాలు ఇలా (కేస్లలో).. తేదీ ఐఎంఎల్ బీర్లు రాబడి (రూ.కోట్లలో) 29–12–25 8,607 3,392 6.96 30–12–25 8,213 3,874 6.91 31–12–25 7,041 3545 6.13 -
రత్నగిరి.. వివాదాలే సరి..
● అన్నవరం దేవస్థానానికి చేదు జ్ఞాపకాలు ● కలిసిరాని 2025 ● పెరగని ఆదాయం, కానరాని అభివృద్ధి ● పాత ఈఓ వివాదాస్పద నిర్ణయాలుఅన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని వీర వేంకట సత్యనారాయణ స్వామి దేవస్థానానికి 2025 పెద్దగా కలిసి రాలేదు. ఏడాది ప్రారంభం నుంచి చివరి వరకు ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచింది. ఆదాయంలో కానీ, నిర్మాణాలలో కానీ పెద్దగా పురోగతి లేకుండానే ఏడాది జరిగిపోయింది. దీనికి తోడు రాజకీయ జోక్యం పెరిగిపోయింది. ముఖ్యంగా పాత ఈఓ సుబ్బారావు వైఖరిపై అనేక విమర్శలు వచ్చాయి. ఆయన 2024 డిసెంబర్ 14న అన్నవరం దేవస్థానం ఈఓగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం దేవస్థానంలో ఆయన కుటుంబ సభ్యుల జోక్యం పెరిగింది. ప్రొటోకాల్తో సంబంధం లేకుండా సినిమా, టీవీ, జబర్దస్ నటులతో పాటు, కూటమి ప్రభుత్వంలోని ఎమ్మెల్యేల బంధువులకూ బ్రహ్మరథం పట్టడం, పాలనలో అనుభవ లేమి దేవస్థానాన్ని వివాదాల పాలు చేశాయి. భక్తులకు కొంచెం ఊరట 2025లో దేవస్థానంలో పూర్తి చేసిన ఏకై క నిర్మాణం రూ.కోటితో చేపట్టిన రెండో మెట్లదారి ఒకటే అని చెప్పవచ్చు. మిగిలిన పనులన్నీ భక్తుల రద్దీకి అనుగుణంగా చేసిన ఏర్పాట్లే. దాదాపు పదేళ్లుగా ఇదిగో.. అదిగో అంటూ సాగిన కేంద్ర ‘ప్రసాద్ ’ స్కీం నిర్మాణాలకు ఈ ఏడాది టెండర్లు ఖరారయ్యాయి. సుమారు రూ.20 కోట్ల కేంద్ర నిధులతో అన్నదాన భవనం, భక్తులు వేచి ఉండే భవనం, టాయిలెట్ల బ్లాకుల నిర్మాణాలు జరుగుతున్నాయి. విశాఖపట్నానికి చెందిన లారస్ కంపెనీ 2023లో వాగ్దానం చేసిన విశ్రాంతి షెడ్డును.. రెండేళ్ల తరువాత ఈ ఏడాది నిర్మించడం భక్తులకు ఊరట నిచ్చే విషయం. ఆదాయంలోనూ వెనుకంజ శిథిలావస్థకు చేరిన సీతారామ సత్రాన్ని 2024లోనే కూల్చివేసి నూతన సత్రం నిర్మించాల్సి ఉంది. కానీ దాన్ని కూల్చివేయాలా, వద్దా అనే మీమాంసలోనే 2025 ఏడాది గడిచిపోయింది. చివరకు గత నెలలోనే ఈ సత్రాన్ని కూల్చివేసి, దాని స్థానంలో కొత్త సత్రం నిర్మాణానికి అనుమతి రావడంతో ఆ పనులు మొదలయ్యాయి. ఆదాయ పరంగా దేవస్థానం పెద్డగా ముందడుగు వేయలేదు. గతేడాది రూ.135 కోట్ల ఆదాయం, రూ.134 కోట్ల వ్యయం ఉంటే, ఈసారి కూడా ఆదాయానికి సమానంగా వ్యయం పెరిగింది. సేవల్లో చివరి ర్యాంకు రాష్ట్రంలోని ఏడు ప్రముఖ పుణ్యక్షేత్రాలకు విచ్చేసిన భక్తులకు ఆయా దేవస్థానాలు అందించిన సేవలపై రాష్ట్ర ప్రభుత్వం ఐవీఆర్ఎస్ ద్వారా సర్వే నిర్వహించింది. దానిలో అన్నవరం దేవస్థానానికి గత ఫిబ్రవరిలో చివరాఖరు ఏడో ర్యాంకు వచ్చింది. దీంతో జిల్లా కలెక్టర్.. అన్నవరం దేవస్థానంలో తనిఖీలు నిర్వహించి పరిస్థితిని చక్కదిద్దారు. అనంతరం కార్తిక మాసం ఏర్పాట్లను దేవదాయశాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ స్వయంగా పర్యవేక్షించడంతో ఏ వివాదాలు లేకుండా జరిగాయి. ఆవు నెయ్యిపై.. స్వామి వారి ప్రసాదం తయారీలో ఉపయోగించే ఆవు నెయ్యిని 2024 ఆగస్టు నుంచి సహకార డైయిరీ నుంచి కొటేషన్లపై కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ ఏడాది జూన్ నుంచి టెండర్ పిలవాలని కమిషనర్ ఆదేశాలివ్వగా ఈఓ అమలు చేయలేదు. దీంతో ఈఓపై దేవదాయశాఖ కార్యదర్శి హరి జవహర్లాల్, కమిషనర్ రామచంద్రమోహన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈ నెల ఒకటిన టెండర్ ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రోక్యూర్మెంట్ ద్వారా కొనుగోలు చేస్తున్నారు. సంగం డైయిరీ కేజీ రూ.639.90కు ఆవు నెయ్యి సరఫరా చేయడానికి లోయెస్ట్ టెండర్ కోట్ చేసి దక్కించుకుంది. ప్రజాప్రతినిధుల జోక్యం అన్నవరం దేవస్థానాన్ని ఏడాది కాలంగా ప్రజాప్రతినిధుల చేతుల్లో పెట్టారన్న విమర్శలు బలంగా వినిపించాయి. దేవస్థానంలో ఉన్న చిన్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను సైతం ప్రజాప్రతినిధులకు చెప్పడం, వారి సూచించిన వారినే నియమించడం జరిగింది. వివాదాస్పదం ఈఓ సుబ్బారావు ఇక్కడ నుంచి బదిలీ అయ్యాక కూడా ఆయన ఇచ్చిన ఉత్తర్వులు వివాదస్పదమయ్యాయి. గో ఆధారిత ఉత్పత్తులు, స్వామివారి పూజలు, వ్రతాలలో వాడిన పత్రి పూలతో చేసినవి అంటూ ఫినాయిల్, కాళ్ల పగుళ్ల నివారణ ఆయిల్ అమ్మకాలు చేస్తుండడం దుమారం రేపింది. దీనిపై ‘సాక్షి’లో కథనం ప్రచురితమవడంతో వాటి విక్రయాలను దేవస్థానం నిలిపివేసింది. అలాగే పాలకొల్లులో నిర్వహించిన సత్యదేవుని వ్రతాలలో కానుకలు డిమాండ్ చేశారనే ఆరోపణలపై ఆరుగురు పురోహితులను సస్పెండ్ చేయడం సంచలనం రేపింది. ఈఓగా త్రినాథరావు దేవస్థానం ఈఓ (ఫుల్ అడిషనల్ చార్జి)గా ఈ నెల పదో తేదీన రాజమహేంద్రవరం ఆర్జేసీ వి.త్రినాథరావు బాధ్యతలు స్వీకరించారు. ఆయన దేవస్థానంలో పాలనను గాడిలో పెట్టడంతో పాటు సీతారామసత్రం నిర్మాణం ప్రారంభించడం, మెట్లదారి పెండింగ్ పనులు పూర్తి చేసి దానిని భక్తులకు అందుబాటులోకి తేవడం, ఇంకా దాతల సహకారంతో సత్యగిరిపై భక్తులకు ఉచితంగా వసతి ఇచ్చేందుకు డార్మెట్రీ నిర్మించడం తదితర పనులు చేపట్టాల్సి ఉంది. 2027 పుష్కరాల కోసం ఇప్పటి నుంచి ప్రణాళిక రూపొందించి ఆ మేరకు పనిచేయాలి.పాలనా వైఫల్యాలు గత ఈఓ పాలనా వైఫల్యాలపై ఈ ఏడాది ‘సాక్షి’లో పలు కథనాలు ప్రచురితమయ్యాయి. ముఖ్యంగా దేవస్థానంలో నీటి సమస్య పరిష్కారానికి గాను వసతి సత్రాలలో ఏసీ గదులు అద్దెకు ఇవ్వొద్దంటూ మార్చిలో ఈఓ ఇచ్చిన ఆదేశాలు తీవ్ర దుమారం రేపాయి. అలాగే ఈఓ కుమారుడు దేవస్థానంలో షాడో ఈఓగా వ్యవహరించేవారు. దానిపై వార్త రావడంపై సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. దేవస్థానం సిబ్బందిని ఈఓ వేధిస్తున్నారన్న ఆరోపణలపై పలువురు అధికారులు సెలవు పెట్టడం, కొందరు వలంటరీ రిటైర్మెంట్కు దరఖాస్తు చేసుకోవడం సంచలనం రేకెత్తించింది. దీనిపై కూడా ‘సాక్షి’లో వచ్చిన కథనంపై అధికారులు స్పందించారు. దేవస్థానంలో పారిశుధ్య సిబ్బందికి ఆరు నెలలుగా జీతాలు ఇవ్వలేదు. దీనిపై కూడా వార్త రావడంతో ఆ సమస్య పరిష్కారమైంది. -
‘యుద్ధం.. కుక్కల కొట్లాట వంటిది’
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): యుద్ధం అంటే మాంసం కోసం కుక్కల కొట్లాట వంటిదని కృష్ణుడికి ధర్మరాజు విన్నవించుకుంటాడని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నా రు. హిందూ సమాజంలో చేస్తున్న వ్యాస భారత ప్రవచనంలో భాగంగా ఆయన మంగళవారం ఉద్యోగ పర్వంలోని పలు అంశాలను వివరించారు. ‘‘తమ తరఫున ద్యూత కార్యం నిర్వహించాల్సిందిగా సోదరులు, భార్యతో కలసి కృష్ణ పరమాత్మకు ధర్మరాజు విన్నవించుకుంటాడు. అయితే, రాజ్యం కోల్పోయి సంపాదించుకునే శాంతి మరణంతో సమానమని అంటాడు. కనీసం ఐదు ఊళ్లు ఇవ్వా లని మేం అడిగాం. కానీ, మేం యుద్ధానికి భయపడ్డా మని దుర్యోధనుడు భావించి, దానికి కూడా సిద్ధపడటం లేదు. క్షత్రియ వంశం నాశనం కాకూడదని భావించి, మేము ఐదు ఊళ్లు ఇవ్వాలని అడుగుతున్నాం. కృష్ణా, మమ్మల్ని ఆపదల నుంచి గట్టెక్కించడానికి నీవు తప్ప మరొకరు లేరు’’ అని ధర్మరాజు అంటాడని చెప్పారు. ధర్మజుడి మాటల్లో ఆయన శరణాగతి కనపడుతోందని, ఇలా ప్రతివారూ భగవంతుడిని ప్రార్థించాలని అన్నారు. ఇక కర్ణ దుర్యోధనులది ఆదర్శ మైత్రి కాదని, అవసరార్థం మైత్రి అని వ్యాఖ్యానించారు. ‘‘అర్జునుడిని ఎదుర్కోవడానికి తగిన వాడని భావించే కర్ణుడిని దుర్యోధనుడు చేరదీశాడు. అర్జునుడిని నిగ్రహించడానికి రాజాశ్రయం కావాలనే తలంపుతో దుర్యోధనుడి అండ చేరాడు కర్ణుడు. సినిమాలో చూపినట్లు వీరు ఆదర్శ స్నేహితులు కారు’’ అని సామవేదం వివరించారు. కులవివక్ష లేని నాటి కాలాన్ని కుల విద్వేషంతో నేడు కొందరు విమర్శిస్తున్నారని, సంజయుడు, విదురుడు ఏ కులానికి చెందిన వారైనా, వారిని ‘రాజర్షి’ అని, మహాప్రాజ్ఞ అని ధృతరాష్ట్రుడు సంబోధించడాన్ని గమనించాలని చెప్పారు. కృష్ణుడు ద్యూత కార్య నిర్వహణకు వస్తున్నాడన్న వార్త సంజయుని ద్వారా విన్న ధృతరాష్ట్రుడు ‘కళ్లున్న వారు ఎంత అదష్టవంతులు’ అని ఆవేదన చెందుతాడని, పరమాత్మ మీద దృష్టి లేని వారందరూ అంధులేనని సామవేదం అన్నారు. సంజయునికి ధృతరాష్ట్రుడు కృష్ణ తత్త్వాన్ని వివరిస్తాడన్నారు. ‘ధృతరాష్ట్రునిలో రెండు ప్రవృత్తులున్నాయి. అంతఃకరణంలో ఉన్న జీవుడు ఒకరు, ఇంద్రియాలను అంటిపెట్టుకున్న జీవుడు మరొకరు. ఇటువంటి స్వభావం అనేక మందిలో ఉంటుంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. జాతీయ స్థాయి హాకీకి ఎంపికచాగల్లు: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్జీఎఫ్ఐ) అండర్–19 జాతీయ స్థాయి హాకీ పోటీలకు చాగ ల్లు గ్రామానికి చెందిన ఉయ్యూరు శాంతి ఎంపికైంది. స్థానిక వ్యాయామోపాధ్యాయిని జె.విజయలక్ష్మి మంగళవారం ఒక ప్రకటనలో ఈ విష యం తెలిపారు. గత నెల 19 నుంచి 22వ తేదీ వరకూ అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో జరిగిన ఎస్జీఎఫ్ఐ అండర్–19 రాష్ట్ర స్థాయి హాకీ పోటీల్లో శాంతి అత్యద్భుత ప్రతిభ చూపింది. తద్వారా జనవరి 2 నుంచి 6వ తేదీ వరకూ గ్వాలియర్లో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ంది. -
రహదారులు రక్తసిక్తం
కాకినాడ క్రైం: జిల్లా పోలీసు శాఖ వార్షిక నేర నివేదిక విడుదల చేసింది. కాకినాడలోని జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ జి.బిందుమాధవ్ ఈ వివరాలు వెల్లడించారు. దీని ప్రకారం ఈ ఏడాది జిల్లాలోని రహదారులు రక్తసిక్తమయ్యాయి. వివిధ రోడ్డు ప్రమాదాల్లో ఏకంగా 300 మంది ప్రాణాలు కోల్పోయారు. రహదారి ప్రమాదాల్లో జనవరి నుంచి జూన్ వరకూ 170, జూలై నుంచి డిసెంబర్ వరకూ 130 మరణాలు చోటు చేసుకున్నాయి. గత ఏడాది 859 రోడ్డు ప్రమాదాలు జరగగా ఈ ఏడాది ఆ సంఖ్య 787కు తగ్గిందని, 8.38 శాతం మేర రోడ్డు ప్రమాదాలు తగ్గాయని ఎస్పీ తెలిపారు. రహదారులపై జూలై నుంచి ఏర్పాటు చేసిన అధునాతన స్మార్ట్ పార్కింగ్ అలెర్ట్ సిస్టం ద్వారా రెండో అర్ధ సంవత్సరంలో రోడ్డు ప్రమాదాలను నియంత్రించగలిగామని చెప్పారు. మెడలో గొలుసులు జాగ్రత్త జిల్లాలో చైన్ స్నాచింగ్లు గణనీయంగా పెరిగాయి. గత ఏడాది 31 కేసులు నమోదవగా, ఈ ఏడాది ఆ సంఖ్య ఏకంగా 57కు పెరిగింది. ఈ నేరాలు ఏకంగా 83.87 శాతం మేర పెరిగి బెంబేలెత్తిస్తున్నాయి. ద్విచక్ర వాహనాల చోరీలు కూడా గణనీయంగా పెరిగాయి. గత ఏడాది 301 వాహనాలు చోరీ కాగా, ఈ ఏడాది ఆ సంఖ్య 480 వాహనాలను దొంగలు అపహరించారు. ఏకంగా 59.47 శాతం మేర బైక్ దొంగతనాలు పెరిగాయి. రాత్రయితే ఇల్లు గుల్లే.. జిల్లాలో రాత్రి వేళ దొంగతనాలు కూడా విపరీతంగా పెరిగాయి. ఈ తరహా చోరీలు గత ఏడాది 110 నమోదవగా.. ఈ ఏడాది 151 కేసులు వచ్చాయి. వీటి పెరుగుదల 37.27 శాతంగా నమోదైంది. సమయంతో నిమిత్తం లేకుండా ఆస్తులు కొల్లగొట్టి దోచుకెళుతున్న కేసులు గత ఏడాది 738 నమోదైతే ఈ ఏడాది ఏకంగా వెయ్యికి (+35.50 శాతం) పెరిగాయి. తగ్గిన అత్యాచారాలు మహిళలపై అత్యాచారాలు, అత్యాచార యత్నాలు ఈ ఏడాది తగ్గినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత ఏడాది 19 అత్యాచార కేసులు నమోదైతే ఈ ఏడాది ఆ సంఖ్య 10కి పరిమితమై, 47.37 శాతం మేర తగ్గాయి. అలాగే, మహిళల మరణాలకు సైతం కారణమవుతున్న వరకట్న వేధింపు కేసులు గత ఏడాది 383 న మోదవగా.. ఈ ఏడాది 336కు తగ్గాయి. వీటి తగ్గుదల 12.27 శాతం ఉందని ఎస్పీ చెప్పారు. గత ఏడాది ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు 65 రాగా, ఈ ఏడాది 46 (29.23 శాతం తగ్గుదల) నమోదయ్యాయి. హత్యలు.. మాదక ద్రవ్యాలు జిల్లాలో హత్యలు గత ఏడాది కంటే పెరిగాయి. 2024లో 28 హత్యలు జరగగా.. ఈ ఏడాది ఆ సంఖ్య 33కు (+17.86 శాతం) పెరిగింది. మరోవైపు గత ఏడాది గంజాయి కేసులు 35 నమోదవగా.. ఈ ఏడాది గంజాయి అనుబంధ మాదకద్రవ్యాల కేసులు 43 (+22.86 శాతం) నమోదయ్యాయి. ఈ ఏడాది రోడ్డు ప్రమాదాల మృతులు 300 మంది పెరిగిన చైన్ స్నాచింగ్లు, సైబర్ నేరాలు తగ్గిన వరకట్న వేధింపులు, దళితులపై నేరాలు 2025 వార్షిక నేర నివేదిక విడుదల రికవరీలు అంతంత మాత్రం చోరీ కేసులలో సొత్తు రికవరీ అంతంత మాత్రంగానే ఉంది. బంగారం 60 శాతం, వెండి 64 శా తం, నగదు 62 శాతం మేర మాత్రమే పోలీసులు రికవరీ చేయగలిగారు. వివిధ కేసులలో రూ.9.01 కోట్ల నగదు చోరీ కాగా.. రూ.5.60 కోట్లు రికవరీ చేయగలిగారు. మొత్తం మీద ఈ ఏడాది నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందని ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు. సీసీ కెమెరాల వినియోగం, నేరాల నియంత్రణకు చేపడుతున్న వివిధ కార్యక్రమాలు, ప్రత్యేక బృందాల పని తీరు, సాంకేతికత వినియోగం ఈ పురోగతికి కారణమని చెప్పారు. గత ఏడాది 7,947 నేరాలు జరగగా.. ఈ ఏడాది 171 తగ్గి (2.15 శాతం) 7,776 నమోదయ్యాయన్నారు. 5.2 కిలోల బంగారం, 92.40 కిలోల వెండి, రూ.8.52 కోట్ల నగదు, మూడు లారీలు, 21 ఆటోలు, 360 బైకులు, 1,541 సెల్ఫోన్లు రికవరీ చేసి, 813 మందిని అరెస్టు చేశామని వివరించారు. వచ్చే ఏడాది కూడా ప్రత్యేక ప్రణాళికతో నేర నియంత్రణలో సానుకూల ఫలితాలు రాబడతామని చెప్పారు. జిల్లా ప్రజలకు ఎస్పీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. -
కట్టెదుట వైకుంఠం..
● రత్నగిరిపై ఘనంగా ‘ముక్కోటి’ వేడుకలు ● ఉత్తర ద్వారం నుంచి సత్యదేవుడు, అమ్మవారి దర్శనం ● వేకువజాము నుంచే వేచి ఉన్న భక్తులు ● సాయంత్రం వరకూ రద్దీ అన్నవరం: పాల కడలిలో శేషశయ్యపై ఉత్తరాభిముఖంగా తల పెట్టి పవళించిన శ్రీమహావిష్ణువులా సత్యదేవుడు.. ఆయన పాదాలు ఒత్తుతూ శ్రీమహాలక్ష్మిగా అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారు.. సర్వాలంకార భూషితులై భక్తులకు దర్శనమిచ్చిన ముక్కోటి ఏకాదశి పర్వదినమైన మంగళవారం.. రత్నగిరి అపర వైకుంఠంలా శోభిల్లింది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని పెద్ద సంఖ్యలో భక్తులు వేకువజామున 3 గంటల నుంచే ఉత్తర ద్వార దర్శనానికి బారులు తీరారు. స్వామివారి ప్రధానాలయంలో ఉత్తర ద్వారం వద్ద సుగంధభరిత పుష్పాలంకరణతో శోభిల్లుతున్న మండపంలో స్వామి, అమ్మవార్లకు తెల్లవారుజామున 4 గంటలకు పండితులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గర్భాలయంలోని సత్యదేవుడు, అమ్మవార్ల మూలవిరాట్టుకు స్వర్ణ పుష్పార్చన, అష్టోత్తర పూజలు నిర్వహించి, పంచహారతులు, నీరాజన మంత్రపుష్పాదులు సమర్పించారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వి.త్రినాథరావు దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున 5 గంటల నుంచి భక్తులను స్వామి, అమ్మవార్ల ఉత్తర ద్వార దర్శనానికి అనుమతించారు. ఉత్తర ద్వారం వద్ద స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు సుమారు 2 గంటల సమయం పట్టింది. ఉత్తర ద్వార దర్శనానంతరం భక్తులు తూర్పు ద్వారం నుంచి ప్రధానాలయంలోకి ప్రవేశించి సత్యదేవుడు, అమ్మవార్లను, దక్షిణ ద్వారం నుంచి వెలుపలకు వచ్చి, దిగువన యంత్రాలయాన్ని దర్శించుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకూ ఉత్తర ద్వార దర్శనం కొనసాగింది. అనంతరం, భక్తులను యథావిధిగా గర్భాలయంలోకి దక్షిణ ద్వారం నుంచి సత్యదేవుని దర్శనానికి అనుమతించారు. కూరగాయలతో ప్రత్యేకంగా వండిన కదంబం ప్రసాదాన్ని స్వామి, అమ్మవార్లకు నివేదించిన అనంతరం భక్తులకు పంపిణీ చేశారు. ఉత్తర ద్వార దర్శనం నేపథ్యంలో అంతరాలయ దర్శనాన్ని రద్దు చేశారు. ఆకట్టుకున్న పుష్పాలంకరణ ముక్కోటి ఏకాదశి సందర్భంగా సత్యదేవుని ప్రధానాలయంలో చేసిన పుష్పాలంకరణ అందరినీ ఆకట్టుకుంది. స్వామివారి ఆలయానికి దారి తీసే ఉత్తరం వైపు మెట్లను రంగురంగుల విద్యుద్దీపాలు, పూలమాలలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఉత్తర ద్వారం వద్ద స్వామి, అమ్మవార్లను కొలువుదీర్చిన మండపాన్ని కూడా సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ప్రధానాలయం, అనివేటి మండపం ముందు సత్యదేవుడు, అమ్మవారి నమూనా విగ్రహాల వద్ద పుష్పాలంకరణ పలువురిని ఆకర్షించింది. ఈ రెండుచోట్లా చాలా మంది భక్తులు ఫొటోలు దిగారు. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని సత్యదేవుడు, అమ్మవార్లను ఆలయ ప్రాకారంలో వెండి రథంపై ఘనంగా ఊరేగించారు. ఉదయం 11 గంటలకు పండితుల ప్రత్యేక పూజల అనంతరం, ఈఓ త్రినాథరావు దంపతులు ఈ ఉత్సవాన్ని ప్రారంభించారు. రథం లాగేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పోటీ పడ్డారు. -
తమిళ బెల్లం.. రుచి అమోఘం
పిఠాపురం: తమిళనాడు అనగానే మనకు నోరూరించే సాంబారు గుర్తుకువస్తుంది. ఒక్కసారి తింటే మరిచిపోలేని అనుభూతి కలుగుతుంది. ఇప్పుడు దానికి పోటీగా తాటిబెల్లం వచ్చింది. ప్రస్తుతం తాటిబెల్లం సీజన్ కావడంతో ఎక్కడ చూసినా వీటి అమ్మకాలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా తమిళనాడుకు చెందిన వ్యాపారులు పిఠాపురం, గొల్లప్రోలు, కాకినాడ, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల్లో తాటి బెల్లాన్ని విక్రయిస్తున్నారు. మామూలు బెల్లం కేజీ రూ.50 వరకూ, తమిళ తాటిబెల్లాన్ని కేజీ రూ.140, మిరియాలు, అల్లం వంటివి కలిపి తయారు చేసిన దాన్ని కేజీ రూ.250 వరకు విక్రయిస్తున్నారు. కన్యాకుమారి ఏరియాలో ఈ బెల్లం తయారు చేస్తారని, అక్కడి నుంచి లారీలపై తీసుకువచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్టు ఆ ప్రాంతానికి చెందిన పరమేశన్ తెలిపాడు. -
కొత్త ఆశలతో..
● కొద్ది గంటల్లో గతించనున్న 2025 ● కొత్త సంవత్సరానికి స్వాగతం పలకనున్న జనం ● ఈ ఏడాదైనా తమ జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్ష సాక్షి ప్రతినిధి, కాకినాడ: మరికొద్ది గంటల్లో 2025 కాలగర్భంలో కలసిపోనుంది. సరికొత్త సంవత్సరం 2026కు స్వాగతం పలికేందుకు ప్రజలు ఆనందోత్సాహాలతో ఎదురు చూస్తున్నారు. గత కాలం పంచిన చేదు కషాయాన్ని బలవంతంగా దిగమింగుకుంటూనే.. అది పంచిన విషాదాన్ని జ్ఞాపకాల పొరల్లో దాచుకుంటూనే.. రానున్న కాలమైనా తమ ఆశలను, ఆకాంక్షలను నెరవేర్చేదిగా ఉండాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా జనజీవితంపై నిత్యం ప్రభావం చూపే ప్రభుత్వ పాలన ఇకనైనా ప్రజారంజకంగా మారాలని కోరుకుంటున్నారు. గద్దెనెక్కి ఏడాదిన్నరయినా అరకొర పథకాలకే పరిమితమై.. తమ సంక్షేమాన్ని గాలికొదిలేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు మనసు మారాలని, ఎన్నికల వేళ తమకిచ్చిన మాటలు ఈ ఏడాదైనా పూర్తి స్థాయిలో నిజం చేయాలని వివిధ వర్గాల ప్రజలు ఎదురు చూస్తున్నారు. వ్యవసాయ ఆధారమైన జిల్లాలో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మాదిరిగానే ఉచిత పంటల బీమా అమలు చేయాలని 2 లక్షల మందికి పైగా రైతులు కోరుకుంటున్నారు. మోంథా తుపానుతో 40 వేల ఎకరాల్లో పంట నష్టపోయిన అన్నదాతలకు నెలలు గడుస్తున్నా ప్రభుత్వం చిల్లిగవ్వ కూడా పరిహారం ఇవ్వలేదు. కొత్త సంవత్సరంలోనైనా తమపై కనికరం చూపాలని బాధిత రైతులు అభ్యర్థిస్తున్నారు. 50 ఏళ్లు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు నెలకు రూ.1,500 ఇస్తామని ఎన్నికల్లో చెప్పి, ఇంతవరకూ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. వచ్చే సంవత్సరమైనా ఆ మాట నిలబెట్టుకుంటారని మహిళలు ఆశ పడుతున్నారు. ప్రతి నిరుద్యోగికీ ఉద్యోగం ఇస్తామని, అలా ఇవ్వకుంటే ప్రతి నెలా రూ.3 వేల చొప్పున భృతి ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఏడాది బకాయి రూ.1,800 కోట్లయినా విడుదల చేసి తమ హృదయాలు గెలుచుకోవాలని అభిలషిస్తున్నారు. జగన్ ప్రభుత్వంలో క్రమం తప్పకుండా అమలు చేసిన సంక్షేమ పథకాలన్నీ అమలు చేసేలా ప్రభుత్వ పెద్దలకు ఆ భగవంతుడు మంచి బుద్ధి ప్రసాదించాలని, కొత్త సంవత్సరంలోనైనా తమ జీవితాల్లో వెలుగులు నింపే ఆలోచనలు కలిగించాలని ప్రార్థిస్తున్నారు. -
జనసేన నాయకుడి దాడి కేసుపై విచారణ
రాజోలు: ప్రజా సంఘాల నేతలపై దాడి, కుల దూషణకు పాల్పడిన జనసేన నాయకుడిపై కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్ మంగళవారం విచారణ చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 25న జరిగిన శివకోటి ముసలమ్మ తల్లి ఉత్సవాల్లో నృత్య ప్రదర్శన కోసం రాజమహేంద్రవరం నుంచి వచ్చిన పాలపర్తి భవ్యశ్రీ ఇక్కడ మెట్లపై నుంచి పడి మృతి చెందింది. మృతదేహాన్ని రాజోలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో భవ్యశ్రీ కుటుంబానికి మద్దతుగా రాజోలు ప్రభుత్వాస్పత్రి వద్దకు జిల్లా మానవ హక్కుల వేదిక కార్యవర్గ సభ్యుడు జనుపల్లి సత్యానందం (నాని), రాజోలు నియోజకవర్గ బహుజన సమాజ్వాది పార్టీ ఇన్చార్జి ఆకుమర్తి భూషణం వచ్చారు. అక్కడ వారిపై జనసేన నాయకుడు పినిశెట్టి వెంకటస్వామి (బుజ్జి) దాడికి పాల్పడ్డాడు. బాధితుల ఫిర్యాదు మేరకు రాజోలు పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణాధికారి అయిన కొత్తపేట డీఎస్పీ మురళీమోహన్ రాజోలు ప్రభుత్వాస్పత్రి వద్ద నేరస్థలాన్ని, ఫిర్యాదు దారుడు, కేసులో కొందరు సాక్షుల నుంచి వాంగ్మూలం నమోదు చేశారు. -
హైదరాబాదులో హత్య.. కోనసీమలో మృతదేహం
● వీడిన మహిళ అదృశ్యం మిస్టరీ ● ముగ్గురు నిందితుల అరెస్టు మామిడికుదురు: హైదరాబాద్లో హత్యకు గురైన ఓ మహిళ మృతదేహాన్ని జిల్లాలో పోలీసులు గుర్తించారు. నాచారం సీఐ కె.ధనుంజయ మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని మల్లాపూర్ బాబానగర్లో సూరెడ్డి సుజాత (65) నివాసం ఉంటోంది. డ్రైవర్గా పనిచేస్తున్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపల్లికి చెందిన ఎం.అంజిబాబు ఆమె ఇంట్లో రెండు నెలల క్రితం అద్దెకు దిగాడు. సుజాత ఒంటరిగా ఉండడం, ఆమె ఒంటిపై బంగారాన్ని చూసిన అంజిబాబుకు దుర్బుద్ధి పుట్టింది. బంగారాన్ని కాజేయాలన్న ఉద్దేశంతో ఈ నెల 19న వంటగదిలో ఉన్న సుజాతపై వెనుక నుంచి దుప్పటి కప్పి, ఊపిరి ఆడకుండా చేసి చంపేశాడు. అనంతరం పెరవలి మండలం ఖండవిల్లికి చెందిన స్నేహితుడు యువరాజు, అనకాపల్లికి చెందిన నూకల దుర్గారావు సహాయంతో ఈనెల 20వ తేదీన ఆ మృతదేహాన్ని అద్దె కారులో తీసుకువచ్చి గోదావరిలో పడేశాడు. కాగా.. సుజాత కనిపించడం లేదంటూ ఈ నెల 24న ఆమె బంధువులు ఇచ్చిన ఫిర్యాదుపై నాచారం పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమానంతో అంజిబాబును అదుపులోకి తీసుకుని విచారించగా నేరం చేసినట్లు ఒప్పుకున్నాడు. అతడి సమాచారం మేరకు పెదపట్నం గ్రామంలోని మధ్యలంకలో సుజాత మృతదేహాన్ని గుర్తించారు. బాగా పాడైపోవడంతో అక్కడే పోస్టుమార్టం నిర్వహించి శవాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
నర్సరీ రైతుల సమస్యలు పరిష్కరించాలి
కడియం: నర్సరీ రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్ కీర్తి చేకూరికి సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్లో ఆమెను అసోసియేషన్ అధ్యక్షుడు రత్నం అయ్యప్ప, పాలకవర్గ సభ్యులు కలిశారు. మొక్కలను అంతర్జాతీయంగా ఎగుమతి చేసేటప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ప్రభుత్వం నుంచి మరిన్ని ప్రోత్సాహకాలు అందిస్తే అంతర్జాతీయ ఎగుమతులకు అవకాశాలు పెరుగుతాయన్నారు. సాయిల్ లెస్ మీడియాపై కోకోపిట్ స్టబిలైజేషన్, టిష్యూకల్చర్ ల్యాబ్ వంటి తదితర అంశాలపై చర్చించారు. కాగా.. తాము వివరించిన పలు అంశాలపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారని అయ్యప్ప తెలిపారు. జాయింట్ కలెక్టర్ మేఘస్వరూప్, జిల్లా ఉద్యానశాఖ అధికారి మల్లికార్జున, కడియం ఉద్యానశాఖ అధికారి లావణ్య, అసోసియేషన్ పాలకవర్గం బోడపాటి గోపి, కొండేపూడి నాగు, తాడాల నాగేశ్వరరావు, బాబ్జీ, పిల్లా శ్రీనివాస్, బోడపాటి సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ నొడగల బుచ్చిరాజు పాల్గొన్నారు. రమ్యసుధకు జాతీయ ఉత్తమ పరిశోధన అవార్డురంగంపేట: అహ్మదాబాద్ సైన్స్ సిటీలో ఈ నెల 21న ఆల్ ఇండియా రామానుజన్ మ్యాథ్స్ క్లబ్, గుజరాత్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంయుక్తంగా నిర్వహించిన జాతీయ సదస్సులో రంగంపేట జిల్లా పరిషత్ హైస్కూల్ ఉపాధ్యాయురాలు రమ్యసుధ జాతీయ ఉత్తమ పరిశోధన ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు. జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు అయిన ఆమె అనేక పరిశోధనా వ్యాసాలు రాసి, పలు శాసీ్త్రయ ప్రాజెక్టులు తయారు చేసి, పలు ప్రదర్శనలలో ఉత్తమ బహుమతులు పొందుతున్నారు. ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్లో పదికి పైగా పరిశోధనా పత్రాలు ప్రచురితమయ్యాయి. రమ్యసుధ పరిశోధనలు మన దేశంతో పాటు జపాన్, మలేషియా, నేపాల్ వంటి దేశాల్లో ప్రదర్శింపబడి సందర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. కాగా.. రమ్యసుధను రంగంపేట హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు వి.పార్థసారథి, ఉపాధ్యాయులు వీసీ జాకబ్, వరలక్ష్మి అభినందించారు. -
సూర్యబలిజల ఐక్యత కోసం వెబ్సైట్
సామర్లకోట: రాష్ట్రంలో ఐదు సంఘాలుగా ఉన్న సూర్యబలిజలను ఒకే తాటిపైకి తీసుకు రావడానికి సూర్యబలిజ వెబ్సైట్ను ప్రారంభిస్తున్నట్లు ఆ సామాజికవర్గ ఐక్య వేదిక నాయకులు అన్నారు. ఈ మేరకు స్థానిక గణపతినగరం వాటర్ ట్యాంకుల వద్ద మంగళవారం రాష్ట్ర సూర్యబలిజ సంఘ నాయకుడు జీవీకే మోహనరావు ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఉమ్మడి గోదావరి జిల్లాల సూర్యబలిజ సంఘ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది ఏలూరి సుబ్రహ్మణ్యం.. సూర్యబలిజ వెబ్సైట్ను ప్రారంభించారు. అనంతరం ఏలూరి సుబ్రహ్మణ్యం, జీవీకే మోహనరావు, వైబ్సైట్ రూపకర్త పైడిముక్కల ఆనంద్ మాట్లాడుతూ సూర్యబలిజ కులస్తులకు చంద్రబాబు ఇచ్చిన హామీ 18 నెలలు గడిచినా అమలు చేయలేదన్నారు. ఈ వెబ్సైట్లో సూర్యబలిజ కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేయాలన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ కులస్తుల పేర్ల నమోదు ప్రక్రియ పూర్తయిన తర్వాత రెండు రాష్ట్రాల కమిటీల ఎన్నికలను ముఖ్య నాయకులు సమక్షంలో నిర్వహిస్తామన్నారు. సామాజికవర్గీయులందరూ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.రాష్ట్ర సూర్యబలిజ.కమ్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని కోరారు. సమావేశంలో జిల్లా సంఘ అధికార ప్రతినిధి కాలే వెంకటరత్నం, ప్రముఖులు యండమూరి ఈశ్వరరావు, అల్లు భాస్కరరావు, కాకరపల్లి శ్రీధర్, బి.కామేశ్వరరావు, కాలే సతీష్ ప్రసాద్, పెండ్యాల ధర్మ తదతరులు పాల్గొన్నారు -
బాబు మనసు మారాలి
రైతుల ప్రభుత్వమంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మాకు తీరని అన్యాయం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఉచిత పంటల బీమా అమలు చేశారు. ప్రీమియాన్ని నాటి ప్రభుత్వమే చెల్లించేది. ఇన్పుట్ సబ్సిడీ, పంట నష్టపరిహారం సైతం సకాలంలో అందేవి. చంద్రబాబు ప్రభుత్వం పంటల బీమా ప్రీమియం భారాన్ని మాపై మోపారు. కొత్త సంవత్సరంలోనైనా బాబు పెద్ద మనసు చేసుకుని ఉచిత పంటల బీమాను పునరుద్ధరించాలి. ప్రీమియం చెల్లించకపోవడంతో పంట నష్టపరిహారం కోల్పోతున్నాం. మోంథా తుపానుతో నష్టపోయిన పంటకు కొత్త సంవత్సరంలోనైనా పరిహారం ఇవ్వాలి. కొత్త సంవత్సరంలోనైనా బాబు మనసు మారి మాబోటి రైతులకు మేలు జరగాలని కోరుకుంటున్నాం. – మిరియాల లోవరాజు, రైతు, మర్లావ, పెద్దాపురం మండలం మా ఆశలకు ఊపిరి పోయండి ఏడాదిన్నరగా నిరుద్యోగుల ఆశలన్నీ ఆవిరైపోయాయి. ఉద్యోగం ఇస్తాను లేదంటే నిరుద్యోగ భృతి ఇస్తామన్న మాటనే చంద్రబాబు ప్రభుత్వం మరచిపోయింది. కనీసం కొత్త సంవత్సరంలోనైనా గత ఏడాది నిరుద్యోగ భృతి బకాయిలు విడుదల చేసి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ఎంతవరకూ చదువుకున్నా ఉద్యోగాలు లేకపోవడంతో నిరుద్యోగులు కూలీలుగా మారుతున్నారు. హాస్టళ్లలోని విద్యార్థులకు కనీస మెస్ చార్జీలను కూడా ప్రభుత్వం చెల్లించడం లేదు. ప్రభుత్వ ఐటీఐలో చదువుతున్న విద్యార్థులకు వారి ట్రేడ్లతో సంబంధం లేకుండా ఇంటర్న్షిప్ ఇస్తున్నారు. వారి ట్రేడ్లకు సంబంధించి మాత్రమే పరిశ్రమల్లో మాత్రమే ఇంటర్న్షిప్ ఇవ్వాలి. కొత్త సంవత్సరంలోనైనా నిరుద్యోగుల ఆశలకు చంద్రబాబు ప్రభుత్వం ఊపిరి పోయాలి. – పెంకే రవితేజ, నిరుద్యోగ జేఏసీ జిల్లా కన్వీనర్, కాకినాడ 2026లోనైనా రూ.1,500 ఇవ్వు బాబూ ఆడబిడ్డ నిధి పేరిట 18 నుంచి 59 ఏళ్ల వయసున్న ప్రతి మహిళకూ రూ.1,500 భృతి ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చి 19 నెలలైనా ఇంత వరకూ ఇవ్వలేదు. కనీసం కొత్త సంవత్సరంలోనైనా చంద్రబాబు ఈ మాట నిలబెట్టుకోవాలి. కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న మహిళల స్వయం ఉపాధి కోసం కుట్టు మెషీన్లు ఇస్తామన్న మాటను ఇంతవరకూ నెరవేర్చలేదు. ఈ ఏడాదైనా ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆయా పథకాలు అమలు చేసి, మహిళల పట్ల చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. – కమిడి మంగాదేవి, సర్పంచ్, వేములవాడ, కరప మండలం ఉద్యోగుల ఆశలు చివురించాలి నూతన సంవత్సరంలో పీఆర్సీ కమిటీ త్వరగా వేసి, ఆ నివేదిక ఆధారంగా జీతాలు పెంచాలి. ఉద్యోగులకు రావలసిన సరెండర్ లీవ్ బకాయిలు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలి. సీపీఎస్ రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీం అమలు చేయాలి. పని ప్రదేశాల్లో ఉద్యోగులకు భద్రత కల్పించాలి. ఉద్యోగులపై దాడులు చేసే వారిపై చర్యల కోసం రూపొందించిన చట్టాలు కట్టుదిట్టంగా అమలు చేయాలి. ఆస్పత్రుల్లో పని చేసే వైద్య, వైద్యేతర ఉద్యోగులపై దాడులు జరగకుండా ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకోవాలి. విశ్రాంత ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ త్వరితగతిన అందేలా చొరవ చూపాలి. – పసుపులేటి శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఏపీఎన్జీజీవో సంఘం -
హాస్టల్ విద్యార్థులకు.. సహాయం చేయండి ప్లీజ్..
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు కనీస వసతులు కల్పించేందుకు దాతలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు, పారిశ్రామికవేత్తలు, అధికారులు, ప్రజలు ధన, వస్తు రూపంలో సహాయం అందించాలని కలెక్టర్ షణ్మోహణ్ సగిలి మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. జిల్లాలోని 100 సంక్షేమ హాస్టళ్లలో దాదాపు 15 వేల మంది పేద విద్యార్థులు చదువుతున్నారన్నారు. వీరందరికీ మంచి విద్య, ఆరోగ్యం, బంగారు భవిత అందించేందుకు హాస్టళ్లలో కనీస వసతుల అభివృద్ధి చేపడుతున్నామన్నారు. దీనికి భూరి విరాళాలు అందించాలని కోరారు. నూతన సంవత్సర వేళ తనకు శుభాకాంక్షలు తెలియజేసేవారు ధన రూపంలో లేదా దోమతెరలు, ఆర్ఓ ప్లాంట్లు, లైట్లు, ఫ్యాన్లు, మోడ్రన్ లైబ్రరీ తదితర వస్తు రూపంలో కానీ సహాయం అందజేయాలని సూచించారు. నేడు హుండీల ఆదాయం లెక్కింపు అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో ఈ నెల హుండీల ఆదాయం లెక్కింపు బుధవారం నిర్వహించనున్నారు. కార్తిక మాసం అనంతరం స్వామివారి హుండీల ఆదాయాన్ని గత నెల 24న లెక్కించారు. అప్పటి నుంచి తెరవకపోవడంతో ఆలయంలోని ప్రధాన హుండీతో పాటు ఇతర హుండీలు చాలావరకూ నిండిపోవడంతో వాటికి సీల్ వేశారు. స్వామివారి నిత్య కల్యాణ మండపంలో ఉదయం 7 గంటల నుంచి లెక్కింపు జరగనుంది. దీనికి సిబ్బంది అందరూ హాజరు కావాలని అన్నవరం దేవస్థానం ఈఓ వి.త్రినాథరావు ఆదేశించారు. ఈసారి రూ.1.50 కోట్లు పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మాఘంలో కోటి తులసి పూజఅన్నవరం: వచ్చే మాఘ మాసంలో సత్యదేవుని సన్నిధిలో కోటి తులసి పూజ నిర్వహించాలని భావిస్తున్నట్లు అన్నవరం దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వి.త్రినాథరావు మంగళవారం తెలిపారు. ఈ పూజల నిర్వహణకు రెండు ముహూర్తాలు పెట్టాల్సిందిగా వైదిక కమిటీని కోరామన్నారు. పండితులతో చర్చించి ఆ రెండు ముహూర్తాల్లో దేవస్థానానికి అనుకూలమైన తేదీల్లో కోటి తులసి పూజ నిర్వహిస్తామని చెప్పారు. లోక కల్యాణార్థం, సత్యదేవుని భక్తులకు మంచి జరగాలని, తెలిసీ తెలియక చేసిన అపచారాలు తొలగిపోవాలని ఈ పూజలు తలపెట్టామని వివరించారు. 2022, 2023 సంవత్సరాల్లో అప్పటి ఈఓ త్రినాథరావు హయాంలోనే దేవస్థానంలో మహా నారాయణ యాగం, కోటి తులసి పూజ నిర్వహించారు. ఆ తర్వాత ఇటువంటి కార్యక్రమాలు జరగలేదు. దీంతో, గత రెండేళ్లలో రెండు అగ్ని ప్ర మాదాలు, ఆలయ ప్రాంగణంలో పలువురు మృతి చెందడంతో పాటు పలు అవాంఛనీయ సంఘటనలు, వివాదాలు దేవస్థానంలో చోటు చేసుకున్నాయనే వాదనలున్నాయి. అయినప్పటికీ, దే వస్థానంలో సంప్రోక్షణ, హోమాల వంటివి జరగలేదు. దీనిపై ‘అపశృతులు అందుకేనా..?’ శీర్షికన ‘సాక్షి’ అక్టోబర్ 7న కథనం ప్రచురించింది. ఈ నేపథ్యంలో దేవస్థానం అధికారులు స్పందించి, సంప్రోక్షణ పూజలు చేశారు. ఇప్పుడు కోటి తులసి పూజ నిర్వహించాలని నిర్ణయించారు. పలువురికి ఉద్యోగోన్నతులు బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లా పరిషత్లో ఆఫీసు సబార్డినేట్లుగా పని చేస్తున్న పలువురికి రికార్డు అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతి కల్పించారు. వారికి జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు మంగళవారం నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రమోషన్లు పొందిన ఉద్యోగులు సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని సూచించారు. ప్రజాసేవ చేసి జిల్లా పరిషత్కు మంచి పేరు తేవాలని అన్నారు. ఎంతో కాలంగా ఆఫీస్ సబార్డినేట్లుగా సేవలందించామని, ఉద్యోగోన్నతి పొందడం ఎంతో ఆనందంగా ఉందని ప్రమోషన్ పొందిన ఉద్యోగులు అన్నారు. జెడ్పీ చైర్మన్కు, సీఈఓ లక్ష్మణరావుకు కృతజ్ఞతలు తెలిపారు. జనవరి 24న నాటిక పోటీలుసామర్లకోట: పెద్దాపురం మండలం చంద్రమాంపల్లిలో జనవరి 24 నుంచి 26వ తేదీ వరకూ ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయి నాటిక పోటీలు నిర్వహిస్తున్నట్లు స్నేహ ఆర్ట్స్ నాటక పరిషత్ అధ్యక్షుడు గొందేసి రాజా తెలిపారు. సంబంధిత బ్రోచర్లను పెద్దాపురం ఎస్సై వి.మౌనిక ఆధ్వర్యాన మంగళవారం ఆవిష్కరించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో రెండు రాష్ట్రాల నుంచి 8 నాటికలు ప్రదర్శిస్తారని రాజా చెప్పారు. ఆరేళ్లుగా ఈ నాటిక పోటీలు నిర్వహిస్తున్నారని, ఇప్పుడు ఏడో సంవత్సరం మరింత ఉత్సాహంగా ఈ పోటీలు జరగాలని ఆశిస్తున్నట్లు ఎస్సై మౌనిక అన్నారు. ప్రజల్లో చైతన్యం తెచ్చేలా సందేశాత్మక నాటికలు ప్రదర్శించాలని సూచించారు. కార్యక్రమంలో పరిషత్ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. -
క్యాన్సర్ రోగులకు అత్యాధునిక టోమోథెరపీ సేవలు
ఎంవీపీ కాలనీ (విశాఖపట్నంవిశ): క్యాన్సర్ చికిత్సలో రాష్ట్రంలో తొలిసారిగా అత్యాధునిక టోమోథెరపీ వైద్యసేవలను విశాఖపట్నం ఎంవీపీ కాలనీలోని మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ అందుబాటులోకి తెచ్చింది. ఆ హాస్పటల్లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో విశాఖ ఎంపీ శ్రీభరత్, ఎండీ డాక్టర్ వున్నా మురళీకృష్ణతో కలిసి ఆ యూనిట్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ క్యాన్సర్ రోగులకు ఉపశమనం కలిగించేలా మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పిటల్ ఏపీలోనే తొలిసారి అత్యాధునిక టోమోథెరపీ సాంకేతిక అందుబాటులోకి తేవడం హర్షణీయమన్నారు. దీని ద్వారా మెరుగైన వైద్యసేవలు క్యాన్సర్ రోగులకు అందించడం సాధ్యమవుతుందన్నారు. హాస్పటల్ ఎండీ మురళీకృష్ణ మాట్లాడుతూ రూ.32 కోట్ల విలువైన ఈ యూనిట్ కొనుగోలుతో మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పిటల్ దేశంలో లెవల్ 3 కేటగిరి హాస్పటల్స్గా గుర్తింపు తెచ్చుకుందన్నారు. ఈ సాంకేతికత ద్వారా క్యాన్సర్ ట్యూమర్ను అత్యంత కచ్చితత్వంతో గుర్తించి నిమిషాల వ్యవధిలో చికిత్స అందించవచ్చన్నారు. కార్యక్రమంలో పలువురు హాస్పటల్ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
తొలి తిరుపతికి పోటెత్తిన భక్తులు
పెద్దాపురం (సామర్లకోట): ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని,, పెద్దాపురం మండలంలో తొలి తిరుపతి గ్రామంలో స్వయంభువుగా వెలసిన శృంగార వల్లభ స్వామి ఆలయానికి మంగళవారం వేలాదిగా భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు జిల్లా నలుమూల నుంచీ ఆలయానికి చేరుకోవడం ప్రారంభమైంది. వేకువజామున 3.30 నుంచి 4 గంటల వరకూ స్వామి వారికి అర్చకులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, నారాయణాచార్యులు ఆధ్వర్యాన సుప్రభాత సేవ, ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే ఉచిత, రూ.20, రూ.50 క్యూలలో భక్తులు బారులు తీరారు. తెల్లవారుజామున 4.30 గంటల నుంచి స్వామి వారి ఉత్తర ద్వార దర్శనానికి భక్తులను అనుమతించారు. స్వామివారిని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు దర్శించుకుని, పూజలు చేశారు. సుమారు 18 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు ఈఓ వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. భక్తులకు చక్కెర పొంగలి, పులిహోర ప్రసాదాలుగా అందజేశారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఆలయాన్ని పూలతో అలంకరించారు. -
అమ్మవార్లను ఆకట్టుకునేలా..
రాయవరం: దేవుడిపై ఉన్న భక్తిని పలువురు వివిధ రకాలుగా ప్రదర్శిస్తుంటారు. దానిలో భాగంగా లొల్ల గ్రామానికి చెందిన సుతాపల్లి శిరీష వినూత్నంగా తన భక్తిని చాటుకున్నారు. చీరపై అష్టోత్తరం, గోవింద నామాలను రాసి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయానికి సమర్పించారు. ఈ చీరను అమ్మవార్లకు అలంకరించేందుకు వినియోగించాలన్నారు. ఇప్పటి వరకు కాకినాడలోని కన్యకా పరమేశ్వరి, పిఠాపురంలోని పురూహుతికా అమ్మవారు, మండపేటలోని కన్యకా పరమేశ్వరి, లొల్లలోని శివాలయం, కాకినాడలో శ్రీపీఠం.. ఇలా తొమ్మిది ఆలయాల్లో అమ్మవార్లకు లలితా సహస్ర నామాలు రాసిన చీర్లను సమర్పించినట్లు తెలిపారు. రాయవరంలోని శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు రెండు చీరలు, శ్రీవారికి పంచెను బహూకరిస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా ఆమెను సర్పంచ్ చంద్రమళ్ల రామకృష్ణ, ఎంపీపీ నౌడు వెంకట రమణ, స్థానిక నేతలు పీఎస్ఆర్, తాడి రామచంద్రారెడ్డి, సత్తి వెంకట సుబ్బారెడ్డి, పులగం శ్రీనివాసరెడ్డి, మంతెన అచ్యుత రామరాజు తదితరులు అభినందించారు. -
నేడు రమణ మహర్షి జయంతి
ప్రత్తిపాడు రూరల్: ఆంధ్రా అరుణాచలంగా ప్రసిద్ధి చెందిన ప్రత్తిపాడు మండలం రాచపల్లిలోని శ్రీ రమణ సేవాశ్రమంలో రమణ మహర్షి 146వ జయంతి వేడుకలు మంగళవారం నిర్వహించనున్నారు. దీనికి 15 వేల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. సత్యసాయి సేవా సంస్థలు సహా పలు స్వచ్ఛంద సంస్థలు, భక్తుల సహకారంతో ఈ వేడుకలు నిర్వహించనున్నారు. మంగళవారం ఉదయం 7 గంటలకు కంఠం వేణుస్వామి అఖండ జ్యోతి ప్రజ్వలన చేస్తారు. ఉపనిషత్ పారాయణ, ప్రణవ పతాక ప్రతిష్ఠాపన, గోపూజ, రమణ అష్టోత్తర శతనామావళి, మూలమంత్ర హోమం, అర్చన, లక్ష్మీ గణపతి హోమం అనంతరం 10.30 గంటలకు ఆధ్యాత్మిక సభ నిర్వహించనున్నట్లు ఆశ్రమ వ్యవస్థాపకుడు స్వామి రామానంద తెలిపారు. యాగశాల పక్కన మెట్లదారి విస్తరణ అన్నవరం దేవస్థానం చైర్మన్ ఆదేశం అన్నవరం: రత్నగిరిపై సత్యదేవుని యాగశాల పక్క నుంచి దిగువకు వెళ్లేందుకు ఉన్న మెట్లను మరింత వెడల్పుగా విస్తరించాలని అన్నవరం దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆ మెట్ల దారిని సోమవారం ఆయన పరిశీలించారు. కార్తిక మాసంలో భక్తుల తాకిడి అధికంగా ఉంటుందని, సత్యదేవుని దర్శనానంతరం వారు దిగేందుకు తూర్పు రాజగోపురం ఎదురుగా ఉన్న మెట్లు మాత్రమే సరిపోవని 2023లో అప్పటి ఈఓ చంద్రశేఖర్ ఆజాద్ భావించారు. ఈ మేరకు రావిచెట్టు పక్క నుంచి యాగశాల వద్దకు చేరుకునేలా అదనంగా మెట్లు నిర్మించారు. అక్కడి నుంచి రామాలయ ప్రాంగణంలోకి వెళ్లడం సులువవుతుందని ఆయన భావించారు. అయితే ఈ మెట్లు 10 అడుగుల వెడల్పు మాత్రమే ఉండటంతో సరిపోవడం లేదు. గత కార్తిక మాసంలో రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు భక్తుల తోపులాట జరిగింది. దీంతో ఈ మెట్లను మరో 10 అడుగుల వెడల్పున విస్తరించాలని చైర్మన్ ఆదేశించారు. అయితే, దీనివలన యాగశాల దక్షిణం వైపు మెట్లు సగం వరకూ పోయే అవకాశముంది. ఈ విషయమై సిద్ధాంతితో మాట్లాడగా.. దక్షిణం వైపు మెట్లు సగం తొలగించి, వాటికి బదులు ఎల్ ఆకారంలో తూర్పునకు మెట్లు నిర్మించి, వాటిని మిగిలిన వాటికి అనుసంధానం చేయాల్సిందిగా సూచించారని ఈఈ రామకృష్ణ తెలిపారు. త్వరలోనే ఈ మెట్ల వెడల్పునకు అంచనాలు రూపొందించి, టెండర్లు పిలవనున్నారు. రాష్ట్ర స్థాయి కబడ్డీలో జిల్లా జయకేతనం సామర్లకోట: కర్నూలులో ఈ నెల 24 నుంచి 28వ తేదీ వరకూ జరిగిన రాష్ట్ర స్థాయి పురుషుల కబడ్డీ పోటీల్లో జిల్లా జట్టు జయకేతనం ఎగురవేసి, ప్రథమ బహుమతి సాధించింది. జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కొండపల్లి శ్రీనివాస్ సోమవారం విలేకర్లకు ఈ విషయం తెలిపారు. పశ్చిమ గోదావరితో జరిగిన తుది పోటీలో జిల్లా జట్టు అత్యంత ఉత్తమ ప్రదర్శన చేయడం ద్వారా చాంపియన్షిప్ సాధించిందన్నారు. జట్టు సభ్యులను అంతర్జాతీయ కోచ్ పోతుల సాయి, ప్రో కబడ్డీ రిఫరీ బోగిళ్ల మురళీ కుమార్, ఉపాధ్యక్షుడు నిమ్మకాయల కిరణ్, అంతర్జాతీయ క్రీడాకారిణి శ్వేత, అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వీవీ శ్రీనివాస్, కోశాధికారి తాళ్లూరి వైకుంఠం అభినందించారు. ఈ–కామర్స్ డెలివరీ కోర్సు ట్రైనర్లకు దరఖాస్తుల ఆహ్వానం బాలాజీచెరువు (కాకినాడ సిటీ): రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా కాకినాడ ప్రభుత్వ ఐటీఐలో ఈ–కామర్స్ డెలీవరీ అసోసియేట్ కోర్సు ట్రైనర్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి ఎస్.గోపీకృష్ణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై, 18 నుంచి 35 సంవత్సరాల లోపు వయసు ఉన్న వారు అర్హులన్నారు. దరఖాస్తుతో పాటు ఇతర వివరాలకు ప్రభుత్వ ఐటీఐ లేదా స్కిల్ హబ్ కో ఆర్డినేటర్ రేవతిని 86399 51441 నంబరులో సంప్రదింవచ్చని సూచించారు. -
నేర నామ సంవత్సరం
గంజాయి బ్యాచ్ల స్వైరవిహారం గంజాయిని అరికడతామంటూ ప్రభుత్వం గొప్పగా చెప్పడం మినహా.. వాస్తవానికి ఈ మత్తు ఈ ఏడాది మరింత ఎక్కువగా పట్టణాలతో పాటు పల్లెల్లోకీ విస్తరిస్తోంది. జిల్లా కేంద్రమైన కాకినాడలో అయితే గంజాయి లభించని ప్రాంతం లేదంటే అతిశయోక్తి కాదు. గంజాయి ముఠాలు విద్యార్థులను ఈ మత్తులో ముంచుతూ సొమ్ము చేసుకుంటున్నాయి. టన్నులకొద్దీ గంజాయిని పోలీసులు పట్టుకుంటున్నా.. అనేక మందిని అరెస్టు చేస్తున్నా.. అవేవీ ఈ మత్తును నియంత్రించలేని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. పైగా గంజాయి ముఠాలు బరితెగించి నడి రోడ్డుపై వీరంగం వేస్తూండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కాకినాడ రామారావుపేటలో ఈ ఏడాది అక్టోబర్లో రాత్రి విధులు ముగించుకొని వస్తున్న ఓ వైద్యుడిపై ముగ్గురు గంజాయి నిందితులు దాడి చేసి డబ్బులు లాక్కున్నారు. స్నేహితుడు సకాలంలో స్పందించడంతో వైద్యుడికి ముప్పు తప్పింది. అప్పటికి కొద్ది రోజుల ముందు మల్లయ్య అగ్రహారం సమీపాన ఓ విలేకరిపై గంజాయి మత్తులో ఉన్న మైనర్లు విచక్షణా రహితంగా దాడి చేశారు. ఆ విలేకరి చావు అంచుల వరకూ వెళ్లొచ్చాడు. ఇక చైన్స్నాచర్ల ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. దోపిడీ దొంగలు చెలరేగిపోతూండటం ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది.కాకినాడ క్రైం: జిల్లా ప్రజలకు 2025 సంవత్సరం చేదు అనుభవాలను చవిచూపింది. అనుకోని ప్రమాదాలు కొన్ని.. అనుకొని చేసిన దారుణాలు ఇంకొన్ని.. కక్షలు, కార్పణ్యాలు.. వ్యామోహాలతో రక్తం చిందిన ఉదంతాలు.. వావివరుసలు మరచి, విచక్షణ విడిచేసిన మృగాల అఘాయిత్యాలు.. ఇంకా దొంగతనాలు.. గంజాయి బ్యాచ్ల దాడులు.. మందుబాబుల వీరంగాలు.. సైబర్ నేరాల వంటివి ఈ ఏడాది యథేచ్ఛగా కొనసాగాయి. సోషల్ మీడియా పరిచయాలు వివాహేతర సంబంధాలకు దారి తీసి పచ్చని సంసారాల్లో చిచ్చులు రేపాయి. ఇలా ఎన్నో వివాదాలు, మరెన్నో విషాదాలకు నిలయమైన 2025.. నేర నామ సంవత్సరంగా నిలిచింది. హత్యలతో అట్టుడికి.. వివాహేతర సంబంధా లు, ప్రేమ వ్యవహారాలు, ఆర్థిక కారణాలు, రియల్ ఎస్టేట్ వివాదాలు, క్షణికావేశం వంటి కారణాలతో జరిగిన హత్యలతో జిల్లా ఈ ఏడాది అట్టుడికిపోయింది. గొల్లప్రోలులోని ఓ ప్రాంతంలో కుళ్లిన స్థితిలో గుర్తు తెలియని ఓ వ్యక్తి మృతదేహం మే నెలలో కనిపించింది. దేహంపై గాయాలుండటంతో పోలీసులు లోతుగా విచారణ జరిపారు. మొత్తం 7 వేల మిస్సింగ్ కేసులు పరిశీలించారు. అనకాపల్లికి చెందిన ఓ వృద్ధురాలు తన కుమారుడు కనిపించడం లేదంటూ చేసిన ఫిర్యాదు ఆధారంగా ఆ వ్యక్తిని తంగెళ్ల లోవరాజు(38)గా గుర్తించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో భార్య, ఆమె ప్రియుడు, మరో వ్యక్తి సహకారంతో సర్జికల్ బ్లేడ్తో లోవరాజు గొంతు కోసి హతమా ర్చి, మృతదేహాన్ని కత్తిపూడి – కాకినాడ మధ్య ఓ కాలువలో పడేసినట్లు తేలింది. సామర్లకోట సీతారాం కాలనీలో ఓ భర్త.. తన భార్య మాధురిని, 4, 5 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమార్తెలు పుష్పకుమారి, జెస్సీలను ఆగస్టులో దారుణంగా హతమార్చడం సంచలనం రేపింది. ఈ ఏడాది అక్టోబర్లో ఇద్దరు మైనర్ల మధ్య ఓ అమ్మాయి కోసం గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో గంటా శామ్యూల్ను అభివర్ధన్ అనే స్నేహితుడితో పాటు శ్రీనివాస్ అనే యువకుడు బ్లేడ్తో గొంతు కోసి, ఆపై కాళ్లు చేతులు తాళ్లతో కట్టి, డ్రైనేజీ నీటిలో ముంచి హతమార్చారు. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత ఆ డ్రైనేజీలోనే మృతదేహాన్ని వదిలేశారు. ఈ సంఘటనతో కాకినాడ నగర వాసులు ఉలిక్కిపడ్డారు. కాకినాడ ఇంద్రపాలెంలో భార్యపై అనుమానంతో ఓ వ్యక్తి నాపరాయితో ఆమె తల పగులగొట్టి చంపాడు. మరో వ్యక్తి తన తమ్ముడి చెప్పుడు మాటలు విని భార్య గొంతు కోసి, తానూ పురుగు మందు తాగాడు. భార్య బతికింది, భర్త చనిపోయాడు. ఈ నెలలో కాకినాడ సంతచెరువు వద్ద చెప్పులు కుట్టే ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. అంతకు ముందు రోజు ఘర్షణ పడ్డ వ్యక్తి తనను, తన తల్లిని తిడతావా అంటూ చెప్పులు కుట్టే పదునైన పరికరంతో అతడి గుండెల్లో గుచ్చాడు. ఆ గాయంతోనే బాధితుడు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్కు వెళ్లగా.. పోలీసులు అతడిని ఆస్పత్రికి పంపించారు. అక్కడకు వెళ్లేసరికే అపస్మారక స్థితి లో ఉన్న బాధితుడు మృతి చెందాడు. ఇలా మరెన్నో హత్యలు జిల్లాలో చోటు చేసుకున్నాయి. ‘మృత్యు’రాదారులు ఈ ఏడాది జిల్లాలో రోడ్డు ప్రమాదాలు గణనీయంగా పెరిగాయి. అతి వేగం, మద్యం తాగి వాహనాలు నడపడం, నిద్ర మత్తు, దారుణంగా ఛిద్రమైన రహదారులు ఈ ప్రమాదాలకు ప్రధాన కారణాలయ్యాయి. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న ఘటనల్లో పోలీసులు కేసులు నమోదు చేస్తున్నా సత్ఫలితాలనివ్వడం లేదు. ఫిబ్రవరిలో కాకినాడ – సామర్లకోట రోడ్డులో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వృద్ధ జంట గోతుల వల్ల కుదుపులకు గురయ్యారు. ఈ క్రమంలో వెనుక కూర్చున్న వృద్ధురాలు కింద పడిపోయి, తలకు తీవ్ర గాయమై, అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె మృతదేహం వద్ద భర్త రోదించిన తీరు చూపరులను కంట తడి పెట్టించింది. ఏప్రిల్ 5న జగ్గంపేట మండలం కాట్రావులపల్లికి చెందిన మల్లేపల్లి శ్రీను తన పెళ్లి బట్టలు కొనుక్కునేందుకు కాకినాడ వచ్చి వెళ్తూండగా లారీ ఢీకొని ప్రాణాలు కోల్పోవడం స్థానికులను, కుటుంబ సభ్యులను దిగ్భ్రాంతికి గురి చేసింది. మే 17న విశాఖపట్నం నుంచి రాజమహేంద్రవరం వెళ్తున్న ఓ కారు తుని వద్ద హైవేపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. నవంబర్ 8వ తేదీ ఉదయం 7 గంటల సమయంలో కిర్లంపూడి మండలం సోమవరం గ్రామం వద్ద హైవేపై అతి వేగంగా దూసుకొచ్చిన ఓ కారు కనిపించిన వాహనాలనల్లా ఢీకొట్టుకుంటూ దూసుకెళ్లింది. ఈ దారుణ ఘటనలో బస్టాప్లో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు, మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఇంకా మరిన్ని ప్రమాదాల్లో ఎంతోమంది అర్ధాంతరంగా తనువు చాలించారు. సైబర్ నేరాలు ఈ ఏడాది సైబర్ నేరాలు సైతం గణనీయంగా పెరిగాయి. కంటికి కనిపించని చీకటి దొంగలు ఆన్లైన్లో వివిధ నేరాలకు పాల్పడుతూ పోలీసుల మతులు పోగొడుతున్నారు. ప్రతాప్ నగర్కు చెందిన ఓ విశ్రాంత అధికారి ఈ ఏడాది ఆరంభంలో డిజిటల్ అరెస్టు పన్నాగంలో చిక్కుకోబోయి త్రుటిలో తప్పించుకుని, సుమారు రూ.40 లక్షల సొత్తు కాపాడుకున్నాడు. పెద్దాపురానికి చెందిన ఓ ప్రముఖ వ్యక్తికి వలపు వల విరిసిన సైబర్ నేరగాళ్లు ఫొటోలు మార్ఫింగ్ చేసి, బ్లాక్ మెయిల్కు పాల్పడ్డారు. డబ్బు ముట్టజెప్పినా వేధింపులు ఆగలేదు. చివరకు బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కాకినాడ మెయిన్ రోడ్లో ఓ డీటీపీ సెంటర్ నిర్వాహకుడు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి వ్యాపారం పేరిట రూ.2 లక్షలు కోల్పోయాడు. జిల్లాలో సైబర్ నేరాల నియంత్రణ చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కితే ఎక్కడ, ఎవరికి, ఎలా ఫిర్యాదు చేయాలనే అంశాలపై బాధితులకు కనీస అవగాహన కూడా ఉండటం లేదు. పోలీసు శాఖలో సైబర్ సెల్ లేకపోవడం, ఉన్న ఐటీ కోర్ విభాగ మే ఈ నేరాలపై పని చేయడంతో తగిన ఫలితాలు రావడం లేదనే విమర్శలకు తావిస్తోంది. జిల్లాను కుదిపేసిన హత్యలు ఆయువు తీసిన ప్రమాదాలు అమ్మాయిలపై అఘాయిత్యాలు మూలమూలలకూ గంజాయి మత్తు వివాదాలు, విషాదాలకు నిలయంగా 2025 అమ్మాయిలపై అఘాయిత్యాలు మహిళలు, బాలికలపై ఈ ఏడాది అఘాయిత్యాలు పెరిగాయి. మృగాల బారిన పడి మైనర్లు చివురుటాకుల్లా వణికిపోయారు. కాకినాడ వెంకట్ నగర్లో పదకొండేళ్ల బాలికపై బాబాయి.. 13 ఏళ్ల మైనర్పై తాతయ్య అఘాయిత్యానికి పాల్పడ్డారు. తునిలో ఓ వృద్దుడు తాతయ్యనంటూ టీచర్లకు చెప్పి, ఓ విద్యార్థినిని పాఠశాల నుంచి బయటకు తీసుకెళ్లి తోటల్లో అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అంతకు ముందు నుంచే వృద్ధుడు ఈ దురాగతానికి పాల్పడుతూ వచ్చాడు. చివరకు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు చెప్పారు. ప్రమాదాల నివారణకు స్మార్ట్ పార్కింగ్ అలర్ట్ సిస్టం హైవేలపై నిలిపి ఉంచే వాహనాల వల్లే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. జూలైలో ఒకే కుటుంబంలో ఐదుగురు మరణించిన విషాద ఘటన అనంతరం జిల్లా పోలీస్ శాఖ ప్రయోగాత్మకంగా స్మార్ట్ పార్కింగ్ అలర్ట్ సిస్టం విధానాన్ని అమలు చేసింది. ప్రత్యేక లేజర్ సాంకేతికత ఆధారంగా రోడ్డుపై నిలిపి ఉంచిన వాహనాల సమాచారం 45 సెకండ్లలోనే స్థానిక పోలీస్ స్టేషన్కు చేరుతుంది. తద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించే ఆస్కారం కలిగింది. ఈ విధానం ప్రారంభించాక రోడ్లపై నిలిపి ఉంచిన వాహనాల వల్ల ఇప్పటి వరకూ ఒక్క ప్రమాదం కూడా జరగలేదు. పొరుగు జిల్లాలు కూడా దీనిని అవలంబిస్తున్నాయి. గతం కంటే గంజాయి నియంత్రణ మెరుగ్గా ఉంది. ఈగల్ టీంలు అందుకు పని చేస్తున్నాయి. క్షణికావేశాలే హత్యలకు కారణం. ప్లాన్ చేసి హత్య చేసిన ఉదంతాలు లేవు. మహిళలపై నేరాలు తగ్గాయి. మైనర్లపై జరుగుతున్న అకృత్యాలను ఉపేక్షించడం లేదు. త్వరితగతిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నాం. – జి.బిందుమాధవ్, జిల్లా ఎస్పీ, కాకినాడ -
‘ముక్కోటి’కి ముస్తాబు
● రత్నగిరిపై పూర్తయిన ఏర్పాట్లు ● ఉదయం 5 గంటల నుంచి ఉత్తర ద్వార దర్శనంఅన్నవరం: భక్తవరదుడైన సత్యదేవుడు వెలసిన రత్నగిరి మంగళవారం జరగనున్న ముక్కోటి ఏకాదశి పర్వదినానికి ముస్తాబైంది. సత్యదేవుని ప్రధానాలయంతో పాటు తూర్పు రాజగోపురం, ఆలయ ప్రాంగణాన్ని రంగురంగుల పూలమాలలు, విద్యుద్దీప తోరణాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. సత్యదేవుని ఉత్తర ద్వార దర్శనాన్ని ఉదయం నుంచి సాయంత్రం వరకూ యూట్యూబ్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ప్రధానాలయం ఉత్తర ద్వారం వద్ద ఉత్తరాభిముఖంగా మండపం ఏర్పాటు చేశారు. అందులో శేషపాన్పు మీద పవళిస్తున్న విష్ణుమూర్తి, లక్షీదేవి అలంకరణలో సత్యదేవుడు, అమ్మవారి ఉత్సవమూర్తులను ప్రతిష్ఠించారు. తెల్లవారుజామున 4 గంటలకు పండితులు స్వామి, అమ్మవార్లకు పంచ హారతి, నీరాజన మంత్రపుష్పాదులు సమర్పిస్తారు. అనంతరం ఉదయం 5 గంటల నుంచి ఉత్తర ద్వార దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. భక్తుల రద్దీని అనుసరించి సాయంత్రం వరకూ ఉత్తర ద్వార దర్శనం కొనసాగిస్తారు. దీనికోసం ప్రత్యేక క్యూలు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకూ భక్తులు దిగువ నుంచి ఆలయ ప్రాకారంలోకి క్యూలో ప్రవేశించాక.. దక్షిణ ద్వారం నుంచి లోపలకు వెళ్లి, స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ఉత్తర ద్వారం నుంచి వెలుపలకు వచ్చేవారు. ముక్కోటి సందర్భంగా దక్షిణ ద్వారం నుంచి కాకుండా ఉత్తర ద్వారం వద్దనే ఏర్పాటు చేసిన స్వామి, అమ్మవార్లను దర్శించి, అక్కడి నుంచి తూర్పు ద్వారం వైపు వెళ్లి, గర్భాలయంలో సత్యదేవుడు, అమ్మవారిని దర్శించుకుని, దక్షిణ ద్వారం వద్ద ఉన్న క్యూ లైనులో వెలుపలకు వచ్చేలా ఏర్పాటు చేశారు. ఉత్తర ద్వారం ద్వారా రెండు క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. దర్శనానంతరం భక్తులకు కదంబం ప్రసాదం పంపిణీ చేస్తారు. ఉదయం 11 గంటలకు స్వామి, అమ్మవార్లను వెండి రధంపై ఆలయ ప్రాకారంలో ఊరేగిస్తారు. అలాగే, రాత్రి 7 గంటల నుంచి వెండి గరుడ వాహనంపై అన్నవరం గ్రామంలో ఊరేగించనున్నారు. ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లను దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వి.త్రినాథరావు సోమవారం పరిశీలించారు. ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యం, అర్చకుడు సుధీర్ తదితరులతో ఆలయంలో ఏర్పాట్లపై సమీక్షించారు. దేవస్థానం ఈఈ వి.రామకృష్ణ, ఏఈఓ పెండ్యాల భాస్కర్, సూపరింటెండెంట్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
థర్టీ ఫస్ట్ ధమాకా
● క్వార్టర్పై రూ.10 అదనం ● ముమ్మిడివరం నియోజకవర్గంలో దోపిడీ ● కీలక నేత వత్తాసు ● సిండికేట్లో 30 షాపులు వారివే సాక్షి, అమలాపురం: ‘డిసెంబర్ థర్టీ ఫస్ట్’... పాత సంవత్సరానికి ముగింపు రోజు. అంతేకాదు మందు బాబులకు పండగ రోజు. మరీ ముఖ్యంగా మద్యం వ్యాపారులు రెండు చేతులా సంపాదించే రోజు. సాధారణ రోజుల కన్నా సంవత్సరాంతం రెండు, మూడు రెట్లు సాగే వ్యాపారం కోసం మద్యం వ్యాపారులు చేసుకునే ఏర్పాట్లు అన్నీ ఇన్నీ కావు. సందట్లో సడేమియాగా జిల్లాలో మద్యం వ్యాపారులు దోపిడీకి సిద్ధమయ్యారు. ఎమ్మార్పీ కన్నా క్వార్టర్ బాటిల్కు అదనంగా సొమ్ము వసూలుకు తెగబడ్డారు. జిల్లాలోని ముమ్మిడివరం నియోజకవర్గం కేంద్రంగా ఇప్పటికే మొదలైన ఈ దోపిడీ జిల్లా అంతా విస్తరించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలో ముమ్మిడివరం, కాట్రేనికోన, ఐ.పోలవరం, తాళ్లరేవు మండలాల్లో మద్యాన్ని అదనపు ధరలకు విక్రయిస్తున్నారు. గడచిన మూడు రోజులుగా ఈ దందా సాగుతోంది. క్వార్టర్ బాటిల్కు అదనంగా రూ.పది చొప్పున వసూలు చేస్తున్నారు. ఈ దందాపై ఒక మద్యం ప్రియుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఇప్పుడిది హల్చల్ చేస్తోంది. మద్యం విక్రయాలు జరిపే ఒక వ్యక్తి మాట్లాడుతూ ‘అదనపు ధర ముమ్మిడివరం నియోజకవర్గానికి ప్రత్యేకమని’ చెప్పడం గమనార్హం. సాధారణంగా బెల్టు షాపుల్లో మద్యం దుకాణాల కన్నా రూ.20 అదనంగా చేసి అమ్మకాలు చేస్తున్నారు. మద్యం వ్యాపారులు ధరలు పెంచడంతో వీరు కూడా అదనంగా రూ.30 నుంచి రూ.40 పెంచి విక్రయిస్తున్నారు. ఆ నేత సోదరుడి హవా.. నియోజకవర్గానికి చెందిన ఒక అధికార పార్టీ కీలక నేత సోదరుడి ఆధ్వర్యంలో ఇక్కడ సిండికేట్ నడుస్తోంది. వీరి ఆధ్వర్యంలో ముమ్మిడివరం, అమలాపురం నియోజకవర్గాల్లో సుమారు 30 మద్యం దుకాణాల వరకూ ఉన్నాయని అంచనా. దీనిని అడ్డు పెట్టుకుని మద్యం ధరలు పెంచేశారు. మద్యం దుకాణాల కనుసన్నల్లోనే బెల్టుషాపులు కూడా నిర్వహిస్తున్నారు. ఇక్కడ మద్యం వ్యాపారం కాస్తా మాఫియాగా మారిపోయింది. గతంలో తీర ప్రాంత మత్స్యకార గ్రామాల్లో బెల్టు షాపులకు వేలం పాటలు నిర్వహించిన విషయం గమనార్హం. మిగతా చోట్లా.. అదే బాట డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజున జరిగే వ్యాపారంలో భారీ లబ్ధి ఆశిస్తున్న జిల్లాలోని మిగిలిన మద్యం వ్యాపారులు కూడా ముమ్మిడివరం బాట పట్టే అవకాశముంది. జిల్లా వ్యాప్తంగా మండలాలు, నియోజకవర్గాల వారీగా సిండికేట్లు ఏర్పడిన విషయం తెలిసిందే. అంబాజీపేటలో ఒక సిండికేట్ ఆధ్వర్యంలో మద్యం డోర్ డెలివరీ జరుగుతోంది. గత దసరా పండగ సమయంలో ఇక్కడ జరిగే భేతాళస్వామి ఉత్సవాలకు మద్యం దుకాణాలను బంద్ చేశారు. ఇదే అదునుగా మద్యం వ్యాపారులు క్వార్టర్కు రూ.50 చొప్పున పెంచి మద్యాన్ని డోర్ డెలివరీ చేశారు. అప్పటి నుంచి ఇక్కడ డోర్ డెలివరీ వ్యాపారం జోరందుకుంది. -
మున్సిపల్ డీఈ రీకాల్
● రామచంద్రపురం మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం ● 17 మంది ఏకగ్రీవ ఆమోదం ● డీసెంట్ తెలిపిన ఏడుగురు కౌన్సిలర్లు రామచంద్రపురం: మున్సిపాలిటీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మున్సిపల్ డీఈనీ రీకాల్ చేస్తూ ఆదివారం కౌన్సిలర్లు తీర్మానం చేశారు. కొంతకాలంగా కౌన్సిల్ సభ్యులు మున్సిపల్ డీఈ శ్రీకాంత్ను రీకాల్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు గత నెలలో జరిగిన సమావేశంలో కూడా సభ్యులు ఆయనను రీకాల్ చేయాలని కోరారు. ఈ మేరకు స్థానిక మంత్రి సుభాష్కు, మున్సిపల్ ఆర్డీ, కలెక్టర్, మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రాలు అందజేశారు. తాజాగా శనివారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో టేబుల్ అజెండాగా డీఈ శ్రీకాంత్ను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ కౌన్సిల్ తీర్మానించింది. మున్సిపల్ చైర్పర్సన్తో సహా 17 మంది కౌన్సిలర్లు దీనికి మద్దతు తెలపగా ఏడుగురు మాత్రం డీసెంట్ తెలిపారు. సమావేశంలో అజెండాలోని తొమ్మిది అంశాలను కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. అనంతరం కౌన్సిలర్లు మాట్లాడుతూ డీఈ శ్రీకాంత్ పట్టణాభివృద్ధికి ఆటంకంగా మారారని, కౌన్సిల్ సభ్యులను అవమానపర్చడం, పనులు పూర్తి చేసినా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడం, నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దీనికి నలుగురు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో సమావేశం రసాభాసగా మారింది. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవితో సహా 17 మంది సభ్యులు డీఈని ప్రభుత్వానికి సరెండర్ చేయాలని ప్రతిపాదించారు. ఈ సందర్భంగా ఒక కౌన్సిలర్ వాడిన పదజాలాన్ని తప్పుపడుతూ పలువురు కౌన్సిలర్లు బైఠాయించారు. దీంతో చైర్పర్సన్ వారికి నచ్చచెప్పి అతి కష్టం మీద సమావేశాన్ని అదుపులోకి తీసుకొచ్చి డీఈని సరెండర్ చేస్తూ తీర్మానాన్ని ఆమోదించారు. అదే సమయంలో ఏడుగురు కౌన్సిలర్లు డీసెంట్ తెలుపుతూ రాసిన పత్రాన్ని కమిషనర్ రాజుకు అందజేశారు. ఈ అంశంపై వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ వాడ్రేవు సాయి ప్రసాద్ విప్ జారీ చేసినప్పటికీ, ఆ పార్టీ నలుగురు కౌన్సిలర్లు విప్ను ధిక్కరించి డీసెంట్పై సంతకాలు చేయడం గమనార్హం. -
విద్యారంగం డీలా
● ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై శీతకన్ను ● ‘తల్లికి వందనం’లో కోతలు ● ఫీజు రీయింబర్స్మెంట్కు ఎగనామం ● గురువులకిచ్చిన హామీలు గాలికి.. ● బోధనేతర పనులతో ఒత్తిడి బాలాజీచెరువు (కాకినాడ): గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో మాదిరిగా నేడు సర్కారీ పాఠశాలల అభివృద్ధికి కానరాని చేయూత.. ప్రభుత్వ చదువులకు కరవవుతున్న ప్రోత్సాహం.. విద్యారంగంలో సంక్షేమానికీ దాదాపు తిలోదకాలు ఇస్తున్న ధోరణి.. మరోవైపు పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులపై విపరీతమైన బోధనేతర భారం.. పదో తరగతి పరీక్షల్లో 82.24 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 15వ స్థానంతో సరిపెట్టుకోవాల్సిన దుస్థితి.. ఇలా అన్ని రూపాల్లోనూ ప్రభుత్వ విద్యారంగం ఈ ఏడాది డీలా పడిన పరిస్థితి కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. కొద్ది రోజుల్లో 2025వ సంవత్సరం కాలగర్భంలో కలసిపోతున్న తరుణంలో జిల్లాలో విద్యారంగ పరిస్థితులపై విహంగ వీక్షణం.. తల్లికి ‘వంచన’ పేదింటి పిల్లలను బడికి పంపించేలా తల్లిదండ్రులను ప్రోత్సహించే లక్ష్యంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమ్మ ఒడి పథకాన్ని అమలు చేసింది. గత సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఈ పథకం పేరును ‘తల్లికి వందనం’గా మార్చింది. ప్రతి ఇంట్లోను చదువుకునే పిల్లలందరికీ రూ.15 వేల చొప్పున పూర్తి స్థాయిలో అందిస్తామని ప్రకటించింది. తీరా చూస్తే తొలి ఏడాది ఈ సాయాన్ని ఎగ్గొట్టారు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో ఈ ఏడాది ఈ పథకాన్ని అమలు చేసినా.. లబ్ధిదారుల్లో.. వారికిచ్చే సాయంలో భారీగా కోత పెట్టారు. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలోని 2,80 లక్షల మంది తల్లులకు రూ.330.17 కోట్లు జమ చేశారు. అయితే, క్షేత్ర స్థాయిలో కొందరు తల్లులకు రూ.8 వేలు, మరి కొందరికి రూ.9 వేలు, ఇంకొందరికి రూ.11 వేల చొప్పున మాత్రమే ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిన వెంటనే మిగిలిన మొత్తాన్ని తల్లుల ఖాతాల్లో వేస్తామంటూ మెలిక పెట్టి, తల్లులకు రాష్ట్ర ప్రభుత్వం పంగనామం పెట్టింది. ఉన్నత విద్య భారం పేద విద్యార్థులు ఎటువంటి ఆటంకమూ లేకుండా ఉన్నత విద్య అభ్యసించాలనే ఉన్నతాశయంతో ప్రారంభించిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసింది. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది ఫీజు రీయింబర్స్మెంట్ ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. ఈ ఏడాదైనా నిధులు విడుదల చేస్తారని ఎదురు చూసిన విద్యార్థులకు నిరాశే ఎదురైంది. కంటితుడుపుగా కొందరు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నిధులు విడుదల చేసినట్లు ప్రభుత్వం ప్రచారం చేసుకుంది. వాస్తవానికి చాలామంది విద్యార్థులు నిధులు విడుదల కాక మధ్యలోనే చదువులు ఆపేయాల్సిన దుస్థితిని ఎదుర్కొన్నారు. కొంతమంది తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ ఫీజులు చెల్లించాల్సి వచ్చింది. జిల్లావ్యాప్తంగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు దాదాపు రూ.38 కోట్ల మేర ఉన్నాయి. ఏడాదంతా అడ్మిషన్లే.. డిసెంబర్ నెలలో సైతం డిగ్రీ, పీజీ కోర్సులకు వివిధ కళాశాలల్లో ఈ ఏడాది స్పాట్ అడ్మిషన్లు నిర్వహించారు. ఇంజినీరింగ్ అడ్మిషన్లు సైతం ఇదేవిధంగా కొనసాగిస్తూ వచ్చారు. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం తేదీలు కేటాయించినా ఈ ఏడాది వాటిని ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో, మునుపెన్నడూ లేనివిధంగా ఈ ఏడాదంతా అడ్మిషన్లే అనే పరిస్థితి ఏర్పడింది. నాణ్యత లేని ‘విద్యార్థి మిత్ర’ కార్పొరేట్కు దీటుగా పేద విద్యార్థులు చదువుకోవాలనే ఉన్నతాశయంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వినూత్న రీతిలో జగనన్న విద్యా కానుక పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తెరచిన రోజున విద్యార్థులకు పాఠ్య, నోట్ పుస్తకాలు, డిక్షనరీలు, యూనిఫాం, బెల్టు, షూ, సాక్సులు, నాణ్యమైన స్కూల్ బ్యాగ్ వంటివి అందించింది. ఈ పథకం పేరును చంద్రబాబు ప్రభుత్వం ‘సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర’గా మార్చింది. తీరా ఆచరణకు వచ్చేసరికి ఆ మహనీయునికే మచ్చ తెచ్చేలా విద్యార్థులకు ఇచ్చే వస్తువుల్లో నాణ్యతకు తిలోదకాలిచ్చింది. స్కూల్ బ్యాగులు రెండు నెలలకే చిరిగిపోయాయి. బూట్లు ఇప్పటికే పాడైపోయాయి. దీంతో, విద్యార్థులు తరగతులకు చెప్పులతోనే హాజరవుతున్నారు. ట్యాబ్లు గోవిందా.. విద్యార్థుల్లో డిజిటల్ విద్యను ప్రోత్సహించే లక్ష్యంతో గత వైఎస్ జగన్ ప్రభుత్వం ఎనిమిదో తరగతి విద్యార్థులకు బైజూజ్ కంటెంట్తో ట్యాబులు పంపిణీ చేసింది. తద్వారా విద్యార్థులు తరగతిలో పాఠంతో పాటు ఇంటికి వెళ్లాక కూడా ఆ ట్యాబ్ల ద్వారా ఆ పాఠాలకు సంబంధించి మరిన్ని విషయాలను లోతుగా అర్థం చేసుకునే అవకాశం ఉండేది. అర్థం కాని విషయాలను కూడా వాటి ద్వారా సులభంగా గ్రహించేవారు. ఈ ట్యాబుల పంపిణీకి చంద్రబాబు ప్రభుత్వం తిలోదకాలిచ్చింది. ఎక్కడి నిర్మాణాలు అక్కడే.. మన బడి నాడు–నేడు కింద ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ఈ పథకం పేరును ప్రస్తుత ప్రభుత్వం ‘మన బడి – మన భవిష్యత్తు’గా మార్చిందే తప్ప ఒక్క రూపాయి ఇచ్చిందీ లేదు.. ఒక్క ఇటుక కూడా పేర్చిందీ లేదు. మొత్తం రూ.188 కోట్ల మేర బకాయిలు పేరుకుపోవడంతో చేసిన పనులకు వడ్డీలు కట్టలేక కాంట్రాక్టర్లు లబోదిబోమంటున్నారు. మరో మూడు నెలల్లో ఆర్థికం సంవత్సరం ముగిసిపోనుండగా.. ఈ నిధుల విడుదలపై ఇప్పటికీ స్పష్టత లేదు. ఫలితంగా గత ప్రభుత్వం వివిధ పాఠశాలల్లో చేపట్టిన పలు నిర్మాణాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. దాతల సహకారంతో పనులు పూర్తి చేయాలని చంద్రబాబు ప్రభుత్వం కొత్త విధానం తెచ్చింది. బోధనేతర భారం మరోవైపు ఉపాధ్యాయులు బోధనేతర భారంతో సతమతమవుతున్నారు. ఫలితంగా విద్యార్థులు చదువులకు దూరమవుతున్న పరిస్థితి నెలకొందని ఉపాధ్యాయులు, విద్యార్థి సంఘాల నాయకులు వాపోతున్నారు. యాప్ల భారాన్ని తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. టీచర్లపై హాజరు నమోదు, ఇన్స్పెక్షన్, యూనిఫాం, పరిశుభ్రత, మరుగుదొడ్లు, మధ్యాహ్న భోజనం, సాసా, కర్మయోగి తదితర పలు రకాల యాప్ల బాధ్యతలు అప్పగించింది. దీంతో పాటు పేరెంట్స్ – టీచర్స్ కమిటీ సమావేశాలు ఉపాధ్యాయులకు భారంగా మారాయి. ఈ సమావేశాల కోసం గురువులు తమ జేబులోని సొమ్ము వెచ్చించాల్సి వస్తోంది. మరోవైపు ఎంఈఓల నుంచి ప్రధానోపాధ్యాయుల వరకూ అందరికీ సమయం సమీక్షలకే సరిపోతోంది. పరీక్షల మార్కుల వివరాలు ఆన్లైన్ చేయడం వంటి పనుల పర్యవేక్షణతో వారు సతమతమవుతున్నారు. హామీల అమలెప్పుడో! ఎన్నికల ముందు ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీల అమలును చంద్రబాబు ప్రభుత్వం ఈ ఏడాది కూడా గాలికొదిలేసింది. 12వ పీఆర్సీ కోసం గత ప్రభుత్వం వేసిన కమిటీని రద్దు చేసిన సర్కారు.. ఇప్పటి వరకూ కొత్త కమిటీని వేయలేదు. కనీసం ఐఆర్ కూడా ప్రకటించకపోవడంతో ఉపాధ్యాయులు తీవ్రంగా మండిపడుతున్నారు. మరోవైపు డీఏల చెల్లింపుపై కూడా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2024 జూలై, 2025 జనవరి, 2025 జూలైకి సంబంధించి ఉపాధ్యాయులకు డీఏ బకాయిలు చెల్లించాల్సి ఉంది. మూడు రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో మరో డీఏ.. అంటే మొత్తం నాలుగు డీఏలను ప్రభుత్వం చెల్లించాలని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ప్రభుత్వం విఫలం ప్రతి నెలా ఏదో ఒక సమస్యపై విద్యా రంగ సమస్యలపై పోరాడుతున్నాం. ఫీజు రీయింబర్స్మెంట్, అందరికీ తల్లికి వందనం రాకపోవడం, సకాలంలో అడ్మిషన్లు నిర్వహించకపోవడం వంటి అంశాలపై పోరాటాలు చేస్తున్నాం. తల్లిదండ్రుల కమిటీ సమావేశాలను రాజకీయ వేదికలుగా మార్చి వీటికి ప్రాధాన్యం లేకుండా చేస్తున్నారు. ప్రతి విషయంలోనూ ప్రభుత్వం విఫలమవుతోంది. – సీహెచ్ లోవరాజు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు చిరిగిన బ్యాగుతో విద్యార్థి -
అటు రంకెలేస్తూ.. ఇటు దౌడు తీస్తూ..
● రసవత్తరంగా రాష్ట్ర స్థాయి ఎడ్ల బళ్లు, గుర్రపు స్వారీ పోటీలు ● వివిధ జిల్లాల నుంచి వచ్చిన 67 జతల ఎడ్లు, 23 గుర్రాలు ● సందడిగా మారిన ఏడీబీ రోడ్డు రంగంపేట: మండలం వడిశలేరు సమీపంలో గన్ని వ్యవసాయ క్షేత్రం వద్ద ఆదివారం నిర్వహించిన 7వ రాష్ట్రస్థాయి ఎడ్లబళ్లు, గుర్రాల పోటీలు రసవత్తంరంగా సాగాయి. దివంగత ఆదర్శరైతు గన్ని సత్యనారాయణమూర్తి స్మారకార్థం ఆయన కుమారుడు, రాజానగరం జీఎస్ఎల్ వైద్య కళాశాల చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కరరావు సహకారంతో కూటి కోటేశ్వరరావు, బొప్పన బ్రహ్మాజీరావుల నిర్వహణలో ఈ పోటీలు జరిగాయి. ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఐదు వరకు సాగిన ఈ పోటీలను మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించగా రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు చూడడానికి వచ్చారు. రాష్ట్రలోని వివిధ జిల్లాల నుంచి 67 జతల ఎడ్లు, 23 గుర్రాలు పోటీలకు హాజరు కాగా, సీనియర్స్ 1600 మీటర్ల విభాగంలో 11 జతలు, జూనియర్స్ విభాగం వెయ్యి మీటర్లలో 56 జతల ఎడ్లు పాల్గొన్నాయి. ఈ పోటీల వల్ల వడిశలేరు నుంచి రంగంపేట వరకు గల ఏడీబీ రోడ్డు కోలాహలంగా మారింది. పోలీసు బందోబస్తు నడుమ పోటీలు ప్రశాంతంగా ముగిసాయి. ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు బత్తుల బలరామకృష్ణ, ముప్పిడి వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు పోటీలు తిలకించారు. విజేతలు వీరే... సీనియర్స్ విభాగంలో 11 జతల ఎడ్లు పాల్గొనగా మొదటి బహుమతి రాయల్ ఎన్ఫీల్డ్ను జి.మేడపాడుకి చెందిన మలిరెడ్డి అన్నపూర్ణ, గుమ్మిలేరుకు చెందిన కోరా శృతి చౌదరి ద్వితీయ, తృతీయ బహుమతులుగా బైక్లను గెలుచుకున్నారు. మరికొందరు కన్సొలేషన్ బహుమతులు గెలుచుకున్నారు. విజేతలకు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బహుమతులు అందజేశారు. జూనియర్స్ విభాగంలో 56 జతల ఎడ్లు పాల్గొనగా మొదటి బహుమతి రాయల్ ఎన్ఫీల్డ్ను చౌడవాడకు చెందిన గెడ్డం అప్పారావు, ద్వితీయ బహుమతిని కంకటపాలేనికి చెందిన కొండేటి పద్మ, తృతీయ బహుమతిని బి.కొత్తూరుకు చెందిన మురుకుర్తి శంకరరావు గెలుచుకున్నారు. గుర్రాల పందెం విజేతలు వీరే.. మొదటి బహుమతి రూ.40 వేలను అగ్రహారానికి చెందిన చేమల మణికంఠ, ద్వితీయ బహుమతి రూ.30 వేలను యలమంచిలికి చెందిన ఎల్లపు జగదీష్, తృతీయ బహుమతి రూ.25 వేలను రామన్నపాలేనికి చెందిన చోడమాంచిక విక్రమ్ సాధించారు. నాల్గవ బహుమతి సాధించిన సింగపూర్ సత్యనారాయణకు రూ.20 వేలు, ఐదో బహుమతిని అరకుపాలేనికి చెందిన మోదమాంబ మురుగన్కు రూ.15 వేలు, ఆరో బహుమతి సాధించిన సోమలింగంపాలేనికి చెందిన యల్లపు జగదీష్కు రూ.10 వేలు, ఏడో బహుమతి సాధించిన కోటనందూరుకు చెందిన శివరాజుకు రూ.10 వేల చొప్పున నగదు అందించారు. విజేతలకు గన్ని కృష్ణ నగదు బహుమతులు అందజేశారు. -
అలా ఆటాడుకుంటున్నారు
● జీఎంసీలో వివాదాస్పదంగా పోస్టుల భర్తీ ప్రక్రియ ● మొత్తం ఖాళీలు 162 ● గత ఏడాది మొదటి నోటిఫికేషన్లో చూపినవి 77 ● రెండో విడతలో 79కి పెంపు ● వేర్వేరు కారణాలతో మొదటి రెండు నోటిఫికేషన్లూ రద్దు ● మూడోసారి పోస్టులు 60కి కుదింపు ● అధికారులు తమతో ఆటలాడుకుంటున్నారని అర్హుల ఆగ్రహంకాకినాడ క్రైం: రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాల (జీఎంసీ) ద్వారా రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాల(జీజీహెచ్)లో వివిధ కేడర్లలో పారామెడికల్ సిబ్బంది నియామకానికి చేపట్టిన ప్రక్రియ వివాదాస్పదంగా మారింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో వైద్య విధాన పరిషత్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ), డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్కు సంబంధించి 350కి పైగా పారామెడికల్ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందుకు గతంలో నోటిఫికేషన్ ఇచ్చారు. దీని ద్వారా ఉమ్మడి జిల్లాలోని రాజమహేంద్రవరం జీఎంసీ, కాకినాడ జీజీహెచ్, రంగరాయ వైద్య కళాశాల(ఆర్ఎంసీ)తో పాటు వివిధ పీహెచ్సీలు, యూహెచ్సీలు, ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల్లో వివిధ పారామెడికల్ పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించారు. కాకినాడలోని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్ఓ) కార్యాలయం ద్వారానే ఉమ్మడి జిల్లా పోస్టుల భర్తీ చేపట్టారు. అన్నిచోట్లా నియామకాలూ పూర్తయిపోయాయి. అయితే, రాజమహేంద్రవరం జీఎంసీ, రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాల (జీజీహెచ్) పరిధిలోని 79 పోస్టులను తామే భర్తీ చేసుకుంటామని అధికారులు దాదాపు ఏడాదిన్నర కిందట చెప్పారు. కానీ, ఈ పోస్టుల భర్తీ ప్రక్రియను సంబంధిత అధికారులు ఇప్పటి వరకూ పూర్తి చేయలేదు. ఈ పోస్టులకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అర్హులెవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. కలెక్టర్నే తప్పుదోవ పట్టించారా.. ఉమ్మడి జిల్లా ఉద్యోగాల నోటిఫికేషన్ కావడం వల్ల నియామక ప్రక్రియ ఆసాంతం కాకినాడ జిల్లా కలెక్టర్ పరిధిలోకే వస్తుంది. జీఎంసీలో పోస్టుల భర్తీకి సంబంధించి ఇప్పటి వరకూ మూడుసార్లు నోటిఫికేషన్ ఇచ్చారు. గత ఏడాది కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు కొద్ది కాలం ముందు మొదటిసారి ఇచ్చిన నోటిఫికేషన్లో 77 ఖాళీలు చూపించారు. అభ్యర్థుల అభ్యంతరాల పేరుతో దానిని రద్దు చేసి, గత ఏడాది డిసెంబర్లో రెండోసారి నోటిఫికేషన్ ఇచ్చి మొత్తం 79 పోస్టులు చూపారు. అనివార్య కారణాలంటూ దీనినీ రద్దు చేసినట్లు ప్రకటించారు. అయితే, రోస్టర్ నిర్వహణలో లోపం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకపోవడం వంటి కారణాలతోనే రెండో నోటిఫికేషన్ రద్దు చేశారన్నది అభ్యర్థుల వాదన. తాజాగా ఈ నెలలో మూడోసారి ఇచ్చిన నోటిఫికేషన్లో 60 మాత్రమే ఖాళీలున్నాయని తెలిపారు. కొన్ని ఉద్యోగాలకు విద్యార్హతలు నిర్ణయించలేదని, అందువలన మూడో నోటిఫికేషన్లో పోస్టుల సంఖ్య కుదించామని చెబుతున్నారు. అదే నిజమైతే అంతకు ముందు రెండుసార్లు అవే పోస్టులకు నోటిఫికేషన్లు ఎలా ఇచ్చారని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. మూడుసార్లు వేర్వేరుగా ఖాళీలు చూపుతూ, కలెక్టర్నే తప్పుదోవ పట్టించి మరీ ఆయా నోటిఫికేషన్లపై సంతకాలు చేయించారని ఆరోపిస్తున్నారు. మొత్తం 162 ఖాళీలు రాజమహేంద్రవరం జీజీహెచ్, జీఎంసీలలో మొత్తం 162 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గతానివే 79 కాగా, తాజాగా జీజీహెచ్లో మరో 83 ఖాళీలు ఏర్పడ్డాయి. రోగులకు నాణ్యమైన వైద్య సేవలందించేందుకు ఈ ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని ఆస్పత్రి అధికారులు కోరినా జీఎంసీ అధికారులు పట్టించుకోలేదని చెబుతున్నారు. ఈ 162 పోస్టులను గత నెల నాటికే భర్తీ చేయాలని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించినా ఫలితం లేకపోయింది. కేవలం 60 పోస్టులకే నోటిఫికేషన్ ఇచ్చారు. పాతవి 19, కొత్తవి 83 కలిపి మిగిలిన 102 పోస్టులు ఎందుకు భర్తీ చేయకుండా నిలిపివేశారనేది జవాబు లేని ప్రశ్నగానే ఉంది. 11 కేడర్లకు ఎగనామం మొత్తం 21 కేడర్లలో సిబ్బందిని నియమించాల్సి ఉండగా.. 10 కేడర్ల పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారు. మిగిలిన 11 కేడర్లలోని కంప్యూటర్ ప్రోగ్రామర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్, ఎలక్ట్రికల్ హెల్పర్, మార్చురీ అటెండెంట్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, సైకియాట్రీ సోషల్ వర్కర్, స్పీచ్ థెరపిస్ట్, సిస్టం అడ్మినిస్ట్రేటర్, చైల్డ్ సైకాలజిస్టు, క్లినికల్ సైకాలజిస్టు పోస్టులను పక్కన పెట్టేశారు. విద్యార్హతలు నిర్ణయించలేదు ఖాళీలు ఎక్కువగా ఉన్న మాట నిజమే. అన్ని పోస్టుల భర్తీకీ బదులు 60 పోస్టులకే నోటిఫికేషన్ ఇచ్చాం. కొన్ని పోస్టులకు విద్యార్హతలు ఇంకా నిర్ణయించలేదు. సూపర్స్పెషాలిటీ పోస్టులు ఇవ్వొద్దని రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు (డీఎంఈ) ఆదేశించారు. అందుకే నోటిఫికేషన్లో ఇవ్వలేదు. అన్నీ నెమ్మదిగా అవుతాయి. కొత్త కాలేజీలకు ఇంకా ఉద్యోగ నియామకాలు జరగలేదు. – డాక్టర్ కేవీ శివప్రసాద్, ప్రిన్సిపాల్, రాజమహేంద్రవరం జీఎంసీ పోస్టులు తగ్గించాలని చెప్పలేదు సూపర్స్పెషాలిటీ సహా ఏ పోస్టులూ తగ్గించాలని లేదా పెంచాలని మేం ఎటువంటి ఆదేశాలూ ఇవ్వలేదు. భర్తీకి అనుమతి మాత్రమే ఇచ్చాం. ఎన్ని పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చినా అది పూర్తిగా వారి బాధ్యతే. జీఓ ప్రకారం ఎప్పటికప్పుడు పోస్టులు భర్తీ చేయాలి. పోస్టుల కుదింపునకు గల కారణాలపై రాజమహేంద్రవరం జీఎంసీ అధికారులు మాకు ఎటువంటి సమాచారమూ ఇవ్వలేదు. – డాక్టర్ రఘునందన్ గంభీర, డీఎంఈ నా జీవితంతో ఆడుకున్నారు నిరుద్యోగినైన నా జీవితంతో జీఎంసీ అధికారులు ఆడుకున్నారు. నా వయసు 48 ఏళ్లు. మూడోసారి విడుదల చేసిన తాజా నోటిఫికేషన్ నాటికి నా వయో పరిమితి ముగిసింది. రెండో నోటిఫికేషన్ సమయానికి వయసు ఉన్నా, అకారణంగా నోటిఫికేషన్ రద్దు చేశారు. నేను మంచి మార్కులతో ఐటీఐ ఎలక్ట్రికల్ ఉత్తీర్ణుడినయ్యాను. మెరిట్లోనూ ముందున్నాను. రెండో నోటిఫికేషన్ కొనసాగి ఉంటే, మెరిట్ ఆధారంగా నాకే ఉద్యోగం వచ్చేది. అధికారుల నిర్వాకంతో ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగానికి దూరమయ్యాను. నాకు భార్య, పిల్లలు ఉన్నారు. వారిని పోషించడానికి ఇంటింటికీ కేబుల్ వైర్లు వేస్తూ పూట గడుపుకొంటున్నాను. – పి.అశోక్, అభ్యర్థి, కాకినాడ -
భవితకు భద్రత బీమా..
● ఆరు పథకాలతో ఎన్నో ప్రయోజనాలు ● విస్తృతంగా అవగాహన కల్పిస్తున్న వైనం ● ప్రజలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న తపాలా శాఖ బాలాజీచెరువు (కాకినాడ సిటీ): తపాలా శాఖ అందించే బీమా పథకాలు అన్ని వర్గాల ప్రజలకు ధీమానిస్తున్నాయి. పీఎస్ఐ (పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్) పేరిట ప్రవేశపెట్టిన పలు రకాల పథకాలు ఎంతోమంది గ్రాడ్యుయేట్లకు ఆర్థిక ప్రయోజనాలు చేకూరుస్తున్నాయి. వీటిని మొదట్లో తపాలా శాఖ ఉద్యోగుల సంక్షేమ పథకాలుగా ప్రవేశపెట్టారు. తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు, భద్రతా సిబ్బందికి వర్తింపజేశారు. కాలక్రమేణా ఈ పథకాన్ని వైద్యులు, ఇంజినీర్లు, న్యాయవాదులు, సీఏ వంటి ప్రొఫెషనల్స్తో పాటు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో నమోదు చేసుకున్న కంపెనీల ఉద్యోగులకూ వర్తింపజేశారు. ఇటీవల గ్రాడ్యుయేట్లకు పీఎల్ఎస్ఐ సౌకర్యాన్ని విస్తరించారు. దీంతో ఈ పథకాల వైపు గ్రాడ్యుయేట్లు ఆసక్తి చూపుతున్నారు. యాంటిసిపేటెడ్ ఎండోమెంట్ అస్యూరెన్స్ దీనిని మనీ బ్యాక్ పాలసీ అంటారు. 19 నుంచి 25 ఏళ్ల మధ్య గలవారు ఈ పాలసీకి అర్హులు. బీమా రూ.20 వేల నుంచి రూ.50 లక్షల వరకు ఉంటుంది. పాలసీ కాలపరిమితి 15 నుంచి 20 ఏళ్లుగా నిర్ణయించారు. 15 ఏళ్ల పాలసీపై 6, 9, 12 ఏళ్లు పూర్తయితే 20 శాతం, మెచ్యూరిటీపై 40 శాతం బోనస్ లభిస్తుంది. 20 ఏళ్ల పాలసీపై 8, 12, 16 ఏళ్లు పూర్తయితే 20 శాతం, మెచ్యూరిటీపై 40 శాతం చొప్పున బోనస్ లభిస్తుంది. ఈ పథకంలో ఉన్న లబ్ధిదారులకు ఏడాదికి ఒకసారి రూ.వెయ్యికి రూ.48 చొప్పున బోనస్ లభిస్తుంది. హోల్ లైఫ్ అస్యూరెన్స్ ఈ పాలసీకి 19 నుంచి 55 ఏళ్ల మధ్య గలవారు అర్హులు. బీమా రూ.20 వేల నుంచి 50 లక్షల వరకు ఉంటుంది. ప్రీమియం చెల్లించే వయసును 55, 58, 60 ఏళ్లుగా ఎంచుకునే అవకాశం కల్పించారు. నాలుగేళ్ల తర్వాత రుణం తీసుకునే వెసులుబాటు ఉంది. మూడేళ్లు దాటితే పాలసీ సరెండర్ చేసుకోవచ్చు. ఐదేళ్ల లోపు సరెండర్ చేస్తే ఎలాంటి బోనస్లు వర్తించవు. ఏటా రూ.వెయ్యికి రూ.76 చొప్పున బోనస్ లభిస్తుంది. పాలసీదారునికి 80 ఏళ్లు దాటినా లేదా మరణించినా వారసులకు బీమా సొమ్ము బోనస్ ప్రయోజనాలను చెల్లిస్తారు. కన్వర్టబుల్ హోల్ లైవ్ అస్యూరెన్స్ ఈ పాలసీకి 19 నుంచి 50 ఏళ్ల వారు అర్హులు. రూ.20 వేల నుంచి రూ.50 లక్షల వరకు బీమా చెల్లింపులు చేయవచ్చు. మూడేళ్లు దాటితే ఎప్పుడైనా పాలసీ సరెండర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఐదేళ్ల లోపు సరెండర్ చేస్తే బోనస్ రాకపోగా కోతలు విధించే నిబంధనలు ఉన్నాయి. ఏటా రూ.వెయ్యికి రూ.76 చొప్పున బోనస్ లభిస్తుంది.. ఎండోమెంట్ అస్యూరెన్స్ ఈ పాలసీకి 18 నుంచి 50 ఏళ్ల వారు అర్హులు. కనీస బీమా రూ.20 వేలు కాగా గరిష్టంగా రూ.50 లక్షలు ఉంటుంది. పాలసీ తీసుకున్న మూడేళ్ల తర్వాత రుణ సదుపాయం, పాలసీ సరెండర్కు అవకాశం ఉం టుంది. ఐదేళ్లు దాటిన పాలసీల సరెండర్పై బోనస్లలో కోతలు తప్పవు. ఏటా రూ.వెయ్యికి రూ.52 చొప్పున బోనస్ లభిస్తుంది. జాయింట్ లైఫ్ అస్యూరెన్స్ ఈ పాలసీకి 21 నుంచి 45 ఏళ్ల వయసు గల దంపతులు అర్హులు. బీమా రూ.20 వేల నుంచి రూ.50 లక్షల వరకు ఉంటుంది. పాలసీ కాల పరిమితి ఐదు నుంచి 20 ఏళ్లు. పాలసీ తీసుకున్న మూడేళ్ల తర్వాత రుణ సదుపాయం ఉంటుంది. ఐదేళ్లు దాటిన పాలసీలు సరెండర్పై బోనస్లలో కోత ఉంటుంది. పాలసీ దారుడి మరణానంతరం ప్రయోజనాలు భాగస్వామి లేదా వారసులకు లభిస్తాయి. ఏటా రూ.వెయ్యికి రూ.52 చొప్పున బోనస్ లభిస్తుంది. సింగిల్ ప్రీమియంతో దంపతులు బీమా కవరేజి పొడిగించుకోవచ్చు. చిల్డ్రన్ పాలసీ.. పాలసీదారుల పిల్లల కోసమే ఈ పథకాన్ని తీసుకువచ్చారు. గరిష్టంగా ఇద్దరు పిల్లలకు బీమా చేసుకోవచ్చు. పిల్లల వయసు ఐదు నుంచి 20 ఏళ్ల లోపు ఉండాలి. పిల్లలకు గరిష్టంగా రూ.3 లక్షలు లేదా పాలసీదారు వయసు ప్రకారం బీమా తీసుకోవచ్చు. పాలసీదారు ( పిల్లల తండ్రి) వయసు 40 ఏళ్లు దాటి ఉండకూడదు. పాలసీదారు చనిపోతే పిల్లలపై తీసుకున్న బీమాకు ప్రీమియం చెల్లించనక్కర్లేదు. కాల పరిమితి తీరాక బీమా సొమ్ము బోనస్లు వర్తిస్తాయి. రుణ సదుపాయం సరెండర్ సౌకర్యాలు ఈ స్కీమ్లో ఉండవు. ప్రీమియం తల్లిదండ్రులు చెల్లించాల్సి ఉంటుంది. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి. వీరికి ఎలాంటి వైద్య పరీక్షలు నిర్వహించరు. ఎండోమెంట్ పాలసీ ప్రకారం బోనస్లు వర్తిస్తాయి. దరఖాస్తు ఇలా పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకునేవారు కావాల్సిన పత్రాలను విధిగా సంబంధిత అధికారులకు సమర్పించాలి. గ్రాడ్యుయేట్, పదో తరగతి, డిగ్రీ సర్టిఫికెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. పాలసీని బట్టి వివిధ వైద్య పరీక్షలు ఉంటాయి. స్మార్ట్ ఫోన్ వినియోగదారులు పోస్ట్ ఇన్ఫో యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా సమీప పోస్ట్ ఆఫీస్ను సంప్రదించి పథకంలో భాగస్వాములు కావచ్చు. -
గోదావరిలో పడి వృద్ధుడి మృతి
మామిడికుదురు: పెదపట్నంలంక గ్రామంలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. స్థానిక గెడ్డంవారి పేటకు చెందిన గెడ్డం సంజీవరావు (65) స్థానిక గోదావరి వద్దకు బహిర్భూమికి వెళ్లి మృతి చెందాడు. సంజీవరావు కుమారుడు రాజారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నగరం ఎస్సై ఎ.చైతన్యకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంటి నుంచి వెళ్లిన సంజీవరావు కనిపించక పోవడంతో అతని కోసం గాలించగా గోదావరిలో మృతదేహం లభ్యమైందన్నారు. మృతుడు సంజీవరావుకు భార్య గవరమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. సంజీవరావు మృతితో కుటుంబ సభ్యులు తీవ్రంగా విలపించారు. -
కోట నృత్య కళాకారులకు గిన్నిస్లో చోటు
సామర్లకోట: స్థానిక చిన్నారి నృత్య కళాకారులు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించారు. హైదరాబాద్కు చెందిన భారత్ ఆర్ట్ ఆకాడమీ ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియంలో ఏడు వేల నృత్య కళాకారులతో కూచిపూడి కళా వైభవాన్ని నిర్వహించి ఈ రికార్డు సాధించారు. ఆ బృందంలో సామర్లకోటకు చెందిన 30 మంది చిన్నారులు పాల్గొన్నారు. నాట్యాచార్యుడు బేత సత్యనారాయణ వద్ద వారు నృత్యాన్ని అభ్యసించారు. శనివారం సాయంత్రం హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ మంత్రి, ప్రముఖుల సమక్షంలో వారికి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్ుడ్స ప్రతినిధులు సర్టిఫికెట్లు అందుకున్నారు. ఆదివారం పట్టణ ప్రముఖులు ఆ చిన్నారులను అభినందించారు. -
నకిలీ వే బిల్లులతో ఇసుక తరలింపు
● రెండు లారీల సీజ్ తాళ్లపూడి: మండలం ప్రక్కిలంకలో ఆదివారం తెల్లవారుజామున జిల్లా గనులు, భూగర్భశాఖ, టాస్క్ఫోర్స్ సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు చేసి అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీలను సీజ్ చేశాయి. ఇసుక రీచ్ ఏజెన్సీలు నకిలీ వే బిల్లులతో ఇసుక తరలిస్తున్నట్టు తేలితే ఆ ఏజెన్సీని రద్దు చేసి, చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని మైనింగ్ ఏడీ డి.ఫణిభూషణ్రెడ్డి హెచ్చరించారు. ఈ తనిఖీల్లో ఇసుకను తరలిస్తున్న ఏపీ 39 టీక్యూ 0007, ఏపీ 37 టీఈ 6979 నంబర్లు ఉన్న రెండు వాహనాలను తనిఖీ చేసి వే బిల్లులను స్కాన్ చేశారు. ఏపీఎస్ఎంఎస్ పోర్టల్లో ఎటువంటి డిస్పాచ్ వివరాలు లేవని గుర్తించి బిల్లులు నకిలీవని గుర్తించి రెండు వాహనాలను స్వాధీనం చేసుకుని స్థానిక పోలీస్ స్టేషన్కు అప్పగించారు. అలాగే ప్రక్కిలంక–1 డీసిల్టేషన్ రీచ్లో ఇసుక రవాణాకు ఏజెన్సీగా ఎంపికై న ‘ది గణేష్ బోట్స్మెన్ – శాండ్ వర్కర్స్ కో–ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్’ సంస్థ నకిలీ ఇసుక వే బిల్లులు జారీ చేసినట్లు గుర్తించి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఎస్సై రామకృష్ణకు సూచించారు. అనంతరం సొసైటీకి కేటాయించిన శాండ్ సప్లై పాయింట్ లాగిన్ ఐడీని ఏపీఎస్ఎంఎస్ పోర్టల్లో బ్లాక్ చేశారు. ఈ దాడుల్లో జిల్లా మైనింగ్ సర్వేయర్ పట్నాల శ్రీనివాస్, జిల్లా టాస్క్ ఫోర్స్ ఎస్సై కె.ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
కన్నుల పండువగా త్యాగరాజ ఆరాధనోత్సవం
500 మంది కళాకారులతో పంచరత్న సేవ బోట్క్లబ్ (కాకినాడ సిటీ): త్యాగరాజ స్వామి పంచరత్న కీర్తనలతో కాకినాడ నగరం పులకించిపోయింది. అంతర్జాతీయ స్థాయిలో పేరున్న సంగీత కళాకారుల తమ గాత్రం, వాద్య పరికరాలతో అలరించారు. దాదాపు 500 మందికి పైగా కళాకారులు సంప్రదాయ వస్త్రధారణలో చేసిన ఈ అద్భుత ప్రదర్శన నగర ప్రజలను సుస్వరానంద సాగరంలో ఓలలాడించింది. సంగీత, నృత్య, నాటక రంగాల్లో వందేళ్లకు పైగా విశిష్ట సేవలందిస్తున్న సరస్వతీ గానసభ 122 వసంతాల మహోజ్వల ప్రస్థానాన్ని పురస్కరించుకొని త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాన్ని ఆదివారం రాత్రి వేడుకగా నిర్వహించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, చైన్నె తదితర ప్రాంతాల నుంచి 500 మందికి పైగా లబ్ధప్రతిష్టులైన కళాకారులు పంచరత్న కీర్తనలను రాగయుక్తంగా ఆలపించారు. గాత్రం, వయోలిన్, వీణ, వేణునాదం, మృదంగం, ఘటం, కంజీర, మోర్సింగ్ వంటి వాద్యాలతో కళాకారులు అద్భుతమైన సహకారం అందించారు. ప్రఖ్యాత మృదంగ విద్వాంసుడు ఎల్లా వెంకటేశ్వరరావు శిష్య బృందం కచేరీ ఆహూతులను ఎంతో ఆనంద పారవశ్యంలో ముంచెత్తింది. పంచరత్న సేవను ప్రారంభించిన ప్రవచన చక్రవర్తి చాగంటి కోటేశ్వరరావు.. త్యాగరాజ స్వామిపై చేసిన ప్రవచనం విశేషంగా ఆకట్టుకుంది. రాష్ట్రంలోనే తొలిసారిగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 500 మంది కళాకారులు ఒకే వేదికపై ఇటువంటి అద్భుత ప్రదర్శన ఇవ్వడం ఇదే తొలిసారి అని సరస్వతీ గాన సభ గౌరవాధ్యక్షురాలు పెద్దాడ సూర్యకుమారి తెలిపారు. సరస్వతీ గానసభ జీవితకాల చైర్మన్ కొమిరెడ్డి శ్రీరామ నరసింగరావు, అధ్యక్షుడు డాక్టర్ ముళ్లపూడి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు లక్కరాజు సత్యనారాయణ, కార్యదర్శి పేపకాయల రామకృష్ణ, సహాయ కార్యదర్శి చెరుకువాడ సత్యనారాయణ ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
ఇదేం శిక్షణ బాబూ!
● మెషీన్ల పంపిణీ ఏదీ? ● 8 నెలలుగా ఎదురుచూపులు ● ఉమ్మడి జిల్లాలో 11,014 మందికి మొండిచేయి కొత్తపేట: మహిళల స్వయం ఉపాధి కల్పనలో భాగంగా చంద్రబాబు ప్రభుత్వం మహిళలకు ఉచితంగా కుట్టు శిక్షణ ఇచ్చింది. శిక్షణ అనంతరం ఇవ్వాల్సిన ఉచిత కుట్టు మెషీన్లను మాత్రం ఇవ్వలేదు. అసలు ఇస్తారా? ఇవ్వరా? అంటూ మహిళలు ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ ఆధ్వర్యంలో ఈ ఏడాది మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి నుంచి ఉచిత కుట్టు శిక్షణ ప్రారంభించారు. వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా వెనుకబడిన కులాల వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. బీసీ, ఈడబ్ల్యూఎస్ శాఖల ద్వారా మండల కేంద్రాల్లో శిక్షణ ఇచ్చారు. ఎంపీడీవోలు ఈ కేంద్రాల్లో వసతులను పర్యవేక్షించారు. మూడు నెలల చొప్పున దశల వారీగా అన్ని మండలాల్లో శిక్షణ పూర్తి చేశారు కానీ. శిక్షణ పొందిన మహిళలకు ఇవ్వాల్సిన కుట్టు మెషీన్లను ఆరేడు నెలలు కావస్తున్నా ప్రభుత్వం ఇవ్వలేదు. హాజరు బాగుంటేనే మెషీన్ మహిళలకు ఉచిత కుట్టు మెషీన్ల పంపిణీ పథకానికి ఆయా గ్రామ సచివాలయాల ద్వారా మూడు వేలకుపైగా దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తుదారులు 3 నెలల పాటు కుట్టు శిక్షణ పొందితేనే ధ్రువీకరణ పత్రంతో పాటు, ఉచిత కుట్టు మెషీన్ అందిస్తామని చంద్రబాబు ప్రభుత్వం మెలిక పెట్టింది. ప్రజా ప్రతినిధుల సిఫారసుల నేపథ్యంలో మహిళలకు ఈ శిక్షణ ఇచ్చేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఎంపికై న వారి హాజరు 75 శాతం కచ్చితంగా ఉండాలనడంతో 445 మంది మాత్రమే ఉచిత కుట్టు మెషీన్ పొందేందుకు అర్హత సాధించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇంతవరకు ఏమీ లేదు ఉచిత కుట్టు శిక్షణకు మూడు నెలల పాటు హాజరై, 75 శాతం హాజరు పొంది అర్హత సాధించి 6, 7 నెలలు గడుస్తున్నా ధ్రువీకరణ పత్రాలు, ఉచిత కుట్టు మెషీన్ల పంపిణీపై ప్రభుత్వం నేటి వరకూ ఎటువంటి స్పందనా లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. శిక్షణ పూర్తయి నెలలు గడుస్తున్నా కుట్టు యంత్రాలు ఆందకపోవడంతో రోజూ అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఎవరూ స్పందించడం లేదు. ఉచిత కుట్టు మెషీన్లతో పాటు నేరుగా దర్జీ దుకాణాల ఏర్పాటుకు అవసరమైన బ్యాంక్ రుణాలు ఇస్తామని శిక్షణ సమయంలో అధికారులు భరోసా ఇచ్చారు. ఈ ఏడాది మార్చిలో బీసీ, ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ల ద్వారా దరఖాస్తు చేసుకున్న స్వయం ఊపాధి సోపానం రుణాల పైనా చంద్రబాబు సర్కారు నేటీకీ ఏ విధమైన ప్రకటన చేయడం లేదని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేటి పాలకులు నాడు ఎన్నికల్లో అన్ని వర్గాలను ముఖ్యంగా మహిళాలోకాన్ని ఉద్దరిస్తామని హామీ ఇచ్చినా ఇంతవరకు చేసిందేమీ లేదని మహిళలు పెదవి విరుస్తున్నారు. కుట్టు మెషీన్లకు అర్హత పొందిన లబ్ధిదారుల వివరాలు ఇలా.. జిల్లా శిక్షణకు వచ్చిన శిక్షణ దరఖాస్తులు పొందినవారు కోనసీమ 21,908 3,190 తూర్పు గోదావరి 12,118 2,904 కాకినాడ 27,722 4,920 మొత్తం 61,718 11,014 -
అగ్ని ప్రమాదంలో తాటాకిల్లు దగ్ధం
● రూ.4.5 లక్షల ఆస్తి నష్టం కడియం: మండలంలోని కడియపులంక పంచాయతీ పరిధిలోని దోసాలమ్మకాలనీలో తెల్లవారు జామున జరిగిన ప్రమాదంలో ఎల్లంశెట్టి సముద్రుడుకు చెందిన తాటాకిల్లు దగ్ధమైంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి, ఇంటిని చుట్టుముట్టడంతో ఇల్లు, అందులోని వస్తువులు పూర్తిగా కాలిపోయాయని బాధితులు తెలిపారు. ఈ ప్రమాదంలో రూ.4.5 లక్షల విలువైన ఆస్తి నష్టం సంభవించిందని వారు తెలిపారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అగ్నిమాపక శకటం అక్కడికి చేరుకుని మంటలు పక్క ఇళ్లకు వ్యాపించకుండా సిబ్బంది ఆర్పారు. బాధితులను ఆదివారం పలువురు పరామర్శించి సాయం అందజేశారు. కడియపులంక ఉప సర్పంచ్ పాటంశెట్టి రాంజీ రూ.10వేలు, ఏపీఐఐసీ సభ్యుడు మార్గాని సత్యనారాయణ నగదు సాయం అందజేశారు. అలాగే తహసీల్దార్ ఆదేశాల మేరకు 25 కిలోల బియ్యం, నిత్యావసర వస్తువులను వీఆర్వో జ్యోతి బాధితులకు ఇచ్చారు. కష్టకాలంలో ఆపన్నహస్తంకరప: బాల్య స్నేహితునికి పూర్వ విద్యార్థులు అండగా నిలిచి ఆపన్నహస్తం అందించారు. స్థానిక నక్కా సూర్యనారాయణమూర్తి జెడ్పీ ఉన్నత పాఠశాలలో 1990–91 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు ఆ బ్యాచ్లోని పెదపూడి మండలం కాండ్రేగుల గ్రామానికి చెందిన బత్తుల వీరవెంకట సత్యనారాయణ చిన్న కుమార్తె కిడ్నీ డయాలసిస్ కోసం ఆర్థిక సాయం చేశారు. బాల్య స్నేహితుని కుమార్తె అనారోగ్యం సమాచారాన్ని తెలుసుకున్న ఆ బ్యాచ్ విద్యార్థులు పెద్దిరెడ్డి శ్రీరామకృష్ణ, కూనపరెడ్డి వీర్రాజు తమతో చదువుకున్న సహచరులతో చర్చించి రూ.3,02,116 సేకరించారు. వైఎస్సార్ సీపీ, టీడీపీ, జనసేన నాయకులు పెంకే సత్తిబాబు, దేవు వెంకటేశ్వరరావు, పురుషోత్తమ శ్రీనివాస్ తమ ద్వారా సేకరించిన రూ.56 వేలు వెరసి రూ.3,58,216 ఆదివారం కరప హైస్కూలులో తమ స్నేహితుడు, కుమార్తెకు అందజేశారు. అవసరమైతే మరింత సాయం అందిస్తామని వారు హామీ ఇచ్చారు. కోడి పందేలు ఆడుతున్న ముగ్గురి అరెస్టు జగ్గంపేట: మండలంలోని గొల్లలగుంట గ్రామ శివారులో రహస్యంగా నిర్వహిస్తున్న కోడి పందేల శిబిరంపై ఎస్సై రఘునాథరావు ఆదివారం దాడి చేశారు. ఈ దాడిలో కోడి పందేలు ఆడుతున్న ముగ్గురిని అరెస్టు చేసి వారి నుంచి రూ.5.6 వేలు, వీటితో పాటు 2 పందెం కోళ్లు, కత్తులను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్సై తెలిపారు. మండలంలో జూద క్రీడలు ఎక్కడ నిర్వహించినట్టు కనిపించినా, తెలిసినా 94949 33233కి నంబర్కు కానీ, 100కు కానీ, 112 నంబర్కు కాల్ చేసి కానీ ఫిర్యాదు చేయాలన్నారు. ప్రజల సహకారంతోనే జూదాలు నిరోధించగలమని తెలిపారు. -
రత్నగిరిపై రద్దీ
అన్నవరం: రత్నగిరిపై ఆదివారం కూడా భక్తుల రద్దీ కొనసాగింది. సుమారు 25 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించుకున్నారు. స్వామివారి ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. సత్యదేవుని వ్రతాలు 2 వేలు నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.25 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. నిత్యాన్నదాన పథకంలో సుమారు 5 వేల మంది భక్తులు సత్యదేవుని అన్న ప్రసాదం స్వీకరించారు. ఆలయ ప్రాకారంలో సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లను టేకు రథంపై ఉదయం ఘనంగా ఊరేగించారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్ కొబ్బరికాయ కొట్టి రథ సేవను ప్రారంభించారు. 1న భారీ త్రిముఖ సాయి విగ్రహావిష్కరణ తుని రూరల్: మండలంలోని మరువాడ శివారున నిర్మించిన 120 అడుగుల త్రిముఖ సాయిబాబా విగ్రహావిష్కరణకు అంకురార్పణ జరిగింది. భక్తులు నిర్వహిస్తున్న సాయి నామ స్మరణలు, భజనలు (24/7) ఆదివారం ప్రారంభమయ్యాయి. కాకినాడకు చెందిన గురువు అంబూరి సాంబశివరావు పర్యవేక్షణలో సాయిదాసిని సత్యవేణి ఆధ్వర్యాన మందిరం, 120 అడుగుల త్రిముఖ సాయి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే నెల 1న ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రం నలుమూల నుంచీ ఇప్పటికే సాయిబాబా భక్తుల రాక ఆరంభమైంది. వేలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విగ్రహాన్ని తుని – నర్సీపట్నం రోడ్డు పై నుంచి స్పష్టంగా చూడవచ్చని సాయి భక్తులు తెలిపారు. కొన్నేళ్లుగా ఇక్కడ సాయిబాబా మందిరాన్ని నిర్వహిస్తూండగా.. ఇప్పుడు స్థూపం నిర్మించి, దానిపై భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఇదే అత్యంత ఎత్తయిన త్రిముఖ సాయిబాబా విగ్రహమని చెప్పారు. లోవలో ఆన్లైన్ సేవలు ప్రారంభం తుని రూరల్: తలుపులమ్మ అమ్మవారి లోవ దేవ స్థానంలో ఆదివారం నుంచి ఆన్లైన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. aptemples.ap.gov.in వెబ్సైట్లో లాగిన్ అయి ఆన్లైన్ సేవలు పొందవచ్చని అధికారులు తెలిపారు. ప్రతి శుక్రవారం, పౌర్ణమి నాడు నిర్వహించే మహాచండీ హోమం, అమ్మవారి తిరు నక్షత్రం స్వాతి సందర్భంగా ని ర్వహించే పంచామృతాభిషేకాలతో పాటు ఊయ ల సేవ, వాహన పూజలు తదితర నిత్య సేవలకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని వివరించారు. ఆన్లైన్లో నమోదు చేసుకుని వచ్చే భక్తుల కోసం ప్రత్యేక క్యూ ఏర్పాటు చేశామన్నారు. కాటేజీలు, వసతి గదులు సైతం ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. భక్తుల సౌలభ్యం కోసం క్యూఆర్ కోడ్ అందుబాటులో ఉంచామన్నారు. వేలాదిగా భక్తుల రాక తలుపులమ్మ అమ్మవారిని ఆదివారం వివిధ జిల్లాల నుంచి వచ్చిన 8 వేల మంది భక్తులు క్యూలో దర్శించుకున్నారని డిప్యూటీ కమిషనర్, లోవ దేవస్థానం ఈఓ పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల ద్వారా రూ.61775, పూజా టికెట్లకు రూ.91960, కేశఖండన శాలకు రూ.3,080, వాహన పూజలకు రూ.4,750, వసతి గదులు, కాటేజీల అద్దెలు రూ.36,020, విరాళాలు రూ.33,867, కలిపి మొత్తం రూ.2,31,452 ఆదాయం సమకూరిందని వివరించారు. -
మహిళల ఆశలు నీరుగార్చారు
చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజా సంక్షేమ పట్ల ముఖ్యంగా మహిళా పథకాలు అమలు చేయడంలో చిత్తశుద్ధి లేదు. సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన ఆడబిడ్డ నిధి పథకం కింద నెలకు రూ.1,500 ఇస్తామన్న హామీ ఏడాదిన్నర అవుతున్నా అమలు కాలేదు. అనేక కొర్రీలతో కుట్టు శిక్షణ పొందిన మహిళలకు నేటికీ మెషీన్లు ఇవ్వకపోడం దారుణం. వారు ఈ శిక్షణ ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకోగలం అని ఆశించారు. ఆలస్యం కావడంతో వారు వేరే ఉపాధి మార్గాలను వెతుక్కోవలసిన పరిస్థితి ఏర్పడింది. మహిళల ఆశలను ప్రభుత్వం నీరుగార్చింది. – గూడపాటి రమాదేవి, జెడ్పీటీసీ సభ్యురాలు, కొత్తపేట మహిళల స్వయం ఉపాధిలో భాగంగా కుట్టు మెషీన్ల ద్వారా జీవనోపాధి పొందుతూ, కుటుంబ ఆర్థికాభివృద్ధికి దోహదపడేలా చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అందుకు సంక్షేమ పథకాల అమలులో భాగంగా ఉచిత కుట్టు శిక్షణ ఇచ్చాం. అయితే ప్రభుత్వంలో కొన్ని బిల్లులు పండింగ్ ఉన్నాయి. అవి క్లియర్ అయ్యాక మెషీన్లను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అర్హులైన అందరికీ మెషీన్లు ఇస్తాం. – ఎ.శ్రీనివాసరావు, ఈడీ, బీసీ కార్పొరేషన్, కాకినాడ -
విశ్వబ్రాహ్మణులను చట్ట సభలకు పంపాలి
● సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతరావు అమలాపురం టౌన్: విశ్వ బ్రాహ్మణులకు ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవుల్లో ఏదో ఒకటి ఇచ్చి చట్ట సభలకు పంపించాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పావులూరి హనుమంతరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక దుడ్డివాని అగ్రహారంలోని విశ్వబ్రాహ్మణ కల్యాణ మండపంలో జిల్లా సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి హనుమంతరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ తమ వర్గానికి రాజకీయ పదవులు వచ్చినపుడే మనకు గుర్తింపు, హోదా వస్తాయని పేర్కొన్నారు. విద్యా, ఉద్యోగ, ఆర్థిక సామాజిక, రాజకీయ రంగాల్లో తమ వర్గం అభివృద్ధికి కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఆ దిశగానే కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. యువజన నాయకుడు ఆవుపాటి వేణుగోపాలరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఆ సామాజిక వర్గ పెద్దలు, అమలాపురం మున్సిపల్ కౌన్సిలర్ కట్టోజు సన్నయ్యదాసు, వరద సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హనుమంతరావు, ఆ వర్గం పెద్దలను సంఘీయులు గజమాలతో సత్కరించారు. అనంతరం వారంతా ఎమ్మెల్యే ఆనందరావు వద్దకు వెళ్లి తమ వర్గీయులకు రాజకీయ అవకాశాలు కల్పించాలని వినతి ప్రతాన్ని అందించారు. -
డూడూ బసవన్నా.. ఆదరణ ఏదన్నా!
ఫ వైభవాన్ని కోల్పోతున్న గంగిరెద్దులాట ఫ ఇతర వృత్తులకు మళ్లుతున్న కళాకారులు రాయవరం: అయ్యవారికి దండం పెట్టు.. అమ్మగారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దుల కళాకారులు గ్రామాల్లో సందడి చేస్తుంటారు. తలకు పాగా ధరించి, వివిధ రకాల దుస్తులను ధరించి, బూర ఊదుతూ గంగిరెద్దులను తీసుకు వస్తారు. అందంగా అలంకరించిన గంగిరెద్దును తీసుకుని ఇంటింటికీ వెళ్లి వారి వంశ ప్రతిష్టను కీర్తించే గంగిరెద్దుల వారికి గ్రామాల్లో గంగిరెద్దులాటకు రానురానూ ఆదరణ తగ్గుతోంది. సాధారణ రోజుల్లో గంగిరెద్దులను ఆడిస్తూ గ్రామాల్లో తిరిగినా సంక్రాంతి సమయంలోనే కళాకారులకు ఓ ప్రత్యేకత ఉంటుంది. హరిదాసులతో పాటు డూడూ బసవన్నల రాకతోనే సంక్రాంతి పండగకు పరిపూర్ణత వస్తుందని చెప్పవచ్చు. ధనుర్మాసం ప్రారంభం నుంచి ఇళ్ల ముంగిట్లో ఎక్కడ చూసినా గంగిరెద్దులు దర్శనమిచ్చేవి. ఈ కళాకారులు ప్రతి ఇంటికి వచ్చి సన్నాయితో పాటలు పాడుతూ.. ఇంటి యజమానుల వంశాన్ని కీర్తిస్తూ.. బసవన్నను ఆడిస్తూ యజమానులు ఇచ్చే కానుకలను స్వీకరిస్తారు. నిర్వాహకులు సన్నాయితో పాడే పాటలకు అనుగుణంగా గంగిరెద్దుతో నాట్యం, విన్యాసాలు చేయిస్తారు. గ్రామాల్లో చిన్న పిల్లలు గంగిరెద్దుల వెంట తిరుగుతూ సెలవు దినాలను ఆనందోత్సాహాలతో గడిపేవారు. ఉమ్మడి జిల్లాలో 15 వేల మంది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 15 వేల మంది గంగిరెద్దుల సామాజిక వర్గం వారు ఉన్నారు. వీరు 25 సంఘాలను ఏర్పాటు చేసుకున్నారు. అమలాపురం, కొత్తపేట, రాయవరం, పసలపూడి, రాజమహేంద్రవరం, వెదురుమూడి, ముక్కామల, భీమనపల్లి, మురమళ్ల, నీలపల్లి, కాకినాడ, అనపర్తి, ద్వారపూడి తదితర ప్రాంతాల్లో అధిక సంఖ్యలో గంగిరెడ్ల సామాజిక వర్గం వారు జీవిస్తున్నారు. ఈ వృత్తిలో ఆదరణ తగ్గిపోవడంతో ఇతర వృత్తుల్లోకి మరలిపోతున్నారు. కొందరు ఇంకా పక్కా ఇళ్లకు కూడా నోచుకోలేక పోతున్నారు. ఇప్పటికీ మార్కెట్ షెడ్లలో నివాసం ఉంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికీ కొందరు గంగిరెద్దులను తీసుకుని సంక్రాంతికి జిల్లాలోని కందికుప్ప, అమలాపురం, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాలకు తరలివెళ్లారు. తగ్గుతున్న ఆదరణ గంగిరెద్దులకు కాలక్రమంలో ఆదరణ తగ్గుతుంది. ఇదే విషయాన్ని గంగిరెద్దుల కళాకారులు చెబుతున్నారు. ప్రజల్లో ఆదరణ తగ్గడానికి ఇంటింటికి ఉన్న టీవీలు కూడా ఒక కారణమని అంటున్నారు. టీవీలతోనే పిల్లలు, పెద్దలు కాలక్షేపం చేస్తూ గంగిరెద్దుల ఆటను తనివితీరా ఆస్వాదించ లేకపోతున్నారని, ఆట చూడడానికి కూడా తీరిక ఉండడం లేదని కళాకారులు అంటున్నారు. గతంలో గంగిరెద్దుల ఆటలు జనరంజకంగా ఉండేవి. గంగిరెద్దుల ఆటను చూసిన అనంతరం ఇంటి యజమానుల నుంచి కానుకలు స్వీకరించే ముందు వారిని ఆశీర్వదించేవారు. -
ఉపాధికి వెళ్లి గుండెపోటుతో మృతి
అమలాపురం రూరల్: అమలాపురం మండలం వన్నెచింతలపూడికి చెందిన ఓ యువకుడు ఉపాధి నిమిత్తం దేశం కాని దేశం వెళ్లి గుండెపోటుతో మృతి చెందాడు. కేసీఎం అధికారుల చొరవతో అతని మృతదేహాన్ని శనివారం స్వగ్రామానికి తీసుకు వచ్చారు. అధికారుల వివరాల ప్రకారం.. వన్నెచింతలపూడి గ్రామానికి చెందిన ముంగండ రవితేజ (33) ఉపాధి నిమిత్తం ఈ ఏడాది సెప్టెంబర్ 11న ఖతార్ దేశానికి వెళ్లి హౌస్ కేరింగ్ వర్క్ చేస్తున్నాడు. అయితే ఈ నెల 16న రాత్రి అక్కడ గుండెపోటుతో మరణించాడు. దీనిపై మృతుని కుటుంబ సభ్యులు ఈ నెల 17న కలెక్టర్ మహేష్ కుమార్ను సంప్రదించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు నోడల్ అధికారి కె.మాధవి, సమన్వయ అధికారి గోళ్ల రమేష్, సిబ్బంది ఎంఎం సఫియా, కడియాల సత్తిబాబు, బద్రి దుర్గా అమ్మాజీలు బాధిత కుటుంబాన్ని కలుసుకుని వివరాలు సేకరించారు. అనంతరం భారత రాయబార కార్యాలయంతో పాటు ఖతార్లోని ప్రతినిధులు శ్రీనివాస్, రాజ్కుమార్, విజయ్ చార్లీ, సోలామాన్, రమణ, శశిలతో నిరంతరం సమన్వయం జరిపారు. అనంతరం మృతదేహాన్ని వన్నెచింతలపూడికి శనివారం చేర్చారు. వ్యక్తి ఆత్మహత్య సామర్లకోట: ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సామర్లకోట సీఐ ఎ.కృష్ణభగవాన్ కథనం ప్రకారం.. స్థానిక గాంధీనగర్కు చెందిన సిరికి రవికుమార్ (49) లారీ స్టాండ్ సమీపంలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి ఆర్థిక ఇబ్బందులు కారణమని పోలీసులు భావిస్తున్నారు. వీఆర్వో సమాచారం మేరకు సీఐ కృష్ణభగవాన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పదోన్నతుల్లో సీనియారిటీకే ప్రాధాన్యమివ్వాలి
● విద్యుత్ ఓసీ ఉద్యోగుల డిమాండ్ ● కాకినాడలో సంఘ వార్షికోత్సవం కాకినాడ రూరల్: పదోన్నతుల్లో సీనియారిటీకే ప్రాధాన్యత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఓసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. కాకినాడ ఎన్ఎఫ్సీఎల్ రోడ్డలోని జి.కన్వెన్షన్ హాల్లో శనివారం రాష్ట్ర స్థాయిలో సంఘ 17వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు దూళిపాల వెంకట రంగారావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో 2026 సంవత్సర కేలండర్, డైరీలను ఆవిష్కరించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, ఎమ్మెల్యేలు పంతం నానాజీ, వరుపుల సత్యప్రభ, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి హాజరయ్యారు. సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోట శ్రీనివాస్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓసీల ప్రయోజనాల కోసం పోరాటానికి విద్యుత్ సంస్థలో విద్యుత్ ఓసీ ఉద్యోగుల సంక్షేమ సంఘాన్ని ప్రారంభించామన్నారు. ముఖ్యంగా ఓసీలకు ప్రతిభ ఉన్నా ఉద్యోగాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్ల వలన అన్యాయం జరుగుతోందన్నారు. పదోన్నతుల్లో రిజర్వేషన్ల కంటే సీనియారిటీకే ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఉద్యోగుల పీఆర్సీ, న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలన్నారు. కార్యక్రమంలో ఆల్ ఇండియా ఈక్వాలిటీ ఫారం నేషనల్ ప్రెసిడెంట్ ఎం.నాగరాజు, ఓసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకర్ రెడ్డి, సౌత్జోన్ ఏఐఈఎఫ్ వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ నజీర్ డల్, ఈపీడీసీఎల్ కంపెనీ ప్రెసిడెంట్ అప్పలరాజు, కంపెనీ సెక్రటరీ త్వరగా రామకృష్ణ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల ప్రాంతీయ అధ్యక్షుడు కేవీవీ రమణ, కాకినాడ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు డి.సురేష్బాబు, జ్యోతుల వీరబాబు, బొజ్జా వాసు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
బస్సులు పెంచకుండా ఉచిత ప్రయాణమా!
● సీ్త్రశక్తి పథకంతో తీవ్ర ఇబ్బందులు ● ఆర్టీసీ సిబ్బందికి పెరిగిన పనిభారం గోకవరం: బస్సులను పెంచకుండా సీ్త్రశక్తి పథకం అమలు చేయడంతో ప్రయాణికులకు, ఆర్టీసీ సిబ్బందికి తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని యునైటెడ్ వర్కర్స్ అసోసియేషన్ నాయకులు అన్నారు. ఈ మేరకు శనివారం గోకవరం ఆర్టీసీ డిపో ఎదుట రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గేటు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏఎస్ నారాయణ, డిపో అధ్యక్షుడు జీఎస్ రావు, ప్రధాన కార్యదర్శి కేఎస్పీ రావు మాట్లాడుతూ ఉచిత బస్సు పథకంతో సిబ్బందిపై పని భారం పెరిగిపోయిందని, కండక్టర్లకు పొరపాట్లు ఎక్కువగా జరుగుతున్నాయని, వీటి వల్ల వారి ఉద్యోగ భద్రత ముప్పు వాటిల్లుతుందన్నారు. బస్సుల్లో రెండు రకాల టిక్కెట్లు ఇచ్చే విధానాన్ని తీసి వేసి, డబ్బులు ఇచ్చిన వారికి మాత్రమే టిక్కెట్లు ఇచ్చేలా నిబంధన మార్చాలని డిమాండ్ చేశారు. మోటారు వాహనాల చట్టం ప్రకారం బస్సులకు డోర్లు ఏర్పాటు చేసి బస్సుల్లో 70 మంది ప్రయాణికులకు మాత్రమే అనుమతించేలా చూడాలన్నారు. తక్షణమే బస్సుల సంఖ్యను పెంచాలని, బస్సులకు హైడ్రాలిక్ డోర్లు ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించాలన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు ఎంఎన్వీఎస్ నారాయణ, జిల్లా కార్యదర్శి ఎన్ఎన్ రావు, జీఎస్రావు, సెక్రటరీ రమణ, ఎంఎం కృష్ణ, సూర్యచంద్రరావు, దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. -
వృత్తిని వదులుకోవాల్సిన పరిస్థితి
గతంలో మాదిరిగా గంగిరెద్దుల ప్రదర్శనకు ఆదరణ అంతగా ఉండడం లేదు. కుల వృత్తిని వీడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వం గంగిరెద్దుల సామాజిక వర్గాన్ని గుర్తించి ఆర్థికంగా ఆదుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే ఈ వృత్తిని కొనసాగించగలం. –బొడ్డు రాజు, పసలపూడి, రాయవరం మండలం పండగ సమయంలోనే.. ఒకప్పుడు అన్ని కాలాల్లో గంగిరెద్దుల ఆటను ప్రతి ఒక్కరూ ఆదరించేవారు. ఇప్పుడు కేవలం సంక్రాంతి సమయంలోనే ఆట ఉంటుంది. ఆదరణ తగ్గుతుండడంతో యువత ఈ వృత్తిని స్వీకరించడం లేదు. ప్లాస్టిక్ సామాన్లు అమ్ముకునేందుకు, కూలి పనులకు వెళ్లిపోతున్నారు. –బొడ్డు ప్రకాష్, కందరాడ, పిఠాపురం మండలం ఆర్థికంగా ఆదుకోవాలి గంగిరెడ్ల సామాజిక వర్గం అనాది నుంచి సంచార జాతి ఉంటుంంది. ఒక జిల్లా నుంచి వేరే జిల్లాకు వెళ్లి గంగిరెద్దులను ఆడించుకుని పోషణ పొందుతున్నాం. ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోకుంటే మా జీవితాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతాయి. –జానపాటి ఏసు, మాధవపట్నం, కాకినాడ రూరల్ ఎస్టీ జాబితాలో చేర్చాలి ఊరూరా తిరుగుతూ ఉండే సంచార జాతులమైన గంగిరెడ్ల సామాజిక వర్గాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలి. ఇప్పటికీ అధిక సంఖ్యలో ఉన్న గంగిరెడ్ల సామాజిక వర్గానికి కనీసం పక్కా ఇళ్లు లేవు. వృత్తి కూడు పెట్టకపోవడంతో చిన్న చిన్న సామాన్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాం. –బొమ్మన పరంజ్యోతి, అధ్యక్షుడు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గంగిరెడ్ల సంక్షేమ సంఘం -
హిందువులందరూ ఏకం కావాలి
కరప: భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకునేందుకు హిందువులందరకూ ఏకం కావాలని కాకినాడ గీతాశ్రమం స్వామీజీ దివ్యానంద సరస్వతి పిలుపునిచ్చారు. ఆర్ఎస్ఎస్ స్థాపించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న హిందూ సమ్మేళనం కార్యక్రమాల్లో భాగంగా శనివారం నీలయ్య తోటలోని ఒకలే అవుట్లో మండల సహ కన్వీనర్ కొక్కెరమట్ల రామకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ వ్యాప్తంగా 2.50 లక్షల హిందూ సమ్మేళనాలు నిర్వహించాలన్న ఆశయంలో ఇంత వరకూ 1.50 లక్షల సమ్మేళనాలు జరిగాయన్నారు. హిందూ ధర్మాన్ని దశ దిశలా వ్యాపింపజేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. యానాంఖండ పూర్వ కార్యనిర్వాహక్ రామారావు మాట్లాడుతూ హిందువులందరూ బంధువులేనన్న నినాదాన్ని ప్రజలకు తెలియజెప్పాలన్నారు. సమరసత సేవా ఫౌండేషన్ జిల్లా ధర్మ ప్రచారక్ పడాల రఘు, ఆధ్యాత్మికవేత్త చాగంటి సూరిబాబు, జిల్లా మహిళా సహ కన్వీనర్ వాసంశెట్టి సూర్యవతి, మండల మహిళా కన్వీనర్ పేకేటి లక్ష్మీకాంతం పాల్గొన్నారు. -
ఏపీఎన్జీవో జిల్లా కార్యవర్గం ఎన్నిక
కాకినాడ క్రైం: ఏపీఎన్జీవో జిల్లా కార్యవర్గ ఎన్నిక శనివారం ఏకగ్రీవమైంది. కాకినాడలోని ఏపీఎన్జీవో హోంలో శుక్రవారం నామినేషన్ల ప్రక్రియ జరిగింది. ఇందులో 17 స్థానాలకు గాను ఒక్కో నామినేషనే దాఖలు చేయడం వల్ల ఆయా స్థానాలన్నీ ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి, ఏలూరు జిల్లా ఏపీఎన్జీవో అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాసరావు, సహాయ ఎన్నికల అధికారి, సంఘ కార్యదర్శి ఎన్వీ రామారావు తెలిపారు. మూడేళ్ల పదవీ కాలానికి గాను కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా గుద్దటి రామ్మోహనరావు, కార్యదర్శిగా పాలపర్తి మూర్తిబాబు, కోశాఽధికారిగా యండమూరి పద్మ మీనాక్షి ఎన్నికయ్యారు. అసోసియేట్ ప్రెసిడెంట్గా ఎం.వెంకటేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్లుగా చంద్రరావు, ప్రసాద్, పాండురంగారావు, సత్యనారాయణ, జయకృష్ణ, భారతి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా రామకృష్ణ, జాయింట్ సెక్రటరీలుగా శ్రీనివాసరావు, వీరబాబు, చార్లెస్ పాల్, లోకమాన్య పరిమళ కుమార్, వెంకటరమణ, జయలక్ష్మి ఎన్నికై నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఎన్నికల పర్యవేక్షణాధికారిగా సంఘ రాష్ట్ర కార్యదర్శి ఎ.రంజిత్ కుమార్ నాయుడు వ్యవహరించారు. నూతన కార్యవర్గాన్ని స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పసుపులేటి శ్రీనివాస్, సంఘ మాజీ అధ్యక్షులు ఆచంట రామానాయుడు, బూరిగ ఆశీర్వాదం, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మాజీ కార్యదర్శి పేపకాయల వెంకటకృష్ణ అభినందించారు. శృంగార వల్లభస్వామి ఆలయానికి భక్తుల తాకిడి పెద్దాపురం (సామర్లకోట): తొలి తిరుపతిగా ప్రసిద్ధి చెందిన పెద్దాపురం మండలం తిరుపతి గ్రామంలోని శృంగార వల్లభ స్వామి ఆలయానికి శనివారం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. జిల్లా నలుమూలల నుంచీ వచ్చిన సుమారు 12 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. ప్రత్యేక దర్శనం టిక్కెట్ల ద్వారా రూ.1,20,860, అన్నదాన విరాళాలు రూ.61,519, కేశ ఖండన ద్వారా రూ.3 వేలు, తులాభారం ద్వారా రూ.300, లడ్డూ ప్రసాదాల విక్రయం ద్వారా రూ.19,035లతో కలిపి రూ.2,04,714 ఆదాయం వచ్చిందని చెప్పారు. సుమారు 3,200 మంది భక్తులు ఆలయంలో అన్న ప్రసాదం స్వీకరించారన్నారు. స్వామి వారికి ఆలయ అర్చకులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, నారాయణాచార్యులు పూజలు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మొయిలి కృష్ణమూర్తి, ట్రస్టు బోర్డు చైర్మన్ మొయిలి సంధ్య, దేవస్థానం సిబ్బంది, గ్రామ పెద్దలు భక్తులకు సేవలందించారు. బ్రిడ్జి నిర్మాణాలకు భూసేకరణ వేగవంతం బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలో రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబీ), రోడ్డు అండర్ బ్రిడ్జి (ఆర్యూబీబీ) నిర్మాణాలకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులను కలెక్టర్ షణ్మోహన్ ఆదేశించారు. కలెక్టరేట్లో శనివారం జేసీ అపూర్వ భరత్తో కలిసి రెవెన్యూ, రోడ్డు భవనాలు, రైల్వే అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పీఎం గతిశక్తి పథకం కింద రైల్వే లైన్ల మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా జిల్లాలో పరిధిలో వివిధ ప్రదేశాల్లో రైల్వే లైనులకు అవసరమైన ఆర్ఓబీ, ఆర్యూబీ నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రాథమిక దశలో వీటి నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియపై అధికారులు ప్రత్యేక దృష్టి సాధించాలన్నారు. ఇందుకు రెవెన్యూ, సర్వే, రోడ్డు భవనాల శాఖల అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించి, ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు, కాకినాడ ఆర్డీవో ఎస్.మల్లిబాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
పార్థుని సంస్కారం ప్రశంసనీయం
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): పార్థుని సంస్కారం ప్రశంసనీయమని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. ఆయన శనివారం హిందూ సమాజంలో 31వ రోజు విరాట పర్వ ప్రవచనం ముగించి, ఉద్యోగ పర్వంలోకి ప్రవేశించారు. పాండవులు తన వద్దనే అజ్ఞాతవాసం ముగించారని తెలుసుకున్న విరాటరాజు అనందభరితుడవుతాడు. తన కుమార్తె ఉత్తరను వివాహం చేసుకోవాలని అర్జునుడిని కోరతాడు. అర్జునుడు దానిని అంగీకరించక, ఉత్తరను కోడలిగా చేసుకుంటానని తన అభిప్రాయాన్ని వెల్లడిస్తాడు. ‘ఏడాది పాటు ఉత్తరకు నాట్యం నేర్పాను, ఆమె నన్ను ఆచార్యునిగా, తండ్రిగా భావించింది. ఇప్పుడు ఆమెను వివాహం చేసుకుంటే లోకం నా నడవడిని శంకిస్తుంది. ఆమెను కోడలిగా చేసుకుంటే నన్నుగానీ, నీ కుమార్తెను గానీ ఎవరూ శంకించరు. నేనులోకాపవాదుకు భయపడతాను’ అన్న అర్జునుని ఉత్తమ సంస్కారం మనకు ఆదర్శం కావాలని సామవేదం అన్నారు. ఉత్తరాభిమన్యుల వివాహంతో విరాట పర్వం ముగిసింది. సినిమాల్లో చూపినట్లు వివాహానికి ముందు ఉత్తరాభిమన్యులు యుగళగీతాలను పాడుకోలేదని ఆయన అన్నారు. నేడు సామవేదంకు బ్రహ్మజోస్యుల పురస్కారం ప్రముఖ స్వాతంత్య్ర పోరాట యోధుడు, గాంధేయవాది, సీతానగరం ఆశ్రమ వ్యవస్థాపకుడు డాక్టర్ బ్రహ్మజోస్యుల సుబ్రహ్మణ్యం స్మారక పురస్కారాన్ని సామవేదం షణ్ముఖశర్మ అందుకోనున్నారు. ఆదివారం ఉదయం 10.45 గంటలకు సీతానగరం కస్తూర్బా ఆశ్రమంలో సామవేదం పురస్కారాన్ని అందుకుంటారని భగవత విరించి టీవీ నారాయణరావు వేదికపై వివరాలను వెల్లడించారు. -
రామచంద్రపురాన్ని కాకినాడ జిల్లాలో కలపాలి
అమలాపురం రూరల్: రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని, ప్రజల సంకల్పాన్ని నీరుగార్చేలా కూటమి ప్రభుత్వ నిర్ణయాలు ఉంటున్నాయని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీ, రామచంద్రపురం నియోజకవర్గ అఖిలపక్ష జేఏసీ, పీడీఎస్యూ, ఏఐకేఎంఎస్, ఐఎఫ్టీయూ ప్రజా సంఘాలు శనివారం అమలాపురం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించాయి. సీపీఐ న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి చీకట్ల వెంకటేశ్వరరావు, రామచంద్రపురం నియోజకవర్గ అఖిలపక్ష జేఏసీ కన్వీనర్ మాగాపు అమ్మిరాజు, కోకన్వీనర్, పీడీఎస్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.సిద్ధూ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏఐకేఎంఎస్ నాయకుడు వెంటపల్లి భీమశంకరం, పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.కిరణ్కుమార్, బీఎస్పీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు మాతా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ అభివృద్ధి ముసుగులో జిల్లాల పునర్విభజన చేయడంతో ప్రజల మధ్య అనేక చీలికలు, అయోమయం, పరిపాలనా సమస్యలు ఏర్పడుతున్నాయన్నారు. భౌగోళికంగా, చారిత్రకంగా, పరిపాలనా పరంగా శతాబ్దాలుగా కాకినాడ జిల్లాతో అనుసంధానమైన రామచంద్రపురం నియోజకవర్గాన్ని, గోదావరి నదిని దాటి వెళ్లాల్సిన దూర ప్రాంతంతో అనుసంధానం చేయడం ప్రజలకు మేలు చేసే నిర్ణయం కాదని అన్నారు. ఈ నియోజకవర్గం నుంచి మంత్రి పదవి అందుకున్న కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ నోరు మెదపకపోవడం దారుణమన్నారు. అఖిలపక్ష జేఏసీ గౌరవ అధ్యక్షుడు దొమ్మలపాటి సత్యనారాయణ, ఐఎఫ్టీయూ నాయకులు చింతా రాజారెడ్డి, నాయకులు నాగరాజు, అలీ, కె.నవీన్, బుల్లి రాజు, పట్టాభి, చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. -
ఎదురీతే..
కరప మండలం జెడ్.భావారంలో మోంఽథా తుపాన్కు నీట మునిగిన పంట (ఫైల్) పాత పెద్దాపురంలో నీటిలో కుళ్లిపోయిన పంటను చూపుతున్న రైతులు (ఫైల్)● ఈ ఏడాదంతా రైతులకు కష్టాలే ● కలసిరాని కాలం ● చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం ● పెరిగిన పెట్టుబడులు సాక్షి ప్రతినిధి, కాకినాడ: పట్టెడన్నం పెట్టే రైతన్న ఈ ఏడాది కష్టాల కడలిలో ఎదురీదాడు. ఆరుగాలం పడిన రెక్కల కష్టం ప్రకృతి కన్నెర్రకు తోడు చంద్రబాబు సర్కార్ నిర్వాకంతో నీటి పాలైంది. రబీ సీజన్ ఒక రకంగా నష్టపోతే ఖరీఫ్ సీజన్లో ముందుచూపులేని ప్రణాళిక సాగులో జాప్యానికి కారణమై రైతులు గుండెలు బాదుకుంటున్నారు. అకాల వర్షాలు రైతులను నిండా ముంచేశాయి. చేతికొచ్చిన ధాన్యాన్ని కనీస మద్ధతు ధర దక్కిందా అంటే అదీ లేదు. ధాన్యం సేకరణ లక్ష్యాన్ని ప్రభుత్వం కుదించడం దళారీ వ్యవస్థకు గేట్లు తెరిచినట్లైంది. తేమ శాతం అనే కుంటి సాకులతో రైతులకు మద్దతు లేకుండా పోయింది. పోనీ రబీ సీజన్లో అయినా సంతోషంగా సాగు జరుగుతుందా అంటే అదీ కొరవడింది. మొత్తంగా చూస్తే ఈ ఏడాది (2025) రైతులకు కలిసి రాలేదు. ఎరువుల బ్లాక్ 2025 ప్రారంభంలో రబీని గంపెడాశతో స్వాగతించిన రైతులకు ప్రారంభంలోనే చంద్రబాబు ప్రభుత్వంలో కొందరు పెద్దలు ఎరువులను బ్లాక్ చేసి చుక్కలు చూపించారు. దీంతో ప్రతి ఎకరాకు రూ.500 తక్కువ కాకుండా అదనపు భారం పడింది. పెట్టుబడి ఎక్కువై రైతు కుదేలయ్యాడు. జిల్లాలో 2.10 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, 5 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. సవాలక్ష ప్రతి బంధకాల మధ్య సాగు చేసిన రైతుల నుంచి కనీస మద్ధతు ధరకు ప్రభుత్వం పూర్తిగా ధాన్యం కొనుగోలు చేయలేదు. జిల్లాలో ఎంఎస్పీకి 3 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుని, కేవలం 2.60 లక్షల మెట్రిక్ టన్నులకే సరి పెట్టేసి రైతుల నెత్తిన పిడుగు పడేసింది. మాసూళ్లు సమయంలో అకాల వర్షాలకు తోడు గోనె సంచుల కొరత కూడా వేధించింది. తేమ శాతం ఎక్కువగా ఉందనే సాకుతో ప్రతి బస్తా ధాన్యం కొనుగోలుపై సుమారు రూ.400ను కమీషన్ ఏజెంట్లు, దళారులు కోత పెట్టడంతో రైతులు నష్టాలపాలయ్యారు. 80 వేల మంది రైతులు వద్ద ధాన్యం కొనుగోలు చేసి సక్రమంగా సకాలంలో వారి ఖాతాలో నగదు జమ చేసిన దాఖలాలు లేవు. మోంథా తుపానుతో భారీ నష్టం ఖరీఫ్లో సాగునీటి ఎద్దడి, ప్రకృతి విపత్తులకు తోడు ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వర్షాభావ పరిస్థితులతో సాగును ఆలస్యం కాగా, జిల్లాలో 2.10 లక్షల ఎకరాల్లో సాగుకు చేశారు. పంట పాలుపోసుకునే, గింజ గట్టిపడే దశల్లో మోంథా తుపాను తీవ్ర నష్టం కలిగింది. స్వర్ణ, సంపద స్వర్ణ సాగు చేసిన పొలాల్లో పంట నేలకొరిగి రైతులు కకావికలం అయ్యారు. ఎంటీయూ 1318, పీఎల్ఏ 1100 తదితర రకాల్లో తాలు గింజలు పెరిగి దిగుబడులు తగ్గిపోయాయి. నేలనంటిన వరి సామర్లకోట, పిఠాపురం, కొత్తపల్లి, కాకినాడ రూరల్ తదితర మండలాల్లో పంట పొలాలు నేలనంటాయి. మోంథా తుపానుతో జిల్లాలో సుమారు 70 వేల ఎకరాలలో వరి ముంపునకు గురైందని అధికారులు అంచనాలు రూపొందించారు. తీరా చివరకు నష్టం అంచనాలు కాస్తా బక్కచిక్కిపోయి 40 వేల ఎకరాలు మాత్రమే పంట నష్టం సంభవించినట్టు రికార్డులకెక్కాయి. దిగుబడి పరంగానూ రైతులకు ఖరీఫ్ కలిసి రాలేదు. ఎకరాకు సుమారు 35 బస్తాలు చొప్పున వస్తుందన్న అంచనాలు తల్లకిందులై కేవలం 25 బస్తాలు మాత్రమే వచ్చింది. తేమ శాతం ఎక్కువగా ఉందనే కుంటి సాకులతో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు దళారులను ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొంది. దళారుల దందా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఎత్తివేసి.. రైతుల నెత్తిన ప్రీమియం భారం మోపింది. అలాగే జిల్లాలో 60 వేల మంది పైచిలుకు కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కూడా దూరం చేసింది. దాని కింద రైతులకు ఏటా రూ.20 వేలు ఇస్తామని చెప్పి, మొదటి ఏడాది ఎగనామం పెట్టారు. ధాన్యం కొనుగోలులో దళారులకు గేట్లు తెరిచారు. రైతులకు అన్ని విధాలా అండగా ఉన్న ఆర్బీకే వ్యవస్థ నిర్వీర్యం చేశారు. అయితే చంద్రబాబు సర్కారు మాత్రం ప్రచార యావతో ‘రైతన్నా.. మీకోసం’ అంటూ గ్రామాల్లో సభలు నిర్వహించి హడావుడి చేసింది. రైతులకు అండగా జగన్ ప్రభుత్వం జగన్ సర్కార్ సాగుకు ముందే పెట్టుబడి సాయం అందిస్తూ అన్నదాతలకు అండగా నిలిచింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఇచ్చే రూ.6 వేలకు తోడుగా రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.7500 కలిపి మొత్తం రూ.13,500 చొప్పున రైతు ఖాతాలో జమ చేస్తూ వచ్చింది. జిల్లాలో రెండు లక్షల మంది రైతులకు ఏటా రూ.200 కోట్లకు పైగా రైతు భరోసా ద్వారా అందించింది. దీనితో పాటు వైఎస్సార్ సున్నా వడ్డీ, వైఎస్సార్ ఉచిత పంటల బీమా, ఇన్పుడ్ సబ్సిడీ ఇలా పలు పథకాల ద్వారా రైతులకు ఆర్థికంగా అండగా నిలిచింది. ఉచిత పంటల బీమాకు మంగళం రైతులపై ప్రీమియం భారం లేకుండా 2019 ఖరీఫ్ నుంచి వైఎస్సార్ ప్రభుత్వం ఉచిత పంటల బీమాను తీసుకువచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం ఈ పథకాన్ని ఎత్తివేసి ప్రీమియం భారాన్ని రైతులపై మోపింది. జిల్లాలో 2,15,068 ఎకరాల్లో ఖరీఫ్ సాగు చేయగా రైతులు ఎకరాకు రూ.210 చొప్పున 72,766 ఎకరాలకు మాత్రమే ప్రీమియం చెల్లించారు. మిగిలిన 1,42,302 ఎకరాలు క్రాఫ్ ఇన్స్యూరెన్స్కు దూరంగా ఉండటం గమనార్హం. ఆర్బీకే వ్యవస్థ నిర్వీర్యం విత్తు నుంచి పంట ఉత్పత్తుల విక్రయం వరకు సాగులో రైతుకు అన్ని విధాలా అండగా ఉండేందుకు అప్పటి జగన్ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది. చంద్రబాబు ప్రభుత్వం వాటి పేర్లను రైతు సేవా కేంద్రాలుగా మార్చిందే తప్ప.. అన్నదాతలకు ఒక్క ప్రయోజనం కల్పించలేదు. ప్రస్తుతం కొన్ని ఆర్బీకే భవనాలను ఇతర కార్యాలయాలకు వినియోగిస్తుండగా, మరికొన్ని తాళం వేసి కనిపిస్తున్నాయి. ఏడాది పొడవునా ఎరువుల కోసం రైతులు ఇబ్బందులు పడుతూనే 2025ను అతి భారంగా వీడుతున్నారు. యూరియా ఇవ్వలేని దుస్థితి చంద్రబాబు ప్రభుత్వంలో వ్యవసాయం కుంటుపడింది. రైతును ఆదుకోవడంలో పాలకులు ఘోరంగా విఫలమయ్యారు. కనీసం యూరియా ఇవ్వలేని దయనీయ స్థితిలో ఈ ప్రభుత్వం నడుస్తోంది. రైతులందరికీ ఈ – క్రాప్ చేయలేదు. కౌలు రైతులకు కౌలు కార్డులు లేవు. పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కడం లేదు. గత జగన్ ప్రభుత్వంలో విత్తనాలు, ఎరువులు, ఈ– క్రాప్ చక్కగా జరిగింది. ధాన్యం కొనుగోలులో హమాలీ, రవాణా చార్జీలను చెల్లించారు. గిట్టుబాటుఽ ధర కంటే రైతులకు ఎక్కువ లభించేలా చర్యలు తీసుకున్నారు. – లంక ప్రసాద్, వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 30,000 గటగట (వెయ్యి) 27,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 26,500 గటగట (వెయ్యి) 23,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 15,000 – 16,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)15,000 – 16,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 6,000 కిలో 400 -
రోడ్డు ప్రమాదంలో విద్యార్థికి తీవ్ర గాయాలు
సామర్లకోట: గొంచాల–అచ్చంపేట రోడ్డులో జరిగిన ప్రమాదంలో పెద్దాపురం మండలం వడ్లమూరు గ్రామానికి చెందిన ఎంబీబీఎస్ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. నక్కపల్లి యూనియన్ బ్యాంకులో ఫీల్డ్ ఆఫీసర్గా పని చేస్తున్న సందీప్రాజు కారు అతి వేగంగా రావడంతో ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరర చదువుతున్న బెహరా రాజు తీవ్రంగా గాయపడ్డాడని తోటి విద్యార్థులు చెబుతున్నారు. విద్యార్థికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. తాను ఏమి చేయలేనని సందీప్రాజు చెప్పడంతో విద్యార్థులు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. దాంతో సీఐ ఎ.కృష్ణభగవాన్ శనివారం రాత్రి ఇరువర్గాలను పిలిచి చర్చలు జరిపారు. బాధితుడి కాలు పూర్తిగా తీసి వేయడంతో ఇబ్బంది పడాల్సి వస్తోందని, నష్ట పరిహారం ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. దానికి కారు యజమానికి చెందిన బంధువులు అంగీకరించక పోవడంతో బ్యాంకు వద్ద ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఇరువర్గాలకు సీఐ సూచించారు. అయితే రాత్రి వరకూ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. -
రాష్ట్ర స్థాయి నెట్బాల్ పోటీలు ప్రారంభం
రావులపాలెం: క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తదితరులు అన్నారు. రావులపాలెం మండలం వెదిరేశ్వరం గ్రామంలో శనివారం మాజీ వైస్ ఎంపీపీ దండు సుబ్రహ్మణ్యేశ్వర వర్మ ఆధ్వర్యంలో దండు సాయిఆకాష్వర్మ మెమెరబుల్ టోర్నమెంట్ 10వ రాష్ట్ర స్థాయి నెట్బాల్ సీనియర్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ చాంపియన్షిప్ పోటీలను ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ అతి చిన్న వయసులోనే రాష్ట్ర స్థాయి నెట్బాల్ ఆటలో అత్యున్నత ప్రతిభ కనబరిచి దురదృష్టవశాత్తూ మరణించిన దండు సాయిఆకాష్ వర్మ ఆసక్తి మేరకు అతని తండ్రి దండు సుబ్రహ్మణ్యేశ్వరవర్మ, సుజాత దంపతులు ఈ రాష్ట్ర స్థాయి పోటీలను నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం జగ్గిరెడ్డి టాస్ వేసి తూర్పుగోదావరి– నెల్లూరు జట్ల మధ్య మ్యాచ్ను ప్రారంభించారు. అలాగే క్రీడాకారులకు టీషర్ట్లు పంపిణీ చేశారు. 13 జిల్లాల నుంచి మెన్, ఉమెన్ కేటగిరీల్లో మొత్తం 26 టీమ్లు పాల్గొనగా లీగ్ కమ్ నాకౌట్ విధానంలో తొలి రోజు పోటీలు జరిగాయి. పురుషుల విభాగంలో పది మ్యాచ్లు, మహిళల విభాగంలో నాలుగు మ్యాచ్లు హోరాహోరీగా సాగాయి. రెండో రోజు క్వార్టర్స్, సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్లు జరుగుతాయని నెట్బాల్ రాష్ట్ర సెక్రటరీ పల్లా శ్రీను తెలిపారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కొత్తపేట ఎంపీపీ మార్గన గంగాధరరావు, అముడా మాజీ చైర్మన్ గొల్లపల్లి డేవిడ్రాజు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రి నాగిరెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు బొక్కా వెంకటలక్ష్మి, వైస్ ఎంపీపీ గన్నవరపు వెంకట్రావు, సర్పంచులు బొక్కా కరుణాకరం, సబ్బితి మోహనరావు, కొత్తపేట వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ ముత్యాల వీరభద్రరావు పాల్గొన్నారు. -
పరుగు పందెంలో బంగారు పతకం
బాలాజీచెరువు: ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన 100 మీటర్ల పరుగు పందెంలో కాకినాడ పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల బీఏ ప్రథమ సంవత్సర విద్యార్థిని బి.నాగవిహారిక ప్రతిభ కనబరిచింది. ప్రో స్పోర్ట్స్ 100 ప్లస్ టీం, హైదరాబాద్ డిస్ట్రిక్ అథ్లెటిక్ అసోసియేషన్ నిర్వహించిన ఈ పోటీల్లో 12 సెకన్లలో పరుగు పూర్తి చేసి గోల్డ్ మెడల్తో పాటు రూ.30 వేల నగదు సాధించారు. అలాగే గత నెలలో నన్నయ వర్సిటీలో నిర్వహించిన అథ్లెటిక్స్ నన్నయవర్సిటీ చాంపియన్షిప్ పోటీల్లో పాస్టెస్ట్ ఉమెన్ టైటిల్ సాఽధించారు. కాకినాడ జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ నిర్వహించిన పోటీల్లో బీఏ విద్యార్థి వి.రేష్మయాదవ్ ప్రతిభ చూపి బంగారు పతకంతో పాటు నొయిడాలో జనవరి 3 నుంచి నిర్వహించే జాతీయ పోటీలకు అర్హత పొందారు. వీరిని కళాశాల ప్రిన్సిపాల్ కందుల ఆంజనేయులు, ఇన్చార్జి ప్రిన్సిపాల్ సంజీవ్కుమార్, పీడీ రమణ, డాక్టర్ పసుపులేటి హరిరామప్రసాద్ అభినందించారు. -
కాకినాడ టు శబరిమల
ఇరుముడి ధరించి 1,470 కిలోమీటర్ల పాదయాత్ర నగరి: సాధారణంగా అయ్యప్ప భక్తులు పంబ నుంచి, లేకుంటే ఎరిమేలి నుంచి పెద్ద పాదలో గానీ పాదయాత్రగా శబరి కొండపైకి వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శించుకోవడం పరిపాటి. అయితే కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ఇద్దరు భక్తులు 1,470 కిలోమీటర్ల పాదయాత్ర చేసి అయ్యప్ప దర్శనానికి వెళ్తుండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా, తణుకు మండలం మండపాక గ్రామానికి చెందిన అర్జున్ (63), కాకినాడ రూరల్ రేపూరు గ్రామానికి చెందిన ముమ్మిడి భవానిశంకర్ (44) అయ్యప్ప స్వామి మాల ధరించారు. 18 ఏళ్ల క్రితం అర్జున్ స్వామి తన 18వ శబరియాత్రను చేపట్టగా, ముమ్మిడి భవాని శంకర్ కన్నెస్వామిగా మాల ధరించి ఆయన వెంట కాకినాడ నుంచి శబరికొండ వరకు పాదయాత్రగా వెళ్లి అయ్యప్పస్వామిని దర్శించుకున్నారు. ఆపై ఇరువురు సొంతంగా అయ్యప్ప ఆలయాలను నిర్మించి కలసి పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. ఆపై ఇద్దరూ పాదయాత్ర చేసినా కలసి వెళ్లలేదు. మరో 18 ఏళ్లకు వారి ఆశయం నెరవేరింది. ఇద్దరూ వారి ప్రాంతాల్లో నూతన అయ్యప్ప ఆలయాల నిర్మాణం పూర్తి చేశారు. ఈ ఏడాది కలసి పాదయాత్ర ప్రారంభించారు. భవానీ శంకర్ 18వ సారి శబరి యాత్ర చేస్తుండగా, అర్జున్ స్వామి 36వ సారి తన యాత్రను కొనసాగిస్తున్నారు. వారు శుక్రవారం చిత్తూరు జిల్లా నగరికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు తమ యాత్ర వివరాలను మీడియాకు తెలియజేశారు. ప్రజా సంక్షేమం కోరుతూ ఇరుముడి ధరించి 1,470 కిలోమీటర్ల పాదయాత్రను కొనసాగిస్తున్నామన్నారు. భవానీ శంకర్ నవంబరు 30న రేపూరు నుంచి యాత్రను ప్రారంభించగా, అర్జున్ స్వామి డిసెంబరు 4వ తేదీ తణుకు నుంచి యాత్రను ప్రారంభించారు. 22 రోజులుగా కలసి యాత్ర కొనసాగిస్తున్నామని మకర జ్యోతికి శబరిమలకు చేరుకుంటామని వారు తెలిపారు. వేల కిలోమీటర్ల యాత్రలో.. శబరి కొండకు వీరు చేసే యాత్రలు విని అందరూ నోరెళ్లబెడుతున్నారు. వీరిలో అర్జున్ స్వామి ఏడుసార్లు ఇలా తణుకు నుంచి శబరి కొండకు ఇరుముడితో పాదయాత్ర చేశారు. ఇందులో నాయుడుపేట మీదుగా మూడు సార్లు, సేలం, దిండిగల్ మీదుగా రెండు సార్లు, తిరుత్తణి, అరకోణం మీదుగా రెండు సార్లు పాదయాత్రగా వెళ్లగా, మోటారుసైకిల్ మీదుగా మూడుసార్లు, సైకిల్పై ఐదుసార్లు యాత్ర కొనసాగించారు. ప్రస్తుతం 62 సంవత్సరాల వయస్సులో ఇరుముడి ధరించి పాదయాత్ర చేస్తున్న ఈయన భక్తికి పరవశించి అందరూ ఆశీర్వచనాలు తీసుకుంటున్నారు. గణపతి గురుస్వామి ద్వారా తాను ఈ భక్తిమార్గంలో నడుస్తున్నానని ఆయన తెలిపారు. ముమ్మిడి భవానీశంకర్ నాలుగు సార్లు పాదయాత్రగా వెళ్లగా, ఒకసారి బైక్యాత్ర చేశారు. ప్రస్తుతం ఐదవసారి యాత్ర చేస్తున్నారు. వేలు గురుస్వామి ద్వారా తాను ఈ భక్తిమార్గంలో నడుస్తున్నాని ఆయన తెలిపారు. పెట్రోలు బంకులు, ఆశ్రమాలు, గుళ్ల వద్ద తలదాచుకుంటూ మార్గంలో ఉన్న ప్రముఖ పుణ్య క్షేత్రాలు దర్శించుకుంటూ యాత్రను కొనసాగిస్తున్నారు. -
● మంచి మార్కులకు దోహదం
దస్తూరి అందంగా ఉంటేనే మంచి మార్కులు వస్తాయి. ప్రజెంటేషన్ బాగా చేయడానికి దస్తూరి ఒక కారణంగా చెప్పవచ్చు. ఏకాగ్రతతో 10 రోజులు సాధన చేస్తే కచ్చితంగా అద్భుతమైన చేతిరాతను సొంతం చేసుకోవచ్చు. వేల మందికి చేతిరాతను తీర్చిదిద్దడంలో తర్ఫీదునిచ్చాను. –కుంచే బాలకృష్ణ, కాలిగ్రాఫర్, స్కూల్ అసిస్టెంట్ (బయాలజీ), జెడ్పీహెచ్ఎస్, తొండవరం ● మెళకువలు నేర్చుకోవాలి చేతిరాతను అందంగా తీర్చిదిద్దుకోవాలంటే కొన్ని మెళకువలు తప్పనిసరిగా పాటించాలి. పెన్ను పట్టుకునే విధానం కూడా చేతిరాతను మారుస్తుంది. ప్రతి రోజూ కొంత సమయాన్ని చేతిరాతను తీర్చిదిద్దుకునేందుకు కేటాయించాలి. చేతిరాత బాగుంటే తలరాత కూడా మారుతుంది. –టి.గణేశ్వరరావు, హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవర్, స్కూల్ అసిస్టెంట్ (హిందీ), కాండ్రకోట, పెద్దాపురం మండలం ● తప్పుల్లేకుండా రాయాలి అందమైన అక్షరాలతో మంచి మార్కులను సంపాదించవచ్చు. చేతిరాత మెరుగుపర్చేందుకు విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాం. సమాధానాలు దిద్దేవారికి సులభంగా అర్థమైనప్పుడే మంచి మార్కులకు అవకాశం ఉంటుంది. తక్కువ రాసినా తప్పుల్లేకుండా అందంగా రాయడం వల్ల మంచి మార్కులు సాధించవచ్చు. –సీహెచ్ జాన్ప్రసాద్, జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం, ప్రత్తిపాడు -
కాకినాడలో బిగ్బాస్ విజేత సందడి
బోట్క్లబ్ (కాకినాడ): స్థానిక శ్యామ్ ఇనిస్టిట్యూట్లో బిగ్బాస్ సీజన్– 9 విజేత, భారతదేశ సైనికుడు కళ్యాణ్ పడాల సందడి చేశారు. ఆ సంస్థతో జ్ఞాపకాలను నెమర వేసుకుంటూ, తన ఎదుగుదలలో శ్యామ్ ఇనిస్టిట్యూట్ పాత్రను ఆయన కొనియాడారు. బిగ్బాస్ ట్రోఫీతో విచ్చేసిన కళ్యాణ్ పడాలకు ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ శ్యామ్ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై కళ్యాణ్ మాట్లాడుతూ ఈ ఇనిస్టిట్యూట్ విద్యార్థిగా నేర్చుకున్న క్రమశిక్షణ, పట్టుదలే తనను ఈ స్థాయిలో నిలబెట్టాయన్నారు. బిగ్బాస్ హౌస్లో ఉన్నప్పుడు కూడా ఇక్కడ నేర్చుకున్న పాఠాలు ధైర్యాన్ని ఇచ్చాయని భావోద్వేగంతో వివరించారు. శ్యామ్ ఇనిస్టిట్యూట్ అధినేత గుంటూరు శ్యామ్ మాట్లాడుతూ ఇనిస్టిట్యూట్ విద్యార్థిగా కళ్యాణ్ ఎంతో అంకితభావంతో ఉండేవారన్నారు. అనంతరం కళ్యాణ్ను సత్కరించారు. పోటీ పరీక్షలకు కేరాఫ్ అడ్రస్గా.. పోటీ పరీక్షలకు శ్యామ్ ఇనిస్టిట్యూట్ కేరాఫ్ అడ్రస్గా నిలిచిందని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అన్నారు. స్థానిక శ్యామ్ ఇనిస్టిట్యూట్ ఆవరణలో కొత్తగా ఏర్పాటు చేసిన ఫిజికల్ ఈవెంట్ గ్రౌండ్ను ఎంపీతో పాటు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ ప్రారంభించారు. ఎంపీ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన అన్ని రకాల పోటీ పరీక్షల్లో శ్యామ్ ఇనిస్టిట్యూట్ అగ్రగామిగా నిలవాలని ఆకాంక్షించారు. అడిషనల్ ఎస్పీ ఎ.శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతున్న శ్యామ్ ఇనిస్టిట్యూట్ అధినేత శ్యామ్ను అభినందనీయులన్నారు. కార్యక్రమంలో ఇనిస్టిట్యూట్ అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. -
100
శనివారం శ్రీ 27 శ్రీ డిసెంబర్ శ్రీ 2025రో జు లగందరగోళం● టెన్త్ ప్రత్యేక తరగతులపై ‘పరాయి’ పెత్తనం ● ఇతర శాఖలకు పర్యవేక్షణ బాధ్యతలు ● ఇది టీచర్లను అవమానించడమేనంటున్న ఉపాధ్యాయ సంఘాలు బాలాజీచెరువు (కాకినాడ సిటీ): మరో మూడు నెలల్లో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈసారి మెరుగైన ఫలితాలు సాధించాలని విద్యా శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం కొద్ది రోజులుగా వంద రోజుల ప్రణాళిక అమలు చేస్తోంది. దీని ద్వారా డిసెంబర్ మొదటి వారానికే మొత్తం సిలబస్ పూర్తి చేసి, వంద రోజుల పాటు ప్రత్యేక తరగతులు నిర్వహించి, పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులను ఉపాధ్యాయులు సన్నద్ధం చేయాల్సి ఉంది. ఆలోచన గొప్పగానే ఉన్నా.. అమలుకు వచ్చేసరికి ఈ ప్రణాళిక మొత్తం గందరగోళంగా మారింది. టీచర్లపై ‘బోధనేతర’ భారం జిల్లాలోని 476 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 29,637 మంది విద్యార్థులు ఈసారి పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. వీరిలో 251 ప్రభుత్వ పాఠశాలల నుంచి 18,097 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. వీరు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు గాను ప్రభుత్వం వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తోంది. దీనికి సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం విడుదల చేసిన ప్రణాళిక తీవ్ర గందరగోళానికి గురి చేస్తోంది. వాస్తవానికి విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే ఉపాధ్యాయులకు ప్రభుత్వం అనేక బోధనేతర పనులు అప్పగించింది. దీంతో, వారు సిలబస్ సకాలంలో పూర్తి చేసేందుకు అనేక ఇబ్బందులు పడ్డారు. మరోవైపు విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం ఒక ఎత్తయితే.. మూల్యాంకనం, మార్కుల అప్లోడ్ చేయడంతోనే వారికి సమయం అయిపోతోంది. మరోవైపు రకరకాల యాప్లు.. వాటిల్లో సమాచారం అప్లోడ్ వంటి వాటితో వారు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ పరిస్థితుల్లోనే పదో తరగతి విద్యార్థులకు డిసెంబర్ 6 నుంచి మార్చి 15వ తేదీ వరకూ వంద రోజుల ప్రత్యేక ప్రణాళిక అమలు చేయాలని విద్యా శాఖ ఆదేశించింది. దీని అమలు పర్యవేక్షణను ఆ శాఖతో ఎటువంటి సంబంధమూ లేని అధికారులకు అప్పగించింది. ఈ ఇన్చార్జి అధికారుల కనుసన్నల్లోనే ఈ ప్రణాళిక మొత్తం అమలవుతుందని చెప్పింది. దీనిపై ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నేతలు మండిపడుతున్నారు. తమ శాఖపై ఇతరులకు పెత్తనం అప్పగించడమేమిటని ప్రశ్నిస్తున్నారు. వివిధ శాఖలు అధికారులు ఇలా.. వంద రోజుల ప్రణాళిక అమలుకు ఇన్చార్జ్లుగా రెవె న్యూ, పంచాయతీరాజ్, వైద్య – ఆరోగ్యం, ఎంపీడీఓ, ఆర్డబ్ల్యూఎస్, వ్యవసాయం, ఇరిగేషన్, మున్సిపల్ కమిషనర్, వెటర్నరీ తదితర అధికారులను ప్రభుత్వం నియమించింది. వీరందరూ కలిసి ఆయా మండలాల పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు వెళ్లి, ఈ ప్రణాళిక అమలును పూర్తిగా పర్యవేక్షించాల్సి ఉంటుంది. అంతేకాకుండా స్లిప్ టెస్టుల నిర్వహణ, మార్కుల నమోదు, ఉపాధ్యాయుల హాజరు, షైనింగ్, రైజింగ్ స్టార్లుగా టెన్త్ విద్యార్థులను విభజించి పాఠాలు బోధిస్తున్నారా లేదా తదితర అంశాలను ప్రతి రోజూ పరిశీలించాలి. శని ఆదివారాలు, ఇతర సెలవు దినాల్లో ఈ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారో లేదో చూడాల్సిన బాధ్యత కూడా వీరిపై ఉంటుంది. మావాళ్లుండగా వారితో పనేంటి? వాస్తవానికి ప్రతి మండలానికీ ఎంఈఓ–1, 2లతో పాటు జిల్లావ్యాప్తంగా డిప్యూటీ డీఈఓలు, ప్రతి పాఠశాలకు ప్రధానోపాధ్యాయులు, సీఆర్పీలు ఉన్నారు. విద్యా శాఖలోనే ఇంత మంది ఉండగా.. వేరే శాఖల వారిని ఇన్చార్జులుగా నియమించడం దేనికనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. వీరికి పాఠశాల విద్య అమలు తీరుపై ఏవిధంగా అవగాహన ఉంటుందని ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం ఉపాధ్యాయులను అవమానించడమేనని ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కరప మండలం వేళంగిలో వంద రోజుల ప్రణాళిక అమలును పరిశీలిస్తున్న డీఈఓ రమేష్ (ఫైల్) ఇతర శాఖల పెత్తనం తగదు వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలో విద్యా శాఖ నిర్ణయాలు విద్యార్థులను తీవ్ర మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నాయి. వంద శాతం ఉత్తీర్ణత సాధించడానికి ఆంక్షలు విధించడం అశాసీ్త్రయం. ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో, నిబద్ధతతో పని చేస్తూంటే ఇతర శాఖల అధికారులను తనిఖీల పేరుతో నియమించడం తగదు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. – చింతాడ ప్రదీప్ కుమార్,పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు ప్రభుత్వ నిర్ణయం సరికాదు వంద రోజుల ప్రణాళిక ఏవిధంగా అమలవుతోందో పరిశీలించడానికి ఇతర శాఖల ఉద్యోగులను నియమించాలనే ప్రభుత్వ నిర్ణయం సరి కాదు. దీనివలన ఉపాధ్యాయుల ఆత్మాభిమానం దెబ్బ తింటోంది. ప్రణాళికను పక్కాగా అమలు చేసేందుకు జిల్లా విద్యా శాఖ అధికారి, ఉప విద్యా శాఖ అధికారులు, ఎంఈఓలు ఉన్నారు. – మోర్త శ్రీనివాస్, ఎస్టీయూ రాష్ట అదనపు ప్రధాన కార్యదర్శి విద్యార్థులు, ఉపాధ్యాయులపై ఒత్తిడి వంద రోజుల ప్రణాళికలో భాగంగా పండగ సెలవులు కూడా ఇవ్వకుండా విద్యార్థులు, ఉపాధ్యాయులపై ఒత్తిడి పెట్టడం సరైన విధానం కాదు. రోజూ పరీక్షలు నిర్వహించడం, మర్నాడు మార్కులు అప్ లోడ్ చేయాలని ఆదేశించడం, విద్యా శాఖపై అవగాహ న లేని వారిని పర్యవేక్షకులుగా నియమించడం సమంజసం కాదు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం. – శేశెట్టి సత్యనారాయణ, అధ్యక్షుడు, ఎస్టీయూ, కాకినాడ -
రూ.150 నాణెం సేకరణ
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): వందేమాతర గీతం రూపుదిద్దుకొని 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముంబై టంకసాల ద్వారా రూ.150 ప్రత్యేక స్మారక నాణెం విడుదల చేసింది. దీనిని కాకినాడకు చెందిన ప్రముఖ నాణేల సేకర్త మార్ని జానకిరామ చౌదరి సేకరించారు. 32 గ్రాముల బరువైన ఈ నాణేన్ని రాగి, నికెల్, జింక్ మిశ్రమ లోహాలతో తయారు చేశారు. దీనికి ఒకవైపు రూ.150 ముఖవిలువను, మరోవైపు తుపాకీ ఎక్కుపెట్టి బ్రిటిష్ సైనికుల అరాచకాలను నిరసిస్తూ భారతీయులు ఏకతాటిపై నిలిచి ‘వందేమాతరం’ అంటూ నినదిస్తున్న చారిత్రక దృశ్యాన్ని ముద్రించారు. భారత స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తితో పాటు సాంస్కృతిక వారసత్వాన్ని, దేశభక్తిని చాటే ఇలాంటి అరుదైన నాణెం సేకరించటం గర్వంగా ఉందని జానకిరామ చౌదరి శుక్రవారం విలేకర్లకు తెలిపారు. చంద్రబాబుది ట్రబుల్ ఇంజిన్ సర్కార్ కాకినాడ రూరల్: చంద్రబాబుది డబుల్ ఇంజిన్ సర్కారు కాదని, ట్రబుల్ ఇంజిన్ సర్కార్ అని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి విమర్శించారు. శుక్రవారం ఆమె విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్ర సంపదను కొందరికి దోచి పెట్టడానికే చంద్రబాబు ప్రభుత్వం పని చేస్తోందని దుయ్యబట్టారు. గడచిన 8 నెలల్లో రాష్ట్ర ఆర్థిక లోటు 163 శాతానికి చేరిందంటూ కాగ్ నివేదిక ఇవ్వడం చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యం కాదా అని ప్రశ్నించారు. రాష్ట్ర ఆదాయంలో ఎక్కువ శాతం కొంత మంది కాంట్రాక్టర్లకు దోచి పెట్టడమే ప్రభుత్వ విధానంలా మారిందని దుయ్యబట్టారు. చేస్తున్న అప్పులు ఎక్కడికి పోతున్నాయో కూడా చెప్పలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేసేందుకు కంకణం కట్టుకోవడం దారుణమన్నారు. ఆయుష్ ఆస్పత్రిలో కీలకమైన అధ్యాయం మొదలైందని చెబుతున్న ప్రభుత్వం.. మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ సూచనల మేరకు ముఖ్యమంత్రి, మంత్రులు అక్కడ చికిత్స చేయించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరుగుతోందంటూ కాగ్ పదేపదే చెబుతున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికై నా కుప్పలు తెప్పలుగా అప్పులు చేయడం మానుకుని, ఆదాయం పెంపుపై దృష్టి సారించాలని నాగమణి హితవు పలికారు. ‘కేవల మర్త్యుడె ధర్మసుతుడు?’ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్) ధర్మరాజును కేవలం మానవమాత్రుడేనని అనుకోరాదని ప్రవచన విరించి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. స్థానిక హిందూ సమాజంలో కొనసాగిస్తున్న వ్యాస భారత ప్రవచనంలో భాగంగా కీచక వధ వృత్తాంతాన్ని శుక్రవారం ఆయన వివరించారు. ‘‘నిండు సభలో కామరోగ పీడితుడైన కీచకుడు.. ద్రౌపదిని కాలితో తన్ని అవమానిస్తాడు. ఆ రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో భీముని వద్దకు వెళ్లి ద్రౌపది తన ఆవేదన వ్యక్తం చేస్తుంది. ‘యుధిష్టిరుని భర్తగా పొందిన సీ్త్ర.. శోకం లేనిదెలా అవుతుంది? – అశోచ్యత్వం కుతస్తస్యాః యస్యా భర్తా యుధిష్ఠిరః’ అని తీవ్ర దుఃఖంతో అంటుంది. భీముడు సాంత్వనవచనాలతో ఆమెను ఓదార్చి, కీచకుడిని నర్తనశాలకు రాత్రి వేళ రావాల్సిందిగా ఆహ్వానించాలని, వాడిని అక్కడే గుట్టుగా మట్టు పెడతానని చెబుతాడు. ద్రౌపది తన తొందరపాటును నిందించుకుంటూ, ఆవేశంలో, దుఃఖాన్ని తట్టుకోలేక, ధర్మరాజు గురించి పరుషమైన పదాలు పలికానని, ఆ మహానుభావుని దివ్యత్వం తనకు తెలుసునని అంటుంది. ‘ఎవని చరిత్రము ఎల్ల లోకాలకు గురుస్థానంలో నిలచి పూజనీయమవుతుందో, ఎవని కడగంటి చూపు మానిత సంపదలు కలగచేస్తుందో, అట్టి మహానుభావుడు ధర్మరాజును కేవలం మానవమాత్రుడని అనుకోరాదు. కేవల మర్త్యుడె ధర్మసుతుడు?’ అని తన అంతరంగాన్ని వెల్లడిస్తుంది. చక్కగా అలంకరించుకుని నర్తనశాలకు వచ్చిన కీచకుడిని భీముడు గుట్టుగా మట్టు పెడతాడు. అతడి పార్థివ శరీరంతో పాటు ద్రౌపదిని దహనం చేయాలనుకున్న ఉపకీచకులు 105 మందిని భీముడు వధిస్తాడు. హస్తినలో వేగుల ద్వారా కీచకుని మరణ వార్త విన్న దుర్యోధనుడు ఈ పని చేసింది భీముడేనని, కీచకుడు మనసు పడ్డ సైరంధ్రి ద్రౌపది అనే నిర్ణయానికి వస్తాడు. ధర్మరాజు ఉన్న రాజ్యం సుఖశాంతులతో ఉంటుందని భీష్ముడు చెబుతాడు’’ అంటూ సామవేదం వివరించారు. అప్పటికే పాండవుల అజ్ఞాతవాస గడువు పూర్తయిందని అన్నారు. -
ఎగ్నామం పెట్టేందుకా?
బాలాజీచెరువు (కాకినాడ): మధ్యాహ్న భోజన పథకం అపహాస్యం అవుతోంది.. సంబంధిత ప్రైవేట్ ఏజెన్సీలు మధ్యాహ్న భోజనంలో మెనూలో భాగంగా ఉడకబెట్టిన గుడ్లను నిర్వాహకులకు పంపిస్తుండగా, ఇందులో రోజుకు 10 నుంచి 20 వరకూ పాడైపోతున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. కాకినాడ పీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు పాడైన గుడ్లు వచ్చాయి. వాటిని వారు తినకుండా వదిలేశారు. ఇక్కడ మొత్తం 240 మంది మధ్యాహ్న భోజనం చేస్తారు. ఇందులో రోజూ సుమారు పది వరకూ గుడ్లు పాడవుతున్నాయని చెబుతున్నారు. ఈ విషయమై అధికారులకు చెబుతున్నా మార్పు ఉండటం లేదని పలువురు వాపోతున్నారు. స్నేహితుడిపై దాడి: వ్యక్తికి జైలు కాకినాడ లీగల్: స్నేహితుడిపై దాడి చేసిన వ్యక్తికి 9 నెలల జైలు, రూ.మూడు వేల జరిమానా విధిస్తూ కాకినాడ నాలుగో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ నిరూప భంజ్ డియో శుక్రవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. తిమ్మాపురానికి చెందిన కొప్పిశెట్టి రాజేష్ అదే ప్రాంతానికి చెందిన జియ్యన శ్రీమన్నారాయణ స్నేహితులు. వారి మధ్య కక్షలు ఉండడంతో శ్రీమన్నారాయణపై రాజేష్ రాయితో దాడి చేశాడు. దీనిపై తిమ్మాపురం పోలీసులు 2022లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. కోర్టు విచారణలో రాజేష్పై నేరం రుజువు కావడంతో 9 నెలల జైలు, రూ.మూడు వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. -
బాలా.. భళా
ఫ ఆంగ్లంలో 20వ ఎక్కం వరకూ చెబుతున్న ఒకటో తరగతి విద్యార్థి ఫ చిరుప్రాయంలోనే ప్రతిభ కొత్తపేట: ఒకటో తరగతి బాలుడు.. ఎక్కాలు ఆంగ్లంలో గణగణా చెప్పేస్తున్నాడు.. ఆ చిన్నారి ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలో చదువుకుంటున్నాడని అనుకుంటున్నారా? కాదు.. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న బాలుడే.. అతని జ్ఞాపకశక్తి అమోఘమని అందరూ ఆశ్చర్యపోతున్నారు. భవిష్యత్ మేధావి అని ఆకాంక్షిస్తున్నారు.. ఈ బాలుడి పేరు అడపా మోహన్సాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం అవిడి ప్రభుత్వ మోడల్ ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. ఆ పాఠశాల ఉపాధ్యాయుడు ఎ.దుర్గాప్రసాద్ ఎక్కాలు సులభ రీతిలో ఆంగ్లంలో చదవడంపై శిక్షణ ఇచ్చారు. దాని ఫలితంగా మోహన్సాయి అందరి కంటే మించి ఒకటో ఎక్కం నుంచి 20వ ఎక్కం వరకూ 20 స్టెప్పులు అనర్గళంగా చూడకుండా చెప్పేస్తున్నాడు. ఎంఈఓ మట్టపర్తి హరిప్రసాద్ ఆ పాఠశాల సందర్శన సందర్భంగా ఏ ఎక్కం గురించి అడిగినా భయం లేకుండా, తడుముకోకుండా అప్పచెప్పేశాడు. బాలుడి మేథస్సుకు ముచ్చటపడి ఆయన అభినందించారు. నేటి బాల మేథావి అని ఆకాంక్షించారు. ఇదిలాఉంటే అతని తల్లిదండ్రులు పెద్ద చదువులు చదివిన విద్యాధికులు కాదు.. తండ్రి శ్రీనివాసరావు సాధారణ రైతు కాగా, తల్లి గృహిణి. అతని అన్న రెండో తరగతి చదువుతున్నాడు. జ్ఞాపకశక్తి అమోఘం చిరుప్రాయంలోనే ఇంత మేథస్సు గల మోహన్సాయి గురించి ఉపాధ్యాయుడు దుర్గాప్రసాద్ను ‘సాక్షి’ అడగ్గా, ఆయన ఇలా తెలిపారు. ఒకటో తరగతి బాలలు రెండు పదులు, మూడు పదులు వరకూ చెప్తారు. కానీ సాయి 20వ ఎక్కం వరకూ 20 స్టెప్పులు ఆంగ్లంలో ధారాళంగా చూడకుండా చెబుతున్నాడు. ఇతని జ్ఞాపకశక్తి అద్భుతం, అమోఘమని అన్నారు. తన 40 ఏళ్ల సర్వీసులో ఒకటో తరగతి విద్యార్థి ఇలా చెప్పడం చూడలేదని చెప్పారు. గత ప్రభుత్వ కృషికి ఫలితంమోహన్సాయి అనర్గళంగా ఆంగ్లంలో 20 ఎక్కాలు చెప్పడానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలోని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టిన ఇంగ్లిషు మీడియం ఓ కారణంగా చెప్పవచ్చు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో తీసుకువచ్చిన సంస్కరణలే పునాది అయ్యింది. ‘మనబడి నాడు – నేడు’ పేరుతో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడంతో పాటు, అన్ని సౌకర్యాలు కల్పించిన విషయం తెలిసిందే. ఇంగ్లిషు మీడియం ఆప్షన్ అమలు చేయడంతో ఈ పాఠశాలల్లో చదువుకునే పేద, మధ్య తరగతి విద్యార్థులు ఈ మీడియం పట్ల మక్కువ చూపారు. మాతృభాష తెలుగుతో పాటు దేశ, విదేశాల్లో ఉన్నత చదువులకు దోహదపడే ఇంగ్లిషును కూడా మాట్లాడగలుగుతున్నారు. నాడు జగన్ ప్రభుత్వం విద్యా సంస్కరణలే నేటి ఈ మార్పులకు పునాది అని పలువురు విద్యాధికులు, మేధావులు పేర్కొంటున్నారు. -
కల్తీ పెట్రోలు విక్రయంపై ఆందోళన
జగ్గంపేట: కాట్రావులపల్లి గ్రామంలోని శ్రీజయలక్ష్మి ఫిల్లింగ్ స్టేషన్లో కల్తీ పెట్రోల్ కొడుతున్నారంటూ వినియోగదారులు శుక్రవారం ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో జిల్లా సివిల్ సప్లయిస్ అధికారి ఆర్ఎస్ఎస్ సత్యనారాయణ రాజు పరిశీలించి తేడాలు గుర్తించి బంక్ను సీజ్ చేశారు. ఆ వివరాల ప్రకారం.. కాట్రావులపల్లిలో ఆ పెట్రోల్ బంక్ వద్ద పెట్రోలు కొట్టించుకున్న మోటార్ సైకిళ్లు కొద్దిరోజులుగా మరమ్మతులకు గురవుతున్నాయి. ఒక్కసారిగా చాలా మోటారు సైకిళ్లు పాడవడంతో మెకానిక్లు పెట్రోల్లో తేడా వల్లే ఇలా జరిగిందని వివరించడంతో సుమారు 28 మంది వాహనదారులు పెట్రోల్ బంక్ వద్ద సాయంత్రం ఆందోళనకు దిగారు. తమ వాహనాల మరమ్మతులకు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనితో యాజమాన్యానికి, వినియోగదారుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో జగ్గంపేట ఎస్సై రఘునాధరావు ఆధ్వర్యంలో పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ నేపథ్యంలో జగ్గంపేట ఎంఎస్ఓ కృష్ణ సమాచారంతో జిల్లా సివిల్ సప్లయిస్ అధికారి సత్యనారాయణ రాజు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రికార్డులు పరిశీలించడంతో పాటు, పెట్రోల్ సాంద్రత, నిల్వలను తనిఖీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సాంద్రతలో చాలా తేడాలు గుర్తించామని చెప్పారు. దీని ప్రకారం కల్తీ జరిగిందని నిర్ధారణకు వచ్చి బంక్ సీజ్ చేశామని, అలాగే యజమాని కనిగిరి వెంకట రమణమూర్తి, గుమస్తా వాకాడ రమేష్పై 6ఏ కేసు నమోదు చేశామని తెలిపారు. కాట్రావులపల్లి పెట్రోల్ బంక్ను తాత్కాలికంగా జగ్గంపేటలోని ఎస్ఆర్ బంక్ అప్పగించామని చెప్పారు. జగ్గంపేట ఎంఎస్ఓ కృష్ణ, వీఆర్వో కె.శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఇదేం యాపారం సామీ..!
● రత్నగిరిపై షాపులో రకరకాల వస్తువుల విక్రయాలు ● టాయిలెట్లకు వాడే ఫినాయిల్, కాళ్ల పగుళ్లకు తైలం కూడా అమ్మకం ● ‘దేవుని నిర్మాల్యాలతో తయారీ’ పేరిట ఎర ● భక్తుల నమ్మకంతో వ్యాపారం ● అలా చేయడం సరైనదో కాదో పరిశీలించకుండానే అనుమతులు అన్నవరం: గో ఆధారిత ఉత్పత్తులు.. సత్యదేవుని నిర్మాల్యంతో (పూజలు, వ్రతాల్లో ఉపయోగించిన పూలు, పత్రి) తయారు చేసిన ఉత్పత్తులు.. అంటూ భక్తుల నమ్మకంతో రత్నగిరిపై జరుగుతున్న వ్యాపారం చూస్తూంటే ఆశ్చర్యం కలగకమానదు. ప్రజల్లో నానాటికీ పెరుగుతున్న భక్తి.. గో ఆరాధన.. పూజలు, వ్రతాల్లో ఉపయోగించిన పూలు, పత్రికి ఉన్న పవిత్ర భావన.. కొత్త కొత్త ఆలోచనలకు, వ్యాపారాలకు ఊతమిస్తున్నాయి. దీనిని అవకాశంగా తీసుకుంటున్న కొంత మంది.. గోమయంతో తయారు చేసిన విభూది, దేవుని నిర్మాల్యంతో తయారు చేసిన అగరువత్తులు, ప్రమిదల వంటి అనేక వస్తువులను వివిధ దేవస్థానాల్లో ఇబ్బడిముబ్బడిగా విక్రయిస్తున్నారు. లాభమే పరమావధిగా భక్తులను దోపిడీ చేస్తున్నారు. రత్నగిరిపై బీజం పడిందిలా.. మూడు నెలల క్రితం ఓ వ్యాపారి అన్నవరం దేవస్థానం అధికారులను కలిసి గో ఆధారిత ఉత్పత్తులు, దేవుని నిర్మాల్యంతో తయారు చేసే వివిధ వస్తువుల విక్రయానికి అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకున్నాడు. ఇతర దేవస్థానాల్లో కూడా తాను ఇదే విధంగా దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పాడు. ఇదే అదునుగా అన్నవరం దేవస్థానంలోని కొంత మంది ఉద్యోగులు ఆ వ్యాపారితో కుమ్మక్కయ్యారు. తమదైన శైలిలో చక్రం తిప్పి.. ఆ వ్యాపారి ప్రతిపాదనను దేవదాయ శాఖ కమిషనర్కు పంపించారు. దేవస్థానంలో పూజల్లో ఉపయోగించిన పూలు, పత్రి, బియ్యం, వక్కలను కేజీల లెక్కన కొనుగోలు చేస్తామని, వాటినే తిరిగి ఈ ఉత్పత్తుల తయారీకి వాడతామని ఆ వ్యాపారి చెప్పినట్లు ఆ ప్రతిపాదనలో పేర్కొన్నారు. దీంతో, ఈ ఉత్పత్తుల విక్రయాలకు వేలం నిర్వహించాలంటూ కమిషనర్ అనుమతి మంజూరు చేశారు. ఈ ఉత్పత్తుల విక్రయాల్లో ఏడాది అనుభవం ఉన్నవారే వేలంలో పాల్గొనాలంటూ టెండర్ షరతుల్లో పేర్కొన్నారు. ఫలితంగా స్థానిక వ్యాపారులెవరూ ఇందులో పాల్గొనలేదు. దీంతో, నెలకు కేవలం రూ.45 వేల అద్దెకే దేవస్థానంలోని తూర్పు, పశ్చిమ రాజగోపురాల వద్ద రెండు స్టాల్స్ ఏర్పాటుకు ఆ వ్యాపారి వేలం పాడుకున్నారు. చిన్న వ్యాపారానికీ రూ.లక్ష పైనే.. విచిత్రమేమిటంటే దేవస్థానంలో ప్రతి వ్యాపారానికి వేలం పాట ద్వారానే అనుమతి మంజూరు చేస్తారు. చిన్నపాటి వ్యాపారానికి కూడా అద్దె రూ.లక్షకు పైబడే ఉంటుంది. కొబ్బరి కాయలు అరటిపండ్లు తదితర పూజాద్రవ్యాలు, ఆవు నేతి దీపాల వంటి వ్యాపారాలకు ఏడాదికి సుమారు రూ.70 లక్షల నుంచి రూ.కోటి వరకూ వేలం పాట ఖరారవుతోంది. ఫ్యాన్సీ షాపులు, క్యాంటీన్ల వేలం ఏడాదికి రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ ఉంటోంది. చిన్నపాటి కాఫీ, టీ స్టాల్కు కూడా నెలకు రూ.50 వేలు పైనే ఉంటోంది. అటువంటిది స్వామివారి ఆలయానికి అతి తక్కువ దూరంలో ఈ రెండు స్టాల్స్ను కేవలం రూ.45 వేలకే ఏర్పాటు చేయడం వెనుక ఉన్న మతలబు ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. అపచారమో కాదో చూడకుండానే.. ఈ స్టాల్స్లో సంప్రదాయ కాటుక, సహజ కుంకుమ, పంచగవ్య సబ్బు, బిల్వ పత్రాలతో చేసిన సబ్బు, బిల్వ పత్రాలతో చేసిన షాంపూ, తులసి పౌడర్, తులసి సోప్, పంచతులసి డ్రాప్, బిల్వదళ పౌడర్, తులసి వాటర్, తులసి టీ, బిల్వ సోప్, తులసి నాజిల్ డ్రాప్స్, దశపత్రి కషాయం. నిర్మాల్య పత్రితో ఫినాయిల్, నిర్మాల్య పత్రితో ఫేస్ ప్యాక్, నిర్మాల్య పత్రితో కాళ్ల పగుళ్ల క్రీమ్, నిర్మాల్య పత్రితో మాయిశ్చరైజింగ్ క్రీమ్, నిర్మాల్య పత్రితో నొప్పి నివారణ తైలం, కామధేను హారతి, గోక్షీరాది తైలం, సహజ సున్నిపిండి విక్రయించడానికి అనుమతులిచ్చారు. వీటిల్లో దేవుని నిర్మాల్యంతో తయారు చేసిన ఫినాయిల్, ‘కాళ్ల పగుళ్లకు రాసుకునే తైలం’ కూడా ఉన్నాయి. దేవుని నిర్మాల్యంతో ఇటువంటి వస్తువుల తయారీయే తప్పని అనుకుంటే.. వీటి విక్రయాలకు సైతం గత ఈఓ వీర్ల సుబ్బారావు అనుమతివ్వడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇటువంటి వస్తువులు విక్రయించడం సరైనదో కాదో పరిశీలించకుండానే అనుమతులిచ్చారా.. లేక ఎవరి ఒత్తిళ్లయినా ఉన్నాయా అని పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. దేవస్థానం ఆవరణలో చెప్పులతోనే నడవకూడదని మైకులో రోజుకు వందసార్లు చెబుతారు. దేవుని పూజలో వాడిన పత్రి, పుష్పాలు, ప్రసాదాలు కింద పడితే వాటిని కాళ్లతో తొక్కడాన్ని అపచారంగానే భక్తులు భావిస్తారు. చెప్పులతో తొక్కడం మరింత అపచారం. అటువంటిది ఈ స్టాల్స్లో నిర్మాల్యంతో తయారు చేసిన ఫినాయిల్, కాళ్ల పగుళ్ల క్రీమ్ వంటి వాటి విక్రయాలకు అనుమతి ఇవ్వడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఈ జాబితాల్లో పేర్కొన్న మిగిలిన ఉత్పత్తులు ఎక్కడ తయారు చేస్తున్నారు.. తయారీకి సత్యదేవుని నిర్మాల్యమే ఉపయోగిస్తున్నారా వంటి అంశాలను అధికారులెవ్వరూ పరిశీలించిన దాఖలాల్లేవు. ఈఓ ఆరా ఈ స్టాల్స్ అనుమతులను దేవస్థానం ఈఓ వి.త్రినాథరావు శుక్రవారం పరిశీలించారు. ఈ ఉత్పత్తుల విక్రయాలకు గత ఈఓ అనుమతిచ్చిన విషయం ఈ సందర్భంగా తేటతెల్లమైంది. భక్తుల మనోభావాలకు విరుద్ధంగా, దేవస్థానం ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉండే ఉత్పత్తులను ఇక్కడ విక్రయించరాదని ఈఓ ఆదేశించారు. దీనిపై కమిషనర్కు ఆయన నివేదిక సమర్పించనున్నట్లు సమాచారం. ఆ ఫినాయిల్ బాటిల్స్ మాయం ‘సత్యదేవుని నిర్మాల్య పత్రితో తయారైన ఫినాయిల్’ అంటూ రత్నగిరిపై షాపులో సాగిస్తున్న అమ్మకాలపై ‘సత్యదేవుని సన్నిధిలో మహాపచారం’ శీర్షికన ‘సాక్షి’ శుక్రవారం ప్రత్యేక కథనం ప్రచురించింది. ఈ నేపథ్యంలో ఆ షాపులో ‘సత్యదేవుని నిర్యాల్య పత్రితో ఫినాయిల్’ అని స్టిక్కర్ అతికించి అమ్ముతున్న బాటిల్స్ను తీసేశారు. మిగిలిన ఉత్పత్తులను మాత్రం యథాతథంగా విక్రయిస్తున్నారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 30,000 గటగట (వెయ్యి) 27,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 26,500 గటగట (వెయ్యి) 23,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 15,000 – 16,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)15,000 – 16,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 6,000 కిలో 400 -
చిన్నారి ప్రాణాలు కాపాడిన జీజీహెచ్ వైద్యులు
కాకినాడ క్రైం: స్థానిక జీజీహెచ్ వైద్యులు ఒక పసివాడి ప్రాణాలు కాపాడారు. ఆ వివరాల్లోకి వెళితే.. పండా విజయదుర్గ అనే మహిళ మూడు రోజుల నుంచి జీజీహెచ్లోని న్యూరో మెడిసిన్ విభాగంలో ఫిట్స్తో చికిత్స పొందుతుంది. ఆమెకు ఎనిమిది నెలల కుమారుడు. ఆస్పత్రిలో తల్లితో పాటు ఉంటున్నాడు. శుక్రవారం ఉదయం ఆ చిన్నారి ఆడుకుంటూ అక్కడే ఉన్న మెంథోప్లస్ బామ్ డబ్బా ప్రమాదవశాత్తూ మింగేశాడు. డబ్బా బయటకు రాక ఊపిరాడక అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఈ విషయం గుర్తించిన తల్లి విజయదుర్గ తోటి రోగుల సహాయంతో బాలుడిని కింద అంతస్తులోని అత్యవసర విభాగంలో చేర్చింది. అప్పటికే బాలుడి నోటి నుంచి రక్తం కారడం మొదలైంది. తక్షణమే స్పందించిన క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుష్మ, సహ వైద్యులు సత్యవాణి, మాణిక్యం, కాంతిమ సహకారంతో అరగంట పాటు శ్రమించి బాలుడి గొంతు నుంచి మెంథోప్లస్ బామ్ డబ్బాను బయటకు తీసి ప్రాణాలు నిలిపారు. వైద్యుల కృషిని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి అభినందించడంతో పాటు బాలుడి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. -
30న రత్నగిరిపై ఉత్తర ద్వార దర్శనం
అన్నవరం: ఈ నెల 30న ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా రత్నగిరిపై సత్యదేవుని సన్నిధిలో ఉత్తర ద్వార దర్శనం, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు అన్నవరం దేవస్థానం ఈఓ వి.త్రినాథరావు శుక్రవారం తెలిపారు. ఆ రోజు తెల్లవారుజామున 4 గంటలకు సత్యదేవుని ఆలయంలో ఉత్తర ద్వారం వద్ద శ్రీమహావిష్డువు, శ్రీమహాలక్ష్మి అలంకరణలో సత్యదేవుడు, అమ్మవార్లను కొలువుదీరుస్తారు. పండితులు వివిధ పూజలు నిర్వహిస్తారు. తెల్లవారుజామున 5 గంటల నుంచి భక్తులను ఉత్తర ద్వార దర్శనానికి అనుమతిస్తారు. భక్తుల రద్దీని అనుసరించి సాయంత్రం 5 గంటల వరకూ ఈ దర్శనం కొనసాగుతుంది. ఆ రోజు ఉదయం 11 గంటలకు ఆలయ ప్రాకారంలో సత్యదేవుడు, అమ్మవారిని వెండి రథంపై ఊరేగిస్తారు. రాత్రి 7 గంటల నుంచి కొండ దిగువన గరుడ వాహనంపై స్వామి, అమ్మవార్లకు గ్రామోత్సవం నిర్వహిస్తామని ఈఓ తెలిపారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా దేవస్థానంలో చేస్తున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఉత్తర ద్వార దర్శనం కోసం ఏర్పాటు చేసే క్యూ లైన్లపై ఇంజినీరింగ్ అధికారులతో చర్చించారు. స్వామివారి ప్రసాద విభాగాన్ని పరిశీలించారు. ప్రసాదం తయారీలో ఉపయోగిస్తున్న నెయ్యి, పంచదార, ఇతర దినుసులను పరిశీలించారు. అక్కడి సిబ్బంది సమస్యలపై ఆరా తీశారు. భక్తులు మెచ్చే విధంగా ప్రసాదం తయారు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో దేవస్థానం ఈఈ వి.రామకృష్ణ, ఏఈఓలు భాస్కర్, ఎలక్ట్రికల్ డీఈ సత్యనారాయణ, ప్రసాదం విభాగం సూపరింటెండెంట్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తొలి తిరుపతిలో.. పెద్దాపురం (సామర్లకోట): పెద్దాపురం మండలంలో తొలి తిరుపతి గ్రామంలోని శృంగార వల్లభ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ నెల 30న ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఈఓ వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. స్వామివారికి 29న ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తామన్నారు. మంగళవారం తెల్లవారుజామున 3.30 నుంచి 4.30 గంటల వరకూ మేలుకొలుపు హారతి, సుప్రభాత సేవ నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం 4.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకూ భక్తులకు స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తామని చెప్పారు. భక్తులకు ఉచిత దర్శనం ఏర్పాట్లు చేస్తున్నామని ఈఓ శ్రీనివాసరావు, చైర్పర్సన్ మొయిల సంధ్య తెలిపారు. భక్తులకు ప్రసాద వితరణ ఉంటుందన్నారు. పోస్టాఫీసుల పనివేళల పెంపు బాలాజీచెరువు (కాకినాడ సిటీ): కాకినాడ డివిజన్లోని పోస్టాఫీసుల పని వేళలను పొడిగించినట్లు కాకినాడ పోస్టల్ సూపరింటెండెంట్ కె.కృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీఎస్పీ క్యాంపస్ ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ.. గాంధీ నగర్, జగన్నాయక్పూర్, పెద్దాపురం పోస్టాఫీసులు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకూ.. జేఎన్టీయూకే తపాలా కార్యాలయం ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకూ.. జగ్గంపేట పోస్టాఫీసు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకూ పని చేస్తాయని వివరించారు. -
రాతనాల్లా మార్చుకుందామా..
ఫ మంచి దస్తూరితో భవితకు బాట ఫ పదో తరగతిలో మంచి మార్కులకు దోహదం ఫ విద్యార్థులకు తర్ఫీదు ఇస్తున్న ఉపాధ్యాయులు రాయవరం/ ప్రత్తిపాడు: మా అబ్బాయి చాలా బాగా చదువుతాడు.. కానీ అందుకు తగ్గట్టుగా మార్కులు రావడం లేదు.. మా అమ్మాయి లెక్కలు బాగా చేస్తోంది. సూత్రాలు, ఫార్ములాలు మాత్రం ఎందుకో తప్పుగా కనిపిస్తుంటాయని ఉపాధ్యాయులు తరచూ చెప్పే మాటలివి.. ఇందుకు కారణం చేతిరాతే. ‘రాత బాగుంటే గీత బాగుంటుంది’ అన్న నానుడి పరీక్ష రాసే విద్యార్థికి ‘అక్షరాలా’ సరిపోతుంది. మంచి దస్తూరి ఉంటే మూల్యాంకనం సమయంలో సమాధాన పత్రాలు దిద్దే ఉపాధ్యాయుడికి మంచి భావన కలుగుతుంది. ఆ ప్రభావం మార్కులపై ఉంటుంది. అందుకే పరీక్షల్లో తెలివితో పాటు అక్షరాలు కూడా ఆయుధాలుగా పనిచేస్తాయని ఉపాధ్యాయులు చెబుతారు. ఇవి పాటిస్తే మంచిది ఫ పేజీ పైభాగంలో ఒక అంగుళం, ఎడమ వైపు అంగుళం మార్జిన్ విడిచి పెట్టాలి. ఫ సమాధాన పత్రంలో రాసే జవాబు సూటిగా ఉండటంతో పాటు అక్షరాలు పొందికగా రాయాలి. ఫ అక్షరాలు వంకర టింకరగా, గజిబిజిగా ఉంటే మార్కులు తగ్గినట్టే. ఫ పేజీకి 16 నుంచి 20 లైన్లకు మించకుండా రాయాలి. ఫ సమాధానాలు రాసే సమయంలో ప్యాడ్పైకి వాలిపోకుండా సాధ్యమైనంత వరకూ కూర్చుని రాయాలి. ఫ రెండు పదాల మధ్య ఒక అక్షరం లేదా ‘0’ పట్టేంత ఖాళీ స్థలం ఉండాలి. రెండు వరుసల మధ్య అర అంగుళం దూరం వదలాలి. ఫ కంటికి పేపరుకు 30–35 సెంటీమీటర్ల దూరం ఉండాలి. ఫ అక్షరాలన్నీ ఒకే సైజులో, ఒకే లైనులో ఉంటేనే రాత అందంగా వస్తుంది. ముందుగా ఫోర్ రూల్, తర్వాత డబుల్ రూల్, అనంతరం సింగిల్ రూల్పై ప్రాక్టీస్ చేయాలి. ఫ ఇంగ్లిష్లో కర్సివ్, లుసిడా రైటింగ్ను ప్రాక్టీస్ చేయాలి. వరుస క్రమంలో కనీసం పది రోజులు తర్ఫీదు తీసుకోవాలి. ఫ మొదటగా లెటరింగ్, తర్వాత వర్డింగ్, అనంతరం సెంటెన్సెస్ రాయడం నేర్చుకోవాలి. ఫ గొలుసుకట్టు రాత ఉండకూడదు. ప్రతి అక్షరం ఒకే పరిమాణంలో రాయాలి. ఫ పెన్నును మామూలుగా పట్టుకోవాలి. బిగుసుగా పట్టుకుంటే వేగంగా రాయలేం. అక్షరాల స్పష్టతకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఫ ప్రాథమిక స్థాయి నుంచే మంచి రాత అలవాటు చేసుకోవాలి. తెల్ల కాగితంపై వరుస తప్పకుండా రాయగలగాలి. సాధనతోనే సాధ్యంప్రతి విద్యార్థికి తెలివి తేటలకు తోడు, సమయ పాలనకు, సహనానికి దస్తూరి ఓ సూచికగా చెప్పవచ్చు. అందుకే మంచి దస్తూరి ఉన్న విద్యార్థులే దాదాపు టాపర్లుగా నిలుస్తున్నారు. మార్చి 16వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల పరిధిలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ఉపాధ్యాయులు శ్రమిస్తున్నారు. ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఎలాంటి దిద్దుబాట్లు, కొట్టివేతలు లేకుండా రెండున్నర గంటల్లో స్పష్టంగా పరీక్ష రాయాలి. అందుకే ఇప్పుడు అందరి దృష్టి చేతిరాతపై పడింది. ఇందుకు తగిన తర్ఫీదును ఉపాధ్యాయులు ఇస్తూ సాధన చేయిస్తున్నారు. పరీక్ష నెమ్మదిగా రాస్తే సమయం సరిపోదు. వేగంగా రాసేటప్పుడు తప్పులు దొర్లకుండా చూసుకోవాలి.ఇలా చేయాలంటే ముందుగా ప్రత్యేక తరగతులు, స్లిప్, గ్రాండ్ టెస్టులు సద్వినియోగం చేసుకోవాలని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు. ముత్యాల్లాంటి అక్షరాలు మంచి మార్కులు తెచ్చిపెడతాయి.. విద్యార్థి భవితకు బాటలు వేస్తాయి.. సమయాన్ని వృథా చేయకుండా ప్రణాళిక ప్రకారం అన్ని సబ్జెక్టుల్లో పట్టు సాధించడంతో పాటు, మంచి దస్తూరితో అనేక ప్రయోజనాలు చేకూరుతాయి.. మనం ఏం రాశామన్నది పేపర్లు మూల్యాంకనం చేసే ఉపాధ్యాయులకు అర్థం అయ్యేట్టు ఉంటేనే ఎక్కువ మార్కులు వస్తాయి.. దీనికోసం మంచి దస్తూరిపై ఇప్పటి నుంచే దృష్టి సారిస్తే పదో తరగతి పరీక్షల్లో ఇబ్బందులు ఉండవని నిపుణులు సూచిస్తున్నారు. -
రత్నగిరిపై రద్దీ
అన్నవరం: రత్నగిరికి శుక్రవారం వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. దీంతో, ఆలయ ప్రాంగణం, వ్రత, విశ్రాంతి మండపాలన్నీ భక్తులతో నిండిపోయాయి. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. సత్యదేవుడిని దర్శించిన అనంతరం భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి, రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. స్వామివారిని సుమారు 30 వేల మంది దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. సత్యదేవుని వ్రతాలు 2,100 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సుమారు 5 వేల మంది సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. -
ప్రజాస్వామిక శక్తులను బలోపేతం చేయాలి
● రాజ్యాంగాన్ని, దేశాన్ని కాపాడుకోవాలి ● సీపీఐ నేత మధు ● ఘనంగా ఆ పార్టీ శతజయంతి ఉత్సవాల ముగింపు సభ సామర్లకోట: రాజ్యాంగాన్ని, దేశాన్ని కాపాడుతూ, లౌకిక, ప్రజాస్వామ్య పార్టీలను, శక్తులను బలోపేతం చేయాల్సిన అవసరముందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తాటిపాక మధు అన్నారు. సీపీఐ శత జయంతి ఉత్సవాల జిల్లా స్థాయి ముగింపు సభ శుక్రవారం సామర్లకోటలో జరిగింది. ఈ సందర్భంగా స్థానిక మెహర్ కాంప్లెక్స్ నుంచి మెయిన్ రోడ్డు మీదుగా లారీ స్టాండ్ వద్ద ఉన్న సీపీఐ కార్యాలయం వరకూ ప్రజా ప్రదర్శన నిర్వహించారు. అక్కడ సీపీఐ పతాకాన్ని పార్టీ సీనియర్ నాయకుడు చెరుకూరి సుబ్బారావు మాస్టారు ఆవిష్కరించారు. పార్టీ కార్యాలయాన్ని మధు ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ, ప్రస్తుతం దేశం సంక్షోభంలో ఉందని, క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటోందని అన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాకర్టీ ప్రైవేటీకరణకు రంగం సిద్ధం చేస్తున్నారన్నారు. కేంద్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకున్న మతతత్వ శక్తులు అంబేడ్కర్ వంటి మహనీయులు అందించిన రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తున్నాయని ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు.. రాజ్యాంగం ప్రకారం ఏర్పడిన లౌకిక, ప్రజాస్వామ్య, సంక్షేమ దేశాన్ని మత రాజ్యంగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. దీనిలో భాగంగానే దేశాన్ని, దేశ చరిత్రను మార్చేందుకు రాజ్యాంగం నుంచి సెక్యులరిజం పదాన్ని తొలగించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు. లౌకిక, ప్రజాస్వామ్య, ఫెడరల్ వ్యవస్థలు మతతత్వ శక్తుల దాడికి గురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోయి ప్రజల జీవితాలు దుర్భరంగా మారిపోయాయని అన్నారు. ఈ పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని, దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత లౌకిక, ప్రజాస్వామ్య, వామపక్ష శక్తులపై ఉందని మధు చెప్పారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వచ్చిన తరువాత ప్రపంచంలో యుద్ధ వాతావరణం ఏర్పడిందన్నారు. కమ్యూనిస్టుల లక్ష్యమైన కుల, మత రహిత సోషలిస్టు సమాజ నిర్మాణానికి నిరంతరం పోరాడతామని ప్రతిజ్ఞ చేశారు. సీపీఐ వందేళ్ల పోరాట వారసత్వాన్ని యువత ముందుకు తీసుకు వెళ్లాలని కోరారు. సీపీఐ పట్టణ కార్యదర్శి పెదిరెడ్ల సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి కె.బోడకొండ, సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు పప్పు ఆదినారాయణ, సీనియర్ నాయకులు చింతపల్లి సుబ్బారావు, కట్ట సత్యనారాయణ, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వై.బాబు, ఏఐఎస్ఎఫ్ నేత నాని స్టాలిన్, మున్సిపల్ యూనియన్ నాయకులు నందకిషోర, బొత్స శ్రీనివాసు, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ కార్యకర్తలను సత్కరించారు. -
సత్యదేవుని సన్నిధిలో మహాపచారం
● పూజలో వాడిన పూలతో ఫినాయిల్ తయారీ! ● అన్నవరం దేవస్థానంలో విక్రయాలు ● ఆవేదన చెందుతున్న భక్తులుఅన్నవరం: ‘సంపద సృష్టి’ంచే నేటి పాలకుల హయాంలో ప్రతిదీ వ్యాపార మయమైపోతోంది. దాదాపు అన్ని వ్యవస్థలూ ప్రతి అంశాన్నీ డబ్బుతోనే లెక్కిస్తున్న దురవస్థలో కూరుకుపోతున్నాయి. ఈ క్రమంలో దేవుని సన్నిధిలో అపచారం చేస్తున్నామనే ఆలోచన కూడా వదిలేసినట్లు కనిపిస్తోంది. సాధారణంగా పూజ పూర్తి చేసిన అనంతరం.. ఏ దేవుడు/దేవతను అర్చిస్తున్నారో వారి పేరు స్మరించుకుని, ‘... ప్రసాదం శిరసా గృహ్ణామి’ అని చెప్పుకొంటూ.. ఆ స్వామి/అమ్మవారిని అర్చించిన పూలను భక్తులు భక్తితో కళ్లకు అద్దుకుని, శిరస్సున పెట్టుకుంటారు. ఆ తరువాతో.. ఆ మర్నాడో పూజ చేసి పూలు, పత్రిని (నిర్మాల్యం) ఎవ్వరూ కాలితో తొక్కని చోట వేస్తారు. లేదా నదులు, చెరువుల్లో కలుపుతారు. కానీ, అన్నవరం దేవస్థానంలో మాత్రం దీనికి భిన్నంగా చేస్తున్నారు. ‘నిర్మాల్య పత్రితో’ అని రాసి మరీ.. సత్యదేవుని వ్రతాలు, ఇతర పూజల్లో ఉపయోగించిన పూలు, పత్రి, ఇతర నిర్మాల్యంతో వివిధ రకాల పొడులు, నూనెలు, అగరుబత్తీలు తయారు చేస్తున్నారు. వీటిని భక్తులకు విక్రయించేందుకు దుకాణాలు ఏర్పాటు చేశారు. వీటికి ప్రతి నెలా రూ.50 వేల అద్దె వసూలు చేస్తున్నారు. వీటిల్లో గోమయంతో తయారు విభూతి కూడా విక్రయిస్తున్నారు. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ, ఎవరి ఆలోచనో కానీ.. స్వామివారి నిర్మాల్యంతో ఏకంగా ఫినాయిల్ తయారు చేసేస్తున్నారు. పైగా ఆ బాటిల్పై భక్తవరదుడైన శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి ఫొటోతో కూడిన లేబుల్ సైతం అతికించేశారు. దానిపై ‘అన్నవరం సత్యనారాయణ స్వామి వారి నిర్మాల్య పత్రితో ఫినాయిల్’ అని స్పష్టంగా రాసి ఉంది. ఈ ఫినాయిల్ లీటర్ బాటిల్ను రూ.100కు విక్రయిస్తున్నారు. ఈ దుకాణాన్ని బుధవారం ప్రారంభించారు. అయితే, ఫినాయిల్ బాటిల్పై స్వామివారి ఫొటో ఉన్న లేబుల్ అతికించడంపై కొంతమంది భక్తులు అభ్యంతరం చెప్పారు. దీంతో, ఆ ఫొటోపై ‘ద్వారకా తిరుమల’ అనే స్టిక్కర్ అతికించి విక్రయిస్తున్నారు. సాధారణంగా ఫినాయిల్ను టాయిలెట్స్ కడగడానికి ఉపయోగిస్తారు. అటువంటి ఫినాయిల్ను దేవుని నిర్మాల్యంతో తయారు చేయడమేమిటో.. దానిని విక్రయించడానికి అనుమతించడమేమిటో.. ఇదేమి అపచారమోనని భక్తులు ఆవేదన చెందుతున్నారు. గతంలోనూ అపచారాలు అన్నవరం దేవస్థానంలో అధికారులు మారినా అపచారాలు మాత్రం జరిగిపోతూనే ఉన్నాయి. ఈఓలతో సంబంధం లేకుండా కింది స్థాయి అధికారులు చేపడుతున్న చర్యలు వివాదాస్పదమవుతున్నాయి. గత ఈఓ వీర్ల సుబ్బారావు హయాంలో రత్నగిరిపై రామాలయం పక్కన స్వామివారి వార్షిక కల్యాణ మండపం ఎదురుగా ఉన్న షెడ్డులో వివాహం కోసం పెద్ద కల్యాణ మండపం సెట్టింగ్ వేశారు. అదే రోజు వార్షిక కల్యాణ మండపంలో జరిగిన సూర్య నమస్కారాలను తిలకించడానికి ఈ సెట్టింగ్ అడ్డంగా ఉందంటూ అప్పట్లో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, గత మే నెలలో సత్యదేవుని వార్షిక దివ్య కల్యాణ మహోత్సవాల సందర్భంగా వనదుర్గ అమ్మవారికి శుక్రవారం జరిగే చండీ హోమం, పౌర్ణమి నాడు జరిగే ప్రత్యంగిర హోమాలు చేయలేదు. అంతకు ముందెన్నడూ ఇలా జరగకపోవడంతో దీనిని అపచారమనే భక్తులు భావించారు. తాజాగా స్వామివారి నిర్మాల్యంతో తయారు చేసిన ఫినాయిల్ విక్రయించడం పెద్ద అపచారంగా చెప్పవచ్చు. అటువంటివి విక్రయించనీయం దేవస్థానంలోని పూజలు, వ్రతాల్లో వచ్చిన నిర్మాల్యం, పత్రితో తయారు చేసిన ఉత్పత్తుల విక్రయానికి గతంలో ఈఓ అనుమతి ఇచ్చారు. ఆ షాపు బుధవారమే ప్రారంభించారు. అందులో ఏయే ఉత్పత్తులు విక్రయిస్తున్నారో ఇంకా పరిశీలించలేదు. భక్తుల మనోభావాలు దెబ్బ తినేలా, దేవస్థానం పవిత్రతకు భంగం వాటిల్లేలా ఉండే వస్తువులను ఇక్కడ విక్రయించనీయం. ఆ షాపు అగ్రిమెంట్ను శుక్రవారం పరిశీలించి, తగు చర్యలు తీసుకుంటాం. – వి.త్రినాథరావు, ఈఓ, అన్నవరం దేవస్థానం -
నేత కార్మికులకిచ్చిన హామీలు అమలు చేయాలి
● రూ.170 కోట్ల బకాయిలు చెల్లించాలి ● ఆలిండియా వీవర్స్ ఫెడరేషన్ నేత డిమాండ్ పిఠాపురం: నేత కార్మికులకిచ్చిన ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని ఆలిండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ కార్యవర్గ సభ్యుడు పప్పు దుర్గా రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫెడరేషన్, చేనేత సహకార సంఘాల జేఏసీ ఆధ్వర్యాన పిఠాపురం సూర్యరాయ గ్రంథాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆప్కో ద్వారా గత ఆరేళ్ల నుంచి కొన్ని చేనేత సహకార సంఘాలకు, 12 సంవత్సరాల నుంచి మరికొన్నింటికి రావాల్సిన సుమారు రూ.170 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. గతంలో నిలిచిపోయిన త్రిఫ్ట్ ఫండ్, నూలు సబ్సిడీ, 30 శాతం రిబేటు బకాయిలను కూడా చెల్లించాలని కోరారు. చేనేత సహకార సంఘాల నుంచి వస్త్రాల కొనుగోలును కొనసాగించాలని, పావలా వడ్డీ రుణ పథకం వెంటనే ప్రారంభించాలని, చేనేతలకు ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.25 వేల నేతన్న భరోసా పథకాలను వెంటనే అమలు చేయాలని దుర్గా రమేష్ డిమాండ్ చేశారు. న్యాయపరమైన అడ్డంకులను తొలగించి, చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని వివిధ సంఘాల నాయకులు కోరారు. బోగస్ చేనేత సొసైటీలపై విచారణ జరిపించి, చర్యలు తీసుకోవాలన్నారు. సంక్రాంతిలోగా వంద శాతం బకాయిలను ఆప్కో చెల్లించకుంటే చేనేత సహకార సంఘాలు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 18 చేనేత కుల సంఘాలతో కలిపి రిలే నిరాహార దీక్షలు చేపడతామని, అవసరమైతే ఆమరణ దీక్ష నిర్వహించేలా కార్యాచరణ రూపొందించామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. చేనేతలకు, ప్రభుత్వానికి మధ్య అడ్డంకిగా మారిన హ్యాండ్లూమ్ కమిషనర్, ఆప్కో ఎండీ రేఖారాణిని వేరే శాఖకు బదిలీ చేయాలని డిమాండ్ చేశారు, విలేకర్ల సమావేశంలో సీనియర్ చేనేత నాయకుడు కోమాకుల సత్యనారాయణ, చేనేత సహకార సంఘాల సీనియర్ నాయకుడు పడాల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
న్యాయం కావాలి
● మహిళా పోలీస్ స్టేషన్ ఎదుటే వివాహిత ధర్నా ● ఏడాదిన్నర బిడ్డతో నిరసన ● వదిలి వెళ్లిపోయిన భర్త నిర్వాకంపై ఫిర్యాదు కాకినాడ క్రైం: తనకు న్యాయం చేయాలని కోరుతూ ఓ మహిళ ఏడాదిన్నర బిడ్డతో కలసి కాకినాడ మహిళా పోలీస్ స్టేషన్ వద్ద నిరసన తెలపడం సంచలనం రేపింది. వివరాలివీ.. స్థానిక జగన్నాథపురానికి చెందిన మల్లాడి సునీత(24)కు కోటిపల్లికి చెందిన కార్పెంటర్ సూర్యప్రకాష్తో వివాహమైంది. వారికి ఏడాదిన్నర వయసున్న బాబు ఉన్నాడు. అయితే, అదనపు కట్నం రూ.3 లక్షలు తేవాలంటూ భర్త తనను వేధిస్తున్నాడని ఆరోపిస్తూ సునీత ఏడాదిన్నర క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేసింది. నాటి నుంచి నేటి వరకూ ఈ ఫిర్యాదుపై పోలీసులు ఎటువంటి చర్యలూ తీసుకోలేదని, తన భర్త నుంచి డబ్బులు తీసుకుని, రేపుమాపు, కౌన్సెలింగ్ అంటూ ఉద్దేశపూర్వకంగా తాత్సారం చేస్తున్నారని సునీత ఆరోపించింది. తన భర్త తరఫున రాజకీయ నాయకులు వత్తాసు పలుకుతున్నారని, పోలీసులు కేసు నమోదు చేయకుండా వారు అడ్డు పడుతున్నారని వాపోయింది. తాను తల్లిదండ్రులు లేని అనాథనని, ఏ ఆధారమూ లేక, తినేందుకై నా గత్యంతరం లేని స్థితిలో చంటి బిడ్డతో బతుకుతున్నానని చెప్పింది. డబ్బు కోసం పోలీసులు తన జీవితంతో ఆడుకుంటున్నారని కన్నీటి పర్యంతమైంది. కేసు నమోదు చేసి, తనకు న్యాయం చేయాలనే డిమాండుతో సునీత నిరాహార దీక్షకు దిగి, గురువారం ఉదయం నుంచీ స్టేషన్ బయటనే బైఠాయించింది. అక్కడి నుంచి వెళ్లిపోవాలని మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బంది చెప్పారని, తాను వెళ్లకపోవడంతో వారు తనను బలవంతంగా స్టేషన్లోకి లాక్కెళ్లారని చెప్పింది. చంటిబిడ్డతో ఉన్న తనను తీవ్రంగా బెదిరించారని, తన ఫోన్ బలవంతంగా లాక్కున్నారని ఆరోపించింది. తనను లాక్కెళ్లే క్రమంలో బిడ్డకు దెబ్బలు తగులుతున్నా నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారని, కనీసం తనను వాష్ రూముకు కూడా పంపకుండా చిత్రహింసలకు గురి చేశారని సునీత చెప్పింది. తాను, తన బిడ్డ ఉదయం నుంచీ ఆహారం ముట్టుకోలేదని, తన బిడ్డ నీరసించి తల వెనక్కి వాల్చేస్తే భయపడి గట్టిగా ఏడ్చానని, బాబు పరిస్థితి చూసిన పోలీసులు అప్పటికప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నామంటూ హడావుడి చేశారని తెలిపింది. తాను అక్కడి నుంచి బలవంతంగా బయటపడి తన బిడ్డను ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్లానని సునీత చెప్పింది. కాగా, గురువారం రాత్రి ఎఫ్ఐఆర్ నమోదు చేసే సమయానికి సునీత తన బిడ్డతో స్టేషన్ నుంచి వెళ్లిపోయిందని పోలీసులు చెప్పారు. -
కోఢీ.. రెడీ!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: సంక్రాంతి సంబరాలకు సమయం సమీపిస్తూండటంతో రూ.కోట్లు కొల్లగొట్టే కోడి పందేలకు నిర్వాహకులు ఇప్పటి నుంచే కాలు దువ్వుతున్నారు. బరుల కోసం ఇప్పటికే వెతుకులాట ప్రారంభించారు. ఎక్కడెక్కడ బరులు ఏర్పాటు చేయాలి, పందేల నిర్వహణకు సంబంధించి ఎవరెవరికి ఎంతెంత ముట్టచెప్పాలనే దానిపై అంచనాలు వేసుకోవడంలో తలమునకలవుతున్నారు. బేరసారాలకు తలుపులు బార్లా తెరిచారు. ప్రతి ఏడాది మాదిరిగానే కోడి పందేలు వేస్తే తోలు తీస్తామంటూ పోలీసులు భీకర హెచ్చరికలు చేస్తున్నా.. వాటిని నిర్వాహకులు షరా మామూలుగానే తేలికగా తీసుకుంటున్నారు. గత ఏడాది కంటే రెట్టింపు బరులు వేయాలనే పట్టుదలతో పకడ్బందీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మూడు పుంజులు.. ఆరు పందేలు ఏటా సంక్రాంతి పండగ వస్తోందంటే చాలు.. జిల్లాలోని జగ్గంపేట, గోకవరం, గండేపల్లి, తుని రూరల్, తొండంగి, పిఠాపురం, గొల్లప్రోలు, కాకినాడ రూరల్, కరప మండలాల్లో కోడి పందేలు యమ జోరుగా సాగుతూంటాయి. కోడి పందేల ముసుగులో గుండాట, నంబర్ లాటరీలకు కూడా ఈ మండలాలు పెట్టింది పేరుగా నిలుస్తున్నాయి. వాస్తవానికి చంద్రబాబు ప్రభుత్వం గద్దెనెక్కాక కాకినాడ సిటీ, రూరల్ సహా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ గంజాయి, పేకాట, సింగిల్ నంబర్ లాటరీలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే సంక్రాంతి పండగ నాటికి కోడి పందేలు నిర్వహించి తీరుతామని ఇప్పటికే నిర్వాహకులు చాలెంజ్లు చేస్తున్నారు. అధికార పార్టీ నేతల అండదండలతో ‘మూడు పుంజులు.. ఆరు పందేలు’ అనే రీతిలో కోడిపందేలు నిర్వహించడం ఖాయమని ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు. పండగ పూట కోడికి కత్తి కట్టకుండా సరదాగా పందేలు వేసుకుంటే ఎటువంటి అభ్యంతరం ఉండదని, కత్తి కడితే మాత్రం పందేలను అడ్డుకుని తీరుతామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయితే, ఇప్పుడలానే అంటారని, పండగ దగ్గర చేసి ఈ మాటలేవీ చెల్లవని, ఏమైనా తేడా వస్తే తమ నాయకులే చూసుకుంటారని పందేల నిర్వాహకులు అంటున్నారు. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లో పోలీసులతో సైతం బేరసారాల్లో మునిగితేలుతున్నారు. రోజుకు రూ.30 లక్షల మేర.. జిల్లాలో ఈసారి ప్రధానంగా కాకినాడ రూరల్, జగ్గంపేట, పిఠాపురం నియోజకవర్గాలు కోడి పందేలకు కేరాఫ్గా నిలవనున్నాయి. ప్రతి బరిలో రోజుకు ఐదారు పెద్ద పందేలు, రెండు మూడు కొసరు పందేలు వేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఒక్కో బరిలో రోజుకు తక్కువలో తక్కువ రూ.30 లక్షల విలువైన కోడి పందేలు నిర్వహించాలని భావిస్తున్నారు. దీనికి ఎంత ఖర్చవుతుంది, ఎంత మిగులుతుందనే లెక్కలేస్తున్నారు. కాకినాడ రూరల్, కరప మండలాల్లో ఈసారి జనసేన గ్రామ స్థాయి నేతలు గ్రామాల వారీగా బరులు వేసే ఏర్పాట్లలో ఉన్నారు. గత ఏడాది సంక్రాంతి సందర్భంగా ఈ మండలంలో విచ్చలవిడిగా జరిగిన పందేల్లో లక్షలాది రూపాయలు చేతులు మారాయి. ఈసారి కూడా ఎవరికీ ఎటువంటి ఇబ్బందీ లేకుండా పార్టీ నియోజకవర్గ ముఖ్య నేత మాట తీసుకుని మరీ నిర్వాహకులు ముందడుగు వేస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసులతో ద్వితీయ శ్రేణి నేతలు ముందస్తు మంతనాలు సాగిస్తున్నారు. జరిగే పందేలను బట్టి బరులకు రేట్లు నిర్ధారించాలనే నిర్ణయానికి వచ్చారు. ముఖ్య నేతల కనుసన్నల్లో.. నిర్వాహకులు మారుతున్నారే తప్ప పందేలు మాత్రం ఎప్పటి మాదిరిగానే జరిపే ఏర్పాట్లలో ఉన్నారు. ఉదాహరణకు మండల కేంద్రమైన కరప, గురజనాపల్లి, గొర్రిపూడి, కొంగోడు, విజయరాయుడుపాలెం, వేళంగి, వేములవాడ గ్రామాల్లో గత ఏడాది వేసిన భారీ బరుల్లో రూ.లక్షలు చేతులు మారాయి. ఈసారి సంక్రాంతికి వేళంగి, గురజనాపల్లి మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ పందేలకు బరిలు సిద్ధమవుతున్నాయి. గత ఏడాది గురజనాపల్లిలో నష్టం వచ్చిందనే కారణంతో ఈసారి నిర్వహించేందుకు వెనకడుగు వేశారని అంటున్నారు. కరపలో మాత్రం ఈసారి రెండు బరులు వేసేందుకు సిద్ధపడుతున్నారు. ఒక్కో బరిలో గుండాట నిర్వాహకులు రూ.40 లక్షలకు తక్కువ కాకుండా ముట్టజెప్పేలా ఒప్పందాలు కుదుర్చుకున్నారని చెబుతున్నారు. ఇక్కడ జనసేనలో రెండు వర్గాలు రెండు బరులకు ఏర్పాట్లు చేస్తున్నాయి. కరప – పెనుగుదురు మధ్య ఒక ప్రైవేట్ లే అవుట్లో బరి ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. కాకినాడ రూరల్ తిమ్మాపురం, సర్పవరం ప్రాంతాల్లో సైతం భారీ బరుల ఏర్పాటుకు బేరసారాలు కుదిరాయి. ఒక్కో బరికి రూ.30 లక్షల మేర ఒప్పందానికి వచ్చారని అంటున్నారు. అలాగే, తూరంగి, వాకలపూడి, వలసపాకలు, గొడారిగుంటల్లో ద్వితీయ శ్రేణి బరులు ఏర్పాటు చేసే పనిలో నిర్వాహకులున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ ముఖ్య నేతల కనుసన్నల్లోనే బేరసారాలు సాగుతూండటం విశేషం. పందేలకు పుంజులను సిద్ధం చేస్తున్న నిర్వాహకులు (ఫైల్)బరిలో తలపడుతున్న పందెం పుంజులు (ఫైల్) కాలు దువ్వుతున్న పందెం కోడి పందెం బరులకు ముఖ్య నేతల కనుసన్నల్లో ఒప్పందాలు జోరుగా బేరసారాలు బరుల వేటలో పందెంరాయుళ్లు ఆ మూడు నియోజకవర్గాలే కీలకం -
ఐక్యత లేకనే హిందూ మతంపై దాడులు
● రాధామనోహర్ దాస్ ● వాకలపూడిలో హిందూ సమ్మేళనం కాకినాడ రూరల్: హిందువుల్లో ఐక్యత లేకనే హిందూ మతంపై దాడులు జరుగుతున్నాయని ఆధ్యాత్మికవేత్త రాధామనోహర్ దాస్ అన్నారు. ఆర్ఎస్ఎస్ స్థాపించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా వాకలపూడిలో గురువారం ఏర్పాటు చేసిన హిందూ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రపంచంలోని అన్ని మతాల కన్నా హిందూ మతం చాలా గొప్పదని అన్నారు. దేశంలోని వారు మతం మారినంత మాత్రాన మానవత్వం మరచిపోరాదని కోరారు. భారతదేశానికి జన్మించిన పాకిస్థాన్, బంగ్లాదేశ్లు నేడు హిందూ మతానికి వ్యతిరేకంగా యుద్ధాలు చేస్తున్నాయని, వారి పీచం అణచివేయాలని పిలుపునిచ్చారు. హిందూ సంస్కృతీ సంప్రదాయాలను నాశనం చేయాలని చూస్తున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. వెయ్యి సంవత్సరాలుగా హిందూ మతంపై అనేక దాడులు జరిగాయని చెప్పారు. ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు దంగేటి సత్యనారాయణ, సాధుల శేషపాన్పు, బిందుశ్రీ తదితరులు కూడా ప్రసంగించారు. తొలుత సాంస్కృతిక కార్యక్రమాలు, వేద మంత్ర పఠనం నిర్వహించారు. కార్యక్రమంలో కాకినాడ హిందూ సమ్మేళన నిర్వహణ సమితి నాయకులు సుబ్రహ్మణ్యం, రామరాజు, అప్పాజీ తదితరులతో పాటు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. -
బాధితుడికి ఆర్థిక సాయం
కాకినాడ క్రైం: ‘నీ చేయి పని చేయదు.. పెన్షన్ రాద్దాంలే’ శీర్షికన ‘సాక్షి’ ఈ నెల 16న ప్రచురించిన కథనానికి స్పందన వచ్చింది. పెదపూడి మండలం కైకవోలు గ్రామానికి చెందిన 42 ఏళ్ల పెరుగుల వెంకట రమణ ఈ ఏడాది మార్చి 18న ద్విచక్ర వాహనం స్టాండ్ వేస్తూ పడిపోయాడు. ఈ ఘటనలో అతడి కుడి చేతికి గాయమైంది. కాకినా డ జీజీహెచ్ వైద్యులు అతడికి తొలుత కట్టు కట్టి, డిశ్చార్జి చేశారు. ఏప్రిల్ 7న శస్త్రచికిత్స చేశారు. అప్పటి నుంచీ వెంకట రమణ కుడి చేయి మెల్లగా అచేతనంగా మారుతూ కదల్లేని స్థితికి చేరింది. సర్జరీ సమయంలో జీజీహెచ్ వైద్యులు మోచేతిలో బాల్ వంటి నిర్మాణం తీసేశారని ఓ ప్రైవేటు వైద్యుడు చెప్పడంతో తనకు జరిగిన అన్యాయంపై వెంకట రమణ ఈ నెల 8న జీజీహెచ్ సూపరింటెండెంట్కు ఫిర్యాదు చేశారు. అనంతరం అక్కడి ఆర్థోపెడిక్ వైద్యుడు శివానందం కూడా సర్జరీలో తేడా జరిగిందని, చేయి రాదని, కావాలంటే పెన్షన్ పెడదామని అన్నారు. దీనిపై బాధితుడు కలెక్టరేట్ గ్రీవెన్స్లో నేరుగా కలెక్టర్కు తన సమస్యను నివేదించాడు. దీనిపై ఈ నెల 16న ‘సాక్షి’ దినపత్రిక కథనం ప్రచురించింది. దీని ద్వారా వెంకట రమణ కష్టం తెలుసుకుని విశ్రాంత డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ వి.శ్రీనివాసరావు చలించిపోయారు. అతడికి సామాజికవేత్త, కరప మాజీ సర్పంచ్ పోలిశెట్టి తాతీలు సాయంతో రూ.20 వేల ఆర్థిక సాయం అందించారు. కష్ట కాలంలో అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. హిందువులు మౌనం వీడాలి ● ఇస్కాన్ దక్షిణ భారత డివిజినల్ కౌన్సిల్ పూర్వ చైర్మన్ సత్యగోపీనాథ్ దాస్ ● భగవద్గీతను అర్థం చేసుకోవాలని పిలుపు ఆలమూరు: హిందువులందరూ మౌనం వీడి సంఘటితం కావాల్సిన సమయం వచ్చిందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఇస్కాన్ దక్షిణ భారతదేశ డివిజినల్ కౌన్సిల్ పూర్వపు చైర్మన్ పరవస్తు సత్యగోపీనాథ్ దాస్ ప్రభూజీ అన్నారు. మండలంలోని చెముడులంక రామాలయం వద్ద గురువారం జరిగిన హిందూ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాజకీయ నాయకుల నుంచి ప్రతి ఒక్కరికీ హిందువులంటే అలుసుగా మారిందన్నారు. అవమానాలు చేసినా నోరు తెరవరని ఇతరులకు ధీమా ఏర్పడినందువల్లే తరచూ హిందూమతంపై దాడి జరుగుతోందన్నారు. హిందూ ధర్మాన్ని అవమానించిన వారికి హిందువులు ఓట్లు వేయడం సిగ్గు చేటన్నారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్, భారతదేశంలో అనేక ప్రాంతాల్లో హిందువులపై ఎన్ని దౌర్జన్యాలు జరుగుతున్నా ఒక్క హిందువు కూడా రోడ్డు మీదకు వచ్చి నిరసన తెలిపిన దాఖలాలు లేవన్నారు. ఇప్పటికైనా అందరూ సంఘటితమై జై శ్రీరామ్ అంటూ రోడ్ల మీదకు రావాలన్నారు. ధర్మాన్ని ఆచరించడం, భావితరాలకు అందించడం ద్వారా మాత్రమే హిందూ ధర్మ రక్షణ సాధ్యమవుతుందన్నారు. శ్రీమద్రామాయణం బాటలో మనం నడిచినంత కాలం సంస్కృతీ సంప్రదాయాలు, కుటుంబ, మానవ సంబంధాలు ఉన్నతంగా వెలుగొందాయని చెప్పారు. పాశ్చాత్య సంస్కతిని అనుసరించడం మొదలుపెట్టాక సంఘంలోనే కాదు, కుటుంబాల్లో సైతం ఐక్యత దెబ్బ తిందన్నారు. గతంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో భగవద్గీత పోటీలు నిర్వహిస్తే నెల్లూరుకు చెందిన ముస్లిం యువకునికి మొదటి బహుమతి వచ్చిందన్నారు. తాను పోటీల కోసమే భగవద్గీత చదివానని అయితే భగవద్గీత మొత్తం చదివాక మొత్తం 700 శ్లోకాలలో ఎక్కడా మతం అన్న పదం లేదని, ఇది సర్వమానవాళికి ఉపయోగపడే సందేశంగా తెలుసుకున్నానని, మానవులు అందరూ భగవద్గీత చదవడం మొదలుపెడితే అశాంతి, కొట్లాటలు ఉండవని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. హిందూ ధర్మం గొప్పతనం తెలుసుకోలేక కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా నేడు ప్రవర్తిస్తున్నామని సత్యగోపీనాథ్ దాస్ ప్రభూజీ అన్నారు. ఆర్ఎస్ఎస్ గోదావరి జిల్లా సహకార్యవాహ్ గెడ్డం రాంబాబు, వీహెచ్పీ తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి దూలం వెంకట గనిరాజు పాల్గొన్నారు. -
పాటల పల్లకిలో లెక్కల పాఠాలు
● వినూత్న బోధనతో ఆకట్టుకుంటున్న మా‘స్టార్’ ● రాగాలాపనతో చిక్కుముడులకు విడుపులు ● వి.సావరంలో నాగేశ్వరరావు ప్రతిభ రాయవరం: విద్యార్థికి అర్థమయ్యేలా బోధించడమే గురువు పరమ కర్తవ్యం. అందుకు ఒక్కొక్కరిది ఒక్కో శైలి. రాయవరం మండలం వి.సావరం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడు పి.నాగేశ్వరరావు శైలి విభిన్నం. పాటతో గణితంలో పీటముడులు విప్పించడం ఆయన ప్రత్యేకత. రాష్ట్ర ఉన్నతాధికారులను సైతం ఆకట్టుకున్న ఆయన శైలిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం గణితం గజిబిజి కాదంటూ గణితంలో కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాలపై విద్యార్థులు గజిబిజి అవుతుంటారు. వారు అలా అవస్థ పడకుండా ఒకటి నుంచి ఇంటర్మీడియెట్ వరకు ప్రతి పాఠాన్ని పేరడీ పాటలతో బోధిస్తూ లెక్కను సులువు చేస్తున్నారాయన. రోజా చిత్రంలోని పరువం వానగా.. అన్న పాటను రియల్ నంబర్స్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ రేషనల్ ఇర్రేషనల్ నంబర్గా పాడారు. అలాగే చిన్నారి తల్లి.. చిన్నారి తల్లి అనే పాటను సైన్ ఏ ఫ్లస్ బి ఈజ్ అంటూ పేరడీగా పాడారు. ఇలా ప్రతి గణిత పాఠానికి పేరడీ పాటలు సృష్టించి పిల్లల నోళ్లలో నానుతున్నారు. సోషల్ మీడియాలోనూ సోషల్ మీడియా ద్వారా కూడా నాగేశ్వరరావు తనదైన శైలిలో బోధిస్తున్నారు. ప్రత్యేకంగా ‘పాలెపు నాగేశ్వరరావు’ పేరుతో యూట్యూబ్ ఛానల్ను ఓపెన్ చేసి, దాని ద్వారా గణితం బోధిస్తున్నారు. ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్ట్రాగామ్ల ద్వారా తన గణిత పాఠాలను అప్లోడ్ చేసి బోధిస్తున్నారు. ఇప్పటి వరకు ఆరు కోట్ల మంది వీక్షకులు చూసినట్లు నాగేశ్వరరావు ‘సాక్షి’కి తెలిపారు. ఇప్పటి వరకు 72 వేల మంది ఇన్స్ర్ట్రాగామ్లో సభ్యులుగా ఉన్నారన్నారు. అలాగే తెలుగు సబ్జెక్టులో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉన్న పద్య రత్నాల్లో 50 పద్యాలను తనదైన శైలిలో గానం చేసి ఆకట్టుకున్నారు. ఫిజికల్ సైన్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులకు సంబంధించి ఇంటర్ పాఠ్యాంశాలపై చేసిన పేరడీలకు ఇన్స్టాలో 50 లక్షల వీక్షణలు రావడం గమనార్హం. ఉన్నతాధికారుల నుంచి పిలుపు సోషల్ మీడియా ద్వారా గణితాన్ని సులువుగా బోధిస్తున్న తీరును గుర్తించిన సమగ్ర శిక్షా రాష్ట్ర ఉన్నతాధికారులు నాగేశ్వరరావును ప్రత్యేకంగా విజయవాడకు ఆహ్వానించారు. రాష్ట్ర వ్యాప్తంగా విన్నూత్నంగా బోధిస్తున్న 41 మందిని బెస్ట్ ప్రాక్టీసెస్ వర్క్షాప్కు ఆహ్వానించగా, జిల్లాలోని మండపేట మండలం నుంచి అమలదాసు కావేరి, ఆలమూరు మండలం చింతలూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నుంచి వి.వెంకటేశ్వరరావు, రాయవరం మండలం వెదురుపాక నుంచి పి.నాగేశ్వరరావు ఉన్నారు. వర్క్షాప్లో నాగేశ్వరరావు కృషిని అభినందించి, ప్రశంసాపత్రాన్ని, వీడియోలు షూట్ చేయడానికి అవసరమైన పరికరాలను సమగ్ర శిక్షా రాష్ట్ర ఎస్పీడీ శ్రీనివాసరావు అందజేశారు. -
హైటెక్ దాసులు
ఉప్పలగుప్తం: ధనుర్మాసం వస్తూనే వేకువ జామునే శిరస్సున అక్షయ పాత్ర.. మెడలో చామంతుల మాల.. ఓ చేతిన చిడతలు.. మరో చేతిన తంబుర.. పాదాలకు మంజీరాలు.. నోట సుస్వర హరినామ సంకీర్తనలు.. పెద్దపెద్ద అంగలతో ఇంటింటికీ తిరిగి వారిచ్చిన స్వయంపాకాన్ని స్వీకరించి నమస్కరించినవారిని దీవించి వడివడిగా ముందుకు సాగే హరిదాసు ఓ నాటి దృశ్యకావ్యం. తెలుగువారి సంస్కృతిని తరతరాలుగా కొనసాగిస్తూ.. మారిన కాలంతో పోటీ పడి తానూ మారుతూ వాహనధారియై.. దాని హెడ్లైట్పై అక్షయ పాత్ర.. హ్యాండిల్కి మైక్.. దాని నుంచి హరినామ సంకీర్తనలు.. ఇదీ ఆధునిక హరిదాసు జీవన చిత్రం. మున్ముందు ఇంకెంత ఆధునీకత సంతరించుకుంటారో చూడాలి మరి. వీరికీ ఓ ఘన చరిత్ర.. కఠోర దీక్ష.. సంప్రదాయాన్ని ముందు తరాలకు తీసుకువెళ్లాలనే అంకితభావం ఉండడం చెప్పుకోదగ్గ విషయం. వైష్ణవులలో ఓ వర్గం నియమ నిబద్ధతలతో కూడిన మహావిష్ణు దీక్షను భక్తితో స్వీకరిస్తారు. కృష్ణ బలిజలు, శాతానాలు, వైష్ణవులు, దాసరులు పూర్వీకుల నుంచి వచ్చిన ఆచారాన్ని కాపాడటానికి అవలంబించే 41 రోజుల కఠోర దీక్ష ఇది. ఈ దీక్షలను కార్తికం, ధనుర్మాసం, మాఘమాసాల్లో సంబంధిత గురువుల వద్ద స్వీకరిస్తారు. ఈ హరిదాసు దీక్షలకు సంబంధించి భద్రాచలంలో ప్రత్యేక శిక్షణ క్షేత్రం ఉంది. దీక్ష ఆరంభం నుంచి విరామం వరకూ వారి తమ పూర్వీకులు తిరిగిన గ్రామాల్లో పీఠం పెట్టుకుని భక్తిశ్రద్ధలతో కుటుంబాలకు దూరంగా ఉంటూ ఇల్లిల్లూ హరి నామ కీర్తన చేసుకుంటూ భిక్షాటన చేస్తారు. కటిక నేలపై పడుకుని నిత్యం ఉదయం, సాయంత్రం తల స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేసుకుని అక్షయపాత్రకు అభిషేకం చేస్తారు. గ్రామాల్లో తిరుగుతూ సాయంత్రానికి పీఠం వద్దకు చేరుకుంటారు. ఉదయం వేళ అల్పాహారం తీసుకుంటూ సాయంత్రం ఒంటిపూట భోజనం చేస్తుంటారు. నెత్తిన అక్షయపాత్ర పెట్టుకుంటే అది దింపే వరకూ దైవ సంకీర్తన తప్ప వేరే మాట నోటి నుంచి రాకూడదన్నది నియమం. దీక్షాకాలం అనంతరం విష్ణు, శివాలయాల్లో దీక్షను విరమిస్తారు. దీక్షలో స్వీకరించిన భిక్షను తమ అవసరాలకు కొంత మిగుల్చుకుని భధ్రాచలం రాముల వారి కల్యాణంలో జరిగే అన్నదానానికి పంపిస్తారు. సాధారణ సమయంలో ఉద్యోగాలు, వ్యాపారాలు, చేతి వృత్తులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటారు. ఇంత కఠిన దీక్షను నేటి తరం ఆచరించే శారీరక సామర్థ్యం లేక ఆధునిక వసతులను వినియోగించుకుంటూ సంస్కృతిని ముందు తరాలకు అందజేస్తున్నారు. ఈ పయనంలో భాగంగా మోటారు సైకిళ్లను వారి ఆహార్యానికి అనుగుణంగా మార్పులు చేసుకుని చకచకా సాగిపోతున్నారు. వీరు సుమారు 4, 5 గ్రామాలను ఎంపిక చేసుకుంటారు. ఈ గ్రామాల్లో సంచరిస్తే వచ్చేది రోజకు కేవలం నాలుగైదు కుంచాల బియ్యం మాత్రమే. ప్రస్తుతం మోటారు సైకిల్పై తిరగటంతో దాని ఇంధనంతో పాటు ఇతర ఖర్చులకు 3 నుంచి 4 వందలు ఖర్చవుతుంది. ఇంతటి పురాతన సంస్కృతిని ముందు తరాలకు అందిస్తున్న ఈ వృత్తి కళాకారులకు ప్రభుత్వాల పరంగా ఎటువంటి గుర్తింపూ లేకపోవడం గమనార్హం. కొంతమంది దృష్టిలో వీరు భక్తులా, లేక ఒక వృత్తినే నమ్ముకున్న వారా అనే సందేహాలు కొంతమంది వ్యక్తం చేస్తుంటారు. కృష్ణ బలిజలు, శాతానాలు, వైష్ణవులు, దాసరి సామాజిక వర్గాలకు చెందిన వీరు బిసీ–డీ కేటగిరీగా పరిగణించబడుతున్నారు. వీరు ఎక్కువగా ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో, కృష్ణ, అనకాపల్లి జిల్లాలో నివసిస్తుంటారు. వీరికి రిజర్వేషన్ కోటాలో తక్కువగా ప్రాధాన్యత ఉండి వారి పిల్లలు విద్యారంగంలో అవకాశాలు కోల్పోతున్నప్పటికీ బీసీ–ఏ గా మార్చాలని ప్రభుత్వాలపై ఒత్తిడి చేస్తూ వారి గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఈ విషయాన్ని గమనించిన మాజీ ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హయాంలో వారిని బీసీ–ఏగా మార్చడానికి సన్నాహాలు చేసినప్పటికీ కొందరి అభ్యంతరాలతో పిటిషన్లు పెట్టి అడ్డుకున్నారని ఆ సామాజిక వర్గాల వారు ఆవేదన చేస్తున్నారు. మారుతున్న కాలంతో మున్ముందుకు సంస్కృతిని, వారసత్వాన్ని కొనసాగిస్తున్న వైనం ఆదాయాన్ని వదులుకుని ఆచారానికి పెద్దపీట ఎంతటి వారైనా గజ్జెకట్టి అక్షయ పాత్ర పట్టాల్సిందే భక్తి శ్రద్ధలతో.. హరినామ సంకీర్తనతో కఠోర దీక్ష -
కోకపై పాశుర భాసురాలు!
చీరపై బొమ్మలు వేస్తున్న లీలా పూర్ణిమ అమ్మవారికి సమర్పించిన చీరను ప్రదర్శిస్తున్న లీలా పూర్ణిమ ● బొమ్మలతో కళాత్మకంగా అల్లిక ● ఉపాధ్యాయిని లీలా పూర్ణిమ ప్రతిభ మామిడికుదురు: కళోపాసన ఆ భగవంతుని ప్రసాదం. చేతిలో కళ ఉండాలే కానీ దానిని వ్యక్తపరిచే ప్రతి చర్యలోనూ ఆధ్యాత్మికత నిండి ఉంటుంది. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని సందర్భోచితంగా తనలోని కుట్టు కళను అత్యంత సుందరంగా ఆవిష్కరించారు శ్రీఘాకోళపు లీలా పూర్ణిమ. మండలంలోని అప్పనపల్లికి చెందిన ఆమె ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయినిగా పని చేస్తూ తీరిక సమయంలో ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తుంటారు. ధనుర్మాసం సందర్భంగా ఆమె గోదాదేవి తిరుప్పావై పాశురాలను చీరపై అత్యంత సుందరంగా అల్లి ఔరా అనిపించారు. పాశురాలతో పాటు చీరపై గోదాదేవి అమ్మవారి చిత్రం, నెమలి పింఛాలు, వెంకటేశుని నామాలు, వేణువు, కలువ పూలు, శంఖు, చక్రాలను రమణీయంగా కుట్టి తన ప్రతిభను చాటుకున్నారు. పది రోజుల పాటు 30 తిరుప్పావై పాశురాలు, 10 తిరుపుళ్లియ్యెచ్చి (శ్రీరంగనాథుని మేల్కొలుపు శ్లోకం) పాశురాలు, ప్రార్థనా శ్లోకాన్ని చీరపై అల్లారు. 1,493 పదాలను 320 వాక్యాల్లో అల్లినట్టు లీలా పూర్ణిమ తెలిపారు. ఎటువంటి తప్పులు దొర్లకుండా అక్షరాల మధ్య సమతౌల్యం పాటిస్తూ చీరకు ప్రాణం పోసినట్లు అక్షరాలను, బొమ్మలను తీర్చిదిద్దారు. పవిత్రతను చాటాలన్న లక్ష్యంతో.. సంక్రాంతి పండుగలో వచ్చే ధనుర్మాసానికి ఎంతో విశిష్టత ఉంది. దాని పవిత్రతను ప్రతి ఒక్కరికి చాటాలన్న లక్ష్యంతోనే పాశురాలు (శ్లోకాలు) రాశానని లీలా పూర్ణిమ తెలిపారు. నేటి తరం మరిచిపోతున్న లిపి కళను ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నదే తన ఆలోచన అని ఆమె చెప్పారు. భక్తి, సంప్రదాయం, సహనం, సృజనాత్మకతకు ప్రతి రూపంగా ఆమె అల్లిన శ్లోకాలు, బొమ్మలతో కూడిన చీరను అప్పనపల్లి బాల బాలాజీ స్వామి వారికి సమర్పించారు. ఆ చీరను అర్చకులు అమ్మవారికి అలంకరించి నిత్యం ‘తిరుప్పావై’ సేవ నిర్వహిస్తున్నారు. -
నాన్న ఆదేశాలతో దీక్ష స్వీకరించా
నాపేరు అన్యం రాంబాబు. మాది కోనసీమ జిల్లా కె.గంగవరం మండలంలోని అముజూరు గ్రామం. నేను డిగ్రీ వరకూ చదువుకున్నాను. ప్రస్తుతం బట్టల వ్యాపారం చేస్తున్నాను. మా ముత్తాత, మాతాత, మానాన్న ఈ దీక్ష స్వీకరించి కొన్ని గ్రామాల్లో సంచరించారు. మా నాన్నకు మోకాళ్ల గుజ్జు అరిగిపోయి ఆరోగ్యం క్షీణించింది. అందుకే వారసత్వం, సాంప్రదాయం కాపాడటానికి ఆయన ఆదేశాలతో ఈ దీక్షను స్వీకరించి నేను మోటారు సైకిల్పై కొనసాగిస్తున్నాను. మా ఈ ఆచారంలో చాలా ఉన్నతమైన ఉద్యోగం చేసుకునే వారు సైతం వారి అవకాశాన్ని బట్టి కనీసం రెండు రోజులైనా ఈ దీక్షను స్వీకరిస్తారు. రేపటి తరంలో నా కుమారుడు సైతం ఏ హోదాలో ఉన్న మా పూర్వీకులు తిరిగిన ప్రాంతాల్లో ఈ దీక్షను ఆచరించాలి. నేను కార్తికమాసంలో దీక్షను తీసుకున్నాను. సుబ్రహ్మణ్య షష్టికి దీక్షను విరమిస్తాను. -
అనుమానాస్పద మృతిపై విచారణ
కాకినాడ క్రైం: కాకినాడలో ఓ వ్యక్తి అనుమానాస్పద మృతిపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. మల్లయ్య అగ్రహారానికి చెందిన కుడుపూడి సత్యనారాయణ(29) ఈ నెల 22న అర్థరాత్రి ఇంట్లో దుప్పటితో ఫ్యాన్కు ఉరి వేసుకుని వేళాడుతూ ఉండడాన్ని కుటుంబ సభ్యులు గమనించారు. చేతులు వెనక్కి కట్టేసి ఉండడంతో పాటు మరి కొన్ని కారణాల నేపథ్యంలో అనుమానాస్పద మృతిగా కుటుంబసభ్యులు భావించారు. ఈ అంశాలతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాకినాడ టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేయగా, మృతిపై విచారణ కొనసాగుతోందని సీఐ మజ్జి అప్పలనాయుడు తెలిపారు. సత్యనారాయణకు తల్లిదండ్రులు లేరు. బాబాయి, పిన్నే కన్నబిడ్డలా చూసుకుంటున్నారు. పెయింటింగ్ పనిచేసే సత్యనారాయణ కుటుంబసభ్యులతో ఎంతో అన్యోన్యంగా ఉండేవాడు. ఈ నేపథ్యంలో అతడి మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
కాకినాడలో నటి మీనాక్షి సందడి
లక్కీ సిగ్నేచర్ మాల్ ప్రారంభం బోట్క్లబ్ (కాకినాడ సిటీ): సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో విక్టరీ వెంకటేష్ సరసన నటించిన నటి మీనాక్షి చౌదరి నగరంలో సందడి చేశారు. కాకినాడ మెయిన్రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన లక్కీ సిగ్నేచర్ ఫ్యామిలీ షోరూంను ఆమె గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రేక్షకులను తన అభివాదాలు ముద్దు ముద్దు మాటలతో ముంచెత్తారు. పూర్తిగా మహిళల కోసం ఏర్పాటు చేసిన ఈ షోరూమ్కు అందరి శుభాశీస్సులు అందించాలని మీనాక్షి కోరారు. మహిళల కోసం చీరలు, గాగ్రాలు, లెహంగాలు, ఎన్నో రకాలను అందుబాటు ధరలో అందిస్తోందన్నారు. ఆమెను చూసేందుకు హాజరైన ప్రజలు ఎగబడ్డారు. దీంతో పోలీసులు ట్రాఫిక్ మళ్లించారు. షోరూమ్ అంతా తిరిగి రకరకాల చీరలను ఆమె తిలకించగా వాటి వివరాలను సిబ్బంది ఆమెకు వివరించారు. షోరూం అధినేతలు రత్తయ్య, శ్రీను, స్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో ఫ్యామిలీ కనెక్షన్ల్లో తిరుగులేని ఆదరణ పొందుతున్న లక్కీషాపింగ్ మాల్ను కాకినాడలో ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, వనమాడి కొండబాబు పాల్గొన్నారు. -
మెట్ల పైనుంచి పడి కళాకారిణి మృతి
ముసలమ్మతల్లి ఉత్సవ ప్రారంభంలో అపశృతి రాజోలు: పొట్టకూటి కోసం ఉత్సవాల్లో వేషధారణలు వేసి భక్తులను ఆనందింపజేసే కళాకారిణి ప్రమాదవశాత్తు భవనం మెట్లపై నుంచి జారిపడి మృతి చెందింది. ఈ ప్రమాదంలో రాజమహేంద్రవరానికి చెందిన పాలపర్తి భవ్యశ్రీ (17) ప్రాణాలు కోల్పోయింది. రాజోలు మండలం శివకోటి ములసమ్మతల్లి ఉత్సవాల ప్రారంభంలో ఈ అపశృతి చోటుచేసుకుంది. గురువారం శివకోటి ముసలమ్మతల్లి అమ్మవారి ఉత్సవాల ప్రారంభాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరం నుంచి పలువురు కళాకారులు శివకోటి చేరుకున్నారు. వీరంతా వేషధారణల కోసం ఆలయానికి ఎదురుగా ఉన్న మూడు అంతస్తుల కల్యాణ మండప భవనంలోనికి వెళ్లారు. ఈ క్రమంలో తెల్లవారుజామున భవ్యశ్రీ ప్రమాదవశాత్తు కల్యాణ మండపం మెట్లపై నుంచి జారిపడి తలకు బలమైన గాయమైంది. ఆమెను హుటాహుటీన రాజోలు ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. సహ కళాకారిణి మృతిపై సహచరులు, మృతురాలి తల్లి చినపాప ఆస్పత్రి వద్ద రోదించిన తీరు కంటతడి పెట్టించింది. యువతి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రాజేష్కుమార్ తెలిపారు. యువతి మృతదేహానికి రాజోలు ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టమ్ నిర్వహించారు. అసంపూర్తి భవనంలో బసపై అగ్రహం అసంపూర్తిగా నిర్మించిన కల్యాణమండపంలో కళాకారులకు బస ఏర్పాటు చేయడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. భవనం మెట్లకు రెయిలింగ్ లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఉత్సవ కమిటీ నిర్లక్ష్యం వల్లే కళాకారిణి మృతి చెందిందని వారు వాపోయారు. సగరుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వావి బోట్క్లబ్ (కాకినాడ సిటీ): రాష్ట్ర జనాభాలో అధిక శాతం ఉన్న సగర కులస్తులకు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించడంతో పాటు, ఒక ఎమ్మెల్సీ పదవిని ఇవ్వాలని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సగర సంఘం అధ్యక్షుడు గుర్రం మహాలక్ష్మి డిమాండ్ చేశారు. స్థానిక సూర్యకళా మందిరంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సగర సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం గురువారం ఘనంగా జరిగింది. సంఘం గౌరవ అధ్యక్షుడిగా ములికి సత్యనారాయణ, అధ్యక్షుడిగా కుర్ర మహాలక్ష్మి, వర్కింగ్ ప్రెసిడెంట్గా నక్క కిశోర్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా తన్నాటి అప్పలస్వామి డిప్యూటీ ప్రధాన కార్యదర్శులుగా నక్క వీర వెంకట్రావు, శ్రీను, కోశాధికారి తంగెళ్ల అప్పారావుతో పాటు 151 మంది ప్రమాణ స్వీకారం చేశారు. నూతన కార్యవర్గాన్ని సభ్యులు సత్కరించారు. కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ సగరులు కలిసికట్టుగా ఉంటే అనుకున్నది సాధించవచ్చునన్నారు. త్వరలోనే కత్తిపూడి నుంచి కాకినాడ వరకూ భారీ ర్యాలీ నిర్వహించి, సగరుల సత్తా ఏమిటో తెలియజేయాలన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఒక కమ్యూనిటీ హాల్ నిర్మించాలన్నారు. తొలుత భగీరథుడు చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన సగర కుల నాయకులు పాల్గొన్నారు. -
మూడో పంటకు మంగళం!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఈ సారి రైతులు మూడో పంటకు మంగళం పాడక తప్పని పరిస్థితి. ఖరీఫ్ సీజన్కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం చూపించిన ఉదాసీనత రైతులకు శాపమైంది. దెబ్బమీద దెబ్బగా ప్రకృతి కన్నెర్రజేయడంతో తడిసిన ధాన్యాన్ని రబీ రైతులు కళ్లాల్లో ఆరబెట్టుకుని అమ్ముకున్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సవాలక్ష సాకులు వెతకడంతో కనీస మద్దతు ధర అందక రైతులు లబోదిబోమంటున్నారు. ఈ పరిణామంతో ఖరీఫ్లో ధాన్యం విక్రయించడానికి రైతులు నానా కష్టాలు పడ్డారు. ఖరీఫ్ చివరిలో వర్షాలు పడడం, పండిన ధాన్యం ఆలస్యంగా కొనుగోలు చేయడంతో రైతులు రబీ పనులు చేసుకునేందుకు అన్నదాత సతమతమవుతున్నాడు. తేమ శాతం వల్ల రైతులు తాము కోసిన వరి పంటను కళ్లాల్లోనే సుమారు 10 నుంచి 15 రోజులు ఉంచేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీని ప్రభావం రబీ సాగు జాప్యానికి కారణమైంది. ఫలితంగా ఈ ఏడాది మూడో పంట అపరాలు వేసే అవకాశం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో రబీ సీజన్లో 1.80 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయాలనేది జిల్లా వ్యవసాయశాఖ నిర్దేశించిన లక్ష్యం. ముందస్తు ప్రణాళిక ప్రకారం రబీలో నాట్లు డిసెంబరు నెలాఖరుకు పూర్తి చేయాల్సి ఉంటుంది. లక్ష్యాలు నిర్దేశించడంలో చూపుతోన్న శ్రద్ధ వాటిని అధిగమించడంపై పెట్టడం లేదనే పలువురు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. రబీ సీజన్ మొదలై నెల దాటిపోతున్నా ఇంత వరకు కనీసం 20 శాతం వరి నాట్లు కూడా పూర్తి కాలేదు. వాస్తవానికి ఈ నెలాఖరు నాటికే నాట్లు పూర్తి కావాల్సి ఉంది. సాగు నీటి సలహా మండలి సమావేశంలో ఈ ఏడాది రబీ సాగు లక్ష్యాలను నిర్దేశించారు. 2026 మార్చి 31 కల్లా రబీ పంట కాలం పూర్తయ్యేలా నాటి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు అనుగుణంగా జిల్లాలో 1.8 లక్షల ఎకరాల్లో వరి సాగుచేయాలనేది లక్ష్యం. కానీ అధికారిక లెక్కల ప్రకారం ఇంతవరకు జిల్లాలో కేవలం 23 వేల ఎకరాల్లో మాత్రమే నాట్లు పడ్డాయి. మిగిలిన 1.6 లక్షల ఎకరాల్లో నెలాఖరు నాటికి పూర్తి కావడం సాధ్యం కాదంటున్నారు. వచ్చే జనవరి మూడో వారానికి కూడా పూర్తికాావడం గగనమే అంటున్నారు. ఎప్పటిలాగే ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశామని వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం గొప్పగా సెలవిస్తున్నారు. ఈ సారి రబీ సన్నాహాలు బాగా ఆలస్యమైపోయాయి. నాట్లు వేసిన దగ్గర నుంచి సుమారు వంద రోజులకు గానీ వరిపంట చేతికి రాదు. రబీ త్వరగా పూర్తయితే మూడో పంటగా రైతులు మినుములు, పెసలు వంటి అపరాలు సాగు చేస్తారు. అపరాలు సాగు అంటేనే తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వస్తుంది. ఒక ఎకరాలో రైతు పెసలు, మినుములు కానీ సాగుచేస్తే మూడు నుంచి నాలుగు బస్తాలు దిగుబడి వస్తుంది. ఎకరాకు కనీసం రెండు, మూడు బస్తాలు పండినా రైతులకు సుమారు రూ.15 వేలు లాభం వచ్చేది. ప్రభుత్వ నిర్ణయాల వల్ల ప్రస్తుత రబీలో అపరాల సాగు దాదాపు లేనట్టే అంటున్నారు. ఖరీఫ్ సీజన్లో చంద్రబాబు ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో కుంటిసాకులతో ఈ ఏడాది రబీ మరింత ఆలస్యమవడమే ఇందుకు కారణం. సుమారు నెల రోజుల పైనే రబీ ఆలస్యం కావడంతో జనవరి నెలాఖరుకు కానీ వరినాట్లు పూర్తి చేసే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం జిల్లాలో కాకినాడ రూరల్, కరప, సామర్లకోట, పెద్దాపురం, గండేపల్లి, జగ్గంపేట తదితర మండలాల్లో ఇప్పుడిప్పుడే దమ్ములు చేస్తున్నారు. రబీ సాగు ఆలస్యం కావడంతో పంట చివర్లో ఇబ్బందులు తప్పవని రైతులు ఆందోళన చెందుతున్నారు. రబీకి నీరు వదిలే సమయంలో గుర్రపు డెక్క తొలగింపు, కాలువల్లో పూడిక తీత పనులంటూ సాగునీరు వదలకుండా నీటిసంఘాల నాయకులు తాత్సారం చేశారు. డిసెంబర్ మూడో వారం నాటికే 70 శాతం రబీనాట్లు పూర్తయ్యేవి. ఈ ఏడాది ప్రభుత్వ నిర్వాకానికి సాగునీరందక రబీ ఆలస్యమవుతోందని రైతులు పేర్కొంటున్నారు. రబీ చివర్లో వరి పంట ఈనిక, పాలు పోసుకునే దశలో నీరందక తప్పతాలు గింజలు మారి, దిగుబడులు తగ్గిపోతాయంటున్నారు. మే నెలలో కూడా రబీ కోతలు పూర్తి కావంటున్నారు. మూడో పంటగా వేసే అపరాలసాగుపై ఆశలు వదులు కోవాల్సిందేనని రైతులు ఆందోళన చెందుతున్నారు. మూడో పంటను పక్కన పెడితే రబీకై నా పూర్తిస్థాయిలో సాగునీరు అందుతుందో లేదోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్చి నెలాఖరు నాటికి ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయి. సరిగ్గా అదే సమయంలో మార్చి నెలాఖరున గోదావరి కాలువలు మూసివేస్తారు. ఆయకట్టు శివారున ఉన్న పంట పొలాలకు సాగునీటి ఇబ్బందులు తప్పవన్నది రైతుల వాదన. డిసెంబర్ నెలాఖరు లోగా రబీ వరినాట్లు వేసుకుంటే ఫిబ్రవరి నెలాఖరులోగా పంట చేతికి వచ్చేది. ఇలా క్రమ పద్ధతిలో సాగు జరిగి ఉంటే అపరాలు సాగు చేసుకునే అవకాశం దక్కేదని రైతులు చెబుతున్నారు. సాగు జాప్యంతో మూడో పంటగా అపరాల మాట ఎలా ఉన్నా రబీకి కూడా నీరు అందడం కష్టమవుతుందని రైతులు ఇప్పటి నుంచే దిగులు చెందుతున్నారు. ఏలేరు రైతు కన్నీరు జిల్లాలోని ఏలేరు సాగునీటి వ్యవస్థపై ఆధారపడ్డ 60 వేల ఎకరాల ఆయకట్టు రైతుల పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. సాగునీటి వ్యవస్థలో లోపాలతో ఏలేరు పరిధిలో పిఠాపురం, గొల్లప్రోలు, ఉప్పాడ కొత్తపల్లి మండలాల్లో అనుకున్న ప్రకారం రబీ సాగు పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. డిసెంబర్ 1 నుంచే రబీ సాగుకు నీరు వదిలినట్లు అధికారులు చెబుతున్నప్పటికీ ఎక్కడా సాగు నీరందిన ఆనవాళ్లు కనిపించడం లేదు. కేవలం కాలువల్లో ఊట నీటిని మోటార్ల ద్వారా తోడుకుని అక్కడక్కడా నారుమళ్లు వేశారు తప్ప కాలువ ద్వారా సాగునీరు అందిన దాఖలాలు ఏలేరు పరీవాహక ప్రాంత ఆయకట్టులో ఎక్కడా కనిపించడం లేదు. ప్రభుత్వ తీరుతో కాలువల ఆధునీకరణ పనులు సక్రమంగా ముందుకు సాగక రబీ సాగుకు ప్రతిబంధకంగా పరిణమించింది. ఏలేరు వంటి ప్రధాన ప్రాజెక్టుకు ఆధునీకరణ పనులు చేపట్టకపోవడంతో రైతులు ఏటా నష్టపోతూనే ఉన్నా సర్కార్ పట్టించుకోవడం లేదు. గడచిన రెండు సీజన్లుగా ఇదే పునరావృతమవుతోంది. అందుకే వెదజల్లు విధానంలో రబీలో ఇబ్బందులు లేకుండా చేస్తున్నామని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. తుపాన్తో ఆలస్యం ఖరీఫ్ సాగు నుంచి వర్షాలు కురియడంతో వరి నాట్లు మునిగిపోయి రెండు పర్యాయాలు నాట్లు వేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. పంట చేతికి వచ్చే సమయంతో మోంథా తుపాను పంటను ముంచేసింది. అదే సమయంలో గ్రామం లోని ఏలేరు కాలువలో ఉన్న కాజ్వే కొట్టుకుపోవడంతో పంట రవాణాకు అవకాశం లేని పరిస్థితిలో ప్రభుత్వం నుంచి కాజ్వే నిర్మాణానికి సహకారం లభించలేదు. దాంతో దాత సహకారంతో కాజ్వేను పూర్తి చేసి కోతలు చేసుకున్నాం. దీని వల్ల రబీకి ఆలస్యం అవుతోంది. జనవరిలో పండగ వెళ్లిన తరువాత వరినాట్లు వేస్తాం. గ్రామంలో 30 శాతం మంది నాట్లు వేస్తున్నారు. – ఇంటి వెంకట్రావు, రైతు, వీకే రాయపురం ఆలస్యంగా రబీ సాగు ఈ నెలాఖరు తుది గడువైనా మూడో వారానికీ 20 శాతమే పూర్తి 1.8 లక్షల ఎకరాల సాగు లక్ష్యం 23 వేల ఎకరాల్లో మాత్రమే నాట్లు -
గురువారం శ్రీ 25 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
కరుణామయునికి వందనాలు.. సర్వ మానవాళికి శాంతి.. ప్రేమ.. దయ బోధించిన క్రీస్తు కరుణామయుడు.. చిరస్మరణీయుడు. శాంతిదూత జన్మదినాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా చర్చిలు ముస్తాబయ్యాయి. క్రిస్మస్ను జిల్లా ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు. కాకినాడ లాల్బహదూర్నగర్లో విద్యుల్లతల నడుమ దేదీప్యమానంగా సిద్ధమైన షియోను ప్రార్థనా మందిరం -
విరి విలాపం
పెరవలి: మార్కెట్లో పూల ధరలు పతనం కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ ఏడాది మూఢం ముందే రావడంతో శుభ ముహూర్తాలు లేక వినియోగం తగ్గడంతో ఈ పరిస్థితి నెలకొంది. దీని వల్ల రైతులకు నష్టం వస్తుంటే పూలతోటలపై ఆధారపడిన కూలీలకు పనులు లేక ఉపాధి కరువై విలవిలలాడుతున్నారు. తూర్పు గోదావరి జిల్లాకు తలమానికంగా ఉన్న కడియం, కాకరపర్రు పూల మార్కెట్లు నేడు కొనుగోలుదారులు లేక కళావిహీనంగా కనిపిస్తున్నాయి. వ్యాపారులకు విక్రయాలు లేక.. దిగుబడి బాగున్నా గిట్టుబాటు ధర లేక.. కూలీలకు ఉపాధి దొరకక.. రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం శుభ ముహూర్తాలు, పండుగలు లేకపోవటం వలన పూల వినియోగం తక్కువగా ఉందని వ్యాపారులు చెప్తున్నారు. 20 రోజుల క్రితం చామంతి కిలో రూ.300, కాగడాలు కిలో రూ.900, కనకాంబరాలు రూ.1200 పలికితే నేడు పూల రకాలు, నాణ్యతను బట్టి కిలో రూ.20 నుంచి రూ.150కి కొనుగోలు చేస్తున్నారని రైతులు చెప్తున్నారు. రైతులు మార్కెట్కు పట్టుకువచ్చిన పూలు రెండు మూడు రోజుల వరకు విక్రయాలు జరగకపోవడంతో వ్యాపారుల దగ్గరే రెండు నుంచి మూడు రోజులు నిల్వ ఉండిపోతున్నాయి. నాలుగు రోజులు దాటితో పూలు వసి వాడిపోయి రోడ్డు పక్కన పాడేయాల్సిన పరిస్థితి నెలకొందని వ్యాపారులు వాపోతున్నారు. వాతావరణం అనుకూలించడంతో పూల దిగుబడి చాలా బాగుందని, మార్కెట్లో పూల ధరలు లేకపోవటం వల్ల వారానికి రెండు కోతలు కోయాల్సిన పూలు నేడు ఒక్కకోతే కోస్తున్నామని రైతులు చెప్తున్నారు. తీరా కోసిన తరువాత కనీసం కూలీల ఖర్చులు కూడ రావడం లేదని, దీంతో కోయకుండానే నష్టపోతున్నామని రైతులు చెప్తున్నారు. పూల రైతులు గ్రామాల బాట బట్టి కిలో పూలు సమయాన్ని బట్టి రూ.30 నుంచి రూ.50కి విక్రయిస్తున్నారు. మార్కెట్లకు పూలను తీసుకువెళ్తుంటే వ్యాపారులు కొనుగోలు చేయడం లేదని.. దీంతో మళ్లీ తామే తమ గ్రామాలకు తీసుకువెళ్లి వచ్చినకాడికి విక్రయిస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో పూలసాగు ఇలా.. జిల్లాలో 4897 ఎకరాల్లో పూల సాగు చేస్తుంటే దీనిపై ప్రత్యక్షంగాను, పరోక్షంగాను 15 వేల మంది ఉపాధి పొందుతున్నారు. పూలకు మార్కెట్లో ధరలు పలకకపోవడం వల్ల సగానికి సగం మందికి ఉపాధి కరువైయ్యిందని రైతులు అంటున్నారు. చిరు వ్యాపారులు సైతం కూలి ఖర్చులు రావడం లేదంటున్నారు. పనులు లేక ఇబ్బంది పూల కోతలు, పూల తోటలకు ఎరువులు, పురుగు మందులు కొట్టే కూలీలకు, దండలు కట్టే కూలీలకు, చిరు వ్యాపారాలు చేసే సైకిల్ వ్యాపారులకు పని అంతంతమాత్రంగా లభించడంలో వారు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. నిత్యం పూలు కోసే కూలీలకు వారానికి ఒక్కరోజు మాత్రమే పనులు లభిస్తుంటే, పూల దండలు కట్టే మహిళలు పనులు లేక అల్లాడిపోతున్నారు. మార్కెట్లో ధరలు ఇలా.. పూల మార్కెట్లో 20 రోజుల వ్యవధిలో ధరలు పరిశీలిస్తే సగానికి సగం పడిపోయాయి. పూల రకం 20 రోజుల ప్రస్తుత క్రితం (రూ.) ధర (రూ.) బంతి పూలు 80 20 చామంతి 300 30-50 గులాబీలు 250 140 లిల్లీ పూలు 300 80 కాగడాలు 900 400 కనకాంబరాలు 1200 600 తోటలోనే మగ్గిపోతున్న పూలు పూలధరలు తగ్గడంతో వాటిని కోయకుండా రైతుల చేలల్లోనే వదలేస్తున్నారు. ఎందుకంటే కోయిస్తే కనీసం కూలీ ఖర్చులు కూడా రావటం లేదని, దీనితో పూల కోసేకంటే వదిలేయడమే మేలని చెప్తున్నారు. నిత్యం పదిమందితో పూలు కోయించే రైతులు నేడు వారానికి ఒక్కసారి మాత్రమే కోయిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు బంతి పూలు ఒక్కకోతకు 10 కూలీలు అవసరం వస్తే వీరికి రోజుకు రూ.350 కూలి ఇవ్వాలి. మార్కెట్లో కిలో పూలు రూ.20 పలుకుతున్నాయి. ఒక్క కోతకు సుమారు 100 కిలోలు కోయిస్తే కూలీలకు రూ.3500, కాఫీ, టిఫిన్లు, సంచులు, రవాణా కలిపి రూ.వెయ్యి ఖర్చు అవుతుంది. దీనితో పూలకు మార్కెట్లో వంద కిలోలకు రూ.రెండు వేలు వస్తే ఖర్చు రూ.4500 అవుతోందని రైతులు చెప్తున్నారు. అందుకే పూలను కోయకుండా వదలివేస్తున్నామని వాపోతున్నారు. అన్ని రకాల పూల సాగు పరిస్థితీ ఇలానే ఉందని రైతులు అంటున్నారు. విరివిగా పూసినా సిరులు అంతంతే ధరలు లేక మందగించిన వ్యాపారాలు గగ్గోలు పెడుతున్న రైతులు పనులు లేక కూలీలు.. ఉపాధి దొరక్క పనివారు విలవిల ‘తూర్పు’న 4897 ఎకరాల్లో పూల సాగు ప్రత్యక్షంగా,‘ పరోక్షంగా 15వేల మందిపై ప్రభావం -
నేతి చమురు వదిలిపోయేలా..
అన్నవరం: సత్యదేవునికి ‘నేతి’ చమురు భారీగానే వదిలిపోనుంది. స్వామివారి ప్రసాదం తయారీకి అవసరమైన ఆవు నేతిని ఇప్పటి వరకూ కొటేషన్ ద్వారా కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వచ్చే నెల నుంచి టెండర్ ద్వారా నెయ్యి కొనుగోలు చేయనున్నారు. ఈ మేరకు ఈ–ప్రొక్యూర్మెంట్ ద్వారా నెయ్యి కొనుగోలుకు గత నెల 30న దేవస్థానం అధికారులు టెండర్లు పిలిచారు. ఇందులో సంగం డెయిరీ (గుంటూరు), విజయా డెయిరీ (విజయవాడ) టెండర్లో పాల్గొని టెక్నికల్ బిడ్కు అర్హత సాధించాయి. ప్రైస్ బిడ్ మంగళవారం తెరవగా.. సంగం డెయిరీ కిలో రూ.639.90కి, విజయా డెయిరీ కేజీ రూ.660కి కోట్ చేశాయి. దీంతో, అతి తక్కువ ధర కోట్ చేసిన సంగం డెయిరీ ఈ టెండర్ను దక్కించుకుంది. ఈ డెయిరీ జనవరి 1 తేదీ నుంచి జూన్ 30 వరకూ ఆరు నెలల పాటు అన్నవరం దేవస్థానానికి ఆవు నెయ్యి సరఫరా చేయాల్సి ఉంటుంది. కిలోకు రూ.50 అధికం గత ప్రభుత్వ హయాంలో టెండర్ పిలిచి నెయ్యి కొనుగోలు చేసేవారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అప్పటి వరకూ ఉన్న టెండర్లను రద్దు చేసి సహకార డెయిరీల నుంచి కొటేషన్లు పిలిచి నెయ్యి కొనుగోలు చేయాలని ఆదేశించింది. ఆ మేరకు సంగం, విజయా డైరీల నుంచి కిలో సుమారు రూ.590కి కొంటున్నారు. ఈ నేపథ్యంలో తిరిగి టెండర్లు పిలిచి ఆవు నెయ్యి కొనుగోలు చేయాలని గత ఆగస్టులో కమిషనర్ ఆదేశించారు. అయినప్పటికీ నవంబర్ వరకూ కొటేషన్ ద్వారానే కొనుగోలు చేశారు. దీనిపై దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్లు అప్పటి ఈఓ వీర్ల సుబ్బారావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే టెండర్ పిలిచి కొనుగోలు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు టెండర్ పిలవగా దీనిని సంగం డెయిరీ దక్కించుకుంది. సత్యదేవుని ప్రసాదం తయారీకి ప్రతి నెలా 18 వేల నుంచి 20 వేల కిలోల వరకూ నెయ్యి ఉపయోగిస్తారు. ఇప్పుడు టెండర్ దక్కించుకున్న సంగం డెయిరీ జనవరి 1 నుంచి జూన్ 30 వరకూ సుమారు 1.10 లక్షల కిలోల నెయ్యి సరఫరా చేయాలి. కిలో రూ.639.90 చొప్పున నేతి కొనుగోలుకు సుమారు రూ.7.04 కోట్ల మేర దేవస్థానం సంగం డెయిరీకి చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం కొటేషన్పై కొనుగోలు చేస్తున్న దానికన్నా సంగం డెయిరీ రూ.50 ఎక్కువకు కోట్ చేయడం గమనార్హం. దీని ప్రకారం 1.10 లక్షల కిలోల నేతికి దేవస్థానం అదనంగా రూ.55 లక్షలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫ ‘సంగం’కే ఆవునేతి టెండర్ ఫ కిలో రూ.639.90కి కోట్ చేసిన డెయిరీ ఫ ఇప్పటి వరకూ కొటేషన్ ద్వారా కిలో రూ.590కే కొనుగోలు ఫ ప్రస్తుతం 6 నెలలకు రూ.7.04 కోట్ల వ్యయం ఫ తాజా ధరతో 6 నెలలకు రూ.55 లక్షల భారం -
ఈ కుర్చీకో దండం
అన్నవరం: ఒకప్పుడు అన్నవరం దేవస్థానం కార్యనిర్వహణాధికారి(ఈఓ)గా పని చేయడానికి దేవదాయ శాఖ అధికారులు పోటీ పడేవారు. ఈ కుర్చీ కోసం ప్రజాప్రతినిధులతో పెద్ద ఎత్తున సిఫారసులు చేయించుకునేవారు. కానీ, నేడు పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. ఈఓ కుర్చీ అంటే.. వద్దు బాబోయ్.. దీనికో దండమని అంటున్నారు. ఏడాది కాలంగా దేవస్థానంలో నెలకొన్న పరిస్థితులు, పరిపాలనలో మితిమీరిన రాజకీయ జోక్యంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఇటీవల ఇన్చార్జి ఈఓగా బాధ్యతలు చేపట్టిన వి.త్రినాథరావు సైతం తనను ఈ బాధ్యతల నుంచి తప్పించాలంటూ సంబంధిత శాఖ మంత్రిని వేడుకున్నారనే ప్రచారం జరుగుతోంది. అదే కనుక నిజమైతే రత్నగిరిపై పరిస్థితి ఎంతలా దిగజారిపోయిందో చెప్పడానికి వేరే ఉదాహరణ అవసరం లేదు. ప్రస్తుతం రాజకీయ జోక్యం చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత దేవస్థానం ఈఓగా దేవదాయ శాఖ అధికారుల స్థానంలో గ్రూప్–1 అధికారి, డిప్యూటీ కలెక్టర్ వీర్ల సుబ్బారావును గత ఏడాది డిసెంబర్లో నియమించారు. దేవస్థానంపై ఆయనకు పెద్దగా అవగాహన లేకపోవడానికి తోడు దేవస్థానం పరిపాలన అంతా ప్రజాప్రతినిధుల చేతుల్లో పెట్టడం, పని చిన్నదైనా, పెద్దదైనా వారు చెప్తే చేయడమే పరిపాలననే విధంగా పరిస్థితులు దిగజారిపోయాయి. అలాగే, ఆయన కుటుంబ సభ్యుల జోక్యం బాగా పెరిగిపోవడం దేవస్థానం సిబ్బందిలో అసంతృప్తికి కారణమైంది. సుబ్బారావు నియామకంపై ఈ ఏడాది మార్చి నాటికే దేవదాయ శాఖ ఉన్నతాధికారులు ఓ నిర్ణయానికి వచ్చినప్పటికీ, రాజకీయ జోక్యంతో కొనసాగించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ కాలంలో ఉన్నతాధికారులు తరచూ జోక్యం చేసుకుని, పరిపాలనను చక్కదిద్దాల్సి వచ్చింది. రాష్ట్రంలోని ఏడు ప్రముఖ దేవస్థానాల్లో అన్నవరం ఐదు, ఆరు, ఏడు ర్యాంకులతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈఓ మారినా.. శ్రీశైలం, కాణిపాకం, శ్రీకాళహస్తి దేవస్థానాలకు ఈఓలుగా నియమించిన డిప్యూటీ కలెక్టర్ల పదవీ కాలాన్ని ఇటీవల మరో ఏడాది పొడిగించారు. అన్నవరం దేవస్థానం ఈఓ సుబ్బారావును మాత్రం రెవెన్యూ విభాగానికి సరెండర్ చేశారు. ఆయన స్థానంలో దేవదాయ శాఖ రాజమహేంద్రవరం రీజినల్ జాయింట్ కమిషనర్ (ఆర్జేసీ) త్రినాథరావును ఇన్చార్జిగా నియమించారు. గతంలో మూడుసార్లు ఈఓగా పని చేసిన అనుభవం ఉండటంతో ఆయన పరిస్థితులను చక్కదిద్దుతారని ఉన్నతాధికారులు భావించారు. కానీ, ఎవ్వరూ చక్కదిద్దలేనంతగా ఇక్కడి పరిస్థితులు దిగజారిపోయాయనే విషయం ఇప్పుడిప్పుడే తేటతెల్లమవుతోంది. ఇక్కడ ఏ పని చేయాలన్నా ప్రజాప్రతినిధుల జోక్యం చేసుకుంటున్నారు. ప్రతి పనీ తమకు చెప్పిన తర్వాతే చేయాలనే విధంగా పరిస్థితులు మారిపోయాయి. దీంతో, ఇక్కడ స్వేచ్ఛగా ఏ పనీ చేయలేమనే నిర్ణయానికి అధికారులు వచ్చేశారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే గతంలో ఈ సీటు ఆశించిన వారందరూ ఇప్పుడు మిన్నకున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత ఈఓ త్రినాథరావు కూడా తనను ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పించాలని సంబంధిత మంత్రిని కోరినట్లు ప్రచారం జరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అన్నవరం దేవస్థానం అభివృద్ధి పథంలో పయనించింది. 2021–22 మధ్య కూడా త్రినాథరావు ఇక్కడ ఈఓగా ఉన్నారు. ఆ సమయంలో రత్నగిరి రామాలయం ముందు భక్తుల కోసం దాతల సహకారంతో సుమారు రూ.కోటితో విశ్రాంతి షెడ్డు నిర్మించారు. స్వామివారి వార్షిక కల్యాణ మండపం, ప్రసాద తయారీ భవనం నిర్మించి, ప్రారంభించారు. అలాగే, 2022–23లో కూడా దాతల సహకారంతో వనదుర్గ ఆలయం వద్ద డార్మెట్రీ నిర్మించారు. చంద్రశేఖర్ ఆజాద్ ఈఓగా ఉన్న సమయంలో కేవలం 8 నెలల్లోనే సత్యగిరి రోడ్డు నుంచి నేరుగా మూడో ఘాట్ రోడ్డు మలుపులోకి చేరేలా ఆదిశంకర మార్గ్ రోడ్డు, కొండ దిగువన టూరిస్టు బస్సులలో వచ్చే భక్తుల కోసం 5 విశ్రాంతి షెడ్లు నిర్మించారు. జాతీయ రహదారి వద్ద ఆక్రమణలో ఉన్న స్థలాన్ని స్వాధీనం చేసుకుని, అందులో సత్యదేవుని నూతన నమూనా ఆలయం, రత్నగిరిపై పార్కింగ్ స్థలాల అభివృద్ధి, సహజ, ప్రకాష్ సదన్ సత్రాల మధ్య నుంచి పశ్చిమ రాజగోపురం సమీపానికి వాహనాలు చేరుకునేలా రోడ్ల నిర్మాణం వంటి పనులు చేపట్టి పూర్తి చేశారు. శివసదన్ సత్రం కూడా 135 గదులతో త్వరితగతిన నిర్మించి, భక్తులకు అందుబాటులోకి తెచ్చారు. దూర ప్రాంతాల భక్తులకు కనిపించేలా విద్యుద్దీపాలతో శంఖచక్ర నామాలు ఏర్పాటు చేశారు. పశ్చిమ రాజగోపురం ముందు విశ్రాంతి షెడ్డు నిర్మాణానికి లారెస్ ఫార్మా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని, సత్యదేవ అతిథి గృహాన్ని కూల్చేశారు. వివిధ కారణాలతో ఆ షెడ్డు నిర్మాణం ఆలస్యమైనప్పటికీ ఇటీవల పూర్తి చేశారు. సుమారు 45 వ్రత పురోహిత పోస్టులు భర్తీ చేశారు. వ్రత పురోహితుల పారితోషికాన్ని 30 నుంచి 40 శాతానికి పెంచారు. ఆ ఐదేళ్లూ ఎటువంటి వివాదాలూ లేకుండా దేవస్థానం పరిపాలన సాఫీగా సాగిపోయింది. ఫ రత్నగిరిపై మితిమీరిన రాజకీయ జోక్యం ఫ ఏ పనైనా తమకు చెప్పి చేయాల్సిందే నంటున్న ప్రజాప్రతినిధులు ఫ బెంబేలెత్తిపోతున్న అధికారులు ఫ ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పించాలని కోరిన ఈఓ ఫ మళ్లీ డిప్యూటీ కలెక్టర్నే నియమిస్తారంటూ ప్రచారం బలమైన అధికారి ఉండాల్సిందే.. పాలకొల్లులో ఆదివారం జరిగిన సామూహిక సత్యదేవుని వ్రతాల నిర్వహణకు వెళ్లిన పురోహిత బృందం అక్కడి భక్తుల నుంచి బలవంతంగా కానుకలు డిమాండ్ చేశారనే ఫిర్యాదు అందింది. దీంతో, ఆరుగురు పురోహితులను ఈఓ త్రినాథరావు సస్పెండ్ చేశారు. ఈ ఆరుగురిలో కీలకమైన ఓ పురోహితుడు తాను ప్రజాప్రతినిధులకు అత్యంత సన్నిహితుడనని, తననెవరూ ఏమీ చేయలేరంటూ చెప్పుకునేవాడని సాటి పురోహితులే చెబుతున్నారు. దీనికి తోడు ఇటీవల ఒక ప్రజాప్రతినిధిని మర్యాద పూర్వకంగా కలవడానికి ఈఓ వెళ్లినపుడు.. అక్కడ ఆ పురోహితుడు కూడా ప్రత్యక్షమయ్యారు. దీంతో, దేవస్థానంలో మారిన పరిస్థితి తేటతెల్లమైందని అంటున్నారు. ఏదేమైనా దేవస్థానంలో పరిస్థితులను చక్కదిద్దడానికి సొంతంగా నిర్ణయాలు తీసుకునే బలమైన అధికారిని నియమించాలని పలువురు అంటున్నారు. మెతకగా ఉండే అధికారిని నియమిస్తే పరిస్థితి మరింత దిగజారుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకవేళ త్రినాథరావు విన్నపాన్ని మన్నిస్తే.. తిరిగి డిప్యూటీ కలెక్టర్నే ఈఓగా నియమిస్తారనే ప్రచారం దేవస్థానంలో జరుగుతోంది. -
నీతి, నిజాయితీలకు మారుపేరు ముద్రగడ
కిర్లంపూడి: మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభం ఉమ్మడి తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో నీతి, నిజాయితీలకు మారుపేరని ఆ పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు, చోడవరం నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ముద్రగడను కిర్లంపూడిలోని ఆయన నివాసంలో మంగళవారం మర్యాద పూర్వకంగా కలుసుకుని, ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ముద్రగడ కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వైఎస్సార్ సీపీ ప్రత్తిపాడు నియోజకవర్గ కో ఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు, అమర్నాథ్ రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఈ సందర్భంగా అమర్నాథ్ విలేకర్లతో మాట్లాడుతూ, ఇటీవల అనారోగ్యానికి గురైన ముద్రగడ ఇప్పుడు పూర్తిగా కోలుకుని ఎంతో ఆరోగ్యంగా ఉన్నారని అన్నారు. లక్షలాది మంది అభిమానులు, శ్రేయోభిలాషులు, ప్రజల ఆశీస్సులు ఆయనకు నిండుగా ఉన్నాయన్నారు. పద్మనాభం రాజకీయ అనుభవాలు, సలహాలు తీసుకుని ముందుకు వెళ్తామన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు ఆయన సేవలు పార్టీకి ఎంతో అవసరమని చెప్పారు. ముద్రగడ ఒక ప్రాంతానికి పరిమితమైన నాయకుడు కాదని, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది అభిమానులు ఆయనకున్నారని అన్నారు. ఆయనను ఒక కులానికే నాయకుడిగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందని, కానీ, అన్ని కులాలనూ ఆదరిస్తూ, అందరికీ అండగా నిలుస్తున్న నాయకుడు ముద్రగడ అని వివరించారు. అలాంటి మహానాయకుడి ఆశీస్సులు అందుకోవడానికే తాను వచ్చానని చెప్పారు. అమర్నాథ్ వెంట మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట రామయ్య, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శులు చిక్కాల రామారావు, ఏడువాక సత్యారావు, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దొండ రాంబాబుతో పాటు చోడవరం, అనకాపల్లి నియోజకవర్గాల పార్టీ శ్రేణులు ఉన్నాయి. ఫ ఆయన కుటుంబంతో నాలుగున్నర దశాబ్దాల అనుబంధం ఫ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ -
● రక్షణ లేదిక్కడ!
రెండు మార్గాలను కలిపేవే వంతెనలు.. అలాంటి వారధుల నిర్వహణను అధికారులు గాలికొదిలేయడంతో ప్రమాదకరంగా మారుతున్నాయి. కూలేందుకు సిద్ధంగా తయారవుతున్నాయి. యు.కొత్తపల్లి మండలం కాశివారిపాకలు – కొండెవరం రోడ్డులో గోదావరి కాలువపై దశాబ్దాల కిందట నిర్మించిన ఈ వంతెన ప్రస్తుతం ప్రమాదకరంగా మారింది. దీని రక్షణ గోడ ఓవైపు పూర్తిగా, మరోవైపు సగం కులిపోయింది. మిగిలింది శిథిలావస్థలో ఉంది. అప్రోచ్ సరిగ్గా లేదు. దీంతో, ఇటుగా ప్రయాణించాలంటే ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారు. ఇదే వంతెనపై నుంచి కొండెవరంలోని జిల్లా పరిషత్ పాఠశాలకు విద్యార్థులు వెళ్తుంటారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని వారి తల్లిదండ్రులు నిత్యం ఆందోళన చెందుతున్నారు. రక్షణ గోడలు లేకపోవడంతో ఏమాత్రం అదుపు తప్పినా కాలువలోకి జారి పడే పరిస్థితి. ఈ వంతెన రక్షణకు సంబంధిత అధికారులు ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. – కొత్తపల్లిగోదావరి కాలువపై రక్షణ గోడలు కూలి ప్రమాదకరంగా మారిన వంతెన -
భంగపాటు చేయాలనిభంగపడిన దుష్టచతుష్టయం
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): వనవాసం చేస్తున్న పాండు సుతులకు ఘోష యాత్ర మిషతో భంగపాటు కలిగించాలని వచ్చిన ధార్తరాష్ట్రులు భంగపాటుకు గురయ్యారని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. వ్యాస భారతంపై ప్రవచనాన్ని స్థానిక హిందూ సమాజంలో మంగళవారం ఆయన కొనసాగించారు. ‘‘గంధర్వుని చేతిలో దుర్యోధనుడు బందీ అయినప్పుడు.. కావలసిన కార్యాన్ని గంధర్వులే సరి చేశారని భీముడు ఆనందిస్తాడు. అతడిని ధర్మరాజు వారిస్తాడు. ‘ఇతరులతో విభేదాలు వస్తే మనం 105 మంది సోదరులం. ఇతర సందర్భాల్లో వారు వంద మంది, మనం ఐదుగురం. వెంటనే దుర్యోధనుడిని విడిపించు’ అని అర్జునుడిని ఆదేశిస్తాడు. తిరిగి వచ్చిన దుర్యోధనుడిని భీష్ముడు మందలిస్తాడు. ‘నీవు నమ్ముకున్న కర్ణుడు గంధర్వులతో జరిగిన పోరులో పలాయనవాదం చిత్తగించాడు. పాండవుల పరాక్రమంలో కర్ణుడు పావు భాగానికి సరిపోడు’ అని అంటాడ’’ని వివరించారు. భీష్ముడు దుష్టచతుష్టయాన్ని మందలించలేదని వచ్చే విమర్శల్లో సత్యం లేదని సామవేదం చెప్పారు. ‘‘తమ వద్దకు వచ్చిన దూర్వాస మహర్షిని దుర్యోధనుడుఅన్ని విధాలా సహనంతో సేవించాడు. ఆయన అర్థరాత్రీ, అపరాత్రీ వచ్చి భోజనం కావాలని ఆదేశించినా, చక్కని అన్నపానీయాలను అందించేవాడు. సంతృప్తి చెందిన దూర్వాసుడు వరం కోరుకోవాలని దుర్యోధనుడిని అడుగుతాడు. ‘మీరు పాండవుల వద్దకు వెళ్లి, సేవలు అందుకుని వారిని కూడా తరింపజేయాలి. ద్రౌపది కూడా భుజించిన తరువాత భోజనం పెట్టాల్సిందిగా వారిని ఆదేశించాలి’ అని దుర్యోధనుడు కోరుతాడు. వేలాది శిష్యులతో దూర్వాసుడు పాండుసుతుల వద్దకు వెళ్తాడు. ద్రౌపది భుజించిన తరువాత వెళ్లి, తనకూ, తనతో వచ్చిన వేలాది మంది శిష్యులకు భోజనం సిద్ధం చేయాలని కోరుతాడు. స్నానానికి వెళ్లిన దూర్వాసుడు, ఆయన శిష్యగణాలకు కృష్ణుని అనుగ్రహంతో మృష్టాన్న భోజనం చేసిన తృప్తి కలిగి, ధర్మరాజుకు చెప్పకుండా వెళ్లిపోతారు’’ అని కథా భాగాన్ని వివరించారు. హరి భక్తులకు ఇబ్బందులు కలిగిస్తే వచ్చే ప్రమాదాలు దూర్వాసునికి అంబరీషుని ద్వారా గతంలోనే అవగాహనకు వచ్చిందని చెప్పారు. అనంతరం, పాండవులకు మార్కండేయ మహర్షి రామకథ వివరిస్తాడని, పురాణాలు రామకథతో పవిత్రమవుతాయని, భాగవతంలో కూడా రామకథ కనిపిస్తుందని సామవేదం చెప్పారు. నలదమయంతుల కథ, సీతారాముల కథ, సావిత్రీసత్యవంతుల కథలతో కూడిన భారత కథా శ్రవణం ద్వారా యజ్ఞఫలం లభిస్తుందని అన్నారు. -
శాసీ్త్రయ దృక్పథంతో సమస్యలకు పరిష్కారం
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): శాసీ్త్రయ దృక్పథంతో ఆలోచిస్తేనే సమాజంలోని సమస్యలకు సరైన పరిష్కారం లభిస్తుందని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బి.గోపీమూర్తి అన్నారు. జన విజ్ఞాన వేదిక (జేవీవీ) ఆధ్వర్యాన జేఎన్టీయూకేలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న చెకుముకి రాష్ట్ర స్థాయి సైన్స్ సంబరాలు మంగళవారం ముగిశాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో సాధించిన ప్రగతి ఫలాలు సామాన్య ప్రజలందరికీ అందుబాటులోకి రావాలని అన్నారు. సభకు అధ్యక్షత వహించిన జేవీవీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ, మూఢ విశ్వాసాల నిర్మూలన, పర్యావరణ పరిరక్షణ, అందరికీ విద్య, నాణ్యమైన వైద్యం కోసం 38 సంవత్సరాలుగా జేవీవీ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. భావితరాలకు ఉన్నత, అభివృద్ధికర సమాజాన్ని అందించేందుకు, శాసీ్త్రయ దృక్పథం పెంపొందించేందుకు మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. జేవీవీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తవ్వా సురేష్ మాట్లాడుతూ, విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించేందుకు, సైన్స్, ప్రయోగాల పట్ల ఆసక్తి రేకెత్తించేందుకు, సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఏటా పాఠశాల, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో చెకుముకి సైన్స్ సంబరాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది పాఠశాల స్థాయి సైన్స్ సంబరాల్లో 4.60 లక్షల మంది విద్యార్థులు పాల్గొన్నారన్నారు. వచ్చే నెలలో సైన్స్ ప్రయోగాల పోటీలు నిర్వహిస్తామన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి పి.రమేష్ మాట్లాడుతూ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యావంతులు హేతుబద్ధమైన ఆలోచన కలిగి ఉంటేనే భావితరాలకు మంచి సమాజాన్ని అందించగలుగుతామని అన్నారు. కార్యక్రమంలో సంబరాల ఆహ్వాన సంఘం అధ్యక్షుడు, కాకినాడ సీ పోర్ట్ చీఫ్ ఆపరేటింగ్ అధికారి ఎం.మురళీధర్, కోరమండల్ ఇంటర్నేషనల్ అధికారి వంశీకృష్ణ, సత్యా స్కాన్ డైరెక్టర్ డాక్టర్ కాదా వెంకట రమణ, చెకుముకి రాష్ట్ర కన్వీనర్ కేఎంఎంఆర్ ప్రసాద్, యూటీఎఫ్ నాయకుడు ప్రభాకరవర్మ, జేవీవీ రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి విజేతలు వీరే.. జిల్లా స్థాయి పోటీల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విభాగాల్లో మొదటి స్థానం సాధించిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి సైన్స్ సంబరాలకు హాజరయ్యారని జేవీవీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తవ్వా సురేష్ తెలిపారు. వారికి ప్రయోగాలు, క్విజ్, విజువల్ రౌండ్, రాత పరీక్ష నిర్వహించి, విజేతలను ఎంపిక చేశామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల విభాగంలో ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్ మున్సిపల్ స్కూల్ (కర్నూలు జిల్లా) ప్రథమ, శ్రీ నరసింహ గవర్నమెంట్ హైస్కూల్ (గుంటూరు) ద్వితీయ, జెడ్పీ గర్ల్స్ హైస్కూల్ (బుదిరెడ్డిపల్లి, శ్రీ సత్యసాయి జిల్లా) తృతీయ స్థానాల్లో నిలిచాయని వివరించారు. ప్రైవేటు పాఠశాలల విభాగంలో ది ఎతేనా స్కూల్ (కర్నూలు) ప్రథమ, శ్రీ సాయి విజ్ఞాన్ ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ (వైఎస్సార్ కడప) ద్వితీయ, ఆదిత్య ఇంగ్లిష్ మీడియం స్కూల్ (గంగరాజు నగర్, కాకినాడ) తృతీయ స్థానాలు సాధించాయని తెలిపారు. పోటీలో పాల్గొన్న విద్యార్థులకు, పాఠశాలలకు సర్టిఫికెట్, జ్ఞాపికలను ఎమ్మెల్సీ గోపిమూర్తి, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు, డీఓ రమేశ్ తదితరుల చేతుల మీదుగా అందజేశారు. ఫ ఎమ్మెల్సీ గోపీమూర్తి ఫ ముగిసిన చెకుముకి రాష్ట్ర స్థాయి సైన్స్ సంబరాలు -
శాసీ్త్రయ ప్రతిభను వెలికి తీసేందుకే కౌశల్ పరీక్షలు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ѧéÅÆý‡$¦ÌZÏ §éW E¯]l² {糆¿ýæ¯]l$ ÐðlÍMìS ¡Ä¶æ$-yýl…ÌZ MúÔèæÌŒæ ç³È-„ýSË$ MîSÌSMýS ´ë{™èl ´ùíÙ-çÜ$¢-¯é²Ä¶æ$° hÌêÏ Ñ§éÅ-Ô>Rê-«¨M>Ç (yîlDK) í³.Æý‡Ðól$‹Ù A¯é²Æý‡$. Ý린MýS çÜÐ]l${VýS Õ„ýS çÜÐ]l*-ÐólÔèæ Ð]l$…¨Æý‡…ÌZ Ð]l$…VýS-âýæÐéÆý‡… °Æý‡Ó-íßæ…-_¯]l hÌêÏ Ýë¦Æ‡$$ MúÔèæÌŒæ ç³È„ýSÌS ºçßæ$Ð]l$† {ç³§é-¯ø-™èlÞ-Ð]l…ÌZ BĶæ$¯]l Ð]l¬QÅ A†¤V> ´ëÌŸY-¯é²Æý‡$. D çÜ…§ýl-Æý‡Â…V> ѧéÅ-Æý‡$¦-ÌS-¯]l$§ólªÕ…_ Ð]l*sêÏ-yýl$™èl*, ´ùsîæ ç³È-„ýS-ÌSMýS$ çܯ]l²§ýl®… ^ólĶæ$-yé°MìS MúÔèæÌŒæ ç³È„ýSË$ G…™ø §øçßæ§ýlç³-yýl-™éĶæ$° A¯é²Æý‡$. ¿êÆý‡-¡Ä¶æ$ Ñgêq¯]l Ð]l$…yýl-Í, Æ>çÙ‰ Ô>ç܈, Ýë…MóS-†MýS Ð]l$…yýl-Í, OòܯŒSÞ íÜsîæ B‹œ B…{«§ýl{ç³§ólÔŒæ ç܅Ķæ¬MýS¢ B«§ýlÓÆý‡Å…ÌZ °Æý‡Ó-íßæ…_¯]l D ç³È„ýSÌZÏ hÌêÏ-ÐéÅ-ç³¢…V> 3,084 Ð]l$…¨ ѧéÅ-Æý‡$¦Ë$ ´ëÌŸY-¯é²Æý‡° ™ðlÍ-´ëÆý‡$. D ç³È-„ýSÌZÏ E™èl¢Ð]l$ {糆¿ýæ ^èl*í³¯]l ѧéÅ-Æý‡$¦ÌSMýS$ ¯]lVýS§ýl$ ºçßæ$-Ð]l$™èl$Ë$, {ç³Ôèæ…-Ýëç³-{™éË$, gêqí³-MýSË$ A…§ýl-gôæ-Ô>Æý‡$. {ç³£ýlÐ]l$ Ý릯]l… ´÷…¨¯]l ѧéÅ-Æý‡$¦-ÌSMýS$ Æý‡*.1,500, ¨Ó-¡Ä¶æ$ Ý릯]l… Ý뫨…-_¯]l ÐéÇMìS Æý‡*.1,000 ^ö糚¯]l ¯]lVýS§ýl$ ºçßæ$Ð]l$™èl$Ë$ A…¨…-^éÆý‡$. M>Æý‡Å-{MýSÐ]l$…ÌZ Eç³ Ñ§éÅÔ>Rꫨ-M>Æý‡$Ë$ MóSÒÒ çÜ™èlůé-Æ>-Ķæ$׿, {糿ê-MýS-Æý‡-ÔèæÆý‡Ã, yîlïÜ-D½ M>Æý‡Å-§ýlÇØ MðS.Ððl…-MýS-r-Æ> Ð]l#, MúÔèæÌŒæ gêÆ‡$$…sŒæ Mø BÇŠేyýl²-rÆŠ‡ ¼.çÜ*Æý‡Å-Ððl*-çßæ-¯ŒSÆð‡yìlz, hÌêÏ çÜÐ]l$-¯]lÓ-Ķæ$-MýSÆý‡¢ MóSçÜÇ }°-Ðé-çÜ-Æ>Ð]l#, G…DKË$, E´ë«§éÅ-Ķæ¬Ë$ ´ëÌŸY-¯é²Æý‡$. జిల్లా స్థాయి విజేతలు వీరే.. ● క్విజ్లో ఎస్డీ ఆఫియా తబస్సుం (8వ తరగతి, పీఆర్జీ బాలికల ఉన్నత పాఠశాల, కాకినాడ), జి.విజయలక్ష్మి (9వ తరగతి), వి.కుసుమ (10వ తరగతి, జెడ్పీ హైస్కూల్, పెద్దనాపల్లి) ప్రథమ స్థానం సాధించారు. కె.శివగణేష్ (8వ తరగతి, జెడ్పీ హైస్కూల్, ఇంజరం), డీఎల్వీఎన్ఎస్ఎం లహరి (9వ తరగతి, ఏపీ మోడల్ స్కూల్, శంఖవరం), కె.కిశోర్ (10వ తరగతి, జెడ్పీ హైస్కూల్, తేటగుంట) ద్వితీయ స్థానంలో నిలిచారు. ● పోస్టర్ పోటీలో జి.మేఘన (8వ తరగతి, మున్సిపల్ ఉన్నత పాఠశాల, సీతారామపురం, తుని), పీజీవీ ఆశ (9వ తరగతి, ఏపీ మోడల్ స్కూల్, శంఖవరం) ప్రథమ స్థానం సాధించారు. కె.గణేష్ (8వ తరగతి, జెడ్పీ హైస్కూల్, సర్పవరం), సీహెచ్. లోహిత సుధ (9వ తరగతి, జెడ్పీ హైస్కూల్,ఎ.కొత్తపల్లి)ద్వితీయస్థానం పొందారు. ● రీల్స్ పోటీలో ఎం.లక్ష్మీ పూర్ణిమ (10వ తరగతి, జెడ్పీ హైస్కూల్, నాయకంపల్లి) ప్రథమ, ఎన్.తేజస్విని (10వ తరగతి, జెడ్పీ హైస్కూల్, పవర) ద్వితీయ స్థానం సాధించారు. ● వీరు ఈ నెల 27న తిరుపతిలోని నేషనల్ సంస్కృత్ యూనివర్సిటీలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని కేసరి శ్రీనివాసరావు తెలిపారు. -
శతాబ్దాల ఘన చర్చితం
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న శుభదినం రెండు రోజుల్లో రానే వస్తోంది. ప్రేమ, శాంతి, కరుణ, క్షమ, నీతి వంటి సద్గుణాలను ఈ లోకానికి బోధించిన దైవ కుమారుడు.. ఏసు క్రీస్తు ఈ భూమిపై అడుగిడిన క్రిస్మస్ పర్వదినాన్ని ఆనందంగా నిర్వహించుకునేందుకు క్రైస్తవులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే చర్చిలను ముస్తాబు చేశారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. క్రైస్తవులు సామూహికంగా ప్రార్థనలు నిర్వహించుకునేందుకు శతాబ్దం కిందటే కాకినాడ నగరంలో అనేక చర్చిల నిర్మాణం జరిగింది. స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటిష్ పాలకుల హయాంలో క్రైస్తవ మిషనరీల నిర్వాహకులు వీటిని నిర్మించారు. ఇప్పటికీ చెక్కు చెదరకుండా అవి నిలుస్తున్నాయంటే.. వాటిని ఎంత పటిష్టంగా, నాణ్యంగా నిర్మించారో అర్థం చేసుకోవచ్చు. బ్రిటిష్, ఇటాలియన్ వంటి నిర్మాణ రీతులు ఈ చర్చిల్లో కనిపిస్తూ.. వీక్షకులను ఆకట్టుకుంటాయి. చర్చి స్క్వేర్ సెంటర్ కాకినాడ నగరం అనగానే క్రైస్తవులకు గుర్తుకు వచ్చేది జగన్నాథపురంలోని చర్చి స్క్వేర్ సెంటర్. వందేళ్ల చరిత్ర కలిగిన నాలుగు చర్చిలు ఉండటంతో ఆ ప్రాంతాన్ని చర్చి స్క్వేర్ సెంటర్గా పిలుస్తారు. ఇక్కడ ఇటలీకి చెందిన రోమన్ కేథలిక్ మిషన్తో పాటు బ్రిటిష్ పాలకుల హయాంలో నిర్మించిన పురాతన చర్చిలు ఉన్నాయి. ఈ నెల 25 క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 24 నుంచి 31 వరకూ క్రీస్తు జనన వేడుకను ఈ ప్రాంతంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. కాకినాడ పరిసర ప్రాంతాల నుంచి క్రైస్తవ భక్తులు వేల సంఖ్యలో ఈ వేడుకల్లో పాల్గొంటారు. కోకనాడ సెయింట్ ఆన్స్ చర్చి కోకనాడ సెయింట్ ఆన్స్ చర్చిని 1854లో జగన్నాథపురం చర్చి స్క్వేర్ సెంటర్లో నిర్మించారు. దీని నిర్మాణానికి బాప్టిస్టు జేఎన్ టిస్సోట్, ఫెడ్రిక్ డికంపియోక్స్ ఆద్యులు. ఈ చర్చి నిర్మాణంలో ఇటలీ ఆర్కిటెక్చర్ స్పష్టంగా కనపడుతుంది. చర్చి బయట కొవ్వొత్తి వెలిగించి, మేరీ మాతను పూజించడానికి రాళ్లతో కట్టిన నిర్మాణం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ చర్చిలో ఏసుక్రీస్తు విగ్రహంతో ఆల్టర్(పరిశుద్ధ స్థలం)ను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. ఫ కాకినాడలో ఎన్నో పురాతన చర్చిలు ఫ వందేళ్లకు పైగా చరిత్ర వీటి సొంతం ఫ నేటికీ చెక్కుచెదరని నిర్మాణాలు -
గాంధీజీ ఆనవాళ్లను తుడిచేస్తున్నారు
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): కులమతాలకు అతీతంగా చివరి ఊపిరి వరకూ ప్రజల కోసమే పని చేసిన జాతిపిత మహాత్మా గాంధీ ఆనవాళ్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తుడిచేస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తాటిపాక మధు ఆవేదన వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చడాన్ని నిరసిస్తూ.. స్థానిక గాంధీనగర్ పార్కులో బాపూజీ విగ్రహం వద్ద సీపీఐ, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యాన సోమవారం మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. తొలుత రామారావుపేట సెంటర్ నుంచి గాంధీనగర్ పార్కు వరకూ అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ, ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి, నిధులకు ఎగనామం పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నిందన్నారు. గాంధీజీ ఏం తప్పు చేశారని పేరు మారుస్తున్నారని ప్రశ్నించారు. ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ కూలీలకు ఉపాధి దొరుకుతోందని సంతృప్తి పడేలోపే వారు పస్తులుండే పరిస్థితికి కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తోందని ఆరోపించారు. ఇప్పటికై నా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును యథాతథంగా కొనసాగించాలని, దీనికి కేంద్రమే నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కామిరెడ్డి బోడకొండ, సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, కార్యవర్గ సభ్యులు పెద్దిరెడ్ల సత్యనారాయణ, బొబ్బిలి శ్రీనివాసరావు, సాకా రామకృష్ణ పాల్గొన్నారు. -
గణిత మేధావి రామానుజన్
కె.పెదపూడిలో 1729 ఆకృతిలో కూర్చున్న విద్యార్థులు అంబాజీపేట: దేశానికి గణిత మేధావిగా శ్రీనివాస రామానుజన్ ఎంతో కీర్తి ప్రతిష్టలు సాధించారని హైస్కూలు హెచ్.ఎం, సీహెచ్.వేణుగోపాలకృష్ణ అన్నారు. కె.పెదపూడి జెడ్పీ హైస్కూల్లో గణిత దినోత్సవాన్ని సోమవారం నిర్వహించారు. హెచ్ఎంతో పాటు ఉపాధ్యాయులు మాట్లాడుతూ శ్రీనివాస రామానుజన్కు ఎంతో ఇష్టమైన సంఖ్య 1729 అని దీనిని రెండు ఘనముల మొత్తంగా రాయగల చిన్న సంఖ్య కావటంతో దీనిని ‘రామానుజన్ సంఖ్య‘ అంటారని వివరించారు. విద్యార్థులు రామానుజన్ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అనంతరం విద్యార్థులతో ఏర్పాటు చేసిన 1729 ఆకృతి పలువురిని అలరించింది. -
ఉప్పాడలో ఫుడ్ పాయిజన్
● ఎనిమిది మంది మత్స్యకారులకు అస్వస్థత ● పిఠాపురం ప్రభుత్వాసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్న బాధితులు పిఠాపురం: చేపల ప్యాకింగ్ పనికి వెళ్లిన కొత్తపల్లి మండలం ఉప్పాడకు చెందిన ఎనిమిది మంది మత్స్యకారులు ఫుడ్ పాయిజన్ అయిన బిర్యాని తినడంతో సోమవారం తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని పిఠాపురం ప్రభుత్వాసునత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం అందరి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైదద్యులు తెలిపారు. బాధితుల కథనం ప్రకారం కొత్తపల్లి మండలం ఉప్పాడకు చెందిన మత్స్యకారులు వంక కాలేబు, ఓసిపల్లి సంతోష్, పల్లెటి స్టాలిన్, ఉమ్మిడి జాన్, గోశల పీటర్ పాల్, రాచపల్లి ప్రసాద్, గోశల ప్రసాద్, కోడా నాగేంద్ర ఆదివారం తాళ్లరేవు మండలం భైరవపాలెం తీర ప్రాంతానికి చేపల ప్యాకింగ్ పనికి వెళ్లారు. తాళ్లరేవులో ఒక బిర్యానీ హోటల్ వద్ద ఎనిమిది మంది బిర్యానీ కొనుక్కుని ప్యాకింగ్ పూర్తయ్యాక దానిని తిన్నారు. తిరిగి రాత్రికి ఇంటికి చేరుకున్నాక బిర్యానీ తిన్న ఎనిమిది మందికి వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి రావడంతో వారందరిని కొత్తపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించగా ప్రథమ చికిత్స అనంతరం పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో ఇద్దరికి మినహా మిగిలిన వారి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బాధితులను పరామర్శించిన మాజీ ఎంపీ గీత ఫుడ్ పాయిజన్ అవ్వడంతో అస్వస్థతకు గురైన బాధితులను మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జి, పీఏసీ సభ్యురాలు వంగా గీతావిశ్వనాఽథ్ పిఠాపురం ప్రభుత్వాసుపత్రిలో పరామర్శించారు. వైఎస్సార్సీపీ నాయకులు అంతా అండగా ఉంటామని ఆమె బాధితులకు ఽభరోసా కల్పించారు. ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీయాలని అవసరమైన సహకారం అందించాలని పిఠాపురం, కొత్తపల్లి మండల పార్టీ అధ్యక్షులు రావుల మాధవరావు, ఆనాల సుదర్శన్లకు ఆమె సూచించారు. ఆమె వెంట మత్స్యకార నాయకుడు ఉప్పాడ ఎంపీటీసీ మేరుగు ఎల్లాజీ కొత్తెం దత్తుడు తదితరులు ఉన్నారు. -
కాకినాడలో సినీ నటి నిధి అగర్వాల్ సందడి
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): కాకినాడ సినీనటి నిధి అగర్వాల్ సందడి చేశారు. కాకినాడ మసీద్ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ఎస్ బ్రదర్స్ వస్త్ర దుకాణాన్ని ఆమె సోమవారం ప్రారంభించారు. షాపింగ్ మాల్లో ఉన్న మూడు అంతస్తులను సందర్శించి అక్కడ ఉన్న వివిధ రకాల దుస్తులను పరిశీలించారు. తరువాత షోరూం బయట ఏర్పాటు చేసిన వేదికపై తెలుగులోనే ప్రసంగించారు. తాను ప్రభాస్ సరసన రాజా సాబ్ సినిమాలో నటిస్తున్నానని చెప్పారు. అనంతరం షోరూం చైర్మన్ పొట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తాము ఏర్పాటు చేస్తున్న ప్రతీ షోరూమ్లో పండగలు, వివాహాది కార్యక్రమాలకు అన్ని రకాల ప్రజలకు అందుబాటులో ఉండే నాణ్యమెన వస్త్రాలను అందిస్తున్నామన్నారు. కంపెనీ డైరెక్టర్ తిరువీధుల ప్రసాదరావు మాట్లాడుతూ ధరలోను, నాణ్యత లోను, అభిరుచులలో ఆర్ఎస్ బ్రదర్స్ ముందుంటుందని తెలిపారు. షోరూమ్ మేనేజింగ్ డైరెక్టర్ సిర్ణ రాజమౌళి మాట్లాడుతూ ఇక్కడ అన్ని రకాలైన వస్త్రాలు పిల్లలకు, పెద్దలకు లభిస్తాయన్నారు.ఆర్ఎస్ బ్రదర్స్ షోరూం ప్రారంభం -
సమస్యలు పరిష్కరించే వరకూ పోరాటం
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): సమస్యలు పరిష్కరించేంత వరకూ పోరాటం సాగిస్తామని రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు తోట వెంకట రామయ్య అన్నారు. కాకినాడ డీసీసీబీ వద్ద సోమవారం నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. సహకార ఉద్యోగులకు చట్ట ప్రకారం గ్రాట్యుటీ చెల్లించాలని, ఉద్యోగ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచాలని, రూ.5 లక్షలకు తక్కువ కాకుండా ఆరోగ్య బీమా కల్పించాలని, సర్వీసులో ఉండగా ఉద్యోగి మరణిస్తే ఆ కుటుంబానికి రూ.20 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ చేయించి భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. సంఘం రాష్ట్ర కోశాధికారి పెంకె సత్యనారాయణ మాట్లాడుతూ, 2019 తర్వాత సహకార సంఘాల్లో చేరిన ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, రైతులకు సహకార సంఘాల ద్వారా రుణాలిచ్చేలా చర్యలు తీసుకోవాలని, ప్రస్తుతం సహకార సంఘాల్లో పని చేస్తున్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ క్లర్క్, కంప్యూటర్ ఆపరేటర్లను సీనియారిటీ ప్రాతిపదికన జిల్లాలో ఖాళీగా ఉన్న సంఘాల సీఈఓలుగా నియమించాలని కోరారు. అనంతరం డీసీసీబీ ఇన్చార్జ్ సీఈఓ ప్రవీణ్ కుమార్కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో సంఘం కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల అధ్యక్షులు వై.రామచంద్రరావు, ఎ.ఆదినారాయణ, కేవీవీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
సెంటినరీ ఆంధ్రా బాప్టిస్ట్ చర్చి
జగన్నాథపురం చర్చి స్క్వేర్ సెంటర్లో సెంటినరీ ఆంధ్రా బాపిస్ట్ చర్చిని 1870లో సువిశాల ప్రాంగణంలో నిర్మించారు. దీని నిర్మాణం పూర్తయిన తరువాత మిషనరీ రెవరెండ్ జాన్ మెక్ లారిన్ ఇక్కడ దాదాపు తొమ్మిది సంవత్సరాల పాటు పని చేశారు. ఈ చర్చిలో బ్రిటిష్ నిర్మాణ శైలి స్పష్టంగా కనపడుతుంది. పూర్తి రాతి కట్టడం కావడంతో ఇప్పటికీ ఇసుమంత కూడా చెక్కు చెదరకుండా నిలిచింది. ఈ చర్చి ఆధ్వర్యాన క్రిస్మస్ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. క్రెగ్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చి కాకినాడ అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న క్రెగ్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చికి కూడా వందేళ్లకు పైబడిన చరిత్ర ఉంది. ఇక్కడ క్రిస్మస్ వేడుకలు ఎంతో కోలాహలంగా జరుగుతాయి. వేలాదిగా భక్తులు తరలివస్తారు. -
ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ప్రభుత్వ స్థలాల్లో 30 ఏళ్లుగా నివాసం ఉంటున్న తమకు ఇళ్ల పట్టాలు మంజూరు చేసి, పక్కా ఇల్లు నిర్మించాలని, మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కాకినాడ కలెక్టరేట్ వద్ద సోమవారం ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం, ఏఐఎఫ్టీయూ, ప్రగతిశీల మహిళా సంఘం ( సీ్త్ర విముక్తి), ప్రజా సంఘాల ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి, అనంతరం జాయింట్ కలెక్టర్ అపూర్వభరత్కు వినతి పత్రం సమర్పించారు. ధర్నాను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు మాట్లాడుతూ పెద్దాపురం ఒకటో వార్డు పరిధిలో గల ప్రభుత్వ స్థలంలో 30 ఏళ్ల క్రితం ఇల్లు లేని నిరుపేదలు పూరిగుడిసెలు వేసుకుని నివాసముంటున్నారన్నారు. ఆ కాలనీలో మౌలిక వసతులు లేక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వరదలు వచ్చిన, ఏలూరు కాలువ నీరు వదిలిన ఆ కాలనీ ముంపుకు గురవుతుందన్నారు. సర్వే నంబర్ 579లో గతంలో ప్రభుత్వం ఇచ్చిన పట్టాదారులకు ఇంటి రుణాలు మంజూరు చేయాలని, వారికి రోడ్లు డ్రైనేజీలు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.300 మంది శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన ప్రజలకు శ్మశాన వాటిక లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి శ్మశాన వాటికకు స్థలం కొనుగోలు చేసి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. రైతు కూలీ సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి అధ్యక్షుడు వల్లూరి రాజబాబు, సహాయ కార్యదర్శి కడితి సతీష్, జిల్లా నాయకులు కే రామలింగేశ్వర రావు, ఎల్లే సత్తిబాబు ఏఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి కుంచ అంజిబాబు, అధ్యక్షుడు మడికి సత్యం, ప్రగతిశీల మహిళా సంఘం ( సీ్త్ర విముక్తి) నాయకులు రెడ్డి దుర్గాదేవి, యమునా, శిరీష, దమ్మ సీత పాల్గొన్నారు. -
మరచిన సొమ్ము ఇదిగో..
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): చాలా మందికి వివిధ బ్యాంకుల్లో ఖాతాలుంటాయి. బదిలీ జరిగో, బతుకు తెరువు కోసమో ఒక ఊరి నుంచి మరో ఊరికి వెళ్లినప్పుడు పాత బ్యాంకు ఖాతాలను పలువురు వినియోగించరు. అందులో ఉన్న సొమ్ము గురించి మరచిపోతూంటారు. అలాగే, కుటుంబ సభ్యులెవరైనా మరణిస్తే వారి ఖాతాలోని సొమ్ము గురించి వారసులకు ఏమాత్రం తెలిసే అవకాశం ఉండదు. ఇన్నాళ్లూ ఇటువంటి సొమ్మును కనీసం క్లెయిమ్ చేసే అవకాశం కూడా ఉండటం లేదు. దీంతో, బ్యాంకు వినియోగదార్లు నష్టపోతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గుర్తించింది. వారికి మేలు చేసే లక్ష్యంతో అన్ క్లెయిమ్డ్ డిపాజిట్స్ గేట్వే టు యాక్సెస్ ఇన్ఫర్మేషన్ (ఉద్గమ్) పోర్టల్ను ప్రారంభించింది. దీని ద్వారా క్లెయిమ్ చేయని ఖాతాలను ఖాతాదారులు స్వయంగా తనిఖీ చేసుకోవచ్చు. అటువంటి ఖాతాదారులు, వారి వారసులు సంబంధిత బ్యాంకులను సంప్రదించి, తగు ఆధారాలు సమర్పిస్తే అన్క్లెయిమ్డ్ సొమ్మును తిరిగి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పదేళ్లు అంతకు మించి లావాదేవీలు జరగని ఖాతాల్లోని సొమ్మును ఆయా బ్యాంకులు తిరిగి చెల్లిస్తున్నాయి. ఫిక్స్డ్ డిపాజిట్, సేవింగ్స్, కరెంట్ ఖాతాలకు ఈ అవకాశం వర్తిస్తుంది. జిల్లాలో 39 బ్యాంకులుండగా వాటి పరిధిలో 351 బ్రాంచిలున్నాయి. అన్క్లెయిమ్డ్ సొమ్ము రూ.101.22 కోట్లు ఏళ్ల తరబడి ఎటువంటి లావాదేవీలు జరగని వాటిని డిపాజిట్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ (డీఈఏ) ఫండ్ ఖాతాలుగా బ్యాంకర్లు పేర్కొంటున్నారు. ఈవిధంగా జిల్లావ్యాప్తంగా 5,72,938 వ్యక్తిగత ఖాతాల్లో రూ.83.36 కోట్లు, 10,048 సంస్థల ఖాతాల్లో రూ.12.60 కోట్లు, 5,535 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల ఖాతాల్లో రూ.5.26 కోట్లు కలిపి మొత్తం 5,88,521 ఖాతాల్లో రూ.101.22 కోట్లు ఉన్నాయి. అత్యధికంగా స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిధిలోని 1.50 లక్షల ఖాతాల్లో దాదాపు రూ.45 కోట్లు ఈవిధంగా మూల్గుతున్నాయి. ఆ తరువాతి స్థానంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. ఖాతాదారు నేరుగా సంబంధిత బ్యాంకుకు వెళ్లి కెయిమ్ ఫామ్ నింపి, నో యువర్ కస్టమర్(కేవైసీ)కు సంబంధించిన ఆధారాలు సమర్పిస్తే ఆయా ఖాతాల్లోని సొమ్ము తిరిగి చెల్లిస్తారు. ఒకవేళ ఖాతాదారు మృతి చెందితే వారి వారసులు సంబంధిత వ్యక్తి మరణ ధ్రువపత్రం కూడా సమర్పించాలి. సద్వినియోగం చేసుకోవాలి ఆర్బీఐ కల్పించిన ఈ అవకాశాన్ని అర్హులైన ఖాతాదార్లు వినియోగించుకోవాలి. ఇప్పటికీ వీటిపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటి వరకూ జిల్లాలో దాదాపు 3 కోట్ల మంది వరకూ ఖాతాదారులకు రిఫండ్ చేశాం. – చందాల శ్రీవెంకట ప్రసాద్, జిల్లా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ (ఎల్డీఎం), కాకినాడ ఉద్గమ్ పోర్టల్తో వివరాలు గతంలో ఏళ్ల తరబడి లావాదేవీలు జరగని ఖాతాల్లోని వివరాలు తెలుసుకోవాలంటే ఖాతాదార్లు ఆయా బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు అన్ని బ్యాంకులకు సంబంధించి ఈ వివరాలను ఉద్గమ్ పోర్టల్ ద్వారా ఒకేచోట తెలుసుకోవచ్చు. దీనికోసం మొదట ఉద్గమ్ అధికారిక వెబ్సైట్లో మొబైల్ నంబర్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి. పేరు, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ లేదా డ్రైవింగ్ లైసెన్స్ నంబర్ ఎంటర్ చేయాలి. ఎవరి పేరిట డబ్బుందో లేదో తెలుసుకోవాలనుకుంటున్నారో వారి వివరాలు ఇచ్చి సెర్చ్ చేయాలి. ఆ వెంటనే ఆ పేరిట ఏ బ్యాంకులో ఎంత అన్క్లెయిమ్డ్ అమౌంట్ ఉందో స్క్రీన్పై కనిపిస్తుంది. అనంతరం ఆయా బ్యాంకు బ్రాంచిలను పూర్తి ఆధారాలతో సంప్రదించాలి. సమాచారం ఇలా.. అన్క్లెయిమ్డ్ డిపాజిట్లకు సంబంధించి ఆయా బ్యాంకు మేనేజర్లు తమ పరిధిలోని ఖాతాదారులకు లేదా వారి వారసులకు ఫోన్, మెసేజ్, రిజిస్టర్డ్ పోస్టు ద్వారా సమాచారం అందించాలని ఆదేశించారు. అప్పటికీ స్పందన లేకపోతే సచివాలయ సిబ్బందికి వివరాలు అందజేయాలి. వారు ఆ సమాచారాన్ని ఆయా ఖాతాదారులకు లేదా వారి వారసులకు తెలియజేస్తారు. అన్క్లెయిమ్డ్ డిపాజిట్లపై బ్యాంకులు మూడు నెలలుగా ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నాయి. ఈ శిబిరాలు ఈ నెల 31తో పూర్తవుతాయి. ఈ అంశంపై ఆయా బ్యాంకుల ఉన్నతాధికారులు ప్రతి వారం సమీక్షిస్తున్నారు. ఫ బ్యాంక్ ఖాతాలో వదిలేసిన నగదు తిరిగి పొందే చాన్స్ ఫ ఆర్బీఐ మార్గదర్శకాలు ఫ ఆధారాలతో దరఖాస్తు చేస్తే చెల్లింపులు ఫ బ్యాంకుల కసరత్తు ఫ 31 వరకూ గడువు -
రెండు తాటాకిళ్లు దగ్ధం
రూ.5 లక్షల ఆస్తినష్టం పి.గన్నవరం: మండలంలోని పోతవరం శివారు మాతావారిపేటలో ఆదివారం అర్ధరాత్రి విద్యుత్ షార్ట్ సర్యూట్ వల్ల జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు తాటాకిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. మరొక డాబా ఇల్లు పాక్షికంగా దెబ్బతింది. మొత్తం ఐదు కుటుంబాల వారు నిరాశ్రయులు కాగా, రూ.5 లక్షల మేర ఆస్తినష్టం వాటిల్లినట్టు స్థానికులు చెబుతున్నారు. మాతా చంద్రరావు ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్కూట్ వల్ల మంటలు చెలరేగడంతో ఆ ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఆ మంటలు పక్కనే ఉన్న మాతా శ్రీరాములు ఇంటికి వ్యాపించి, అతడి ఇల్లు కూడా అగ్నికి ఆహూతైంది. పక్కనే ఉన్న మాతా వెంకట్రావుకు చెందిన డాబా ఇల్లు దెబ్బతింది. అర్ధరాత్రి ఇళ్లల్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో అగ్ని ప్రమాదం జరగడంతో బాధితులంతా కట్టుబట్టలతో ప్రాణాలు అరచేత పట్టుకుని ప్రమాదం నుంచి బయట పడ్డారు. చంద్రరావు ఇంట్లో నివసిస్తున్న అతడి కుమారులు శ్రీనుబాబు, రాంబాబు కుటుంబాలవారు కూడా నిరాశ్రయులయ్యారు. ఇళ్లలోని సామాన్లు, ఫర్నీచర్, ఎలక్ట్రానిక్ వస్తువులు, దుస్తులు, విద్యార్థుల సర్టిఫికెట్లు సర్వం కాలిపోవడంతో బాధితులు ఆవేదన చెందుతున్నారు. చంద్రరావు కోడలు పద్మ ఇటీవల కువైట్ నుంచి వచ్చింది. ఆమె ఇల్లు కట్టుకుందామని తెచ్చుకున్న రూ.90 వేలు, బంగారు వస్తువులు కాలిపోవడంతో బోరున విలపించింది. సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలామని బాధితులు విలపించారు. అమలాపురం అగ్నిమాపక కేంద్ర సిబ్బంది, స్థానికులు మంటలను అదుపు చేశారు. బాధిత కుటుంబాలకు రెవెన్యూ అధికారులు బియ్యం పంపిణీ చేశారు. సర్పంచ్ వడలి కొండయ్య, వీఆర్వో పద్మావతి సహాయక చర్యలు చేపట్టారు. తహసీల్దార్ పి.శ్రీపల్లవి, ఆర్ఐ వెన్నపు డాంగే, గిడ్డి ఆనంద్ బాధిత కుటుంబాలను పరామర్శించారు. -
కంద పంటకు ఇదే అనువైన కాలం
పెరవలి: రాష్ట్రంలో కంద పంటను పశ్చిమ, తూర్పుగోదావరి, కృష్ణ, గుంటూరు జిల్లాల్లో 10వేల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో పెరవలి, నిడదవోలు, కొవ్వూరు, నల్లజర్ల, ఉండ్రాజవరం, చాగల్లు మండలాల్లో సుమారు 400 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. కంద పంట వేసే రైతులకు ఇదే సరైన సమయం కావడంతో రైతులు కందను నాటే విధానం, సాగు, సస్యరక్షణ చర్యలు, ఎరువుల యాజమాన్యం, ఆశించే తెగుళ్లు, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కొవ్వూరు ఉద్యావన శాఖ అధికారి డి.సుధీర్ కుమార్ వివరించారు. కంద నాటే సమయం ఆసన్నమవ్వడంతో రైతులు ఈ విధంగా సాగు చేపట్టాలని సూచించారు. నేల తయారీ నీటి వసతి కలిగి నీరు బయటకుపోయే సదుపాయం గల సారవంతమైన నేలలను ఎన్నుకోవాలి. ఈ పంట వేయడానికి దుక్కు లోతుగా దున్నాలి. ఆఖరి దుక్కులో 10 టన్నుల చివికిన పశువుల ఎరువును, 24కిలోల భాస్వరం ఎరువులను వేసి దుక్కి దున్నాలి. నాటే సమయం ఏడాదిలో రెండుసార్లు ఈ పంటను వేయవచ్చు. మే, జూన్ నెలల్లోను నవంబర్, డిసెంబర్ నెలల్లో విత్తనాన్ని నాటవచ్చు. విత్తనం నీడలో రెండుమూడు నెలలు ఆరబెట్టిన దుంపలనే విత్తనంగా ఉపయోగించాలి. విత్తన దుంపలు 500 నుండి 750గ్రాములు బరువు కలిగినవి వినియోగిస్తే వీటిని ముక్కలుగా కోసి వాడవచ్చు. ముక్కలుగా కోసేటప్పుడు దుంపకన్ను(మొలక భాగం) ప్రతీ ముక్కలోకి వచ్చే విధంగా కోయాలి. విత్తన దుంపలను కోసిన తరువాత వెంటనే నాటాలి. ఎకరానికి 6టన్నుల విత్తనం వాడాలి. నాటడం విత్తనదుంపలను 60 సెంటీమీటర్ల దూరంలో నాటాలి. దుంపలను భూమికి లోతుగా నాటి వెంటనే తడిపెట్టాలి. ఎరువుల యాజమాన్యం విత్తనం నాటిన 40, 80, 120 రోజులకు ఎరువులను వేయాలి. నత్రజని, పొటాష్, యూరియాను 217 కిలోలు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 179 కిలోలను 3 సమాన భాగాలుగా చేసి పైన తెలిపిన రోజుల్లో అందించాలి. ఇనుప ధాతువు లోపం కంద పంటకు నీటితడులు సక్రమంగా ఇవ్వని చేలల్లో ఇనుపధాతువు లోపం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ ధాతువు లోపం ఉన్న మొక్కల ఆకులు పత్రహరితం కోల్పోయి తెలుపుగా మారతాయి. దీని నివారణకు లీటరు నీటికి 5 గ్రాముల అన్నబేధి, 1 గ్రాము నిమ్మ ఉప్పు కలిపి వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. జింక్ ధాతువు లోపం జింక్ ధాతువు లోపం ఉంటే కందమొక్కల ఆకుల ఈనెల మధ్య పసుపువర్ణంగా మారి ఆకు ముగ్గిపోయి ఎండిపోతుంది. దీని నివారణకు లీటరు నీటికి 3 గ్రాముల జింక్సల్ఫేట్ కలిపి 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. ఆకుమచ్చ తెగులు ఆకులపై చిన్నచిన్న మచ్చలు ఏర్పడి అవి పెరిగి ఆకంతా వ్యాపించి ఆకులు ఎండిపోతాయి. ఈ తెగులు సోకడం వలన పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీని నివారణకు లీటరు నీటికి 3 గ్రాములు కాపర్ ఆక్సీక్లోరైడ్ మందును పిచికారీ చేయాలి. కాండం లేక మొదలు కుళ్లు తెగులు ఈ తెగులు మొక్క మొదలు వద్ద కాండాన్ని ఆశించడంతో కాండం కుళ్లిపోయి చనిపోతుంది. ఈ తెగులు ఆశించినప్పుడు మొదలుకు నీరు వెళ్ళకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దీని నివారణకు లీటరు నీటికి 2 గ్రాముల కాప్టాన్ లేదా 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ మందును కలిపి కాండం మొత్తం తడిసేలా పిచికారీ చేయాలి. మొజాయిక్ తెగులు ఇది వైరస్ తెగులు. ఈ తెగులు ఆశించిన మొక్కల ఆకులు పత్రహరితం కోల్పోయి ఆకులపై తెలుపు, పసుపురంగు మచ్చలు ఏర్పడతాయి. ఆకులు చిన్నవిగాను, ముడుచుకుపోయినట్లుగా ఉంటాయి. ఈ తెగులు విత్తన దుంపల ద్వారాను, పేనుబంక పురుగు ద్వారాను వ్యాపిస్తుంది. దీని నివారణకు డైమిథోయేట్ లేదా మిథైల్డెమటాన్ మందును 2 మిల్లీలీటర్లు 1 లీటరు నీటిలో కలిపి ఆకులు పూర్తిగా తడిసేలా పిచికారీ చేయాలి.అన్నవరప్పాడులో చేలో పరచిన విత్తనం కందఅన్నవరప్పాడులో విత్తనం కందను నాటుతున్న కూలీలు -
గ్రావెల్ అక్రమ తవ్వకాలపై అధికారుల దాడులు
రెండు పొక్లెయిన్లు, లారీ సీజ్ గోకవరం: మండలంలోని రంపయర్రంపాలెం, గంగంపాలెం గ్రామాల్లో జరుగుతున్న గ్రావెల్ అక్రమ తవ్వకాలపై జిల్లా మైన్స్శాఖ అధికారి డి.ఫణిభూషణ్రెడ్డి సోమవారం దాడులు నిర్వహించారు. రంపయర్రంపాలెంలో సర్వే నంబర్ 471లో బి.అర్జునుడికి చెందిన భూమిలో, గంగంపాలెంలో సర్వేనంబర్ 96/2లో కనిశెట్టి అచ్చియ్యమ్మకు చెందిన భూమిలో గ్రావెల్ అక్రమంగా తవ్వుతున్నట్టు ఆయన గుర్తించారు. ఆయా భూముల్లో గ్రావెల్ తవ్వకాలు నిర్వహిస్తున్న రెండు జేసీబీలను, లారీని సీజ్ చేశారు. రంపయర్రంపాలెంలో 1,104 క్యూబిక్ మీటర్లు, గంగంపాలెంలో 5,769 క్యూబిక్ మీటర్లు మేర గ్రావెల్ అక్రమంగా తవ్వినట్టు నిర్ధారించామన్నారు. ఆయన వెంట మైన్స్శాఖ సర్వేయర్ పి.శ్రీనివాస్, ఆయా గ్రామాల రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి తొండంగి: మండలంలోని ఏ.వి.నగరంలో బాలిక ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై అనుమానాస్పద స్థితిలో మృతి కేసు నమోదు చేసినట్టు తొండంగి ఎస్సై జగన్మోహన్రావు సోమవారం తెలిపారు. ఏ.వి.నగరం గ్రామానికి చెందిన నరాల పాపారావుకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తె కత్తిపూడిలోని ఒక ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆదివారం ఏ.వి.నగరం గ్రామంలోని తన ఇంటి నుంచి అదే గ్రామంలో అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఇంటి దూలానికి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని అదే గ్రామానికి చెందిన తాటిపర్తి వసంతు పాపారావు సమాచారం అందించాడు. ఘటనా స్ధలానికి వెళ్లి చూడగా కుమార్తె ఉరివేసుకుని వేలాడుతూ మృతిచెంది ఉంది. కుమార్తె మరణంపై అనుమానం వ్యక్తం చేస్తూ పాపారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వివరించారు. బైక్ దొంగలకు 12 నెలల జైలు గండేపల్లి: బైక్ దొంగలకు కోర్టు జైలు శిక్ష, జరిమానా విధించినట్టు సీఐ వైఆర్కే శ్రీనివాస్ తెలిపారు. రాజమహేంద్రవరానికి చెందిన తోట వినయ్ (లోఫర్), ఐసెట్టి దివాకర్ (బన్నీ) కలిసి మండలంలోని సూరంపాలెంకు చెందిన వెలుగుల బాలాజీ జూలై 11న తన కూతురిని స్థానికంగా ఉన్న ఒక ప్రైవేటు కాలేజీలో దింపేందుకు వెళ్లి మోటార్ సైకిల్ను పార్క్చేసి కాలేజీలోకి వెళ్లి వచ్చే సరికి బైక్ మాయమైందన్నారు. ఎసై యూవి శివ నాగబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి బైక్ చోరీకి పాల్పడిన ఇద్దరిని అరెస్ట్చేసి కోర్టుకు తరలించగా పెద్దాపురం జూనియర్ సివిల్ జడ్జి, జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎల్ దేవి రత్నకుమారి ఒక్కొక్కరికి 12 నెలలు చొప్పున జైలు శిక్ష, రూ.1,000 జరిమానా విధించినట్టు తెలిపారు. -
కొత్త కానిస్టేబుళ్లకు శిక్షణ ప్రారంభం
కాకినాడ రూరల్: కొత్తగా కానిస్టేబుళ్లుగా ఎంపికై న 282 మందికి తొమ్మిది నెలల శిక్షణను జిల్లా ఎస్పీ బిందుమాధవ్ రమణయ్యపేటలోని ఏపీఎస్పీ మూడో బెటాలియన్ క్యాంపులో సోమవారం ప్రారంభించారు. శిక్షణకు సంబంధించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్తగా రూపొందించిన క్రిమినల్ చట్టాలను ఎంతో శ్రద్ధాసక్తులతో నేర్చుకోవాలని, శిక్షణను సీరియస్గా తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి కమాండెంట్ దేవానందరావు, అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచి డీఎస్పీ కేవీ సత్యనారాయణ, అసిస్టెంట్ కమాండెంట్ గంగరాజు తదితరులు పాల్గొన్నారు. పీజీఆర్ఎస్కు 556 అర్జీలు బోట్క్లబ్ (కాకినాడ సిటీ): కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు 556 అర్జీలు సమర్పించారు. వారి నుంచి జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్తో పాటు వివిధ శాఖల అధికారులు అర్జీలు స్వీకరించారు. బియ్యం కార్డుల మంజూరు, ఇళ్ల స్థలాలు, ఆన్లైన్లో భూమి వివరాల నమోదు, పూడికల తొలగింపు, పారిశుధ్యం, సంక్షేమ పథకాల లబ్ధి వంటి సమస్యలు పరిష్కరించాలని ప్రజలు అర్జీలు సమర్పించారు. వీటిని గడువులోగా పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను జేసీ ఆదేశించారు. ఆలిండియా సివిల్ సర్వీసెస్ అథ్లెటిక్స్లో రజతం నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): పాట్నాలో ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకూ జరిగిన ఆలిండియా సివిల్ సర్వీసెస్ ఉద్యోగుల క్రీడా పోటీల్లో యు.కొత్తపల్లి మండలం మూలపేట జెడ్పీ హైస్కూల్ వ్యాయామోపాధ్యాయిని సునీత రజత పతకం సాధించారు. అథ్లెటిక్స్ 35–45 సంవత్సరాల కేటగిరీ లాంగ్జంప్లో ఆమె ఈ ఘనత సాధించారు. అలాగే, 100 మీటర్ల పరుగు పందెంలో ఆరో స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా సోమవారం తనను మర్యాదపూర్వకంగా కలిసిన సునీతను జిల్లా విద్యాశాఖాధికారి పిల్లి రమేష్ అభినందించారు. కార్యక్రమంలో డీఈఓ కార్యాలయ ఏడీ షరీఫ్, వ్యాయామోపాధ్యాయ సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఎల్.జార్జి పాల్గొన్నారు. సర్పవరం ఏఎస్సైకి డీజీపీ మెడల్ కాకినాడ రూరల్: సర్పవరం ఏఎస్సై ఎం.నాగేశ్వరరావు డీజీపీ మెడల్కు ఎంపికయ్యారు. పోలీసు శాఖలో ఉత్తమ సేవలందిస్తున్న అధికారులు, సిబ్బందికి డీజీపీ అవార్డులను సోమవారం ప్రకటించారు. దీనికి జిల్లా నుంచి ఇద్దరు ఎంపికవగా వీరిలో ఏఎస్సై నాగేశ్వరరావుతో పాటు ట్రాఫిక్ ఏఎస్సై హోదాలో జిల్లా స్పెషల్ బ్రాంచ్లో అటాచ్మెంట్ ద్వారా విధులు నిర్వర్తిస్తున్న రేగడమిల్లి వెంకట సత్య భాస్కర్ కూడా ఉన్నారు. వీరు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే కార్యక్రమంలో డీజీపీ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోనున్నారు. వీరితో పాటు ఏపీఎస్పీ 3వ బెటాలియన్ నుంచి పలువురు డీజీపీ మెడల్కు ఎంపికయ్యారు. అద్దేపల్లి ప్రభుకు సాహితీ వేదిక పురస్కారం సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): అనేక సంవత్సరాలు గా సాహితీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ‘రాజమండ్రి సాహితీ వేదిక’ కాకినాడకు చెందిన రచయిత అద్దేపల్లి ప్రభుకు 2025 సంవత్సరానికి ‘సాహితీ వేదిక పురస్కారం’ ప్రకటించింది. ఈ నెల 25న స్థానిక గౌతమీ గ్రంథాలయంలో జరిగే సంస్థ వార్షిక సమావేశంలో ప్రభు కు పురస్కారంతో పాటు రూ.20 వేల నగదు అందజేస్తున్నట్లు నిర్వాహకురాలు కుప్పిలి పద్మ తెలిపారు. క్లిష్టమైన వర్తమానాన్ని తన కథల్లో, కవితల్లో ఆవిష్కరిస్తూ, తెలుగు సాహిత్యానికి చేర్పునిస్తున్నందుకు గాను ఆయనకు ఈ పురస్కారం ఇస్తున్నట్లు వివరించారు. ప్రభు ఇప్పటికే ఆవాహన, పారిపోలేం, పిట్ట లేని లోకం, పర్యావరణ ప్రయాణాలు, దుఃఖపు ఎరుక కవితా సంపుటాలను, ‘సీమేన్’ కథా సంపుటిని ప్రచురించారు. -
ఆరుగురు వ్రత పురోహితుల సస్పెన్షన్
అన్నవరం: వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం వ్రతవిభాగంలో పనిచేస్తున్న ఆరుగురు వ్రత పురోహితులను సస్పెండ్ చేస్తూ దేవస్థానం ఈఓ వీ త్రినాధరావు సోమవారం ఆదేశాలు ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆదివారం అన్నవరం దేవస్థానం సామూహిక సత్యదేవుని వ్రతాలు నిర్వహించింది. ఇందుకు ఆరుగురు రెగ్యులర్ వ్రత పురోహితులు, ముగ్గురు అదనపు పురోహితులు, వ్రత సామగ్రి, సత్యదేవుని ప్రచార రథంతో బయల్దేరి వెళ్లారు. ఈ వ్రతాలలో 300 జంటలు పాల్గొనగా మరో వేయి మంది భక్తులు తిలకించినట్టు అధికారులు తెలిపారు. ఉదయం తొమ్మిది నుంచి 11 గంటల వరకు వ్రతాలు నిర్వహించిన అనంతరం వ్రతకథ చెప్పిన మొదటి శ్రేణి వ్రతపురోహితుడు మల్లాది గురుమూర్తి వ్రత దక్షిణగా భక్తులు వస్త్రదానం కింద రూ.501, అన్నదానం కింద రూ.251 ఇవ్వాలని మైకు ద్వారా డిమాండ్ చేసినట్టు దేవదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరి జవహర్లాల్, కమిషనర్ కే రామచంద్రమోహన్లకు సంబంధిత వీడియోలను సాక్ష్యాలుగా చూపుతూ కొందరు ఫిర్యాదు చేశారు. వాటిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఈఓ త్రినాథ్రావును ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ ఆదేశించారు. దీనిపై ఈఓ ఆ వ్రతాల నిర్వహణకు వెళ్లిన గుమస్తా బీఎస్ఎన్ రాజును విచారించగా వ్రతాలనంతరం భక్తుల నుంచి దానాలు రూపంలో కానుకలు డిమాండ్ చేసిన మాట వాస్తవమేనని, తాను వారించినా వినలేదని స్టేట్మెంట్ ఇచ్చారు. దీని ఆధారంగా వ్రతాల నిర్వహణకు వెళ్లిన స్పెషల్ గ్రేడ్ వ్రత పురోహితులు మంధా శ్రీరామ్మూర్తి, ప్రయాగ ఆంజనేయులు, తొయ్యేటి వేంకట నరసింహ హరిహర సుబ్రహ్మణ్యం, మొదటి శ్రేణి పురోహితులు మల్లాది గురుమూర్తి, పాలంకి సోమేశ్వరరావు, మూడో గ్రేడ్ పురోహితుడు మొక్కరాల సతీష్ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చారు. గుమస్తా బీఎస్ఎన్ రాజు కు మెమో ఇచ్చారు. సోమవారం సస్పెండ్ అయిన వ్రత పురోహితులు కొందరు గతంలో ఇదే విధమైన ఆరోపణలతో సస్పెండ్ అయి మళ్లీ విధుల్లో జాయిన్ అయ్యారు. దేవస్థానంలో పరిస్థితులు చక్కదిద్దడానికి కఠిన నిర్ణయాలు తీసుకోవలసిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
చెడు అలవాట్లతో బీబీఏ విద్యార్థి ఆత్మహత్య
అమలాపురం టౌన్: అమలాపురం జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి ఎదురుగా గల మెట్ల కాలనీకి చెందిన బీబీఏ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి కొప్పన దీపక్ రాజన్ (18) ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంట్లో ఫ్యాన్ హుక్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అమలాపురం రూరల్ మండలం భట్లపాలెం బీవీసీ ఇంజినీరింగ్ కళాశాలలో బీబీఏ చదువుతున్న దీపక్ రాజన్ చెడు అలవాట్లకు బానిసై ఈ అఘాయిత్యం చేసుకున్నాడని పట్టణ ఎస్సై టి.శ్రీనివాస్ తెలిపారు. తండ్రి మరణించడంతో అతని తల్లి అతి గారాబంగా పెంచింది. తరచూ డబ్బు కోసం తల్లిని బెదిరించడం, ఇచ్చిన డబ్బుతో మద్యం తాగడం అతనికి అలవాటుగా మారింది. కాకినాడకు చెందిన తన మామయ్య ఇటీవల చనిపోవడంతో అతని తల్లి అక్కడికి వెళ్లింది. ఆదివారం అర్ధరాత్రి మద్యం సేవించి ఇంటికి చేరుకున్న దీపక్ రాజన్ తన తండ్రి గతంలో చనిపోయాడు, ఇప్పుడు మామయ్య చనిపోయాడు. నేనూ చనిపోతానని ఇంట్లో ఉన్న తన తాతాయ్యకు చెప్పి గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. గంట సమయం దాటాక అనుమానం వచ్చి తాతాయ్య చూసేసరికి గదిలో దీపక్ రాజన్ ఉరి వేసుకుని వేలాడుతుండడాన్ని గమనించాడు. పోస్టుమార్టం కోసం విద్యార్థి మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పతికి తరలించారు. పట్టణ సీఐ పి.వీరబాబు ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. -
ఉప్పాడలో వైఎస్ విగ్రహాష్కరణ
పేదల సంక్షేమానికి పెద్దపీట వేసిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ.. పేదల పక్షపాతిగా నిలిచిన వైఎస్ జగన్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యురాలు, పిఠాపురం కో ఆర్డినేటర్ వంగా గీతా విశ్వనాథ్, జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అన్నారు. జగన్ పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా కొత్తపల్లి మండలం ఉప్పాడలో వైఎస్సార్ విగ్రహాన్ని వారు ఆవిష్కరించారు. కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. జెడ్పీటీసీ సభ్యుడు గుబ్బల తులసీకుమార్, పార్టీ ఎస్ఈసీ సభ్యుడు రావు చిన్నారావు, కారె శ్రీను, ఆనాల సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. గీత ఆధ్వర్యాన శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకూ గొల్లప్రోలు, పిఠాపురం, ఉప్పాడ కొత్తపల్లి మండలాల్లో జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పిఠాపురం ఉప్పాడ సెంటర్లో నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి, పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. పార్టీ కార్యాలయంలో గీత కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు పంచారు. పేదలకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలు, దుర్గాడ, కొడవలి, వన్నెపూడి తదితర గ్రామాల్లో జెడ్పీటీసీ సభ్యుడు ఉలవకాయల లోవరాజు ఆధ్వర్యాన జగన్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. గొల్లప్రోలులో పార్టీ జిల్లా కార్యదర్శి అముజూరి రాంబాబు వృద్ధులకు, దివ్యాంగులకు దుప్పట్లు పంపిణీ చేశారు. రాష్ట్ర కార్యదర్శి కొప్పన శివనాథ్, గండేపల్లి బాబీ తదితరులు పాల్గొన్నారు. -
ఫ శిరస్త్రాణం.. శిరో రక్షణం
ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న ఎంతో మంది హెల్మెట్పై సరైన అవగాహన లేక.. ఉన్నా పెట్టుకోక.. ప్రమాదాలకు గురైనప్పుడు అర్ధాంతరంగా అసువులు బాస్తున్నారు. కుటుంబ సభ్యులకు తీరని క్షోభను మిగిలిస్తున్నారు. ఈ నేపథ్యంలో హెల్మెట్ వాడకంపై వాహన చోదకులకు అవగాహన కల్పించే లక్ష్యంతో పోలీసులు ఆదివారం ఉప్పాడ బీచ్ రోడ్డులో వినూత్నంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పిఠాపురం సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ, ద్విచక్ర వాహనచోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి, ప్రాణ రక్షణ పొందాలని అన్నారు. ప్రాణరక్షణలో హెల్మెట్ పాత్ర, ప్రయోజనాలు, ట్రాఫిక్ నిబంధనలు, సేఫ్ డ్రైవింగ్, రోడ్డు ప్రమాదల నివారణ, ప్రయాణాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. మద్యం తాగి వాహనాలు నడపడం వలన ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే జరిమానా, జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు. లైసెన్సులు, ఇన్సూరెన్సులు తప్పనిసరిగా ఉండాలని చెప్పారు. కార్యక్రమంలో ఎస్సై వెంకటేష్, సిబ్బంది పాల్గొన్నారు. – కొత్తపల్లి -
జగ్గంపేటలో రక్తదాన శిబిరం
జగన్ జన్మదినాన్ని పురస్కరించుకుని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ తోట నరసింహం ఆధ్వర్యాన జగ్గంపేటలోని పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. పార్టీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి తోట శ్రీరాంజీ సహా నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రక్తదానం చేశారు. కేక్ కట్ చేసి, వేడుకలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు జగ్గంపేటలో పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అన్నసమారాధన నిర్వహించారు. పార్టీ నాయకులు రామూర్తి జగాలు, గుల్లా ఏడుకొండలు, ఎంపీపీ చలగల్ల దొరబాబు, బండారు రాజా, పెద్దాడ రాజబాబు, దాసరి పెదకాపు, పాటి చినబాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఒమ్మి రఘురాం, జెడ్పీటీసీ సభ్యురాలు బిందుమాధవి ఆధ్వర్యంలో జగ్గంపేటలో పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. గండేపల్లి, కిర్లంపూడిల్లో కూడా వేడుకలు ఘనంగా జరిగాయి. సామర్లకోటలో వైద్య శిబిరాలు సామర్లకోట అన్నపూర్ణ కల్యాణ మండపంలో వైఎస్సార్ సీపీ పెద్దాపురం కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు ఆధ్వర్యాన భారీ ఎత్తున రక్తదాన, నేత్ర, వైద్య శిబిరాలు నిర్వహించారు. దొరబాబు, పార్టీ నేతలు కేక్ కట్ చేసి చిన్నారికి, దివ్యాంగునికి తినిపించారు. కాకినాడ రోటరీ బ్లడ్ బ్యాంకు వైద్యుడు కామరాజు ఆధ్వర్యాన సిబ్బంది రక్తం సేకరించారు. పలువురు ప్రజలు కంటి, బీపీ, షుగర్ పరీక్షలు చేయించుకున్నారు. పెద్దాపురం క్రిస్టియన్పేటలో ఐటీ సెల్ అధ్యక్షుడు వి.ఇమ్మానియేల్ రాజు ఆధ్వర్యాన దొరబాబు దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో రాష్ట్ర కార్యదర్శి నెక్కంటి సాయిప్రసాద్, రాష్ట్ర అయ్యెరక సంఘం అధ్యక్షుడు ఆవాల లక్ష్మీనారాయణ, మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డు తులసీ మంగతాయారు, సీనియర్ నాయకుడు దవులూరి సుబ్బారావు, ఎంపీపీలు బొబ్బరాడ సత్తిబాబు, పెంకే సత్యవతి, జెడ్పీటీసీ సభ్యుడు గవరసాని సూరిబాబు, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు అత్తిలి వెంకట సీతారామస్వామి, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఇనకొండ విష్ణుచక్రం తదితరులు పాల్గొన్నారు. -
సోమవారం శ్రీ 22 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
కష్టాల్లో ఉన్న వారికి అండాదండ కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలిచిన వైఎస్ జగన్ నేటి రాజకీయాల్లో అరుదైన నాయకుడని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ కాకినాడ సిటీ కో ఆర్డినేటర్ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అన్నారు. జగన్ పుట్టిన రోజు వేడుకలను నగరంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ సిటీ కార్యాలయంలో ద్వారంపూడి కేక్ కట్ చేసి, స్వీట్లు పంచారు. జగన్నాథపురంలోని పార్టీ కార్యాలయంలో పేదలకు పండ్లు, చీరలు పంపిణీ చేశారు. మహర్షి సాంబమూర్తి ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు అన్న సమారాధన చేశారు. ఈ సందర్భంగా ద్వారంపూడి మాట్లాడుతూ, కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిరంతరం పోరాడుతున్న జగన్కు ప్రతి కార్యకర్తా తోడుగా నిలవాలని అన్నారు. ప్రజల కోసమే నిరంతరం పోరాడిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడిగా జగన్కు ఉన్న ప్రజాదరణ ఎక్కడా చెక్కు చెదరలేదన్నారు. ఆయన మరోసారి సీఎం కావడం ఖాయమని అన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సుంకర విద్యాసాగర్, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, సిటీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, యువజన, బీసీ విభాగాల జిల్లా అధ్యక్షులు రాగిరెడ్డి బన్నీ, అల్లి రాజబాబు తదితరులు పాల్గొన్నారు. -
జననేతకు జేజేలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా విప్లవాత్మక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన దార్శనికుడు.. సంక్షేమ ప్రదాత.. పేదల బాంధవుడు.. విద్యార్థులకు మావయ్యగా.. పింఛనర్లకు పెద్ద కొడుకుగా.. అక్కచెల్లెమ్మలకు సోదరుడిగా.. రాజకీయాల్లో సమున్నత విలువలకు పెద్దపీట వేసిన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు వేడుకలు జిల్లావ్యాప్తంగా ఆదివారం ఘనంగా నిర్వహించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు జననేత జన్మదిన వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొని జేజేలు పలికారు. పెద్ద ఎత్తున కేక్లు కట్ చేసి, మిఠాయిలు పంచి, సంబరాలు చేసుకున్నారు. రక్తదాన శిబిరాలు, దుప్పట్లు, పండ్ల పంపిణీ తదితర రూపాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించి, తమ అభిమానాన్ని చాటుకున్నారు. తమ ప్రియతమ నేతకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. పేదల అభ్యున్నతే జగన్ జీవితాయశం పేదల అభ్యున్నతి కోసం జీవిత కాలం పని చేసే శక్తిని, హోదాను వైఎస్ జగన్కు దేవుడు ప్రసాదించాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఆకాంక్షించారు. రమణయ్యపేట వైద్య నగర్లోని పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో జగన్ బర్త్డే కేక్ను ఆయన కట్ చేసి, అందరికీ పంచారు. వృద్ధాశ్రమాల్లో పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఐదేళ్ల జగన్ పరిపాలనలో రెండేళ్లు కోవిడ్తో పోయినా.. ఆయన అందించిన సంక్షేమం, అభివృద్ధి కళ్లకు కట్టినట్లు కనిపిస్తోందని కన్నబాబు అన్నారు. జెడ్పీటీసీ సభ్యుడు నురుకుర్తి రామకృష్ణ, పార్టీ ఎస్ఈసీ సభ్యుడు బెజవాడ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఫ ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు ఫ జిల్లావ్యాప్తంగా సంబరాలు చేసుకున్న ప్రజలు ఫ విస్తృతంగా సేవా కార్యక్రమాలు -
మహోన్నతుడు వాజ్పేయి
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి దేశ సంక్షేమమే లక్ష్యంగా పని చేసిన మహోన్నత వ్యక్తి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. కాకినాడలో ఏర్పాటు చేసిన వాజ్పేయి విగ్రహాన్ని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్తో కలిసి ఆదివారం ఆయన ప్రారంభించారు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని సత్యనిష్టతో దేశానికి దిశానిర్దేశం చేసిన ఏకై క నేత వాజ్పేయి అని అన్నారు. మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ, స్వర్ణ చతుర్భుజి, గ్రామీణ సడక్ యోజన, సర్వశిక్షాభియాన్ వంటి అనేక పథకాలకు వాజ్పేయి శ్రీకారం చుట్టారని అన్నారు. అమెరికాను సైతం ఎదిరించి అణు పరీక్షలు నిర్వహించారన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. -
భారతం సమగ్ర వేదవాజ్మయం
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్) భారతం సమగ్ర వేదవాజ్ఞ్మయమని, విజ్ఞాన సర్వస్వమని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. వ్యాసభారత ప్రవచన యజ్ఞాన్ని స్థానిక హిందూ సమాజంలో ఆయన ఆదివారం కొనసాగించారు. భారతంలోని కథలు, ఉపదేశాలు, ఉపాఖ్యానాలు, పాత్రల మధ్య కానవచ్చే సంవాదాల్లో విస్తారమైన ధర్మబోధ ఉంటుందని చెప్పారు. ధర్మం లేనప్పుడు జ్ఞానం వికసించదన్నారు. ‘భారతంలో ముఖ్యంగా మూడు విచారధారలు కనపడతాయి. జీవవిచారం– నేను ఎవరు అనే ప్రశ్న. ధర్మవిచారం– ఏది ధర్మం అనే ప్రశ్న, బ్రహ్మవిచారం– బ్రహ్మం అంటే ఏమిటి? ఈ మూడు విభాగాలకు సంబంధించిన రహస్యాలకు భారతం పరిష్కారం చూపుతుంది’ అని అన్నారు. ‘బ్రాహ్మణుడంటే ఎవరు అని ధర్మరాజును నహుషుడు అడుగుతాడు. సత్యం, దానం, క్షమ, శీలం, క్రూరత్వం లేకపోవడం, తపస్సు, దయ ఇత్యాది లక్షణాలు కలవాడే బ్రాహ్మణుడని ధర్మరాజు సమాధానం చెబుతాడు’ అని వివరించారు. వేదాలు, పురాణాలతో పాటు భారతంలో అనేక సందర్భాల్లో సరస్వతీ నది ప్రస్తావన కనబడుతుందని, అనేక పరిశోధనలు ఈ ప్రాచీన నది ఉనికిని నిర్ధారించాయని చెప్పారు. పాశ్చాత్యులు కుట్రలతో ఈ పరిశోధనలను అణగదొక్కారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘దివ్యాస్త్రాలతో తిరిగి వచ్చిన అర్జునుడు తన సోదరులను, ద్రౌపదిని కలుసుకుంటాడు. దివ్యాస్త్రాలను ప్రదర్శన కోసం వినియోగించరాదని, అల్పులపై ప్రయోగించరాదని అతడికి నారదుడు హితోపదేశం చేస్తాడు. అలాగే, క్రోధం పాపహేతువని, దీనిని నియంత్రించుకోవాలని భీముడికి కుబేరుడు చెబుతాడు’ అని సామవేదం చెప్పారు. తొలుత భాగవత విరించి డాక్టర్ టీవీ నారాయణరావు మాట్లాడుతూ, సౌగంధికా పుష్పాలను తీసుకురావడానికి వెళ్లిన భీముడి ద్వారా మనకు హనుమద్దర్శనం జరిగిందని, ఇక రామ దర్శనమే తరువాయని అన్నారు. -
జాతీయ స్థాయి కరాటే పోటీలు ప్రారంభం
సామర్లకోట: స్థానిక ఇండస్ట్రియల్ ఎస్టేట్లోని డీఎన్ఆర్ కల్యాణ మండపంలో జాతీయ స్థాయి కరాటే పోటీలు ఆదివారం అట్టహాసంగా నిర్వహించారు. స్థానిక కరాటే కోచ్ డి.శంకర్ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ పోటీల్లో 10 రాష్ట్రాల నుంచి సుమారు 300 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వివిధ కేటగిరీల్లో పోటీలు నిర్వహించారు. లయన్స్ క్లబ్ మొదటి వైస్ గవర్నర్ చిట్టినీడి శ్రీనివాసరావు, కరాటే ఇండియా చీఫ్ మల్లికార్జునగౌడ్ ఈ పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ పూర్వ గవర్నర్ ఈదల ఈశ్వర కుమార్, జిల్లా చైర్మన్ చిత్తూలూరి వీర్రాజు, క్లబ్ అధ్యక్షుడు డాక్టరు అమలకంటి శ్రీనివాసరావు, కార్యదర్శి బడుబు బాబీ, కోశాధికారి ఏలేటి రమేష్ తదితరులు పాల్గొన్నారు. సైక్లింగ్ మంచి వ్యాయామం నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): ప్రతి రోజూ ఒక గంట సైకిల్ తొక్కడం శరీరానికి మంచి వ్యాయామమని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి (డీఎస్డీఓ) వి.సతీష్ కుమార్ తెలిపారు. ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా కాకినాడలో ఆదివారం నిర్వహించిన ర్యాలీని ఆయన జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ(డీఎస్ఏ)లో జెండా ఊపి ప్రారంభించారు. డీఎస్ఏలో వివిధ క్రీడల్లో శిక్షణ పొందుతున్న చిన్నారులు ఈ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. డీఎస్ఏ నుంచి నాగమల్లితోట జంక్షన్లోని అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకూ, తిరిగి డీఎస్ఏ వరకూ ఈ ర్యాలీ కొనసాగింది. కార్యక్రమంలో డీఎస్ఏ కోచ్లు సమీర్, నాగేంద్ర, సురేష్, సత్తి చిన్నారి, కనకదుర్గ, క్రీడాకారులు పాల్గొన్నారు. 75.11 శాతం మందికి పోలియో చుక్కలు కాకినాడ క్రైం: జిల్లావ్యాప్తంగా ఆదివారం పల్స్పోలియో కార్యక్రమం ప్రారంభమైంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కాకినాడ రామారావుపేట అర్బన్ పీహెచ్సీలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్ఓ) నరసింహ నాయక్తో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఐదేళ్లలోపు పిల్లలందరికీ చుక్కల మందు ఇప్పించి, రాష్ట్రాన్ని పోలియో రహితంగా తీర్చిదిద్దడంలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు. కాగా, జిల్లావ్యాప్తంగా 1,94,437 మంది ఐదేళ్లలోపు పిల్లలుండగా 1,46,061 మందికి (75.11 శాతం) పోలియో చుక్కలు వేశామని డీఎంహెచ్ఓ ఒక ప్రకటనలో తెలిపారు. తొలి రోజు బూత్ల స్థాయిలో పూర్తి చేశామని, రానున్న రెండు రోజుల్లో క్షేత్ర స్థాయి బృందాలు ఇంటింటికీ వెళ్లి, మిగిలిన పిల్లలకు పోలియో చుక్కల మందు వేస్తాయని వివరించారు. రైలు నుంచి జారి పడి వ్యక్తి మృతి నిడదవోలు: రైలు నుంచి జారి పడి నిడదవోలు – నవాబుపాలెం రైల్వే స్టేషన్ల మధ్య ఆదివారం గుర్తు తెలియని వ్యక్తి (40) మృతి చెందాడు. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. ఆ వ్యక్తి ఒంటిపై పచ్చ రంగు టీ షర్టు, నాచు రంగు ఫ్యాంట్ ఉన్నాయి. మృతదేహన్ని తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. తాడేపల్లిగూడెం రైల్వే ఎస్సై పి.అప్పారావు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మృతుని ఆచూకీ తెలిసినవారు 94906 17090 80191 57528 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు. -
మంగళసూత్రాలే టార్గెట్
కాకినాడ క్రైం: మహిళల మెడలో మంగళసూత్రాలు లాక్కుని వెళ్తున్న నలుగురు చైన్ స్నాచర్లను పోలీసులు అరెస్టు చేశారు. మంగళసూత్రాల చోరీలే లక్ష్యంగా పేట్రేగిపోతున్న ఈ నలుగురు రోడ్లపై వెళ్తున్న మహిళల మెడల నుంచి చాకచక్యంగా లాక్కుని వెళ్లడంలో ఆరితేరిపోయారు. వీరి ఆటలను జిల్లా పోలీసులు కట్టించారు. సంబంధిత వివరాలను ఎస్పీ బిందుమాధవ్ శనివారం కాకినాడలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. జిల్లాలో పలు ప్రాంతాలకు చెందిన నలుగురు దొంగలు ఇటీవల కాలంలో చైన్ స్నాచింగ్లు చేస్తూ బెంబేలు పుట్టిస్తున్నారు. మోటార్ సైకిళ్లపై సంచరిస్తూ రోడ్లపై వెళ్తున్న ఒంటరి మహిళలు, వృద్ధులను లక్ష్యంగా ఎంచుకుంటారు. పరస్పర సమన్వయంతో ప్రణాళికను పకడ్బందీగా అమలు చేస్తారు. వరుస దొంగతనాలపై నిఘా పెట్టిన కాకినాడ రూరల్ ఇన్స్పెక్టర్ డీఎస్ చైతన్యకృష్ణ తన బృందాన్ని అప్రమత్తం చేశారు. ఎస్పీ బిందుమాధవ్ ఆదేశాల మేరకు, కాకినాడ ఏఎస్పీ దేవరాజ్ మనీష్ పాటిల్ పర్యవేక్షణలో దొంగల జాడకోసం జల్లెడ పట్టారు. సీఐ చైతన్యకృష్ణ ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయని ఎస్పీ తెలిపారు. కాజులూరు, తాళ్లరేవు, కరప మండలాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతుండగా ఈ బృందాలు ఆయా ప్రాంతాల్లో దొంగల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాయన్నారు. ఎట్టకేలకు దొంగలు తాళ్లరేవు మండలం పరదేశమ్మ పేటకు చెందిన మల్లాడి విజయ్కుమార్, సీతారాంపురం కొత్తకాలనీకి చెందిన పెసింగి రాధాకృష్ణ, కాకినాడ జగన్నాథపురానికి చెందిన మల్లాడి సతీష్, తాళ్లరేవు మండలం సీతమ్మపురానికి చెందిన పరంశెట్టి బుజ్జి వెంకట దుర్గారావులను శుక్రవారం సాయంత్రం నామవానిపాలెం మార్గంలో అరెస్టు చేశామని ఎస్పీ తెలిపారు. వీరు 24 చోరీలకు పాల్పడ్డారని తెలిపారు. ముద్దాయిల నుంచి రూ.56 లక్షల విలువైన 452 గ్రాముల బంగారంతో పాటు, ఐదు ద్విచక్ర వాహనాలను, నేరాలకు వినియోగించిన రెండు ద్విచక్రవాహనాలను సీజ్ చేశామన్నారు. దొంగల్ని పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన ఇన్స్పెక్టర్ డీఎస్ చైతన్యకృష్ణతో పాటు ఆయన బృందాన్ని ఎస్పి ప్రత్యేకంగా అభినందించారు. ● నలుగురు చైన్ స్నాచర్ల అరెస్టు ● రూ.56 లక్షల విలువైన 452 గ్రాముల బంగారం రికవరీ -
జాతీయ ఖోఖో పోటీలకు లావణ్యశ్రీ
అంబాజీపేట: తొండవరం జెడ్పీ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్న సవరపు లావణ్యశ్రీ జాతీయ ఖోఖో పోటీలలో పాల్గొననున్నట్టు హెచ్ఎం పీవీ కేశవాచార్యులు, పీడీ పెచ్చెట్టి సూర్యనారాయణ తెలిపారు. గత నెల విజయనగరంలో జరిగిన అండర్–19 బాలికల ఖోఖో రాష్ట్ర స్థాయి అంతర్ జిల్లాల పోటీల్లో లావణ్యశ్రీ పాల్గొందన్నారు. ఈ పోటీలలో ఆమె అత్యంత ప్రతిభ కనబర్చి ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున జాతీయ పోటీలకు ఎంపికై ందన్నారు. మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఈ నెల 22 నుంచి 27 వరకు జరిగే జాతీయ స్థాయి పోటీల్లో ఆమె పాల్గొననుందన్నారు. లావణ్యశ్రీని పలువురు అభినందించారు. -
తొలి తిరుపతికి భక్తుల తాకిడి
పెద్దాపురం (సామర్లకోట): పెద్దాపురం మండలంలో తొలి తిరుపతిగా ప్రసిద్ధి చెందిన తిరుపతి గ్రామంలో వెలసిన శృంగార వల్లభ స్వామి వారిని శనివారం సుమారు 15 వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. ప్రత్యేక దర్శనం టికెట్ల ద్వారా రూ.1,40,560, అన్నదాన విరాళాలు రూ.58,652, కేశఖండన ద్వారా రూ.3,080, తులాభారం ద్వారా రూ.100, లడ్డూ ప్రసాద విక్రయం ద్వారా రూ.16,860 కలిపి మొత్తం రూ.2,19,252 ఆదాయం వచ్చిందని వివరించారు. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని ధ్వజస్తంభంతో పాటు ఆలయ ప్రాంగణాన్ని పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. 24న రాష్ట్ర స్థాయి క్రాస్ కంట్రీ పోటీలు నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): రాష్ట్ర స్థాయి క్రాస్ కంట్రీ చాంపియన్షిప్ పోటీలు ఈ నెల 24న పెద్దాపురం లూథరన్ హైస్కూల్ ఆవరణలో నిర్వహిస్తున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ సంఘ కార్యదర్శి కె.సుబ్రహ్మణ్యం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా నుంచి రాష్ట్ర స్థాయికి ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 23వ తేదీ ఉదయం 10 గంటలకు తమ ఒరిజనల్ సర్టిఫికెట్లతో లూథరన్ హైస్కూల్ కార్యాలయంలో హాజరు కావాలని సూచించారు. ఆక్రమణలు తొలగించాలిబోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లావ్యాప్తంగా పంచాయతీ, రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ కార్పొరేషన్, పబ్లిక్ హెల్త్ పరిధిలోని కాలువలు, చెరువులు, డ్రైన్లపై ఆక్రమణలను గుర్తించి, ప్రణాళిక ప్రకారం తొలగించాలని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో శనివారం జరిగిన వాచ్ డాగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి నెలా లక్ష్యం నిర్దేశించుకుని ఆక్రమణలు తొలగించాలన్నారు. కాలువలు, చెరువులు, డ్రైనేజీల్లో ప్రవాహానికి అడ్డు తగిలే తూడు, గుర్రపు డెక్క, ఇతర చెత్త తొలగింపుపై దృష్టి పెట్టాలని సూచించారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్ మనీష, జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు, కాకినాడ ఆర్డీఓ ఎస్.మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు. జనవరి 18న చలో ఖమ్మం బోట్క్లబ్ (కాకినాడ సిటీ): వచ్చే నెల 18న ఖమ్మంలో జరిగే సీపీఐ శత వార్షికోత్సవ ముగింపు సభను విజయవంతం చేసేందుకు చలో ఖమ్మం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తాటిపాక మధు తెలిపారు. చలో ఖమ్మం కరపత్రాలను స్థానిక పీఆర్ భవన్లో శనివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సీపీఐ శత వార్షికోత్సవాలు ఈ నెల 26తో పూర్తవుతాయన్నారు. ఖమ్మం సభకు జిల్లా నుంచి విద్యార్థులు, యువత భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ నెల 20 నుంచి 26 వరకూ వాడవాడలా సీపీఐ పతాకావిష్కరణలు, ప్రదర్శనలు, ఉత్సవాలు జరపాలని కోరారు. జిల్లా స్థాయి శత వార్షికోత్సవ ముగింపు బహిరంగ సభ ఈ నెల 27న సామర్లకోటలో జరగనుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ఇంటింటి ప్రచారాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఉపాధి హామీ చట్టం పేరు మార్పు వలన జరిగే నష్టాలపై పల్లె పల్లెనా కూలీలకు వివరించాలని, మోదీ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా ప్రజా పోరాటాలు నిర్వహించాలని కోరారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యార్థి, యువజన సంఘాలను కలుపుకుని విద్యాలయాల్లో సెమినార్లు, ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని మధు కోరారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కె.బోడకొండ, సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
మీరు నిలిపిన ప్రాణాలే..
ఫ కాకినాడకు చెందిన అలీముద్దీన్ అన్సారీ రెండున్నరేళ్ల కుమారుడు 13 నెలల వయసులో ప్రైమరీ ఇమ్యూనో డెఫిషియన్సీతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. చికిత్సకు భారీ ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. అమెరికన్ ఆంకాలజీ హాస్పిటల్ వైద్యులు చిన్నారికి చికిత్స అందించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో అన్సారీ అప్పటి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేసుకున్నారు. ఇలా చేసుకున్న కొద్ది రోజుల వ్యవధిలోనే రూ.10 లక్షల ఆర్థిక సాయం అందింది. ఫ కాకినాడకు చెందిన పుచ్చకాయల మాధవి 50 ఏళ్ల వయసులో తలతో రక్తం గడ్డకట్టి ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. నాటి ఎమ్మెల్యే ద్వారా ప్రభుత్వానికి తన బాధను చెప్పుకుంది. అప్పటి సీఎం జగన్ తక్షణమే స్పందించి ఆమె వైద్యానికి రూ.5 లక్షలు విడుదల చేసి ఆమె ప్రాణాలు నిలిపారు. ఆమె ఇప్పుడు పూర్తిగా కోలుకొని సాధారణ జీవితం గడుపుతోంది. తన యావత్ కుటుంబం తనపై ఆధారపడి ఉందని, తనకేమైనా అయి ఉంటే తన కుటుంబం రోడ్డున పడేదని ఆవేదన వ్యక్తం చేసింది. – కాకినాడ క్రైం -
మా ఊరిని మార్చింది జగనే..
ఒకప్పుడు మా ఊరు అభివృద్ధికి ఆమడ దూరం. ఏ చిన్న పనికై నా పిఠాపురం వెళ్లాల్సిందే. దీంతో వృద్ధులు, దివ్యాంగులు, రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలూ అవస్థలు పడేవారు. 2019లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన నాటి నుంచి, మా గ్రామం రూపురేఖలు మారిపోయాయి. గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం (ఆర్బీకే), ఆసుపత్రి, అంగన్వాడీ కేంద్రం, పాల కేంద్రం, తాగునీటి ఓవర్హెడ్ ట్యాంకు, డ్రైనేజీలు, పాఠశాలలకు నూతన భవనాలు.. ఇలా సుమారు రూ.5 కోట్ల వరకూ మా గ్రామంలో అభివృద్ధి పనులు జరిగాయి. విత్తు నాటిన నాటి నుంచి పంట డబ్బు చేతికి వచ్చే వరకూ అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వమే బాధ్యత తీసుకుంది. ఆర్బీకేల ద్వారా రైతులకు అన్ని సేవలూ అందుబాటులోకి వచ్చాయి. పింఛన్లు ఇంటింటికీ అందించారు. వైఎస్ జగన్ హయాంలో సర్పంచ్గా పని చేయడం పూర్వ జన్మ సుకృతం. ఒక మనిషి తలరాత దేవుడు రాస్తాడనేది ఎంత నిజమో.. గ్రామాల తలరాతను మార్చింది వైఎస్ జగన్ అనేది అంతే నిజం. – బండి వెంకట సుబ్బారావు (సుబ్బులు), సర్పంచ్, మాధవపురం, పిఠాపురం మండలంపిఠాపురం మండలం మాధవపురంలో జగన్ హయాంలో నిర్మించిన ఆస్పత్రి నాడు–నేడు పనులతో అభివృద్ధి చేసిన పాఠశాలఫ సంక్షేమ, అభివృద్ధి ప్రదాత వైఎస్ జగన్ ఫ గత వైఎస్సార్ సీపీ పాలనలో రూ.వేల కోట్లతో సంక్షేమంఫ మేనిఫెస్టోలో ప్రకటించని పథకాలు సైతం అమలుఫ జననేత మళ్లీ రావాలని సర్వత్రా ఆకాంక్ష ఫ నేడు వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఆ ఐదు వసంతాలు.. రాష్ట్ర సంక్షేమ చరిత్రలో సువర్ణాధ్యాయాన్ని లిఖించాయి.. పల్లెపల్లెనా ప్రగతి గీతికను ఆలపించాయి.. ‘అన్నా.. నాకీ కష్టం వచ్చింద’ని చెప్పిందే తడవు.. గుండె కరగి.. కళ్లు చెమ్మగిల్లి.. ఆపన్నులకు అండగా నిలిచిన కాలమది. అది సంక్షేమ సారథి.. అభివృద్ధి వారధిగా నిలిచిన జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. పరిపాలనకు మానవత్వాన్ని జోడించిన తరుణమది. 2019కి ముందు.. ‘పచ్చ’పాలకుల తుచ్ఛ విధానాలతో కష్టాల కొలిమిలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ను అడుగడుగునా స్పృశిస్తూ.. అన్ని వర్గాల ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుంటూ.. సుదీర్ఘ పాదయాత్ర సాగించిన వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్.. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి రాగానే ఆ సమస్యల పరిష్కారానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. నవరత్న పథకాలు అమలు చేశారు. దేశ చరిత్రలోనే మునుపెన్నడూ చూడని రీతిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ రూ.వేల కోట్లతో సంక్షేమాన్ని అందించారు. ఫలితంగా నిరుపేద కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. పేదలు, మధ్యతరగతి వర్గాలు ఆర్థికంగా నిలదొక్కుకున్నాయి. అంతకుముందు ఎప్పుడూ లేని విధంగా లక్షలాదిగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. కొత్త పరిశ్రమలకు, సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) చేయూతనిచ్చారు. ప్రతి నెలా ఏదో ఒక రూపంలో ప్రజలకు లబ్ధి చేకూర్చారు. ఆ సంక్షేమ, అభివృద్ధి ప్రదాత వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించేందుకు వైఎస్సార్ సీపీ శ్రేణులు, ప్రజలు, అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నారు. కేక్ల కటింగ్తో పాటు, సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మళ్లీ ఆ జననేత ముఖ్యమంత్రి కావాలని, ప్రస్తుత పాలకుల హయాంలో ఎదుర్కొంటున్న కష్టాల నుంచి తమను గట్టెక్కించాలని ఆకాంక్షిస్తున్నారు. విద్యారంగం.. స్వర్ణయుగం ఫ జగన్ పాలనంతా విద్యారంగానికి స్వర్ణయుగంగానే నిలిచింది. ఫ జిల్లాలో 933 ప్రాథమిక, 105 ప్రాథమికోన్నత, 247 ఉన్నత కలిపి 1,285 పాఠశాలలున్నాయి. నాడు – నేడు మొదటి విడతలో 441 పాఠశాలల అభివృద్ధికి రూ.132 కోట్లు, రెండో విడతలో 881 పాఠశాలలకు రూ.334 కోట్లు మంజూరు చేశారు. ఫ ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు కార్పొరేట్తో పోటీ పడేలా దృశ్య, శ్రవణ విద్యను జగన్ అందుబాటులోకి తెచ్చారు. 2022 డిసెంబర్ 21న తన పుట్టిన రోజును పురస్కరించుకుని 8వ తరగతి విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు ట్యాబుల పంపిణీకి శ్రీకారం చుట్టారు. మొత్తం 380 పాఠశాలల్లో రూ.126 కోట్లతో 41,230 మంది విద్యార్థులకు వీటిని సమకూర్చారు. దివ్యాంగ విద్యార్థులకు సైతం 250 ట్యాబులు అందజేశారు. ఫ 247 ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి 10 తరగతులు చదువుతున్న విద్యార్థులకు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానళ్లు (ఐఎఫ్పీ) సమకూర్చడం ద్వారా డిజిటల్ విద్యా బోధనకు శ్రీకారం చుట్టారు. అలాగే, 933 ప్రాథమిక పాఠశాలల్లోని 1 నుంచి 5 తరగతుల విద్యార్థుల కోసం స్మార్ట్ టీవీలు అందజేశారు. ఫ ఏటా విద్యా సంవత్సరం ప్రారంభం రోజునే విద్యార్థుల చేతికి జగనన్న విద్యా కానుక కింద ఒక్కో విద్యార్థికి రూ.2,419 విలువైన మూడు జతల యూనిఫాం, పాఠ్య, నోట్ పుస్తకాలు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, స్కూల్ బ్యాగ్, బెల్టు, బ్యాగ్, 6 నుంచి 10 తరగతుల విద్యార్థులకు ఆక్స్ఫర్డ్ డిక్షనరీలు, 1–5 తరగతి విద్యార్థులకు పిక్టోరియల్ డిక్షనరీలతో కూడిన కిట్ అందించేవారు. ఈవిధంగా 1,59,797 మంది విద్యార్థులకు ఏటా రూ.30 కోట్లు వెచ్చించారు. నాడు ఇచ్చిన స్కూల్ బ్యాగులనే ఇప్పటికీ విద్యార్థులు వినియోగిస్తున్నారంటే వాటి నాణ్యత ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జగనన్న విద్యాకానుకను చంద్రబాబు సర్కార్ గద్దెనెక్కాక అందజేసిన బ్యాగ్లు ఆరు నెలలు కూడా తిరగకుండానే చిరిగిపోయి మూలకు చేరాయి. ఫ అమ్మ ఒడి పథకం ద్వారా అర్హులైన 1.86 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఏటా రూ.1,140 కోట్ల మేర జమ చేసేవారు. ఫలితంగా అప్పటి వరకూ పనుల్లోకి వెళ్లే విద్యార్థులను వారి తల్లిదండ్రులు బడులకు పంపించడం, ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు, హాజరు శాతం పెరగడాన్ని అప్పట్లో విద్యాశాఖాధికారులు గుర్తించారు. గాలికొదిలేసిన నేటి సర్కారు విద్యారంగంలో వైఎస్ జగన్ తీసుకొచ్చిన విప్లవాత్మకమైన సంస్కరణలను నేడు చంద్రబాబు ప్రభుత్వం గాలికొదిలేసింది. అమ్మ ఒడి పేరును తల్లికి వందనమంటూ మార్చి చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఈ పథకం కింద ప్రతి ఇంట్లో పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులందరికీ రూ.15 వేల చొప్పున ఇస్తామన్న చంద్రబాబు, పవన్ మాటలు వట్టి గారడీగా మిగిలాయి. పైగా అనేక సాకులతో విద్యార్థుల సంఖ్యలో గణనీయంగా కోత పెట్టేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకూ ఫీజు రీయింబర్స్మెంట్ ఊసే లేకుండా పోయింది. ఫలితంగా ప్రైవేటు విద్యా సంస్థల్లోని విద్యార్థులు నానా ఇబ్బందులూ పడుతున్నారు. అన్నదాతకు పెద్దపీట దేశానికి తిండి పెట్టే అన్నదాతలకు నాటి సీఎం వైఎస్ జగన్ పెద్దపీట వేశారు. దేశంలోనే తొలిసారిగా వినూత్న రీతిలో వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని ప్రవేశపెట్టారు. తద్వారా రైతులపై ప్రీమియం భారం లేకుండా చేయూతనందించారు. దీనిని కౌలు రైతులకు, దేవదాయ భూములు కౌలుకు చేసే రైతులకు కూడా వర్తింపజేశారు. ఫలితంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో గడచిన ఐదేళ్లలో ప్రకృతి విపత్తులతో పంటలు నష్టపోయిన 1,35,353 రైతులు రూ.29,638.79 కోట్ల మేర బీమా పరిహారాన్ని అందుకున్నారు. కౌలు రైతులకు కూడా గుర్తింపు కార్డులు, రైతులందరికీ ఈ–క్రాప్ నమోదు తప్పని సరి చేయడంతో ఇది సాధ్యమైంది. సొంతింటి కల సాకారం పేదల సొంతింటి కలను జగన్ సాకారం చేశారు. రూ.1,531.40 కోట్లతో 3,600.99 ఎకరాలు సేకరించి 319 జగనన్న కాలనీల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 1,52,316 మందికి ఇంటి స్థలాలు అందించారు. తొలి విడత ఇళ్ల నిర్మాణానికి గాను 71 వేల మందికి నిధులు కూడా మంజూరు చేశారు. కాకినాడలో ఐఐఎఫ్టీ జాతీయ స్థాయిలో ఢిల్లీ, కోల్కతా తరువాత ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్టీ) మూడో క్యాంపస్ కాకినాడకు దక్కడం జగన్ సర్కార్ కృషి ఫలితమే. దీని కోసం గుజరాత్, రాజస్థాన్, ఒడిశా తదితర రాష్ట్రాల మధ్య గట్టి పోటీ నెలకొన్న తరుణంలో కాకినాడలో ఏర్పాటు చేసేలా నాటి ముఖ్యమంత్రి జగన్ అవిరళ కృషి చేశారు. దీని కోసం కాకినాడ ఎస్ఈజెడ్లో జగన్ 25 ఎకరాలు కేటాయించారు. ఆయన హయాంలోనే కేంద్రం నుంచి సాధించిన రూ.229 కోట్లతో ఈ క్యాంపస్లో భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. బాగుబడి మండల కేంద్రమైన గోకవరం గ్రామానికి చెందిన షేక్ నాగూర్ వలీబాబా, షేక్ యాకూబీబీ దంపతులది మధ్యతరగతి కుటుంబం. వలీబాబా కారు డ్రైవర్గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వారి ఒక్కగానొక కుమారుడు షేక్ బషీర్ను ఉన్నత చదువులు చదివించాలని దంపతులిద్దరూ ఆశ పడేవారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతుందో లేదోననే భయంతో ఐదో తరగతి వరకూ స్థానిక ప్రైవేటు పాఠశాలలో చేర్పించారు. ఫీజులు చెల్లించడానికి అప్పులు చేయాల్సి వచ్చేది. 2019లో జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత, ప్రభుత్వ పాఠశాలను ఆధునీకరించి మెరుగైన విద్యను అందించారు. ఆయనపై నమ్మకంతో వలీబాబా తన కుమారుడిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. 6 నుంచి 8వ తరగతి వరకూ స్థానిక ఎంపీయూపీ, 9, 10 తరగతులు జెడ్పీ హైస్కూల్లో చదివించారు. ఆ పాఠశాలలను నాడు–నేడు పథకంలో పూర్తిగా ఆధునీకరించి, మెరుగైన వసతులు కల్పించారు. దీంతో, షేక్ బషీర్ పదో తరగతిలో 447 మార్కులు సాధించాడు. తమ కుమారుడికి బంగారు భవిష్యత్తును అందించిన జగన్.. దేవుని ఆశీస్సులతో కలకాలం సుఖ సంతోషాలతో ఉండాలని వలీబాబా దంపతులు కోరుకుంటున్నారు. – గోకవరం -
ఐహెచ్ఆర్సీ ఉపాధ్యక్షుడిగా బిషప్ డాక్టర్ థామస్
నియామక పత్రం అందచేసిన జాతీయ అధ్యక్షుడు సాక్షి, న్యూఢిల్లీ: అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్(ఐహెచ్ఆర్సీ) భారతదేశ ఉపాధ్యక్షుడిగా బిషప్ డాక్టర్ అరుల్ థామస్ సెల్వనాథన్ నియమితులయ్యారు. ఈ మేరకు నియామక పత్రాన్ని జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కుందవరం రాజానందన్ విజ్ఞాన్ ఢిల్లీలో అందచేశారు. కొన్నేళ్లుగా మానవ హక్కులకు సంబంధించి డాక్టర్ థామస్ విశేషమైన సేవలను అందిస్తున్నారు. ఐహెచ్ఆర్సీ తరఫున ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ మానవ హక్కులపై ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నారు. ఇందుకు గాను ఇండియన్ చాప్టర్ (దేశ) ఉపాధ్యక్షుడిగా డాక్టర్ థామస్ను నియమించారు. ఈ పదవి తనకు మరింత బాధ్యతను పెంచిందని డాక్టర్ థామస్ పేర్కొన్నారు. -
ఇల్లు ఇచ్చి.. సోదరిగా బట్టలు పెట్టారు
సామర్లకోట జగనన్న కాలనీకి చెందిన బండి విశాల భర్త సింహాచలం కోవిడ్ సమయంలో మరణించారు. ఎటువంటి ఉపాధీ లేక, దిక్కు లేని స్థితిలో ఉన్న ఆమె కుటుంబానికి నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. ప్రత్తిపాడు రోడ్డులో ఇల్లు నిర్మించి ఇవ్వడమే కాకుండా స్వయంగా ఆమె ఇంటిని ప్రారంభించారు. గృహప్రవేశ సమయంలో సోదరిగా భావించి, తనకు బట్టలు పెట్టడం ఎప్పటికీ మరచిపోలేనని విశాల చెమర్చిన కళ్లతో చెప్పారు. అటువంటి ముఖ్యమంత్రినే ప్రజలు కోరుకుంటారని అన్నారు. మహిళా సంఘంలో సభ్యురాలు కావడంతో బ్యాంకు నుంచి తీసుకున్న రుణానికి ఉచిత వడ్డీ సైతం ఆమెకు అమలు చేశారు. దీంతో నాలుగు వాయిదాల్లోనే విశాల రుణ బకాయి మొత్తం చెల్లించారు. మహిళా సంఘంలో సభ్యురాలిగా ఉండటంతో ఇంటి నిర్మాణానికి రుణం సైతం సులభంగానే లభించింది. ప్రస్తుతం ఆ రుణ బకాయి ఉండటంతో నోటీసులు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ సీఎంగా ఉన్న సమయంలోనే విశాల పెద్ద కుమార్తె మేఘన ఫీజు రీయింబర్స్మెంట్ సాయంతో బీఎస్సీ పూర్తి చేసి, డిప్లమో చేసింది. చిన్న కుమార్తె కీర్తిప్రియకు అమ్మ ఒడి పథకం అమలైంది. ప్రస్తుతం ఆమె బీకాం చదువుతోంది. ఈ ప్రభుత్వంలో ఇప్పటి వరకూ ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదు. తమ ఒక్క కుటుంబానికి ఇన్నివిధాల సాయం చేసిన జగన్ మేలును జీవితాంతం గుర్తుంచుకుంటామని, తమ ఆయుష్షు కూడా పోసుకుని, ఆయన నూరేళ్లు సంపూర్ణ జీవితం గడపాలని విశాల ఆకాంక్షించారు. -
కల నెరవేరింది
కాకినాడ రూరల్ వాకలపూడి గ్రామానికి చెందిన కర్రి చక్రధరరావు, విజయకుమారి దంపతులది పేద కుటుంబం. ముగ్గురు కుమారులు. కుటుంబ పోషణ కోసం గ్రామంలో చిన్న మెడికల్ షాపు నిర్వహించుకుంటున్నారు. పెద్దబ్బాయి పాలిటెక్నిక్ పూర్తి చేశాడు. రెండో అబ్బాయి తమన్ సాయినందన్ కుటుంబానికి చేయూతగా ఉండాలని బీ ఫార్మసీ చేయాలని కలలు కన్నాడు. ఆర్థిక పరిస్థితి సహకరించక అతడిని చదివించేందుకు చక్రధరరావు దంపతులు వెనుకంజ వేశారు. అయితే, వారి మొరను వైఎస్ జగన్మోహన్రెడ్డి రూపంలో దేవుడు ఆలకించాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తమన్కు 2021లో భీమవరం విష్ణు కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో సీటు వచ్చింది. డబ్బులిచ్చి చదివించే స్తోమత లేకున్నా నాడు జగన్ అమలు చేసిన ఫీజు రీయింబర్స్మెంట్ ఆదుకుంది. ఏడాదికి రూ.60,300 చొప్పున మొత్తం రూ.2,41,200 ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చింది. చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగం కూడా వచ్చింది. తమన్ సాయినందన్ ఇప్పుడు రాజమహేంద్రవరంలోని ఓ మెడికల్ కంపెనీలో ఉద్యోగం చేసుకుంటూ, ప్రతి నెలా రూ.27,500 జీతం పొందుతూ తమకు ఆసరాగా ఉన్నాడని తల్లిదండ్రులు చెబుతున్నారు. మూడో కుమారుడికి కూడా జగన్ ప్రభుత్వ హయాంలోనే బీటెక్ సీటు వచ్చింది. ప్రస్తుతం ఆంధ్రా యూనివర్సిటీలో అతడు బీటెక్ చదువుతున్నాడు. జగనన్న వల్లనే తమ కుటుంబంలో ముగ్గురు అబ్బాయిలు ఉన్నత విద్య చదువుకోగలిగారని, ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటూ చేదోడుగా ఉన్నారని చక్రధరరావు దంపతులు చెబుతున్నారు. తమ బిడ్డలకు మంచి భవిష్యత్తును అందించిన జగన్ నిండు నూరేళ్లూ చల్లగా ఉండాలని, మళ్లీ అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తున్నారు. తన ఉన్నత చదువుల కలను నిజం చేసిన జగన్కు తమన్ సాయినందన్ కృతజ్ఞతలు చెబుతున్నారు. – కాకినాడ రూరల్ -
చైతన్య కెరటం చెకుముకి
● రాష్ట్ర స్థాయి సంబరాలకు కాకినాడ సిద్ధం ● మూడోసారి ఆతిథ్యమిస్తున్న ఉమ్మడి జిల్లా ● రాష్ట్ర వ్యాప్తంగా 312 మంది హాజరు ● శాస్త్రవేత్తలతో 162 మంది విద్యార్థులు మమేకం కపిలేశ్వరపురం: మానవుని దైనందిన జీవితంలో సైన్స్ భాగం కావాలన్న లక్ష్యంతో జన విజ్ఞాన వేదిక 37 ఏళ్లుగా కృషి చేస్తోంది. విద్యార్థుల్లో విజ్ఞానం, సమాజం పట్ల చైతన్యం కల్పించే దిశగా చెకుముకి సంబరాలను ఏటా నిర్వహిస్తోంది. ఈ ఏడాది రాష్ట్ర స్థాయి సంబరాలను కాకినాడ జేఎన్టీయూకేలో ఆదివారం నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కథనం.. విద్యార్థులు ప్రతిభ ఇలా.. అక్టోబర్ 18న పాఠశాల స్థాయిలోనూ, నవంబర్ 4న మండల స్థాయిలోనూ చెకుముకి పరీక్ష నిర్వహించి మండలానికి ఒక్కో బృందం చొప్పున జిల్లా పోటీలకు ఎంపిక చేశారు. నవంబర్ 23న కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో జిల్లా స్థాయి సంబరాలను నిర్వహించారు. వారిలో ప్రథమ స్థానంలో నిలిచిన ప్రభుత్వ, ప్రైవేటు విభాగాలకు ఒక్కో బృందం చొప్పున ఆదివారం నుంచి రాష్ట్ర స్థాయి సంబరాలకు ఎంపిక చేశారు. కోనసీమ జిల్లా ప్రభుత్వ విభాగం నుంచి మండపేట రూరల్ మండలం ద్వారపూడి జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థుల బృందం, ప్రైవేటు విభాగంలో మండపేట పట్టణంలోని అన్నపూర్ణ ఉన్నత పాఠశాల విద్యార్థుల బృందం ప్రథమ స్థానంలో నిలిచాయి. తూర్పుగోదావరి జిల్లా ప్రభుత్వ విభాగం నుంచి సీతానగరం మండలం రఘుదేవపురం పీఎంశ్రీ జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు, ప్రైవేటు విభాగం నుంచి రాజానగరంలోని శ్రీప్రకాష్ విద్యానికేతన్ విద్యార్థులు నిలిచారు. కాకినాడ జిల్లా ప్రభుత్వ విభాగం నుంచి పిఠాపురం ఆర్ఆర్ బీహెచ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు, ప్రైవేటు విభాగం నుంచి కాకినాడ గంగరాజునగర్లోని ఆదిత్య ఇంగ్లిష్ మీడియం పాఠశాల విద్యార్థుల బృందం ప్రథమ స్థానాల్లో నిలిచాయి. కాకినాడలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి చెకుముకి పోటీల్లో ఆయా బృందాల ప్రాజెక్టులు ప్రదర్శించనున్నారు. రాష్ట్ర స్థాయి సంబరాల ప్రత్యేకతలివీ కాకినాడలోని జేఎన్టీయూకేలో మూడు రోజుల పాటు రాష్ట్ర స్థాయి సంబరాలు నిర్వహించనున్నారు. 2015లో జేఎన్టీయూకేలోనూ, 2014లో పెద్దాపురం శ్రీప్రకాష్ విద్యాలయంలోనూ రాష్ట్ర స్థాయి సంబాలను నిర్వహించారు. ప్రస్తుత సంబరాలకు రాష్ట్రం నలుమూలల నుంచి 54 బృందాలుగా 162 మంది విద్యార్థులు చెకుముకి పరీక్షలో పాల్గొననున్నారు. మరో 150 మంది తల్లిదండ్రులు హాజరుకానున్నారు. ఒక్కో బృందానికి ఒక్కో గైడ్ టీచర్ హాజరవుతారు. హైదరాబాద్ సీసీఎంబీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ వేగేశ్న రాధ, విశాఖపట్టణం డీఆర్డీఓ శాస్త్రవేత్త డాక్టర్ యు.అర్బన్కుమార్, ప్రొఫెసర్ రామచంద్రయ్య, ప్రొఫెసర్ లక్ష్మారెడ్డిలతో మీట్ ది సైంటిస్ట్ నిర్వహిస్తారు. అలాగే విద్యార్థి బృందాలకు రాత పరీక్ష నిర్వహిస్తారు. వ్యక్తిగతంగా కాకుండా విద్యార్థుల బృందంగానే ప్రతిభను పరిగణిస్తారు. ప్రాక్టికల్, ఆడియో, వీడియో విజువల్ క్విజ్ రౌండ్ తదితర ప్రతిభా పోటీలను నిర్వహిస్తారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థి బృందాలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను ఎంపిక చేస్తారు. విద్యార్థులను క్షేత్ర పరిశీలన విభాగంలో మడ అడవుల సందర్శనకు తీసుకెళ్తారు. తల్లిదండ్రులకు వివిధ సామాజిక అంశాలపై చర్చావేదిక నిర్వహిస్తారు. జీవితంలో సైన్స్ భాగం కావాలి ప్రజల దైనందిన జీవితంలో సైన్స్ భావాలను కల్పించడమే లక్ష్యంగా జనవిజ్ఞాన వేదిక కృషి చేస్తోంది. ఆ లక్ష్యంలో భాగంగా 8, 9, 10 విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం, చదువు పట్ల ఆసక్తి, చిన్ననాటి నుంచీ సమానత్వం, ఇచ్చిపుచ్చుకునే ధోరణి, సమష్టి ఆచరణ పద్ధతులను అలవాటు చేయడానికి కృషి చేస్తున్నాం. కాకినాడలోని రాష్ట్ర స్థాయి సంబరాలు విద్యార్థులకు ఎంతో ఉపయోగకరం. జీఎస్హెచ్పీ వర్మ, ఆహ్వాన సంఘం కార్యదర్శి, కాకినాడ చెకుముకి సంబరాల నేపథ్యమిదీ మానవుల్లో అజ్ఞానాన్ని తొలగించేందుకు పలువురు మేధావులు 1988 ఫిబ్రవరి 28న జన విజ్ఞాన వేదికను స్థాపించారు. విద్యార్థి చెకుముకి పేరుతో 1990 డిసెంబరు నుంచి సైన్స్ మాస పత్రికను, 2010 నుంచి ‘చెకుముఖి సైన్స్ సంబరాలు’ను నిర్వహిస్తుంది. నేర్చుకున్నది గుర్తుంచుకోవడం కాకుండా ఆచరించగలగడమే గీటురాయి అని చెప్పడమే సంబరాల ఉద్దేశం. వ్యక్తిగా కాకుండా సమూహంగా విజ్ఞాన ప్రదర్శనకు ప్రాధాన్యం ఇస్తుండటం చెకుముకి మరో ప్రత్యేకత. -
అగ్ని ప్రమాదంలో పూరిళ్లు దగ్ధం
నిరాశ్రయులైన పేద కుటుంబాలు తొండంగి: మండలంలోని శృంగవృక్షంలో శనివారం అగ్నిప్రమాదం సంభవించి ఏడు పూరిళ్లు దగ్ధమయ్యాయి. శృంగవృక్షం గ్రామశివారు పి.అగ్రహారం రహదారిలో సుమారు పది కుటుంబాల వారు ఈ ఇళ్లలో నివసిస్తున్నారు. కొబ్బరి చీపుర్లు, పాములు పట్టడం, ఉడుములు పట్టడం వంటి కుటుంబ వృత్తులతో వారు జీవిస్తుంటారు. శనివారం మధ్యాహ్నం ఓ ఇంటిలో వంట చేస్తుండగా పొయ్యిలోని మంటలు చెలరేగి పై కప్పునకు వ్యాపించాయి. ఈదురుగాలుల ప్రభావంతో మరో ఐదిళ్లకు మంటలు వ్యాపించి క్షణాల్లో అవి కాలిపోయాయి. మగవారు పనికి వెళ్లడంతో ఇళ్లలోని మహిళలు, పిల్లలు కేకలు వేయడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించి ఈ లోపు మంటలు ఆర్పేందుకు చేతనైన చర్యలు తీసుకున్నారు. అగ్నిమాపక శకటం వచ్చేటప్పటికే ఆ పూరిళ్లన్నీ కాలిపోయాయి. తోట రమణ, రావూరి శివ, పుట్టం పోలయ్య, తుపాకుల వెంకటలక్ష్మి, బండి సత్తిబాబు, పంజాపు లక్ష్మి, పుట్టం రాజు తదితర కుటుంబాల వారి ఇంటి సామగ్రితో పాటు నగదు కాలిపోవడంతో తీవ్రంగా నష్టపోయారు. సుమారు రూ.పది లక్షల ఆస్తినష్టం ఉంటుందని బాధితులు వాపోయారు. కట్టుబట్టలతో మిగిలిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. దీనిపై తహసీల్దార్ కాంతారావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అట్టహాసంగా టెన్నిస్ టోర్నీ పెద్దాపురం (సామర్లకోట): సీనియర్ జాతీయ ర్యాంకర్స్ టెన్నిస్ టోర్నమెంట్ శనివారం పెద్దాపురం లిటరరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో అట్టహసంగా ప్రారంభమైంది. 35 ప్లస్, 40 ప్లస్, 45 ప్లస్, 50 ప్లస్, 55 ప్లస్, 60 ప్లస్, 65ప్లస్, 70ప్లస్, 70 ప్లస్ విభాగాలలో టెన్నిస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఏటా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి పోటీలలో భాగంగానే ఈ పోటీలు ఈనెల 23 వరకు జరుగుతాయని చెప్పారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు తమ పేర్లు నమోదు చేయించుకోవాలన్నారు. లిటరరీ అసోసియేషన్ క్లబ్ ఆహ్లాదకరమైన వాతావారణంలో పోటీలు నువ్వా, నేనా అన్నట్టు సింగిల్స్, డబుల్స్ పోటీలు జరిగాయి. డ్రైవర్ నిర్లక్ష్యం... ప్రయాణికురాలికి గాయం ప్రత్తిపాడు: ఉచిత బస్సు.. ప్రయాణికుల రద్దీకి తోడు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ప్రయాణికురాలు గాయపడిన ఘటన శనివారం జరిగింది. స్థానికుల కథనం మేరకు ఏలేశ్వరం మండల కేంద్రానికి చెందిన బి.దివ్య బంధువు వి.పరిమళతో కలిసి పెద్దాపురం మండలం పులిమేరు వెళ్లేందుకు పయనమయ్యారు. ఏలేశ్వరం నుంచి యర్రవరం వచ్చిన వారిద్దరూ ప్రత్తిపాడు వెళ్లేందుకు రాజమహేంద్రపురం డిపోకు చెందిన తుని వెళ్లే బస్సు ఎక్కుతుండగా డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సును కదిలించారు. దీంతో దివ్య అదుపుతప్పి పడిపోయింది. దీనిపై ప్రయాణి కులు డ్రైవర్పై ఆగ్రహంతో విరుచుకుపడడంతో అదే బస్సులో ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో తరలించారు. చికిత్స అనంతరం ఆమె స్వగ్రామానికి వెళ్లిపోయింది. -
భక్తజన సంద్రమైన వాడపల్లి
కొత్తపేట: ఏడు వారాలస్వామి వాడపల్లి వెంకన్న ఆలయం శనివారం భక్తులతో కిక్కిరిసింది. ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ, భూ సమేత వేంకటేశ్వరస్వామి క్షేత్రానికి రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన భక్తులు స్వామిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుంచి ప్రత్యేక పూజలు అర్చనలు చేశారు. దేవస్థానానికి ఒక్క రోజు ఆదాయం రూ 62.53 లక్షలు సమకూరినట్టు ఈఓ తెలిపారు. సాధారణ భక్తులతో పాటు ఏడు శనివారాలు.. ఏడు ప్రదక్షిణ చేస్తున్న భక్తులతో వాడపల్లి క్షేత్రం భక్తజన సంద్రమైంది. అనంతరం తీర్థప్రసాదాలు, అన్నప్రసాదం స్వీకరించారు. ఎస్సై రాము ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది ట్రాఫిక్ను క్రమబద్ధీకరణ, బందోబస్తు నిర్వహించారు. ఒక్క రోజు ఆదాయం రూ.53.36 లక్షలు వాడపల్లి క్షేత్రానికి వేలాదిగా తరలివచ్చిన భక్తుల విశిష్ట దర్శనం, ప్రత్యేక దర్శనం, వేదాశీర్వచనం, ఆన్లైన్, నిత్య, శాస్వత అన్నదానం విరాళాలు, లడ్డు విక్రయం తదితర రూపాల్లో శనివారం ఒక్కరోజు రాత్రి 9 గంటల వరకూ దేవస్థానానికి రూ.53,36,577 ఆదాయం వచ్చినట్టు ఈఓ చక్రధరరావు తెలిపారు. ధర్మపథం కార్యక్రమంలో భాగంగా రాత్రి రావులపాలేనికి చెందిన సాయి నటరాజ కళాపీఠం కళాకారిణుల కూచిపూడి నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. వారికి దేవస్థానం వారు మెమెంటోలు అందచేశారు. శనైశ్చరుని ఆదాయం రూ.2.49 లక్షలు కొత్తపేట: శనిదోష నివారణకు ప్రసిద్ధి చెందిన మందపల్లి ఉమా మందేశ్వర (శనైశ్చర) స్వామి వారిని శనివారం అత్యధిక సంఖ్యలో భక్తులు దర్శించి, ప్రత్యేక పూజలు, తైలాభిషేకాలు చేశారు. దేవస్థానం చైర్మన్ దారపురెడ్డి సురేష్బాబు ఆధ్వర్యంలో భక్తుల పూజలకు ఏర్పాట్లు చేశారు. భక్తుల ప్రత్యక్ష పూజలు, తైలాభిషేకాల టిక్కెట్ల ద్వారా దేవస్థానానికి రూ.1,28,670, పరోక్ష పూజలు, మనియార్డర్లు ద్వారా రూ.86,600, అన్నప్రసాదం విరాళాలు రూపంలో రూ.33,954 మొత్తం రూ.2,49,224 ఆదాయం వచ్చినట్టు ఈఓ సురేష్బాబు తెలిపారు. -
పిల్లలకు స్క్రీనింగ్ పరీక్షలు
కాకినాడ క్రైం: స్థానిక జీజీహెచ్లో చీలిక పెదాలు, అంగిలి సవరణ చికిత్సా శిబిరం శనివారం ప్రారంభమైంది. మిషన్ స్మైల్ ఇండియా ఫినాలెక్స్, ముకుల్ మహదేవ్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీ వరకు నిర్వహించనున్న ఈ శిబిరాన్ని సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి ప్రారంభించారు. బాధిత బాలల్ని గుర్తించేందుకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ప్లాస్టిక్ సర్జరీ హెచ్ఓడీ డాక్టర్ రత్నభూషణ్ పర్యవేక్షణలో అనస్తీషియా అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రతాప్, డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ వైద్యులు శిశిర్రెడ్డి, రేఖాదేవి ఆధ్వర్యంలో చేపట్టారు. మొత్తం 66 మంది బాలలకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. -
పవన్ సభ కోసం.. పచ్చని చెట్లపై వేటు
పెరవలి: ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్న చందంగా ఉంది జనసేన నేతల తీరు. ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ శనివారం పెరవలిలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నేతలు జాతీయ రహదారి పక్కన ఉన్న పలు చెట్లను నరికివేశారు. విషయం తెలియడంతో హైవే అధికారులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. చెట్లు ఎందుకు, ఎవరిని అడిగి నరుకుతున్నారని ప్రశ్నించారు. దీంతో, జనసేన కార్యకర్తలు వెనక్కు తగ్గారు. అయితే, అప్పటికే పచ్చగా ఉన్న సుమారు 10 చెట్లపై వేటు వేసేశారు. గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎక్కడైనా సభ నిర్వహిస్తే చెట్లు నరికివేస్తున్నారంటూ ఏమీ జరగకపోయినా కూటమి నేతలు రచ్చ చేసేవారు. అటువంటిది ఇప్పుడు జనసేన శ్రేణులు చెట్లు నరికివేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. టీడీపీ, బీజేపీ దూరం! మరోవైపు పవన్ సభకు కూటమి నేతల నుంచి పెద్దగా సహకారం అందడం లేదని తెలుస్తోంది. జాతీయ రహదారి పైన, సభా ప్రాంగణం వద్ద జనసేన జెండాలు, ఫ్లెక్సీలే కనిపిస్తున్నాయి. టీడీపీ, బీజేపీ జెండాలు, ప్లెక్సీలు మచ్చుకు కూడా కానరావడం లేదు. కొంత కాలంగా నిడదవోలు నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య విభేదాలు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, కందుల దుర్గేష్ కలసి మాట్లాడుకున్నా మండల, నియోజకవర్గ నాయకుల్లో మాత్రం అంతర్గత విభేదాలు బలంగానే ఉన్నాయి. అందువల్లనే జనసేన నేతలు తప్ప, కూటమిలోని మిగిలిన పార్టీల నాయకులెవ్వరూ సభా ప్రాంగణానికి రావడం లేదని పలువురు చెబుతున్నారు.పెరవలిలో జాతీయ రహదారి పక్కన నరికేసిన చెట్లు -
నీరు ఎలా పంపాలి?
అన్నవరంలోని పంపా రిజర్వాయర్ అన్నవరం: పంపా రిజర్వాయర్ కింద ఈ ఏడాది రబీ సాగుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించినా.. ఎన్ని ఎకరాలకు నీరు సరఫరా చేస్తారనే దానిపై సందిగ్ధత కొనసాగుతోంది. ప్రస్తుతం పంపా నదీ గర్భంలో నిర్మిస్తున్న పోలవరం అక్విడెక్ట్ పనులు జరుగుతున్నాయి. ఇవి వేగంగా జరగాలంటే పంపా రిజర్వాయర్ నీటిమట్టం 91 అడుగులకు తగ్గించాలని పోలవరం అధికారులు కోరుతున్నారు. మరోవైపు నీటిని వృథాగా వదిలేయడంకన్నా రబీకి ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పంపా రిజర్వాయర్ అధికారులు కూడా అదే ఆలోచనలో ఉన్నారు. ఇది జరగాలంటే పంపాకు ఏలేరు నుంచి నీటిని విడుదల చేయాల్సి ఉంటుంది. ఏలేరు నుంచి ఎన్ని క్యూసెక్కుల నీరు విడుదల చేస్తారనే దానిపై పంపా ఆయకట్టులో ఎన్ని వేల ఎకరాల్లో రబీ సాగు జరుగుతుందనేది ఆధారపడి ఉంటుంది. రబీకి నీటి కొరత పంపా రిజర్వాయర్ గరిష్ట నీటిమట్టం 103 అడుగులు. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 0.43 టీఎంసీలు. పంపా పూర్తి ఆయకట్టు 12,500 ఎకరాల్లో ఖరీఫ్ పంటల సాగుకు సుమారు 1.5 టీఎంసీల నీరు అవసరమవుతోంది. అయితే, ఆ సమయంలో వర్షాలు కురుస్తాయి కాబట్టి రిజర్వాయర్ నుంచి నీటి అవసరం తక్కువగా ఉంటుంది. ఈ ఏడాది ఖరీఫ్లోనూ అదే జరిగింది. వర్షాలు దండిగా కురవడంతో రైతులు పూర్తి స్ధాయి ఆయకట్టులో వరి సాగు చేశారు. అదే పూర్తి స్థాయి ఆయకట్టులో రబీ సాగు జరగాలంటే పంపా రిజర్వాయర్ నుంచి నీరు పుష్కలంగా అందాలి. పది వేల ఎకరాల్లో సాగు చేయాలంటే ఒక టీఎంసీ నీరు అవసరం. కానీ, పంపాలో గరిష్ట స్థాయిలో 0.43 టీఎంసీల నీటి లభ్యత మాత్రమే ఉంటోంది. ప్రస్తుతం పంపాలో నీటిమట్టం 97.5 అడుగులు ఉంది. నీటి నిల్వలు 0.25 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. మొత్తం 10 వేల ఎకరాల్లో రబీ సాగు జరగాలంటే మరో 0.75 టీఎంసీల నీరు అవసరం. ఏలేరే గతి పంపా ఆయకట్టులో నీటి కొరతను అధిగమించాలంటే ఏలేరు రిజర్వాయర్పై ఆధారపడటం మినహా మరో మార్గం కనిపించడం లేదు. రౌతులపూడి మండలం శృంగవరం వద్ద ఏలేరు కాలువ నుంచి రోజుకు గరిష్టంగా 50 క్యూసెక్కుల వరకూ నీటిని పంపాకు విడుదల చేయవచ్చు. అంతకంటే ఎక్కువ నీటిని విడుదల చేస్తే పక్కనే ఉన్న పొలాలు ముంపునకు గురవుతాయి. అందువలన అక్కడి రైతులు అంగీకరించరు. జనవరి 1 నుంచి మార్చి నెలాఖరు వరకూ ఏలేరు నుంచి నీటిని విడుదల చేసినా.. ప్రస్తుతం పంపాలో ఉన్న నీటితో కలిపి సుమారు 6 వేల ఎకరాల్లో మాత్రమే రబీ సాగుకు వీలవుతుందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. గత ప్రభుత్వంలో రెండు పంటలకూ నీరు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో పంపా జలాశయం కింద రెండు పంటలకూ పుష్కలంగా నీరందించారు. పంపాతో పాటు పుష్కర కాలువ నీటితో ఖరీఫ్, ఏలేరు నుంచి విడుదల చేసిన నీటితో రబీ సాగు సుమారు 10 వేల ఎకరాల్లో జరిగేలా చర్యలు తీసుకున్నారు. గత ఏడాది అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఆ ఏడాది ఖరీఫ్ సాగుకు మాత్రమే నీరిచ్చింది. పంపా బ్యారేజీ గేట్ల మరమ్మతుల పేరిట గత ఏడాది రబీకి నీరివ్వలేదు. పైగా పోలవరం అక్విడెక్ట్ పనుల పేరుతో పంపా నీటిని దిగువకు వృథాగా వదిలేశారు. దీంతో, పంపా ప్రాజెక్ట్లో నీటి నిల్వలు పూర్తిగా అడుగంటి, అన్నవరం గ్రామంతో పాటు, సత్యదేవుని ఆలయానికి కూడా నీటి సమస్య ఏర్పడే పరిస్థితి ఉత్పన్నమైంది. ఒక దశలో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అన్నవరం వచ్చి పరిస్థితిని సమీక్షించి, ఏలేరు నీటిని పంపాకు విడుదల చేసేలా ఆదేశించారు. అదే సమయంలో ఆ నీటి విడుదల వలన పోలవరం అక్విడెక్ట్ పనులకు ఆటంకం కలగకుండా ప్రత్యేకంగా కాలువ, పైప్లైన్ వేయించారు. స్థానిక ఎన్నికల్లో లబ్ధి కోసం.. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక గత ఏడాది రబీలో పంపా ఆయకట్టు నీటికి ఎగనామం పెట్టింది. వచ్చే ఏడాది స్థానిక సంస్ధల ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అందువలన ఈసారైనా సాగునీరు ఇవ్వకపోతే తొండంగి, తుని మండలాల్లోని పంపా ఆయకట్టు రైతుల్లో తీవ్ర అసంతృప్తి వస్తుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలాగైనా 10 వేల ఎకరాల్లో రబీ సాగుకు అనుమతి ఇవ్వాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ఏలేరు నుంచి 70 క్యూసెక్కుల నీటిని విడుదల చేయించి రబీకి నీరందిస్తామని వారు చెబుతున్నట్లు సమాచారం. అయితే, పంపా కాలువకు ఇరువైపులా ఉన్న గ్రామాల్లోని 6 వేల ఎకరాల్లో మాత్రమే రబీ సాగుకు నీరు సరఫరా చేయగలమని, అంతకు మించి సాగు చేస్తే పంట చివరిలో నీటి సమస్య తలెత్తుతుందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ నిర్ణయం మేరకే.. పంపా ఆయకట్లులో రబీ సాగు ఎంత విస్తీర్ణంలో చేయాలనేది ప్రభుత్వ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం పంపాలో ఉన్న నీరు, ఏలేరు నుంచి నీటి సరఫరా సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే రబీ ఆయకట్టు నిర్ణయించాలి. ఈ విషయాలన్నీ వివరిస్తూ జిల్లా కలెక్టర్కు నివేదిక ఇచ్చాం. ప్రభుత్వం అనుమతిస్తే జనవరి 1 నుంచి రబీ నారుమడులకు నీటిని విడుదల చేస్తాం. – జి.శేషగిరిరావు, ఈఈ, ఇరిగేషన్, పెద్దాపురం పంపా ఆయకట్టులో రబీ సాగుపై సందిగ్ధం 10 వేల ఎకరాలకు నీరివ్వాలని ప్రభుత్వంపై ఒత్తిడి 6 వేల ఎకరాలకు మించి ఇవ్వలేమంటున్న ఇరిగేషన్ అధికారులు


