వైఎస్సార్ సీపీ నేత సూర్యచక్రరెడ్డి ఆకస్మిక మృతి
తుని: వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు అనిశెట్టి సూర్యచక్రరెడ్డి (60) మంగళవారం ఆకస్మికంగా మృతి చెందారు. పట్టణ శివారులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. సూర్యచక్రరెడ్డి మృతి వార్త తెలియగానే ఆయన నివాసానికి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా చేరుకున్నారు. సూర్యచక్రరెడ్డి పార్థివ దేహానికి పూలమాల వేసి, శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సమకాలీన రాజకీయాల్లో వివాదరహితుడిగా పేరొందిన సూర్యచక్రరెడ్డి ఆకస్మిక మృతి వైఎస్సార్ సీపీకి తీరని లోటని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం నాయకుడిగా పని చేశారని చెప్పారు. ప్రజల పక్షాన పోరాడటంలో ఆయనకు మరొకరు సాటి లేరని కొనియాడారు. రాజకీయ ప్రస్థానంలో టీడీపీకి వ్యతిరేకంగా పని చేశారని గుర్తు చేశారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి తునిలో అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో కూడా పని చేసి అందరి మన్ననలూ అందుకున్న మహోన్నత నాయకుడిగా సూర్యచక్రరెడ్డి అరుదైన గౌరవం పొందారని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులు దూర ప్రాంతాల్లో ఉన్నందున అంత్యక్రియలు బుధవారం నిర్వహిస్తున్నారని తెలిపారు. సూర్యచక్రరెడ్డి మృతదేహానికి తుని, తొండంగి, కోటనందూరు మండలాలతో పాటు తుని పట్టణానికి చెందిన నాయకులు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు, సర్పంచులు, పార్టీ అనుబంధ విభాగాల నాయకులు నివాళులర్పించారు. బుధవారం జరిగే అంత్యక్రియలకు భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యే అవకాశం ఉందని నాయకులు తెలిపారు.
ఫ పార్థివ దేహానికి మాజీ మంత్రి
దాడిశెట్టి రాజా నివాళి
ఫ పార్టీకి తీరని లోటని ఆవేదన
వైఎస్సార్ సీపీ నేత సూర్యచక్రరెడ్డి ఆకస్మిక మృతి


