బోట్క్లబ్ (కాకినాడ సిటీ): రైతులు కష్టపడి పండించిన పంటలను కోతుల బెడద నుంచి రక్షించాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఏజెన్సీకి చెందిన పలువురు జెడ్పీటీసీ సభ్యులు మండిపడ్డారు. గతంలో అనేకసార్లు ప్రభుత్వానికి నివేదించినా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్తు స్థాయీ సంఘ సమావేశాలు గురువారం జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన నిర్వహించారు. 1,2,4,7 స్థాయి సంఘాల చైర్మన్ వి.వేణుగోపాలరావు అధ్యక్షతన, 3వ స్థాయి సంఘం వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు అధ్యక్షతన, 5వ స్థాయి సంఘ జేడ్పీటీసీ సభ్యురాలు రొంగల పద్మావతి అధ్యక్షతన, 6వ స్థాయీ సంఘం సమావేశం జెడ్పీ వైస్ చైర్మన్ మేరుగు పద్మలత అధ్యక్షతన నిర్వహించారు. వివిధ అంశాలు చర్చించి ఆమోదించారు. జెడ్పీ చైర్మన్ వేణుగోపాలరావు వివిధ అభివృద్ధి పథకాలపై సమీక్ష నిర్వహించి ఆర్థిక, ప్రణాళిక, గ్రామీణాభివృద్ధి, రహదారులు, విద్య, వైద్యం, గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్యం, జాతీయ ఉపాధి హామీ పథకం, హౌసింగ్, విద్యుత్, గ్రామీణ అభివృద్ధి తదితర అంశాలపై ఇప్పటివరకు జరిగిన పురోగతి, కొత్తగా ప్రతిపాదించిన పనుల వివరాలపై అధికారులతో చర్చించారు. వేసవి నేపథ్యంలో అన్ని మండలాల్లో నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, చలివేంద్రాలు ఏర్పాట్లు చేయాలని ఆర్ డబ్ల్యూఎస్ అధికారులకు సూచించారు. జేడ్పీ సీఈవో లక్ష్మణరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాల్లో సభ్యుల ఆవేదన


