వైభవంగా గంధోత్సవం
● బషీర్ బీబీ దర్శనానికి పోటెత్తిన భక్తులు
● ప్రత్యేక ప్రార్థనలు
● కిక్కిరిసిన పొన్నాడ
కొత్తపల్లి: స్థానిక పొన్నాడ బంగారు పాపమ్మ (బషీర్ బీబీ ఔలియా) ఉర్స్ ఉత్సవాలు ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నాడ పరిసర ప్రాంతాలు భక్తులతో కిక్కిరిశాయి. భారీ పోలీసు బందోబస్తు నడుమ సుమారు 30 వేల మంది అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ ముజావర్లు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా గంధోత్సవం ఘనంగా నిర్వహించారు. మూలపేటకు చెందిన షేక్ మౌలాసాహేబ్ ఇంటి నుంచి పెద్దబొడ్డేపల్లికి చెందిన ఎండీ తాజుద్దీన్ బాబా సమర్పించిన గంధాన్ని (సంథల్) ప్రత్యేకంగా అలంకరించిన గుర్రంపై ఉంచి ఫకీర్ మేళాతో పొన్నాడ బషీర్బీబీ ఆలయం వరకూ ఊరేగించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సంప్రదాయ ప్రార్థనల అనంతరం భక్తులకు గంధం పంపిణీ చేశారు. ఉత్సవాల సందర్భంగా మూలపేట నుంచి పొన్నాడ వరకూ కాలినడకన వెళ్లేందుకు కూడా వీలులేని పరిస్థితి నెలకొంది. పలుమార్లు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పిఠాపురం, తుని, కాకినాడ నుంచి వాహనాల్లో వచ్చిన వారు పొన్నాడ చేరుకోవడానికి ఇబ్బంది పడ్డారు. ఎస్సై వెంకటేష్ ఆధ్వర్యాన సుమారు 120 సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోకి వాహనాలు వెళ్లకుండా పొన్నాడ, అమరవిల్లి, నాగులపల్లి వద్ద నిలిపివేశారు. గ్రామ కార్యదర్శి ఆధ్వర్యంలో భక్తులకు తాగునీరు, పారిశుధ్య నిర్వహణ ఏర్పాట్లు చేశారు.
వైభవంగా గంధోత్సవం
వైభవంగా గంధోత్సవం


