ఖైదీ మృతిపై విచారణ
కాకినాడ క్రైం: గత ఏడాది నవంబర్ 25న కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతూ మృతి చెందిన రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు ఖైదీ మృతిపై బుధవారం మెజిస్ట్రీరియల్ విచారణ జరిగింది. గుంటూరుకు చెందిన మృతుడు మెట్టు భాస్కర్రెడ్డి తరఫు బంధువులు, జైలు అధికారులు, వైద్యులు, పోలీస్ సిబ్బంది సహా సాక్షులను ఈ సందర్భంగా ఆర్డీవో మల్లిబాబు ఆధ్వర్యాన కాకినాడలోని డివిజన్ రెవెన్యూ కార్యాలయంలో విచారించారు. ఈ విచారణలో ట్రైనీ కలెక్టర్ జె.మనీషా తదితరులు పాల్గొన్నారు.
నూనె గింజల సాగుతో
ఆర్థిక వృద్ధి
రంగంపేట: మెట్ట ప్రాంతమైన రంగంపేట మండలంలో సార్వా వరి తర్వాత రైతులు నూనె గింజల పంటలను సాగు చేయాలని జిల్లా ఏరువాక కేంద్రం కో ఆర్డినేటర్ చల్లా వెంకట నరసింహరావు సూచించారు. దీని ద్వారా నాణ్యమైన, పోషక విలువలున్న నూనెను ఉత్పత్తి చేసుకోవడమే కాకుండా, విలువ ఆధారిత ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకుని ఆర్థిక వృద్ధి సాధించవచ్చన్నారు. రంగంపేటలోని నువ్వు పంట సామూహిక ప్రదర్శన క్షేత్రాన్ని బుధవారం వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు, ప్రధాన శాస్త్రవేత్త మానుకొండ శ్రీనివాస్, జిల్లా వనరుల కేంద్రం ఏడీఎఎస్ జయరామలక్ష్మితో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ నరసింహరావు మాట్లాడుతూ సామూహిక ప్రదర్శన క్షేత్రం కోసం వైఎల్ఎం 146 రకాన్ని రైతులకు ఇచ్చామని, పంట ఆరోగ్యంగా ఉందన్నారు. ఒక ఎకరా వరికి కావాల్సిన నీటితో ఐదు ఎకరాల్లో నువ్వు పంట సాగు చేయవచ్చని తెలిపారు. ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మానుకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ తక్కువ తడులతో, ఎరువులతో ఆరోగ్యమైన పంటను తీసుకోవచ్చన్నారు.
ఖైదీ మృతిపై విచారణ


