ఒక్క మాత్రతో నులిమేద్దాం..
రాజమహేంద్రవరం రూరల్: పిల్లల ఆరోగ్యంపై నులి పురుగులు తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అనేక రకాల అనారోగ్యాలకు కారణమవుతున్న నులి పురుగుల నివారణకు కేవలం ఒకే ఒక్క ఆల్బెండజోల్ మాత్ర మింగించండి బుజ్జాయి ఆరోగ్యం తిరిగి చూసుకోవలసిన అవసరం లేదని వైద్యాధికారులు సూచిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా నులిపురుగుల నివారణ కోసం మంగళవారం ఉచితంగా మాత్రలు పంపిణీ చేయనున్నారు. ప్రధానంగా ఈ నులి పురుగులు చిన్నారుల్లో రక్తహీనతకు దారి తీస్తాయి. శారీరక, మానసిక ఎదుగుదలకు ఆటంకంగా మారతాయి. కడుపులో చేరి నొప్పి, మంట, వికారం కలిగిస్తాయి. దీనివల్ల ఆహారం సహించదు. ఆకలి ఉండదు. నీరసపడతారు. శారీరక, మానసిక ఎదుగుదల లోపాలు కలుగుతాయి. వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. వాంతులు, మలంలో రక్తం, అతిసార వంటి సమస్యలు విజృంభిస్తాయి. ఏడాది నుంచి 19 ఏళ్లలోపు పిల్లల్లో ఈ నులి పురుగుల సమస్య ఎక్కువగా ఉంటుంది.
డోసేజీ ఇలా..
ఏడాది నుంచి రెండేళ్లలోపు చిన్నారులకు ఆల్బెండజోల్ సగం మాత్ర (200 మిల్లీ గ్రాములు) నీళ్లలో కలిపి పట్టించాలి. 2 నుంచి 19 ఏళ్ల లోపు పిల్లలకు 400 మిల్లీ గ్రాముల మాత్రను మధ్యాహ్నం భోజనం అయ్యాక చప్పరించేలా చూడాలి. మాత్రను మింగనీయకూడదు.
4,06,342 మందికి పంపిణీ
తూర్పు గోదావరి జిల్లాలో ఏడాది నుంచి 19 ఏళ్లలోపు పిల్లలు 4,06,342 మందికి ఆల్బెండజోల్ మాత్రలు ఇవ్వనున్నారు. ఆ రోజు ఏ కారణంతోనైనా మాత్రలు తీసుకోని, అందుబాటులో లేని పిల్లలకు మళ్లీ 24వ తేదీన వేయనున్నారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, పభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలలు, ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలలు, ఒకేషనల్ ఇనిస్టిట్యూషన్లు, ప్రథమ సంవత్సర డిగ్రీ కళాశాలలు పారా మెడికల్, ఇంజినీరింగ్, మెడికల్ కళాశాలలు, బడిబయటి పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు వేయనున్నారు.
జిల్లా వ్యాప్తంగా
ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ
రేపు జాతీయ నులిపురుగుల
నిర్మూలన కార్యక్రమం
4,06,342 మందికి
ఇచ్చేందుకు ఏర్పాట్లు


