రేపటి పీజీఆర్ఎస్ రద్దు
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ప్రతి సోమవారం ప్రజా సమస్యలు నిమిత్తం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఈ నెల 9న రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ షణ్మోహన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అనివార్య కారణాల వల్ల పీజీఆర్ఎస్తోపాటు, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
విద్యుత్ సమస్యల పరిష్కారానికి
‘డయల్ యువర్ సీఎండీ’
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని విద్యుత్ సంబంధిత సమస్యలను మరింత వేగవంతంగా పరిష్కరించే లక్ష్యంతో ’డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండి’ విధానాన్ని ప్రవేశపెడుతున్నామని విద్యుత్శాఖ ఎస్ఈ ప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి సోమవారం నిర్వహించనున్న డయల్ యువర్ సీఎండీ కార్యక్రమాన్ని ఈ నెల 9వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నామన్నారు. జిల్లాలకు చెందిన విద్యుత్ వినియోగదారులు ఫోన్ నంబరు 8688400499 ద్వారా విద్యుత్ సంబంధిత సమస్యలను తెలియజేయవచ్చునన్నారు. విశాఖపట్నం ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు డయల్ యువర్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని ఆయన తెలిపారు. విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయాలు, హెచ్చుతగ్గులు, కొత్త సర్వీసుల జారీలో జాప్యం, విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో జాప్యం, ట్రాన్స్ఫార్మర్ల మార్పిడి, తదితర విద్యుత్ సంబంధిత సమస్యలపై ఫిర్యాదులను నేరుగా సీఎండీ దృష్టికి తీసుకురావచ్చన్నారు. ఈ అవకాశాన్ని సంస్థ పరిధిలోని 11 జిల్లాల వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఆల్ఇండియా సివిల్ సర్వీసెస్ విజేతకు సత్కారం
రూ.10 వేల నగదు బహుమతి
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): ఆల్ఇండియా సివిల్ సర్వీసెస్ లాంగ్ జంప్ పోటీలలో బ్రాంజ్ మెడల్ సాధించిన వ్యాయామ ఉపాధ్యాయురాలు, క్రీడాకారిణి సునీతను కాకినాడ కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం సత్కరించారు. కాకినాడ జిల్లా క్రీడామైదానంలో జరుగుతున్న జాతీయస్థాయి కోకనాడ గోల్డ్ కప్ హాకీ పోటీలలో భాగంగా శనివారం నిర్వహించిన మొదటి మహిళల మ్యాచ్కు ఆమె అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కాకినాడ కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ వ్యవస్థాపకులు రవిచంద్రప్రసాద్ సునీతను శాలువాతో సత్కరించి రూ.10వేల నగదును అందించారు. ఆలిండియా సివిల్ సర్వీసెస్ పోటీలలో మెడల్ సాఽధించిన ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీలో కూడా ఇంక్రిమెంట్లు అందించి ప్రోత్సహించాలని రవిచంద్ర కోరారు. సీబీడీటీ చీఫ్ కోచ్ అజయ్ శర్మ, కోశాధికారి వినయ్, క్లబ్ అధ్యక్షుడు బాబ్జి, మూర్తి, సురేష్రాజు పాల్గొన్నారు.
ఘనంగా ‘కోటి తులసి పత్రి పూజ’
– రెండో రోజు కార్యక్రమంలో
పాల్గొన్న పలువురు దాతలు
అన్నవరం: లోక కల్యాణార్థం రత్నగిరి సత్యదేవుని సన్నిధిలో నిర్వహిస్తున్న ‘కోటి తులసి పూజ’ శనివారం రెండో రోజు కు చేరుకుంది. శనివారం తెల్లవారు జామున సుప్రభాత సేవతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం పండితులు స్వా మి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉదయం తొమ్మిది గంటలకు 60 మంది రుత్విక్కులు ఆరు లక్షల తులసి దళాలతో స్వామిని అర్చించారు. 11–30 గంటలకు వేదాశీస్సులు అందచేసి స్వామి, అమ్మవారికి నివేదన సమర్పించారు. మధ్యాహ్నం 2–30 గంటల నుంచి ఆరు గంటల వరకు మరో ఐదు లక్షల తులసి దళాలతో స్వామివారికి రుత్విక్కులు పూజలు చేశారు. అనంతరం నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు. సూర్యనమస్కారాలు, లింగార్చన కార్యక్రమాలను రుత్విక్కులు నిర్వహించారు. స్వామివారికి నూతన ధ్వజస్తంభం సమకూర్చి, స్వర్ణ తాపడం చేయించిన దాత రెడ్డి దంపతులు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు కేబీ రామన్నదొర స్వామికి తులసి దళాలు నివేదించారు.
రేపటి పీజీఆర్ఎస్ రద్దు


