ఉద్రేకాగ్నిని సహనమనే నీటితో చల్లార్చాలి
● అప్పుడే మనస్సుకు ప్రశాంతత
● డాక్టర్ ఉమర్ ఆలీషా
పిఠాపురం: ప్రతి వ్యక్తీ తనలో రగులుతున్న ఉద్రేకమనే అగ్నిని సహనం అనే నీటితో చల్లార్చుకోవాలని, అప్పుడే మనస్సు ప్రశాంతంగా ఉంటుందని పిఠాపురంలోని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య, ఆధ్యాత్మిక పీఠం అధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా అన్నారు. పీఠంలో మూడు రోజుల పాటు జరిగే 98వ వార్షిక జ్ఞాన మహాసభలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలీషా మాట్లాడుతూ, తాత్విక జ్ఞానం పొందడం ద్వారా మనిషిలో జ్ఞాన నేత్రం తెరచుకుంటుందని అన్నారు. త్రయీ సాధన అనే ఆధ్యాత్మిక దిక్సూచి ద్వారా మానసిక స్థిరత్వం, ధైర్యం అలవడి జీవనాన్ని సుఖమయం చేసుకోవచ్చని చెప్పారు. ప్రతి మనిషీ అంతర్లీనంగా ఉన్న జ్ఞాననేత్రాన్ని గుర్తించగలిగితే భగవంతుడిని దర్శించవచ్చని అన్నారు. మనిషిని మహనీయుడిగా మలిచే జ్ఞాననేత్రం పొందడానికి గురుముఖంగా ఆధ్యాత్మిక తత్వాన్ని గ్రహించాలని సూచించారు. అనంతరం నివేదిక 2026, ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ దేవదారు బ్రోచర్లను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో రైల్వే బోర్డ్ సభ్యుడు నూర్ అహ్మద్, హుస్సేన్ షా, పీఠం సభ్యులు ఏవీవీ సత్యనారాయణ, రేఖా సత్యనారాయణ, ఎన్ఆర్ఐలు దిడ్డి సూర్యకుమార్, శ్రీధర్, డాక్టర్ ఎన్.రాంగోపాల్వర్మ, కె.స్వర్ణలత, టి.సాయి వెంకన్నబాబు, చింతపల్లి అమృతవల్లి తదితరులు కూడా ప్రసంగించారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసరావు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, ప్రముఖ కవులు యామిజాల ఆనంద్,, డాక్టర్ శిరీష్, సినీ మాటల రచయిత పోలగాని భాను తేజశ్రీ, యోగ భారత్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ జ్యోతుల నాగేశ్వరరావు తదితరులు పీఠాధిపతిని దర్శించుకున్నారు. ఆశ్రమ ప్రాంగణంలో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యాన చిన్నారుల కోసం పాలకేంద్రం, శిశు సంరక్షణ కేంద్రాలను, ప్రాథమిక వైద్య శిబిరం వంటివి ఏర్పాటు చేశారు. పీఠం నిర్వహిస్తున్న తాత్విక బాల వికాస్లో శిక్షణ పొందుతున్న చిన్నారులు మాస్టర్ రేఖా ఉషా కిరణ్ బ్రదర్స్ ఉపన్యాసం సభికులను ఆకట్టుకుంది. కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, మీడియా కన్వీనర్ ఆకుల రవితేజ, సెంట్రల్ కమిటీ సభ్యులు ఎన్టీవీ వర్మ, డాక్టర్ పింగళి ఆనంద కుమార్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
ఉద్రేకాగ్నిని సహనమనే నీటితో చల్లార్చాలి


