చోరీ కేసులో నిందితుల అరెస్ట్
రూ.15 లక్షల విలువైన సొత్తు రికవరీ
కాజులూరు: రెండేళ్లుగా కాజులూరు, కరప తదితర మండలాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ముగ్గురిని అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్టు కాకినాడ రూరల్ సీఐ డీఎస్ చైతన్యకృష్ణ, గొల్లపాలెం ఎస్సై ఎం.మోహన్కుమార్ తెలిపారు. వారి కథనం ప్రకారం.. కొత్త గైగొలుపాడు అంబేడ్కర్ కాలనీకి చెందిన పిల్లి సింహాచలం, కాకినాడ మధురానగర్కు చెందిన ద్రాక్షరాపు ఉమాశంకర్, సర్పవరం పూల మార్కెట్ ప్రాంతానికి చెందిన దార నాని గత కొంత కాలంగా వరుస దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నారు. వీరిని పట్టుకునేందుకు కాకినాడ జిల్లా ఎస్పీ జి.బిందుమాధవ్ ఆదేశాల మేరకు ఏఎస్పీ పాటిల్ దేవరాజ్, రూరల్ సీఐ చైతన్యకృష్ణల ఆధ్వర్యంలో గొల్లపాలెం, కరప పోలీస్టేషన్ల సిబ్బంది రెండు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో గొల్లపాలెం శలపాక రోడ్లోని రైస్మిల్లు ప్రాంతంలో శుక్రవారం రాత్రి గొల్లపాలెం ఎస్సై మోహన్కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది వలపన్ని వారిని పట్టుకున్నారు. వీరి నుంచి రూ.15 లక్షల విలువజేసే కారు, ఏడు మోటారు సైకిళ్లు, ఒక ల్యాప్టాప్, 186 గ్రాముల వెండి వస్తువులు, మూడు సెల్ ఫోన్లు రికవరీ చేశారు. నిందితులను కోర్టుకు తరలించారు.


