వక్ఫ్ బోర్డు ఆస్తులను ప్రైవేటుకు అప్పగించవద్దు
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉన్న ముస్లింల సంపదను ఐటీ పార్కు పేరిట ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పే ప్రయత్నాలను విరమించుకోవాలని వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ జోనల్ అధ్యక్షుడు అబ్దుల్ బషీరుద్దీన్ ప్రభుత్వాన్ని కోరారు. పార్టీ ఆదేశాల మేరకు కలెక్టరేట్లో డీఆర్వో తిప్పేనాయక్కు మంగళవారం ఆయన వినతిపత్రం సమర్పించారు. ముస్లిం సమాజ అభివృద్ధి కోసం గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం చినకాకాని మండలంలో అంజుమన్ ఏ ఇస్లామియా సంస్థకు 1915లో 81.23 ఎకరాల భూమిని దాతలు ఇచ్చారని తెలిపారు. ఈ భూమిని ముస్లింల స్కిల్ డెవలప్మెంట్, లైబ్రరీ, ముస్లిం పిల్లలకు స్కాలర్షిప్, ముస్లిం విద్యా సంస్థల కోసం ఈ భూమిని ఇచారన్నారు. ఇందులో 71.57 సెంట్ల భూమిని ఏపీఐఐసీకి బదలాయించి, తద్వారా కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టాలనే ఉద్దేశంతో గత ఏడాది డిసెంబర్ 19న గుంటూరు జిల్లా కలెక్టర్ నోటీసు జారీ చేశారన్నారు. తక్షణం దీనిని నిలిపివేయాలని బషీరుద్దీన్ డిమాండ్ చేశారు. డీఆర్వోకు వినతిపత్రం ఇచ్చిన వారిలో మైనారిటీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరీం బాషా, జాయింట్ సెక్రటరీ ఎండీ అలీషా, జిల్లా కార్యదర్శి ఎండీ కరీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు.


