రత్నగిరిపై రద్దీ
అన్నవరం: మహాశివరాత్రి పర్వదినం, ఆదివారం కలసి రావడంతో రత్నగిరికి వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. దీంతో, సత్యదేవుని ఆలయ ప్రాంగణం, క్యూలు, వ్రత, విశ్రాంతి మండపాలు రద్దీగా మారాయి. సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. సత్యదేవుని వ్రతాలు రెండు వేలు జరిగాయి. స్వామివారి ఉచిత దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట పట్టింది. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.25 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో సత్యదేవుని రథ సేవను ఉదయం టేకు రథంపై ఘనంగా నిర్వహించారు.
నేటి నుంచి సీపీఐ రాష్ట్ర
సమితి సమావేశాలు
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాలు సోమవారం నుంచి ఈ నెల 18వ తేదీ వరకూ స్థానిక సూర్య కళామందిరంలో నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తాటిపాక మధు తెలిపారు. స్థానిక సూర్య కళామందిరంలో ఈ సమావేశాల నిర్వహణకు జరుగుతున్న ఏర్పాట్లను ఆయన ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశ, రాష్ట్ర రాజకీయ పరిణామాలపై ఈ సమావేశాల్లో చర్చిస్తామన్నారు. రాష్ట్రంలో మెడికల్ మాఫియా, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, మన గ్యాస్ – మన హక్కు, టిడ్కో ఇళ్లు, ఇళ్ల స్థలాలు తదితర అంశాలపై చర్చించి ఉద్యమ కార్యచరణ రూపొందిస్తామని వివరించారు. విభజన చట్టం హామీలు, నిరుద్యోగ భృతి, ఇంటింటా ఉచిత గ్యాస్ పైప్లైన్ తదితర అంశాలపై కూడా చర్చిస్తామని చెప్పారు. ఈ సమావేశాల్లో ముఖ్య అతిథులుగా సీపీఐ సీనియర్ నాయకుడు కె.నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్యతో పాటు 26 జిల్లాల నాయకులు పాల్గొంటారని తెలిపారు.
ఉత్సాహంగా
ఫుట్బాల్ పోటీలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): స్థానిక జిల్లా క్రీడా మైదానంలో అంతర్ జిల్లా ఫుట్బాల్ పోటీలు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ (డీఎస్ఏ) ఫుట్బాల్ కోచ్ స్వామి పర్యవేక్షణలో ఆదివారం ఉత్సాహంగా జరిగాయి. ఈ పోటీలను జిల్లా క్రీడాభివృద్ధి అధికారి (డీఎస్డీఓ) వి.సతీష్ కుమార్, తలాటం హరీష్ ప్రారంభించారు. ఈ పోల్లో రోనాల్డో టీము విజేతగా, భాటియా టీము రన్నర్గా నిలిచింది. విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.
సివిల్ సర్వీసెస్ హాకీ
పోటీలకు ఎంపిక
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): ఢిల్లీలో ఈ నెల 17 నుంచి 27వ తేదీ వరకూ జరిగే ఆలిండియా సివిల్ సర్వీసెస్ హాకీ పోటీలకు కాకినాడ క్రీడాకారులు ఎంపికయ్యారు. ఇన్కంట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉద్యోగి కడియాల రవిచంద్రప్రసాద్ ఆర్ఎస్బీ టీముకు కోచ్గా, ఎస్.వీరబాబు కెప్టెన్గా జట్టులో స్థానం పొందారు. వీరిద్దరూ కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో హాకీ ఆడినవారే. గత ఏడాది నిర్వహించిన సివిల్ సర్వీసెస్ హాకీ పోటీల్లో ఆర్ఎస్బీ జట్టు రన్నర్గా నిలిచింది.
జేఎన్టీయూకే
విద్యార్థిని ఆత్మహత్య
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జేఎన్టీయూకే ఇంజినీరింగ్ కళాశాలలో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన అరుణ కెమికల్ ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతూ.. కళాశాల ఆవరణలోని నాగవళి హాస్టల్లో ఉంటోంది. ఆదివారం మధ్యాహ్నం తన గది నుంచి ఆమె ఎంతకూ బయటకు రాలేదు. దీంతో, తోటి విద్యార్థులు వెళ్లి చూడగా గదిలో తాడుకు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించింది. వెంటనే విద్యార్థులు కళాశాల యాజమాన్యానికి, హాస్టల్ అధికారులకు ఈ విషయం చెప్పారు. దీంతో, అధికారులు సర్పవరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. గదిలో లభించిన ఆధారాలు, లేఖల ఆధారంగా అరుణ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని గుర్తించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
రత్నగిరిపై రద్దీ


