పొల్లూరు జల్లింత కావాలిలే... | - | Sakshi
Sakshi News home page

పొల్లూరు జల్లింత కావాలిలే...

Feb 12 2026 7:36 AM | Updated on Feb 12 2026 7:36 AM

పొల్ల

పొల్లూరు జల్లింత కావాలిలే...

ఆహ్లాదంగా పొల్లూరు జలపాతం విహారం మౌలిక వసతుల కల్పనపై అటవీ శాఖ దృష్టి సుకుమామిడి నుంచి గుడిస వరకు ట్రైక్కింగ్‌ గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయంలోనే బీజం జెన్‌కో రూ.50 లక్షల సీఎస్సార్‌ నిధులతో పనులు

మోతుగూడెం: ప్రకృతి అందాలకు నిలయమైన పొల్లూరు జలపాతం అభివృద్ధిపై అటవీ శాఖ దృష్టి సారించింది. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హాయంలోనే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు తయారై పనులు కూడా మొదలయ్యాయి. ఇందులో భాగంగా అక్కడి మౌలిక వసతుల కల్పనపై ఆ అటవీశాఖ దృష్టి సారించింది. ఏపీ జెన్‌కో సంస్థ కేటాయించిన రూ.50 లక్షల సీఎస్సార్‌ నిధులతో ఈ పనులు చేపట్టారు.

అభివృద్ధితో పాటు సౌకర్యాలు..

ఏపీ జెన్‌కో సంస్థ ఇచ్చిన నిధులతో పొల్లూరు జలపాతం వద్ద అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయి. వర్షాకాలంలో ముఖ్యంగా జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు ఈ జలపాతం ఉప్పొంగి ప్రవహిస్తూ పర్యాటకులకు కనువిందు చేస్తుంది. కొండల మధ్య సుమారు 50 అడుగులు ఎత్తు నుంచి నీరు జాలువారుతూ ఎందరో పర్యాటకులను ఆకర్షిస్తుంటుంది. ఈ జలపాతం పొల్లూరు నుంచి డొంకరాయికి వెళ్లే మార్గంలో రహదారికి అర కిలోమీటరు దూరంలో ఉంది. ఫోర్‌బే, డొంకరాయి అటవీ ప్రాంతాల నుంచి ప్రవహిస్తూ కొల్లూరు వద్ద సీలేరు నదిలో కలుస్తుంది. ఇక్కడి జలపాతం ప్రవేశ ద్వారాన్ని ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. సుమారు 50 వరకు కార్లు పార్కింగ్‌ చేయడానికి అనుకూలంగా ఈ స్థలాన్ని చదును చేశారు. అలాగే పర్యాటకులు సేదతీరేందుకు రెల్లుగడ్డితో నిర్మిచిన పగోడాలను, కూర్చొనేందుకు వీలుగా గ్రానైట్‌ బెంచ్‌లు ఏర్పాట్లు చేశారు. జలపాతాన్ని చూడడానికి వచ్చే మహిళల సౌకర్యం కోసం మూడు మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునేందుకు మూడు గదులు నిర్మిస్తున్నారు. అంతే కాకుండా కెప్ట్రే (టీ,కాఫీతో పాటు టిఫిన్‌, శీతల పానీయాలు) అందించేందుకు షాప్‌ను ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు సేవానియర్స్‌ ఏర్పాటు చేసి స్థానికంగా ఉండే అటవీ ఉత్పత్తులను ఈ స్టాల్‌లో ఉంచి పర్యాటకులకు అందిస్తున్నారు. ఇవే కాకుండా పది మీటర్ల సీసీ రహదారిని రూ.3.5 లక్షలతో నిర్మించారు. సోలార్‌ సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. పార్కింగ్‌ ప్రాంతాల్లో చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేన్నారు. అలాగే చెత్త లేకుండా శుభ్రంగా ఉంచడానికి డస్ట్‌బిన్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటి వరకు 70 శాతం సుందరీకరణ పనులు, మౌలిక సదుపాయాల కల్పన పూర్తయినట్లు స్థానిక రేంజర్‌ జి.నానాజీ తెలిపారు.

అటవీ మార్గంలో ట్రెక్కింగ్‌

మారేడుమిల్లి మండలం గుడిస ప్రాంతానికి మోతుగూడెం సమీపాన సుకుమామిడి గ్రామం నుంచి (ఏనుగుల బాట ) 12 కిలోమీటర్ల మేర ట్రెక్కింగ్‌ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గత ఐదు నెలల క్రితం ఈ గ్రామం నుంచి గుడిస వరకు కొండలు గుట్టలపై ట్రెక్కింగ్‌ మార్గానికి అటవీశాఖ అధికారులు సర్వే చేశారు. సుమారు ఐదు మీటర్ల వెడల్పున 12 కిలోమీటర్ల మేర కాలిబాటకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అటవీ శాఖ ప్రధాన కార్యాలయం నుంచి అనుమతులు రాగానే దీనికి రూపకల్పన చేయనున్నట్టు వారు తెలిపారు. ట్రెక్కింగ్‌ చేయాలనుకునే వారి నుంచి కొంత రుసుము తీసుకొని గైడ్‌లను ఏర్పాటు చేస్తామని, వర్షాకాలం లోపు ఫైర్‌ క్యాంపింగ్‌తో పాటు, నైట్‌ స్టే చేసేందుకు క్యాంపింగ్‌ టెంట్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. వీటి వల్ల రాత్రి వేళల్లో కూడా గుడిసె అందాలను తిలకిస్తూ గడిపేందుకు అవకాశం ఉంటుంది. పర్యాటకులు బస చేసేందుకు మోతుగూడెంలో ఏపీ జెన్కో అతిథి గృహం ఉంది. ఇందులో ఆరు గదులు ఉన్నాయి. ఇవి అద్దెకు ఇచ్చే అవకాశం ఉంది. ప్రైవేట్‌ రిసార్టులు పొల్లూరులో ఒకటి, మోతుగూడెంలో ఏడు ఉన్నాయి. గదికి 24 గంటలకు రూ.2500 వరకు అద్దె ఉంటుంది.

పొల్లూరు జల్లింత కావాలిలే...1
1/1

పొల్లూరు జల్లింత కావాలిలే...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement