పకడ్బందీగా వంద రోజుల ప్రణాళిక
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు జిల్లాలో వంద రోజుల ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను కలెక్టర్ షణ్మోహన్ ఆదేశించారు. జిల్లా పాఠశాల విద్యా శాఖ ఆధ్వర్యాన ప్రధానోపాధ్యాయులతో కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. వంద రోజుల ప్రణాళికలో భాగంగా సబ్జెక్టుల వారీగా సిలబస్ పూర్తి చేసి, ప్రతి రోజూ స్లిప్ టెస్ట్ నిర్వహించాలని, తద్వారా వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుందని అన్నారు. సి, డి గ్రేడ్లు వచ్చిన విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు సమష్టిగా పని చేసి, నూరు శాతం ఫలితాల సాధనకు ప్రత్యేక కృషి చేయాల ని సూచించారు. సబ్జెక్టుల వారీగా లక్ష్యాలు నిర్దేశించుకోవాలన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి పి.రమేష్ మాట్లాడుతూ, వెనుకబడిన విద్యార్థులకు వంద రోజుల ప్రణాళిక ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఆయా సబ్జెక్టుల్లో వెనుకబడిన విద్యార్థులతో ఉపాధ్యాయులు ఎక్కువ సమయం గడపడం వలన వారిలో ఏకాగ్రత, మానసిక ధైర్యం పెరిగి, మార్కుల్లో గణనీయమైన మార్పు కనిపిస్తుందని చెప్పారు.
మెడికల్ మాఫియాపై
14న ఆందోళన
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): రాష్ట్రంలో మెడికల్ మాఫియాను అరికట్టాలని, ప్రజారోగ్యాన్ని కాపాడాలనే డిమాండ్లతో ఈ నెల 14న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తాటిపాక మధు తెలిపారు. స్థానిక సీపీఐ భవన్లో పార్టీ నేత తోకల ప్రసాద్ అధ్యక్షతన గురువారం జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫార్మసీ కంపెనీలు, మెడికల్ షాపులపై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో ఎవరికి తోచిన విధంగా వారు విచ్చలవిడిగా మందులు విక్రయిస్తూ, ప్రజలను పీక్కు తింటున్నారని ఆరోపించారు. మెడికల్ మాఫియాకు వ్యతిరేకంగా సీపీఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈ నెల 14న నిర్వహిస్తున్న ఆందోళనను జయప్రదం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రైవేటు భాగస్వామ్యం కోసం ఇప్పటి వరకూ ఏ కార్పొరేట్ వ్యక్తులూ ముందుకు రాలేదని, దీనిని స్వాగతిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రైవేటు వ్యాపారులు పెట్టుబడులు పెట్టకూడదని, ఇది పేదల వైద్య విద్యకు సంబంధించిన విషయమని అన్నారు. ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకూ కాకినాడ సూర్య కళామందిర్లో సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాలు జరగనున్నాయని మధు తెలిపారు. ఈ సమావేశాలకు జాతీయ కార్యదర్శులు కె.రామకృష్ణ, పల్లా వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్యతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల నుంచి ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కె.బోడకొండ, జిల్లా కార్యవర్గ సభ్యులు పి.సత్యనారాయణ, పప్పు ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.
పకడ్బందీగా వంద రోజుల ప్రణాళిక


