కలెక్టర్ను కలిసిన డీఆర్వో
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) టి.తిప్పేనాయక్ కలెక్టర్ షణ్మోహన్ను, ఎస్పీ బిందుమాధవ్ను కలెక్టర్ చాంబర్లో సోమవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్కు మొక్కను అందజేశారు. డీఆర్వోగా తిప్పేనాయక్ ఆదివారం బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.
నాలుగో రోజుకు
కోటి తులసి పూజ
అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో నిర్వహిస్తున్న కోటి తులసి పూజ సోమవారం నాలుగో రోజుకు చేరుకుంది. సుప్రభాత సేవతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటలకు వార్షిక కల్యాణ వేదిక సత్యదేవునికి, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి పండితులు ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకూ, తిరిగి సాయంత్రం 4 నుంచి రాత్రి 7 గంటల వరకూ 60 మంది రుత్విక్కులు ఐదేసి లక్షలు తులసి దళాలతో విష్ణు సహస్ర నామాలు పఠిస్తూ స్వామి వారిని అర్చించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.కోటి తులసి పూజ నిర్వహిస్తున్న స్వామివారి వార్షిక కల్యాణ మండపం విద్యుద్దీపాలంకరణతో కనువిందు చేసింది.
నేడు జాబ్ మేళా
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జిల్లా ఉపాధి కార్యాలయంలో మంగళవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి జి.శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎల్అండ్టీ సంస్థలో వెల్డర్, ప్లంబర్, ఫిట్టర్, సర్వేయర్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామన్నారు. పదో తరగతి ఆపైన, ఏదైనా ఐటీఐ ట్రేడ్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు తమ విద్యార్హతల సర్టిఫికెట్లుతో హాజరు కావాలని సూచించారు. ఇతర వివరాలకు 86398 46568 నంబరులో సంప్రదించాలని కోరారు.
కస్టోడియల్ మృతిపై
మెజిస్టీరియల్ విచారణ
కాకినాడ క్రైం: పోలీస్ కస్టడీలో ఉండి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి ఓ ఖైదీ మృతి చెందిన ఘటనపై అధికారులు మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. గుంటూరుకు చెందిన మెట్టు భాస్కరరెడ్డి (53) రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తూ, గత ఏడాది నవంబర్ 26న అనారోగ్యంతో కాకినాడ జీజీహెచ్లో చేరి, చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతడి మృతిపై మెజిస్టీరియల్ విచారణకు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆదేశాలు జారీ చేసినట్లు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మరణం సంభవించడానికి కారణాలు, వాస్తవాలు, సంబంధిత అంశాల నిర్థారణకు ఈ విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. భాస్కరరెడ్డి మృతిపై కాకినాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందన్నారు. సంబంధిత పోలీస్, వైద్య, జైలు అధికారులతో పాటు మృతుడి కుటుంబ సభ్యులు కాకినాడ ఆర్డీఓ కార్యాలయానికి ఈ నెల 18న విచారణకు హాజరు కావాలని కలెక్టర్ తెలిపారు.
పూర్తిగా కోలుకునే వరకూ వైద్య సేవలు
రంపచోడవరం: అస్వస్థతకు గురైన విద్యార్థులు పూర్తిగా కోలుకునేంత వరకూ మెరుగైన వైద్య సేవలు అందిస్తామని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఇన్చార్జి డైరెక్టర్ వి.ప్రసన్న వెంకటేష్ తెలిపారు. దేవరపల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను ఆయన, పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ బచ్చు స్మరణ్రాజ్ సోమవారం సందర్శించారు. రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొంది, కోలుకొని తిరిగి పాఠశాలకు వచ్చిన విద్యార్థులను పరామర్శించారు. ఇబ్బంది ఉంటే పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరంలో సేవలు పొందాలన్నారు. విద్యార్థులు నిద్రపోయే గదులు, స్టోర్ రూమ్లను పరిశీలించారు. పాఠశాలకు నిత్యావసర సరకుల సరఫరాపై ఆరా తీశారు. విద్యార్థులకు కాచి చల్లార్చిన నీరు అందించాలని, బయటి ఆహారం తినకుండా చూడాలన్నారు. మరుగుదొడ్లు మరమ్మతులు చేయించాలని ఆదేశించారు.
కలెక్టర్ను కలిసిన డీఆర్వో
కలెక్టర్ను కలిసిన డీఆర్వో


