బడ్జెట్లో అరకొర నిధులేలా!
● గ్రంథాలయాల సంస్థకు అన్యాయం
● రాష్ట్ర సంఘ అసోసియేట్ అధ్యక్షుడు వర్మ
అమలాపురం టౌన్: రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో గ్రంథాలయాల సంస్థకు చెందిన ఉద్యోగుల జీతాలు కోసం కేటాయించిన నిధులు కేవలం రూ.36.30 కోట్లు మాత్రమేని, ఈ అరకొర నిధులు ఎలా సరిపోతాయని అమలాపురానికి చెందిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు, రాష్ట్ర సంఘ అసోసియేట్ అధ్యక్షుడు జీవీఆర్ఎస్హెచ్కే వర్మ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం అమలాపురంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ బడ్జెట్లోనే గ్రంథాలయ ఉద్యోగుల జీతాలు, రిటైర్మెంట్ అయిన వారి బెనిఫిట్స్, పెన్షనర్లకు ఇవ్వాల్సి ఉంటుందని వర్మ గుర్తు చేశారు. ఈ కేటాయింపులు గ్రంథాలయ శాఖకు ఎంత మాత్రం సరిపోవని, తక్షణమే బడ్జెట్ను పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కేటాయింపులను రాష్ట్ర వ్యాప్తంగా గ్రంథాలయ ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. గత రెండేళ్లుగా తమ శాఖలో విశ్రాంత ఉద్యోగులుకు చెల్లించాల్సిన బెనిఫిట్స్ దాదాపు రూ.20 కోట్లు ఉందని గుర్తు చేశారు. ప్రతి నెలా ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల నిమిత్తం రూ. 10 కోట్ల నిధులు అవసరం అవతాయని స్పష్టం చేశారు. అంటే ఏడాదికి సుమారు రూ.120 కోట్లు ఖర్చు అవుతుందని వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో గ్రంథాలయాలకు ప్రభుత్వం బడ్జెట్లో కేవలం రూ.36.30 కోట్లు కేటాయించడంతో ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయని వర్మ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో గత ఏడాది డిసెంబర్ నెల నుంచి గ్రంథాలయ ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులను చూస్తుంటే ముందు ముందు ఉద్యోగులకు, పెన్షన్దారులకు చెల్లింపులు నిలిచిపోయే అవకాశం ఉందన్నారు. గ్రంథాలయాలకు స్థానిక సంస్థలు చెల్లించాల్సిన సెస్ బకాయిలు ఈ ఆర్థిక సంవత్సరంలోనే దాదాపు రూ.100 కోట్లకు చేరిందని గుర్తు చేశారు. తమ శాఖ ఉద్యోగులు, పెన్షనర్లకు 010 పద్దు ద్వారా చెల్లించాలని, పూర్తి గ్రాంట్ విడుదల చేయాలని వర్మ డిమాండ్ చేశారు.


