సామాజిక న్యాయ దినోత్సవాన్ని జయప్రదం చేయాలి
● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య పిలుపు
● ముగిసిన రాష్ట్ర సమితి సమావేశాలు
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): అంతర్జాతీయ సామాజిక న్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 20న రాష్ట్రవ్యాప్తంగా ప్రతిజ్ఞ నిర్వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. మూడు రోజులుగా కాకినాడలో జరుగుతున్న ఆ పార్టీ రాష్ట్ర సమితి సమావేశాలు గురువారం ముగిశాయి. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ, దేశంలో కొద్ది మంది వద్ద పోగు పడిన సంపదను వివిధ పన్నుల ద్వారా సేకరించి పునఃపంపిణీ చేయడం ద్వారా సామాజిక న్యా యం సాధించాలని అన్నారు. దీని కోసం పోరా డుతున్న శ్రామిక, దళిత, బహుజన, మైనార్టీ, మహిళా సంఘాలన్నీ ఇందులో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశించిన సాంఘిక న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం నేటి పాలకుల కార్పొరేట్ అనుకూల విధానాల వల్ల ప్రమాదంలో పడ్డాయన్నారు. మోదీ ప్రభుత్వం అంటేనే బిలియనీర్లు, కార్పొరేట్ల ప్రభుత్వమన్నారు. కార్పొరేట్ పన్ను 35 నుంచి 22 శాతానికి తగ్గించారన్నారు. సంపద పన్ను, వారసత్వ పన్ను చట్టాలను రద్దు చేశారన్నారు. మోదీ పాలనలోనే కార్పొరేట్లకు రూ.20 లక్షల కోట్ల రుణమాఫీలు, రాయితీలు ఇచ్చారని ఆయన చెప్పారు. విమానాశ్రయాలు, పోర్టులు, గనులు, సహజవాయు నిక్షేపాలు కట్టబెట్టారన్నారు. ప్రతిఫలంగా వారు బీజేపీకి రూ.వేల కోట్లు ఎన్నికల నిధులు ఇస్తున్నారన్నారు. గ్రామీణ పేదలకు ఎంతో తోడ్పాటునిచ్చే మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారన్నారు. అందరికీ హక్కుగా మంచి ప్రమాణాలతో విద్య, వైద్య సేవలు అందించాలని, పంటలకు చట్టబద్ధంగా లాభసాటి ధరలు ఇవ్వాలని, యువతకు ఉచితంగా ఉపాధి నైపుణ్యాలు, హక్కుగా ఉపాధి లేదా పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. మోదీ పన్నెండేళ్ల పాలనలో ప్రజాస్వామ్యాన్ని కాలరాసి, రాజ్యాంగానికి ఏ మాత్రం గౌరవం ఇవ్వడం లేదని ఆరోపించారు. పూర్తి మెజార్టీ వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తామంటూ గత ఎన్నికల్లో బీజేపీ ప్రచారానికి ఒడిగట్టిందన్నారు. పాలకులు రాజ్యాంగ సంస్థలను చేతిలోకి తీసుకుని గుత్తాధిపత్యం చెలాయిస్తున్నాయని ఈశ్వరయ్య ఆరోపించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తాటిపాక మధు మాట్లాడుతూ, మార్చి 1 నుంచి 15వ తేదీ వరకూ గడప గడపకూ కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకు పార్టీ శ్రేణులు వెళ్లాలని కోరారు. అనంతరం రాష్ట్ర కార్యదర్శి ప్రవేశపెట్టిన తీర్మానాలను సమితి ఏకగ్రీవంగా ఆమోదించింది.


