వన్నెపూడి వద్ద రోడ్డు ప్రమాదం
● బలంగా ఢీకొని, పల్టీలు కొట్టిన కార్లు
● ఐదుగురికి గాయాలు
గొల్లప్రోలు (పిఠాపురం): గొల్లప్రోలు మండలం వన్నెపూడి – కొడవలి జంక్షన్ వద్ద 16వ నంబరు జాతీయ రహదారిపై రెండు కార్లు ఢీకొట్టుకుని పల్టీలు కొట్టడంతో వాటిల్లో ప్రయాణిస్తున్న నలుగురు గాయపడ్డారు. గొల్లప్రోలు పోలీసుల కథనం ప్రకారం.. కిర్లపూడి మండలం జె.బూరుగుపూడికి చెందిన పాటంశెట్టి మణి నాగేంద్ర ప్రైవేటు ఫొటోగ్రాఫర్గా పని చేస్తున్నాడు. వృత్తి పనిలో భాగంగా సోమవారం ఉదయం బూరుగుపూడి నుంచి తన బావకు చెందిన కారులో తోటి ఫొటోగ్రాఫర్లు కేశనకుర్తి శ్రీను, ఆజేష్, వీర శివ, చిన వీర్రాజులతో కలసి షూటింగ్ కోసం విశాఖపట్నం బయలుదేరాడు. గొల్లప్రోలు మండలం కొడవలి జంక్షన్ వద్ద వీరి కారు ముందు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వైపు మరో కారు వీరి ముందు వెళ్తోంది. వన్నెపూడి వద్దకు వచ్చేసరికి ముందున్న కారును డ్రైవర్ అస్తవ్యస్తంగా నడుపుతూ, ఒక్కసారిగా పక్కకు వచ్చాడు. అదే సమయంలో ఓవర్టేక్ చేస్తున్న మణి నాగేంద్ర కారును బలంగా ఢీకొన్నాడు. దీంతో, రెండు కార్లూ పల్టీలు కొట్టి, నుజ్జునుజ్జయ్యాయి. మణి నాగేంద్ర కారుకు ఉన్న నాలుగు చక్రాలూ ఊడిపోయి సుమారు 12 పల్టీలు కొట్టింది. అందులో ప్రయాణిస్తున్న కేశనకుర్తి శ్రీను, ఆజేష్, వీరశివ, చిన వీర్రాజు, మణి నాగేంద్ర గాయపడ్డారు. వారిని హైవే పోలీసు సిబ్బంది ప్రత్తిపాడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం కాకినాడలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి వస్తున్న కారులో వారు ఎటువంటి గాయాలూ కాకుండా ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఎస్సై ఎన్.రామకృష్ణ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
వన్నెపూడి వద్ద రోడ్డు ప్రమాదం
వన్నెపూడి వద్ద రోడ్డు ప్రమాదం


