పెరుగుతున్న.. పెళ్లికాని ప్రసాద్‌లు | - | Sakshi
Sakshi News home page

పెరుగుతున్న.. పెళ్లికాని ప్రసాద్‌లు

Feb 17 2026 7:26 AM | Updated on Feb 17 2026 7:26 AM

పెరుగుతున్న.. పెళ్లికాని ప్రసాద్‌లు

పెరుగుతున్న.. పెళ్లికాని ప్రసాద్‌లు

వధువుల కోసం వెతుకులాట

తగ్గుతున్న అమ్మాయిల సంఖ్య

విద్యావంతులు కావడమూ పెళ్లికి సమస్యే!

రాయవరం: కాలం మారుతోంది. కన్యాశుల్కం మళ్లీ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మ్యారేజ్‌ బ్యూరోల వద్ద పెళ్లి కాని ప్రసాద్‌ల జాబితా పెరిగిపోతోంది. కొడుకే పుట్టాలని కనిపించిన దేవుళ్లందరినీ కోరుకున్న తల్లిదండ్రులు ఇప్పుడు వారి కుమారులకు పెళ్లి చేసేందుకు గుర్తుకొచ్చిన దేవుళ్లకు మొక్కుతున్నారు. పురుషుల సంఖ్యకు తగ్గట్టు అమ్మాయిల సంఖ్య పెరగకపోవడమే ఇందుకు కారణం. ఒకప్పటిలా తల్లిదండ్రులు చూసిన వరుడితో తలవంచుకుని తాళి కట్టించుకునే అమ్మాయిలు ఇప్పుడు లేరు. అబ్బాయిలు రాజీ పడినా.. చదువుకున్న అమ్మాయిలు నో అంటున్నారు.

మారిన రోజులు

ఒకప్పుడు పెళ్లిచూపుల్లో రకరకాల యక్షప్రశ్నలు వేసి అమ్మాయి సహనాన్ని అబ్బాయిలు పరీక్షించేవారు. ఇప్పుడు రోజులు మారాయి. అమ్మాయి, ఆమె కుటుంబం బాగుంటే చాలు. ఆస్తిపాస్తులు ఇవ్వనవసరం లేదంటున్నారు. అమ్మాయికి నేను నచ్చానో లేదో ఒకసారి అడగండి అంటున్నారు. అవసరమైతే కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటామంటున్నారు అధిక శాతం అబ్బాయి తరపు తల్లిదండ్రులు. లింగ వివక్షతో అమ్మాయిల సంఖ్య తగ్గిపోవడం, వారిలో చాలా మంది విద్యావంతులు కావడం ఈ సమస్యకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు. గతంలో వైద్య వృత్తి, ఫార్మసీ, డెంటల్‌, అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌, బీఎస్సీ అగ్రికల్చర్‌, ఎంబీఏ, ఎంసీఏ, సీఏ, ఇంజినీరింగ్‌ వంటి కోర్సులను కేవలం కొన్ని వర్గాల ప్రజలు మాత్రమే చదివేవారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకంతో అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ వృత్తి విద్య కోర్సులు చదువుతున్నారు. ఇందుకు అనుగుణంగా కళాశాలల సంఖ్య కూడా గణనీయంగా పెరిగాయి. బాలికల తల్లిదండ్రులు కూడా విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. యూకేజీ నుంచి డిగ్రీ వరకు రూ.వేల నుంచి రూ.లక్షలు ఖర్చు పెట్టి చదివిస్తున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా అమ్మాయిలే విద్య, ఉద్యోగాల్లో రాణిస్తున్నారు. ఇప్పుడు అమ్మాయిల కోసం ప్రత్యేకించి కళాశాలలు వెలుస్తున్నాయంటే అతిశయోక్తి కాదు.

పెరిగిన వివాహ వయసు

ఒకప్పుడు అమ్మాయికి 16 వచ్చీ రాగానే పెళ్లి చేసేవారు. ఇప్పుడు 25 సంవత్సరాల వరకూ వివాహ ప్రస్తావన ఎత్తడం లేదు. చదువుకున్న కుటుంబాల్లో ఇది ఎక్కువగా ఉంది. అమ్మాయికి తగ్గ అబ్బాయి లభించడం లేదన్న కారణాన్ని కూడా తల్లిదండ్రులు చెబుతున్నారు. అబ్బాయిలు సైతం ఒకప్పుడు 20 ఏళ్లు వచ్చేలోపు పెళ్లి చేసుకునేవారు. కానీ వారు కూడా ఇప్పుడు 30 ఏళ్ల దాకా పెళ్లి మాట ఎత్తవద్దంటున్నారు. బాగా వెనుకబడిన ప్రాంతాలు, గ్రామాల్లో కొన్ని కుటుంబాల్లో మాత్రమే చిన్న వయసులో వివాహాలు జరుగుతున్నాయి. పట్టణాలు, చదువుకున్న కుటుంబాల్లో మాత్రం అధిక శాతం వివాహాలు ఆలస్యంగా జరుగుతున్నట్లు మ్యారేజ్‌ బ్యూరో నిర్వాహకులు చెబుతున్నారు.

అందుకే తేడా..

తమను కని, పెంచి పెద్ద చేసేది సీ్త్ర. తల్లిగా, చెల్లిగా, అక్కగా ఉండవచ్చు కానీ కూతురుగా వస్తే మాత్రం చాలా మంది ఒప్పుకోవడం లేదు. గర్భంలో ఉన్నది ఆడపిల్ల అని తెలియగానే భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారనే విమర్శలున్నాయి. ఆడపిల్లను కంటే చదివించడం, పెద్ద చేయడం, సంరక్షించడం, పెళ్లి చేయడం భారంగా కొంతమంది తల్లిదండ్రులు భావిస్తున్నారు. అందుకే అబ్బాయిల, అమ్మాయిల నిష్పత్తిలో తేడా వస్తోందని పలువురు పేర్కొంటున్నారు. అయితే ఇటీవల కాలంలో తల్లిదండ్రుల ఆలోచనా సరళిలో మార్పు కన్పిస్తోంది. అమ్మాయి అయినా, అబ్బాయి అయినా ఓకే అనే పరిస్థితికి వస్తున్నారు. ఇది కొంత వరకు ఆశించదగ్గ పరిణామంగా చెప్పవచ్చు.

అమ్మాయికి తగ్గ అబ్బాయిలు ఎక్కడ?

ఉన్నత చదువులు చదివిన వారు, ప్రొఫెషనల్‌ కోర్సులు చేసిన అమ్మాయిలు సాదాసీదాగా డిగ్రీ, ఇంటర్‌ చదివిన అబ్బాయిలను ఇష్టపడడం లేదు. అబ్బాయి ఎంతగా ఆస్తిపరుడైనా ప్రొఫెషనల్‌ కోర్సు చేసి ఉండాలని అమ్మాయిలు కోరుకుంటున్నారు. ఈ మేరకు వారి డిమాండ్లను మ్యారేజ్‌ బ్యూరో నిర్వాహకుల ముందు ఉంచుతున్నారు.

మరోవైపు అబ్బాయిలకు చదువుకు తగ్గ ఉద్యోగాలు లభించక పోవడంతో పలువురు వ్యాపారాల వైపు, వృత్తి విద్యా కోర్సుల వైపు దృష్టి మళ్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమ్మాయిల కోరికలకు తగ్గట్టు అబ్బాయిలు లభించడం లేదని మ్యారేజ్‌ బ్యూరో నిర్వాహకుడు వి.శ్రీనివాసరావు ‘సాక్షి’కి తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగం, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌, వైద్యులు కావాలని అమ్మాయిలు అడుగుతున్నారు. ఒక్కడే కుమారుడై ఉండాలని, అత్తమామలు లేకుంటే మరీ మేలని అనే వారూ ఉంటున్నారని మరో మ్యారేజ్‌ బ్యూరో నిర్వాహకుడు నాగేశ్వరరావు తెలిపారు. దీంతో అబ్బాయిల కోర్కెలు తగ్గిపోయాయి. చాలా మంది పిల్లనిస్తే చాలనే ధోరణిలో ఉన్నారు.

ఆ లెక్కలు చూస్తే..

2011 లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లాలో 51,54,296 మంది జనాభా ఉంటే, ఇందులో పురుషులు 25,69,688, మహిళలు 25,84,608 మంది ఉన్నారు. లింగ నిష్పత్తి లెక్క వేస్తే ప్రతి వెయ్యి మంది పురుషులకు గాను 1,006 మంది మహిళలున్నారు. మొత్తం మీద పురుషుల కంటే మహిళలే అధికంగా ఉన్నారన్నమాట. అయితే, గత ఆరేళ్ల లోపు శిశు లింగ నిష్పత్తిని పరిశీలిస్తే, ప్రతి వెయ్యి మంది మగ శిశువులకు 968 మంది మాత్రమే ఆడబిడ్డలు ఉన్నారు. దీనిని బట్టి చూస్తే పురుషుల అధికమవుతోంది. 2001లో 7.93 శాతం జనాభా వృద్ధి రేటు ఉంటే, 2011లో జనాభా వృద్ధి రేటు 5.16 శాతంగా ఉంది. 2027 జనాభా లెక్కల అనంతరం ప్రస్తుత పరిస్థితి తెలుస్తుంది. జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో 74.51 శాతం జనాభా ఉంటే, పట్టణ ప్రాంతంలో 25.49 శాతం మంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement