గుర్రువుల పోరు
కపిలేశ్వరపురం: భావిభారత పౌరులను తీర్చిదిద్దే ఉపాధ్యాయుడంటే సమాజంలో ఎనలేని గౌరవం ఉంటుంది. అయితే చంద్రబాబు ప్రభుత్వం వారికి కనీస విలువ ఇవ్వడం లేదు. ఎన్నికల సమయంలో వారికి కూటమి నేతలు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు. ఎన్నిసార్లు గుర్తు చేసినా పట్టించుకోవడం లేదు. చేసేది లేక ప్రజాస్వామ్య పద్ధతిలో ఉపాధ్యాయులు మంగళవారం రణభేరి 2.0 పేరుతో ఆందోళనకు దిగుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో ఉపాధ్యాయులిలా..
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని 4,570 ప్రభుత్వ పాఠశాలల్లో 18,316 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని 962 ప్రభుత్వ పాఠశాలల్లో 5,814 మంది, కాకినాడ జిల్లాలోని 1,246 పాఠశాలల్లో 6,493 మంది, కోనసీమ జిల్లాలోని 1,562 పాఠశాలల్లో 4,109 మంది, పోలవరం జిల్లాలోని సుమారు 800 ప్రభుత్వ పాఠశాలల్లో 1,900 మంది చొప్పున ఉపాధ్యాయులు పని చేస్తున్నారు.
నేటి విజయవాడ ధర్నాకు ఉపాధ్యాయులు
పలు ప్రధాన డిమాండ్లతో ‘ఉపాధ్యాయ రణభేరి’ పేరిట యూటీఎఫ్ మంగళవారం చలో విజయవాడ ఆందోళనకు పిలుపునిచ్చింది. ఉపాధ్యాయులకు చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడలోని బీఆర్టీఎస్ రోడ్డుపై ధర్నా చేయనున్నారు. ఆ మేరకు ఈ నెల 13న విజయవాడలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు తదితరులు రణభేరి కార్యక్రమం పోస్టర్ను విడుదల చేశారు. అదే రోజు పోలవరం జిల్లా వీఆర్పురం మండలం రేఖపల్లిలో ఆందోళన సన్నాహక సమావేశం నిర్వహించారు. తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో కూడా సన్నాహక సమావేశాలు నిర్వహించారు. విజయవాడకు తరలివెళ్లే విషయమై సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి దిశా నిర్దేశం చేశారు.
నాడు హామీల ఎర..
నేడు విస్మరణ
సార్వత్రిక ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఉద్యోగ, ఉపాధ్యాయులకు పలు హామీలు గుప్పించారు. అధికారంలోకి వచ్చి 20 నెలలయినా ఆ హామీలను నెరవేర్చడం లేదు. యూటీఎఫ్, ఎస్టీయూ తదితర సంఘాల ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబుకు అనేక మార్లు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ స్పందించడం లేదు. పైగా బోధనేతర పనులతో ఉపాధ్యాయులపై పని ఒత్తిడి పెంచారు. హామీల అమలుకు అనేకసార్లు విజ్ఞప్తులు చేసిన ఉపాధ్యాయులు చట్ట పరిధిలో శాంతియుత మార్గాన నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అయినప్పటికీ ప్రభుత్వం ఖాతరు చేయకపోవడంతో ఈ నెల 13న ఎస్టీయూ ఆధ్వర్యాన కాకినాడ, రాజమహేంద్రవరాల్లోని కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహించారు. ఆ సంఘం ఈ నెల 25న చలో విజయవాడకు పిలుపునిచ్చింది. యూటీఎఫ్ ఆధ్వర్యాన రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు సీఎం చంద్రబాబుకు లక్ష ఉత్తరాలు రాశారు. ఈ నెల 5న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద భారీ ధర్నా నిర్వహించగా ఉమ్మడి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు తరలి వెళ్లారు.
పాఠశాలలను బలోపేతం చేయాలి
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించాలి. పాఠశాలల్లో తగిన సదుపాయాలను మెరుగుపర్చాలి.
– సీహెచ్ సూరిబాబు,
యూటీఎఫ్ అధ్యక్షుడు, కాకినాడ జిల్లా
హామీలు నెరవేర్చాలి
సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఉపాధ్యాయు లకు పలు హామీలను ఇచ్చారు. వాటిని నెరవేర్చాలి. 29 శాతం ఐఆర్ వెంటనే ప్రకటించాలి.
– ఎంటీవీఏఎస్ సుబ్బారావు, యూటీఎఫ్
ప్రధాన కార్యదర్శి, అంబేడ్కర్ కోనసీమ జిల్లా
ఉపాధ్యాయ రణభేరి 2.0 డిమాండ్లు ఇవీ..
12వ పీఆర్సీ కమిషన్ వెంటనే
నియమించాలి.
29 శాతం మధ్యంతర భృతి
(ఐఆర్) ప్రకటించాలి.
పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలను
వెంటనే విడుదల చేయాలి.
ఉద్యోగుల, పెన్షనర్ల బకాయి చెల్లింపులకు
రోడ్ మ్యాప్ ప్రకటించాలి.
ఉద్యోగులు, ఉపాధ్యాయులు రిటైరైన
రోజే ఆర్థిక చెల్లింపులు పూర్తి చేయాలి.
సీపీఎస్ రద్దు చేయాలి.
హెల్త్కార్డుపై మెడికల్ బిల్ చెల్లింపు
సమస్య పరిష్కరించాలి. కొత్త హెల్త్ కార్డులు మంజూరు చేయాలి.
ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ రద్దు చేయాలి. ఆ మేరకు కోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలి.
సెలవుల్లో తరగతుల నిర్వహణ
భారం తొలగించాలి.
2004 ముందు నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాల్లో చేరిన 2003 డీఎస్సీ ఉపాధ్యాయులు, పోలీసులు, ఇతర ఉద్యోగులకు, కేంద్రం ఇచ్చిన మెమో నంబర్ 57 ప్రకారం పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి.
టీచర్ల గోడు పట్టని చంద్రబాబు ప్రభుత్వం
హామీలను తుంగలోకి తొక్కిన వైనం
ఎన్నిసార్లు విన్నవించినా దక్కని ఫలితం
నేడు యూటీఎఫ్ రణభేరి 2.0
విజయవాడకు తరలివెళ్తున్న
ఉపాధ్యాయులు
గుర్రువుల పోరు
గుర్రువుల పోరు


