సహకారం.. సమరపథం
● సహకార ఉద్యోగుల సమ్మె
● 71 సొసైటీల్లో నిలిచిన సేవలు
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): తమ సమస్యలు పరిష్కరిస్తామని చంద్రబాబు హామీలు ఇవ్వడం తప్ప.. సర్కారు వాటిని నెరవేర్చకపోవడంపై ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (సొసైటీలు) ఉద్యోగులు సోమవారం సమ్మె బాట పట్టారు. ఇందులో భాగంగా జిల్లావ్యాప్తంగా సొసైటీల్లో పని చేస్తున్న ఉద్యోగులు ఆయా కార్యాలయాలను మూసివేసి ఎక్కడికక్కడ ధర్నాలు నిర్వహించారు. జిల్లాలోని 71 సొసైటీల ద్వారా ప్రతి రోజూ సుమారు రూ.40 కోట్లు లావాదేవీలు జరుగుతూంటాయి. సుమారు 1.80 లక్షల మంది సొసైటీల సేవలను వినియోగించుకుంటున్నారు. ఒక్కో సొసైటీకి ప్రతి రోజూ 30 నుంచి 50 మందికి పైగా రైతులు వస్తూంటారు. ప్రతి సహకార సంఘంలో రోజుకు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకూ లావాదేవీలు జరుగుతూంటాయి. సమ్మె కారణంగా సొసైటీలు మూత పడటంతో ఆయా లావాదేవీలు నిలిచిపోయి, రైతులకు ఇబ్బంది తప్పలేదు. ఖరీఫ్ రుణాలు చెల్లించిన రైతులు పలువురు రబీ పెట్టుబడికి అవసరమైన డబ్బుల కోసం సహకార సంఘాలకు వచ్చారు. వాటికి తాళాలు వేసి ఉండటంతో ఉసూరుమంటూ వెనుతిరగాల్సి వచ్చింది.
ఇవీ డిమాండ్లు
● వేతన సవరణ చేపట్టాలి. అప్పటి వరకూ మధ్యంతర భృతి ఇవ్వాలి.
● గ్రాట్యుటీ సీలింగ్ పెట్టి, రూ.2 లక్షలు మాత్రమే చెల్లిస్తున్నారు. అలా కాకుండా చట్ట ప్రకారం గ్రాట్యుటీ చెల్లించాలి.
● సహకార సంఘాల సిబ్బందికి కూడా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా పదవీ విరమణ వయస్సును 62 సంవత్సరాలకు పెంచాలి.
● ఉద్యోగులకు రూ.5 లక్షలకు తక్కువ కాకుండా ఆరోగ్య బీమా కల్పించాలి. సర్వీస్లో ఉండగా మరణిస్తే ఆ కుటుంబం ఆధారం కోల్పోతున్నందున ప్రతి ఉద్యోగికీ రూ.20 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ చేయించాలి.
● అనేక సంఘాల్లో ఉద్యోగుల జీతభత్యాలను డ్యుటు పద్దులో ఉంచారు. ఈ పద్దులను రద్దు చేయాలి.
● 2019 తర్వాత సహకార సంఘాల్లో చేరిన ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలి. వారికి జీవో నంబర్ 36 అమలు చేయాలి.
● డీసీసీబీల ద్వారా నేరుగా కాకుండా సహకార సంఘాల ద్వారా మాత్రమే రైతులకు రుణాలిచ్చేలా చర్యలు తీసుకోవాలి.
● సంఘాలు చెల్లించిన షేరు ధనంపై కనీసం 6 శాతం డివిడెండ్, 6 శాతం కనీస వడ్డీ చెల్లించాలి.
● అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ క్లర్క్, కంప్యూటర్ ఆపరేటర్లను సీనియారిటీ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న సంఘాల సీఈఓలుగా నియమించాలి.


