సాక్షి, వరంగల్: వరంగల్లో సంచలన ఘటన చోటుచేసుకుంది. మాజీ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ తండ్రి నారా సుబ్రహ్మణ్యేశ్వరరావు ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం. 40కి పైగా స్లీపింగ్ టాబ్లెట్లు తీసుకున్న ఆయన.. తెల్లవారుజామున అపస్మారక స్థితిలో ఉండటాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. వెంటనే వరంగల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.
సుబ్రహ్మణ్యేశ్వరరావు గత కొద్ది రోజులుగా ఇంటి వద్దే ఉంటున్నట్లు తెలుస్తోంది. సుమంత్ వ్యవహారశైలితో మనస్తాపానికి గురైన నేపథ్యంలోనే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు కుటుంబ వర్గాల నుంచి సమాచారం. అయితే ఆత్మహత్యాయత్నానికి అసలు కారణం ఏమిటన్నది అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది. ప్రస్తుతం వైద్యులు ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఇదిలా ఉండగా.. సుబ్రహ్మణ్యేశ్వరరావు విద్యుత్ శాఖలో ఉద్యోగం చేశారు. ఉద్యోగ విరమణకు మరో ఆరు నెలల సమయం ఉండగానే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నట్లు తెలిసింది. అనంతరం కుటుంబంతో కలిసి ఉంటున్న ఆయన.. కొంతకాలంగా మానసిక ఆందోళనలో ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, సుమంత్కు సంబంధించిన వివాదాలు ఇటీవల తీవ్ర చర్చకు దారితీశాయి. సుమంత్పై ఇప్పటికే దాడి, బెదిరింపులు, డబ్బులు డిమాండ్ చేశారన్న ఆరోపణలతో కేసులు నమోదైనట్లు తాజా వార్తా కథనాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో సుబ్రహ్మణ్యేశ్వరరావు ఆత్మహత్యాయత్నం ఘటన మరింత చర్చనీయాంశంగా మారింది.
ఇదీ చదవండి: ఉద్యోగుల కోసం ఎనీ టైమ్.. రేవంత్ ఆఫర్


