రాకెట్‌లా దూసుకుపోతున్న ముడిచమురు ధరలు | Brent Crude Nears 110 Dollars as Middle East Shipping Disruptions | Sakshi
Sakshi News home page

రాకెట్‌లా దూసుకుపోతున్న ముడిచమురు ధరలు

Sep 11 2026 9:01 AM | Updated on Sep 11 2026 9:26 AM

Brent Crude Nears 110 Dollars as Middle East Shipping Disruptions

పశ్చిమాసియాలో యుద్ధం ముదురుతున్న కొద్దీ అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు రాకెట్‌లా దూసుకుపోతున్నాయి. హర్ముజ్‌ సహా కీలకమైన సముద్ర మార్గాల్లో వరుస దాడులు, చమురు రవాణాకు అంతరాయాల భయాలు మార్కెట్‌ను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీంతో వరుసగా రెండో రోజూ చమురు ధరలు భారీగా పెరిగాయి. నిన్న ఒక్కరోజే 6 శాతానికి పైగా ఎగబాకిన ధరలు.. శుక్రవారం కూడా పైపైకి కదిలాయి. 

బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధర ఏకంగా బ్యారెల్‌కు 108.68 డాలర్లకు చేరింది. అంటే 110 డాలర్ల మార్క్‌కు అత్యంత చేరువలో ఉంది. అమెరికా వెస్ట్‌ టెక్సాస్‌ ఇంటర్మీడియట్‌ (WTI) క్రూడ్‌ ధర కూడా బ్యారెల్‌కు 103.45 డాలర్లకు చేరింది. ఈ రెండు బెంచ్‌మార్క్‌లు మే మధ్య తర్వాత తొలిసారిగా వారాన్ని 100 డాలర్లకు పైన ముగించే దిశగా సాగుతున్నాయి.

పశ్చిమాసియాలో ఇటీవలి కాలంలో మళ్లీ తీవ్రత పెరిగిన పోరుతో చమురు సరఫరాపై అనిశ్చితి పెరిగింది. ముఖ్యంగా కీలక సముద్ర మార్గాల్లో చమురు ట్యాంకర్లు, ఇతర నౌకలపై దాడులు పెరగడం మార్కెట్‌ను కలవరపెడుతోంది. గురువారం బ్రెంట్‌, WTI ధరలు రెండూ 6 శాతానికిపైగా పెరిగాయి. వారాంత ప్రాతిపదికన చూస్తే రెండు సూచీలు దాదాపు 13 శాతం మేర లాభపడ్డాయి.

ఇరాన్‌-అమెరికా మధ్య యుద్ధం ఏడో నెలలోకి ప్రవేశించినప్పటికీ.. ఉద్రిక్తతలు తగ్గే సూచనలు కనిపించకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. అమెరికా, ఇరాన్‌ రెండూ వెనక్కి తగ్గే ఉద్దేశం లేదన్న సంకేతాలు ఇస్తుండటంతో ఈ పరిస్థితి మరింత కాలం కొనసాగవచ్చన్న అంచనాలు పెరిగాయి.

హర్ముజ్‌ నుంచి ఎర్ర సముద్రం వరకు..
ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హర్ముజ్‌ జలసంధి మీదుగా నౌకల రాకపోకలు ఇప్పటికే పరిమితమయ్యాయి. మరోవైపు యెమెన్‌లో ఇరాన్‌కు అనుకూలంగా ఉన్న హౌతీలు మొచా పోర్టుపై నియంత్రణ సాధించడం ఎర్ర సముద్ర మార్గంపై కొత్త ఆందోళనలకు దారితీసింది. సెప్టెంబర్‌ 10న ఒమన్‌ సమీపంలో రెండు నౌకలు గుర్తుతెలియని ప్రాజెక్టైళ్ల దాడికి గురైనట్లు యూకే మారిటైమ్‌ ట్రేడ్‌ ఆపరేషన్స్‌ తెలిపింది. ఇరాన్‌ సమీప సముద్ర మార్గాల్లో ఉద్రిక్తతలు పెరగడం, అమెరికా ఐదు ఇరానియన్‌ చమురు ట్యాంకర్లపై దాడి చేయడం, అనంతరం ఇరాన్‌ పలు నౌకలపై దాడులు చేసినట్లు ప్రకటించడం.. చమురు రవాణాపై ముప్పును మరింత పెంచాయి.

ఇదే సమయంలో సౌదీ అరేబియాలోని ఇంధన మౌలిక వసతులపై హౌతీల దాడులు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. కొన్ని కార్యకలాపాలు నిలిచిపోవడంతో మిడిల్‌ఈస్ట్‌ నుంచి చమురు సరఫరా మరింత తగ్గే ప్రమాదం ఉందన్న భయాలు వ్యక్తమవుతున్నాయి.

చైనా కొనుగోళ్లతో మరింత మంట..
సరఫరా ఆందోళనలకు తోడు డిమాండ్‌ వైపు పరిణామాలు కూడా క్రూడాయిల్‌ ధరలకు మద్దతు ఇస్తున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద క్రూడాయిల్‌ దిగుమతిదారు అయిన చైనా ఇటీవలి వారాల్లో కొనుగోళ్లను పెంచింది. చైనా ఇదే స్థాయిలో కొనుగోళ్లు కొనసాగిస్తే.. సరఫరా అంతరాయాల ప్రభావం మరింత పెరిగి ధరలు పైకి వెళ్లే అవకాశం ఉందని మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. అదే సమయంలో సౌదీ అరేబియా చమురు ఉత్పత్తి ఏడాదిలోనే కనిష్ట స్థాయికి పడిపోయినట్లు నివేదికలు వెల్లడించాయి. దీంతో ఇప్పటికే సరఫరాపై ఉన్న ఒత్తిడికి ఇది మరింత తోడైంది.

క్రూడాయిల్‌ అంటే.. భూమి నుంచి వెలికితీసే ముడిచమురు. దీన్ని శుద్ధి చేసి పెట్రోల్‌, డీజిల్‌, విమాన ఇంధనం, ఎల్‌పీజీతో పాటు ప్లాస్టిక్‌, పెయింట్లు, రసాయనాలు వంటి అనేక ఉత్పత్తులను తయారు చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలను సాధారణంగా బ్యారెల్‌కు లెక్కిస్తారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధర పెరిగితే.. దాని ప్రభావం ఇంధన ధరలు, రవాణా ఖర్చులు, చివరకు నిత్యావసర వస్తువుల ధరలపైనా పడే అవకాశం ఉంటుంది.

భారత్‌పై ప్రభావం..
క్రూడాయిల్‌ ధరలు ఇలా భారీగా పెరగడం భారత్‌పై నేరుగా ప్రభావం చూపే అవకాశం ఉంది. దేశం తన అవసరాల్లో ఎక్కువ భాగం ముడిచమురును దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో.. అంతర్జాతీయ ధరలు పెరిగితే దిగుమతి బిల్లు, కరెంట్‌ అకౌంట్‌ లోటుపై ఒత్తిడి పెరుగుతుంది. రూపాయి విలువపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. మరోవైపు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచాల్సిన పరిస్థితి వస్తే రవాణా ఖర్చులు పెరిగి.. ఆ ప్రభావం నిత్యావసర వస్తువులు, కూరగాయలు, సరుకుల ధరలపై పడొచ్చు. దీంతో క్రూడాయిల్‌ ర్యాలీ భారత్‌లో ద్రవ్యోల్బణ ఆందోళనలను కూడా పెంచే అవకాశం ఉంది.

120 డాలర్లకు చేరుతుందా?
ప్రస్తుత పరిణామాలు ఇలాగే కొనసాగితే క్రూడాయిల్‌ ధరలు మరింత పెరిగే అవకాశాన్ని విశ్లేషకులు కొట్టిపారేయడం లేదు. యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే బ్రెంట్‌ ధర బ్యారెల్‌కు 120 డాలర్ల స్థాయికి చేరే అవకాశం ఉందని గోల్డ్‌మన్‌ శాక్స్‌ ఇప్పటికే హెచ్చరించింది. బ్రెంట్‌ ధర ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 80 శాతం పెరిగింది. యుద్ధ సమయంలో నమోదైన గరిష్ఠ స్థాయి 126 డాలర్లతో పోలిస్తే(ఏప్రిల్‌ 30న).. ప్రస్తుత ధరలు కూడా ఆ స్థాయికి చేరువలోనే ఉన్నాయి.

అయితే ధరల ర్యాలీ ఎంతకాలం కొనసాగుతుందన్నది ప్రధానంగా యుద్ధ తీవ్రత, సముద్ర మార్గాల్లో చమురు రవాణా పరిస్థితులు, చైనా కొనుగోళ్లపై ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మాత్రం నవంబర్‌లో జరిగే మధ్యంతర ఎన్నికల తర్వాత యుద్ధం ముగుస్తుందని, ఆ తర్వాత చమురు ధరలు భారీగా తగ్గుతాయని పేర్కొన్నారు. కానీ ప్రస్తుత పరిణామాలు మాత్రం సమీప భవిష్యత్తులో ఉద్రిక్తతలు తగ్గే అవకాశాలపై సందేహాలను పెంచుతున్నాయి.

ఇదీ చదవండి: భారత్‌ వద్ద న్యూక్లియర్‌ వెపన్స్‌ లెక్క తెలుసా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement