పెరిగిన బాండ్ రాబడులతో ఒత్తిడి
4,400 డాలర్ల కిందకు చేరిన పసిడి
దేశీయంగానూ దిగొచ్చిన బంగారం, వెండి ధరలు
ముంబై: బాండ్లపై రాబడులు పెరగడం, అమెరికా కరెన్సీ డాలర్ బలోపేతంతో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి, వెండి ధరలు భారీగా దిగొచ్చాయి. కామెక్స్లో ఔన్స్ బంగారం ధర 1.68 శాతం క్షీణించి 4,400 డాలర్ల దిగువన 4,386 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వెండి ధర ఔన్స్ 5.37 శాతం పతనమై 65 డాలర్ల స్థాయిని కోల్పోయి 64.92 డాలర్ల వద్ద కదలాడుతోంది.
బ్రెంట్ క్రూడాయిల్ ధర 102 డాలర్ల మార్కును దాటడంతో ద్రవ్యోల్బణ భయాలు మళ్లీ మొదలయ్యాయి. దీంతో అమెరికా కేంద్ర బ్యాంకు ‘ఫెడరల్ రిజర్వ్’ వడ్డీ రేట్లను పెంచే దిశగా నిర్ణయాలు తీసుకుంటుందనే అంచనాలు తీవ్ర ఒత్తిడి పెంచాయి. ‘‘రాబోయే అమెరికా పీసీఈ ద్రవ్యోల్బణ గణాంకాలు, వచ్చే వారం జరగనున్న ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య విధాన నిర్ణయాలు పసిడి తదుపరి గమనాన్ని నిర్దేశిస్తాయి.’’ అని ఆనంద్ రాఠీ రీసెర్చ్ విశ్లేషకురాలు వేదికా నర్వేకర్ తెలిపారు.
ఎంసీఎక్స్లోనూ నేల చూపులే
అంతర్జాతీయ ప్రభావానికి తోడు డాలర్ మారకంలో రూపాయి విలువ 44 పైసలు క్షీణించడంతో ఎంసీఎక్స్లో బంగారం, వెండి ధరలు నేలచూపు లు చూశాయి. అక్టోబర్ కాంట్రాక్టు పది గ్రాము ల పసిడి ధర దాదాపు 1% క్షీణించి రూ. 1,52,249 వద్ద ట్రేడవుతుండగా, కిలో వెండి ధర 3.63 శాతం పతనమై రూ. 2,35,347 వద్ద ట్రేడవుతోంది. ‘‘స్వల్పకాలంలో దేశీయ మార్కెట్లో బంగారం ధర రూ. 1,51,500 – రూ. 1,55,000 శ్రేణి మధ్య కదలాడొచ్చు’’ అని ఎల్కేపీ సెక్యూరిటీస్ రీసెర్చ్ విశ్లేషకుడు జతీన్ త్రివేది విశ్లేషించారు.


