సాక్షి, కోల్కతా: పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రి సువేందు అధికారి(Suvendu Adhikari) అత్యంత పవిత్రంగా భావించే కౌశికి అమావాస్య (Kaushiki Amavasya) సందర్భంగా కోల్కతా కాళీఘాట్లోని పవిత్ర కాళీమాత అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా శతాబ్దాల చరిత్ర కలిగిన కాళీఘాట్ ఆలయ సంప్రదాయం ప్రకారం చేపల ప్రసాదాన్ని కళ్ల కద్దుకుని మరీ స్వీకరించారు. దుర్గాపూజ సమయంలో బెంగాలీ హిందువులు మాంసాహారం తినడాన్ని ఒక హిందూ పూజారి ఖండించిన నేపథ్యంలో సీఎం మాంసాహార ప్రసాదాన్ని స్వీకరించడం ఆసక్తికరంగా మారింది.
కాళీఘాట్ ఆలయంలో నేలపై కూర్చుని, కాళీఘాట్ భోగ్ ప్రసాదంలో ప్రత్యేకమైన పెద్ద చేప తల (Fish head), వేయించిన చేపలు, బసంతి పులావ్ తింటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Putting all controversy at rest. CM Suvendu Adhikari is currently eating Kalighat Kali Maa's Fish Bhog. Today is the final Amavasya and it's a special day for us pic.twitter.com/rLIqwcWg3u
— Sudhanidhi Bandyopadhyay (@SudhanidhiB) September 10, 2026
#WATCH पश्चिम बंगाल के मुख्यमंत्री सुवेंदु अधिकारी ने आज शाम कालीघाट मंदिर में पूजा-अर्चना की।
(वीडियो सोर्स: सुवेंदु अधिकारी/फेसबुक) pic.twitter.com/Y3L7Cvkplv— ANI_HindiNews (@AHindinews) September 10, 2026
మరోవైపు ఉత్తరాది రాష్ట్రాల శాఖాహార అలవాట్లను మాంసాహారం ఎక్కువగా తినే బెంగాల్పై రుద్దడానికి ప్రయత్నిస్తున్నారనే విమర్శలను బీజేపీ తరచూ ఎదుర్కొంటోంది. అయితే సువేందు అధికారి కాళీఘాట్ వీడియోను ప్రస్తావిస్తూ బీజేపీ ప్రతినిధి ప్రదీప్ భండారి మాట్లాడుతూ.. "ఈ వివాదానికి ఇక్కడితో ముగింపు పలకాలి. కాళీఘాట్లో సీఎం సువేందు అధికారి మా కాళీ సంప్రదాయ చేపల భోగ్ను స్వీకరించడం ద్వారా బెంగాల్ సంస్కృతి, విశ్వాసాలు, జీవన విధానాన్ని గౌరవించారు. బెంగాల్ సంప్రదాయాలు, ప్రయోజనాలకు బీజేపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు.
కాగా కాళీఘాట్ దేవాలయంలో అధిష్టాన దేవత అయిన కాళికాదేవికి చేపలు, బలి ఇచ్చిన మేక మాంసాన్ని నైవేద్యంగా సమర్పించే సంప్రదాయం అనాదిగా వస్తోంది. ఆ తర్వాత ఈ ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేస్తారు.
నాన్-వెజ్ వివాదం ఏమిటంటే:
బాగేశ్వర్ ధామ్ ప్రధాన పూజారి ధీరేంద్ర శాస్త్రి (బాగేశ్వర్ బాబా) ఇటీవల చేసిన శాకాహార వ్యాఖ్యలతో వివాదం మొదలైంది. దుర్గాపూజ సమయంలో మాంసాహారం తినకూడదని బెంగాలీ హిందువులకు ఆయన విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా దుర్గాపూజ సమయంలో మాంసాహారం తినే బెంగాలీ హిందువులను "పాషాండులు" అని వ్యాఖ్యానించడమేకాదు రాష్ట్రవ్యాప్తంగా మాంస విక్రయాలు, మద్యం దుకాణాలను మూసివేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.


