సాధారణంగా చేపల కోసం దగ్గరలోని మార్కెట్కు వెళ్లడం సహజం. కానీ కోటి రూపాయల విలువైన లగ్జరీ కారులో ఏకంగా 40 కిలోమీటర్లు ప్రయాణించి రూ.10 వేలకు కేవలం ఒకే ఒక్క చేప కొనుగోలు చేసిన ఆసక్తికర ఘటన జంగారెడ్డిగూడెం మండలంలోని దేవులపల్లిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవులపల్లిలోని శ్రీ కరాటం జలాశయంలో మత్స్యకారుల వలకు ఒక భారీ చేప చిక్కింది.
కాటా వేసి చూడగా ఆ చేప బరువు దాదాపు 40 కేజీలు ఉంది. ఇంత పెద్ద చేప చిక్కిందనే వార్త చుట్టుపక్కల ప్రాంతాలకు దావానలంలా వ్యాపించింది. విషయం తెలుసుకున్న ఏలూరుకు చెందిన ఒక చేప ప్రియుడు, ఆ భారీ చేపను ఎలాగైనా సొంతం చేసుకోవాలనే కుతూహలంతో ఏకంగా కోటి రూపాయల విలువైన తన లగ్జరీ కారులో 40 కిలోమీటర్లు ప్రయాణించి దేవులపల్లి చేరుకున్నారు. ఎంతో ఆసక్తిగా రూ.10 వేలు వెచ్చించి ఆ చేపను కొనుగోలు చేసి తీసుకెళ్లారు.
-ఏలూరు జిల్లా
చదవండి: ఆ ఇద్దరు ఐఏఎస్లదీ ఒకే కథ!


