Photo Credit: Twitter
సాక్షి, హైదరాబాద్: కర్ణాటకలోని బెలగావిలో జరిగిన ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ (ఏఐటీఏ) పురుషుల టెన్నిస్ టోర్నమెంట్లో తెలంగాణకు చెందిన గణగామ నైశిక్ రెడ్డి సత్తా చాటాడు. డబుల్స్ విభాగంలో తన భాగస్వామి ప్రబీర్ చావ్డాతో కలిసి రన్నరప్గా నిలిచాడు. ఫైనల్లో రెండో సీడ్ ఓగేష్ జయప్రకాశ్–సూరజ్ ప్రబోధ్ జోడీ చేతిలో 3–6, 0–6తో నైశిక్–ప్రబీర్ జోడీ ఓటమి పాలయ్యింది.
అంతకముందు సెమీఫైనల్లోఈ జంట 6–2, 6–1తో ఆయుష్ శర్మ–ఆదిత్య మోర్ జోడీపై విజయం సాధించి ఫైనల్కు చేరుకుంది. ఇక ప్రీ క్వార్టర్ ఫైనల్లో ప్రబీర్ చావ్డా-నైశిక్రెడ్డి జోడీ 7–5, 6–2తో సోమ సుహాస్–కౌశిక్ అరుణ్కుమార్ జోడీపై విజయం సాధించిన సంగతి తెలిసిందే.
నైశిక్ రెడ్డి ప్రస్తుతం సురేష్ కృష్ణ టెన్నిస్ అకాడమీలో శిక్షణ పొందుతున్నారు. మాజీ ఒలింపియన్, డేవిస్ కప్ క్రీడాకారుడు విష్ణువర్ధన్ మార్గదర్శకత్వంలో తన ఆటతీరును మరింత మెరుగుపరుచుకుంటున్నాడు. బెలగావి టోర్నమెంట్లో రన్నరప్గా నిలవడం ద్వారా నైశిక్ మరోసారి తన సత్తాను చాటాడు.
Read: 'అతడో క్రికెట్ పిచ్చోడు; ద్రవిడ్ యజమానిలా ఫీలవుతున్నాడు'


