source: X
ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐకి ఓ కీలక పదవి కోసం సరైన వ్యక్తి దొరకడం లేదు. బెంగళూరు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో హెడ్-స్పోర్ట్స్ సైన్స్ అండ్ మెడిసిన్ పోస్ట్ కోసం భారత క్రికెట్ బోర్డు ఏడాదిగా అభ్యర్ది కోసం గాలిస్తూనే ఉంది. తాజాగా బోర్డు మరోసారి సదరు పోస్ట్ కోసం దరఖాస్తులు ఆహ్వానించింది.
నితిన్ పటేల్ 2025 మార్చిలో రాజీనామా చేసినప్పటికీ నుంచి ఈ పదవి ఖాళీగా ఉంది. అతడు దాదాపు మూడేళ్లు సేవలు అందించిన తర్వాత బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.
నితిన్ పటేల్ గతంలో జస్ప్రీత్ బుమ్రా, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, మహ్మద్ షమీల రిహాబిలిటేషన్ను పర్యవేక్షించి 2023 వన్డే ప్రపంచకప్కు వారు సిద్ధం కావడంలో కీలక పాత్ర పోషించాడు.
అర్హతలు
ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే వ్యక్తికి స్పోర్ట్స్ సైన్స్ లేదా సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. డాక్టరేట్ ఉంటే అదనపు అర్హతగా పరిగణిస్తారు.
అలాగే ప్రొఫెషనల్ లేదా ఒలింపిక్ క్రీడల్లో మల్టీ డిసిప్లినరీ పనితీరు బృందాలను నిర్వహించిన కనీసం ఐదేళ్ల వ్యూహాత్మక నాయకత్వ అనుభవం ఉండాలి. అభ్యర్థి వయసు 60 ఏళ్లలోపు ఉండాలి.
దరఖాస్తుదారులు సెప్టెంబర్ 30 సాయంత్రం 5 గంటల్లోపు ఆన్లైన్లో అప్లై చేయాలి. ఎంపికైన అభ్యర్థులను వ్యక్తిగత ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఈ అధికారి నేరుగా CoE హెడ్, మాజీ భారత బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్కు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
చదవండి: మరో 3 రోజుల్లో సిరీస్.. అంతలోనే టీమిండియా కీలక సభ్యుడి రాజీనామా!


