Indian cricket team
-
రాజకీయ కక్షతోనే నా పేరు తొలగించారు
బంజారాహిల్స్(హైదరాబాద్): ఉప్పల్ స్టేడియంలోని నార్త్ స్టాండ్కున్న తన పేరును తొలగించడంపై భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ విచారం వ్యక్తం చేశారు. నార్త్ స్టాండ్ నుంచి అజహరుద్దీన్ పేరును తొలగించాలంటూ అంబుడ్స్మెన్ జస్టిస్ ఈశ్వరయ్య ఆదేశించిన నేపథ్యంలో బంజారాహిల్స్లోని తన నివాసంలో ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.పదేళ్లపాటు ఇండియన్ క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా, 19 ఏళ్లు క్రికెటర్గా సేవలందించానని పేర్కొన్నారు. కొంత మంది కావాలని రాజకీయం చేసి లార్డ్స్ క్రికెట్ క్లబ్తో కోర్టుల్లో పిటిషన్¯ వేయించారని ఆరోపించారు. తనపై వచి్చన పలు ఆరోపణలను గతంలోనే కోర్టు కొట్టేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఒక హైదరాబాదీగా దేశం గర్వించే స్థాయికి ఎదిగానని, కుట్రలకు న్యాయపరంగా సమాధానం చెప్తానని అన్నారు. ఉదయం నుంచి తనకు వేలాదిగా తన అభిమానులు, శ్రేయోభిలాషులు ఫోన్లు చేస్తున్నారని, నార్త్ స్టాండ్స్కు తన పేరును తొలగించడాన్ని వారు ఖండిస్తున్నారని అన్నారు. ఆనాడు క్రికెట్ అభిమానుల కోరిక మేరకే తన పేరును స్టాండ్స్కు పెట్టారని గుర్తు చేశారు. అజారుద్దీన్ పేరు తొలగింపుపై అభిమానుల ఆందోళన.. క్రికెటర్ అజారుద్దీన్ పేరును ఉప్పల్ స్టేడియంలో నార్త్స్టాండ్ నుంచి తొలగించాలంటూ అంబుడ్స్మెన్ కోర్టు ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో అజారుద్దీన్ అభిమానులు బంజారాహిల్స్లో ధర్నా చేశారు. అజారుద్దీన్ను కావాలంనే కొంత మంది రాజకీయ కక్షలతో వేధిస్తున్నారని ఇలాగే కొనసాగితే హెచ్సీఏ ముందు తాము ఆందోళనలు చేస్తామని వారు హెచ్చరించారు. -
ఐపీఎల్ సమయంలోనూ ‘ఎర్రబంతి’తో...
ముంబై: భారత క్రికెట్ జట్టు చక్కటి ప్రదర్శనతో ఇప్పటికే చాంపియన్స్ ట్రోఫీలో సెమీస్ చేరింది. తమ స్థాయికి తగినట్లుగా ఆడితే టైటిల్ కూడా సాధించే అవకాశం ఉంది. ఈ టోర్నీ ముగిసిన వెంటనే ఆటగాళ్లంతా ఐపీఎల్ హడావిడిలో పడిపోతారు. తమ ఫ్రాంచైజీల తరఫున సత్తా చాటేందుకు సిద్ధమైపోతారు. అయితే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మాత్రం టీమిండియా ఇటీవలి టెస్టు ప్రదర్శనను పూర్తిగా మర్చిపోలేదు. సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో అనూహ్యంగా 0–3తో చిత్తయిన భారత్ ఆ తర్వాత ఆ్రస్టేలియాలో 1–3తో సిరీస్ కోల్పోయింది. ఇప్పుడు ఐపీఎల్ ముగిసిన వెంటనే టీమిండియా జూన్–జులైలో జరిగే ఐదు టెస్టుల సిరీస్లో తలపడేందుకు ఇంగ్లండ్ వెళ్లనుంది. ఈ కీలక సిరీస్కు ముందు అంతా ఐపీఎల్లోనే ఉంటారు కాబట్టి టెస్టుల సన్నద్ధతకు తగిన సమయమే లభించదు. గతంలో ఐపీఎల్ ముగిసిన వెంటనే ఇంగ్లండ్ వెళ్లిన సందర్భాల్లో (2011, 2014, 2018లలో) భారత్ చిత్తుగా ఓడి సిరీస్లు కోల్పోయింది. 2021 సిరీస్లో ముందంజలో నిలిచినా... కోవిడ్ కారణంగా కొద్ది రోజుల తర్వాత జరిగిన టెస్టుల ఓడి సిరీస్ను 2–2తో సమంగా ముగించింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ సమయంలోనూ భారత క్రికెటర్లు టెస్టులకు సిద్ధమయ్యేలా చూసే ప్రణాళికను బీసీసీఐ రూపొందిస్తోంది. పూర్తిగా టి20కే అంకితం కాకుండా టెస్టుల కోసం ఎర్రబంతితో సాధన చేసేలా చేయడమే దీని ఉద్దేశం. ఈ ప్రతిపాదన ప్రకారం టెస్టు జట్టులో సభ్యులైన భారత ఆటగాళ్లు రెండు నెలల పాటు పూర్తిగా ఐపీఎల్కే అంకితమైపోరు. ఒకవైపు ఐపీఎల్ ఆడుతూనే మరోవైపు రాబోయే టెస్టుల కోసం ప్రాక్టీస్ కొనసాగించాల్సి ఉంటుంది. దీని కోసం ప్రత్యేకంగా సెషన్లు ఉంటాయి. ఆటగాళ్లంతా ఇందులో పాల్గొనేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ముగిశాక దుబాయ్లో దీనికి సంబంధించి ఇప్పటికే బోర్డు అధికారులు చర్చించారు. చాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత జరిగే మరో సమావేశంలో ఈ అంశంపై పూర్తి స్పష్టత వస్తుంది. మొత్తంగా ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ను బోర్డు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ ముందుగానే సన్నాహాలు మొదలు పెడుతోంది. -
‘మరో సిరాజ్’ వేటలో...
సాక్షి, హైదరాబాద్: పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ గత కొంత కాలంగా భారత క్రికెట్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. పలు చిరస్మరణీయ విజయాల్లో భాగంగా ఉన్న అతను టి20 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో కూడా సభ్యుడు. ఎంతో మంది యువ ఆటగాళ్లతో పోలిస్తే అతని ప్రస్థానం ఎంతో ప్రత్యేకం. పేదరిక నేపథ్యం, ఆటోడ్రైవర్గా పని చేసే తండ్రి, కనీస ఖర్చులకు కూడా ఇబ్బంది పడే స్థితి నుంచి అతను అంతర్జాతీయ క్రికెటర్గా ఎదిగాడు.ఒకదశలో షూస్ కూడా కొనుక్కోలేకపోయిన అతను డబ్బుల కోసం టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడేవాడు. ఆ తర్వాత కేవలం తన కఠోర శ్రమ, పట్టుదలతో పైకి ఎదిగాడు. ఇప్పుడు అలాంటి సిరాజ్లను వెతికి సానబెట్టేందుకు భారత మాజీ క్రికెటర్, మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ప్రత్యేకంగా నగరంలోని పాతబస్తీలో ఉన్న పేద పేస్ బౌలర్ల కోసం ఒక ప్రతిభాన్వేషణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ‘హూ ఈజ్ అవర్ నెక్స్ట్ సిరాజ్’ పేరుతో ఈ కార్యక్రమం ఎమ్మెస్కే ప్రసాద్ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎంఎస్కేఎస్ఐసీఏ) ఆధ్వర్యంలో జరిగింది. దీనికి స్వయంగా సిరాజ్ హాజరై తన అనుభవాలను పంచుకున్నాడు. కెరీర్లో ఎదిగే క్రమంలో తనకు ఎదురైన కష్టాలను గుర్తు చేసుకున్న అతను... ప్రతిభావంతులైన కుర్రాళ్లు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని భవిష్యత్తులో గొప్ప బౌలర్లుగా ఎదగాలని ఆకాంక్షించాడు. అత్తాపూర్లోని విజయానంద్ గ్రౌండ్స్లో జరిగిన ఈ ప్రతిభాన్వేషణ కార్యక్రమాన్ని హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ ప్రారంభించారు. ఇలాంటి ప్రయత్నాలు క్రికెట్ను కెరీర్గా తీసుకోవాలనుకునే యువ ఆటగాళ్లలో స్ఫూర్తిని నింపుతాయని, ప్రతిభ గలవారిని తీర్చిదిద్దుతున్న ఎమ్మెస్కే ప్రసాద్ను ప్రత్యేకంగా అభినందించారు. తన బాల్య స్నేహితుడు మునీర్ అహ్మద్, కోచ్ రహ్మతుల్లా బేగ్ గౌరవార్ధమే ప్రత్యేకంగా పాతబస్తీ క్రికెటర్ల కోసం ‘హూ ఈజ్ అవర్ నెక్స్ట్ సిరాజ్’ కార్యక్రమాన్ని లాభాపేక్ష లేకుండా నిర్వహించేందుకు సిద్ధమైనట్లు ఎమ్మెస్కే చెప్పారు. సుమారు 400 మంది యువ పేస్ బౌలర్లు ఈ ట్రయల్స్కు హాజరవుతున్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర మాజీ క్రికెటర్లు షహాబుద్దీన్, ఫసీర్ రహమాన్, సత్యప్రసాద్, మనోజ్సాయి, ప్రకాశ్బాబు, అమానుల్లా ఖాన్లతో పాటు టీఎన్జీఏ ప్రధాన కార్యదర్శి ముజీబ్ తదితరులు పాల్గొన్నారు. -
T20 World Cup 2025: శ్రీలంకను చిత్తు చేసిన భారత్.. సూపర్ సిక్స్లోకి ఎంట్రీ
అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్లో భారత్ వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్-ఏలో భాగంగా శ్రీలంకతో ఇవాళ (జనవరి 23) జరిగిన చివరి గ్రూప్ స్టేజీ మ్యాచ్లో భారత్ 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ గ్రూప్-ఏ టాపర్గా నిలిచి సూపర్ సిక్స్కు అర్హత సాధించింది.మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. ఓపెనర్ గొంగడి త్రిష (44 బంతుల్లో 49; 5 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్ ఆడి టీమిండియా గౌరవప్రదమైన స్కోర్ సాధించేలా చేసింది. త్రిషతో పాటు భారత్ ఇన్నింగ్స్లో కెప్టెన్ నికీ ప్రసాద్ (11), మిథిలా వినోద్ (16), వీజే జోషిత (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. జి కమలిని 5, సినిక ఛల్కే 0, భవిక అహిరే 7, ఆయుషి శుక్లా 5, పరునిక సిసోడియా ఒక్క పరుగు చేసి ఔటయ్యారు. షబ్నమ్ షకీల్ (2), వైష్ణవి శర్మ (1) అజేయంగా నిలిచారు. లంక బౌలర్లలో ప్రముది మెత్సర, లిమాంస తిలకరత్న, అసెని తలగుణే తలో 2 వికెట్లు పడగొట్టగా... రష్మిక సేవండి, చమోది ప్రభోద, కెప్టెన్ మనుడి ననయక్కార తలో వికెట్ దక్కించుకున్నారు.119 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంకను భారత బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టారు. వైష్ణవి శర్మ (4-1-3-1), షబ్నమ్ షకీల్ (4-1-9-2), పరునిక సిసోడియా (4-0-7-2), విజే జోషిత (3-0-17-2), ఆయుషి శుక్లా (4-0-13-1) ధాటికి శ్రీలంక నిర్ణీత ఓవర్లు బ్యాటింగ్ చేసి కేవలం 58 పరుగులు మాత్రమే చేయగలిగింది. వైష్ణవి శర్మ సంధించిన బంతులను ఎదుర్కోలేక లంక బ్యాటర్లు నానా అవస్థలు పడ్డారు. లంక ఇన్నింగ్స్లో ఒకే ఒక్కరు (రష్మిక (15)) రెండంకెల స్కోర్ చేశారు. మిగతా 10 మంది ఆటగాళ్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.కాగా, ఈ టోర్నీలో భారత్.. వెస్టిండీస్, మలేసియా, శ్రీలంక జట్లపై ఘన విజయాలు సాధించి సూపర్-6లోకి ప్రవేశించింది. గ్రూప్-ఏలో భారత్, శ్రీలంక, వెస్టిండీస్ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. మిగతా గ్రూప్ల విషయానికొస్తే.. గ్రూప్-బిలో ఇంగ్లండ్, యూఎస్ఏ, ఐర్లాండ్.. గ్రూప్-సిలో సౌతాఫ్రికా, నైజీరియా, న్యూజిలాండ్.. గ్రూప్-డిలో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, స్కాట్లాండ్ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. -
‘ఈడెన్’లో టీమిండియా సాధన
కోల్కతా: ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత క్రికెట్ జట్టు... ఇంగ్లండ్తో పరిమిత ఓవర్ల సిరీస్ కోసం జోరుగా ప్రాక్టీస్ చేస్తోంది. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ల టి20 సిరీస్లో భాగంగా బుధవారం ఈడెన్ గార్డెన్స్లో తొలి పోరు జరగనుంది. ఈ నేపథ్యంలో ఆదివారం టీమిండియా హెడ్ కోచ్ గంభీర్ పర్యవేక్షణలో ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంది. గాయం కారణంగా ఏడాదికి పైగా జాతీయ జట్టుకు దూరమైన సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ ప్రాక్టీస్లో ఆకట్టుకున్నాడు. మూడు గంటలకు పైగా సాగిన ప్రాక్టీస్ సెషన్లో ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, శుబ్మన్ గిల్, హార్దిక్పాండ్యా, హర్షిత్ రాణా, తిలక్ వర్మ, అభిషేక్ శర్మ తదితరులు ప్రాక్టీస్ చేశారు. -
Gongadi Trisha: మహిళల క్రికెట్లో రైజింగ్ స్టార్
బ్యాటింగ్లో నిలకడ, షాట్లలో కచ్చితత్వం, క్రీజులో నిలిస్తే చక్కని ఇన్నింగ్స్లు ఆడగలిగే నేర్పరితనం... ఇవన్నీ ఆ అమ్మాయి సొంతం. మిథాలీ రాజ్ తర్వాత జాతీయ సీనియర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించే సత్తా తనలో ఉందని ఆటద్వారా చాటి చెప్పుకుంటున్న టీనేజ్ సెన్సేషన్ గొంగడి త్రిష, తెలంగాణకు చెందిన 19 ఏళ్ల త్రిష ఆదివారం మలేసియాలో ముగిసిన ఆసియా అండర్–19 టోర్నీలో భారత జట్టు విజేతగా నిలిచేందుకు కీలకపాత్ర పోషించింది. దొరై రాజ్ (మిథాలీ రాజ్), హర్మేందర్ సింగ్ భుల్లర్ (హర్మన్ప్రీత్ కౌర్), శ్రీనివాస్ మంధాన (స్మృతి), ఇవాన్ రోడ్రిగ్స్ (జెమీమా), సంజీవ్ వర్మ (షఫాలీ వర్మ) వీరంతా తమ గారాల తనయల కోసం తపించారు. భారత్ క్రికెట్లో భాగమయ్యేందుకు కుమార్తెలతో పాటు కలలు కని శ్రమించి సాధించారు. వీరిలాగే తెలంగాణకు చెందిన గొంగడి రామిరెడ్డి కూడా తన ఒక్కగానొక్క బిడ్డ (త్రిష) కోసం పుట్టిన గడ్డ (భద్రాచలం)ను వీడి హైదరాబాద్ వచ్చారు. క్రికెట్లో ఓనమాలు మొదలు అకాడమీలో శిక్షణ కోసం తన స్తోమతకు మించే ఖర్చు చేశారు. తండ్రి కష్టం చూసిన తనయ త్రిష ఆ కళ్లలో ఆనందం నింపాలని నెట్స్లో సాధన చేసింది. క్రికెట్లో రాటుదేలింది. మైదానంలో రాణిస్తోంది. తాజాగా కౌలాలంపూర్లో బంగ్లాదేశ్తో ఆదివారం జరిగిన ఆసియా అండర్–19 మహిళల టి20 టోర్నీ ఫైనల్లో త్రిష (47 బంతుల్లో 52; 5 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధసెంచరీతో అదరగొట్టి భారత జట్టును విజేతగా నిలిపింది.అంతేకాకుండా ‘ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్’తోపాటు ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డులు సొంతం చేసుకుంది. గతేడాది దక్షిణాఫ్రికాలో జరిగిన అండర్–19 మహిళల తొలి టి20 ప్రపంచకప్లో విజేతగా నిలిచిన భారత జట్టులోనూ త్రిష సభ్యురాలిగా ఉంది. భద్రాచలంలో ఓ ఫిట్నెస్ ట్రెయినర్గా పనిచేసే రామిరెడ్డి తన కుమార్తెను అంతర్జాతీయ క్రికెటర్గా చూడాలనుకున్నారు. అందుకు భద్రాచలంలో ఉంటే సరిపోదని గుర్తించిన వెంటనే 2013లో సికింద్రాబాద్లోని ఈస్ట్ మారేడ్పల్లికి మకాం మార్చారు. అక్కడ్నుంచి కోచింగ్ సెంటర్కు తీసుకెళ్లడం... ఆమె ఆటపై పట్టుదల కనబరచడం, క్రమంగా ప్రతిభగల క్రికెటర్గా మారడం సజావుగా జరిగిపోయాయి. కానీ ఎన్నో ఆశలు పెట్టుకున్న డబ్ల్యూపీఎల్ వేలమే ఆ తండ్రిని కాస్త నిరాశపరిచింది. క్రితంసారి మెగా వేలంలో అన్సోల్డ్ క్రికెటర్గా మిగిలిపోవడం... ఇటీవల జరిగిన మినీ వేలంలోనూ ఫ్రాంచైజీలు త్రిషను మరోసారి విస్మరించడంతో నిరుత్సాహం కలిగింది. అయితే త్రిష నిలకడగా ఆడుతున్న తీరును బట్టి భవిష్యత్లో ఆమెపై ఫ్రాంచైజీలు తప్పకుండా దృష్టి సారిస్తాయనడంలో సందేహం లేదు. హైదరాబాద్లోని సెయింట్ జాన్స్ క్రికెట్ అకాడమీలో క్రికెట్లో ఓనమాలు నేర్చుకున్న ఆమె అచిరకాలంలోనే పిన్న వయసులో తెలంగాణ రాష్ట్ర అండర్–19 జట్టు తరఫున స్కూల్ గేమ్స్ సమాఖ్య పోటీల్లో రాణించిన ఆమె కీలక బ్యాటింగ్ ఆల్రౌండర్గా రాణించింది. 2014–15 సీజన్లో హైదరాబాద్ అండర్–19 తరఫున ఇంటర్ స్టేట్ టోర్నమెంట్లో పాల్గొంది. అక్కడి నుంచి హైదరాబాద్, సౌత్జోన్ అండర్–19 జట్లలో రెగ్యులర్ ప్లేయర్గా మారింది.గత రెండేళ్లుగా భారత అండర్–19 జట్టులో ఓపెనర్గా రాణిస్తోంది. టాపార్డర్ బ్యాటర్ అయిన త్రిష లెగ్స్పిన్ బౌలర్ కూడా! క్రమం తప్పకుడా బౌలింగ్ కూడా వేస్తుంది. ఆదివారం బంగ్లాదేశ్తో జరిగిన తుదిపోరులో వికెట్ తీయకపోయినా (3–0–10–0)తో కుదురుగా బౌలింగ్ చేసింది. 2023లో అండర్–19 మహిళల టి20 ప్రపంచకప్ సాధించిన భారత జట్టులో సభ్యురాలిగా ఉన్న త్రిష దురదృష్టవశాత్తూ మహిళల ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీల కంటబడటం లేదు. గతేడాది ఆమెను మెగా వేలంలో ఎవరూ పట్టించుకోలేదు. మొన్న మినీ వేలంలోనూ విస్మరించారు. అయినా... త్రిష నిరాశలో కూరుకుపోలేదు. తనపని తాను చేసుకుపోతోంది. రైజింగ్ స్టార్గా ఎదుగుతున్న త్రిష హైదరాబాద్ నుంచి మరో మిథాలీ రాజ్ కావాలని ఆశిద్దాం. – సాక్షి క్రీడా విభాగం -
‘పాక్కు మోదీ వెళ్లొచ్చు.. టీమిండియా వెళ్లకూడదా?’
పాట్నా : వచ్చే ఏడాది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యమిస్తుండగా.. ఆ దేశంలో పర్యటించేందుకు భారత్ నిరాకరించింది. ఈ నిర్ణయంపై రాజకీయం వివాదం రాజుకుంది. ఈ నిర్ణయాన్ని మాజీ క్రికెటర్, రాష్ట్రీయ జనతాదళ్ నేత తేజస్వి యాదవ్ తప్పుబట్టారు. బిర్యానీ తినేందుకు ప్రధాని మోదీ పాకిస్థాన్కు వెళ్లొచ్చు. కానీ భారత క్రికెర్లు అక్కడకు వెళ్లి క్రికెట్ ఆడకూడదా? అని ప్రశ్నించారు. క్రీడలకు రాజకీయాలను ఉంచాలని కేంద్రాన్ని కోరారు. ‘క్రీడల్లో రాజకీయాలు ఉండకూడదు.. వాళ్లు (పాకిస్తాన్) మన దేశానికి రావాలి. మన ఆటగాళ్లు పాకిస్థాన్కి వెళ్లాలి. క్రీడలతో సమస్య ఏంటి? దాయాది దేశాల మధ్య క్రీడలు జరుగుతుంటే యుద్ధం జరుగుతున్నట్లు కాదుగా అని అన్నారు. మోదీ బిర్యానీ తినేందుకు పాక్కు వెళితే మంచి విషయం. కానీ భారత క్రికెట్ టీమ్ వెళితే తప్పా? అని ప్రశ్నించారు. రాష్ట్ర స్థాయి క్రికెట్లో జార్ఖండ్కు ప్రాతినిధ్యం వహించిన తేజస్వి ప్రధాని హోదాలో ప్రధాని మోదీ 2015లో పాకిస్తాన్ లోని లాహోర్ నగరంలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆ దేశ ప్రధానితో కలిసి మోడీ విందు చేశారు. ఈ పర్యటనను ఉద్దేశిస్తూ తేజస్వీ యాదవ్ పై విధంగా కామెంట్స్ చేశారు. ఇదిలా ఉంటే.. భారత క్రికెట్ జట్టు చివరిసారిగా 2008లో పాకిస్థాన్లో పర్యటించింది. ఇక అప్పటి నుండి టీమిండియా మళ్లీ పాక్కు వెళ్లలేదు. చిరకాల ప్రత్యర్థులు చివరిసారిగా 2012-13లో భారత్లో ద్వైపాక్షిక సిరీస్ ఆడారు. -
ఆత్మపరిశీలన అవసరం!
సొంతగడ్డపై చిరకాలంగా భారత క్రికెట్ జట్టు అజేయమైనదనే రికార్డు కుప్పకూలింది. భారత పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్ చేతిలో మనవాళ్ళు మొత్తం 3 టెస్టుల్లోనూ ఓటమి పాలయ్యారు. స్వదేశంలో టెస్ట్సిరీస్ను ఇలా 0–3 తేడాతో చేజార్చుకోవడం భారత క్రికెట్చరిత్రలో ఇదే ప్రథమం. కాగా, ఈ సిరీస్ పరాభవంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ర్యాంకింగుల్లో భారత్ అగ్రస్థానం ఆస్ట్రేలియాకు కోల్పోయి, ద్వితీయ స్థానానికి పడిపోయింది. ఆటలో గెలుపోటములు సహజమైనా, ఈ స్థాయి పరాజయం భారత జట్టు అత్యవసరంగా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. టీ20ల మోజులో పడి టెస్ట్ క్రికెట్కు అవసరమైన కనీసపాటి సన్నద్ధత అయినా లేకుండానే బరిలోకి దిగిన మన ఆటగాళ్ళ నిర్లక్ష్యాన్ని నిలదీస్తోంది. ఆఖరుసారిగా 2012లో ఇంగ్లండ్కు చెందిన అలస్టయిర్ కుక్ చేతిలో ధోనీ సేన 2–1 తేడాతో టెస్ట్ సిరీస్లో ఓటమి పాలైన తర్వాత గత పుష్కరకాలంగా భారత క్రికెట్ జట్టు స్వదేశంలో ఎన్నడూ మళ్ళీ సిరీస్ను కోల్పోలేదు. భారత జట్టు సారథులు మారుతూ వచ్చినా, 18 టెస్ట్ సిరీస్లలో విజయం మనదే. కివీస్పైనా ఆ ట్రాక్ రికార్డ్ కొనసాగుతుందని అందరూ భావించిన నేపథ్యంలో ఇది ఊహించని ఎదురుదెబ్బ. గత నెలలో బెంగుళూరులో 8 వికెట్ల తేడాతో తొలి టెస్ట్, ఆ వెంటనే పుణేలో 113 పరుగుల తేడాతో మలి టెస్ట్ ఓడిపోయినప్పుడే సిరీస్ చేజారింది. అయితే, ముంబయ్లో జరుగుతున్న ఆఖరి టెస్ట్లోనైనా గెలిచి, భారత జట్టు పరువు నిలుపుకొంటుందని ఆశించారు. చివరకు ఆ ఆశను కూడా వమ్ము చేసి, కివీస్ ముందు మన ఆటగాళ్ళు చేతులెత్తేయడం ఇప్పుడిప్పుడే మర్చిపోలేని ఘోర పరాభవం. ముంబయ్లో 147 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సైతం ఛేదించలేక ఆదివారం భారత జట్టు 121 పరుగులకే ఆలౌట్ అవడంతో, అవమానకరమైన రీతిలో 0–3 తేడాతో సిరీస్ను పోగొట్టుకోవాల్సి వచ్చింది. కచ్చితంగా ఇది భారత జట్టుకు మేలుకొలుపు. భారత జట్టు వ్యూహరచన లోపాలు కొల్లలు. కివీస్తో బెంగుళూరు టెస్ట్లో టాస్ గెలిచాక మన వాళ్ళు మొదట బ్యాటింగ్ ఎంచుకోవడం అలాంటిదే. బ్యాట్స్మన్ల ఆర్డర్లో అనూహ్య ప్రయోగాల సంగతీ అంతే. ఇక, అవసరం లేకున్నా పుణేలో బంతి సుడులు తిరిగేలా పిచ్ రూపొందించారు. అదీ ప్రత్యర్థి జట్టుకే లాభించింది. కాబట్టి, భారత జట్టులోని మేధాబృందం ఆగి, ఆలోచించాలి. సిరీస్కు ముందు దులీప్ ట్రోఫీలో ఆడాలని చెప్పినా, మరిన్ని వసతుల కోసం అనంతపురం నుంచి బెంగు ళూరుకు వేదిక మార్చినా అగ్రశ్రేణి ఆటగాళ్ళు ముందుకు రాకపోవడం ఘోరం. వారిని అందుకు అనుమతించడం ఒక రకంగా క్రికెట్ బోర్డ్ స్వయంకృతాపరాధమే. దాని పర్యవసానం, సిరీస్ భవిత తొలి టెస్ట్, తొలి ఇన్నింగ్స్లో 46 పరుగుల అత్యల్పస్కోర్కి భారత్ అవుటైనప్పుడే అర్థమైపోయింది. స్పిన్ ఆడడంలో భారత ఆటగాళ్ళు దిట్టలని ప్రతీతి. కానీ, అదంతా గతం. ఇప్పుడు పరిస్థితి మారింది. జట్టులో బెస్ట్ బ్యాట్స్మెన్ అయిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఇద్దరూ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్లో తరచూ ఔటవుతున్నారనీ, 2021 – 2024 మధ్య సొంత గడ్డపైన స్పిన్ బౌలింగ్లో సాధించిన సగటు పరుగులు 30 మాత్రమేననీ విశ్లేషకులు లెక్కలు తీశారు. అసాధారణ స్పిన్నర్లు కాకున్నా, కివీస్ బౌలర్ల చేతుల్లో భారత ఆటగాళ్ళు టకటకా ఔటవడం చూస్తే, స్పిన్లో మనం మాస్టర్లం కాదని తాజా సిరీస్ ఎత్తిచూపినట్టయింది. అలాగే, ఎర్ర బంతితో ఆడే టెస్ట్లకూ, తెల్ల బంతితో నడిచే టీ20 లకూ మధ్య చాలా తేడా ఉందని ఆటగాళ్ళు గ్రహించాలి. అన్ని బంతులూ ఆడి తీరాలి, పరుగులు చేయాలనే టీ20ల ధోరణితోనే టెస్ట్లు ఆడితే చిక్కులు తప్పవు. 2021లో టెస్ట్ ఓపెనర్గా ఇంగ్లండ్లో సక్సెస్ సాధించిన రోహిత్ మార్చుకున్న టీ20 ధోరణితోనే కివీస్పై ఆడడం వల్ల ఇబ్బంది పడ్డారు. కెప్టెన్గా ఆయనే పరుగులు చేయకపోతే, జట్టు పైన, ఆయన సారథ్యంపైన ఒత్తిడి తప్పదు. గతంలో 2011–12 ఆస్ట్రేలియా పర్యటన భారత జట్టు నుంచి ద్రావిడ్, లక్ష్మణ్ల రిటైర్మెంట్కు దారి తీసింది. చరిత్ర పునరావృతమై, ఇప్పుడు రానున్న టూర్ కోహ్లీ, రోహిత్లకు చివరిది అవుతుందా? చెప్పలేం. అనూహ్యంగా వారిద్దరూ విఫలమైన కివీస్ సిరీస్ పరిస్థితే ఆస్ట్రేలియా టూర్ లోనూ ఎదురైతే, సీనియర్లు రిటైర్ కావాలంటూ ఒత్తిడి పెరుగుతుంది. ఇక, వచ్చే వరల్డ్ టెస్ట్ ఛాంపి యన్ షిప్ విషయానికొస్తే, కివీస్ సిరీస్ దెబ్బతో వరల్డ్ టెస్ట్ ర్యాకింగుల్లో మన స్థానం పడిపోయినందున భారత్ ఫైనల్కు చేరడం కష్టమే. ఇంకా చెప్పాలంటే, ఆస్ట్రేలియాను దాని సొంత గడ్డపై 4–0 తేడాతో ఓడిస్తే కానీ, మన ఫైనల్ ఆశ పండదు. ఏ రకంగా చూసినా అసాధ్యమే. ఈ పరిస్థితుల్లో ఆస్ట్రేలియా టూర్లోనైనా మన జట్టు మితిమీరిన ఆలోచనలు, అంచనాలు పక్కనబెట్టి కేవలం ఆడు తున్న టెస్టులపై ఒకదాని వెంట మరొకటిగా దృష్టి పెడితే మేలు. పరిస్థితులు, పిచ్ స్వభావాన్ని బట్టి అప్పటికప్పుడు ఆట తీరును మలుచుకోవాలే తప్ప, ముందుగానే ఓ నిర్ణయానికి వచ్చి దూకుడు చూపుదామనుకుంటే చిక్కే. మారకపోతే మళ్ళీ కివీస్తో సిరీస్లో లాగా బోర్లా పడక తప్పదు. నిజానికి, భారత్ ఇప్పటికీ మంచి జట్టే. ఆటగాళ్ళలో ప్రతిభకు కొదవ లేదు. అయితే, టాలెంట్ ఎంత ఉన్నా ఆటలో టెంపర్మెంట్ ముఖ్యం. వాటికి తోడు కింద పడినా మళ్ళీ పైకి లేచి సత్తా చాటే చేవ కీలకం. మన జట్టు ఇప్పుడు వీటిని ప్రదర్శించాలి. అందుకోసం తాజా సిరీస్ ఓటమికి కారణాలను ఆత్మపరిశీలన చేసుకోవాలి. భారత క్రికెట్ చరిత్రలో ఎన్నడూ లేనట్లుగా 3–0 తేడాతో సిరీస్ను కోల్పోయి, ఈ అధఃపాతాళానికి ఎలా పడిపోయామో స్వీయ విశ్లేషణ జరుపుకోవాలి. టీ20 వరల్డ్ కప్లో విజేతగా నిలిచిన ఆనందాన్ని మర్చిపోక ముందే ఈ పరాజయాన్ని ఎలా కోరి కొని తెచ్చుకున్నామో విశ్లేషించుకోవాలి. ఎంతైనా, పరాజయాలే విజయాలకు మొదటి మెట్టు కదా! -
రాక్స్టార్ రవీంద్ర జడేజా
భారత క్రికెట్ జట్టులోకి తొలిసారి అడుగు పెట్టినప్పుడు రవీంద్ర జడేజా వయసు 21 ఏళ్లు. అతని ఆట మెరుగ్గానే ఉన్నా అతని వ్యవహారశైలిపై అందరికీ సందేహాలు ఉండేవి. ఐపీఎల్లో మంచి ప్రదర్శనతో గుర్తింపు తెచ్చుకొని జట్టులోకి వచ్చిన జడేజాలోని ‘యూత్’ లక్షణాలు టీమిండియా డ్రెస్సింగ్ రూమ్లో చాలా మందికి కొత్తగా అనిపించాయి. కానీ పదిహేనేళ్ల అంతర్జాతీయ కెరీర్ తర్వాత అతను భారత అత్యుత్తమ ఆల్రౌండర్లలో ఒకడిగా కనిపించసాగాడు. ‘రాక్స్టార్’ అనే ముద్దు పేరుతో మొదలైన అతని ప్రస్థానం టీమిండియా అద్భుత విజయాలకు చుక్కానిగా నిలిచింది. కెరీర్ ఆరంభంలో వన్డే, టి20 ఆటగాడిగానే ముద్ర పడినా కఠోర శ్రమ, పట్టుదలతో ఎరుపు బంతిపై పట్టు సాధించిన జడేజా ఇప్పుడు టెస్టు క్రికెట్లో కూడా అరుదైన మైలురాయిని అందుకున్నాడు. 92 ఏళ్ల చరిత్ర ఉన్న భారత టెస్టు క్రికెట్లో 300కు పైగా వికెట్లు తీసిన ఏడుగురు ఆటగాళ్లలో ఒకడిగా తన పేరును లిఖించుకున్నాడు. అంతేకాదు.. ప్రపంచవ్యాప్తంగా 3 వేల పరుగులు సాధించి, 300 వికెట్లు తీసిన 11 మందిలో ఒకడిగా ఉన్నాడు. ప్రతికూలతలను అధిగమించి..సెంచరీ లేదా హాఫ్ సెంచరీ సాధించినప్పుడు కత్తిసాము తరహాలో తన బ్యాట్ను తిప్పుతూ జడేజా చేసే విన్యాసం భారత అభిమానులందరికీ సుపరిచితమే. రాజపుత్రుల కుటుంబానికి చెందిన అతను తన సంబరాన్ని ఇలా ప్రదర్శిస్తూ ఉంటాడు. అయితే పేరుకు అలాంటి నేపథ్యం ఉన్నా జడేజా జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు. అవి అతనిలో పోరాట పటిమను పెంచి, మానసికంగా దృఢంగా మార్చాయి. అతి సాధారణ కుటుంబం అతనిది. వాచ్మన్గా పనిచేసే తండ్రి తన కుమారుడు తొందరగా ఆర్మీలో ఒక సిపాయి ఉద్యోగంలో చేరితే చాలు.. ఆర్థికంగా గట్టెక్కుతామనే ఆలోచనతో ఉండేవాడు. కానీ జడేజా మాత్రం భిన్న మార్గాన్ని ఎంచుకున్నాడు. తనకెంతో ఇష్టమైన క్రికెట్లోనే ఏదైనా చేసి చూపిస్తాననే పట్టుదల కనబరచి తండ్రిని ఒప్పించగలిగాడు. అతనికి తల్లి కూడా మద్దతు పలికింది. అయితే ఆటలో జడేజా ఎదుగుతున్న సమయంలోనే ఒక ప్రమాదంలో తల్లి చనిపోయింది. అప్పుడు అతని వయసు 16 ఏళ్లు. ఆ బాధలో క్రికెట్కు గుడ్బై చెబుదామనుకున్నాడు. కానీ తండ్రి అండగా నిలవడంతో క్రికెట్పై మళ్లీ శ్రద్ధపెట్టాడు. దేశవాళీలో చెలరేగి..యూత్ క్రికెట్లో సౌరాష్ట్ర జట్టు తరఫున చెలరేగిన జడేజా ఆట అతనికి భారత అండర్–19 జట్టులో చోటు కల్పించింది. 2006లో రన్నరప్గా నిలిచిన జట్టులో భాగంగా ఉన్న జడేజా.. 2008లో విరాట్ కోహ్లీ నేతృత్వంలో టైటిల్ నెగ్గిన టీమ్లో కీలక సభ్యుడిగా సత్తా చాటాడు. ఆరు మ్యాచ్లలో అతను తీసిన 10 వికెట్లు జట్టుకు విజయాలను అందించాయి. ఫలితంగా 2008లో జరిగిన తొలి ఐపీఎల్లో ప్రతిభ గల వర్ధమాన ఆటగాడిగా రాజస్థాన్ రాయల్స్ టీమ్లో చోటు దక్కించుకున్నాడు. రాజస్థాన్ ఐపీఎల్ విజేతగా నిలవడంతో జడేజాకు కూడా మంచి గుర్తింపు దక్కింది. ఇక్కడే షేన్వార్న్ అతనికి రాక్స్టార్ అంటూ పేరు పెట్టాడు. అయితే ఉడుకు రక్తం ఉప్పొంగే 20 ఏళ్ల వయసులో సరైన మార్గనిర్దేశనం లేకుండా అతను చేసిన తప్పుతో వివాదానికి కేంద్రంగా నిలిచాడు. ఒక జట్టుతో కాంట్రాక్ట్లో ఉండగానే ఎక్కువ మొత్తం కోసం మరో జట్టుతో ఒప్పందం కుదుర్చుకునే ప్రయత్నం చేయడం బీసీసీఐకి ఆగ్రహం తెప్పించింది. దాంతో ఏడాది నిషేధం విధించడంతో 2009 ఐపీఎల్కు అతను దూరమయ్యాడు. ఐపీఎల్కు రెండు నెలల ముందే కేవలం ప్రతిభ కారణంగా భారత జట్టు తరఫున తొలి వన్డే, తొలి టి20 అవకాశం రావడం అతనికి కలిగిన ఊరట. అయితే ఆ నిషేధం వ్యక్తిగా కూడా అతను మెరుగుపడే అవకాశాన్నిచ్చింది. 2012 ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో చేరడం జడేజా కెరీర్ను మలుపు తిప్పింది. ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్నాడు. చెన్నై టీమ్ మూల స్తంభాల్లో ఒకడిగా నిలిచాడు. టీమ్ తరఫున మూడు టైటిల్స్ విజయాల్లో భాగంగా ఉన్నాడు. దశాబ్దంన్నర కాలంలో భారత్ తరఫున ఆడిన 197 వన్డేలు, 74 టి20 మ్యాచ్లు పరిమిత ఓవర్ల క్రికెట్లో అతని విలువను చూపించాయి. టెస్టుల్లో సూపర్ హీరోగా..వన్డేలు, టి20లతో పోలిస్తే టెస్టు క్రికెట్లో జడేజా సాధించిన ఘనతలు అసాధారణమైనవి. రంజీ ట్రోఫీలో ఏకంగా మూడు ట్రిపుల్ సెంచరీలు సాధించిన ఏకైక భారతీయుడిగా అతను రికార్డు నెలకొల్పాడు. ప్రపంచ క్రికెట్లో అతనికి ముందు మరో ఏడుగురు మాత్రమే ఇలాంటి ఫీట్ను సాధించారు. ఆ జోరులో 2012లో జడేజా భారత టెస్టు జట్టులోకి తొలిసారి ఎంపికయ్యాడు. ఈ పుష్కర కాలంలో జడేజా ఒంటి చేత్తో జట్టుకు అందించిన విజయాలు ఎన్నో. తన లెఫ్టార్మ్ స్పిన్తో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టిపడేసి చకచకా వికెట్లు పడగొట్టడం.. లేదంటే లోయర్ ఆర్డర్లో తన బ్యాటింగ్తో కీలక పరుగులతో జట్టుకు భారీ స్కోరు అందించడం.. ఇలా ఏదో రూపంలో అతని భాగస్వామ్యం లేని టెస్టులు దాదాపుగా లేవంటే అతిశయోక్తి కాదు. జట్టులో మరో సహచరుడు, అగ్రశ్రేణి స్పిన్నర్గా అశ్విన్ను దాటి కూడా కొన్నిసార్లు ఏకైక స్పిన్నర్గా టీమ్లో అవకాశాన్ని దక్కించుకోగలిగాడంటే జడేజా సత్తాపై టీమ్ మేనేజ్మెంట్కున్న నమ్మకం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఆస్ట్రేలియాపై వరుసగా రెండు సిరీస్లలో 24, 25 చొప్పున, దక్షిణాఫ్రికాపై 23, ఇంగ్లండ్పై 26.. ఇలా సొంతగడ్డపై సిరీస్ ఏదైనా ప్రత్యర్థిని కుప్పకూల్చడం జడేజాకు మంచినీళ్లప్రాయంలా మారింది. అనిల్ కుంబ్లే (1993) తర్వాత ఐసీసీ టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్లో నంబర్వన్గా తొలి భారత బౌలర్గా జడేజా గుర్తింపు తెచ్చుకున్నాడు.∙మొహమ్మద్ అబ్దుల్ హాది -
IPL 2025: ఐపీఎల్లో విలువ పెరిగింది
భారత క్రికెట్ జట్టు తరఫున అంతర్జాతీయ మ్యాచ్ ఆడాలనేది ప్రతీ యువ క్రికెటర్ కల. ప్రతిభకు తోడు శ్రమ, పట్టుదల, పోరాటంతో సత్తా చాటి గుర్తింపు తెచ్చుకున్న ఇద్దరు కుర్రాళ్లకు ఆదివారం అలాంటి గొప్ప అవకాశం వచి్చంది. ఆంధ్రప్రదేశ్ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, ఢిల్లీ పేస్ బౌలర్ మయాంక్ యాదవ్ బంగ్లాదేశ్తో తొలి టి20 మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేశారు. ఇప్పుడు ఈ ఇద్దరు ఆటగాళ్ల టీమిండియా తరఫున ‘బ్లూ జెర్సీ’లో ఆడటం మాత్రమే కాదు... వచ్చే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కూడా తమ విలువను అమాంతం పెంచుకున్నారు. వీరిద్దరిని వచ్చే సీజన్ కోసం భారీ మొత్తం చెల్లించి ఆయా ఫ్రాంచైజీలు కొనసాగిస్తాయా అనేది ఆసక్తికరం. ఐపీఎల్–2025 వేలానికి ముందు ఫ్రాంచైజీలు తాము కొనసాగించే ఆటగాళ్ల పేర్లను వెల్లడించేందుకు ఈ నెల 31 వరకు గడువు విధించారు. ఆదివారం బంగ్లాదేశ్తో జరిగిన తొలి టి20 మ్యాచ్లో నితీశ్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టారు. ఈ సిరీస్కు ముందు వరకు వీరిద్దరు ‘అన్క్యాప్డ్’ ప్లేయర్లే. ఇప్పుడు భారత్కు ప్రాతినిధ్యం వహించడంతో ‘క్యాప్డ్’ ప్లేయర్లుగా మారిపోయారు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం గత ఐపీఎల్లో ఆడి వచ్చే ఐపీఎల్ వేలానికి ముందు భారత్కు ఆడితే ‘క్యాప్డ్ ప్లేయర్’గా అతనికి సంబంధించిన వేలం నిబంధనలన్నీ మారిపోతాయి. 2024 సీజన్లో నితీశ్ రెడ్డి సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున, మయాంక్ యాదవ్ లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడారు. నిబంధనలు ఇలా... ఐపీఎల్–2025 కోసం గరిష్టంగా ఆరుగురు ఆటగాళ్లను టీమ్కు కొనసాగించేందుకు అవకాశం ఉంది. ఇందులో కనీసం ఒకరైనా ‘అన్క్యాప్డ్’ ప్లేయర్ అయి ఉండాలి. కొనసాగించే తొలి ముగ్గురు ప్లేయర్లకు వరుసగా రూ.18 కోట్లు, రూ. 14 కోట్లు, రూ.11 కోట్లు చొప్పున ఫ్రాంచైజీలు చెల్లించాలి. ఆ తర్వాత నాలుగో, ఐదో ఆటగాడికి ఇదే వరస కొనసాగుతుంది. అంటే రూ. 18 కోట్లు, రూ.14 కోట్లు ఇవ్వాలి. ఈ ఐదుగురు అంతర్జాతీయ ప్లేయర్లు అయి ఉంటే ఆరో ఆటగాడు కచి్చతంగా ‘అన్క్యాప్డ్’ అవుతాడు. అతనికి కనీసం రూ.4 కోట్లు ఇవ్వాలి. ఐదుగురుని అట్టి పెట్టుకోకుండా ముగ్గురు చాలు అని భావించే ఫ్రాంచైజీలకు అవకాశం ఇచ్చేందుకు కూడా రెండు దశలుగా ఈ మొత్తాలను నిర్ణయించారు. వీరికి అవకాశం ఉందా... నితీశ్ రెడ్డి గత ఐపీఎల్లో సన్రైజర్స్ తరఫున మంచి ప్రదర్శనతో గుర్తింపు తెచ్చుకున్నాడు. 142.92 స్ట్రయిక్రేట్తో పరుగులు చేసిన అతను ఏకంగా 21 సిక్సర్లు బాదాడు. దీని ప్రకారం చూస్తే ‘అన్క్యాప్డ్’గా అతడిని కనీసం రూ. 4 కోట్లకు హైదరాబాద్ కొనసాగించే అవకాశం కనిపించింది. అయితే ఇప్పుడు క్యాప్డ్ కావడంతో తొలి ఐదుగురు ఆటగాళ్లలో ఒకరిగా ఎంచుకోవాలి. కమిన్స్, హెడ్, క్లాసెన్, అభిõÙక్ శర్మవంటి ఆటగాళ్లు ఉన్న నేపథ్యంలో నితీశ్ను కనీసం ఐదో ఆటగాడిగా రూ. 11 కోట్లకు కొనసాగిస్తారా అనేది సందేహమే! అతడిని విడుదల చేసి వేలంలో ‘రైట్ టు మ్యాచ్’ ద్వారా సొంతం చేసుకునేందుకు సన్రైజర్స్కు మరో అవకాశం ఉంటుంది. మయాంక్ విషయంలో మాత్రం లక్నో సానుకూలంగా ఉండవచ్చు. గత సీజన్లో ఆడింది నాలుగు మ్యాచ్లే అయినా అతను తన వేగంతో ఎంతో ప్రభావం చూపించాడు. కేవలం 12.14 సగటుతో 7 వికెట్లు తీశాడు. ఇప్పుడు భారత్ తరఫున ఆడిన తర్వాత అలాంటి ఆటగాడిని వదులుకునేందుకు సూపర్ జెయింట్స్ ఇష్టపడకపోవచ్చు. లక్నో మెంటార్గా ఉన్న జహీర్ ఖాన్ కూడా మయాంక్పై ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. కాబట్టి కనీసం ఐదో ప్లేయర్గా రూ.11 కోట్లు చెల్లించి తమతో కొనసాగించవచ్చు. ఇద్దరిలో ఎవరినీ ఇరు జట్లు కొనసాగించకపోయినా...వేలంలోకి వెళితే భారీ మొత్తం లభించేందుకు కూడా ఆస్కారం ఉంది. కల నిజమైంది: నితీశ్ రెడ్డి గ్వాలియర్: భారత జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టిన నితీశ్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్ సంతోషం వెలిబుచ్చారు. తమ కెరీర్లో ఇది అత్యుత్తమ క్షణంగా అభివర్ణించారు. తమపై నమ్మకం ఉంచి అవకాశం కల్పించిన కెపె్టన్ సూర్యకుమార్ యాదవ్ ఎంతో ప్రోత్సహించినట్లు ఈ ఇద్దరు యువ ఆటగాళ్లు వెల్లడించారు. ‘భారత్లో క్రికెట్ ఆడే ఎవరికైనా ఇది అద్భుతంలాగే అనిపిస్తుంది. టీమిండియా తరఫున ఆడే అవకాశం రావడంతో నా కల నిజమైనట్లుగా భావించాను. సహజంగానే కొంత ఉత్కంఠ, ఆందోళన ఉన్నా ఆ తర్వాత మెల్లగా ఆటను ఆస్వాదించాను. నాకూ, నా కుటుంబానికి ఇది గర్వకారణమైన క్షణం. టీమ్లో చాలా మంది సీనియర్ ఆటగాళ్లతో పాటు కోచింగ్ బృందం నుంచి మంచి మద్దతు లభించింది. బౌలింగ్లోనూ నాకు మంచి సూచనలు లభించాయి. కెపె్టన్ సూర్య నాపై ఎలాంటి ఒత్తిడి దరి చేరకుండా ప్రశాంతంగా బౌలింగ్ చేసే అవకాశం కలి్పంచాడు. తొలి మ్యాచ్ అనిపించకుండా స్వేచ్ఛగా ఆడమని చెప్పాడు’ అని నితీశ్ రెడ్డి వివరించాడు. తొలి మ్యాచ్లో మయాంక్ కూడా భావోద్వేగభరితమయ్యాడు. ‘నేను మ్యాచ్ ఆడుతున్నానని తెలియగానే గత నాలుగు నెలలు నా కళ్ల ముందు మెదిలాయి. పైగా గాయం నుంచి కోలుకొని వస్తున్నాను కాబట్టి అదనపు ఒత్తిడి నాపై ఉంది. అయితే కెప్టెన్ సూర్య నేను రనప్ తీసుకుంటున్న సమయంలో నా వద్దకు వచ్చి నువ్వు ఎలా బౌలింగ్ చేయగలనని భావిస్తోవో అలాగే చేయి అతని ధైర్యం నింపాడు. బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్తో గతంలో పని చేసిన అనుభవం కూడా పనికొచి్చంది’ అని మయాంక్ చెప్పాడు. – సాక్షి క్రీడా విభాగం -
కౌంట్డౌన్ షురూ
చెన్నై: సొంతగడ్డపై కొత్త సీజన్ కోసం భారత క్రికెట్ జట్టు సన్నాహాలు మొదలయ్యాయి. నెల రోజుల విరామం తర్వాత టీమిండియా ఆటగాళ్లంతా మళ్లీ ఒక్క చోట చేరారు. ఈ నెల 19 నుంచి బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రోహిత్ శర్మ నాయకత్వంలో జట్టు మొత్తం సాధనలో మునిగింది.తొలి రోజు శుక్రవారం చిదంబరం స్టేడియంలో భారత జట్టు పూర్తి స్థాయిలో ప్రాక్టీస్లో పాల్గొంది. గత నెల 7న భారత జట్టు తమ ఆఖరి మ్యాచ్ ఆడింది. శ్రీలంకతో చివరి వన్డేలో ఓడి సిరీస్ను కోల్పోయింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ కొత్తగా హోం సీజన్ను మొదలు పెట్టేందుకు సిద్ధమైంది. లండన్ నుంచి నేరుగా... బంగ్లాదేశ్తో చెన్నైలో జరిగే తొలి టెస్టు కోసం సెలక్టర్లు 16 మంది సభ్యులతో జట్టును ప్రకటించారు. వీరిలో దులీప్ ట్రోఫీలో ఆడుతున్న సర్ఫరాజ్ ఖాన్ మినహా మిగతా వారంతా శిక్షణా శిబిరానికి హాజరయ్యారు. గురువారమే కెపె్టన్ రోహిత్ శర్మ చెన్నై చేరుకోగా... శ్రీలంకతో సిరీస్ ముగిసిన తర్వాత ఇంగ్లండ్కు వెళ్లిన విరాట్ కోహ్లి లండన్ నుంచి నేరుగా ఇక్కడికి వచ్చాడు.సుమారు 45 నిమిషాల పాటు కోహ్లి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయగా, ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా నెట్స్లో సుదీర్ఘ సమయం పాటు బౌలింగ్ చేశాడు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ భారత జట్టు ప్రాక్టీస్ను పర్యవేక్షించగా... కొత్తగా బౌలింగ్ కోచ్గా నియమితుడైన మోర్నీ మోర్కెల్, అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ కూడా ఆటగాళ్లకు తగిన సూచనలిచ్చారు. భారత ఆటగాళ్ల ప్రాక్టీస్ ఫోటోలకు ‘కౌంట్డౌన్ మొదలైంది’ అనే వ్యాఖ్యను జోడించి బీసీసీఐ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బంగ్లాదేశ్ తర్వాత స్వదేశంలోనే న్యూజిలాండ్తో భారత్ సిరీస్ ఆడుతుంది. బంగ్లాదేశ్తో జరిగే రెండు, కివీస్లో జరిగే మూడు టెస్టులు కూడా వరల్డ్ టెస్టు చాంపియన్íÙప్ (డబ్ల్యూటీసీ)లో భాగంగా ఉన్నాయి. -
సీనియర్లు అన్ని మ్యాచ్లు ఆడాల్సిందే
సూటిగా, మొహమాటానికి తావు లేకుండా... భారత క్రికెట్ జట్టు కొత్త హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ తనదైన శైలిలో భవిష్యత్తు గురించి తన ఆలోచనలేమిటో చెప్పేశాడు. సీనియర్ ఆటగాళ్లయినా సరే తమకు నచ్చినట్లుగా సిరీస్లు ఆడతామంటే కుదరదని స్పష్టం చేశాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వచ్చే 2027 వన్డే వరల్డ్ కప్ ఆడాలని కోరుకుంటున్నాను అని చెబుతూ ఫిట్నెస్ ఉంటేనే అంటూ అది సాధ్యమవుతుందని పరోక్షంగా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఆటగాళ్లపై ఒత్తిడి పెంచకుండా పూర్తి స్వేచ్ఛనిచ్చే ఫలితాలు రాబడతానన్న గంభీర్... విరాట్ కోహ్లితో తనకు ఎలాంటి విభేదాలు లేవని పునరుద్ఘాటించాడు. న్యూఢిల్లీ: మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్గా కొత్త ప్రయాణం మొదలు పెట్టాడు. శనివారం నుంచి శ్రీలంకతో జరిగే సిరీస్లో అతను బాధ్యతలు చేపడుతున్నాడు. ఈ నేపథ్యంలో గంభీర్ తొలిసారి మీడియాతో అన్ని విషయాలపై మాట్లాడాడు. టీమిండియా భవిష్యత్తు, తన ప్రణాళికల గురించి వివరించాడు. విశేషాలు అతని మాటల్లోనే... కోచ్గా తన ఆలోచనలపై... నేను ఒక విజయవంతమైన జట్టు బాధ్యతలు తీసుకుంటున్నాను. టి20 వరల్డ్ చాంపియన్, వన్డేలు, టెస్టుల్లో రన్నరప్ టీమ్ ఇది. అనూహ్య మార్పులతో నేను పరిస్థితిని చెడగొట్టను. ఒక హెడ్ కోచ్, ఆటగాడి మధ్య ఉండే బంధం తరహాలో కాకుండా వారికి స్వేచ్ఛనివ్వడం చాలా ముఖ్యం. పరస్పర నమ్మకంతోనే ఫలితాలు వస్తాయి. నేను అన్ని సమయాల్లో ఆటగాళ్లకు అండగా నిలుస్తా. ఏం చేసినా జట్టు గెలుపే లక్ష్యం కావాలి. వేరే మాటకు తావు లేదు. ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలను ప్రదర్శించాలి. విజయాలు లభిస్తేనే డ్రెస్సింగ్ రూమ్ మొత్తం సంతోషంగా ఉంటుంది. నేను అడిగిన సహాయక సిబ్బందిని ఇచి్చన బోర్డుకు కృతజ్ఞతలు. ఆటగాళ్లు సిరీస్లు ఎంచుకోవడంపై... నా దృష్టిలో బుమ్రాలాంటి బౌలర్లకు మాత్రమే విశ్రాంతి అవసరం. ప్రతీ ఒక్కరు జట్టులో ఉండాలనుకునే బుమ్రా ఒక అరుదైన బౌలర్. కాబట్టి అతడిని, ఇతర పేసర్లకు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అంతే గానీ బ్యాటర్లకు పని భారం అనేది ఉండదు. నిలకడగా ఆడుతూ ఫామ్లో ఉంటే అన్ని మ్యాచ్లు ఆడవచ్చు. రోహిత్, కోహ్లి ఇప్పుడు రెండు ఫార్మాట్లే ఆడుతున్నారు కాబట్టి వారు అన్ని మ్యాచ్లకు అందుబాటులో ఉండవచ్చు. ఆటగాళ్లు తమకు నచ్చినట్లుగా ఒక సిరీస్లో ఆడతామని, మరో సిరీస్లో ఆడమని అంటే కుదరదు. రోహిత్, కోహ్లి వన్డే భవిష్యత్తుపై... వారిద్దరిలో ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉందని నా భావన. వారు జట్టుకు ఎంత విలువైన ఆటగాళ్లో అందరికీ తెలుసు. ఏ జట్టయినా తమకు అలాంటి ఆటగాళ్లు కావాలని కోరుకుంటుంది. ఫిట్గా ఉంటే మాత్రం రోహిత్, కోహ్లి 2027 వన్డే వరల్డ్ కప్లో కూడా ఆడవచ్చు. జట్టుకు ఉపయోగపడగలమనే భావన వారిలో ఉంటే ఎప్పటి వరకు ఆడగలరనేది వారి వ్యక్తిగత నిర్ణయం. ఎందుకంటే చివరికి ఏదైనా జట్టు కోసమే. కోహ్లితో విభేదాలపై... నాకు, విరాట్కు మధ్య ఎలాంటి బంధం ఉందనేది మా ఇద్దరికీ బాగా తెలుసు. ఇది జనం ముందు చూపించేది కాదు. టీఆర్పీ రేటింగ్స్ కోసం ఏదైనా చెప్పుకోవచ్చు. మైదానంలో తన జట్టు కోసం పోరాడే హక్కు ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. కానీ ఇప్పుడు మేం భారత్కు ప్రాతినిధ్యం వహించబోతున్నాం. జట్టు గెలుపు కోసమే ప్రయతి్నస్తాం. అది మా బాధ్యత. నేను కోచ్గా ఎంపికయ్యాక, అంతకుముందు కూడా చాలా మాట్లాడుకున్నాం. అత్యుత్తమ ఆట గాడైన కోహ్లి అంటే నాకు ఎంతో గౌరవం ఉంది. ‘సూర్యను అందుకే కెప్టెన్ ను చేశాం’ భారత టి20 కెప్టెన్ గా అయ్యే అర్హత అతనికి అన్ని విధాలా ఉంది. ఈ ఫార్మాట్లో ప్రస్తుతం అత్యుత్తమ బ్యాటర్. గత ఏడాది కాలంగా అతని గురించి, నాయకత్వ లక్షణాల గురించి డ్రెస్సింగ్ రూమ్ సహచరులు కూడా గొప్పగా చెప్పారు. జట్టు సారథి అన్ని మ్యాచ్లు ఆడాలని కోరుకుంటాం. హార్దిక్ పాండ్యా జట్టులో కీలక ఆటగాడే. ఆల్రౌండర్గా అతని సామర్థ్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఫిట్నెస్ సమస్యలే ప్రధాన బలహీనత. గత కొంత కాలంగా అతను వీటిని ఎదుర్కొంటున్నాడు. మూడు ఫార్మాట్లు ఆడే నైపుణ్యంతో పాటు శుబ్మన్ గిల్కు నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. అందుకే వైస్కెప్టెన్ ను చేశాం. అతను మరింత నేర్చుకుంటాడు. అక్షర్కు వన్డేల్లో మరిన్ని అవకాశాలు ఇవ్వడం కోసమే జడేజాకు విరామం ఇచ్చాం తప్ప అతడిని తప్పించలేదు.పంత్, రాహుల్ ఉన్నాక మరో కీపర్ అవసరం లేదు కాబట్టి సామ్సన్ను పక్కన పెట్టక తప్పలేదు. రెండేళ్ల తర్వాత జరిగే టి20 వరల్డ్ కప్ కోణంలో కొన్ని ప్రయోగాలతో కొత్తగా ప్రయతి్నస్తున్నాం. ఫలితాలు ఎలా వస్తాయో చూడాలి. –అజిత్ అగార్కర్, సెలక్షన్ కమిటీ చైర్మన్ -
గౌతముడే శిక్షకుడు.. బీసీసీఐ అధికారిక ప్రకటన
ముంబై: భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఇకపై కొత్త పాత్రలో టీమిండియాతో కలిసి పని చేయనున్నాడు. 43 ఏళ్ల గంభీర్ను భారత హెడ్ కోచ్గా నియమిస్తున్నట్లు మంగళవారం బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు. అశోక్ మల్హోత్రా, జతిన్ పరాంజపే, సులక్షణ నాయక్లతో కూడిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) అన్ని దరఖాస్తుల పరిశీలన, ఇంటర్వ్యూల అనంతరం గంభీర్ను కోచ్గా ఎంపిక చేసింది. ఈ నెల 27 నుంచి శ్రీలంక గడ్డపై భారత జట్టు 3 వన్డేలు, 3 టి20లు ఆడుతుంది. ఇదే సిరీస్ నుంచి గంభీర్ కోచ్గా బాధ్యతలు స్వీకరిస్తాడు. డిసెంబర్ 2027 వరకు అతని పదవీ కాలం ఉంటుంది. కొత్త కోచ్ కోసం మే 13 నుంచి బీసీసీఐ దరఖాస్తులు కోరింది. అంతకుముందే కోచ్ పదవిని స్వీకరించమంటూ మరో మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ను బీసీసీఐ కోరినా... అతను తిరస్కరించాడు.తన ఆసక్తిని బహిరంగంగానే ప్రకటిస్తూ గంభీర్ కూడా దరఖాస్తు చేసుకోగా, ఒక్క డబ్ల్యూవీ రామన్ మాత్రమే అతనితో పోటీ పడ్డాడు. ఎలాగూ ముందే నిర్ణయించేశారనే భావన వల్ల కావచ్చు, విదేశీ కోచ్లు ఎవరూ ఆసక్తి చూపించలేదు. చివరకు ఊహించినట్లుగా గంభీర్కు పగ్గాలు లభించాయి. ఆటగాడిగా ఘనమైన రికార్డు... 2004–2012 మధ్య కాలంలో మూడు ఫార్మాట్లలో గంభీర్ ఓపెనర్గా జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. 58 టెస్టుల్లో 41.95 సగటుతో 4154 పరుగులు చేసిన అతను 9 సెంచరీలు, 22 అర్ధసెంచరీలు చేశాడు. 147 వన్డేల్లో 39.68 సగటుతో 5238 పరుగులు సాధించాడు. ఇందులో 11 సెంచరీలు, 34 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 37 అంతర్జాతీయ టి20ల్లో 119.02 స్ట్రయిక్ రేట్, 7 హాఫ్ సెంచరీలతో 932 పరుగులు పరుగులు సాధించాడు. అన్నింటికి మించి చిరకాలం గుర్తుంచుకునే గంభీర్ రెండు అత్యుత్తమ ప్రదర్శనలు ప్రపంచ కప్ ఫైనల్స్లో వచ్చాయి. పాకిస్తాన్తో 2007 టి20 వరల్డ్ కప్ ఫైనల్లో 75 పరుగులతో, శ్రీలంకతో వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో 97 పరుగులతో అతను టాప్ స్కోరర్గా నిలిచాడు. నేపియర్లో న్యూజిలాండ్తో 11 గంటల పాటు క్రీజ్లో నిలిచి 436 బంతుల్లో 137 పరుగులు చేసి భారత్ను ఓటమి నుంచి కాపాడటం టెస్టుల్లో అతని అత్యుత్తమ ప్రదర్శన. ఐపీఎల్లో ముందుగా ఢిల్లీ డేర్డెవిల్స్కు ప్రాతినిధ్యం వహించిన గంభీర్ ఆ తర్వాత కోల్కతా నైట్రైడర్స్కు మారాడు. 2012, 2014లలో కెపె్టన్గా కేకేఆర్కు ఐపీఎల్ టైటిల్ అందించాడు. కోచ్గా తొలిసారి... రిటైర్మెంట్ తర్వాత చాలామందిలాగే గంభీర్ కూడా కామెంటేటర్గా, విశ్లేషకుడిగా పని చేశాడు. 2019లో బీజేపీ తరఫున ఈస్ట్ ఢిల్లీ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా కూడా ఎన్నికయిన అతను పదవీకాలం ముగిసిన తర్వాత ఈ ఏడాది ఎన్నికలకు ముందు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. అయితే అధికారికంగా కోచ్ హోదాలో పని చేయడం గంభీర్కు ఇదే తొలిసారి. ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ టీమ్కు 2022, 2023 సీజన్లలో మెంటార్గా వ్యవహరించగా, రెండుసార్లు కూడా లక్నో ‘ప్లే ఆఫ్స్’కు చేరింది. అయితే 2024 సీజన్లో కోల్కతాకు మెంటార్గా వెళ్లిన అతను టీమ్ను విజేతగా నిలపడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ సాఫల్యమే అతడిని భారత జట్టు కోచ్ రేసులో ముందంజలో నిలిపింది. మరోవైపు టి20 వరల్డ్ కప్ వరకు జట్టుతో పని చేసిన విక్రమ్ రాథోడ్ (బ్యాటింగ్ కోచ్ ), పారస్ మాంబ్రే (బౌలింగ్ కోచ్), టి.దిలీప్ (ఫీల్డింగ్ కోచ్) పదవీ కాలం కూడా ముగిసినట్లు బీసీసీఐ ప్రకటించింది. వీరి స్థానాల్లో తన ఆలోచనలకు అనుగుణంగా కొత్త బృందాన్ని ఎంచుకునే అధికారం గంభీర్కు ఉంది. -
జగజ్జేతల ఆగమనం
ఇక్కడేమో అభిమానులు... అక్కడేమో ప్రపంచకప్ గెలిచిన క్రికెటర్లు... ఎన్నాళ్లీ నిరీక్షణ, ఎందుకీ పరీక్ష అని చూసే ఎదురుచూపులకు నేడు తెర పడనుంది. ప్రతికూల వాతావరణంతో బార్బడోస్లోనే ఇరుక్కుపోయిన టి20 వరల్డ్ చాంపియన్ భారత జట్టు గురువారం తెల్లవారగానే న్యూఢిల్లీకి చేరుకుంటుంది. వీరికి ఘనస్వాగతం పలికేందుకు బోర్డుతో పాటు వీరాభిమానులు తెగ ఆరాటం కనబరుస్తున్నారు. దీంతో దేశ రాజధాని ఢిల్లీ, వాణిజ్య రాజధాని ముంబై సంబరాల్లో మునిగితేలనున్నాయి. ముంబై: టి20 ప్రపంచకప్ను జయించిన భారత క్రికెట్ జట్టు సభ్యులు కాస్త ఆలస్యంగా నేడు స్వదేశానికి చేరుకుంటున్నారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), ఎయిరిండియా సమన్వయంతో చార్టెర్డ్ ఫ్లయిట్లో చాంపియన్లు, జట్టు సహాయక సిబ్బంది, బోర్డు అధ్యక్ష కార్యదర్శులు రోజర్ బిన్నీ, జై షాలతో పాటు భారత్కు చెందిన మీడియా ప్రతినిధులు బార్బడోస్లోని గ్రాంట్లీ ఆడమ్స్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బుధవారం బయలుదేరారు.ఫ్లయిట్ షెడ్యూల్ టైమ్ ప్రకారం గురువారం ఉదయం గం. 6:20 గంటలకు న్యూఢిల్లీ చేరుకుంటుంది. కాసేపు ఆటగాళ్లు ప్రయాణ బడలిక నుంచి సేదతీరాక ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలుసుకుంటారు. ‘ఢిల్లీ విమానాశ్రయంలో 6 గంటలకు ఫ్లయిట్ ల్యాండ్ అవుతుంది. కొద్దిసేపు విశ్రాంతి అనంతరం ఆటగాళ్లు ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీ నివాసంలో భేటీ అవుతారు. ఇదివరకే విజేత సభ్యులను సోషల్ మీడియా ద్వారా, ఫోన్లో అభినందించిన ప్రధాని కాసేపు క్రికెటర్లతో గడుపుతారు’ అని బోర్డు సీనియర్ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తెలిపారు. ఈ భేటీ ముగిసిన వెంటనే మరో ప్రత్యేక విమానంలో టీమిండియా ముంబైకి పయనమవుతుంది. ముంబైలోనే బోర్డు అంబరాన్నంటే సంబరాలకు అన్ని ఏర్పాట్లు చేసింది. అక్కడికి చేరుకోగానే ముంబై, మహారాష్ట్ర క్రికెట్ సంఘాలు ఘనస్వాగతం పలుకుతాయి. ‘సాయంత్రం 5 గంటలకు నారీమన్ పాయింట్ వద్ద ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఓపెన్ టాప్ బస్లో క్రికెటర్ల రోడ్షో మొదలవుతుంది. అక్కడి నుంచి విఖ్యాత వాంఖెడే స్టేడియం వరకు సుమారు రెండు గంటలపాటు సాగే ఈ షోలో అభిమానులు అడుగడుగునా నీరాజనాలు పలుకుతారు. రాత్రి 7 గంటల సమయంలో స్టేడియంలో ఆటగాళ్లు, సహాయ సిబ్బందిని ఒక్కోక్కరిగా ఘనంగా సన్మానిస్తారు. బోర్డు ప్రకటించిన రూ. 125 కోట్ల ప్రైజ్మనీని కూడా అందజేస్తారు’ అని శుక్లా పూర్తి బిజీ షెడ్యూల్ వివరాలను వెల్లడించారు. ఈ విక్టరీ పరేడ్లో అభిమానులంతా పాల్గొనాల్సిందిగా బోర్డు కార్యదర్శి జై షా ‘ఎక్స్’ (ట్విట్టర్)లో విజ్ఞప్తి చేశారు. ఇలాంటి రోడ్ షో 17 ఏళ్ల క్రితం తొలి టి20 ప్రపంచకప్ గెలిచిన ధోని బృందానికి నిర్వహించారు. కానీ 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన అదే ధోని సేనకు ఐపీఎల్ త్వరలోనే ప్రారంభం కావాల్సి ఉండటంతో రోడ్ షోను నిర్వహించలేదు. న్యూయార్క్ టు న్యూఢిల్లీ.. వయా బార్బడోస్ గత నెల 29న రోహిత్ శర్మ బృందం టి20 వరల్డ్కప్ గెలిచింది. ఆదివారం అర్ధరాత్రి లేదంటే సోమవారం ఉదయానికల్లా జగజ్జేతలు భారత్కు రావాలి. కానీ కరీబియన్లో భీకరమైన హరికేన్ తుఫాన్ వల్ల బార్బడోస్ ఎయిర్పోర్ట్ను మూసివేశారు. దీంతో టీమిండియా ఆటగాళ్లంతా అక్కడే ఇరుక్కుపోయారు. ఎట్టకేలకు కరీబియన్లో టి20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు సభ్యులు కప్తో వచ్చేస్తున్నారు. ఎయిరిండియా చొరవ, న్యూయార్క్లోని ప్రయాణీకుల సహకారంతో దారి మళ్లించిన విమానంలో టీమిండియా క్రికెటర్లు, మీడియా సంస్థల ప్రతినిధులు గురువారం ఉదయం న్యూఢిల్లీకి చేరుకుంటారు. అయితే వాతావరణ పరిస్థితిలో మార్పురావడంతో న్యూయార్క్ (అమెరికా) నుంచి న్యూఢిల్లీకి ప్రయాణించాల్సిన ఎయిరిండియా విమానాన్ని వయా బార్బడోస్ మీదుగా దారి మళ్లించారు. ఈ విమానం కోసం టికెట్లు బుక్ చేసుకున్న సాధారణ ప్రయాణికులకు ముందస్తు సమాచారం ఇచ్చి అసౌకర్యం కలుగకుండా చూశారు. ఇంకొందరికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఇక విజేతల కోసం ‘ఏఐసీ24డబ్ల్యూసీ’ (ఎయిరిండియా చాంపియన్స్ 24 ప్రపంచకప్) పేరిట ఈ విమానాన్ని ముస్తాబుచేసి బార్బడోస్లో క్రికెటర్లను ఎక్కించుకొని బుధవారం బయలుదేరింది. అయితే నిర్ణీత రూట్ కాకుండా మరో రూట్ మారడంపై డీజీసీఏ (విమానయాన నియంత్రణ సంస్థ) ఎయిరిండియాను నివేదిక కోరింది. -
భారీ విజయం... భావి ప్రయాణం...
శనివారం రాత్రి పొద్దుపోయాక... అద్భుతమే జరిగింది. గతంలో అనేకసార్లు ఊరించి ఉసూరుమనిపించినట్టే ఈసారీ ఫలితం అటూ ఇటూగా ఉంటుందేమోనని భయపడుతున్న క్రీడాభిమానుల సందేహాలు తుదిఘట్టంలో పటాపంచలయ్యాయి. పదిహేడేళ్ళ సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. భారత క్రికెట్ జట్టు విజయపతాకం ఎగరేసింది. పొట్టి క్రికెట్ విధానంలో తొలి ప్రపంచ కప్ను 2007లో గెలిచిన భారత జట్టు... మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత తొమ్మిదో ప్రపంచ కప్ను అందుకుంది. మరెక్కడా లేనంత భారీగా, హంగులూ ఆర్భాటాలతో ఆకర్షణీయంగా, అత్యంత సంపన్నంగా టీ20 లీగ్ను జరిపే భారత్ మరోసారి ఆ ఫార్మట్లో జగజ్జేతగా నిలిచింది. జూన్ 29న వెస్టిండీస్లోని బార్బడోస్లో ఆఖరు దాకా ఉత్కంఠగా సాగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్– 2024 ఫైనల్లో దక్షిణాఫ్రికాపై 7 పరుగుల తేడాతో భారత జట్టు సాధించిన విజయం చిరకాలం గుర్తుండిపోతుంది. అమెరికా, వెస్టిండీస్లు సంయుక్తంగా ఆతిథ్యమివ్వగా, న్యూయార్క్లో కొత్తగా వెలసిన స్టేడియమ్ మొదలు వివిధ కరేబియన్ దీవుల్లో సాగిన ఈ వరల్డ్ కప్ కొత్త ఉత్తేజం తెచ్చింది. చివరకు కప్ గెలుపుతో కోచ్గా ద్రావిడ్కూ, టీ20ల నుంచి రోహిత్ శర్మ, కోహ్లీ, రవీంద్ర జడేజాలకూ తీయటి వీడ్కోలు దక్కింది.గతంలో ఎన్నో విజయాలు సాధించినా... ఫార్మట్ ఏదైనప్పటికీ ప్రపంచ కప్ విజేతగా నిలవడమనేది ఎప్పుడూ ప్రత్యేకమే. 1983లో తొలిసారిగా కపిల్దేవ్ సారథ్యంలోని భారత జట్టు వన్డేలలో వరల్డ్ కప్ సాధించినప్పటి నుంచి సామాన్య ప్రజానీకంలో సైతం క్రికెట్ పట్ల, ప్రపంచ కప్ పట్ల పెరిగిన ఆకర్షణ అంతా ఇంతా కాదు. ఆ తర్వాత 20 ఓవర్ల పొట్టి క్రికెట్ వచ్చాక, 2007లో మహేంద్ర సింగ్ ధోనీ సేన తొలి టీ20 వరల్డ్ కప్ మనం దక్కించుకోవడంతో ఇక ఆకాశమే హద్దయింది. 2011లో మరోసారి వన్డేల్లో వరల్డ్ కప్ కైవసం చేసుకున్నాం. లెక్కలు తీస్తే... మనం టీ20 వరల్డ్ కప్ గెలిచి 17 ఏళ్ళయితే, అసలు ఏదో ఒక ఫార్మట్లో ప్రపంచ కప్ గెలిచి 13 ఏళ్ళవుతోంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిర్వహించే ఏదో ఒక టోర్నీలో విజేతగా నిలిచి, స్వదేశానికి ట్రోఫీ పట్టుకొచ్చి కూడా కనీసం 11 ఏళ్ళవుతోంది. 2013లో ఇంగ్లండ్లో ‘ఛాంపియన్స్ ట్రోఫీ’ తర్వాత ఐసీసీ పోటీల్లో మనకు మళ్ళీ ట్రోఫీలు దక్కలేదు. ఇన్నాళ్ళకు ఆ కొరత తీరింది. కొన్నేళ్ళుగా విజయావకాశాలు పుష్కలంగా ఉన్న ఫేవరెట్గా భారత క్రికెట్ జట్టు రకరకాల టోర్నీలలో బరిలోకి దిగుతోంది. కానీ, ప్రతిసారీ ఏదో ఒక దశలో విఫలమవుతోంది. కోచ్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్ల జోడీ సంగతికే వస్తే, ‘వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్స్’లో జట్టును ఫైనల్ దాకా తీసుకెళ్ళినా ఫలితం దక్కలేదు. చివరకు ఏడు నెలల క్రితం గత నవంబర్లో జరిగిన 2023 వన్డే వరల్డ్ కప్ లోనూ మంచి ఫామ్లో ఉన్న భారత జట్టు ఆఖరి ఘట్టంలో అహ్మదాబాద్లో తడబడింది. ఆ రెండుసార్లూ ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. ఈ తాజా టీ20 వరల్డ్ కప్లో సైతం మొదటి నుంచి ఓటమి ఎరుగకుండా దూసుకువచ్చిన మన జట్టు శనివారం నాటి ఫైనల్లో ఒక దశలో ఓటమి అంచుల దాకా వెళ్ళిపోయింది. ప్రత్యర్థి సౌతాఫ్రికా జట్టు 30 బంతుల్లో 30 పరుగులే చేయాలి. పైగా 6 వికెట్లున్నాయి. ఆ పరిస్థితుల్లో బుమ్రా కట్టుదిట్టమైన బౌలింగ్, ఆల్రౌండర్ హార్దిక్పాండ్యా తెలివైన ఆట తీరు, బౌండరీ దాటుతున్న బంతిని అద్భుతంగా ఒడిసి పట్టుకొని ప్రత్యర్థి బ్యాట్స్మన్ను అవుట్ చేసిన సూర్యకుమార్ యాదవ్ ఫీల్డింగ్ మ్యాచ్ దిశను మార్చేశాయి. ఎట్టకేలకు సమష్టి స్ఫూర్తితో ఓటమి కోరల నుంచి కూడా విజయాన్ని అందుకొనే కళలో భారత్ ఆరితేరింది. జట్టు అవసరాలకు తగ్గట్టు భిన్నమైన ఆట శైలిని ఆటగాళ్ళు అవలంబించడం నేర్చుకున్నారు. పోయిన పాత ఫామ్ను మళ్ళీ అత్యవసరమైన ఫైనల్లో అందుకొని, అవతల వికెట్లు పడిపోతున్నా తడబడకుండా పిచ్ వద్ద పాతుకుపోయి, కోహ్లీ 76 పరుగులు చేసిన తీరు అందుకు మచ్చుతునక. రోహిత్ శర్మ సారథ్యం, అక్సర్ పటేల్ లాంటి ఆల్రౌండర్ల ప్రదర్శన, కీలకమైన ఫైనల్లో ప్రమాదకరంగా మారిన క్లాసెన్, డేవిడ్ మిల్లర్ లాంటి బ్యాట్స్మన్లను ఔట్ చేసిన యువ సీమర్ అర్ష్దీప్ సింగ్ పరిణతి... ఇలా అన్నీ కలిస్తేనే ఈ ప్రపంచ విజేత పట్టం. దేశంలోనే అత్యంత ప్రీతిపాత్రమైన ఆట... అందులోనూ వరల్డ్కప్ విజయం... అర్ధరాత్రి దాటినా సరే దేశమంతటా జనం వీధుల్లోకి వచ్చి మరీ ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకొన్నది అందుకే! మన దేశంలోనే కాదు... దేశదేశాల్లో పెరుగుతున్న భారత క్రికెట్ క్రీడాభిమానులకూ ఇది పండుగ వాతావరణం తెచ్చింది. ఒక్కమాటలో, మన దేశం ఇప్పుడు క్రికెట్ సూపర్పవర్. ఒకప్పుడు 1970లు – 80లలో బలమైన బ్యాటింగ్, బౌలింగ్ సేనతో వీరవిహారం చేసిన వెస్టిండీస్ జట్టుతో ఇప్పుడు భారత్ ఆటగాళ్ళను విశ్లేషకులు పోలుస్తున్నారంటే ఆశ్చర్యం లేదు. మరి ఇక్కడ నుంచి మన క్రికెట్ ప్రయాణం ఎలా ముందుకు సాగనుందన్నది ఇక కీలకం. కోచ్ ద్రావిడ్ మొదలు కీలక ఆటగాళ్ళ దాకా పలువురి రిటైర్మెంట్తో ఒక శకం ముగిసింది. ప్రతిభావంతులైన యువ ఆటగాళ్ళపై గతంలో పెట్టుబడి పెడితేనే ఇప్పుడీ ఫలితాలు వచ్చాయని మర్చిపోరాదు. భవిష్యత్తే లక్ష్యంగా జట్టుకు కొత్త రక్తాన్ని ఎక్కించాలి. కొత్తగా కోచ్ బాధ్యతలు చేపట్టనున్న గౌతమ్ గంభీర్ ఖాళీ అవుతున్న కీలక స్థానాల భర్తీపై దృష్టి పెట్టాలి. మ్యాచ్లు ఆడకున్నా ఈ వరల్డ్కప్ జట్టులో భాగమైన యశస్వీ జైస్వాల్ సహా పలువురు ప్రతిభావంతుల్ని ఏరి, ఇకపై మరింత సానబెట్టాలి. కొద్ది నెలల్లోనే 2025లో పాకిస్తాన్లో జరిగే ఛాంపియన్స్ట్రోఫీ నాటికి సర్వసన్నద్ధం కావాలి. ఆ పునర్నిర్మాణానికి తాజా విజయం ఓ బలమైన పునాది. -
టీ20 విజేత భారత జట్టుకు వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, అమరావతి: టీ20 వరల్డ్ కప్ గెలుచుకున్న భారత క్రికెట్ జట్టుకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. కృషి, పట్టుదలతో మరో గొప్ప గెలుపు సొంతం చేసుకుందని ప్రశంసించారు. టోర్నీ ఆద్యంతం సమష్టి కృషితో భారత జట్టు విజయాలు సాధించిందన్నారు. వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమితో తీవ్ర నిరాశకు గురైన అభిమానులకు ఈ విజయం గొప్ప ఊరటనిస్తుందని అభిప్రాయపడ్డారు. భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తెలుగువాడు కావడం గర్వకారణమన్నారు. జట్టును విజయవంతంగా నడిపించడంలో అతడు చక్కటి నాయకత్వాన్ని ప్రదర్శించాడని కొనియాడారు. రానున్న రోజుల్లో టీమ్ ఇండియా మరిన్ని చాంపియన్షిప్లు సాధించాలని ఆకాంక్షించారు. Congratulations to #TeamIndia on the historic win in the #T20WorldCup! Your perseverance and hard work have paid off. Proud moment for every Indian. Jai Hind! 🇮🇳— YS Jagan Mohan Reddy (@ysjagan) June 29, 2024 -
కొంచెం ఇష్టం... కొంచెం కష్టం...
రానున్న టీ20 వరల్డ్ కప్కు రంగం సిద్ధమైంది. భారత క్రికెట్ జట్టు ఎంపిక జరిగింది. అమెరికా, వెస్టిండీస్లు వేదికగా జూన్ 2 నుంచి జరిగే పోటీలకు రోహిత్ శర్మ సారథిగా 15 మంది సభ్యులతో కూడిన ప్రాథమిక జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగళవారం ప్రకటించింది. మరో నలుగురు ఆటగాళ్ళను రిజర్వ్లుగా ఎంపిక చేసింది. భారత మాజీ ఫాస్ట్ బౌలర్ అజిత్ అగర్కర్ నేతృత్వంలోని సీనియర్ సెలక్షన్ ప్యానెల్ చేసిన ఎంపికలో కొందరు స్టార్ ఆటగాళ్ళకు చోటు దక్కలేదు. అలాగని, ఆశ్చర్యకరమైన, అనూహ్యమైన ఎంపికలూ లేవు. విధ్వంసకర బ్యాట్స్ మన్ రింకూ సింగ్కు చోటివ్వకపోవడం, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబయ్ ఇండియన్స్ (ఎంఐ) జట్టు సారథిగా విఫలమైనా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను వైస్ కెప్టెన్ను చేయడం విమర్శలకు తావిచ్చాయి. అలాగే, స్పిన్నర్లనేమో నలుగురిని తీసుకొని, జస్ప్రీత్ బుమ్రా నేతృత్వంలో ముగ్గురు పేసర్ల బృందానికే పరిమితం కావడమూ ప్రశ్నార్హమైంది. కొంత ఇష్టం, కొంత కష్టం, మరికొంత నష్టాల మేళవింపుగా సాగిన ఈ ఎంపికపై సహజంగానే చర్చ జరుగుతోంది.గత ఏడాదంతా టీ20లలో పాల్గొనకపోయినా సీనియర్లు రోహిత్ శర్మ, కోహ్లీలకు సెలక్షన్ ప్యానెల్ పెద్దపీట వేసింది. నాలుగు గ్రూపుల్లో 20 జట్లతో, మొత్తం 55 మ్యాచ్లు సాగే ఈ స్థాయి భారీ పోటీలో, అమెరికాలోని అలవాటు లేని పిచ్లలో సీనియర్ల అనుభవం అక్కరకొస్తుందని భావన. ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత అబ్బురపరిచేలా ఆడుతున్న వికెట్కీపర్ – బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ ఎంపికతో గత రెండు వరల్డ్కప్లలో లేని విధంగా మిడిల్ ఆర్డర్లో లెఫ్ట్హ్యాండ్ బ్యాటర్ ఆప్షన్ జట్టుకు దక్కింది. ఈసారి ఐపీఎల్లో పరుగుల వరద పారిస్తూ, రాజస్థాన్ రాయల్స్ను అగ్రపీఠంలో నిలిపిన సంజూ శామ్సన్కు జట్టులో స్థానం దక్కింది. వెరపెరుగని బ్యాటింగ్తో, అలవోకగా సిక్స్లు కొట్టే అతడి సత్తాకు వరల్డ్ కప్ పిలుపొచ్చింది. మిడిల్ ఆర్డర్లో అతడు జట్టుకు పెట్టని కోట. స్పెషలిస్ట్ వికెట్ కీపర్లుగా శామ్సన్, పంత్లను తీసుకోవడంతో కె.ఎల్. రాహుల్కు మొండి చేయి చూపక తప్పలేదు. ఒకప్పుడు ఎగతాళికి గురైన ముంబయ్ కుర్రాడు శివమ్ దూబే చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టులో మిడిల్ ఆర్డర్లో సిక్సర్ల వీరుడిగా, ప్రస్తుతం భారత వరల్డ్ కప్ టీమ్లో కీలక భాగస్వామిగా ఎదగడం గమనార్హం.క్లిష్టమైన వేళల్లో సైతం బ్యాటింగ్ సత్తాతో జట్టును విజయతీరాలకు చేర్చే సత్తా, స్వభావం ఉన్న ఆటగాడిగా ఉత్తరప్రదేశ్కు చెందిన పాతికేళ్ళ రింకూ సింగ్కు పేరు. అయితే, ఏ స్థానంలో ఆడించా లని మల్లగుల్లాలు పడి, చివరకు ఈ విధ్వంసక బ్యాట్స్మన్కు జట్టులో చోటే ఇవ్వలేదు. రిజర్వ్ ఆట గాడిగా మాత్రం జట్టు వెంట అమెరికా, వెస్టిండీస్లకు వెళతాడు. పరుగుల సగటు 89, స్ట్రయిక్రేట్ 176 ఉన్న రింకూ లాంటి వారికి తుది జట్టులో స్థానం లేకపోవడం తప్పే. ఈ ఏడాది ఐపీఎల్లో బాగా ఆడుతున్న స్పిన్నర్ యజువేంద్ర చాహల్కు జట్టులోకి మళ్ళీ పిలుపు వచ్చింది. అయితే, నలు గురు స్పిన్నర్లతోటి, అందులోనూ ఇద్దరు ముంజేతితో బంతిని తిప్పే రిస్ట్ స్పిన్నర్లతోటి బరిలోకి దిగడంతో మన బౌలింగ్ దాడిలో సమతూకం తప్పినట్టుంది. ప్రధాన పేసర్లు ముగ్గురే కావడం, బౌలింగ్లో హార్దిక్ ఫామ్లో లేకపోవడం, సీఎస్కేలో శివమ్కు గతంలో బౌలింగ్ ఛాన్స్ ఆట్టే రాకపోవడంతో టీ20 వరల్డ్ కప్లో మన పేసర్ల విభాగం బలహీనంగా కనిపిస్తోంది. వివరణలేమీ ఇవ్వకుండానే మే 23 వరకు ఈ ప్రాథమిక జట్టులో మార్పులు చేసుకొనే అవకాశం సెలక్టర్లకుంది. కానీ, ఫైనల్ 15 మందిని మార్చడానికి అగర్కర్ బృందం ఇష్టపడుతుందా అన్నది అనుమానమే. అది అటుంచితే, 2007 తర్వాత భారత్ టీ20 టైటిల్స్ ఏవీ గెలవలేదు. నిజానికి, ధోనీ సారథ్యంలోని యువకుల జట్టు 2007లో తొలి టీ20 వరల్డ్కప్లో గెలిచిన తీరు మన క్రికెట్లో కొత్త మలుపు. టీ20లకు భారత్ అడ్డాగా మారిందంటే దాని చలవే. ఆ వెంటనే 2008లో ఐపీఎల్ ఆరంభంతో కథే మారిపోయింది. ఇవాళ ప్రతి వేసవిలో పేరున్న అంతర్జాతీయ ఆటగాళ్ళు భారత్కు క్యూ కడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక లీగ్స్ వచ్చినా, ఐపీఎల్దే హవా. ఇంతవున్నా 2014లో ఒక్కసారి శ్రీలంకతో ఫైనల్స్లో ఓడినప్పుడు మినహా ఎన్నడూ విజయం అంచుల దాకా మనం చేరింది లేదని గమనించాలి. ఇది ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అంశం. యువ ప్రతిభను ప్రోత్సహించడం, ఆటకు తగ్గ ఆటగాళ్ళను ఎంచుకోవడమనే ప్రాథమిక సూత్రాన్ని మర్చిపోతే కష్టం. ఆ సూత్రాన్ని పాటించడం వల్లే 2007లో మనకు కప్పు దక్కిందని గుర్తుంచుకోవాలి.గమనిస్తే, దశాబ్దిన్నర పైగా క్రికెట్ స్వరూప స్వభావాలే మారిపోయాయి. మిగతావాటి కన్నా టీ20లు పాపులరయ్యాయి. బంతిని మైదానం దాటించే బ్యాటింగ్ విధ్వంసాలు, స్కోర్ బోర్డ్ను పరి గెత్తించే పరుగుల వరదలు, మైదానంలో మెరుపు లాంటి ఫీల్డింగ్ ప్రతిభలు సాధారణమై పోయాయి. టెస్ట్, వన్డే క్రికెట్లు సైతం తమ పూర్వశైలిని మార్చుకోవాల్సి వచ్చింది. ఆర్థికంగానే కాక అనేక విధా లుగా వాటిని టీ20 మింగేసే పరిస్థితీ వచ్చింది. బ్యాట్స్మన్ల వైపు మొగ్గుతో ఈ పొట్టి క్రికెట్ పోటీలు బౌలర్లకు నరకంగా మారి, ఆటకు ప్రాణమైన పోటీతత్వాన్ని హరిస్తున్నాయి. అందుకే, 2008లో ఆరంభమైన ఐపీఎల్ ఏటికేడు క్రమంగా మునుపటి ఆసక్తినీ, ఆదరణనూ కోల్పోతోంది. దీనిపై దృష్టి పెట్టాల్సి ఉంది. బౌలర్లకు అనుకూలించే పిచ్ల తయారీ మొదలు టీ20 ఫార్మట్లో, ఐపీఎల్లో కొన్ని నియమ నిబంధనల సవరణ దాకా అవసరమైన చర్యలు చేపట్టాలి. తద్వారా పొట్టి క్రికెట్కు కొత్త ఊపిరులూదాలి. టీ20 వరల్డ్ కప్లో విజయం సాధించాలంటే ఆటలోనే కాదు... ఎంపికలోనూ దూకుడు అవసరం. రిస్క్ లేని సేఫ్ గేమ్తోనే పొట్టి క్రికెట్లో కప్పు కొట్టగలిగితే అది ఓ కొత్త చరిత్ర! -
IND vs ENG: టీమిండియాకు సంకటం!
హైదరాబాద్: సొంతగడ్డపై ఇంగ్లండ్తో తొలి టెస్టులో ఎదురైన పరాజయం నుంచి కోలుకోకముందే... భారత్కు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, బ్యాటర్ కేఎల్ రాహుల్ గాయాలతో రెండో టెస్టుకు దూరమయ్యారు. ఇప్పటికే తొలి రెండు టెస్టుల నుంచి సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లి విశ్రాంతి తీసుకుంటున్నాడు. తాజాగా కీలకమైన ఇద్దరు ఆటగాళ్లు కూడా రెండో టెస్టుకు దూరమవడం జట్టుకు ప్రతికూలంగా పరిణమించనుంది. అయితే దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న, ఐపీఎల్లో అడపాదడపా మెరిపిస్తున్న ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్కు ఎట్టకేలకు టీమిండియాలో చోటు దక్కింది. రెండో టెస్టు కోసం కొత్తగా సర్ఫరాజ్ ఖాన్, ఉత్తరప్రదేశ్కు చెందిన లెఫ్టార్మ్ స్పిన్ ఆల్రౌండర్ సౌరభ్ కుమార్లను తీసుకోగా... తమిళనాడు ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ను కూడా ఈ మ్యాచ్ కోసం ఎంపిక చేశారు. ఆదివారం నాలుగోరోజు ఆటలో పరుగు తీసే ప్రయత్నంలో జడేజా తొడ కండరాలు పట్టేయడంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఈ మ్యాచ్లో కేవలం పూర్తిస్థాయిలో బ్యాటింగ్ పాత్ర పోషించిన కేఎల్ రాహుల్ కుడి తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడు. గత ఐపీఎల్లో కూడా రాహుల్ ఇదే విధమైన గాయంతో నాలుగు నెలలు ఆటకు దూరమయ్యాడు. ‘గాయపడిన జడేజా, రాహుల్ ఇద్దరు వచ్చే నెల 2 నుంచి విశాఖపట్నంలో జరిగే రెండో టెస్టులో పాల్గొనడం లేదు. బోర్డు మెడికల్ టీమ్ ఇద్దరి పరిస్థితిని సమీక్షిస్తోంది’ అని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. సర్ఫరాజ్ గుర్తున్న క్రికెటరే కానీ..! ముంబై క్రికెటర్ సర్ఫరాజ్ భారత సీనియర్ జట్టుకు కొత్త ముఖమై ఉండొచ్చు కానీ... క్రికెట్ అభిమానులకు తెలియని పేరేమీ కాదు. ఎందుకంటే ఐపీఎల్లో కోహ్లి సారథ్యంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తరఫున మెరిపించాడు. అతని మెరుపులకు ఒకానొక సందర్భంలో ఫిదా అయిన కోహ్లి... సర్ఫరాజ్ అవుటై పెవిలియన్కు చేరుతుంటే రెండు చేతులు జోడించి మరీ జేజేలు పలికాడు. సర్ఫరాజ్ రెండు ఐసీసీ అండర్–19 ప్రపంచకప్ (2014, 2016)లలో ఆడాడు. భారత్ ‘ఎ’ జట్టు తరఫున బరిలోకి దిగాడు. రంజీల్లోనూ నిలకడగా పరుగులు సాధిస్తున్నాడు. అయితే ఇదంతా కూడా అతని ఆటతీరుకు నిదర్శనమైతే... నోటిదురుసుతో సెలక్షన్ కమిటీ పరిశీలనకు అతని పేరు అదేపనిగా దూరమైంది. గత పదేళ్లుగా దేశవాళీ క్రికెట్లో ఆడుతున్న 30 ఏళ్ల సౌరభ్ ఇప్పటి వరకు 68 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడి 2061 పరుగులు సాధించడంతోపాటు 290 వికెట్లు పడగొట్టాడు. -
ధోని జెర్సీ నంబర్ ‘7’కు రిటైర్మెంట్: బీసీసీఐ
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, రెండు ప్రపంచకప్లను గెలిపించిన సారథి మహేంద్ర సింగ్ ధోనిపై బీసీసీఐ సముచిత గౌరవం ప్రదర్శించింది. అతను మైదానంలో ధరించిన ‘7’ నంబర్ జెర్సీకి కూడా రిటైర్మెంట్ ఇస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. దిగ్గజ క్రికెటర్గా భారత క్రికెట్కు ధోని చేసిన సేవలకు గుర్తిస్తూ తాము ఈ నిర్ణయం తీసుకున్నామని బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు. దీని ప్రకారం ఇకపై భారత క్రికెట్కు ప్రాతినిధ్యం వహించే ఏ ఆటగాడు కూడా తమ జెర్సీపై ‘7’ నంబర్ వాడేందుకు బోర్డు అనుమతించదు. గతంలో ఆల్టైమ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ గౌరవార్ధం కూడా అతను ధరించిన ‘10’ నంబర్కు కూడా బీసీసీఐ అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించింది. సచిన్ తప్పుకున్న తర్వాత ఒకే ఒకసారి ఆల్రౌండర్ శార్దుల్ ఠాకూర్ ‘10’ నంబర్ జెర్సీని వేసుకోగా అభిమానుల నుంచి తీవ్ర నిరసన ఎదురైంది. దాంతో అతను తన నంబర్ను మార్చుకోవాల్సి వచ్చింది. జెర్సీ నంబర్లకు రిటైర్మెంట్ ప్రకటించడం ఇతర క్రీడల్లో చాలా కాలంగా ఉంది. బాస్కెట్బాల్ దిగ్గజం మైకేల్ జోర్డాన్ వేసుకున్న ‘23’ నంబర్ను కూడా అతని కెరీర్ తర్వాత చికాగో బుల్స్ టీమ్ రిటైర్మెంట్ ఇచ్చింది. -
శతకోటి జనుల స్వప్నభంగం
పరమపద సోపానపటంలో చివరి దాకా వెళ్ళి, మరొక్క గడిలో లక్ష్యాన్ని అందుకుంటామనగా పెద్ద పాము నోటిలో పడితే ఎలా ఉంటుంది? విజయం అంచుల దాకా వెళ్ళి, ఓటమి కోరల పాలబడితే ఎవరి మానసిక పరిస్థితి అయినా ఏమవుతుంది? వరల్డ్ కప్లో అప్రతిహతంగా దూసుకెళ్ళి, తీరా ఆదివారం ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో చిత్తయిన భారత క్రికెట్ జట్టు పరిస్థితీ, 140 కోట్ల మంది భారతీయుల మనఃస్థితీ అంతే. లక్షా 32 వేల మంది జనంతో క్రిక్కిరిసిన అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియమ్లో నిశ్శబ్దం తాండవించగా, ఆస్ట్రేలియా జట్టు 6 వికెట్ల తేడాతో గెలిచి, ఆరో ఐసీసీ పురుషుల క్రికెట్ వరల్డ్ కప్ను ఎగరేసుకుపోయింది. శత కోటి భారతీయుల స్వప్నం భంగమైంది. ఆసీస్కు ఇది ఆరో వరల్డ్ కప్ టైటిలైతే, ఆ దేశంతో ఇరవై ఏళ్ళ క్రితం దక్షిణాఫ్రికాలో ప్రపంచ కప్ ఫైనల్స్లో తలపడినప్పటి లానే భారత్కు మళ్ళీ చేదు అనుభవమే ఎదురైంది. నిజానికి, ఈసారి భారత జట్టు టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగకపోయినా, టోర్నీ ఆరంభం నుంచి ఆటలో ఆధిక్యాన్ని కనబరుస్తూ వచ్చింది. పది జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో గ్రూప్ దశ నుంచి ఎదురన్నది లేకుండా సాగింది. 2019 సెమీస్లో తమను ఓడించిన న్యూజిలాండ్ను ఈసారి సెమీస్లో తాను మట్టికరిపించి, ఫైనల్కు చేరింది. వరుస విజయాలతో కప్పు భారత్దే అన్న నమ్మకం కలిగించింది. తీరా ఆఖరి మహా సంగ్రామంలో తడబడింది. ఇక, తడబడుతూ ఈ టోర్నీని మొదలుపెట్టి, ఆఖరికి అఫ్గానిస్తాన్ చేతిలో సైతం ఓటమి కోరల నుంచి మ్యాక్స్వెల్ అసాధారణ డబుల్ సెంచరీతో బయటపడ్డ ఆసీస్ ఆఖరికి విజేత అయింది. తనదైన రోజున మన జట్టు మెడలు వంచి, టైటిల్ను సొంతం చేసుకుంది. టోర్నీలో అత్యధిక పరుగులు (కోహ్లీ – 765 రన్స్), అత్యధిక వికెట్లు (షమీ– 7 మ్యాచ్లలో 24 వికెట్లు), అత్యుత్తమ విజయ శాతం (90.9) లాంటి ఘనతలు సాధించిన భారత జట్టు ఆఖరి మెట్టుపైకి చేరకుండానే ఆగిపోయింది. అలాగని మునుపెన్నడూ లేనంత బలంగా కనిపిస్తున్న ఈ జట్టును తప్పుబట్టాల్సిన పని లేదు. అప్రతిహత విజయాలతో, అసాధారణ ప్రతిభా ప్రదర్శనతో, గత నెలన్నర పైగా కోట్లాది అభిమానులకు ఆనందోద్వేగాల్ని పంచిన భారత జట్టును తక్కువ చేయలేం. అసలు ప్రపంచ కప్లో ఫైనల్స్ దాకా చేరడమే గొప్ప.అలాగే, ఆటలో గెలుపోటములు సహజమనీ, విజేత ఒకరే ఉంటారనీ గుర్తెరగాలి. కాకపోతే, లోటుపాట్లేమిటన్నది కూడా సమీక్షించుకోవాలి. పేరున్న వేదికల్ని సైతం పక్కకునెట్టి, పాలకపక్ష పెద్దలు, బీసీసీఐ సారథుల స్వస్థలం లాంటి ఇతరేతర కారణాలతో అహ్మదాబాద్ను ఫైనల్స్కు వేదిక చేయడం మన కురచబుద్ధి రాజకీయాల తప్పు. ఇరుజట్లకూ సమాన విజయావకాశాలు కల్పించకుండా, టాస్ను కీలకం చేసి, మ్యాచ్ను లాటరీగా మార్చేసే పిచ్ను తుదిపోరుకు సిద్ధం చేయడం మరో తప్పు. ఇవన్నీ కొంప ముంచాయి. ప్రపంచ టోర్నీల్లో విజేతగా నిలిచే విషయంలో భారత్ వెనుకబడే ఉంది. ఈసారీ ఆ లోటు తీర లేదు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీని సాధించిన తర్వాత దశాబ్ద కాలంగా మరో ప్రపంచ టైటిల్ ఏదీ మనం గెలవలేదు. పదేళ్ళ లెక్క తీస్తే, సెమీస్లో 3 సార్లు, ఫైనల్స్లో 5 సార్లు... మొత్తం 8 కీలక మ్యాచ్లలో మనం చతికిలపడ్డాం. భారీ గేమ్స్ తాలూకు ఒత్తిడి, ఓటమి భయం, జట్టు ఆలోచనా దృక్పథం... ఇలా అనేకం అందుకు కారణాలు కావచ్చు. అంతర్జాతీయ వేదికపై జెండా ఎగరేసేందుకు మనలోని ఈ అంతర్గత ప్రత్యర్థులపై ముందు విజయం సాధించాలి. అందుకెలాంటి ప్రయత్నం, శ్రమ, శిక్షణ అవసరమన్న దానిపై క్రికెట్ యంత్రాంగం దృష్టి పెట్టాలి. కలబడి ఆడడమే కాదు... ఒత్తిడిలోనూ నిలబడి గెలవడమూ కీలకమేనని ఐపీఎల్ అలవాటైన నవతరానికి నూరిపోయాలి. టాస్ మొదలు ఏదీ కలసిరాని చావో రేవో మ్యాచ్లో పదో ఓవర్ నుంచి యాభయ్యో ఓవర్ మధ్య 40 ఓవర్లలో 4 బౌండరీలే భారత బ్యాట్స్మన్లు కొట్టారన్న లెక్క ఆశ్చర్యపరుస్తుంది. బ్యాటింగ్లో అవతల వికెట్లు టపటపా పడుతుంటే ఒక్కో పరుగుతో, భాగస్వామ్యం, తద్వారా భారీ ఇన్నింగ్స్ నిర్మించే ఓర్పు కావాలి. బంతిని బలంగా బాదడం కన్నా ప్రత్యర్థి ఫీల్డర్ల మధ్య ఖాళీల్లో కొట్టే నేర్పు రావాలి. అన్నీ తెలిసిన భారత్ ఆఖరి రోజున ఆ పనిలో విఫలమైంది. బలంగా కనిపించే జట్టులో తొలి అయిదుగురి తర్వాత బ్యాటింగ్ బలహీనతలూ బయటపడ్డాయి. కనీసం మరో 40 – 50 పరుగులు చేసివుంటే, బౌలింగ్లో, ఫీల్డింగ్లో మరింత రాణించివుంటే కథ మరోలా ఉండేదన్న మాటలు వినిపిస్తున్నది అందుకే! అలాగని, ఆసీస్ తాజా విజయాన్ని తక్కువ చేయలేం. ప్రతి కీలక సందర్భంలో సర్వశక్తులూ ఒడ్డే ఆ జట్టు పోరాటస్ఫూర్తిని అలవరచుకోవడమే ఎప్పటికైనా మనకు ముఖ్యం. ఆటలను పిచ్చిగా ప్రేమించే, కేవలం 2.5 కోట్ల జనాభా గల ఆ దేశం తరగని ప్రేరణ. మన జట్టు గెలవాలనుకోవడం సబబే కానీ, అన్ని రోజులూ, అన్ని మ్యాచ్లూ మనమే గెలవాల నుకోవడం అత్యాశ. అంచనాలు, అనవసర ఒత్తిళ్ళు పెంచేయడం మన లోపమే. కొమ్ములు తిరిగిన ఆటగాళ్ళకైనా కలసిరాని రోజులూ కొన్ని ఉంటాయి. భారత క్రికెట్లో మొన్న ఆదివారం అలాంటిదే. ప్రత్యర్థి ఆటగాడు సెంచరీ కొట్టినా, ఆ జట్టు కెప్టెన్ కప్ అందుకున్నా అభినందించలేనంత సంకుచిత ధోరణి క్రీడాస్ఫూర్తి కానేరదు. అహ్మదాబాద్ సాక్షిగా అందరం ముందు అది తెలుసుకోవాలి. అత్యు త్తమ బౌలింగ్ దాడి, కోహ్లీ అపూర్వ ఫామ్, రోహిత్ ఘనసారథ్యం లాంటి గొప్పలెన్నో ఈ టోర్నీ మిగిల్చిందని గుర్తుంచుకోవాలి. ఇప్పుడిక ప్రతిభకు పదును పెట్టుకుంటూనే, మనదైన మరో రోజు కోసం ఆగుదాం. వచ్చే వరల్డ్కప్ను ముద్దాడేందుకు నాలుగేళ్ళు నిరీక్షిద్దాం. శారీరకంగా, మానసికంగా మన జట్టు అందుకు సన్నద్ధమయ్యేందుకు సహకరిద్దాం. నెక్స్›్ట టైమ్ బెటర్ లక్... టీమిండియా! -
ICC World Cup 2023: అంతిమ సమరం కోసం...
అహ్మదాబాద్: వన్డే ప్రపంచకప్ ఫైనల్లో పోటీపడేందుకు భారత క్రికెట్ జట్టు గురువారం అహ్మదాబాద్ నగరానికి చేరుకుంది. విమానాశ్రయంలో భారత జట్టుకు ఘనస్వాగతం లభించింది. నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం జరిగే టైటిల్ పోరులో ఐదుసార్లు విశ్వవిజేత ఆ్రస్టేలియా జట్టుతో భారత్ తలపడుతుంది. ఫైనల్ వేదికపై ఎయిర్ షో ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఎయిర్ షో నిర్వహించేందుకు భారత వైమానిక దళం (ఐఏఎఫ్) సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోదీ సహా అతిరథ మహారథులు, లక్ష మంది ప్రేక్షకులు విచ్చేసే మ్యాచ్ వేదికపై ఐఏఎఫ్కు చెందిన ‘ది సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్’ ఎయిర్ షోతో మ్యాచ్కు ముందే కనువిందు చేయనుంది. దీనికి సంబంధించిన రిహార్సల్స్ను నేడు, రేపు స్టేడియంపై చేస్తారని గుజరాత్కు చెందిన డిఫెన్స్ ప్రొ ఒక ప్రకటనలో తెలిపింది. ఇలాంటి వైమానిక విన్యాసాలతో అలరించడం సూర్యకిరణ్ టీమ్కు కొత్తేం కాదు. దేశవ్యాప్తంగా ఎయిర్ షోలు ఈ జట్టే చేస్తుంది. మొత్తం తొమ్మిది ఎయిర్క్రాఫ్ట్లు నింగిలో తమ వైమానిక విన్యాసంతో ప్రేక్షకుల్ని ఆకట్టిపడేస్తాయి. మ్యాచ్ ప్రారంభానికి ముందుగా పది నిమిషాల పాటు ఈ ప్రదర్శన నిర్వహిస్తారు. -
ఒక్క అడుగు... ఒకే ఒక్క అడుగు!
అవును. 2023 ప్రపంచ వన్డే క్రికెట్ కప్కూ, భారత క్రికెట్ జట్టుకూ మధ్య మిగిలిన దూరం ఇక ఒకే ఒక్క అడుగు. 2011లో ఆఖరుసారిగా కప్ గెలిచిన తర్వాత మళ్ళీ పన్నెండేళ్ళకు తొలిసారిగా భారత జట్టు ప్రపంచకప్ ఫైనల్స్కు చేరడం అభిమానుల్లో ఆనందోత్సాహాల్ని నింపుతోంది. లక్ష్యం చాలా చేరువగా కనిపిస్తుండడంతో అందరిలో ఆశలు రేపుతోంది. బుధవారం ముంబయ్లోని వాంఖెడే స్టేడియమ్లో భారత, న్యూజిలాండ్ జట్ల మధ్య ఒక దశ వరకు పోటాపోటీగా సాగిన తొలి సెమీ ఫైనల్లో మన జట్టు విజయం సాధించిన తీరు మునుపెన్నడూ లేని ఆత్మవిశ్వాసాన్ని అందిస్తోంది. ఈ ప్రపంచకప్లో అప్రతిహతంగా 10 మ్యాచ్ల్లో విజయం సాధించిన టీమిండియా ఆదివారంఅహ్మదాబాద్లో మరొక్కసారి చేసే ఫైనల్ ఇంద్రజాలానికై అందరూ ఎదురుచూస్తున్నారు. 2011లో ప్రపంచ కప్ గెలిచిన తర్వాత నుంచి చూస్తే గడచిన 2015, 2019 టోర్నీల్లో కన్నా ఈసారే భారత జట్టు విజయావకాశాలు మెరుగ్గా, అధికంగా ఉన్నాయని మొదటి నుంచి క్రికెట్ పండితుల మాట. నిరుడు టీ–20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ నుంచి అవమానకరమైన రీతిలో వెనుదిరిగిన జట్టు ఏడాది తిరిగేసరికల్లా ఇంత బలమైన జట్టుగా రూపొందడం ఒక రకంగా అనూహ్యమే. ఆ ఘోర ఓటమి తర్వాత జట్టును పటిష్ఠంగా తీర్చిదిద్దడం వెనుక కెప్టెన్ రోహిత్ శర్మ పట్టుదల, కోచ్ రాహుల్ ద్రావిడ్ కృషి, ఆటగాళ్ళ నిరంతర శ్రమ దాగి ఉన్నాయి. మునుపటి రెండు కప్ల కన్నా ఈసారి భారత జట్టు మరింత స్థిరంగా, నిలకడగా కనిపిస్తోంది. ఆటగాళ్ళందరూ కలసి కట్టుగా సాగుతూ, వ్యక్తులుగా కన్నా ఒక జట్టుగా ప్రతిభా ప్రదర్శన చేయడం కలిసొస్తోంది. జట్టు సారథిగా రోహిత్ శర్మ ఆ విషయంలో అందరికీ ఆదర్శమయ్యాడు. ఈ టోర్నీలో కనీసం 3 సందర్భాల్లో వ్యక్తిగత మైలురాళ్ళకు దగ్గర ఉన్నా, దాని కన్నా జట్టు ప్రయోజనాల కోసం వేగంగా పరుగులు చేయడం మీదే దృష్టి పెట్టి, ఆ క్రమంలో ఔటవడమే అందుకు ఉదాహరణ. ఓపెనర్గా పరుగుల వరదతో ప్రత్యర్థి బౌలర్ల మానసిక స్థైర్యాన్ని చిత్తు చేసి, భారీ ఇన్నింగ్స్కు ఆయన పునాది వేస్తూ వస్తున్నారు. ఈ టోర్నీలో రోహిత్ శతకాలేమీ సాధించకపోయి ఉండవచ్చు. 124.15 స్ట్రైకింగ్ రేట్తో 550 పరుగులు చేసి, అత్యధిక పరుగుల వీరుల జాబితాలో నిలవడం విశేషం. సాధారణంగా వ్యక్తిగత విజయాలు, ప్రతిష్ఠను ఆశించే, ఆరాధించే చోట ఇది అసాధారణం. జట్టులో ఎవరి పాత్ర వారికి నిర్దిష్టంగా నిర్వచించడంలోనూ తెలివైన వ్యూహం, లక్ష్యంపై గురి కనిపిస్తున్నాయి. బుధవారం నాటి సెమీస్ అందుకు మంచి ఉదాహరణ. ఓపెనర్లు వేసిన పునాదిని పటిష్ఠం చేయడంలో కోహ్లీ, శరవేగంతో పరుగుల వరద పారించడంలో శ్రేయాస్ అయ్యర్, కొనసాగింపుగా రాహుల్, బౌలింగ్లో ప్రత్యర్థుల భాగస్వామ్యాన్ని ఛేదించడానికి పేసర్లు బుమ్రా, షమీ, సిరాజ్ల త్రయం, స్పిన్నర్లుగా కుల్దీప్, జడేజాలు సమర్థంగా పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా జట్టులో ప్రతి ఒక్కరూ అద్భుతమైన ఫామ్ను కొనసాగిస్తుండడం విశేషం. శుభ్మన్ గిల్ లాంటి వారి పాత్ర తక్కువేమీ కాదు. బ్యాటింగ్లో కోహ్లీ, శ్రేయాస్లు వరుసగా సెంచరీల మీద సెంచరీలు కొడుతు న్నారు. సెమీస్లోనే వన్డేల్లో శతకాల అర్ధ సెంచరీ పూర్తి చేసి, బ్యాట్స్మన్ల కింగ్ కోహ్లీ అయ్యాడు. ఆరాధ్య దైవమైన సచిన్ చూస్తుండగా, అతని రికార్డును అధిగమిస్తూ ఈ కొత్త చరిత్ర సృష్టించాడు. ఈసారి భారత బౌలర్ల అమోఘ ప్రతిభా ప్రదర్శన మళ్ళీ 1983 నాటి కపిల్ డెవిల్స్ను తలపిస్తోంది. ఈ వరల్డ్ కప్లో మొదటి 4 మ్యాచ్ల తర్వాత ఆలస్యంగా తుది జట్టులోకి వచ్చిన పేస్బౌలర్ షమీ ఇప్పటికే ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు పడగొట్టి, వికెట్ల వేటగాడిగా నిలిచాడు. వికెట్లలో అర్ధశతకం పూర్తిచేశాడు. ప్రపంచ కప్ చరిత్రలో మరి ఏ ఇతర భారతీయ ఆటగాడికీ లేని రీతిలో 57 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టిన అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసి, నంబర్ 1గా నిలిచాడు. లయ తప్పకుండా, పిచ్ మీద వికెట్ల గురి తప్పకుండా, పరుగు వేగం తగ్గకుండా ప్రత్యర్థులపై పులిలా విరుచుకుపడుతున్న షమి ఈ భారత జట్టు అమ్ములపొదిలో బ్రహ్మాస్త్రం. ఈ 19న జరిగే ఫైనల్లో షమీ ఇలాగే విజృంభిస్తే మనం కప్పు కొట్టడం కష్టమేమీ కాదు. గురువారం నాటి రెండో సెమీఫైనల్లో ఎప్పటిలానే సెమీస్ శాపం తప్పించుకోలేక సౌతాఫ్రికా బ్యాటింగ్లో తడబడింది. ఈ టోర్నీలో మొదట తడబడినా తర్వాత నిలబడిన ఆస్ట్రేలియా ఆఖరికి తక్కువ పరుగుల లక్ష్యాన్ని సైతం శ్రమించి, గెలిచింది. ఓడితేనేం పోరాటస్ఫూర్తిలో సౌతాఫ్రికా జనం మనసు గెలిచింది. అయిదుగురు రెగ్యులర్ బౌలర్లతోనే ప్రయోగం చేస్తున్న భారత్, అయిదుసార్లు ప్రపంచ విజేతగా నిలిచిన బలమైన ఆసీస్తో మహాయుద్ధానికి సమస్త శక్తియుక్తులూ కేంద్రీకరించాలి. అయితే, ఇప్పటికే భారత టాప్ 5 బ్యాట్స్మన్లు 65.8 సగటుతో 2570 పరుగులు సాధించారు. 2007 నాటి ఆసీస్ జట్టు బ్యాట్స్మన్ల సగటు కన్నా ఇది ఎక్కువ. అలాగే ఈ టోర్నీలో తొలి రెండు మ్యాచ్లలో ఓడిన ఆసీస్ ఆటను గమనిస్తే ఆ జట్టు మరీ అజేయమైనదేం కాదనీ అర్థమవుతుంది. అందుకే, వరల్డ్ కప్ వేదికపై 1983లో అనామకంగా వెళ్ళి అద్భుతం చేసిన∙కపిల్ సేన, 2011లో ఒత్తిడిని తట్టుకొని అంచనాలందుకున్న ధోనీ అండ్ కో తర్వాత ముచ్చటగా మూడోసారి ఇప్పుడు రోహిత్ శర్మ అండ్ టీమ్ ఆ ఘనత సాధిస్తే ఆశ్చర్యం లేదు. పుష్కరకాలం నిరీక్షణ ఫలిస్తే శతకోటి భారతీయులకు అంతకన్నా ఆనందమూ లేదు. అనూహ్య ఘటనలు జరిగితే తప్ప ఆతిథ్య దేశమైన మనమే ఈ ఆదివారం ఐసీసీ వరల్డ్ కప్ అందుకోవచ్చు. ఎందుకంటే– ప్రతిసారి కన్నా భిన్నంగా ఈసారి మనది వట్టి ఆశ, అభిమానుల ప్రార్థన కాదు... అంతకు మించిన ప్రతిభా ప్రదర్శన, ఆత్మవిశ్వాస ప్రకటన! -
Asia Cup 2023: రాహుల్, శ్రేయస్ పునరాగమనం
సొంతగడ్డపై జరిగే వన్డే వరల్డ్ కప్కు ముందు రిహార్సల్లాంటి ఆసియా కప్ టోర్నీ కోసం భారత బృందం సిద్ధమైంది. సుదీర్ఘ కాలంగా గాయాలతో సహవాసం చేసిన ఆటగాళ్లంతా కోలుకొని జట్టులోకి రాగా... ఇంకా వన్డేలే ఆడని కొత్త ప్లేయర్కు కూడా తొలిసారి చోటు లభించింది. అజిత్ అగార్కర్ నాయకత్వంలోని సెలక్షన్ కమిటీ 17 మందితో ఈ టీమ్ను ప్రకటించింది. ఇందులో నుంచి ఇద్దరిని తప్పించి 15 మందితో సెపె్టంబర్ 5లోగా వరల్డ్ కప్ టీమ్ను ప్రకటిస్తారు. ఈ నేపథ్యంలో అసలు సమరానికి సిద్ధం కావడానికి ఆసియా కప్ కీలకం కానుంది. న్యూఢిల్లీ: ఆసియా కప్లో పాల్గొనే భారత క్రికెట్ జట్టును బీసీసీఐ సెలక్టర్లు సోమవారం ప్రకటించారు. ఈ నెల 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు పాకిస్తాన్, శ్రీలంకలో ఈ టోర్నీ జరుగుతుంది. గాయాల నుంచి కోలుకొని సుదీర్ఘ విరామం తర్వాత కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ తిరిగి జట్టులోకి వచ్చారు. ఇప్పటికే ఐర్లాండ్తో టి20లు ఆడుతున్న బుమ్రా, ప్రసిధ్ కృష్ణలు కూడా వన్డేల్లో పునరాగమనం చేశారు. హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ అరుదైన అవకాశాన్ని దక్కించుకోవడం ఈ సెలక్షన్స్లో కీలక పరిణామం. ఇప్పటి వరకు ఇంకా వన్డేల్లో అరంగేట్రం చేయని తిలక్కు కీలకమైన ఆసియా కప్ జట్టులో చోటు దక్కింది. మరోవైపు లెగ్ స్పిన్నర్ యుజువేంద్ర చహల్ను టీమ్లోకి ఎంపిక చేయలేదు. రెగ్యులర్ పేసర్లు షమీ, సిరాజ్, బుమ్రా, ప్రసిధ్ ఉండగా... ఆల్రౌండర్లుగా జడేజా, అక్షర్ పటేల్, పాండ్యా, శార్దుల్ కీలకపాత్ర పోషించాల్సి ఉంటుంది. బ్యాటింగ్ బృందం విషయంలో ఎలాంటి అనూహ్య ఎంపికలు లేవు. జట్టులో ఒక్క ఆఫ్స్పిన్నర్ కూడా లేడు. వారిద్దరూ సిద్ధం... రాహుల్ చివరిసారిగా మే 1న ఐపీఎల్ మ్యాచ్ బరిలోకి దిగి తొడ కండరాల గాయంతో ఆటకు దూరం కాగా, మార్చిలో ఆ్రస్టేలియాతో మూడో టెస్టు ఆడుతూ వెన్ను గాయంతో శ్రేయస్ మ్యాచ్ మధ్యలో నుంచి తప్పుకున్నాడు. వీరిద్దరు శస్త్రచికిత్సల అనంతరం ఇప్పటి వరకు జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో రీహాబిలిటేషన్లో ఉన్నారు. మిడిలార్డర్లో కీలకం కానున్న వీరిద్దరు కోలుకొని మ్యాచ్ ఫిట్నెస్ను సాధించడంతో మళ్లీ జట్టులోకి ఎంపిక చేశారు. శ్రేయస్ పూర్తి ఫిట్ కాగా, రాహుల్ పాత గాయం నుంచి కోలుకున్నా... స్వల్ప అసౌకర్యంతో ఉన్నాడు. దాంతో ఆసియా కప్ కోసం ముందు జాగ్రత్తగా రిజర్వ్ ఆటగాడిగా సంజు సామ్సన్ను కూడా ఎంపిక చేశారు. వన్డేల్లో వరుసగా విఫలమైన పేలవ రికార్డు ఉన్నా... సూర్యకుమార్ యాదవ్పై సెలక్టర్లు నమ్మకం ఉంచారు. రాహుల్ తర్వాత రెండో వికెట్ కీపర్గా సామ్సన్ కంటే ఇషాన్ కిషన్కు ప్రాధాన్యత దక్కింది. జట్టు వివరాలు: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెపె్టన్), గిల్, కోహ్లి, శ్రేయస్, రాహుల్, జడేజా, బుమ్రా, కుల్దీప్, సిరాజ్, షమీ, ఇషాన్ కిషన్, శార్దుల్, అక్షర్, సూర్యకుమార్, తిలక్ వర్మ, ప్రసిధ్ కృష్ణ, సంజు సామ్సన్ (రిజర్వ్ ఆటగాడు). ఆఫ్స్పిన్నర్గా అశ్విన్, సుందర్లపై కూడా చర్చ జరిగింది. ఒక పేసర్ను తగ్గిస్తేనే చహల్ను తీసుకోగలిగేవాళ్లం. కానీ జట్టులో మన పేసర్ల పాత్ర కీలకం కానుంది. అయితే ఎవరికీ దారులు మూసుకుపోలేదు. మున్ముందు ఏదైనా జరగొచ్చు. ఒక ఆటగాడికి ప్రత్యేకంగా ఒకే స్థానం అంటూ ఏమీ ఉండదు. పరిస్థితిని బట్టి ఆర్డర్ మారుతుంది. అందరూ దీనికి సిద్ధంగా ఉండాలని చెప్పాం. అయితే దీనర్థం ఏడో నంబర్ ఆటగాడు ఓపెనర్గా, ఓపెనర్ వెళ్లి ఎనిమిదో స్థానంలో ఆడటం కాదు. అలాంటి పిచ్చి పనులు మేం చేయం. టాప్–3 చాలా కాలంగా మారలేదు కాబట్టి మిడిలార్డర్లో స్వల్పంగా మార్పులు ఉంటాయని నా ఉద్దేశం. –రోహిత్ శర్మ, భారత కెప్టెన్ -
అమ్మానాన్న వద్దన్నారు! ఇప్పుడు.. ఏకంగా టీమిండియాకు! ఆ జంక్షన్కు ఆమె పేరు
పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ ఉండదన్న మాటను అక్షరాలా నిజం చేసి చూపించింది మిన్ను మణి. కష్టపడితే ఫలితం తప్పక దక్కుతుందడానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. గిరిజన గూడెంలో పుట్టి.. అడుగడుగునా ఎదురవుతున్న సవాళ్లను మనోబలంతో జయించి.. టీమిండియా క్రికెటర్ స్థాయికి ఎదిగింది. ఆడపిల్లలకు క్రికెట్ ఎందుకని వారించిన అమ్మానాన్నలతో పాటు.. తమ ఊరు మొత్తాన్ని గర్వపడేలా చేస్తోంది. విమర్శించిన నోళ్లే తనను కొనియాడేలా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తోంది. ప్రతిష్టాత్మక ఆసియా క్రీడలు-2023కి సన్నద్ధమవుతున్న ఈ ‘మట్టిలో మాణిక్యం’ గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం! మగవాళ్ల ఆట మనకెందుకు? కేరళలోని వయనాడ్ జిల్లాలో బ్రహ్మగిరి కొండల అంచున ఉన్న గిరిజన గూడెం మిన్ను స్వస్థలం. ‘కరూచియా’ తెగకు చెందిన ఆమె తండ్రి మణి రోజువారీ కూలీ. ఆయన తెచ్చిన డబ్బుతో ఇంటిని చక్కదిద్దే బాధ్యతలు తలకెత్తుకున్న వసంత మిన్ను తల్లి. చిన్ననాటి నుంచే మిన్నుకు క్రికెట్ మీద ఆసక్తి ఉండేది. మగపిల్లలతో కలిసి క్రికెట్ ఆడేది. కానీ మిన్నును అథ్లెట్గా చూడాలనుకున్న ఆమె తల్లిదండ్రులకు ఇది ఎంతమాత్రం నచ్చలేదు. మగవాళ్ల ఆట మనకెందుకని కూతుర్ని వారించారు. పురుషాధిక్య ప్రపంచంలో మిన్నుకు ఇంటి నుంచే ఇలాంటి పోరు మొదలైంది. పట్టువీడలేదు.. బంగారు భవిష్యత్తుకు బాటలు పడ్డాయలా! కానీ ఆమె పట్టువీడలేదు. ఎల్సమ్మ బేబీ అనే స్కూల్ పీఈటీ టీచర్తో పరిచయం మిన్ను రాతను మార్చింది. ఎనిమిదో తరగతి చదివే రోజుల్లో ఆమెలోని ప్రతిభను గుర్తించిన ఎల్సమ్మ.. తల్లిదండ్రులను ఒప్పించి మరీ మిన్ను బంగారు భవిష్యత్తుకు బాటలు వేసింది. దగ్గరుండి మరీ మిన్నును కేరళ క్రికెట్ అసోసియేషన్కు తీసుకెళ్లింది. అంచెలంచెలుగా ఎదిగి ప్రతిభావంతురాలైన మిన్ను తన ఆటతో అక్కడున్న వాళ్లను మంత్రముగ్ధులను చేసి.. తొలుత జిల్లా స్థాయి, ఆపై అండర్ 16.. అండర్ 23లో కేరళకు ఆడింది. అంచెలంచెలుగా ఎదుగుతూ భారత మహిళా అండర్-23, అనంతరం ఇండియా- ఏ జట్టుకు ఎంపికైంది. అయితే, ఆటలో దూసుకుపోతున్నా ‘ఆర్థిక కష్టాల కడలి’ని మాత్రం అంత తేలికగా దాటలేకపోయింది మిన్ను. దశ తిరిగింది.. అదృష్టం వరించింది అలాంటి సమయంలో మహిళా ప్రీమియర్ లీగ్ రూపంలో మిన్నును ‘అదృష్టం’ వరించింది. ఆమె అద్భుత ఆట తీరుకు ప్రతిఫలంగా ఢిల్లీ క్యాపిటల్స్ ఏకంగా రూ. 30 లక్షలు చెల్లించి వేలంలో కొనుగోలు చేసింది. దీంతో మిన్ను కుటుంబానికి కాస్త సాంత్వన లభించింది. అయితే, ఆర్థికంగా కష్టాలు తీరినా.. తనకు ఈ డబ్బు ముఖ్యం కాదని.. ఏదో ఒకరోజు టీమిండియాకు ఆడటమే తన ప్రధాన లక్ష్యమని చెప్పడం.. మిన్నుకు ఆట పట్ల ఉన్న అంకితభావానికి నిదర్శనం. ఆమె ఆశయం గొప్పది.. అందుకే బంగ్లాదేశ్ పర్యటన రూపంలో అవకాశం కలిసివచ్చింది. అరంగేట్రంలోనే సత్తా చాటి.. ఈ ఏడాది బంగ్లాదేశ్తో భారత మహిళా క్రికెట్ జట్టు ఆడిన టీ20 సిరీస్ సందర్భంగా ఆమెకు అవకాశం వచ్చింది. బంగ్లాతో మొదటి టీ20 ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో మిన్న మణి అరంగేట్రం చేసింది. మొదటి మ్యాచ్లో 3 ఓవర్లు బౌలింగ్ చేసి 21 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసిన ఈ ఆల్రౌండర్కు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. అయితే, ఈ సిరీస్లో మొత్తంగా ఐదు వికెట్లతో మెరిసిన మిన్ను.. తనదైన ముద్ర వేయగలిగింది. ఆరంభంలోనే అదరగొట్టే ప్రదర్శనతో ఆకట్టుకుని వారం తిరిగే లోపే 19వ ఆసియా గేమ్స్ జట్టులో చోటు సంపాదించింది. చైనా వేదికగా సెప్టెంబరు 23 నుంచి ఆరంభం కానున్న ప్రతిష్టాత్మక క్రీడల్లో భాగం కానుంది. సమాజం నుంచి ఎన్నో విమర్శలు ‘‘క్రికెట్పై నాకు ఆసక్తి ఉందన్న విషయం తెలిసి నా తల్లిదండ్రులతో పాటు సమాజం నుంచి విమర్శలు ఎదుర్కొన్నా. ఎనిమిదో తరగతికి వచ్చే దాకా నేను లోకల్ మ్యాచ్లు ఆడుతున్న విషయం మా అమ్మానాన్నలకు కూడా తెలియదు. చదువుకుంటూ.. వరి పొలాల్లో పనిచేసుకుంటూ.. నా తల్లిదండ్రులకు వ్యవసాయంలో సాయం చేసేదాన్ని. స్థలం కావాలి అయితే, ఇప్పుడు పరిస్థితి మారింది. వయనాడ్ నుంచి ఓ అమ్మాయి టీమిండియాకు ఆడుతోందని చుట్టుపక్కల వాళ్లు గర్వపడుతున్నారు. నాలాగే వాళ్ల కుమార్తెలు కూడా క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నారు’’ అని 24 ఏళ్ల మిన్ను మణి సంతోషం వ్యక్తం చేసింది. తనలాంటి అమ్మాయిలను ప్రోత్సహించేందుకు క్రికెట్ నర్సరీ నిర్మించేలా స్థలం మంజూరు చేయాలని స్థానిక పాలనా అధికారులను కోరినట్లు జాతీయ మీడియాతో తమ మనసులోని మాట బయటపెట్టింది. అరుదైన గౌరవం.. ఆ జంక్షన్కు పేరు ఉత్తర కేరళలోని వయనాడ్ జిల్లాలో గల మనంతవాడీ మున్సిపాలిటి మిన్ను మణిని అరుదైన గౌరవంతో సత్కరించింది. మైసూర్ రోడ్డు జంక్షన్కు మిన్ను మణి జంక్షన్గా నామకరణం చేసింది. మిన్ను ఇంటి నుంచి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఈ జంక్షన్ ఉంటుంది. ఊహించని బహుమతి సినీ, రాజకీయ ప్రముఖులకు మాత్రమే సాధారణంగా ఇలాంటి గౌరవాలు దక్కుతాయని తాను భావించానని.. అయితే, స్థానిక మున్సిపాలిటీ అధికారులు ఇలా తనకు ఊహించని బహుమతి ఇచ్చారని మిన్ను ఆనందంతో ఉప్పొంగిపోయింది. తమ ఇంటి నుంచి ఈ జంక్షన్ వరకు త్వరలోనే రోడ్డు కూడా నిర్మిస్తామని అధికారులు చెప్పారని హర్షం వ్యక్తం చేసింది. మట్టి సువాసనలు పరిమళించగా.. ఆసియా క్రీడల్లో భారత్కు ప్రాతినిథ్యం వహించనుండటం గర్వంగా ఉందన్న మిన్ను.. ఆల్రౌండర్గా మెగా ఈవెంట్లో సత్తా చాటుతానని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. బౌలర్గా తనకు ప్రాధాన్యం ఉంటుందన్న మిన్ను.. ఏడో స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం కూడా రావొచ్చని చెప్పుకొచ్చింది. మరి లెఫ్టాండ్ బ్యాటర్.. రైట్ ఆర్మ్ ఆఫ్బ్రేక్ స్పిన్నర్ అయిన మిన్ను మణి ఆసియా క్రీడల్లో టీమిండియా జెర్సీ ధరించి బరిలోకి దిగితే.. ఆమె తల్లిదండ్రులతో కేరళ మొత్తం గర్విస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మట్టి సువాసనలతో పరిమళించిన తమ ఆడబిడ్డను దేశం కూడా విజయోస్తు అని దీవిస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదనుకుంటా! హ్యాట్సాఫ్ అండ్ ఆల్ ది బెస్ట్ మిన్ను ‘మణి’!! -సాక్షి వెబ్డెస్క్ చదవండి: Ind Vs WI: టీమిండియాను అవమానించిన విండీస్ హిట్టర్! -
ఇంత తక్కువ ప్రైజ్మనీ ఎందుకివ్వడం.. మిక్సీలు, గ్రైండర్లు ఇవ్వడం బెటర్!
ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25 సీజన్ను టీమిండియా ఘన విజయంతో ఆరంభించింది. తొలి టెస్టులో ఆల్రౌండర్ ప్రదర్శనతో కరేబీయన్ జట్టును మట్టికరిపించి భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక స్పిన్నర్లు చెలరేగడంతో మూడు రోజుల్లోనే ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో భారత్ విజయం సొంతం చేసుకుంది. ఆరంగ్రేటం చేసిన తొలి మ్యాచ్లోనే రికార్డు సెంచరీతో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన యశస్వి జైస్వాల్ (387 బంతుల్లో 16 ఫోర్లు, సిక్స్తో 171) మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. ఫ్యాన్స్ ఫైర్ ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది గానీ.. జైస్వాల్ అందుకున్న మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రివార్డ్పై తాజాగా నెట్టింట దుమారాన్ని రేపుతోంది. ప్రస్తుతం దీనిపై ఎప్పుడూ లేనంతగా సోషల్ మీడియా వేడి వేడిగా చర్చ కూడా మొదలైంది. అసలు ఈ రచ్చ అంతా ఎందుకంటే.. యశస్వి జైశ్వాల్కు రివార్డుగా ఇచ్చిన మొత్తం 500 అమెరికా డాలర్లు కావడమే. ఈ మొత్తం మన భారత కరెన్సీలో సుమారు రూ.41,000 మాత్రమే. ఇదే చర్చనీయాంశంగా మారింది. అసలు కారణం ఇదేనా! ఈ రివార్డ్ మనీని చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. భారత దేశవాళీ క్రికెట్ లోనూ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పారితోషికం ఎక్కువ అని సెటైర్లు పేలుతున్నాయి. ఇదిలా ఉండగా.. వెస్టిండీస్ బోర్డు పరిస్ధితి ఆర్థికంగా అంతగా బాలేదని చెప్పాలి. వాస్తవానికి టీమ్ ఇండియా కూడా ఈ సిరీస్ ఆడేందుకు ప్రధాన కారణమే వెస్టిండీస్ బోర్డుకు ఆర్థిక సహకారం అందించడమే. ఈ కారణం వల్లే వెస్టిండీస్ బోర్డు రివార్డ్ మొత్తాన్ని 500 అమెరికన్ డాలర్లకే పరిమితం చేసినట్లు తెలుస్తోంది. అయినా ఇంత తక్కువ మొత్తంలో రివార్డ్ బహుకరించడం నెట్టింట అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. దీనిపై ఫ్యాన్స్ ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. దీనికంటే మిక్సీలు, గ్రైండర్లు ఇవ్వడం బెటర్ అని జోకులు పేల్చుతున్నారు. Only $500? pic.twitter.com/RMLvMvziJu — Apoorv Sood (@Trendulkar) July 15, 2023 చదవండి Ind Vs Wi: వెస్టిండీస్ వెన్నులో వణుకు పుట్టించాడు.. దిగ్గజ బౌలర్ సరసన చేరిన అశ్విన్! -
వెస్టిండీస్ వెన్నులో వణుకు పుట్టించాడు.. దిగ్గజ బౌలర్ సరసన చేరిన అశ్విన్!
రోసియు (డొమినికా): భారత సీనియర్ స్పిన్నర్ అశ్విన్ (7/71) స్పిన్ వలలో విండీస్ బ్యాటర్లు విలవిలలాడారు. దీంతో తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్, 141 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ టెస్టు మొదలైనప్పటి నుంచి ప్రతి రోజు, ప్రతి సెషన్లో కూడా భారత్ హవానే కొనసాగింది. దీంతో మూడే రోజుల్లో రోహిత్ సేన మ్యాచ్ను ముగించి కొత్త ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యటీసీ)కు ఘనంగా శ్రీకారం చుట్టింది. శుక్రవారం 27/2 స్కోరు వద్ద టీ విరావనికి వెళ్లిన వెస్టిండీస్ ఆఖరి సెషన్లో మిగతా 8 వికెట్లను కోల్పోయింది. రెండో ఇన్నింగ్స్లో ఆతిథ్య జట్టు 50.3 ఓవర్లలో 130 పరుగులకే కుప్పకూలింది. కరీబియన్ గడ్డపై శుభారంభం చేసిన భారత్ రెండు టెస్టుల సిరీస్లో 1–0తో ఆధిక్యంలో నిలింది. రెండో టెస్టు ఈ నెల 20 నుం పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో జరుగుతుంది. ఆఖరి సెషన్ కాదు...అశ్విన్ సెషన్! వన్నె తగ్గని వెటరన్ స్పిన్నర్ మాయాజాలానికి ఆఖరి సెషన్ కాస్తా అశ్విన్ సెషన్గా వరింది. టీ బ్రేక్ తర్వాత అతని స్పిన్ ఉచ్చులో విండీస్ క్కుకుంది. ఈ సెషన్లో పడిన 8 వికెట్లలో 6 వికెట్లు అశ్విన్వే కావడం విశేషం. అలిక్ అతనజ్ (28; 5 ఫోర్లు), హోల్డర్ (20 నాటౌట్; 1 సిక్స్) కొద్ది సేపు నిలవగలిగారు. లోయర్ ఆర్డర్లో అల్జారి జోసెఫ్ (13) నుం... కార్న్వాల్ (4), కీమర్ రోచ్ (0), ఆఖరి వికెట్ వారికన్ (18) వరకు వరుస నాలుగు వికెట్లు అశ్విన్ బౌలింగ్లోనే పడ్డాయి. తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్లు తీసిన అశ్విన్ ఈ టెస్టులో మొత్తం 12 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. కుంబ్లే సరసన ఒక టెస్టులో అశ్విన్ పది వికెట్ల ఘనత నమోదు చేయడం ఇది ఎనిమిదో సారి. భారత బౌలర్లలో అనిల్ కుంబ్లే (8)ను అతను సమం చేశాడు. తొలి టెస్టులోనే ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన ఎనిమిదో భారత క్రికెటర్ యశస్వి. అతనికంటే ముందు ప్రవీణ్ అమ్రే, ఆర్పీ సింగ్, అశ్విన్, ధావన్, రోహిత్, పృథ్వీ షా, శ్రేయస్ ఈ ఫీట్ సాధించారు. చదవండి Rohit Sharma: అరంగేట్రంలో వాళ్లిద్దరు అలా! ఇషాన్ ఇలా! అందుకు కారణం చెప్పిన రోహిత్ -
Asian Games: బీసీసీఐ కీలక నిర్ణయం! ఇక దేశవాళీ టీ20 టోర్నీలోనూ..
BCCI- Asian Games 2023: ముంబై: ఆసియా క్రీడల్లో భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్లు పాల్గొనడం ఖాయమైంది. శుక్రవారం జరిగిన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో దీనికి అధికారికంగా ఆమోద ముద్ర వేశారు. చైనాలో సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకు ఆసియా క్రీడలు జరుగుతాయి. అయితే ఈ పోటీల్లో మహిళల విభాగంలో మాత్రమే భారత రెగ్యులర్, పూర్తి స్థాయి జట్టు బరిలోకి దిగుతోంది. పురుషుల విభాగంలో మాత్రం ద్వితీయ శ్రేణి జట్టును పంపాలని బోర్డు నిర్ణయించింది. అక్టోబర్ 5 నుంచి భారత్లోనే వన్డే వరల్డ్ కప్ జరుగుతుండటమే దీనికి కారణం. అదే విధంగా.. ఐపీఎల్–2023 సీజన్లో కొత్తగా తీసుకొచ్చిన ‘ఇంపాక్ట్ ప్లేయర్’ నిబంధనను దేశవాళీ టి20 టోర్నీ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ అమలు చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం నాటి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. చదవండి: బజ్బాల్ ఆట చూపించాడు.. అరుదైన రికార్డు కొల్లగొట్టాడు -
ఇండియాలో మ్యాచ్లంటే అంతే! వాళ్లు మాపై ఒత్తిడి పెంచి: నితిన్ మీనన్ సంచలన వ్యాఖ్యలు
టీమిండియా ఆటగాళ్లపై ఐసీసీ ఎలైట్ ప్యానెల్లో చోటు దక్కించుకున్న భారత అంపైర్ నితిన్ మీనన్ సంచలన వాఖ్యలు చేశాడు. 50-50 ఉండే ఛాన్సులను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు భారత ఆటగాళ్లు అంపైర్లపై ఒత్తడి తీసుకువస్తారని మీనన్ తెలిపాడు. మీనన్ ప్రస్తుతం ఇంగ్లండ్లో ఉన్నాడు. యాషెస్ సిరీస్-2023లో ఆఖరి మూడు టెస్టులకు నితిన్ మీనన్ అంపైర్గా వ్యవహరించబోతున్నాడు. యాషెస్ సిరీస్లో మీనన్ అంపైర్గా వ్యవహరించనుండడం ఇదే తొలి సారి. కాగా గత కొనేళ్లుగా భారత తమ సొంత గడ్డపై ఆడిన చాలా మ్యాచ్ల్లో ఆన్ఫీల్డ్ అంపైర్గా తన బాధ్యతలు నిర్విర్తించాడు. ఐపీఎల్లో కూడా మెజారిటీ మ్యాచ్ల్లో మీనన్ అంపైర్గా కన్పిస్తున్నాడు. ఈ క్రమంలో భారత జట్టుకు వ్యతిరేకంగా అతడు తీసుకున్న కొన్ని నిర్ణయాలు వివాదస్పదమయ్యాయి కూడా. "భారత జట్టు స్వదేశంలో ఆడుతున్నప్పుడు స్టేడియం మొత్తం ఫుల్ అయిపోతుంది. కాబట్టి తమ అభిమానులు ముందు ఎలాగైనా గెలవడానికి ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో టీమిండియాలో చాలా మంది స్టార్ ఆటగాళ్లు అంపైర్లపై ప్రెషర్ పెట్టాలని ప్రయత్నిస్తారు. 50-50 ఛాన్స్లను తమకు అనుకూలంగా తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ అటువంటి ఒత్తడిలను ఎలా ఎదుర్కొవాలో మాకు బాగా తెలుసు. కాబట్టి వాళ్లేం చేసినా యా ఏకాగ్రత ఏ మాత్రం దెబ్బ తీయలేరు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోగలిగే సామర్థ్యం ఉన్నవారే భారత ఆటగాళ్లు తెచ్చే ఒత్తడిని తట్టుకోగలరు. భారత్లో అంపైర్గా వ్యవహరించడం ఏ ఎలైట్ ప్యానెల్ అంపైర్కైనా సవాలుగా ఉంటుంది. నాకు మొదట్లో అంతగా అనుభవం లేదు. ఐసీసీ ఎలైట్ ప్యానెల్లోకి వెళ్లాక చాలా విషయాలు నేర్చుకున్నాను" అని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మీనన్ పేర్కొన్నాడు. కాగా భారత్ నుంచి ఐసీసీ ఎలైట్ ప్యానెల్లో చోటు దక్కించుకున్న ఏకైక అంపైర్ నితిన్ మీననే కావడం విశేషం. చదవండి: Ind vs WI 2023: రోహిత్, కోహ్లి ఆడతారు.. అయితే! వాళ్లిద్దరి అరంగేట్రం ఫిక్స్! -
భారత క్రికెట్ జట్టు కిట్ స్పాన్సర్గా అడిడాస్
చెన్నై: జర్మనీకి చెందిన ప్రముఖ క్రీడా ఉత్పాదనల సంస్థ అడిడాస్ భారత క్రికెట్ జట్టు కిట్ స్పాన్సర్గా వ్యవహరించనుంది. ప్రస్తుత స్పాన్సర్ ‘కిల్లర్ జీన్స్’తో కాంట్రాక్టు గడువు ఈ నెలాఖరుతో ముగియనుండటంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త స్పాన్సర్షిప్ ఇచ్చింది. దీనిపై బోర్డు కార్యదర్శి జై షా మాట్లాడుతూ ‘దేశంలో క్రికెట్ అభివృద్ధి అంచనాలను మించుతుంది. కాబట్టి ప్రపంచశ్రేణి సంస్థ మాతో జట్టు కట్టడంపై పెద్దగా ఆశ్చర్యమేమీ లేదు’ అని అన్నారు. జర్మన్ స్పోర్ట్స్ బ్రాండ్ అయిన అడిడాస్తో ఒప్పందం ఎన్నేళ్లు, ఎంత మొత్తానికి స్పాన్సర్షిప్ పొందిందనే వివరాలేవీ ఆయన వెల్లడించలేదు. విశ్వసనీయ వర్గాల ప్రకారం రూ. 350 కోట్లతో అడిడాస్ కిట్ స్పాన్సర్షిప్ దక్కించుకున్నట్లు తెలిసింది. టీమిండియా వచ్చే నెల 7 నుంచి ఆస్ట్రేలియాతో జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో తలపడుతుంది. ఆ జెర్సీలపై అడిడాస్ లోగో కనిపించనుంది. టీమ్ స్పానర్ బైజుస్ కూడా మారుతున్నట్లు తెలిసింది. ఈ నవంబర్ వరకు గడువున్నప్పటికీ సదరు సంస్థ ముందుగానే వైదొలగనుండటంతో త్వరలోనే బిడ్లను ఆహ్వానిస్తారు. -
హైదరాబాద్ లో ఇండియా, పాకిస్తాన్ వరల్డ్ కప్ మ్యాచ్
-
BCCI: 'భారత క్రికెట్ జట్లను చైనాకు పంపించలేం'
ఈ ఏడాది చైనాలో జరగనున్న ఏషియన్ గేమ్స్కు భారత క్రికెట్ జట్లను(పురుషులు, మహిళలు) పంపించలేమని బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. ఫ్యూచర్ టూర్ ప్రోగామ్(ఎఫ్టీపీ)లో భాగంగా కొన్ని కమిట్మెంట్స్ ఉండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ పేర్కొంది. కాగా ఈ ఏడాది సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకు చైనాలోని హాంగ్జౌ వేదికగా ఏషియన్ గేమ్స్ జరగనున్నాయి. గతేడాది బర్మింగ్హమ్ కామన్వెల్త్ గేమ్స్కు బీసీసీఐ మహిళల క్రికెట్ జట్టును పంపిన సంగతి తెలిసిందే. ఫైనల్లో ఆస్ట్రేలియాతో చేతిలో ఓడిన హర్మన్ సేన సిల్వర్ మెడల్ గెలుచుకుంది. కామన్వెల్త్ గేమ్స్లానే ఏషియన్ గేమ్స్లోనూ ఈసారి క్రికెట్ను ప్రవేశపెట్టారు. భారత ఏషియన్ గేమ్స్ చీఫ్ భుపేందర్ భజ్వా మాట్లాడుతూ.. ''చైనాలో జరగనున్న ఏషియన్ గేమ్స్లో అన్ని విభాగాల్లో ఎంట్రీ పేర్లు ఇచ్చాం.. ఒక్క క్రికెట్ తప్ప.. ఎందుకంటే క్రికెట్ జట్లను అక్కడికి పంపకూడదని బీసీసీఐ నిర్ణయించింది.'' అని తెలిపాడు. ఇదే విషయమై బీసీసీఐ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ..''డెడ్లైన్కు ఒక్కరోజు ముందు మాకు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) నుంచి మెయిల్ వచ్చింది. కానీ అప్పటికే బీసీసీఐ ఎఫ్టీపీలో భాగంగా పరుషులు, మహిళల క్రికెట్ షెడ్యూల్ను ప్లాన్ చేసింది. ఏషియన్ గేమ్స్ సమయంలో ముఖ్యమైన మ్యాచ్లు ఉన్నాయి. అందుకే భారత క్రికెట్ జట్లను చైనాకు పంపించకూడదని నిర్ణయించుకున్నాం.'' అని పేర్కొన్నాడు. ఇక ఎఫ్టీపీ ప్రకారం టీమిండియా మెన్స్ జట్టు అక్టోబర్-నవంబర్ నెలల్లో స్వదేశంలో వన్డే ప్రపంచకప్ ఆడనుంది. అదే సమయంలో మహిళల జట్టు సౌతాఫ్రికా, న్యూజిలాండ్లతో సిరీస్లు ఆడనుంది. అయితే ఏషియన్ గేమ్స్ కూడా అప్పుడే జరుగుతున్నందున వేరే దారి లేక పోటీల్లో తాము పాల్గొనడం లేదని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. అయితే ఒకవేళ ఏషియన్ గేమ్స్లో ఆడాలనుకుంటే బీసీసీఐకి ఒక దారి ఉంది. మహిళల క్రికెట్కు అవకాశం లేనప్పటికి.. పురుషుల క్రికెట్లో మాత్రం అందుకు ఆస్కారం ఉంది. వన్డే ప్రపంచకప్కు ఎలాగూ సీనియర్ జట్టు ఉంటుంది కాబట్టి.. ఏషియన్ గేమ్స్కు జూనియర్ జట్టును పంపిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. గతంలోనూ 1998లో కౌలలంపూర్ లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో భారత పురుషుల జట్టు పాల్గొంది. అదే సమయంలో పాకిస్తాన్తో టొరంటోలో మరో టీమిండియా జట్టు వన్డే సిరీస్ను ఆడింది. తాజాగా 2021లో భారత సీనియర్ జట్టు ఇంగ్లండ్లో టెస్టు మ్యాచ్ ఆడేందుకు వెళ్లగా.. శిఖర్ ధావన్ సారధ్యంలో జూనియర్ జట్టు శ్రీలంకలో వన్డే సిరీస్ ఆడింది. ఈ ప్లాన్ సూపర్ సక్సెస్ అయింది. దీంతో ఏషియన్ గేమ్స్కు ఇలాంటి స్ట్రాటజీని అమలు చేస్తే బాగుంటుందని.. పైగా ఏషియన్ గేమ్స్లో పతకం తేవడం దేశానికి కూడా గర్వకారణం అవుతుంది. కాగా హాంగ్జౌ వేదికగా ఏషియన్ గేమ్స్ గతేడాదే జరగాల్సి ఉండగా కరోనా కారణంగా ఈ ఏడాది నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు స్పష్టం చేశారు. చదవండి: #Gary Balance: 'రెండు' దేశాల క్రికెటర్ రిటైర్మెంట్.. బ్రాడ్మన్తో పోల్చిన వైనం -
కొడతారా ? పడతారా ?
-
Ind Vs Aus: బ్రిస్బేన్ టు నాగ్పూర్...
జనవరి 19, 2021... బ్రిస్బేన్లోని ‘గాబా’ మైదానం... భారత టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఘట్టాల్లో ఒకటిగా నిలిచిపోయే దృశ్యం ఆవిష్కృతమైంది... 33 ఏళ్లుగా ఆస్ట్రేలియా ఓటమి ఎరుగని వేదికపై టీమిండియా జయకేతనం ఎగురవేసింది. ఒకదశలో పూర్తి ఫిట్గా ఉన్న 11 మందిని ఎంచుకోవడమే అసాధ్యం మారిన స్థితిలో ఈ మ్యాచ్ బరిలోకి దిగిన మన జట్టు సంచలన ప్రదర్శనతో విజయంతో పాటు సిరీస్నూ సొంతం చేసుకుంది. రెండేళ్ల తర్వాత నాటి అవమానభారాన్ని మోస్తూ ఆస్ట్రేలియా జట్టు భారత్లో అడుగు పెట్టింది. అయితే మనకు అనుకూలమైన పిచ్లు, వాతావరణం, స్పిన్ బలగం... ఇలా అన్నీ టీమిండియా పక్షానే ఉన్నాయి. ఇలాంటి స్థితిలో ఆసీస్ బృందం తమ దేశంలో గత సిరీస్లో భారత్ ప్రదర్శించిన స్ఫూర్తిదాయక ప్రదర్శనను చూపించగలదా? లేక ఎప్పటిలాగే తలవంచి నిష్క్రమిస్తుందా? స్వదేశంలో అత్యద్భుత రికార్డు ఉన్న భారత్ ప్రత్యర్థిపై ఏ స్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించగలదో వేచి చూడాలి. – సాక్షి క్రీడా విభాగం గత రెండు దశాబ్దాల్లో భారత్, ఆస్ట్రేలియా మధ్య ఎన్నో అద్భుతమైన, చిరస్మరణీయ టెస్టు మ్యాచ్లు జరిగాయి. 2001 కోల్కతా నుంచి 2021 బ్రిస్బేన్ వరకు విజయం ఎవరిదైనా ఆసక్తికర మలుపు, ఉత్కంఠ నిండిన క్షణాలతో ఇరు దేశాల అభిమానులను అలరించాయి. ఎన్నో హోరాహోరీ సమరాలు, రికార్డులు, ఘనతలు బోర్డర్–గావస్కర్ ట్రోఫీని ప్రపంచ క్రికెట్లో అన్నింటికంటే అత్యుత్తమ టెస్టు పోరుగా మార్చేశాయి. ‘భారత గడ్డపై టెస్టు సిరీస్ గెలవడం యాషెస్కంటే ఎక్కువ’ అని స్టీవ్ స్మిత్ నేరుగా చెప్పడం ఈ సిరీస్ ప్రాధాన్యతను చూపిస్తోంది. ఇరు జట్ల బలాబలాలు, జట్టులో ప్రస్తుతం ఆడుతున్న సభ్యులను బట్టి చూస్తే గత మూడు సిరీస్లు భారత్ ఆధిపత్యంపై స్పష్టతనిస్తాయి. 2016–17లో స్వదేశంలో జరిగిన సిరీస్ను 2–1తో గెలుచుకున్న భారత్... ఆ తర్వాత ఆస్ట్రేలియాలో వరుసగా 2018–19లో 2–1తోనే, ఆపై 2020–21లో 2–1తో సిరీస్లను సొంతం చేసుకుంది. రేపటి నుంచి నాగ్పూర్లో జరిగే తొలి టెస్టు మ్యాచ్తో నాలుగు టెస్టుల కీలక సమరానికి సన్నద్ధమవుతున్న నేపథ్యంలో ఈ సిరీస్లో సాగబోయే ఆసక్తికర ముఖాముఖీలను చూస్తే... ప్రాక్టీస్లో కేఎల్ రాహుల్, కోహ్లి ► భారత గడ్డపై ఆస్ట్రేలియా ప్రధాన స్పిన్నర్ నాథన్ లయన్కు మంచి రికార్డే ఉంది. అతను 7 టెస్టుల్లో 30.58 సగటుతో 34 వికెట్లు తీశాడు. తొలి పర్యటనకంటే రెండోసారి అతని ప్రదర్శన మెరుగైంది. మరోవైపు ఆస్ట్రేలియాలో కోహ్లి, పుజారా లపై పేలవ ప్రదర్శన కనబర్చిన లయన్, భారత్లో మాత్రం కోహ్లిని 4 సార్లు, పుజారాను 5 సార్లు అవుట్ చేశాడు. ► ఆస్ట్రేలియాలో ఏకంగా 54 సగటుతో 1352 పరుగులు చేసి చెలరేగిపోయిన కోహ్లి... భారత్లో మాత్రం అదే ఆసీస్పై 33 సగటుతో 330 పరుగులే చేశాడు. ► స్వదేశంలో ఆసీస్తో ఆడిన 8 టెస్టుల్లో అశ్విన్ 50 వికెట్లు తీశాడు. ఇప్పుడూ అతనే జట్టుకు కీలకం. వార్నర్నే అశ్విన్ 10 సార్లు అవుట్ చేశాడు. జడేజా బౌలింగ్లో నూ తీవ్రంగా ఇబ్బంది పడిన వార్నర్ 4 సార్లు అవుటయ్యాడు. ► ఆసీస్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ఆట ఈ సిరీస్లో నిర్ణాయకంగా మారనుంది. భారత గడ్డపై అశ్విన్ బౌలింగ్లో ఏకంగా 57 సగటుతో స్మిత్ పరుగులు సాధించాడు. జడేజా బౌలింగ్లోనూ 38 సగటుతో పరుగులు చేసిన స్మిత్ వీరిద్దరిని సమర్థంగా ఎదుర్కొంటే కంగారూ బృందం పైచేయి సాధించవచ్చు. గత సిరీస్లో ఏం జరిగిందంటే... తొలి టెస్టు (పుణే): తాము విసిరిన స్పిన్ ఉచ్చులో చిక్కుకున్న భారత్ 333 పరుగులతో ఓడింది. ఆస్ట్రేలియా రెండు ఇన్నింగ్స్లలో 260, 285 పరుగులు చేయగా... లెఫ్టార్మ్ స్పిన్నర్ స్టీవ్ ఒకీఫ్ (12/70) ధాటికి భారత్ 105, 107 పరుగులకే ఆలౌటైంది. రెండో టెస్టు (బెంగళూరు): భారత్ 75 పరుగులతో గెలిచింది. తొలి ఇన్నింగ్స్లో ఆసీస్కు 87 పరుగుల ఆధిక్యం లభించినా... రెండో ఇన్నింగ్స్లో 188 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక జట్టు 112 పరుగులకే కుప్పకూలింది. మూడో టెస్టు (రాంచీ): భారీ స్కోర్లు నమోదైన ఈ టెస్టు (భారత్ 603/9; ఆస్ట్రేలియా 451, 204/6) ‘డ్రా’గా ముగిసింది. భారత్కు చివర్లో గెలుపు అవకాశం వచ్చినా ఆసీస్ బతికిపోయింది. నాలుగో టెస్టు (ధర్మశాల): 8 వికెట్లతో భారత్ విజయం. తొలి ఇన్నింగ్స్లో భారత్కు 32 పరుగుల స్వల్ప ఆధిక్యమే లభించినా... రెండో ఇన్నింగ్స్లో ఆసీస్ను 137 పరుగులకే కుప్పకూల్చి జట్టు సునాయాస విజయాన్నందుకుంది. -
క్రికెటర్ అవ్వాలని కలలు కన్నాడు.. పేదరికం అడ్డొచ్చింది.. అయితేనేం..
ఎంతో ఇష్టమైన క్రికెట్లో రాణించాలని కలలు కన్నాడు. మైదానంలో ఫోర్లు, సిక్సర్లతో మోత మోగించాలని, దేశానికి పేరు తేవాలని పదేపదే పరితపించాడు. అయితే టాలెంట్ ఉన్నా పేదరికం అడ్డొచ్చింది. ఆటపై ఉన్న మక్కువ పేదరికాన్ని జయించేలా చేసింది. తాను ఆడలేని క్రికెట్ను పదిమందితో ఆడించాలని భావించాడు. అభినవ ద్రోణాచార్యలా మారాడు. ఎందరికో అంతర్జాతీయస్థాయిలో తర్ఫీదునిస్తూ తన కలలను సాకారం చేసుకుంటున్నాడు చింతూరుకు చెందిన పాసర్లపూడి సుబ్రహ్మణ్యం అలియాస్ సుబ్బు. సాక్షి, అల్లూరి సీతారామరాజు(చింతూరు): క్రికెట్లో ఎంతోమందికి తర్ఫీదునిస్తూ వారి ఉన్నతికి బాటలు వేస్తున్నాడు చింతూరుకు చెందిన పాసర్లపూడి సుబ్రహ్మణ్యం అలియాస్ సుబ్బు. పేదరికం కారణంగా మధ్యలోనే ఆటకు స్వస్తి పలికిన సుబ్బు తన కలల సాకారానికి అడ్డొచ్చిన పేదరికాన్ని అసహ్యించుకోలేదు. తాను సాధించలేనిది తన శిక్షణతో పలువురిని ఆటలో తీర్చిదిద్దేందుకు నడుం బిగించాడు. ఖర్చుతో కూడుకున్నదైనా క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేసి పలువురు చిన్నారులకు శిక్షణ ఇస్తున్నాడు. వారు మెరుగైన అవకాశాలు అందిపుచ్చుకునేలా చేస్తున్నాడు. స్థానికంగానే చదువు.. సుబ్బు తండ్రి సత్యనారాయణ వడ్రంగి పనిచేసుకుంటూ జీవనం సాగిస్తుండగా సబ్బు చింతూరులో ఇంటర్ వరకు చదివాడు. చిన్నప్పటి నుంచి క్రికెట్పై మక్కువ పెంచుకున్న అతను స్థానికంగా జరిగే టోర్నమెంట్లలో ఆడుతూ మంచి నైపుణ్యం సాధించాడు. అదే సమయంలో అకాడమీలో చేరి క్రికెట్లో ఉన్నతస్థాయికి చేరుకోవాలని ఆశించాడు. అతనికి పేదరికం అడ్డురావడంతో ఆశయానికి బ్రేక్పడింది. అనంతరం భద్రాచలంలో డిగ్రీలో చేరిన సుబ్బు 2010 నుంచి 2014 వరకు ఐదేళ్లపాటు చిన్నారులకు క్రికెట్లో కోచింగ్ ఇచ్చాడు. 2015 నుంచి 2016 వరకు హైదరాబాద్లోని సెయింట్జోన్స్ క్రికెట్ అకాడమీలో కోచ్గా పనిచేశాడు. 2016లో హైదరాబాద్లో ఎరీనా ఎలైట్ కోచింగ్ సెంటర్ ప్రారంభించి 2020 వరకు ఎందరో చిన్నారులకు క్రికెట్ ఓనమాలు నేర్పాడు. అనంతరం 2020లో తిరిగివచ్చిన ఆయన శ్రీ భద్రాద్రి క్రికెట్ అకాడమి పేరుతో సంస్థను నెలకొల్పాడు. ప్రస్తుతం అదే పేరుతో 30 మంది చిన్నారులకు కోచింగ్ ఇస్తున్నాడు. రాణించిన త్రిష భద్రాచలంకు చెందిన గొంగడి త్రిష 2010 నుంచి 2014 వరకు భద్రాచలంలో సుబ్బు కోచింగ్లో క్రికెట్లో ఓనమాలు నేర్చుకుంది. దీంతో త్రిష హైదరాబాద్ జట్టుతో పాటు ఇండియా అండర్–16, అండర్–19 జట్లకు ఎంపికైంది. అనంతరం నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)కు ఎంపికై మరిన్ని మెళకువలు నేర్చుకుంది. ఇటీవల అండర్–19 మహిళా జట్టు తరఫున శ్రీలంక, వెస్టిండీస్, న్యూజిలాండ్ సిరీస్లో రాణించడం ద్వారా అండర్–19 వరల్డ్కప్లో పాల్గొనే భారత్ మహిళా జట్టుకు ఎంపికైంది. ఇదే బాటలో మరెందరో చిన్నారులు సుబ్బు కోచింగ్లో రాటుదేలుతున్నారు. ఉన్నత అవకాశాల కోసం వారంతా ఎదురు చూస్తున్నారు. భారత్ జట్టులో ఆడాలనుకున్నా చిన్నతనం నుంచి క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. ఎప్పటికైనా ఇండియా జట్టు తరఫున ఆడాలనుకున్నా. అనివార్య కారణాలతో ఆటను మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. ఎంతో ఇష్టమైన ఆటను వదల్లేక కోచ్గా బాధ్యతలు చేపట్టి చిన్నారులకు శిక్షణ ఇస్తున్నాను. నా కోచింగ్లో రాటుదేలిన త్రిష ఇండియా జట్టుకు ఎంపిక కావడం ఎంతో ఆనందంగా ఉంది. నా కళ ఇలా సాకారం చేసుకుంటున్నా. –పాసర్లపూడి సుబ్రహ్మణ్యం, క్రికెట్ కోచ్, చింతూరు -
టీ20 వరల్డ్కప్-2022 గెలిచిన టీమిండియా.. ఫైనల్లో బంగ్లాదేశ్పై విజయం
T20 World Cup For Blind: భారత అంధుల క్రికెట్ టీమ్ వరుసగా మూడసారి టీ20 వరల్డ్కప్ కైవసం చేసుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇవాళ (డిసెంబర్ 17) జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత్.. బంగ్లాదేశ్ను 120 తేడాతో ఓడించి జగజ్జేతగా అవతరించింది. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన భారత్ ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. సునీల్ రమేశ్ (63 బంతుల్లో 136), అర్జున్ కుమార్ రెడ్డి (50 బంతుల్లో 100 నాటౌట్) సెంచరీలతో రెచ్చిపోవడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 277 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం 278 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. భారత బౌలర్లలో లలిత్ మీనా, అజయ్ కుమార్ తలో వికెట్ పడగొట్టారు. Many congratulations to team India for winning the T20 World Cup for blind. pic.twitter.com/fbLge7UQVi — Mufaddal Vohra (@mufaddal_vohra) December 17, 2022 కాగా, టీ20 వరల్డ్కప్ను భారత్ గెలవడం ఇది వరుసగా మూడసారి. 2012లో జరిగిన ఇనాగురల్ టోర్నీలో భారత్ పాకిస్తాన్ను ఖంగుతినిపించి, తొలిసారి ఈ ఫార్మాట్లో ఛాంపియన్గా నిలిచింది. అనంతరం 2017లో జరిగిన రెండో ఎడిషన్లోనూ భారత్ ఫైనల్లో పాకిస్తాన్ ఓడించి రెండోసారి జగజ్జేతగా అవతరించింది. తాజాగా జరిగిన టోర్నీలో గెలవడం ద్వారా భారత్ హ్యాట్రిక్ వరల్డ్కప్లు సాధించింది. హ్యాట్రిక్ వరల్డ్కప్లు సాధించిన టీమిండియా వన్డే ఫార్మాట్లో జరిగే వరల్డ్కప్లను కూడా రెండుసార్లు (2014, 2018) కైవసం చేసుకుంది. ఈ రెండుసార్లు కూడా భారత్.. ఫైనల్లో పాకిస్తాన్పైనే విజయం సాధించింది. -
భారత ఆటగాడిపై సెటైరికల్ ట్వీట్.. మింత్రాపై మండిపడుతున్న నెటిజన్స్!
ఇటీవల కంపెనీలు మార్కెటింగ్ కోసం కొత్త దారులను ఎంచుకుంటున్నాయి. తమ వస్తువుల మార్కెటింగ్ కోసం కంటెంట్తో పాటు కాంట్రవర్శీని కూడా జత చేస్తున్నాయి. సోషల్ మీడియా వాడకం పెరిగినప్పటి నుంచి ఇలాంటివి బాగా పెరిగాయి.ఈ తరహాలో ఇప్పటికే ఇ-కామర్స్ ప్లాట్ఫాంలు ఫ్లిప్కార్ట్, అమెజాన్ పాటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ జాబితాలోకి మరో ఆన్లైన్ ప్లాట్పాం మింత్రా(MYNTR) కూడా చేరింది. టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్పై వ్యంగ్యంగా ట్వీట్ చేసి నెటిజన్ల ఆగ్రహాన్ని చవి చూస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న టీ 20 ప్రపంచకప్లో భారత జట్టు కీలక సెమీఫైనల్ మ్యాచ్లో ఇంగ్లండ్ చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ టోర్నిలో కేఎల్ రాహుల్ దారుణంగా విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో రాహుల్ వైఫల్యాలపై మింత్రా వ్యంగ్యంగా ఓ పోస్ట్ చేసింది. అందులో.. 'అవుట్ ఆఫ్ ది వరల్డ్' అని ప్రింట్ చేసిన టీ-షర్టులో.. కేవలం 'అవుట్' మాత్రం కనిపంచేలా ఉన్న టీ షర్ట్ ఫోటోను ట్విటర్లో షేర్ చేసింది. ఆ ఫోస్ట్కు ‘కేఎల్ రాహుల్ ఇష్టమైన టీ-షర్ట్’ అంటూ సెటైరికల్గా క్యాప్షన్ ఇచ్చింది. అయితే ఈ ట్వీట్కు సంబంధించి నెట్టింట దుమారమే రేగుతోంది. మింత్రా చేసని పనికి సోషల్మీడియాలో కేఎల్ రాహుల్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇలాంటి చీఫ్ పబ్లిసిటీ స్టంట్స్ ఆపాలంటూ మండిపడుతున్నారు. చదవండి: ఏంటి బ్రో, చేరిన 2 రోజులకే నా ఉద్యోగం ఊడింది.. ఓ ఐఐటియన్ బాధ ఇది! -
సూర్యకుమార్ ‘ప్రాక్టీస్’
పెర్త్: ఆస్ట్రేలియా గడ్డపై పరిస్థితులకు అలవాటు పడేందుకు అన్ని జట్లకంటే ముందుగా అక్కడికి చేరుకున్న భారత్ తమ సన్నాహాలను సంతృప్తిగా మొదలు పెట్టింది. మూడు రోజుల సాధన అనంతరం సోమవారం మ్యాచ్ బరిలోకి దిగిన టీమిండియా తొలి పోరులో విజయం సాధించింది. ఈ ప్రాక్టీస్ మ్యాచ్లో భారత్ 13 పరుగుల తేడాతో వెస్ట్రన్ ఆస్ట్రేలియాను ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఫామ్లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ (35 బంతుల్లో 52; 3 ఫోర్లు, 3 సిక్స్లు) అదే జోరును ఇక్కడా కొనసాగించాడు. ఇతర బ్యాటర్లలో హార్దిక్ పాండ్యా (27; 1 ఫోర్, 1 సిక్స్), దీపక్ హుడా (22; 2 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించగా... రోహిత్ (3), ఓపెనర్గా ఆడిన పంత్ (9) విఫలమయ్యారు. అనంతరం వెస్ట్రన్ ఆస్ట్రేలియా 8 వికెట్లకు 145 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అర్‡్షదీప్ 6 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టగా... చహల్, భువనేశ్వర్ చెరో 2 వికెట్లు తీశారు. -
టిమిండియాకు రామ్ చరణ్ విందు!
హీరో రామ్ చరణ్ ఇండియన్ క్రికెట్ టీంకు ఆతిథ్యం ఇచ్చాడు. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో నిన్న(ఆదివారం) జరిగిన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్లో భారత్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇండియన్ క్రికెట్ టీంను అభినందిస్తూ తన నివాసంలో విందు ఏర్పాటు చేశాడు చరణ్. ఈ సందర్భంగా ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా, సూర్య కుమార్ యాదవ్తో పాటు పలువురు ఆటగాళ్లు చరణ్ ఇంటికి చేరుకుని సందడి చేశారు. చదవండి: ఐశ్వర్య, త్రిషల వల్ల చాలా ఇబ్బంది పడ్డా: మణిరత్నం ఈ సందర్భంగా చరణ్ ఆటగాళ్లను సన్మానించి వారితో కాసేపు సరదాగా ముచ్చటించాడు. రామ్ చరణ్-ఉపాసన దంపతులు ఏర్పాటు చేసిన ఈ పార్టీలో మెగా కుటుంబ సభ్యులతో పాటు పలువురు సెలబ్రెటీలు సైతం పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా చరణ్ ఇంటిలో పని చేసే ఓ వ్యక్తి హార్థిక్ పాండ్యాతో దిగిన ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఈ ఫొటోలు నెట్టింట వైరల్గా మారింది. అయితే ఈ పార్టీ సంబంధించిన ఫొటోలను చిరు త్వరలోనే తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయనున్నాడని తెలుస్తోంది. చదవండి: ఓటీటీకి రంగ రంగ వైభవంగా! దసరాకు స్ట్రీమింగ్, ఎక్కడంటే.. -
Asia Cup 2022: పాక్పై ప్రతీకారం తీర్చుకున్న భారత్.. ఉత్కంఠ పోరులో విజయం
దుబాయ్: ఇదీ దాయాదుల దమ్మంటే. ఈ మ్యాచ్కున్న కిక్కే వేరు. బరిలో భారత్, పాక్ తలపడితే అది లీగా... నాకౌటా... అనేది ఉండదు! ఎక్కడ ఆడినా... ఎప్పుడు ఎదురుపడినా అది ‘ఫైనల్’ను మించిన సమరమే! అలాంటి మ్యాచ్ ఆదివారం ఆసియా కప్ టి20 టోర్నీలో చిరకాల ప్రత్యర్థుల మధ్య ఉత్కంఠగా జరిగింది. చివరకు భారత్ 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్ను ఓడించింది. మొదట పాకిస్తాన్ 19.5 ఓవర్లలో 147 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్ రిజ్వాన్ (42 బంతుల్లో 43; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. సీమర్లు భువనేశ్వర్ (4/26), హార్దిక్ పాండ్యా (3/25) పాక్ను కట్టడి చేశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన భారత్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసి గెలిచింది. కెరీర్లో 100వ టి20 మ్యాచ్ ఆడిన కోహ్లి (34 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్స్) విలువైన పరుగులు జతచేస్తే... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హార్దిక్ పాండ్యా (17 బంతుల్లో 33 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్), జడేజా (29 బంతుల్లో 35; 2 ఫోర్లు, 2 సిక్స్లు)తో కలిసి గెలిపించే ఇన్నింగ్స్ ఆడాడు. భారత జట్టులో అనుభవజ్ఞుడైన దినేశ్ కార్తీక్ను తీసుకోవడంతో పంత్ను పక్కన బెట్టారు. పేసర్లలో అవేశ్ఖాన్, అర్‡్షదీప్లకు అవకాశమిచ్చారు. భారత్ తమ తదుపరి మ్యాచ్ను బుధవారం హాంకాంగ్తో ఆడుతుంది. నేడు టోర్నీలో విశ్రాంతి దినం. మంగళవారం జరిగే గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్లో బంగ్లాదేశ్తో అఫ్గానిస్తాన్ తలపడుతుంది. పాండ్యా బౌన్సర్లు కెప్టెన్ బాబర్ అజమ్ (10)ను భువీ ఎక్కువసేపు నిలువనీయలేదు. మరో ఓపెనర్ రిజ్వాన్ కుదురుగా ఆడుతున్నప్పటికీ ఫఖర్ జమన్ (10)ను అవేశ్ఖాన్ అవుట్ చేశాడు. పవర్ప్లేలో పాక్ స్కోరు 43/2. రిజ్వాన్, ఇఫ్తికార్ అహ్మద్ (22 బంతుల్లో 28; 2 ఫోర్లు, 1 సిక్స్) జోడీ క్రీజులో పాతుకుపోతున్న దశలో హార్దిక్ పాండ్యా బౌన్సర్లు పాక్ను చావుదెబ్బ తీశాయి. స్వల్ప వ్యవధిలో ఇఫ్తికార్, ఖుష్దిల్ (2), రిజ్వాన్లను హార్దిక్ పెవిలియన్ చేర్చాడు. తర్వాత భువీ పేస్కు మిడిలార్డర్ తలవంచింది. ఓ దశలో 128 పరుగులకే 9 వికెట్లు కోల్పోగా, ఆఖర్లో షానవాజ్ దహని (6 బంతుల్లో 16; 2 సిక్స్లు), రవూఫ్ (7 బంతుల్లో 13 నాటౌట్; 2 ఫోర్లు) ఫోర్లు కొట్టడంతో పాక్ పోరాడే స్కోరు చేసింది. భారత్ మరీ మందకొడిగా బౌలింగ్ చేయడంతో చివర్లో పెనాల్టీగా సర్కిల్ వెలుపల ఒక ఫీల్డర్ను తగ్గించారు. సాధారణంగా 5 మంది చేసే ఫీల్డింగ్ నలుగురికి కుదించారు. ఆ ఫీల్డర్ను సర్కిల్ లోపలకు తీసుకొచ్చారు. రాహుల్ డకౌట్ కెప్టెన్ రోహిత్తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ (0) తనకెదురైన తొలి బంతికే నసీమ్ షా బౌలింగ్లో బౌల్డయ్యాడు. కోహ్లి కూడా డకౌట్ కావాల్సినోడే! కానీ స్లిప్లో ఫఖర్ జమన్ క్యాచ్ నేలపాలు చేయడంతో బతికిపోయాడు. తర్వాత కోహ్లి తన బ్యాట్కు పనిచెప్పాడు. క్లాస్ షాట్లతో అలరించాడు. జట్టు స్కోరు 50 పరుగులకు చేరాక మొదట రోహిత్ (18 బంతుల్లో 12; 1 సిక్స్), కాసేపటికే కోహ్లి భారీ షాట్లకు యత్నించి వికెట్లను సమర్పించుకున్నారు. 53 పరుగులకే టాపార్డర్ వికెట్లు పెవిలియన్కు చేరాయి. ఈ దశలో జడేజా, సూర్యకుమార్ కాసేపు ఓర్పుగా ఆడారు. చేయాల్సిన రన్రేట్ పెరగడంతో అడపాదడపా షాట్లు బాదారు. ఈ క్రమంలోనే సూర్యకుమార్ (18 బంతుల్లో 18; 1 ఫోర్) వెనుదిరిగాడు. హిట్టర్ హార్దిక్ పాండ్యా రాగా... 15 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 97/4. విజయ సమీకరణం 30 బంతుల్లో 51 పరుగులు! అంటే ఓవర్కు పది పైచిలుకు పరుగులు చేయాలి. 16, 17వ ఓవర్లలో ఒక్క బౌండరీ రాలేదు. 18 బంతుల్లో 32 పరుగులు చేయాల్సిన దశలో నసీమ్ షా వేసిన 18వ ఓవర్లో జడేజా ఫోర్, సిక్సర్ బాదాడు. తర్వాత రవూఫ్ ఓవర్ను పాండ్యా 3 బౌండరీలతో ఆడుకున్నాడు. 6 బంతుల్లో 7 పరుగులు. సులువే కానీ... తొలి బంతికి నవాజ్ బౌలింగ్లో జడేజా బౌల్డ్! తర్వాత రెండు బంతుల్లో వచ్చింది ఒకటే పరుగు. మిగిలిన 3 బంతుల్లో గెలవాలంటే 6 పరుగులు చేయాలి. ఉత్కంఠకు తెరదించుతూ హార్దిక్ లాంగాన్లో కొట్టిన సిక్సర్తో ఆట రెండు బంతుల ముందే ముగిసింది. ద్రవిడ్ వచ్చేశాడు... జట్టు బయల్దేరే ముందు అనూహ్యంగా కోవిడ్ బారినపడిన టీమిండియా హెడ్ కోచ్ ద్రవిడ్ కోలుకున్నాడు. అంతేనా... అప్పుడే ఆసియా కప్ ఆతిథ్య దేశం యూఏఈ చేరుకున్నాడు కూడా! ఆ వెంటే జట్టుతో కలిసిన ద్రవిడ్ ఉత్సాహంగా తన కోచింగ్ పనేదో చక్కబెట్టే పనిలోపడ్డాడు. ‘ద్రవిడ్కు చేసిన కరోనా పరీక్షలో నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. దీంతో వెంటనే దుబాయ్ వెళ్లాడు. స్కోరు వివరాలు పాకిస్తాన్ ఇన్నింగ్స్: రిజ్వాన్ (సి) అవేశ్ ఖాన్ (బి) పాండ్యా 43; బాబర్ ఆజమ్ (సి) అర్‡్షదీప్ (బి) భువనేశ్వర్ 10; ఫఖర్ జమాన్ (సి) కార్తీక్ (బి) అవేశ్ ఖాన్ 10; ఇఫ్తికార్ (సి) కార్తీక్ (బి) పాండ్యా 28; ఖుష్దిల్ షా (సి) జడేజా (బి) పాండ్యా 2; షాదాబ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) భువనేశ్వర్ 10; ఆసిఫ్ అలీ (సి) సూర్యకుమార్ (బి) భువనేశ్వర్ 9; నవాజ్ (సి) కార్తీక్ (బి) అర్‡్షదీప్ 1; రవూఫ్ (నాటౌట్) 13; నసీమ్ షా (ఎల్బీడబ్ల్యూ) (బి) భువనేశ్వర్ 0; షానవాజ్ (బి) అర్శ్దీప్ 16; ఎక్స్ట్రాలు 5; మొత్తం (19.5 ఓవర్లలో ఆలౌట్) 147. వికెట్ల పతనం: 1–15, 2–42, 3–87, 4–96, 5–97, 6–112, 7–114, 8–128, 9–128, 10–147. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–26–4, అర్ష్దీప్ సింగ్ 3.5–0–33–2, హార్దిక్ పాండ్యా 4–0–25–3, అవేశ్ ఖాన్ 2–0–19–1, చహల్ 4–0–32–0, జడేజా 2–0–11–0. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) ఇఫ్తికార్ (బి) నవాజ్ 12; రాహుల్ (బి) నసీమ్ షా 0; కోహ్లి (సి) ఇఫ్తికార్ (బి) నవాజ్ 35; జడేజా (బి) నవాజ్ 35; సూర్యకుమార్ (బి) నసీమ్ షా 18; పాండ్యా (నాటౌట్) 33; దినేశ్ కార్తీక్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 14; మొత్తం (19.4 ఓవర్లలో 5 వికెట్లకు) 148. వికెట్ల పతనం: 1–1, 2–50, 3–53, 4–89, 5–141. బౌలింగ్: నసీమ్ షా 4–0–27–2, షానవాజ్ 4–0–29–0, రవూఫ్ 4–0–35–0, షాదాబ్ 4–0–19–0, నవాజ్ 3.4–0–33–3. -
ద్రవిడ్కు కరోనా..
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కరోనా బారిన పడ్డారు. దీంతో జట్టుతో పాటు ఆసియా కప్ టి20 టోర్నీ కోసం ద్రవిడ్ దుబాయ్ విమానం ఎక్కలేదు. ‘అక్కడికి బయల్దేరే ముందు రొటీన్గా చేసే కోవిడ్ పరీక్షల్లో ద్రవిడ్కు పాజిటివ్ రిపోర్టు వచ్చింది. ఆయనకు అతి స్వల్ప లక్షణాలే ఉన్నాయి. దీంతో ఆయన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వైద్య బృందం పర్యవేక్షణలో ఉంచారు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ పరీక్ష చేసి నెగెటివ్ రిపోర్టు రాగానే ద్రవిడ్ యూఏఈకి పయనమవుతారు’ అని బోర్డు కార్యదర్శి జై షా వెల్లడించారు. ప్రస్తుతానికి సహాయక కోచ్ పారస్ మాంబ్రే ఇన్చార్జి కోచ్గా వ్యవహరిస్తారు. ఆసియా కప్కు ఎంపికైన రోహిత్ శర్మ బృందంలో ముగ్గురు మినహా మెజారిటీ సభ్యులంతా మంగళవారం ఉదయం దుబాయ్కి పయనమయ్యారు. జింబాబ్వేలో ఉన్న వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, దీపక్ హుడా, రిజర్వ్ ప్లేయర్ అక్షర్ పటేల్లు హరారే నుంచే అక్కడికి బయల్దేరతారు. ఆసియా కప్ ప్రధాన టోర్నీ యూఏఈలో ఈనెల 27 నుంచి జరుగుతుంది. 28న జరిగే తమ తొలి మ్యాచ్లో పాకిస్తాన్తో భారత్ తలపడుతుంది. -
స్వతంత్ర భారతి: ప్రపంచ కప్ విజయం (1983/2022)
లార్డ్స్ మైదానంలో ఆ రోజున భారత క్రికెట్ జట్టు ఓ అత్యద్భుత పరిణామం దిశగా అడుగులు వేసింది. ఆ ఏడాది జూన్ 25న భారత జట్టు సాధించిన విజయం భారత క్రికెట్ స్వరూపాన్నే మార్చేసింది. ఆ స్ఫూర్తితో దేశంలో క్రికెట్ క్రీడ అపరిమిత ఆత్మవిశ్వాసాన్ని సొంతం చేసుకుంది. క్రికెట్ క్రీడలో రారాజులుగా వెలిగిపోతున్న వారిని దాదాపు నలభై ఏళ్ల క్రిందట ఓడించినప్పుడు కపిల్ బృందం ఈ పరిణామాన్ని ఊహించి ఉండదు. నాటి 60 ఓవర్ల వరల్డ్ కప్ మ్యాచ్లో అప్పటికి రెండుసార్లుగా డిఫెండింగ్ చాంపియన్గా ఉన్న వెస్ట్ ఇండీస్పై ఇండియా 43 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. చదవండి: (Lalu Prasad Yadav: లాలూ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమం) -
India Vs Ireland: కొత్తవారికి అవకాశం దక్కేనా!
డబ్లిన్: ఇంగ్లండ్తో ప్రధాన పోరుకు ముందు భారత క్రికెట్ జట్టు మరో సంక్షిప్త సిరీస్కు సన్నద్ధమైంది. ఐర్లాండ్తో రెండు టి20 మ్యాచ్ల పోరులో భాగంగా నేడు తొలి మ్యాచ్ జరగనుంది. అయితే అగ్రశ్రేణి ఆటగాళ్లు టెస్టు మ్యాచ్ కోసం సిద్ధమవుతున్న నేపథ్యంలో టెస్టు టీమ్లో లేని ఇతర ఆటగాళ్లతోనే టీమిండియా బరిలోకి దిగనుంది. దక్షిణాఫ్రికాతో స్వదేశంలో ఆడిన జట్టే దాదాపుగా ఇక్కడా ఉండగా... కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా తొలిసారి భారత జట్టును నడిపించబోతున్నాడు. రాహుల్ ద్రవిడ్ ప్రధాన జట్టుతో ఉండటంతో వీవీఎస్ లక్ష్మణ్ ఈ సిరీస్కు తాత్కాలిక కోచ్గా వ్యవహరిస్తాడు. బలాబలాలు, గత రికార్డును చూస్తే ఐర్లాండ్పై భారత్దే స్పష్టంగా పైచేయి కాగా, సొంతగడ్డపై సత్తా చాటా లని ఐర్లాండ్ భావిస్తోంది. సామ్సన్ను ఆడిస్తారా... దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్లో తొలి మ్యాచ్ నుంచి చివరి వరకు మార్పు లేకుండా ఆ 11 మందినే ఆడించారు. అయితే ఈసారి టీమ్ మేనేజ్మెంట్ కొత్తగా ప్రయత్నించవచ్చు. పేసర్లు అర్‡్షదీప్, ఉమ్రాన్ మాలిక్లు అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టవచ్చని అంచనా. బ్యాటింగ్పరంగా గత మ్యాచ్ ఆడిన తుది జట్టును చూస్తే పంత్, అయ్యర్ లేరు కాబట్టి రెండు స్పష్టమైన ఖాళీలు ఉన్నాయి. ప్రస్తుత జట్టు నుంచి రాహుల్ త్రిపాఠి అరంగేట్రం చేయకపోగా, సామ్సన్ మరో చాన్స్ కోసం చూస్తున్నాడు. పోటీనిస్తారా... గత ఏడాది టి20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత ఐర్లాండ్ పెద్ద జట్టుతో మ్యాచ్లు ఆడలేదు. అమెరికా, యూఏ ఈలతో మాత్రమే తలపడిన టీమ్కు ఇన్నేళ్లలో కూడా పెద్ద జట్లను ఎదు ర్కొనే అవకాశం ఎక్కువగా రాలేదు. భారత్ తర్వాత ఆ టీమ్ న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాలతో ఆడనుంది. టి20 వరల్డ్కప్కు సన్నాహకంగా భారత్తో సిరీస్ పనికొస్తుంది. భారత్తో గతంలో ఆడిన 3 టి20ల్లోనూ ఐర్లాండ్ ఓడింది. ప్రస్తుత జట్టులోని సీనియర్లు స్టిర్లింగ్, డాక్రెల్తో పాటు కెప్టెన్ బల్బరీన్ జట్టు భారం మోస్తున్నారు. కొత్తగా వచ్చిన యువ ఆటగాళ్లతో కలిసి వీరు జట్టును ఎలా గెలుపు దిశగా నడిపిస్తారనేది చూడాలి. -
అలా ఈ ప్రయాణం అజేయ సెంచరీతో మొదలై హాఫ్ సెంచరీతో ముగిసింది!
Mithali Raj Retirement: రెండు దశాబ్దాలకుపైగా అలసటన్నది లేకుండా ఆడుతూ... లెక్కలేనన్ని కీర్తి శిఖరాలు అధిరోహిస్తూ... ‘ఆమె’ ఆటను అందలాన్ని ఎక్కిస్తూ... భావితరాలకు బాటలు వేస్తూ... ఇక బ్యాట్తో సాధించాల్సిందీ ఏమీ లేదని భావిస్తూ... భారత మహిళల క్రికెట్ మణిహారం మిథాలీ రాజ్ ఆటకు అల్విదా చెప్పింది. అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్గా రికార్డు నెలకొల్పిన మిథాలీ అత్యున్నత దశలో ఆట నుంచి వీడ్కోలు తీసుకుంది. న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్ వన్డే, టెస్టు జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెబుతున్నట్లు ప్రకటించింది. అన్ని రకాల ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు బుధవారం ఈ మేరకు ఆమె ట్విటర్లో లేఖ విడుదల చేసింది. ఇన్నేళ్లు భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరించడం గర్వంగా ఉందని పేర్కొన్న మిథాలీ... రెండు దశాబ్దాలకుపైగా సాగిన తన క్రికెట్ ప్రస్థానానికి ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైందని... ప్రస్తుతం భారత మహిళల క్రికెట్ను ప్రతిభావంతులైన క్రీడాకారిణుల చేతుల్లో పెడుతున్నానని పేర్కొంది. ఇన్నేళ్లపాటు అనుక్షణం తన వెన్నంటే ఉండి ప్రోత్సహించిన వారందరికీ ధన్యవాదాలు చెబుతున్నానని 39 ఏళ్ల ఈ హైదరాబాద్ క్రికెటర్ తెలిపింది. 1999 జూన్ 26న ఐర్లాండ్తో జరిగిన తొలి వన్డేలో అజేయ సెంచరీ (114 నాటౌట్)తో అద్భుత అరంగేట్రం చేసిన మిథాలీ... 2022 మార్చి 27న దక్షిణాఫ్రికాతో చివరి వన్డే (68 పరుగులు) ఆడింది. 23 ఏళ్ల ఆమె అంతర్జాతీయ కెరీర్ సెంచరీతో మొదలై అర్ధ సెంచరీతో ముగియడం విశేషం. భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాలన్న లక్ష్యంతో నా ప్రస్థానం మొదలైంది. ఇన్నేళ్ల ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. ప్రతి ఒక సంఘటనతో కొత్త విషయాలు నేర్చుకున్నాను. గత 23 ఏళ్లలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించాను. అన్ని ప్రయాణాల మాదిరిగానే నా క్రికెట్ కెరీర్కు ముగింపు వచ్చింది. అందుకే అన్ని రకాల అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. మైదానంలో అడుగుపెట్టిన ప్రతిసారీ నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చి భారత్ను విజేతగా నిలబెట్టాలని కృషి చేశా. ప్రస్తుతం భారత మహిళల క్రికెట్ భవిష్యత్ ఉజ్వలంగా ఉందని... యువ క్రికెటర్ల చేతుల్లో సురక్షితంగా ఉందని భావిస్తూ నా కెరీర్కు వీడ్కోలు పలుకుతున్నా. ప్లేయర్గా, కెప్టెన్గా ఎల్లవేళలా నాకు మద్దతు ఇచ్చిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి, బోర్డు కార్యదర్శి జై షాకు ధన్యవాదాలు చెబుతున్నా. ఏళ్లపాటు భారత జట్టుకు కెప్టెన్గా ఉండటం గర్వకారణంగా ఉంది. నాయకత్వ బాధ్యతలు నన్ను వ్యక్తిగానే కాకుండా భారత క్రికెట్ను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు దోహదపడ్డాయి. ప్లేయర్గా నా ప్రయాణం ముగిసినా... భవిష్యత్లో మహిళల క్రికెట్ ఉన్నతికి నా వంతుగా కృషి చేస్తా. ఇన్నాళ్లు నా వెన్నంటే నిలిచి ప్రేమ, ఆప్యాయతలు పంచిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా. –మిథాలీ రాజ్ మిథాలీ కెరీర్ గ్రాఫ్... ఆడిన వన్డేలు 232 ►చేసిన పరుగులు: 7,805, నాటౌట్: 57 ►అత్యధిక స్కోరు: 125 నాటౌట్ ►సగటు: 50.68 ►సెంచరీలు: 7, అర్ధ సెంచరీలు: 64 ►క్యాచ్లు: 64, తీసిన వికెట్లు: 8 ఆడిన టెస్టులు 12 ►చేసిన పరుగులు: 699, నాటౌట్: 3 ►అత్యధిక స్కోరు: 214, సగటు: 43.68 ►సెంచరీలు: 1, అర్ధ సెంచరీలు: 4, క్యాచ్లు: 12 ఆడిన టి20లు 89 ►చేసిన పరుగులు: 2,364 ►అత్యధిక స్కోరు: 97 నాటౌట్ ►సగటు: 37.52 ►సెంచరీలు: 0 ►అర్ధ సెంచరీలు: 17, క్యాచ్లు: 19 చదవండి: Mithali Raj: మిథాలీరాజ్ పెళ్లి చేసుకోకపోవడం వెనుక కారణం? You will continue to inspire millions, @M_Raj03! 👏 👏 We will miss your presence in the dressing room.#ThankYouMithali pic.twitter.com/qDBRYEDHAM — BCCI Women (@BCCIWomen) June 8, 2022 -
ద్రవిడ్ మాస్టర్ ప్లాన్..ఈసారి !
-
Kurnool: ఇండియన్ క్రికెట్ టీంకు ఎమ్మిగనూరు విద్యార్థి ఎంపిక
ఎమ్మిగనూరుటౌన్/కర్నూలు: అండర్ 19 ఇండియన్ క్రికెట్ జట్టుకు ఎమ్మిగనూరుకు చెందిన విద్యార్థి కె.మహబుబ్బాషా ఎంపికయ్యాడు. స్థానిక ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న ఈ విద్యార్థి క్రికెట్లో తన ప్రతిభ చూపి జాతీయ జట్టులో స్థానం దక్కించుకున్నాడు. నాగపూర్లో గత నెల 27 నుంచి ఈనెల 12వ తేదీ వరకు అండర్ 19 ఇండియన్ క్రికెట్ జట్టుకు ఎంపిక పోటీలు నిర్వహించారు. అందులో మహబుబ్బాషా ప్రతిభ కనబరిచాడు. దుబాయ్లో డిసెంబర్ 7 నుంచి 15వ తేదీ వరకు జరగనున్న క్రికెట్ పోటీల్లో అండర్ 19 ఇండియా జట్టు తరఫున ఈ విద్యార్థి ఆడనున్నాడు. ఇండియన్ టీంలో స్థానం దక్కించుకున్న మహబుబ్బాషాను సోమవారం కళాశాల డీన్ లింగేశ్వర్రెడ్డి, ప్రిన్సిపాల్ అయ్యప్ప, ఏజీఎం రమణారెడ్డి, తల్లిదండ్రులు మహమ్మద్ రఫీక్, శైనాజ్, స్థానికులు అభినందించారు. చదవండి: Ind Vs Nz 1st T20- Deepak Chahar: రోహిత్ భయ్యాతో మాట్లాడాను.. ‘హోం గ్రౌండ్’లో ఓపెనర్గా దిగుతా -
భారత్ వర్సెస్ పాకిస్తాన్ :భావోద్వేగాల సమరం
-
T20 ప్రపంచ కప్: జట్టు ఎంపికకు నేడు బీసీసీఐ సమావేశం
-
‘లార్డ్స్’ సమరానికి సై: ఇటు శార్దూల్.. అటు స్టువర్ట్ బ్రాడ్ అవుట్!
వర్షం పడకపోతే తొలి టెస్టులో ఎవరు గెలిచేవారు? మంచి అవకాశం కోల్పోయామని కోహ్లి చెప్పగా... ఆ సమయంలో మ్యాచ్ తమ చేతుల్లోనే ఉందని రూట్ కూడా వ్యాఖ్యానించాడు. సిరీస్లో శుభారంభం చేసే అవకాశం చేజారినా... సుదీర్ఘ సిరీస్లో మరోసారి సత్తా చాటి ముందంజలో నిలిచేందుకు ఇరు జట్లకు రెండో అవకాశం వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రతిష్టాత్మక లార్డ్స్ క్రికెట్ మైదానంలో భారత్, ఇంగ్లండ్ మధ్య పోరుకు రంగం సిద్ధమైంది. రెండు టీమ్లలోనూ బ్యాటింగ్ బలహీనతలు గత మ్యాచ్లో కనిపించగా... వాటిని ఎవరు అధిగమిస్తారనేది చూడాలి. లండన్: ఇంగ్లండ్ గడ్డపై ఎలాగైనా టెస్టు సిరీస్ గెలవాలని పట్టుదలగా ఉన్న భారత క్రికెట్ జట్టు మరో సమరానికి తమ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంది. గురువారం నుంచి ‘లార్డ్స్’లో జరిగే రెండో టెస్టులో కోహ్లి సేన... ఆతిథ్య ఇంగ్లండ్తో తలపడుతుంది. ఒకే ఒక మార్పు మినహా టీమిండియా బృందంలో సమస్యలేమీ లేకపోగా... ఇద్దరు ప్రధాన పేసర్ల గాయాలతో ఇంగ్లండ్ ఇబ్బంది పడుతోంది. స్వల్ప బ్యాటింగ్ సమస్యను మినహాయిస్తే మొత్తంగా ఇంగ్లండ్పై ప్రస్తుతం భారత్దే పైచేయిగా కనిపిస్తోంది. శార్దుల్ అవుట్ నాటింగ్హామ్లో ‘డ్రా’గా ముగిసిన తొలి టెస్టు నుంచి భారత తుది జట్టులో ఒక మార్పు ఖాయమైంది. పేస్ బౌలర్ శార్దుల్ ఠాకూర్ గాయంతో మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో మరో పేస్ బౌలర్ ఇషాంత్ లేదా ఉమేశ్లకు అవకాశం ఇవ్వాలనేది టీమ్ మేనేజ్మెంట్ ముందున్న ఒక ప్రత్యా మ్నాయం. అయితే ట్రెంట్బ్రిడ్జ్ మైదానంతో పోలిస్తే కొంత పొడిగా ఉండే లార్డ్స్ పిచ్ను దృష్టిలో ఉంచుకుంటే సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ తుది జట్టులోకి సరిగ్గా సరిపోతాడు. పైగా కొంత బ్యాటింగ్ను బలంగా మార్చాలనే కారణంతోనే శార్దుల్కు తొలి టెస్టులో అవకాశం దక్కింది. అలా చూస్తే మంచి బ్యాటింగ్ చేయగల నైపుణ్యం ఉన్న అశ్విన్వైపే మొగ్గు ఎక్కువగా ఉంది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ తలకు తగిలిన గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. అయితే అతని స్థానంలో గత మ్యాచ్ ఆడిన కేఎల్ రాహుల్ చక్కటి బ్యాటింగ్తో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. దాంతో మయాంక్ తన చాన్స్ కోసం మళ్లీ వేచి చూడాల్సిందే. మరోవైపు భయపడినట్లుగానే భారత ప్రధాన బ్యాటింగ్ త్రయం పుజారా, కోహ్లి, రహానే గత టెస్టులోనూ విఫలమయ్యారు. తొలి ఇన్నింగ్స్లో వీరు వరుసగా 4, 0, 1 పరుగులు చేశారు. ఈ ముగ్గురిలో కనీసం ఇద్దరు రాణిస్తే తప్ప భారత్ భారీ స్కోరుకు అవకాశం ఉండదు. జడేజా ఆదుకోవడంతో సరిపోయింది కాబట్టి భారత్ కాస్త గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది. ఇక్కడ వీరు ఎలా ఆడతారన్నది ఆసక్తికరం. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూ టీసీ) ఫైనల్లో విఫలమైన బుమ్రా 9 వికెట్లతో మళ్లీ ఫామ్లోకి రావడం సానుకూలాంశం. షమీ కూడా కీలక వికెట్లతో సత్తా చాటాడు. వీరికి అశ్విన్ పదునైన స్పిన్ జత కలిస్తే భారత్కు ఎదురుండదు. పిచ్, వాతావరణం: బ్యాటింగ్కు అనుకూలమైన పిచ్. మంచి ఎండ కాయడంతో పాటు పోలిస్తే వర్ష సూచన లేకపోవడం సానుకూలాంశం. టాస్ గెలిచిన టీమ్ బ్యాటింగ్ ఎంచుకోవడం ఖాయం. తుది జట్లు (అంచనా): భారత్: కోహ్లి (కెప్టె న్), రోహిత్, రాహుల్, పుజారా, రహానే, పంత్, జడేజా, అశ్విన్, షమీ, బుమ్రా, సిరాజ్. ఇంగ్లండ్: రూట్, బర్న్స్, సిబ్లీ, హసీబ్ హమీద్, బెయిర్స్టో, బట్లర్, అలీ, స్యామ్ కరన్, రాబిన్సన్, వుడ్, ఒవర్టన్/సాఖిబ్. స్టువర్ట్ బ్రాడ్ అవుట్ రెండో టెస్టుకు ముందు ఇంగ్లండ్కు భారీ దెబ్బ తగిలింది. సీనియర్ పేస్ బౌలర్, కెరీర్లో 150వ టెస్టు ఆడాల్సి ఉన్న స్టువర్ట్ బ్రాడ్ గాయం కారణంగా మ్యాచ్తో పాటు పూర్తిగా సిరీస్కే దూరమయ్యాడు. అతని స్థానంలో మార్క్ వుడ్ను ఇంగ్లండ్ ఎంపిక చేసింది. పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్ అయిన వుడ్ ఏమాత్రం ప్రభావం చూపుతాడనేది చెప్పలేం. ఇక మరో సీనియర్ అండర్సన్ ఫిట్నెస్పై కూడా సందేహాలున్నాయి. ఈసీబీ అధికారికంగా ప్రకటించలేదు కానీ గాయం తీవ్రంగా ఉండి అండర్సన్ కూడా దూరమైతే ఇంగ్లండ్ ఒక్కసారిగా బలహీనంగా మారిపోవడం ఖాయం. అండర్సన్ స్థానంలో ముందు జాగ్రత్తగా సాఖిబ్ మహమూద్ను జట్టులోకి తీసుకున్నారు. బౌలింగ్ ఇలా ఉండగా బ్యాటింగ్లో ఆ జట్టు పరిస్థితి మరీ పేలవంగా ఉంది. తొలి టెస్టులో రూట్ ఆదుకోకపోయుంటే ఇంగ్లండ్ ఎప్పుడో కుప్పకూలి సునాయాసంగా ఓడిపోయేది. సరిగ్గా చెప్పాలంటే గత కొన్నేళ్లలో ఇంగ్లండ్ బ్యాటింగ్ బృందం స్వదేశంలో ఇంత బలహీనంగా ఎప్పుడూ లేదు. బర్న్స్, సిబ్లీ, క్రాలీ, లారెన్స్... ఇలా అంతా విఫలం కావడంలో ఒకరితో మరొకరు పోటీ పడుతున్నారు! ఈ నేపథ్యంలో ఆల్రౌండర్ మొయిన్ అలీకి మళ్లీ టెస్టు టీమ్లో స్థానం లభించింది. భారత్పై మంచి రికార్డు ఉన్న అలీ అటు బౌలింగ్లో, ఇటు బ్యాటింగ్లో కూడా ప్రభావం చూపించగలడు. క్రాలీ స్థానంలో హమీద్కు చోటు దక్కే అవకాశం ఉంది. తొలి టెస్టులో ‘స్లో ఓవర్ రేట్’ను నమోదు చేసిన భారత్, ఇంగ్లండ్ జట్లపై ఐసీసీ చర్య తీసుకుంది. ఇరు జట్లకు డబ్ల్యూటీసీ పాయింట్లనుంచి చెరో 2 పాయింట్లు కోత విధించారు. అంటే నిబంధనల ప్రకారం ‘డ్రా’ అయితే దక్కే 4 పాయింట్లలో ఒక్కో జట్టుకు ఇప్పుడు రెండేసి పాయిట్లు మాత్రమే లభిస్తాయి. దీంతో పాటు మ్యాచ్ ఫీజులో ఒక్కో జట్టుకు 40 శాతం జరిమానా కూడా ఐసీసీ విధించింది. -
లండన్ చేరిన భారత జట్టు
లండన్: ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు సోమవారం రెండో టెస్టు ఆడేందుకు లండన్ పయనమైంది. అక్కడికి వెళ్లేముందు ఆటగాళ్లందరికీ కోవిడ్ టెస్టులు నిర్వహించారు. అందరి రిపోర్టులు నెగెటివ్గానే వచి్చనట్లు జట్టు వర్గాలు వెల్లడించాయి. నాటింగ్హామ్ టెస్టు ఆదివారం వర్షం వల్ల ‘డ్రా’గా ముగిసిన సంగతి తెలిసిందే. తదుపరి రెండో టెస్టు లార్డ్స్లో ఈ నెల 12 నుంచి జరగనుండటంతో కోహ్లి సేన లండన్ చేరుకుంది. గాయపడిన ఆటగాళ్ల స్థానంలో ఆడేందుకు శ్రీలంక నుంచి నేరుగా ఇంగ్లండ్కు వెళ్లిన పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్లు ఇంకా క్వారంటైన్లోనే ఉన్నారు. పది రోజుల క్వారంటైన్ ఈ నెల 13న ముగియనుంది. గంగూలీ...లార్డ్స్ టెస్టు చూసేందుకు! బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ లార్డ్స్ టెస్టు చూసేందుకు ఇంగ్లండ్కు బయల్దేరనున్నాడు. భారత్ను తాజాగా ‘రెడ్’ లిస్ట్ నుంచి ‘అంబర్’ జాబితాలోకి మార్చడంతో కఠిన క్వారంటైన్ నిబంధనలు తప్పాయి. ఈ అంబర్ జాబితాలో ఉంటే... వ్యాక్సిన్ తీసుకున్న భారతీయులు కనీస కోవిడ్ ప్రొటోకాల్ను పాటిస్తే సరిపోతుంది. 10 రోజుల క్వారంటైన్ నుంచి మినహాయింపు లభిస్తుంది. దీంతో గంగూలీతో పాటు బోర్డు కార్యదర్శి జై షా, కోశాధికారి అరుణ్ ధుమాల్, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లాలు కూడా ఐదు టెస్టుల సిరీస్లో ఒకట్రెండు మ్యాచ్లు చూసేందుకు ఆసక్తి కనబరిచారు. -
చహల్, గౌతమ్లకు కరోనా
కొలంబో: శ్రీలంక పర్యటనను ముగించిన భారత క్రికెట్ జట్టులో మరో ఇద్దరు ఆటగాళ్లు కరోనా వైరస్ బారిన పడ్డారు. స్పిన్నర్ యజువేంద్ర చహల్, కృష్ణప్ప గౌతమ్లు శుక్రవారం కోవిడ్–19 పాజిటివ్గా తేలినట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. మంగళవారం పాజిటివ్గా తేలిన కృనాల్ పాండ్యాతో సన్నిహితంగా మెలిగిన ఎనిమిది మంది (హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, దీపక్ చహర్, పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్, మనీశ్ పాండే)లో వీరిద్దరు కూడా ఉన్నారు. అప్పటి నుంచి వీరంతా కూడా తమ గదుల్లోనే క్వారంటైన్ అయ్యారు. దాంతో చివరి రెండు టి20 మ్యాచ్లకు ఈ ఎనిమిది మంది కూడా దూరమయ్యారు. స్వదేశానికి పయనమయ్యేముందు భారత జట్టుకు చేసిన కరోనా పరీక్షల్లో చహల్, గౌతమ్ పాజిటివ్గా తేలారు. మిగిలిన టీమ్ ప్రత్యేక విమానంలో శుక్రవారం బెంగళూరుకు చేరుకుంది. అక్కడి నుంచి ప్లేయర్లు తమ స్వస్థలాలకు చేరుకున్నారు. ఆ ముగ్గురి పరిస్థితేంటి? పాజిటివ్గా తేలిన కృనాల్ పాండ్యా, చహల్, కృష్ణప్ప గౌతమ్లు కొలంబోలో ఏడు రోజుల పాటు తప్పనిసరి క్వారంటైన్ను పూర్తి చేయాల్సి ఉంది. అనంతరం వారికి రెండు సార్లు ఆర్టీ–పీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తారు. రెండు పర్యాయాలు నెగెటివ్గా తేలితే భారత్కు వచ్చేందుకు వారికి అనుమతి లభిస్తుంది. ఇంగ్లండ్కు వెళ్లేందుకు సూర్యకుమార్ యాదవ్, పృథ్వీ షాలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. వీరిద్దరికీ తాజాగా నిర్వహించిన ఆర్టీ–పీసీఆర్ పరీక్షల్లో నెగెటివ్ అని తేలడంతో... త్వరలోనే కొలంబో నుంచి నేరుగా ఇంగ్లండ్కు వెళ్లనున్నారు. ఇంగ్లండ్తో జరిగే ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో శుబ్మన్ గిల్, వాషింగ్టన్ సుందర్లు గాయపడటంతో... వారి స్థానాల్లో సూర్యకుమార్, పృథ్వీ షాలను బీసీసీఐ ఎంపిక చేసింది. భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు ఆగస్టు 4 నుంచి జరగనుంది. -
మమ్మల్ని చూసే ద్రవిడ్ అలా...
సిడ్నీ: గత కొన్నేళ్లలో భారత క్రికెట్ జట్టు విదేశాల్లోనూ అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తోంది. ముఖ్యంగా వరుసగా రెండుసార్లు ఆస్ట్రేలియాను వారి గడ్డపైనే ఓడించి బోర్డర్–గావస్కర్ ట్రోఫీని గెలుచుకోవడం పెద్ద విశేషం. ఈ విజయాల వెనక భారత ‘ఎ’ జట్టు కోచ్గా యువ ఆటగాళ్లను తీర్చి దిద్దిన రాహుల్ ద్రవిడ్ కృషి ఎంతో ఉంది. ఇదే విషయాన్ని ఆస్ట్రేలియా దిగ్గజం గ్రెగ్ చాపెల్ గుర్తు చేస్తున్నాడు. గతంలో తమ దేశంలో ఇలాంటి పటిష్టమైన వ్యవస్థ ఉండేదని... దానిని స్ఫూర్తిగా తీసుకొని ద్రవిడ్ భారత్లో ఫలితాలు సాధిస్తే తమ టీమ్ మాత్రం వెనుకబడిపోయిందని అతను అభిప్రాయపడ్డాడు. ‘చరిత్రను చూస్తే యువ ఆటగాళ్లను తీర్చిదిద్ది సీనియర్ టీమ్లోకి వచ్చేసరికి రాటుదేల్చే గొప్ప వ్యవస్థ ఆస్ట్రేలియా క్రికెట్లో ఉంది. కానీ గత రెండేళ్లుగా పరిస్థితి మారింది. ఎంతో మంది ప్రతిభావంతులైన కుర్రాళ్లను నేను చూశాను. కానీ వారు దారితెన్నూ లేనట్లు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ప్రతిభను గుర్తించి ప్రోత్సహించే విషయంలో ఆస్ట్రేలియా ఇప్పటికే వెనుకబడిపోయింది. ఇంగ్లండ్ ఇందులో బాగా పని చేస్తుండగా భారత్ కూడా ఆసీస్ను వెనక్కి నెట్టేసింది. భారత్లో దీనిని రాహుల్ ద్రవిడ్ సమర్థంగా అమలు చేస్తున్నాడు. నిజానికి అతను ఆస్ట్రేలియాలో ఉన్న వ్యవస్థను చూసి నేర్చుకొని భారత్లో దానిని తీర్చిదిద్దాడు’ అని చాపెల్ వ్యాఖ్యానించాడు. -
పాజిటివ్ వచ్చిందో... చోటు పోయినట్లే
ముంబై: ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికైన భారత క్రికెటర్లంతా స్వస్థలాల్లోనూ తగు జాగ్రత్తలతో కరోనా నుంచి తమను తాము కాపాడుకోవాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్పష్టంగా చెప్పింది. టీమ్ అంతా ఒక్క చోటికి చేరే సమయంలో ఎవరైనా పాజిటివ్ వస్తే వారు ఇంగ్లండ్ పర్యటన నుంచి దూరమైనట్లేనని హెచ్చరించింది. టీమిండియా ఫిజియో యోగేశ్ పర్మార్ సూచనలతో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్తో పాటు ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ కోసం జూన్ 2న భారత జట్టు ఇంగ్లండ్ బయలుదేరాల్సి ఉండగా కనీసం పది రోజుల పాటు భారత్లో ప్రత్యేక బబుల్ ఏర్పాటు చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. వేర్వేరు నగరాల నుంచి ముంబైకి వచ్చే క్రికెటర్లు హోటల్లోకి అడుగు పెట్టగానే ఆర్టీ–పీసీఆర్ టెస్టులు నిర్వహిస్తారు. కరోనా కారణంగా ఐపీఎల్ వాయిదా వేయాల్సి రావడంతో బోర్డు ఈసారి అదనపు జాగ్రత్తలు తీసుకునేందుకు సిద్ధమైంది. ‘ముంబైకి వచ్చిన తర్వాత ఎవరైనా ఆటగాడు కరోనా పాజిటివ్గా తేలితే వారి ఇంగ్లండ్ పర్యటన ఇక్కడే ముగిసిపోయినట్లుగా భావించవచ్చు. క్రికెటర్లు అందరికీ ఈ విషయం చెప్పేశాం. ఎవరి కోసం కూడా బీసీసీఐ ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. ఇంకా చెప్పాలంటే ముంబైకి రాక ముందే వీలైనంత వరకు వారు ఐసోలేషన్లోనే ఉంటే మరీ మంచిది’ అని బోర్డు ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. కోవిషీల్డ్ డోసు తీసుకోండి... మరోవైపు క్రికెటర్లంతా కోవిషీల్డ్ వ్యాక్సిన్ మాత్రమే మొదటి డోసు వేసుకోవాలని కూడా సూచించింది. కోవిషీల్డ్ మరో వెర్షన్ అయిన అస్ట్రాజెన్కా ఇంగ్లండ్లో కూడా అందుబాటులో ఉంది కాబట్టి రెండో డోసు అక్కడ తీసుకోవచ్చని... అదే కోవాగ్జిన్ అయితే సాధ్యం కాదని చెప్పింది. ఎవరైనా క్రికెటర్లు తమ నగరంలో కోవిషీల్డ్ అందుబాటులో లేదని చెబితే తాము ఏర్పాటు చేస్తామని కూడా బీసీసీఐ స్పష్టం చేసింది. బుమ్రా, స్మృతిలకు ‘వ్యాక్సిన్’ వ్యాక్సిన్ వేయించుకోవడానికి భారత క్రికెటర్లు క్యూ కడుతున్నారు. ఇప్పటికే సారథి విరాట్ కోహ్లిŠ, రహానే, పుజారా, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్లతో సహా పలువురు క్రికెటర్లు తమ తొలి డోస్ కోవిడ్ వ్యాక్సిన్ను వేయించుకోగా... తాజాగా ఆ జాబితాలో పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా చేరాడు. తాను తొలి డోస్ వ్యాక్సిన్ను తీసుకున్నట్లు బుమ్రా ట్విట్టర్ ద్వారా మంగళవారం తెలిపాడు. ‘వ్యాక్సిన్ తీసుకోవడం పూర్తయింది. మీరూ క్షేమం గా ఉండండి’ అంటూ బుమ్రా ట్వీట్ చేశాడు. దినేశ్ కార్తీక్, భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధానలు కూడా తొలి డోస్ వ్యాక్సిన్ను వేయించుకున్నట్లు సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపారు. -
అమ్మా.. అక్కా.. గుండె పగిలిపోతోంది: క్రికెటర్ భావోద్వేగం
బెంగళూరు: ‘‘ప్రియమైన.. అందమైన అమ్మ.. అక్క... మన పొదరింటిని నిలబెట్టింది మీరిద్దరే. ఇలాంటి ఒకరోజు వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. గత కొన్నిరోజులుగా మన ఇంట్లో జరుగుతున్న పరిణామాలు గుండెను బద్దలు చేస్తున్నాయి. అమ్మా... ఎలాంటి కఠిన పరిస్థితులనైనా ఎదుర్కొనే ధైర్యవంతురాలిగా నన్ను పెంచావు. నాకు తెలిసిన అత్యంత అందమైన మనసు గల, నిస్వార్థమైన వ్యక్తివి నువ్వే. అక్కా.. నీకు అత్యంత ఇష్టమైన చెల్లిని నేనని నాకు తెలుసు. నువ్వొక యోధురాలివి. చివరి నిమిషం దాకా ఎలా పోరాడాలో నాకు నేర్పించావు. మీరిద్దరూ.. నా ప్రతిమాటలో.. నేను చేసే ప్రతిపనిలో సంతోషం వెదుక్కునే వారు. మీకు తెలుసా.. నాకు ఇద్దరు అమ్మలు అనే గర్వం నాలో ఉండేది. కానీ.. ఏ మనిషికీ ఇంత గర్వం పనికిరాదు. గతకొన్ని రోజులుగా మీతో గడిపిన సంతోష క్షణాలే ఆఖరు అవుతాయని నేను ఊహించలేకపోయాను. మీరిద్దరు నన్ను వదిలేసి శాశ్వతంగా వెళ్లిపోయిన తర్వాత నా ప్రపంచమంతా తలకిందులైపోయింది. మీ ఇద్దరినీ నేనెంతగా ప్రేమిస్తానో అంతే మిస్సవుతున్నాను కూడా.. నాకింతటి ప్రేమను పంచినందుకు ధన్యవాదాలు’’ అంటూ భారత మహిళా క్రికెటర్ వేద కృష్ణమూర్తి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన తల్లిని, అక్కను గుర్తుచేసుకుని ఉద్వేగానికి గురయ్యారు. కాగా వేద కృష్ణమూర్తి తల్లి చెలువాంబా గత నెల 23న కరోనాతో మృతి చెందగా.. ఆమె అక్క వత్సల కోవిడ్తో మే 6న కన్నుమూశారు. వరుస ఘటనల నేపథ్యంలో ఆమె కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ క్రమంలో వేద కృష్ణమూర్తి అమ్మ, అక్కతో తనకున్న అనుబంధాన్ని ప్రతిబింబించేలా సోమవారం ట్విటర్ వేదికగా ఓ నోట్ షేర్ చేశారు. ఈ సందర్భంగా వారిని స్మరించుకుంటూ ఉద్వేగానికి లోనైన ఆమె.. ‘‘నాలాంటి బాధను అనుభవిస్తున్న వారిని తలచుకుంటుంటే మనస్సు తరుక్కుపోతోంది. నిజానికి మా కుటుంబం చాలా జాగ్రత్తలు పాటించింది. అయినా మహమ్మారి మా ఇంటి వరకు వచ్చిది. ఈ వైరస్ చాలా ప్రమాదకరమైంది. కాబట్టి ప్రతిఒక్కరు కోవిడ్ నిబంధనలు పాటించండి. సురక్షితంగా, ధైర్యంగా ఉండండి’’ అని విజ్ఞప్తి చేశారు. కాగా బెంగళూరుకు చెందిన వేద కృష్ణమూర్తి భారత్ తరఫున 48 వన్డేలు ఆడి 829 పరుగులు... 76 టి20 మ్యాచ్లు ఆడి 875 పరుగులు సాధించారు. To my dearest Amma and Akka ❤️ pic.twitter.com/NLj7kAYQXN — Veda Krishnamurthy (@vedakmurthy08) May 10, 2021 -
టీమిండియా ఆట.. శశిథరూర్ మాట
టెస్ట్ మ్యాచ్ సిరీస్లో ఆస్ట్రేలియాపై ఇండియా గెలవగానే శశిథరూర్ వర్డ్.. ఆఫ్ ది డే : ‘ఎపికేరికసీ’ అంటూ ట్వీట్ చేశారు. ఆ మాటకు స్పెల్లింగ్ Epicaricacy. ఆ మాటకు అర్థం.. ఒకరి బాధ ఇంకొకరికి సంతోషం అవడం. అయితే ఆయన ఉద్దేశం నేరుగా అదే కాకపోయినా, ఇండియాను.. చేతులెత్తేస్తుందనీ, కళ్లు తేలేస్తుందనీ, తలకిందులు అవుతుందనీ.. జోస్యం చెప్పిన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ దిగ్గజాలకు ఇండియా గెలుపు తగిన సమాధానం చెప్పడం తనకెంతో ఆనందంగా ఉందని శశిథరూర్ చెప్పదలచుకున్నారు. అందుకు నిదర్శనంగా తన ‘వర్డ్ ఆఫ్ ది డే’ ట్వీట్కు.. ఈ సీరీస్లో టీమ్ ఇండియా పరాజయాన్ని ఊహించి మరీ కామెంట్స్ చేసిన వారి ఫొటోలను, వారి మాటలను జోడించారు. ఇంగ్లిష్ బాగా తెలిసిన వారికి టీమ్ ఇండియాపై ఎనలేని అభిమానం ఉంటే ఎలా స్పందిస్తారో సరిగ్గానే అలానే స్పందించారు శశి థరూర్. శశిథరూర్ కాంగ్రెస్ నాయకుడు. తిరువనంతపురం (కేరళ) ఎంపీ. ఇంగ్లిష్ అన్నా, క్రికెట్ అన్నా ఇష్టం. ఇంగ్లిష్లో తనని ఎవరైనా పండితుడని అంటే ఆయన ఒప్పుకోరు కానీ, చేతన్ భగత్ వంటి ఆంగ్ల భాషా నవలా రచయితలు థరూర్ని.. ఆ పద సంపదను చూసి.. ఆరాధిస్తారు. ఈమధ్య మీరు చదివే ఉంటారు. ఈమధ్యంటే.. గత సెప్టెంబరులో. చేతన్ భగత్ ఒక జాతీయ ఆంగ్ల దినపత్రికలో ఒక కామెంట్ రాశాడు. యూత్ అస్తమానం ఫోన్ గిల్లుకుంటూ కూర్చోవడం మాని, కాస్త దేశ ఆర్థిక స్థితి గురించి ఆలోచించాలని. గోళ్లు గిల్లుకోవడం అనే నానుడినే ఇప్పటి పరిస్థితులను బట్టి ఫోన్లు గిల్లుకోవడం అన్నాడు చే తన్. ఆ పన్, ఆ పెన్ థరూర్కి నచ్చింది. నచ్చిందని మామూలుగా చెబుతారా! తన స్టెయిల్లో చెప్పారు. భారీ పదాల్లో! ‘ఓ మైడియర్ చేతన్.. నీ కాలమ్ Sesquipedalian అన్నారు. Rodomanted అన్నారు. Limpid perspicacity అని ఇంకో మాట కూడా వేశారు. ఆఖర్న సుపర్బ్ పీస్ అన్నారు. ఈ పదాలేవీ చేతన్ విని ఉండనివి కాకున్నా.. అంత పెద్ద థరూర్ తనను ప్రశంసించడం చేతన్లో చురుకుదనం పుట్టించింది. వెంటనే.. సర్, మరికొన్ని గంభీరమైన పదాల్లో నన్ను మీరు అభినందించాలని కోరుకుంటున్నాను’ అని ట్వీట్ పెట్టాడు. అది వాళ్లిద్దరి సరదా! సమస్థాయి కనుక. ఏమైనా థరూర్తో ఇంగ్లిష్ వర్డింగ్ యూసేజ్లో తలపడగలవారెవరూ ప్రస్తుతానికైతే ఇండియాలో లేరు. ఒకవేళ తల పండిన వాళ్లెవరైనా ఉన్నా.. వాళ్లకు తలపడే తలంపు లేకపోవచ్చు. శశి థరూర్కి ఇంగ్లిష్ అంటే ఎంత ఆపేక్షో క్రికెట్ అంత ఇష్టం. ఈ సంగతి ఇండియా ఫుట్బాల్ కెప్టెన్ సునీల్ ఛత్రితో ఇన్స్టాగ్రామ్లో మాట్లాడుతున్నప్పుడు థరూర్ బయటపెట్టారు. అసలు క్రికెట్ ప్రస్తావన ఎందుకొచ్చింది? సునీల్ స్పోర్ట్స్ పర్సన్ కనుక థరూర్ని మీకే ఆట అంటే ఇష్టం. మీరు ఏ ప్లేయర్ని ఇష్టపడతారు.. అని అడిగారు. ఏ ఆట అంటే ఇష్టం అన్నప్పుడు ‘ఐయామ్ ఎ క్రికెట్ ట్రాజిక్’ అని చెప్పారు. క్రికెట్ అంటే పడి చచ్చిపోతానని. ‘‘సరే, మీకు ఇష్టమైన క్రికెటర్ పేరు చెప్పండి?’’ అని అడిగారు సునీల్. ఒకరని చెప్పలేను. ఓ ఇరవై మంది పేర్లు చెప్పమంటే చెప్తాను’’ అని థరూర్. ‘‘పోనీ ఇది చెప్పండి. అందరికంటే ముందుగా మీరు అభిమానించిన భారతీయ క్రికెటర్ ఎవరో చెప్పండి’’ అని సునీల్ మరో ప్రశ్న. ఎం.ఎల్. జైసింహ పేరు చెప్పారు థరూర్. ఆయనే ఎందుకంటే.. ఆడతాడు ప్లస్ చూడ్డానికీ బాగుంటాడు అని థరూర్ ఆర్సర్. మెడకు కర్చీఫ్ కట్టుకోవడం అదీ ‘లుక్స్ నైస్’ అట. థరూర్కి నచ్చిన మరో క్రికెట్ ప్లేయర్ ఎం.ఎ.కె. పటౌడీ. 1961లో ఇంగ్లండ్లో జరిగిన కారు ఆక్సిడెంట్లో పటౌడీ కుడి కన్ను దెబ్బతిని చూపు పోయింది. ‘‘ఒక కంటి చూపు లేకున్నా ఆయన అద్భుతంగా ఆడేవారని’’ అంటారు థరూర్. అది నిజమే. చూపునకు, చూసే దృష్టికీ సంబంధం ఉండదు. ఆ సంగతిని ఇప్పుడు ఆస్ట్రేలియన్ క్రికెట్ పూర్వపు దిగ్గజాలు తెలుసుకునే ఉంటారు. టీమ్ ఇండియాను వాళ్లు తక్కువ చూపు చూశారు. టీమ్ ఇండియా తమ గెలుపుతో వాళ్ల కళ్లు తెరిపించింది. ►వాళ్ల బ్యాటింగ్ చూడండి. విరాట్ కోహ్లీ లేకుండా తర్వాతి రెండు టెస్ట్ మ్యాచిల్లో వాళ్లెలా ఆడబోతున్నారో మీరు ఊహించగలరా? టీమ్ ఇండియా పీకలోతు కష్టాల్లో పడిపోయింది. – మైఖేల్ క్లార్, ఆస్ట్రేలియా జట్టు మాజీ కెప్టెన్ ►తెలిసిపోతూనే ఉంది. ఏమీ దాచేపనిలేదు. కోహ్లీ లేడు. అతడే లేకపోయాక ఇండియా జట్టును ఇంకెవరూ కాపాడలేదు. ఓడిపోబోవడం కన్నా, కోహ్లీ లేకపోవడం పెద్ద నష్టం టీమ్ ఇండియాకు. – రికీ పాంటింగ్, ఆస్ట్రేలియా జట్టు మాజీ కెప్టెన్ ►మూడో రోజు (అడిలైడ్లో) ఆస్ట్రేలియా ఇండియాను తుడిచిపెట్టేశాక, తిరిగి వాళ్లెలా పుంజుకుంటారో నేను ఊహించలేకున్నాను. – మార్క్ వా, ఆస్ట్రేలియా జట్టు మాజీ కెప్టెన్ ►చెప్పాను కదా. టెస్ట్ సీరీస్లో ఇండియా తలబొప్పి కట్టబోతోంది. – మైఖేల్ వాగన్, ఇంగ్లండ్ జట్టు మాజీ కెప్టెన్ ►టెస్ట్ మ్యాచ్లో వాళ్లకున్న ఒకే ఒక గెలుపు అవకాశం అడిలైట్ అనుకున్నాను. అక్కడే గెలవలేకపోయారు. – బ్రాడ్ హడిన్, ఆస్ట్రేలియా జట్టు మాజీ వికెట్ కీపర్ -
ఐసోలేషన్లో రోహిత్ శర్మ
మెల్బోర్న్: భారత క్రికెటర్లపై అభిమానంతో ఒక వీరాభిమాని చేసిన పని వారికి కొత్త చిక్కులు తెచ్చి పెట్టింది. ఈ అభిమానం కారణంగా భారత జట్టు టెస్టు వైస్ కెప్టెన్ రోహిత్శర్మ సహా నలుగురు క్రికెటర్లు ఐసోలేషన్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొత్త సంవత్సరం రోజున బయటకు వెళ్లి అల్పాహారం చేసిన కారణంగా రోహిత్ శర్మ, యువ ఓపెనర్లు శుబ్మన్ గిల్, పృథ్వీ షా, వికెట్కీపర్ రిషభ్ పంత్, పేసర్ నవదీప్ సైనీలను ఐసోలేషన్కు తరలించినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) శనివారం వెల్లడించింది. ఆటగాళ్లు బయో బబుల్ ప్రొటోకాల్ను ఉల్లంఘించారా లేదా అని తెలుసుకునేందుకు బీసీసీఐ, సీఏ సంయుక్తంగా దర్యాప్తు చేపడుతున్నట్లు చెప్పింది. ► సీఏ ప్రొటోకాల్ ప్రకారం ఆటగాళ్లు ఇన్డోర్ ప్రదేశాల్లో భోజనం చేయకూడదు. ప్రజా రవాణా వ్యవస్థను వాడకుండా సామాజిక దూరాన్ని పాటిస్తూ కాలిబాటన వారికి సమీపంలోని అవుట్డోర్ వేదికలకు మాత్రమే వెళ్లేందుకు అనుమతి ఉంటుంది. ► అయితే శుక్రవారం కొత్త సంవత్సరం సందర్భంగా మెల్బోర్న్లోని సమీప రెస్టారెంట్కు వెళ్లి భారత క్రికెటర్లు అల్పాహారం చేస్తుండగా... అక్కడే ఉన్న భారత అభిమాని ఒకరు వారికి తెలియకుండా క్రికెటర్ల బిల్లు చెల్లించాడు. ఇది తెలుసుకున్న రోహిత్ శర్మ తనను వారించినట్లు, రిషభ్ పంత్ తనను ఆలింగనం చేసుకున్నట్లు, ఆ తర్వాత క్రికెటర్లతో కలిసి ఫొటో తీసుకున్నానని ఆ అభిమాని ట్విట్టర్ వేదికగా పంచుకోవడంతో ఈ సంగతి సీఏ దృష్టికి వచ్చింది. ► బయో బబుల్ దాటి వచ్చారనే ఆరోపణలతో తాజాగా సీఏ ఈ ఐదుగురిని ఐసోలేషన్లో ఉంచింది. దీంతో వీరు ప్రయాణాల్లో, ప్రాక్టీస్ సమయాల్లో... మిగతా భారత జట్టుతో పాటు ఆస్ట్రేలియా ఆటగాళ్లకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. 7 నుంచి జరుగనున్న మూడో టెస్టు కోసం ఇరు జట్లు 2 రోజుల ముందుగా సిడ్నీకి వస్తాయి. ► ‘ఉద్దేశపూర్వకంగా ఎలాంటి ఉల్లంఘన జరగలేదు. మన వాళ్లకు నిబంధనల గురించి బాగా తెలుసు. వారిపై బీసీసీఐ ఎలాంటి దర్యాప్తు చేపట్టడం లేదు. రెండో టెస్టు లో భారత్ చేతిలో ఓటమి అనంతరం ఆస్ట్రేలియాలోని ఓ వర్గం మీడియా ఇలాంటి ద్వేషపూరిత వార్తలను ప్రచారం చేస్తోంది. మూడో టెస్టు ముందర భారత జట్టును కలవరపెట్టేందుకు ఇది ఓ ప్రయత్నమైతే, ఇది చాలా చెడ్డ కుట్ర అని భావించవచ్చు. ఇప్పుడు ఈ వివాదం 2007–08లో జరిగిన ‘మంకీ గేట్’ నాటి పరిస్థితులను తలపిస్తోంది’ అని బీసీసీఐకి చెందిన ఓ అధికారి వివరణ ఇచ్చారు. రెస్టారెంట్లో భారత క్రికెటర్లు -
ఆశిద్దాం ఆటకు 'అచ్చేదిన్'...
ఆనందంగా, ఉత్సాహంగా మైదానంలో చప్పట్లు కొడుతూ అభిమాన ఆటగాళ్లను అభినందించే రోజు రావాలని... వాయిదాలు, రద్దుల పర్వం ఇకనైనా వినిపించరాదని... బయో బబుల్ అంటూ గుబులు పెట్టించే బాధ అథ్లెట్లకు తప్పాలని... 2021లో అనుకున్న తేదీల్లోనే జరిగి ఆటలకు ‘అచ్ఛే దిన్’ వస్తాయని కోరుకుందాం... కరోనా దెబ్బకు కుప్పకూలిన క్రీడలు మునుపటిలా మనకు సంతోషం పంచాలని ఆశిద్దాం. టోక్యో ఒలింపిక్స్, టి20 ప్రపంచకప్... ఇలా శిఖరాన నిలిచే టోర్నీలతో పాటు ఈ ఏడాది జరగబోయే పలు ప్రధాన టోర్నీలను చూస్తే... క్రికెట్... భారత్ బిజీ బిజీ... కరోనా కారణంగా 2020లో తక్కువ మ్యాచ్లు ఆడిన భారత జట్టుకు 2021లో ఎడతెరిపిలేని షెడ్యూల్ ఉంది. ప్రస్తుతం ఆ్రస్టేలియాలో ఉన్న భారత్ సిడ్నీలో జనవరి 7 నుంచి మూడో టెస్టు... జనవరి 15 నుంచి చివరిదైన నాలుగో టెస్టు ఆడుతుంది. ఆ్రస్టేలియా పర్యటన ముగించుకొని స్వదేశానికి తిరిగి వచ్చాక తమ సొంతగడ్డపై ఇంగ్లండ్తో సిరీస్ ఆడుతుంది. ఫిబ్రవరి 5 నుంచి మార్చి 28 వరకు జరిగే ఈ సిరీస్లో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య 4 టెస్టులు, 5 టి20 మ్యాచ్లు, 3 వన్డేలు జరుగుతాయి. ఇంగ్లండ్తో సిరీస్ ముగిసిన వెంటనే ఏప్రిల్–మే నెలల్లో ఐపీఎల్ జరుగుతుంది. ఇది ముగిశాక... ఒకవేళ భారత జట్టు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్కు అర్హత సాధిస్తే జూన్లో ఇంగ్లండ్లోని లార్డ్స్ మైదానంలో ఫైనల్ ఆడేందుకు వెళ్లాల్సి ఉంటుంది. అనంతరం ఆగస్టులో ఇంగ్లండ్లో భారత్ పర్యటిస్తుంది. ఇందులో భాగంగా ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 14 వరకు భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టెస్టులు జరుగుతాయి. సెప్టెంబర్ చివరి వారంలో ఆసియా కప్ టోర్నమెంట్... అక్టోబర్–నవంబర్లలో స్వదేశంలో టి20 వరల్డ్కప్లో భారత్ బరిలోకి దిగనుంది. నవంబర్లో టి20 ప్రపంచకప్ ముగిశాక భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు బయలుదేరి వెళుతుంది. అక్కడ సఫారీ జట్టుతో మూడు టెస్టులు, మూడు టి20 మ్యాచ్ల్లో తలపడుతుంది. ఫార్ములావన్ కరోనా కారణంగా గతేడాది 17 రేసులకే పరిమితమైన ఫార్ములావన్ కొత్త సంవత్సరంలో 23 రేసులతో దూసుకెళ్లేందుకు సిద్ధమైంది. మార్చి 21న ఆస్ట్రేలియా గ్రాండ్ప్రితో మొదలయ్యే సీజన్... డిసెంబర్ 5న అబుదాబి గ్రాండ్ప్రితో ముగియనుంది. ఈ మధ్యలో మార్చి 28న బహ్రెయిన్ గ్రాండ్ ప్రి, ఏప్రిల్ 11న చైనా, మే 9న స్పెయిన్, 23న మొనాకో, జూన్ 6న అజర్బైజాన్, 13న కెనడా, 27న ఫ్రాన్స్, జూలై 4న ఆ్రస్టియా, 18న యూకే, ఆగస్టు 1న హంగరీ, 29న బెల్జియం, సెపె్టంబర్ 5న నెదర్లాండ్స్, సెపె్టంబర్ 12న ఇటలీ, 26న రష్యా, అక్టోబర్ 3న సింగపూర్, 10న జపాన్, 24న యూఎస్ఏ, 31న మెక్సికో, నవంబర్ 14న బ్రెజిల్, 28న సౌదీ అరేబియా గ్రాండ్ ప్రి రేసులు జరుగుతాయి. రేసు క్యాలెండర్లో సౌదీ అరేబియా ఈ ఏడాదే అరంగేట్రం చేసింది. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 25న జరిగాల్సిన గ్రాండ్ ప్రి వేదిక ఇంకా ఖరారు కాలేదు. బ్యాడ్మింటన్ ఒలింపిక్స్లో భారత్కు పతకావకాశాలు మెండుగా ఉన్న క్రీడ బ్యాడ్మింటన్. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్కు ముందు ప్లేయర్లు మునుపటి లయను అందుకోవడానికి కొత్త ఏడాదిలో చాలినన్ని వరల్డ్ టూర్ సూపర్ టోరీ్నలు సిద్ధంగా ఉన్నాయి. జనవరి 12–17: థాయ్లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీ, 19–24: థాయ్లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీ, 27–31: వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీ, మార్చి 17–21: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ సూపర్–1000, ఏప్రిల్ 6–11: మలేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500, 13–18: సింగపూర్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500, మే 11–16: ఇండియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500, జూన్ 1–6: ఇండోనేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500, 8–13: ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000; ఆగస్టు 24–29: హైదరాబాద్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–100, ఆగస్టు 31– సెపె్టంబర్ 5: కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500, సెపె్టంబర్ 21–26: చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000, సెపె్టంబర్ 28–అక్టోబర్ 3: జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750, అక్టోబర్ 12–17: సయ్యద్ మోదీ ఇండియా ఇంటర్నేషనల్ వరల్డ్ టూర్ సూపర్–300, 19–24: డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750, 26–31: ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750, నవంబర్ 9–14: ఫుజు చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750, 16–21: హాంకాంగ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500, డిసెంబర్ 15–19: బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ జరుగుతాయి. టెన్నిస్ ఫిబ్రవరి 8–21: ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీ, మార్చి 24–ఏప్రిల్ 4: మయామి ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీ, ఏప్రిల్ 11–18: మోంటెకార్లో ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీ, మే 2–9: మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీ, మే 23–జూన్ 6: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీ, జూన్ 28–జూలై 7: వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టోర్నీ, ఆగస్టు 9–22: రోజర్స్ కప్, 15–22: సిన్సినాటి ఓపెన్, ఆగస్టు 30–సెప్టెంబర్ 12: యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్, అక్టోబర్ 10–17: షాంఘై మాస్టర్స్ సూపర్–1000 టోర్నీ, నవంబర్ 1–7: పారిస్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీ, 14–21: సీజన్ ముగింపు ఏటీపీ ఫైనల్స్ టోర్నీ. షూటింగ్ ఫిబ్రవరి 22–మార్చి 5: వరల్డ్కప్ షాట్గన్ (ఈజిప్ట్), మార్చి 18–29: వరల్డ్ కప్ రైఫిల్, పిస్టల్, షాట్గన్ (న్యూఢిల్లీ), ఏప్రిల్ 16–27: వరల్డ్కప్ రైఫిల్, పిస్టల్, షాట్గన్ (దక్షిణ కొరియా), మే 7–17: వరల్డ్ కప్ షాట్గన్ (ఇటలీ). చెస్ జనవరి 15–31: టాటా స్టీల్ (నెదర్లాండ్స్), 17–29: మహిళల గ్రాండ్ ప్రి, ఏప్రిల్ 8–14: క్యాండిడేట్స్ టోర్నీ (రష్యా), మే 23–31: చాంపియన్స్ చెస్ టూర్, జూన్ 4–15: చెస్ క్లాసిక్ టోర్నీ (రొమేనియా), 17–22: పారిస్ ర్యాపిడ్, బ్లిట్జ్ టోర్నీ, జూలై 5–12: క్రొయేíÙయా ర్యాపిడ్, బ్లిట్జ్ టోర్నీ, 17–28; బీల్ చెస్ ఫెస్టివల్ (స్విట్జర్లాండ్), ఆగస్టు 10–15: సెయింట్ లూయిస్ ర్యాపిడ్, బ్లిట్జ్ టోర్నీ, అక్టోబర్ 25–నవంబర్ 8: ఫిడే గ్రాండ్ స్విస్ అండ్ మహిళల గ్రాండ్ స్విస్ టోర్నీ, నవంబర్–డిసెంబర్: ప్రపంచ చెస్ చాంపియన్షిప్ (దుబాయ్). -
సెలక్షన్ కమిటీ చైర్మన్గా చేతన్ శర్మ
అహ్మదాబాద్: భారత క్రికెట్ సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్గా మాజీ పేస్ బౌలర్ చేతన్ శర్మ (నార్త్ జోన్) ఎంపికయ్యాడు. గురువారం జరిగిన బీసీసీఐ ఎజీఎంలో ఈ ఎంపికను ఖరారు చేశారు. చేతన్తో పాటు సెలక్షన్ కమిటీలో మాజీ పేసర్లు అబయ్ కురువిల్లా, దేవాశీష్ మొహంతి లకు కూడా అవకాశం దక్కింది. మదన్ లాల్, ఆర్పీ సింగ్, సులక్షణా నాయక్లు సభ్యులుగా ఉన్న క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) ఇంటర్వ్యూలు నిర్వహించి కొత్త సెలక్టర్లను ఎంపిక చేసింది. ఐదుగురు సభ్యుల సెలక్షన్ కమిటీలో ఇప్పటికే సునీల్ జోషి, హర్వీందర్ సింగ్ ఉన్నారు. కొత్తగా ఎంపికైన ముగ్గురు వీరితో జత కలుస్తారు. ఇప్పటి వరకు జోషి చైర్మన్గా వ్యవహరించినా... నిబంధనల ప్రకారం ఐదుగురిలో ఎక్కువ టెస్టులు ఆడిన చేతన్ శర్మ ఇకపై చీఫ్ సెలక్టర్ హోదాలో పని చేస్తాడు. వెస్ట్ జోన్నుంచి చివరి నిమిషం వరకు అజిత్ అగార్కర్ పేరు వినిపించినా... అనూహ్యంగా కురువిల్లాకు అవకాశం లభించింది. వీరితో పాటు సెలక్టర్ పదవి కోసం మణీందర్ సింగ్, నయన్ మోంగియా, శివసుందర్ దాస్, రణదేబ్ బోస్ తదితరులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం సెలక్షన్ కమిటీలో ఐదుగురూ బౌలర్లే (నలుగురు పేస్, ఒకరు స్పిన్నర్) కావడం విశేషం! తొలి హ్యాట్రిక్తో... పదేళ్ల అంతర్జాతీయ కెరీర్లో చేతన్ శర్మ భారత్ తరఫున 23 టెస్టులు (61 వికెట్లు), 65 వన్డేలు (67 వికెట్లు) ఆడాడు. 1987 ప్రపంచకప్లో న్యూజిలాండ్పై ‘హ్యాట్రిక్’ తీసిన చేతన్...ఈ రికార్డు సాధించిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. అయితే అంతకు ముందు ఏడాది ఆస్ట్రలేసియా కప్ ఫైనల్లో అతని బౌలింగ్లో చివరి బంతికి మియాందాద్ సిక్సర్ బాది పాక్ను గెలిపించిన క్షణం చేతన్ను సుదీర్ఘ కాలం వెంటాడటంతో అతని ఘనతలకు తగిన గుర్తింపు దక్కలేదు. దేవాశీష్ మొహంతి భారత్ తరఫున 2 టెస్టులు (4 వికెట్లు), 45 వన్డేలు (57 వికెట్లు) ఆడగా... అబయ్ కురువిల్లా 10 టెస్టులు (25 వికెట్లు), 25 వన్డేల్లో (25 వికెట్లు) టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. -
మన బంతి మెరిసింది
ఎరుపు అయితేనేమి, అది గులాబీ అయితేనేమి... బంతి రంగు మారిందే తప్ప భారత బౌలింగ్ పదునులో మాత్రం ఎలాంటి తేడా లేదు... గత కొన్నేళ్లుగా జట్టు చిరస్మరణీయ విజయాల్లో కీలకపాత్ర పోషించిన మన బౌలర్లు మరోసారి తమ సత్తా చాటుతూ ప్రత్యర్థిని పడగొట్టారు. భారీ స్కోరు సాధించలేకపోయిన టీమిండియా బాధను తీరుస్తూ ఆ్రస్టేలియాను వారి సొంత మైదానంలోనే కుప్పకూల్చి సిరీస్లో శుభారంభానికి బాటలు వేశారు. ముందుగా బుమ్రా వేట మొదలు పెట్టగా, అశ్విన్ మాయకు ఆసీస్ మిడిలార్డర్ వద్ద జవాబు లేకపోయింది. వికెట్ పడగొట్టకపోయినా బ్యాట్స్మెన్ను కట్టడి చేసి పడేసిన షమీ, కీలక సమయంలో వికెట్లు తీసిన ఉమేశ్ రెండో రోజు భారత్ హీరోలుగా నిలిచారు. కొంత అదృష్టం కలిసి రావడంతోపాటు కెపె్టన్ పైన్ పోరాడటంతో కంగారూలు చివరకు కాస్త మెరుగైన స్థితిలో ముగించగలిగారు. తొలి ఇన్నింగ్స్లో సాధించిన 53 పరుగుల కీలక ఆధిక్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి మూడో రోజు కోహ్లి సేన భారీ స్కోరుగా మలచగలిగితే ఇదే అడిలైడ్లో రెండేళ్ల క్రితంనాటి ఫలితాన్ని పునరావృతం చేయడం మన జట్టుకు కష్టం కాకపోవచ్చు. అడిలైడ్: తొలి టెస్టులో బౌలర్ల ప్రదర్శన భారత్ను ఆధిక్యంలో నిలబెట్టింది. మన బౌలర్లను సమర్థంగా ఎదుర్కోవడంలో విఫలమైన ఆ్రస్టేలియా తమ తొలి ఇన్నింగ్స్లో 191 పరుగులకే ఆలౌటైంది. కెపె్టన్ టిమ్ పైన్ (99 బంతుల్లో 73 నాటౌట్; 10 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించగా, మార్నస్ లబ్షేన్ (119 బంతుల్లో 47; 7 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. అశ్విన్ 4 వికెట్లతో చెలరేగగా... ఉమేశ్ యాదవ్ 3, బుమ్రా 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్... పృథ్వీ షా (4) వికెట్ చేజార్చుకొని 9 పరుగులు చేసింది. మయాంక్ (5 బ్యాటింగ్)... బుమ్రా (0 బ్యాటింగ్) క్రీజ్లో ఉన్నారు. శుక్రవారం ఉదయం 233/6తో ఆట కొనసాగించిన భారత్ తమ మొదటి ఇన్నింగ్స్లో 244 పరుగులకు ఆలౌటైంది. ఓవర్నైట్ స్కోరుకు జట్టు మరో 11 పరుగులు మాత్రమే జత చేయగలిగింది. ఫలితంగా 53 పరుగుల తొలి ఇన్నింగ్స్ లభించింది. 4.1 ఓవర్లలోనే... రెండో రోజు మరిన్ని పరుగులు జోడించి స్కోరును కనీసం 300 వరకు చేర్చాలనుకున్న భారత్ కోరిక నెరవేరలేదు. 4.1 ఓవర్ల వ్యవధిలోనే జట్టు మిగిలిన 4 వికెట్లూ కోల్పోయింది. అశ్విన్ (15), సాహా (9) తమ ఓవర్నైట్ స్కోరుకు ఒక్క పరుగును కూడా జోడించలేకపోయారు. ఆ వెంటనే ఉమేశ్ (6), షమీ (0) కూడా అవుట్ కావడంతో భారత్ కథ ముగిసింది. మొత్తంగా కోహ్లి రనౌట్ నుంచి చూస్తే 56 పరుగుల వ్యవధిలో భారత్ చివరి 7 వికెట్లు కోల్పోయింది. బ్యాట్స్మెన్ తడబాటు... ఆ్రస్టేలియా కూడా తమ తొలి ఇన్నింగ్స్ను అతి జాగ్రత్తగా ప్రారంభించింది. ఒక్క పరుగు రాకపోయినా... పింక్ బంతిని ఎదుర్కొని క్రీజ్లో నిలిస్తే చాలనే ధోరణితో ఓపెనర్లు ఆడారు. 150 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల కెరీర్లో ఒక్కసారి కూడా ఓపెనింగ్ చేయని మాథ్యూ వేడ్ (51 బంతుల్లో 8), పేలవ ఫామ్లో ఉన్నా మరో ప్రత్యామ్నాయం లేక అవకాశం దక్కించుకున్న జో బర్న్స్ (41 బంతుల్లో 8) తమ వికెట్ కాపాడుకునేందుకు తీవ్రంగా శ్రమించారు. తొలి నాలుగు ఓవర్లు మెయిడిన్లుగా ముగిసిన తర్వాత ఐదో ఓవర్ నాలుగో బంతికి తొలి పరుగు రాగా... 14 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 16 మాత్రమే! అయితే ఎక్కువ సేపు ఈ ఒత్తిడిని అధిగమించలేకపోయిన వీరిద్దరు బుమ్రా వరుస ఓవర్లలో వికెట్ల ముందు దొరికిపోయారు. ఆసీస్ ఇన్నింగ్స్కు ప్రాణంలాంటి ఇద్దరు బ్యాట్స్మెన్ లబ్õÙన్, స్టీవ్ స్మిత్ (29 బంతుల్లో 1)లపై జట్టును ఆదుకోవాల్సిన భారం పడింది. అయితే వీరిద్దరు కూడా వికెట్ మీద నిలదొక్కుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వడంతో పరుగులు రావడం గగనంగా మారింది. ముఖ్యంగా క్రీజ్లో ఉన్నంత సేపు స్మిత్ బాగా ఇబ్బంది పడటం ఆశ్చర్యం కలిగించింది. అశ్విన్ సూపర్... ఆసీస్ గడ్డపై రికార్డు బాగా లేకపోయినా అనుభవజు్ఞడనే కారణంతో తుది జట్టులో చోటు దక్కించుకున్న సీనియర్ అశ్విన్ తన సత్తా ప్రదర్శించాడు. మిడిలార్డర్ను కూల్చిన అతని స్పెల్ మ్యాచ్ను మలుపు తిప్పింది. అతని తొలి ఓవర్లోనే నేరుగా వచ్చిన బంతిని డిఫెన్స్ ఆడబోయిన స్మిత్ స్లిప్లో రహానేకు క్యాచ్ ఇచ్చాడు. అశ్విన్ సంబరాలు ఈ వికెట్ విలువేమిటో చూపించాయి. ఆ తర్వాత ట్రావిస్ హెడ్ (7) అశ్విన్కే రిటర్న్ క్యాచ్ ఇవ్వగా... అశ్విన్ బౌలింగ్లోనే కోహ్లికి క్యాచ్ ఇచ్చి అరంగేట్రం ఆటగాడు గ్రీన్ (11) నిష్క్రమించాడు. ఆ తర్వాత ఉమేశ్ వంతు వచి్చంది. అతని బౌలింగ్లో తక్కువ ఎత్తులో వచ్చిన బంతిని ఆడలేక లబ్షేన్ ఎల్బీడబ్ల్యూ కాగా, అదే ఓవర్లో కమిన్స్ (0) కూడా అవుటయ్యాడు. ఆదుకున్న కెప్టెన్... ఆ్రస్టేలియా స్కోరు 111/7 చూస్తే భారత్కు వందకు పైగా ఆధిక్యం ఖాయమనిపించింది. అయితే కెపె్టన్ పైన్ బాధ్యతాయుత బ్యాటింగ్తో తన జట్టును కొంత వరకు కాపాడగలిగాడు. పరిస్థితిని గమనించి ఎదురుదాడికి దిగిన అతను చక్కటి బౌండరీలతో బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించాడు. 68 బంతుల్లోనే అతని అర్ధ సెంచరీ పూర్తయింది. సహచరులు స్టార్క్ (15), లయన్ (10), హాజల్వుడ్ (8) భారీగా పరుగులు చేయకపోయినా కెపె్టన్గా అండగా నిలిచారు. ఫలితంగా కెప్టెన్ భాగస్వామ్యంలో ఆ్రస్టేలియా చివరి మూడు వికెట్లకు 80 పరుగులు జోడించడం విశేషం. చివరకు ఉమేశ్ బౌలింగ్లో పుజారా గాల్లోకి ఎగిరి పట్టిన చక్కటి క్యాచ్కు హాజల్వుడ్ అవుట్ కావడంతో ఆసీస్ ఇన్నింగ్స్ ముగిసింది. క్యాచ్లు నేలపాలు... మైదానంలో భారత జట్టు పేలవ ఫీల్డింగ్ ప్రదర్శన తొలి టెస్టులోనూ కొనసాగించింది. రెండో రోజు మూడు సునాయాస క్యాచ్లు మన ఆటగాళ్లు జారవిడిచారు. వీటిని అందుకొని ఉంటే ఆసీస్ పరిస్థితి మరింత ఘోరంగా ఉండేది. షమీ బౌలింగ్లో లబ్షేన్ (అతని స్కోరు 16) ఇచ్చిన క్యాచ్ను బౌండరీ వద్ద తప్పుడు అంచనాతో పరుగెత్తుతూ పట్టబోయి బుమ్రా వదిలేశాడు. ఆ తర్వాత రెండు సార్లు బుమ్రా బౌలింగ్లోనే లబ్షేన్ (స్కోరు 21) క్యాచ్ను స్క్వేర్లెగ్లో పృథ్వీ షా... పైన్ (స్కోరు 26) ఇచ్చిన క్యాచ్ను స్క్వేర్లెగ్లో మయాంక్ పట్టలేకపోయారు. వీటికి తోడు చివర్లో స్టార్క్ (స్కోరు 12) కష్టసాధ్యమైన క్యాచ్ను వెనక్కి వెళుతూ పట్టే ప్రయత్నంలో సాహా విఫలమయ్యాడు. అయితే దీని ప్రభావం పెద్దగా పడలేదు. తొలి సెషన్; ఓవర్లు: 4.1, పరుగులు: 11, వికెట్లు: 4 (భారత్) ఓవర్లు: 19, పరుగులు: 35, వికెట్లు: 2 (ఆసీస్) రెండో సెషన్ ఓవర్లు: 29, పరుగులు: 57, వికెట్లు: 3 (ఆసీస్) మూడో సెషన్ ఓవర్లు: 24.1, పరుగులు: 99, వికెట్లు: 5 (ఆసీస్) ఓవర్లు: 6, పరుగులు: 9, వికెట్లు: 1 (భారత్) స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 244; ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్: వేడ్ (ఎల్బీ) (బి) బుమ్రా 8, బర్న్స్ (ఎల్బీ) (బి) బుమ్రా 8, లబ్షేన్ (ఎల్బీ) (బి) ఉమేశ్ 47, స్మిత్ (సి) రహానే (బి) అశ్విన్ 1, హెడ్ (సి అండ్ బి) అశ్విన్ 7, గ్రీన్ (సి) కోహ్లి (బి) అశ్విన్ 11, పైన్ (నాటౌట్) 73, కమిన్స్ (సి) రహానే (బి) ఉమేశ్ 0, స్టార్క్ (రనౌట్) 15, లయన్ (సి) కోహ్లి (బి) అశ్విన్ 10, హాజల్వుడ్ (సి) పుజారా (బి) ఉమేశ్ 8, ఎక్స్ట్రాలు 3, మొత్తం (72.1 ఓవర్లలో ఆలౌట్) 191. వికెట్ల పతనం: 1–16, 2–29, 3–45, 4–65, 5–79, 6–111, 7–111, 8–139, 9–167, 10–191. బౌలింగ్: ఉమేశ్ యాదవ్ 16.1–5–40–3, జస్ప్రీత్ బుమ్రా 21–7–52–2, మొహమ్మద్ షమీ 17–4–41–0, అశ్విన్ 18–3–55–4. భారత్ రెండో ఇన్నింగ్స్: పృథ్వీ షా (బి) కమిన్స్ 4, మయాంక్ (బ్యాటింగ్) 5, బుమ్రా (బ్యాటింగ్) 0, మొత్తం (6 ఓవర్లలో వికెట్ నష్టానికి) 9. వికెట్ల పతనం: 1–7. బౌలింగ్: స్టార్క్ 3–1–3–0, కమిన్స్ 3–2–6–1. -
చివరిదైనా గెలిచేనా!
ఐదేళ్ల క్రితం వరుసగా ఐదు వన్డేల్లో ఓడిన తర్వాత భారత్ అలాంటి చెత్త ప్రదర్శనను గత మ్యాచ్తో పునరావృతం చేసింది. ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్ చేతిలో మూడు పరాజయాల తర్వాత తాజాగా తొలి రెండు మ్యాచ్లు ఓడింది. ఇప్పుడు ఆసీస్ గడ్డపై పరువు కాపాడుకునేందుకు తమ చివరి మ్యాచ్లో ఎలాగైనా నెగ్గాలని కోహ్లి సేన భావిస్తోంది. ఇక్కడా ఓడితే వరుసగా రెండు సిరీస్లు 0–3తో క్లీన్ స్వీప్ అయినట్లే! సిడ్నీలో రెండుసార్లు భారీ స్కోర్ల పోరాటాల్లో గెలుపు గీత దాటలేకపోయిన టీమిండియా అదృష్టం... వేదిక మారడంతో మారుతుందేమో చూడాలి. మరోవైపు వార్నర్, కమిన్స్లాంటి ఆటగాళ్లు అందుబాటులో లేకపోయినా ఆ్రస్టేలియా విజయంపై ధీమాగా కనిపిస్తోంది. కాన్బెర్రా: ఆ్రస్టేలియా పర్యటనలో రెండు వరుస పరాజయాలతో దెబ్బ తిన్న భారత జట్టు సిరీస్లో ఒక్క మ్యాచ్ అయినా గెలిచి ఆత్మవిశ్వాసం ప్రోది చేసుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే 0–2తో వన్డే సిరీస్ కోల్పోయిన అనంతరం నేడు జరిగే చివరి మ్యాచ్లో ఆసీస్తో పోరుకు సన్నద్ధమైంది. అయితే అన్ని రంగాల్లో అమిత పటిష్టంగా కనిపిస్తున్న ఆసీస్ను ఓడించాలంటే కోహ్లి సేన సర్వ శక్తులూ ఒడ్డాల్సిందే. చహల్ స్థానంలో కుల్దీప్! సిరీస్ కోల్పోయినా... భారత తుది జట్టులో ఎక్కువ మార్పులకు అవకాశం కనిపించడం లేదు. తొలి రెండు మ్యాచ్ల ప్రదర్శన చూస్తే జట్టు బ్యాటింగ్ మరీ పేలవంగా ఏమీ లేదు. ధావన్, మయాంక్ మెరుగైన ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచాల్సి ఉంది. రెండో వన్డేలో కోహ్లి తనదైన శైలిలో చెలరేగడం ఊరట. నాలుగో స్థానంలో తన చోటును ఖాయం చేసుకునేందుకు శ్రమిస్తున్న అయ్యర్ నుంచి ఒక చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ రావాల్సి ఉండగా... రాహుల్ కూడా రాణిస్తున్నాడు. ఆల్రౌండర్లు హార్దిక్, జడేజా చివర్లో చెలరేగితే భారత్ భారీ స్కోరు చేసేందుకు అవకాశం ఉంటుంది. పాండ్యా మళ్లీ బౌలింగ్ చేస్తుండటం జట్టుకు మేలు చేస్తుంది. ముందుగా షమీ, బుమ్రాలకు చివరి వన్డే నుంచి విశ్రాంతినిచ్చే అవకాశం కనిపించింది కానీ ఇప్పుడు ఆ అవకాశం ఉండకపోవచ్చు. బుమ్రా రెండుసార్లు భారీగా పరుగులిచ్చుకోవడం టీమిండియాలో ఆందోళన పెంచే అంశం. ఇదే తరహాలో ధారాళంగా పరుగులిచ్చిన చహల్ స్థానంలో చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ఆడటం దాదాపు ఖాయమైంది. మూడో పేసర్గా సైనీ ప్రభావం చూపించకపోవడంతో అతని స్థానాన్ని శార్దూల్ ఠాకూర్తో భర్తీ చేసే అవకాశం ఉంది. సీన్ అబాట్కు చాన్స్! ఆ్రస్టేలియా కోణంలో ఈ మ్యాచ్కు ప్రాధా న్యత లేదు. అయితే తప్పనిసరి పరిస్థితు ల్లోనే ఆ జట్టు రెండు మార్పులకు సిద్ధమవుతోంది. గాయపడిన వార్నర్, విశ్రాంతినిచ్చిన కమిన్స్ స్థానాల్లో ఇద్దరు ఆటగాళ్లు రానున్నారు. వార్నర్కు బదులుగా డార్సీ షార్ట్, మాథ్యూ వేడ్లలో ఒకరికి అవకాశం లభిస్తుంది. వికెట్ కీపరే అయినా స్పెషలిస్ట్ బ్యాట్స్మన్గా ఇటీవల వేడ్ దేశవాళీలో ఓపెనర్ పాత్రలో మంచి ప్రదర్శన కనబర్చాడు. ఇక దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన ఫామ్లో ఉన్న పేసర్ సీన్ అబాట్కు కమిన్స్ స్థానంలో చోటు ఖాయమైంది. మెరుపు బ్యాటింగ్ చేయగలగడం కూడా అబాట్ అదనపు అర్హత. అతను ఆసీస్ తరఫున గతంలో ఒకే ఒక్క వన్డే ఆడాడు. ఫించ్, స్మిత్, మ్యాక్స్వెల్ల భీకర బ్యాటింగ్ లైనప్తో ఆసీస్ మరో విజయంపై గురి పెట్టింది. వీరికి తోడు లబ్õÙన్ రూపంలో నిలకడైన బ్యాట్స్మన్ కూడా జట్టులో ఉన్నాడు. ప్రధాన పేసర్ స్టార్క్ విఫలమవుతున్నా... మ్యాక్స్వెల్, హెన్రిక్స్ ఆ లోటు కనిపించకుండా చూస్తున్నారు. తుది జట్లు (అంచనా): భారత్: కోహ్లి (కెప్టెన్), ధావన్, మయాంక్, అయ్యర్, రాహుల్, హార్దిక్, జడేజా, షమీ, బుమ్రా, శార్దూల్, కుల్దీప్. ఆ్రస్టేలియా: ఫించ్ (కెప్టెన్), వేడ్, స్మిత్, లబ్షేన్, మ్యాక్స్వెల్, హెన్రిక్స్, క్యారీ, సీన్ అబాట్, స్టార్క్, జంపా, హాజల్వుడ్. పిచ్, వాతావరణం పరుగుల వరద తప్పకపోవచ్చు. మనుకా ఓవల్ మైదానం మొదటి నుంచీ బ్యాటింగ్కు అనుకూలం. భారీ స్కోర్లు ఖాయం. ఇక్కడ జరిగిన గత ఏడు మ్యాచ్లలో మొదట బ్యాటింగ్ చేసిన జట్టే గెలిచింది. ముఖ్యంగా గత నాలుగు వన్డేల్లో అత్యల్ప స్కోరు 348 పరుగులు కావడం పరిస్థితిని చూపిస్తోంది. వాతావరణం బాగుంది. వర్ష సూచన లేదు. కోహ్లి మరో 23 పరుగులు చేస్తే వన్డేల్లో 12 వేల పరుగులు పూర్తి చేసుకుంటాడు. సచిన్ 300 ఇన్నింగ్స్లలో ఈ మైలురాయిని దాటగా... కోహ్లి తన 242వ ఇన్నింగ్స్లోనే దీనిని అందుకునే అవకాశం ఉంది. -
2021లో బిజీ బిజీగా...
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది భారత క్రికెట్ జట్టు ఆడాల్సిన పలు సిరీస్లు రద్దయ్యాయి. ఐపీఎల్ విజయవంతంగా జరిగినా... టీమిండియాకు మాత్రం ఎక్కువ మ్యాచ్లు ఆడే అవకాశం రాలేదు. కోవిడ్–19 ప్రభావం మొదలైన తర్వాత కోహ్లి సేన ఇప్పటి వరకు ఇంకా బరిలోకి దిగలేదు. ఈ నెలలో ఆస్ట్రేలియాతో సిరీస్తో మన ఆటగాళ్లు మళ్లీ మైదానంలో కనిపించనున్నారు. ఈ లోటును తీరుస్తూ వచ్చే ఏడాది ‘మెన్ ఇన్ బ్లూ’ పెద్ద సంఖ్యలో సిరీస్లకు సన్నద్ధమవుతోంది. 2021లో భారత జట్టు ఐపీఎల్ సహా కనీసం 9 సిరీస్లు/టోర్నీలలో ఆడే అవకాశం ఉంది. ఇందులో భాగంగా 14 టెస్టులు, 13 వన్డేలు, 15 టి20 మ్యాచ్లలో భారత్ పాల్గొనవచ్చని సమాచారం. ఇంగ్లండ్ పర్యటనలో భారత్ ఆడే వన్డేల సంఖ్య, ఆసియా కప్ టి20 టోర్నీలో, ప్రపంచకప్ టి20 టోర్నీలో భారత్ ఆడే మ్యాచ్ల సంఖ్య ఇంకా ఖరారు కాలేదు. సరిగ్గా చెప్పాలంటే ఏడాదిలో ఏ ఒక్క నెలలోనూ విరామం లేకుండా మన క్రికెట్ కొనసాగనుంది. ‘పెద్ద సంఖ్యలో మ్యాచ్లు ఆడటం క్రికెటర్లకు అంత సులువు కాదనే విషయం మాకూ తెలుసు. అయితే ఎఫ్టీపీ ఒప్పందాలను మేం గౌరవించాల్సిందే. ఇప్పుడు మన జట్టులో ప్రతిభకు కొదవ లేదు. ఒకరు కాదంటే మరొకరు అన్నట్లుగా పెద్ద సంఖ్యలో యువ ఆటగాళ్లు సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. రొటేషన్ విధానంలో వారికి అవకాశాలు లభించవచ్చు’ అని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. భారత్ ఆడబోయే సిరీస్ల వివరాలను చూస్తే... -
36 ఏళ్లు... 11 సిరీస్లు...
భారత క్రికెట్ జట్టు టెస్టు చరిత్రలో విదేశాల్లో విజయం సాధించడమనేది మొదటి నుంచీ పెద్ద సవాల్గానే నిలిచింది. ప్రపంచ క్రికెట్లో దిగ్గజాలుగా గుర్తింపు పొందిన పలువురు ఆటగాళ్లు ఉన్న సమయంలో కూడా విదేశాల్లో సిరీస్ విజయాలు మనకు అంత సులభంగా దక్కలేదు. ఈ రకంగా విదేశాల్లో భారత ప్రదర్శనను బట్టి చూస్తే తొలి సిరీస్ విజయం ఎప్పుడైనా అపురూపమే. క్రికెట్ అభిమానులు ఎప్పటికీ గుర్తుంచుకోదగ్గ మధురక్షణమే. 1968లో న్యూజిలాండ్ గడ్డపై భారత్ విదేశాల్లో తమ తొలి టెస్టు సిరీస్ విజయాన్ని నమోదు చేసింది. 1932లో భారత జట్టు ఇంగ్లండ్లో తమ తొలి టెస్టు మ్యాచ్ ఆడింది. దాంతో కలిపి వరుసగా జరిపిన 11 విదేశీ పర్యటనల్లోనూ 10 సార్లు జట్టుకు సిరీస్ ఓటమి తప్పలేదు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్ల చేతుల్లో ఈ పరాజయాలు ఎదురుకాగా, స్వాతంత్య్రం తర్వాత పాకిస్తాన్తో ఆడిన ఒక్క సిరీస్ మాత్రం ‘డ్రా’గా ముగిసింది. గెలుపు మాత్రం ఒక్కసారి కూడా దక్కలేదు. ఇలాంటి నేపథ్యంతో న్యూజిలాండ్ గడ్డపై అడుగుపెట్టిన భారత్కు అద్భుత విజయం దక్కింది. మన్సూర్ అలీఖాన్ పటౌడీ సారథ్యంలోని భారత్ 4 టెస్టుల సిరీస్ను 3–1తో కైవసం చేసుకోవడం విశేషం. మన హైదరాబాద్కు చెందిన ఇద్దరు ఆటగాళ్లు సయ్యద్ ఆబిద్ అలీ, ఎంఎల్ జైసింహ ఈ సిరీస్ విజయంలో భాగంగా ఉన్నారు. ఈ నాలుగు టెస్టుల ఫలితాలను చూస్తే... తొలి టెస్టు (డ్యునెడిన్) భారత్ ఐదు వికెట్లతో విజయం డౌలింగ్ (143) సెంచరీతో తొలి ఇన్నింగ్స్లో కివీస్ 350 పరుగులు చేసింది. ఆబిద్ అలీకి 4 వికెట్లు దక్కాయి. అజిత్ వాడేకర్ (80), ఫరూఖ్ ఇంజినీర్ (63) బ్యాటింగ్తో భారత్ 359 పరుగులు చేసింది. ఎరాపల్లి ప్రసన్న 6 వికెట్లతో చెలరేగడంతో న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్లో 208 పరుగులకే ఆలౌటైంది. 200 పరుగుల లక్ష్యాన్ని భారత్ 5 వికెట్లు కోల్పోయి అందుకుంది. విదేశీ గడ్డపై తొలి టెస్టు విజయం రుచి చూసింది. రెండో టెస్టు (క్రైస్ట్చర్చ్): న్యూజిలాండ్ ఆరు వికెట్లతో విజయం డౌలింగ్ (239) డబుల్ సెంచరీతో చెలరేగడంతో కివీస్ ముందుగా 502 పరుగులు చేసింది. బిషన్ సింగ్ బేడీకి 6 వికెట్లు దక్కాయి. భారత్ 288 పరుగులకే పరిమితమైంది. అనంతరం ఫాలోఆన్ ఆడిన మన జట్టు రెండో ఇన్నింగ్స్లో 301 పరుగులు చేయగలిగింది. 88 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్లు నష్టపోయి కివీస్ ఛేదించింది. మూడో టెస్టు (వెల్లింగ్టన్): భారత్ ఎనిమిది వికెట్లతో విజయం ఎరాపల్లి ప్రసన్న 5 వికెట్లతో సత్తా చాటడంతో కివీస్ తొలి ఇన్నింగ్స్లో 186 పరుగులకే కుప్పకూలింది. భారత్ 327 పరుగులు చేసి భారీ ఆధిక్యం అందుకుంది. అజిత్ వాడేకర్ (143) శతకం సాధించడం విశేషం. రెండో ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ మళ్లీ బ్యాటింగ్లో విఫలమై 199 పరుగులకే ఆలౌటైంది. బాపు నాదకర్ణి 6 వికెట్లు పడగొట్టడం విశేషం. 59 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 2 వికెట్లు కోల్పోయి సిరీస్లో ముందంజ వేసింది. నాలుగో టెస్టు (ఆక్లాండ్): భారత్ 272 పరుగులతో విజయం విదేశాల్లో భారత్ సిరీస్ విజయపు కలను నెరవేర్చిన మ్యాచ్ ఇది. భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 252 పరుగులు మాత్రమే చేసినా... న్యూజిలాండ్ను 140 పరుగులకే పడగొట్టింది. మరోసారి ప్రసన్న 4 వికెట్లతో కీలక పాత్ర పోషించాడు. భారత్ తమ రెండో ఇన్నింగ్స్ను 5 వికెట్లకు 261 వద్ద డిక్లేర్ చేసింది. రూసీ సుర్తీ 99 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. 374 పరుగుల అసాధారణ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ సొంతగడ్డపై చేతులెత్తేసింది. 101 పరుగులకే ఆలౌటై భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. ప్రసన్న 4, బేడీ 3 వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బతీశారు. భారత్ చరిత్రాత్మక సిరీస్ విజయంలో అజిత్ వాడేకర్ 328 పరుగులతో మన తరఫున టాప్ స్కోరర్గా నిలవగా...సుర్తీ, ఫరూఖ్ ఇంజినీర్ చెరో 321 పరుగులు సాధించారు. ఏకైక సెంచరీని వాడేకర్ నమోదు చేశాడు. బౌలింగ్లో 24 వికెట్లతో ఎరాపల్లి ప్రసన్న ఎవరికీ అందనంత ఎత్తులో నిలవగా... బిషన్ సింగ్ బేడీ 16, బాపు నాదకర్ణి 14 వికెట్లతో అండగా నిలిచారు. –సాక్షి క్రీడా విభాగం -
టీమిండియాకు పాకిస్తాన్ అల్టిమేటం
లాహోర్: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ వసీం ఖాన్ శనివారం రోజున సంచలన ప్రకటన చేశారు. పాకిస్తాన్లో సెప్టెంబర్లో జరిగే ఆసియా కప్ టీ20లో భారత్ పాల్గొనకపోతే.. 2021లో భారత్లో జరిగే టీ20 వరల్డ్ కప్లో తాము కూడా ఆడేందుకు సిద్ధంగా లేమని ప్రకటించారు. బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు పాకిస్తాన్లో పర్యటిస్తే ఆసియా కప్ ఆతిథ్య హక్కులను బదిలీ చేస్తామని వస్తున్న వార్తలను వసీమ్ ఖండించారు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని మార్చే హక్కు ఎవరికీ లేదన్నారు. ప్రస్తుతం తాము ఆసియా కప్ నిర్వహించడానికి రెండు వేదికలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. అయితే పాకిస్తాన్లో ఆడాలా, లేదా అనే విషయంపై బీసీసీఐ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పాకిస్తాన్లో తీవ్రవాదులను కట్టడిచేశాకనే ఆ దేశంతో క్రికెట్ ఆడతామని భారత్ చెప్పిన విషయం తెలిసిందే. 2020 సెప్టెంబరులో ఆసియా కప్ను పాకిస్తాన్ వేదికగా నిర్వహిస్తే టీ20 వరల్డ్ కప్ 2021 భారత్లో జరగనుంది. -
పరిస్థితుల్ని బట్టి కూర్పు
సాక్షి, విశాఖపట్నం: సొంతగడ్డపై భారత్కు మంచి రికార్డు ఉన్నప్పటికీ... దక్షిణాఫ్రికాను ఏమాత్రం తేలిగ్గా తీసుకోబోమని భారత టెస్టు జట్టు వైస్ కెప్టెన్ అజింక్య రహానే అన్నాడు. పరిస్థితుల్ని బట్టి తుది జట్టు కూర్పు ఉంటుందని చెప్పాడు. బ్యాటింగ్లో నిలకడ ప్రదర్శిస్తున్న ఆంధ్ర క్రికెటర్ హనుమ విహారి... స్పిన్నర్గానూ అక్కరకు వస్తున్నాడని తెలిపాడు. కొంతకాలంగా ఫామ్లేమితో ఒత్తిడిలో కూరుకుపోయిన రహానే ఇటీవల వెస్టిండీస్ పర్యటనలో సెంచరీతో టచ్లోకి వచ్చాడు. తొలి టెస్టులో అతను రెండు ఇన్నింగ్స్ల్లోనూ 81, 102 పరుగులు చేసి సత్తా చాటుకున్నాడు. దీనిపై అతను మాట్లాడుతూ ‘ప్రతీ మ్యాచ్ పాఠమే. ప్రతీ సిరీస్ నుంచి మనం ఎంతో కొంత నేర్చుకోవాలి. అలాగే సెంచరీ కోసం రెండు ఏళ్లుగా ఎదురుచూశాను. 17 టెస్టుల తర్వాత వెస్టిండీస్లో సాధించా. చూస్తుంటే ఈ 17 అంకెతో నాకు ఏదో బంధముందనిపిస్తోంది. నా కెరీర్లో తొలి శతకం కోసం 17 టెస్టులు ఆడాను. ఇప్పుడు ఫామ్లో లేక తంటాలు పడుతున్న నేను మళ్లీ 17 టెస్టుల తర్వాతే మరో సెంచరీ చేశా’నన్నాడు. సెంచరీ కోసం పరితపించినపుడు అది సాకారం కాలేదని... కానీ విండీస్లో ఆ ఆలోచన లేకపోయినా సాధ్యమైందని చెప్పుకొచ్చాడు. త్వరలో తండ్రి కాబోతున్న రహానే ‘ఏది జరగాలని ఉంటే అది జరుగుతుంది. సెంచరీ చేయాలని రాసి ఉంటే సాధించడం జరుగుతుంది’ అని అన్నాడు. పరుగుల కోసం, భారీ ఇన్నింగ్స్లు సాధించడం కోసం పూర్తిగా టెక్నిక్పైనే ఆధారపడటం లేదని చెప్పాడు. ‘మాటలు చెప్పినంత సులువు కాదు టెక్నిక్ మార్చడం. నా వరకైతే నేను నా సామర్థ్యాన్నే నమ్ముతాను. టెక్నిక్ను కాదు. ముఖ్యంగా క్లిష్టమైన పరిస్థితుల్లో మానసిక సమతౌల్యాన్ని పాటిస్తా’నని తెలిపాడు. దిగ్గజాలు డివిలియర్స్, డేల్ స్టెయిన్ లేకపోయినా... దక్షిణాఫ్రికా మేటి జట్టేనని, పైగా ఐసీసీ టెస్టు చాంపియన్షిప్లో భాగమైన ప్రతీ సిరీస్ కీలకమేనని చెప్పాడు. ముందుగా దక్షిణాఫ్రికాతో మూడు, బంగ్లాతో రెండు టెస్టులు మొత్తం స్వదేశంలో ఆడే ఈ ఐదు మ్యాచ్ల్ని సద్వినియోగం చేసుకుంటామని చెప్పాడు. సఫారీ ప్రస్తుత జట్టులో మార్క్రమ్, బవుమా, డుప్లెసిస్ సత్తాగల ఆటగాళ్లని కితాబిచ్చాడు. -
‘దీపావళికి క్రికెట్ మ్యాచ్లు వద్దు’
ముంబై: దీపావళినాడు భారత క్రికెట్ జట్టు గతంలో అనేక చిరస్మరణీయ విజయాలు సాధించిన విషయం అభిమానులకు గుర్తుండే ఉంటుంది. అయితే ఇకపై అలాంటి గెలుపు పటాస్లు వినిపించవు. దీపావళి పండగ సమయంలో క్రికెట్ మ్యాచ్లు నిర్వహించవద్దంటూ ప్రసారకర్త స్టార్ స్పోర్ట్స్ చేసిన విజ్ఞప్తి మేరకు బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ‘మా పరిశోధన ప్రకారం దీపావళి సమయంలో ప్రేక్షకులు క్రికెట్ చూడటానికి ఇష్టపడటం లేదని, దానికంటే ఇంట్లో గడపడమే మంచిదని భావిస్తున్నారు. ఆ సమయంలో టీవీ రేటింగ్లు కూడా రావడం లేదు. పైగా ఆటగాళ్లకు కూడా తగిన విరామం ఇచ్చేందుకు అదే సరైన సమయం. దీని ప్రకారమే ఇకపై మ్యాచ్లు షెడ్యూల్ చేసుకుంటే బాగుంటుంది’ అని స్టార్ తమ నివేదికలో పేర్కొంది. -
అత్యున్నతంగా నిలపడమే లక్ష్యం
కూలిడ్జ్ (అంటిగ్వా): భారత పురుషుల జాతీయ జట్టు హెడ్ కోచ్గా నియామకం అనంతరం రవిశాస్త్రి తన భవిష్యత్ ప్రణాళికను వివరించాడు. కొత్త తరం వస్తున్నందున తాను వైదొలిగే లోపు జట్టు పునర్ నిర్మాణ ప్రక్రియ సాఫీగా సాగేలా చూడటం ప్రధానమైనదని పేర్కొన్నాడు. మరో నలుగురైదుగురు బౌలర్లను వెదికి పట్టుకోవడం ఇందులోని సవాల్గా అతడు తెలిపాడు. ‘26 నెలల నా పదవీ కాలం పూర్తయ్యేసరికి టీమిండియాను అత్యున్నత స్థానంలో నిలపపడమే లక్ష్యం. తద్వార రాబోయే తరానికి వారు ఘన వారసత్వం అందిస్తారు. ఈ జట్టు మున్ముందు అద్భుతాలు సృష్టించగలదన్న నమ్మకం నాకుంది. మేం ఇప్పుడు ఆ దిశగానే వెళ్తున్నాం. పురోగమనానికి అంతుండదు. యువ ఆటగాళ్లను చూస్తుంటే ఉత్సాహంగా ఉంది. ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకున్నప్పుడు శ్రద్ధ కూడా అదేవిధంగా ఉండాలి. ఫలితాలు రాకపోయినా నిరుత్సాహం చెందొద్దు. గత రెండు–మూడేళ్లుగా టీమిండియా స్థిరంగా విజయాలు సాధిస్తోంది. ఇకపై వాటిని మరింత పెంచుకుంటూ పోవాలి’ అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా కొన్నేళ్లుగా జట్టు పురోగతిని విశ్లేషించిన అతడు ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్లో ఫీల్డింగ్లో సాధించిన ప్రగతిని నొక్కిచెప్పాడు. ఈ ప్రమాణాలను మరో మెట్టు ఎక్కించడమే తమ బృందం లక్ష్యమని వివరించాడు. -
శాస్త్రికి మరో అవకాశం!
ముంబై: భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ ఎంపిక విషయంలో కెప్టెన్ విరాట్ కోహ్లి మాట చెల్లుబాటవుతుందా లేక కపిల్ దేవ్ నేతృత్వంలోని క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) మరో విధంగా ఆలోచిస్తోందా! ప్రస్తుత కోచ్ రవిశాస్త్రినే కొనసాగుతారనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇతర ఐదుగురు అభ్యర్థులు సీఏసీని మెప్పించేందుకు ఏం చేస్తారనేది ఆసక్తికరం. భారత కోచ్ పదవి కోసం నేడు (శుక్రవారం) ఇంటర్వ్యూలు జరగనున్నాయి. రవిశాస్త్రితో పాటు టామ్ మూడీ, మైక్ హెసన్, లాల్చంద్ రాజ్పుత్, రాబిన్ సింగ్, ఫిల్ సిమన్స్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కపిల్ దేవ్తో పాటు కమిటీలోని ఇతర సభ్యులు అన్షుమన్ గైక్వాడ్, శాంత రంగస్వామి అభ్యర్థులను ఇంటర్వ్యూ చేస్తారు. కెప్టెన్ కోహ్లి మద్దతుతో పాటు చెప్పుకోదగ్గ రికార్డు ఉండటం శాస్త్రికి అనుకూలంగా మారింది. అతని శిక్షణలోనే భారత జట్టు తొలిసారిగా ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్ గెలుచుకుంది. శాస్త్రి కోచ్గా వచ్చిన సమయం (జులై 2017)నుంచి భారత్ 21 టెస్టులు ఆడితే 13 గెలిచింది. వన్డేల్లో 60 మ్యాచ్లలో 43 గెలవగా, టి20ల్లో 36 మ్యాచ్లలో 25 సొంతం చేసుకుంది. రెండు వన్డే వరల్డ్ కప్లలోనూ సెమీఫైనల్ దాటకపోయినా దానిని పెద్ద వైఫల్యంగా ఎవరూ చూ డటం లేదు. పైగా ఆటగాళ్లందరితో ఈ భారత మాజీ క్రికెటర్కు మంచి సంబంధాలు ఉండటం సానుకూలాంశం. మరోవైపు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్వంటి సహాయక సిబ్బందిని ఎంపిక చేసేందుకు సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలో ఇంటర్వ్యూలు జరుగుతాయి. -
భారత క్రికెటర్ల సంఘం కూడా...
న్యూఢిల్లీ: ఎట్టకేలకు భారత క్రికెట్లోనూ ఆటగాళ్ల కోసం ప్రత్యేక సంఘం సిద్ధమైంది. బీసీసీఐ కొత్త నియమావళి ప్రకారం భారత క్రికెటర్ల సంఘం (ఐసీఏ)ను ఏర్పాటు చేశారు. దీనికి బోర్డు అధికారికంగా ఆమోదముద్ర వేసింది. ‘కంపెనీల చట్టం 2013లోని సెక్షన్ 8 ప్రకారం భారత మాజీ క్రికెటర్ల కోసం ఏర్పాటైన ఇండియన్ క్రికెటర్ల అసోసియేషన్ను బీసీసీఐ అధికారికంగా గుర్తిస్తోంది. ఇది మినహా మరే సంఘానికి కూడా బోర్డు గుర్తింపు ఉండదు’ అని బీసీసీఐ ప్రకటించింది. ఈ సంఘానికి బోర్డు ఆరంభంలో కొంత మొత్తం నిధులు అందజేస్తుందని... అయితే ఆ తర్వాత మాత్రం సొంత ఆదాయమార్గాలు చూసుకోవాలని కూడా బోర్డు సూచించింది. ఐసీఏకు ఎన్నికలు నిర్వహించే వరకు కపిల్ దేవ్, అజిత్ అగార్కర్, శాంత రంగస్వామి డైరెక్టర్లుగా వ్యవహరిస్తారు. ఈ సంఘంలో మాజీ క్రికెటర్లకు మాత్రమే సభ్యత్వం ఇస్తారు. ప్రస్తుతం జాతీయ జట్లకు ఆడుతున్న వారు సభ్యత్వానికి అనర్హులు. ఇతర దేశాల్లో మాత్రం ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న వారికి కూడా సభ్యత్వం కల్పిస్తున్నారు. -
వరల్డ్ కప్ ఫేవరెట్ ఆ టీమే..!
సిడ్నీ: క్రికెట్ ప్రపంచ కప్ మహాసంగ్రామం ఆరంభమవడానికి కేవలం 10 రోజుల వ్యవధి మాత్రమే ఉంది. అన్ని దేశాల జట్లు తుది ఎలెవెన్పై కసరత్తులు చేస్తోండగా మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు మాత్రం తమ ఫేవరెట్ జట్లు ఫలానా అని వెల్లడిస్తున్నారు. నిన్నటికి నిన్న ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, వ్యాఖ్యాత నాసీర్ హుస్సేన్ ఇండియానే అత్యంత ప్రమాదకర జట్టని, దానికే కప్ గెలిచే అవకాశాలు ఎక్కువ అని తెలిపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ జాబితాలో మాజీ కెప్టెన్, ఆస్ట్రేలియాకు రెండు సార్లు వరల్డ్ కప్ అందించిన రికీ పాంటింగ్ చేరారు. ఈ సారి వరల్డ్ కప్ హాట్ ఫేవరెట్ ఇంగ్లండ్ అని పంటర్ పేర్కొన్నారు. అలాగే ఈ వరల్డ్ కప్లో సంచలనాలు నమోదవడానికి కూడా అవకాశాలున్నాయని, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ టీంలు ఆ కోవలోకి వస్తాయని ఆయన అన్నారు. ‘బలమైన బ్యాటింగ్ లైనప్తో ఇంగ్లండ్ బలంగా కనిపిస్తోంది. గత కొంత కాలంగా మోర్గాన్ నాయకత్వంలో ఇంగ్లండ్ టీం అంచనాలకు మించి రాణిస్తోంది. సొంత గడ్డపై ఆడుతుండడం ఆ జట్టుకు సానుకూల అంశం. అదే విధంగా 7వ నెంబర్ వరకు దాటిగా బ్యాటింగ్ చేయడం కలిసొచ్చే అంశం. అయితే ఇండియా, ఆస్ట్రేలియా రూపంలో ఇంగ్లండ్ బలమైన ప్రత్యర్థులను ఎదుర్కొనవలసి ఉంది’అని ఈ మాజీ సారధి జోస్యం చెప్పాడు. మే 30వ తేదీ నుంచి వరల్డ్కప్ సమరం ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. -
జవాన్ల కుటుంబాలకు బీసీసీఐ రూ.5 కోట్ల సాయం?
న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడిలో చనిపోయిన సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలను ఆదుకునేందుకు రూ.5 కోట్లు కేటాయించాలని బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షులు సీకే ఖన్నా ఆదివారం ప్రతిపాదించారు. అలాగే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, ఇండియా-ఆసీస్ మధ్య జరగబోయే టీ20 సిరీస్, ఇండియన్ ప్రీమియర్ లీగ్-2019 మ్యాచ్ల ముందు 2 నిమిషాల పాటు మౌనం పాటించాలని ప్రతిపాదించారు. పుల్వామా దాడిలో చనిపోయిన అమర జవాన్ల కుటుంబాలకు తమకు తోచినంత సహాయం చేయాలని అన్ని రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లకు, ఐపీఎల్ ప్రాంఛైజీలకు ఖన్నా విజ్ఞప్తి చేశారు. గురువారం శ్రీనగర్- జమ్మూ జాతీయ రహదారిపై సీఆర్పీఎఫ్ కాన్వాయ్ వెళ్తుండగా ఉగ్రవాది కారుతో ఢీకొట్టి ఆత్మాహుతికి పాల్పడటతో 40 మంది జవాన్లు మృతిచెందారు. పదుల సంఖ్యలో జవాన్లు గాయపడ్డారు. 2500 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు 78 బస్సుల్లో శ్రీనగర్ బయలుదేరుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. -
ఆ బెంగ మాకు లేదు: ఎంఎస్కే ప్రసాద్
న్యూఢిల్లీ: నాణ్యమైన క్రికెటర్ల కోసం బెంగపడాల్సిన అవసరం భారత క్రికెట్ జట్టుకు లేదని సెలక్షన్ కమిటీ చీఫ్ ఎంఎస్కే ప్రసాద్ స్పష్టం చేశాడు. ఇప్పుడు భారత క్రికెట్ జట్టు నైపుణ్యమున్న క్రికెటర్లతో కళకళలాడుతోందంటూ సంతోషం వ్యక్తం చేశాడు. గత రెండేళ్లుగా టీమిండియాలోకి వచ్చే యువ క్రికెటర్ల సంఖ్య పెరిగిందన్న ఎంఎస్కే.. ఈ సంఖ్య పెరగడానికి ప్రధాన కారణం దేశవాళీ క్రికెట్ అత్యుత్తమంగా ఉండటమేనని వెల్లడించాడు. ‘దేశవాళీ క్రికెట్ మ్యాచ్లు చూడటమంటే నాకు చాలా ఇష్టం. సాధ్యమైనంత వరకూ ఎక్కువ దేశవాళీ మ్యాచ్లు చూడటానికి ప్రాధాన్యతనిస్తా. భారత్ క్రికెట్ భవిష్యత్ అంతా అక్కడే ఉంది. ప్రతి ఏడాది దేశవాళీ క్రికెట్ నుంచి ప్రతిభ ఉన్న ఆటగాళ్లు జాతీయ జట్టులోకి వస్తున్నారు. అందుకే దేశవాళీ మ్యాచ్లకు అధిక ప్రాముఖ్యతనిస్తాను’ అని ఎంఎస్కే పేర్కొన్నాడు. ప్రస్తుతం భారత క్రికెట్ జట్టులో స్థానం కోసం పోటీ పెరగడం చాలా ఆనందంగా ఉందని, రిజర్వ్ బెంచ్ బలం చూస్తుంటే, మరో దశాబ్దం పాటు భారత జట్టుకి ఆటగాళ్ల విషయంలో ఎటువంటి బెంగ ఉండదన్నాడు. నాణ్యమైన ఆటగాళ్లను ఎదిగి పట్టుకోవడంలో భారత-ఎ జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ కృషి ఎంతో ఉందన్నాడు. ఇటీవల కాలంలో వెలుగులోకి వచ్చిన పలువురు యువ క్రికెటర్లు రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో రాటుదేలిన వారేనని తెలిపాడు. -
ప్రాక్టీస్ స్టార్ట్
ముంబైలోని జేవీపిడీ గ్రౌండ్స్కి వెళ్లారు రణ్వీర్ సింగ్ అండ్ కబీర్ఖాన్. సరదాగా ఏదైనా గేమ్ ఆడటానికి కాదు. రణ్వీర్ హీరోగా కబీర్ దర్శకత్వంలో రూపొందనున్న ‘1983’ సినిమా కోసమే. 1983లో ఇండియన్ క్రికెట్ టీమ్ ప్రపంచకప్ సాధించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ టీమ్ కెప్టెన్ కపిల్దేవ్ జీవితం ఆధారంగా బాలీవుడ్లో రూపొందనున్న ఈ సినిమాలో కపిల్దేవ్ పాత్రను రణ్వీర్ పోషించనున్న సంగతి తెలిసిందే. ఇందు కోసమే గ్రౌండ్కి వెళ్లి క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నారట రణ్వీర్ సింగ్. దీన్నిబట్టి ఈ సినిమా త్వరలోనే సెట్స్పైకి వెళ్తుందని ఊహించవచ్చు. మరోవైపు జోయా అక్తర్ దర్శకత్వంలో రణ్వీర్ నటించిన ‘గల్లీబాయ్’ ట్రైలర్ రీసెంట్గా విడుదలైంది. ఈ చిత్రం వచ్చే నెల 14న విడుదల కానుంది. ఇంకా ‘తక్త్’ సినిమాలో నటిస్తారు రణ్వీర్. ఇక గతేడాది బాలీవుడ్ అందాలభామ దీపికా పదుకోన్తో కలిసి రణ్వీర్ ఏడడుగులు వేసిన సంగతి తెలిసిందే. -
సిడ్నీ టెస్ట్; భారత జట్టు ఇదే
సిడ్నీ: ఆస్ట్రేలియాతో రేపటి నుంచి సిడ్నీలో జరగనున్న నాలుగో టెస్టుకు 13 మంది సభ్యులతో భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఆశ్చర్యకరంగా ఇషాంత్ శర్మను జట్టు నుంచి తప్పించింది. అతడికి ఫిట్నెస్ లేదని ప్రకటించింది. గాయపడ్డడా, అనారోగ్యంతో బాధ పడుతున్నాడా అనేది వెల్లడించలేదు. (ఈసారి వదలొద్దు..) అడిలైడ్లో జరిగిన మొదటి టెస్టులో పార్శపు నొప్పి(సైడ్ స్ట్రెయిన్)తో జట్టుకు దూరమైన అశ్విన్కు అవకాశం దక్కింది. రెండు, మూడు టెస్టులు ఆడలేకపోయిన అతడికి చివరి టెస్ట్లో ఛాన్స్ ఇచ్చారు. అశ్విన్ తుది జట్టులో ఉంటాడా, లేదా అనేది మ్యాచ్ ప్రారంభానికి ముందు నిర్ణయిస్తామని బీసీసీఐ తెలిపింది. వ్యక్తిగత కారణాలతో రోహిత్ శర్మ నాలుగో టెస్టుకు దూరమయ్యాడు. తనకు కూతురు పుట్టడంతో అతడు స్వదేశానికి వచ్చాడు. చివరిదైన సిడ్నీ టెస్టులో పైచేయి సాధించి చరిత్ర సృష్టించాలని టీమిండియా భావిస్తోంది. ఒకవేళ ఈ మ్యాచ్ ఫలితం తేలకున్నా సిరీస్ భారత్ సొంతమవుతుంది. బీసీసీఐ ప్రకటించిన జట్టు విరాట్ కోహ్లి(కెప్టెన్), అజింక్య రహానే(వైస్ కెప్టెన్), ఛతేశ్వర్ పుజారా, కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, హనుమ విహారి, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, రవీంద్రన్ అశ్విన్, మహ్మద్ షమి, జస్ప్రిత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్ -
నాడు భారత జట్టులో... నేడు అమెరికా కెప్టెన్గా...
న్యూఢిల్లీ: ఎనిమిదేళ్ల క్రితం భారత్ తరఫున అండర్–19 ప్రపంచ కప్ ఆడిన కుర్రాడు ఇప్పుడు అమెరికా సీనియర్ క్రికెట్ జట్టుకు కెప్టెన్గా ఎంపికయ్యాడు. ముంబైకి చెందిన 27 ఏళ్ల సౌరభ్ నేత్రవల్కర్కు ఈ అరుదైన అవకాశం లభించింది. 2023 వన్డే వరల్డ్ కప్నకు అర్హత టోర్నీ అయిన ఐసీసీ వరల్డ్ కప్ లీగ్ డివిజన్ 3 పోటీల్లో అతను యూఎస్ఏకు నాయకుడిగా వ్యవహరిస్తాడు. నేత్రవల్కర్ ఇప్పటికే అమెరికాకు మూడు లిస్ట్ ‘ఎ’ మ్యాచ్లలో కెప్టెన్సీ చేశాడు. ఇటీవలి వరకు కెప్టెన్గా ఉన్న హైదరాబాద్కు చెందిన రంజీ క్రికెటర్ ఇబ్రహీం ఖలీల్ను తప్పించి అతని స్థానంలో మరో భారత ఆటగాడినే కెప్టెన్గా నియమించింది. 2010 అండర్–19 ప్రపంచ కప్లో సభ్యుడిగా ఉన్న ఈ లెఫ్టార్మ్ పేస్ బౌలర్ ముంబై తరఫున 2013లో ఏకైక ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడాడు. అనంతరం కార్నెల్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చదివేందుకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత ‘ఒరాకిల్’ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేస్తూ మరోసారి క్రికెట్ వైపు ఆకర్షితుడయ్యాడు. నిబంధనల ప్రకారం అమెరికా తరఫున ఆడేందుకు అర్హత సాధించిన అనంతరం సత్తా చాటి జట్టులోకి ఎంపికైన సౌరభ్ ఇప్పుడు కెప్టెన్గా మారడం విశేషం. -
నేను కూడా సిద్ధం: శుబ్మాన్ గిల్
న్యూఢిల్లీ: భారత జాతీయ క్రికెట్ జట్టులో ఆడేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు యువ క్రికెటర్ శుబ్మాన్ గిల్. విండీస్ సిరీస్కు ఎంపిక కానప్పటికీ తర్వాతి సిరీస్కు సెలక్టర్లు తనకు అవకాశం ఇస్తారన్న నమ్మకం ఉందన్నాడు. దేవధర్ ట్రోఫీలో భాగంగా భారత సి జట్టు తరపున ఆడుతున్న శుబ్మాన్ గిల్ సెంచరీతో మెరిశాడు. అనంతరం గిల్ మాట్లాడుతూ.. భారత జట్టులో అరంగేట్రం చేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు ప్రకటించాడు. న్యూజిలాండ్లో జరిగిన ప్రపంచకప్లో శుభమన్గిల్ ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. అద్భుతమైన శతకాలతో ఆకట్టుకున్నాడు. ట్రోఫీ గెలవడంలో పృథ్వీ షాతో కలిసి కీలక పాత్ర పోషించాడు. అయితే తన సహచర ఆటగాడు పృథ్వీ షా ఇప్పటికే జాతీయ జట్టులోకి ప్రవేశించడంతో శుబ్మాన్ గిల్ కూడా స్థానం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాడు. ‘జాతీయ జట్టు తరపున ఆడేందుకు నేను సిద్ధం. వెస్టిండీస్పై నాకు అవకాశం రాలేదు. తర్వాతి సిరీస్లో రావొచ్చు. పరుగులు చేయడం నాకిష్టం. మైదానంలోకి వెళ్లే ముందు వరకే అంచనాలు మదిలో ఉంటాయి. ఆ తర్వాత పరుగులు చేయడం పైనే ధ్యాసంతా. ఔటైతే ఏమవుతుందని ఆలోచించను. అండర్-19 ప్రదర్శనలను సెలక్టర్లు దృష్టిలో పెట్టుకుంటారని తెలుసు. ఆ తర్వాతా వరుస ప్రదర్శనలు చేస్తేనే జాతీయ జట్టుకు అవకాశాలు వస్తాయి. ఈ కాలంలో మ్యాచ్లను ప్రతిరోజూ టీవీల్లో చూసే అవకాశం ఉంది. దాంతో ఒత్తిడి సమయాల్లో ఎలా ఆడాలో తెలుస్తోంది. మా నాన్నే నా కోచ్’ అని శుబ్మాన్ గిల్ గిల్ పేర్కొన్నాడు. -
విదేశీ పర్యటనల్లో సతీమణి, ప్రియసఖిలకు అనుమతి
ముంబై: కెప్టెన్ కోహ్లి కోరికను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మన్నించింది. విదేశీ పర్యటనల్లో క్రికెటర్ల వెంట సతీమణి, ప్రియసఖిలు ఉండేందుకు బోర్డు పరిపాలకుల కమిటీ (సీఓఏ) అనుమతించింది. నిజానికి ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి విధాన నిర్ణయం లేదు. అయితే విదేశాల్లో రెండు వారాల పాటు ఆటగాళ్ల వెంట భాగస్వాముల్ని అనుమతించేవారు. ఇప్పుడు మాత్రం బోర్డు స్థిరమైన విధాన నిర్ణయాన్ని ప్రకటించింది. ఇకపై మొదటి పది రోజుల తర్వాత విదేశీ పర్యటనల్లో క్రికెటర్ల భార్యలను, ప్రియురాళ్లను వారితో పాటు ఉండేందుకు అనుమతిస్తారు. ఈ విషయమై కోహ్లి ఎప్పటి నుంచో గట్టిగా పట్టుబడుతున్నాడు. ఇటీవల బోర్డు పరిపాలక కమిటీ (సీఓఏ)కి తన అభ్యర్థన మరోసారి తెలియజేశాడు. సుదీర్ఘ పర్యటనలప్పుడు ‘తోడు–నీడ’ కావాల్సిందేనని వాదించాడు. హైదరాబాద్లో జరిగిన రెండో టెస్టుకు ముందు కోహ్లి, కోచ్ రవిశాస్త్రి, రోహిత్ శర్మలను సీఓఏ సభ్యులు కలిశారు. తుది నిర్ణయం తీసుకునే దిశగా చర్చించారు. అనంతరం సీఓఏ సభ్యులు... బోర్డు ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపారు. వాళ్లు (భార్య, ప్రియురాలు) వెంట ఉన్నంత మాత్రాన జట్టుకు, ఆటకు వచ్చే నష్టమేమీ లేదని అభిప్రాయపడ్డారు. కీలకమైన ఆస్ట్రేలియా పర్యటనకు ముందే తమ నిర్ణయాన్ని వెల్లడించారు. దీంతో ఆటగాళ్ల విరహవేదన తగ్గనుంది. ఎంచక్కా చెట్టాపట్టాలేసుకొని విదేశీ పర్యటనల్లో ఆటని, ఆనందాన్ని ఆస్వాదించవచ్చు. సరిగ్గా మూడేళ్ల క్రితం 2015లో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్లో ఆసీస్ జట్టు ఘోరంగా ఓడినప్పటికీ అప్పటి క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) చీఫ్ జేమ్స్ సదర్లాండ్ ఇలాంటి నిర్ణయాన్నే తీసుకున్నారు. -
ఆసియాకప్ విజయంపై కేసీఆర్ హర్షం
సాక్షి, హైదరాబాద్: భారత క్రికెట్ జట్టు ఆసియాకప్ సాధించడం పట్ల ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా భారత జట్టు విజేతగా నిలవడం అరుదైన విజయమని అభివర్ణించారు. భారత జట్టు ఇదే స్ఫూర్తితో రానున్న మ్యాచ్ల్లోనూ విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. -
టీమిండియా క్రికెటర్లకు చీఫ్ సెలక్టర్ హెచ్చరిక
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జాతీయ జట్టులో ఆటగాళ్లకు తగినన్ని అవకాశాలు లభిస్తున్నా సరైన ప్రదర్శన చేయలేకపోతున్న వారిని తొలగించడానికి ఇక వెనుకాడబోమని చీఫ్ సెలక్టర్ ఎంఎస్కే ప్రసాద్ హెచ్చరించాడు. భారత క్రికెట్ సత్తాను పరీక్షించేందుకు ఆటగాళ్లకు పదే పదే అవకాశాలు ఇస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశాడు. ఒకవేళ ఆ అవకాశాల్ని ఒడిసి పట్టుకోవడంలో ఎవరైతే విఫలమవుతారో వారిపై వేటు తప్పదనే సంకేతాలు పంపాడు. తగినన్ని అవకాశాలు ఇచ్చినా ఆటగాళ్లు ఉపయోగించుకోకుంటే దేశవాళీలో మెరుగ్గా రాణిస్తున్న కుర్రాళ్లపై తాము దృష్టిపెట్టాల్సివుంటుందని ఎంఎస్కే తేల్చి చెప్పాడు. ఇదిలా ఉంచితే, ఇంగ్లండ్తో ఆఖరి టెస్టులో రిషబ్ పంత్ బ్యాటింగ్కు తనకు సంతోషాన్ని కల్గించిందన్నాడు. ‘ నిజం చెప్పాలంటే అతడి బ్యాటింగ్ నైపుణ్యంపై నాకెప్పుడూ ఎలాంటి అనుమానమూ లేదు. అతడి వికెట్ కీపింగే మెరుగుపడాలి’ అని అన్నాడు. ఆసియాకప్లో కోహ్లికి విశ్రాంతి ఇచ్చినట్లే.. వెస్టిండీస్తో సిరీస్లో కూడా కొందరు ఆటగాళ్లకు విశ్రాంతి కల్పిస్తామని ప్రసాద్ చెప్పాడు. భారత్-ఏ తరఫున, దేశవాళీ మ్యాచ్ల్లో పరుగుల వరద పారిస్తున్న మయాంక్ అగర్వాల్కు త్వరలోనే అవకాశం వస్తుందని ఎమ్మెస్కే ప్రసాద్ పేర్కొన్నాడు. ఆసియాకప్లో భారత జట్టు.. తన ఆరంభపు మ్యాచ్ను మంగళవారం హాంకాంగ్తో ఆడనుంది. -
పొరపాటు పడకోయి!
టి20ల మజా అయిపోయింది. వన్డేల పోరాటం ముగిసింది. సన్నాహం కూడా సమాప్తమైంది. ఇంగ్లిష్ వాతావరణమూ అలవాటైంది. ఇక ముందున్నది అసలు పరీక్ష! కంగుతినిపించే స్వింగ్... కొరుకుడుపడని బ్యాట్స్మెన్... ఓపికను పరీక్షించే టెయిలెండర్లు... ఓ పట్టాన చిక్కని విజయం... మన సత్తా తేల్చే సిసలైన సిరీస్! ఐదు టెస్టుల సుదీర్ఘ ప్రయాణంలో నెగ్గాలంటే టీమిండియా ఏం చేయాలి? విరాట్ కోహ్లి సేన సరిదిద్దుకోవాల్సిన లోపాలేంటి? మెరుగుపడాల్సిన అంశాలపై విశ్లేషణ! సరిగ్గా నాలుగేళ్ల తర్వాత విదేశీ గడ్డపై భారత క్రికెట్ జట్టు ఐదు టెస్టుల సిరీస్ ఆడేందుకు సన్నద్ధమవుతోంది. యాదృచ్ఛికమైనా చివరిసారిగా తలపడింది కూడా ఇంగ్లండ్తోనే కావడం గమనార్హం. పటౌడీ ట్రోఫీ పేరిట 2014లో జరిగిన ఆ సిరీస్లో టీమిండియా 1–3 తేడాతో పరాజయం పాలైంది. అయితే, అదే ఏడాది చివర్లో ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ సందర్భంగా ధోని నుంచి కోహ్లి చేతికి సారథ్య బాధ్యతలు వచ్చాయి. ఆ తర్వాతే జట్టు దృక్పథం మారింది. గెలుపే ముఖ్యమని భావిస్తూ, ఆ మేరకు సహచరులనూ సమాయత్తం చేసే కోహ్లి నాయకత్వంలో విదేశాల్లోనూ ప్రతిఘటన పెరిగింది. ఇటీవలి దక్షిణాఫ్రికా పర్యటనే ఇందుకు సరైన నిదర్శనం. కానీ, కొన్ని పొరపాట్ల కారణంగా ఆ సిరీస్ చేజారింది. అవి పునరావృతం కాకుండా చూసుకుంటే, పదకొండేళ్ల అనంతరం ఇంగ్లండ్లో సిరీస్ నెగ్గి, చరిత్రలో నిలిచే అవకాశం దక్కుతుంది. మరి చేయకూడని ఆ పొరపాట్లేమిటో చూద్దామా? తుది జట్టు ఎంపిక ‘ఫామ్ ఆధారంగా రోహిత్ను ఎంపిక చేశాం’.., ‘రోహిత్ విఫలమైతే రహానేను ఎందుకు ఆడించలేదంటారు... రహానే విఫలమైతే రోహిత్ను ఎందుకు తీసుకోలేదంటారు’ ఇవి దక్షిణాఫ్రికా పర్యటనలో కెప్టెన్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రి వ్యాఖ్యలు. ఇదే సిరీస్లో మొదటి టెస్టులో ఆల్రౌండ్ షో చూపిన భువనేశ్వర్ను అనూహ్యంగా రెండో టెస్టుకు తప్పించారు. సరైన తుది జట్టు ఎంపిక లోపాన్ని చాటే ఇలాంటి నిర్ణయాలతో మిగిలేది ఓటమే. వేర్వేరు కారణాలతో ప్రస్తుతం ఇలాంటి సమస్య లేకున్నా... సరైన కూర్పు విజయానికి తొలి మెట్టుగా భావించి బరిలో దిగాలి. వికెట్ల వెనుక కాదు... ముందు స్వదేశంలో సాహా, పార్థివ్ పటేల్, దినేశ్ కార్తీక్ ఇలా వికెట్ కీపర్ ఎవరైనా వారి బ్యాటింగ్ సామర్థ్యం పెద్దగా చర్చకు రాదు. కానీ, విదేశాల్లో మన కీపర్ల బ్యాటింగ్ ప్రతిభ అంతంతే. ఈ నాలుగేళ్లలో విదేశాల్లో జట్టు స్కోరులో కీపర్ల వాటా 12.37 శాతం కావడమే దీనికి నిదర్శనం. ఇప్పుడు సాహా లేడు, మంచి బ్యాట్స్మన్ అయిన దినేశ్ కార్తీక్కు చక్కని అవకాశం దక్కింది. చిత్రమేమంటే, తన కెరీర్ తొలినాళ్లలో, భారత్ 1–0తో నెగ్గిన 2007 సిరీస్లో కార్తీకే (263) టాప్ స్కోరర్. ప్రస్తుతం అతడు అన్ని విధాలా మెరుగ్గా ఉన్నాడు. కీపింగ్తో పాటు బ్యాట్తోనూ ఓ చేయి వస్తే జట్టుకు అదనపు ప్రయోజనం చేకూర్చిన వాడవుతాడు. రహానేను తప్పించొద్దు కేఎల్ రాహుల్ను ఆడిద్దామనో, అదనపు పేసర్కు చోటిచ్చేందుకో రహానే వంటి ఆటగాడిని పక్కనపెడదామన్న ఆలోచనే సమర్థనీయం కాదు. జొహన్నెస్బర్గ్ టెస్టు ఈ విషయం చాటింది. పైగా ఇంగ్లండ్పై 2014లో లార్డ్స్ టెస్టులో పచ్చిక పిచ్పై టెయిలెండర్లతో బండి లాగించిన రహానే శతకం కొట్టాడు. విదేశాల్లో (ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా) కోహ్లి (52.11) తర్వాత అత్యధిక సగటు రహానేదే (46.91). దీనిని దృష్టిలో పెట్టుకునైనా తన జోలికి వెళ్లకుండా ఉండటమే ఉత్తమం. స్పిన్ను వదలొద్దు పేస్ పిచ్లపై తక్కువ స్కోర్ల మ్యాచ్ల్లోనో, భారీ స్కోర్లు సాధించాక స్పిన్నర్లు ప్రత్యర్థిని చుట్టేసిన సందర్భాల్లోనో టీమిండియాకు విదేశాల్లో టెస్టు విజయాలు దక్కుతున్నాయి. 2000 సంవత్సరం తర్వాత ఇంగ్లండ్ గడ్డపై మన జట్టు నెగ్గిన మూడు టెస్టు ల్లోనూ స్పిన్నర్ల పాత్రే ఎక్కువ కావడం విశేషం. గతం లోలా జూన్, జూలైల్లో కాకుండా ప్రస్తుతం ఆగస్టు, సెప్టెంబర్లో మ్యాచ్లు జరుగనుండటంతో పొడిగా మారిన పిచ్లు స్పిన్నర్లకు అనుకూలించొచ్చు. కాబట్టి ఇద్దరు స్పిన్నర్ల వ్యూహమే సరైనది. విజయ్–పుజారా ప్రస్తుత తరంలో అసలైన టెస్టు ఆటగాళ్లు ఈ ఇద్దరు. పరుగులు రాకున్నా... వీరు క్రీజులో పాతుకుపోతే తద్వారా ప్రధాన బ్యాట్స్మెన్ కోహ్లి, రహానేలకు కొత్త బంతిని ఎదుర్కొనే ఇబ్బంది తప్పుతుంది. షాట్కు వీలుకాని బంతి అని ఏమాత్రం అనిపించినా వదిలేయడం విజయ్ లక్షణమైతే, చెక్కుచెదరని డిఫెన్స్ పుజారా సొంతం. గత సిరీస్లో మాత్రం విజయ్ శైలికి భిన్నంగా తక్కువ సంఖ్యలో (35.59 శాతం) బంతులను వదిలేశాడు. భిన్నమైన షాట్లు ఆడి వికెట్ ఇచ్చుకున్నాడు. ఈసారి అతడితోపాటు పుజారా దుర్భేద్య గోడ కడితే జట్టుకు అదే పదివేలు. స్లిప్ క్యాచింగ్ క్యాచ్లు మ్యాచ్లను గెలిపిస్తాయనేది క్రికెట్ నానుడి. నేటి పరిస్థితుల్లో ఇది టెస్టులకే సరిగ్గా వర్తిస్తుంది. ముఖ్యంగా స్వింగ్ రాజ్యమేలే ఇంగ్లండ్లో. ఇందులో ‘స్లిప్’ ఏరియా గురించి మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి. ద్రవిడ్, లక్ష్మణ్ రిటైర్మెంట్ అనంతరం భారత ‘స్లిప్’ బృందం మారింది. కెప్టెన్ కోహ్లి, వైస్ కెప్టెన్ రహానే ఆ స్థానాల్లోకి వచ్చారు. తోడుగా మురళీ విజయ్. అయితే క్యాచింగ్ గణాంకాలు మాత్రం గొప్పగా లేవు. 2013 చివరి నుంచి పేసర్ల బౌలింగ్లో 46 క్యాచ్లు మిస్ చేయగా... పట్టింది 38 మాత్రమే. సఫారీలపై కేప్టౌన్లో తొలి టెస్టులో టెయిలెండర్ కేశవ్ మహరాజ్ (35 పరుగులు) సున్నా వద్ద ఇచ్చిన క్యాచ్ను జారవిడవడం మ్యాచ్నే చేజారేలా చేసింది. ఇదే సిరీస్ మూడో టెస్టులో కోహ్లి ఇచ్చిన రెండు క్యాచ్లను దక్షిణాఫ్రికా ఫీల్డర్లు అందుకోలేకపోయారు. మరోవైపు అన్నింటిని ఒడిసిపట్టిన భారత్... జయకేతనం ఎగురవేయడం గమనార్హం. సీమర్ల భారం తగ్గించాలి ఆడనున్నది ఐదు టెస్టుల సిరీస్. గరిష్టంగా 25 రోజులు మైదానంలో ఉండాలి. మధ్యలో నాలుగు రోజులు ప్రయాణం. విశ్రాంతి 13 రోజులే. ఇక మొదటి, రెండో టెస్టులకైతే పెద్దగా విరామమే లేదు. కాబట్టి ఇషాంత్, ఉమేశ్, షమీలపై ఎక్కువ భారం పడకుండా చూసుకోవాలి. కనీసం రెండు టెస్టుల వరకు వీరిని కాపాడుకుంటే తర్వాత బుమ్రా, భువనేశ్వర్ చేరికతో ఉపశమనం దక్కే అవకాశం ఉంది. -
మచిలీపట్నంలో టీమిండియా మాజీ క్రికెటర్
సాక్షి, మచిలీపట్నం : ప్రముఖ క్రికెటర్, టీం ఇండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే కృష్ణా జిల్లాకు వచ్చేశారు. భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్గా సేవలందించిన తెలుగు తేజం సీకే నాయుడు విగ్రహాన్ని స్పిన్ దిగ్గజం కుంబ్లే మచిలీపట్నం (బందరు)లో ఆవిష్కరించారు. ఉదయం 9.30 గంటలకు మూడు స్తంభాల సెంటర్ దగ్గర కుంబ్లేకు క్రీడా శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి గోసంగం వరకు ర్యాలీ నిర్వహించారు. తర్వాత 10 గంటలకు స్టేడియం నిర్మాణానికి సంబంధించిన పనులకు శంకుస్థాపన చేశారు. గోసంగం నుంచి ర్యాలీగా బయలు దేరి నేషనల్ కాలేజ్, రాజుపేట, కోనేరుసెంటర్, బస్టాండ్, లక్ష్మీటాకీస్ సెంటర్ మీదుగా జెడ్పీ సెంటర్కు చేరుకున్నారు. అక్కడ టీమిండియా మాజీ కెప్టెన్ సీకే నాయుడు విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. నాయుడు టీమిండియాకు విశేష సేవలందించారని స్పిన్ దిగ్గజం కుంబ్లే కొనియాడారు. తన చేతుల మీదుగా విగ్రహాన్ని ఆవిష్కరించడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు కుంబ్లే తెలిపారు. 1932–34 మధ్య కాలంలో ఇండియన్ క్రికెట్ టీంకు కెప్టెన్గా ఏపీ (బందరు)కి చెందిన సీకే నాయుడు కెప్టెన్గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. సీకే నాయుడు విగ్రహం -
క్రికెట్కు మొహమ్మద్ కైఫ్ వీడ్కోలు
-
క్రికెట్కు కైఫ్ వీడ్కోలు
న్యూఢిల్లీ: భారత మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు శుక్రవారం ప్రకటించాడు. సరిగ్గా పదహారేళ్ల క్రితం (2002 జూలై 13) నాట్వెస్ట్ ట్రోఫీ ఫైనల్లో అద్భుత పోరాటంతో వెలుగులోకి వచ్చిన కైఫ్ తన రిటైర్మెంట్కు అదే రోజును ఎంచుకోవడం విశేషం. ‘ఈ రోజు నాకు ఎంతో ప్రత్యేకమైనది అందుకే రిటైర్మెంట్కు దీన్ని ఎంచుకున్నా’ అని కైఫ్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నాడు. 37 ఏళ్ల కైఫ్ 13 టెస్టులు, 125 వన్డేల్లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్కు చెందిన అతను 129 దేశవాళీ మ్యాచ్ల్లో 7,581 పరుగులు చేశాడు. అందులో 15 సెంచరీలు ఉన్నాయి. అండర్–19 ప్రపంచకప్ (2000) గెలిచిన భారత యువ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన కైఫ్ ఆ తర్వాత టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు మిడిలార్డర్ బ్యాట్స్మన్ యువ రాజ్తో కలిసి ఎన్నో కీలక ఇన్నింగ్స్లు ఆడాడు. ముఖ్యంగా నాట్వెస్ట్ సిరీస్ ఫైనల్లో ఇంగ్లండ్పై లార్డ్స్ మైదానంలో ఈ జోడీ చెలరేగిన తీరు మరుపురానిది. 326 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా 146 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన సమయంలో యువీతో కలిసి 121 పరుగులు జతచేసిన కైఫ్ (75 బంతుల్లో 87 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్లు) చివరి వరకు నిలిచి జట్టుకు మధురమైన విజయాన్ని అందించాడు. పాయింట్, కవర్స్లో కళ్లు చెదిరే క్యాచ్లతో ఫీల్డింగ్లో కొత్త ప్రమాణాలు నెలకొల్పిన కైఫ్... ఆసాధ్యం అనదగ్గ ఎన్నో క్యాచ్లను ఒడిసిపట్టి ఇండియన్ జాంటీ రోడ్స్గా అభిమానుల మనసుల్లో స్థానం సంపాదించుకున్నాడు. 12 ఏళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్కు దూరమైన అతను ప్రస్తుతం క్రికెట్ విశ్లేషకుడిగా వ్యవహరిస్తున్నాడు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో యూపీలోని ఫూల్పూర్ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్సభకు పోటీచేసి ఓటమి పాలయ్యాడు. -
భయంతో వణికిపోయా: విరాట్ కోహ్లి
బెంగళూరు: ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్లలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి స్థానం ఉంటుంది. అయితే ఓ కీలక సందర్భంలో తనకు వణుకు పుట్టిందంటూ క్రికెట్లో తొలి అనుభవాలను ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నాడు. ఈ విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘జాతీయ జట్టులోకి విరాట్ కోహ్లి ఎంపికయ్యాడంటూ 2008లో ఓ టీవీ వార్తల్లో చూశా. సరిగ్గా ఆ సమయంలో అమ్మ నా పక్కనే ఉన్నారు. అవన్నీ వదంతులు అయి ఉంటాయని అమ్మతో చర్చించా. నిమిషాల వ్యవధిలో నాకు బీసీసీఐ నుంచి ఫోన్ వచ్చింది. జాతీయ జట్టులోకి తీసుకున్నామని చెప్పగానే.. ఆ నిజాన్ని జీర్ణించుకునే క్రమంలో భయంతో వణికిపోయానంటూ’ కోహ్లి వివరించాడు. జట్టులోకి సెలక్ట్ అయ్యాక తొలిసారి డ్రెస్సింగ్ రూములో మీటింగ్ జరిగింది. మాట్లాడాల్సిందిగా కోరుతూ నాకు అవకాశం ఇచ్చారు. కానీ గొప్ప క్రికెటర్ల ముందు మాట్లాడేందుకు ఎంతో ఒత్తిడికి లోనయ్యాను. ప్రస్తుతం కొత్త కుర్రాళ్లు జట్టులోకి వచ్చినప్పుడు అదే తీరుగా మేం వారిని డ్రెస్సింగ్ రూములో భయపెడుతుంటాం(నవ్వుతూ). ఇవే భారత క్రికెట్ జట్టులోకి ఎంపికైనప్పుడు నా తొలి అనుభూతులంటూ కోహ్లి చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి. ఒకవేళ తాను క్రికెట్ లేదా ఏదైనా ఆట ఆడకపోయి ఉంటే మాత్రం కచ్చితంగా ఫిట్నెస్పై దృష్టి పెట్టేవాడిని కాదన్నాడు కోహ్లి. ఆటగాడికి ఫిట్నెస్ అదనపు బలమని తాను భావిస్తానన్నాడు. కోహ్లి 2008లో టీమిండియా తరఫున వన్డేల్లో అరంగేట్రం చేయగా, 2010లో తొలి టీ20 మ్యాచ్ ఆడాడు. 2011లో వెస్టిండీస్తో జరిగిన సిరీస్లో భారత్కు ప్రాతినిధ్యం వహించడంతో టెస్టుల్లో అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-11వ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కోహ్లి కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. -
షమీకి ఊరట
ముంబై: భారత పేస్ బౌలర్ మొహమ్మద్ షమీకి ఎట్టకేలకు కాస్త సాంత్వన దక్కింది. భార్య చేసిన గృహ హింస ఆరోపణలు, క్రిమినల్ కేసులు, కాంట్రాక్ట్ నిలిపివేతలతో పాటు ఫిక్సింగ్ తరహా వివాదంతో గత రెండు వారాలుగా ఉక్కిరిబిక్కిరవుతున్న అతనికి కొంత ఊపిరి పీల్చుకునే అవకాశం లభించింది. షమీని వార్షిక కాంట్రాక్ట్ జాబితాలో చేర్చాలని బీసీసీఐ గురువారం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బోర్డు ఒక ప్రకటన చేసింది. దీనికి తోడు బీసీసీఐ అవినీతి వ్యతిరేక విభాగం (ఏసీయూ) హెడ్ నీరజ్ కుమార్ కూడా తన విచారణలో షమీకి అనుకూలంగా నివేదిక ఇచ్చారు. షమీ భార్య హసీన్ జహాన్ చేసిన ఆరోపణల ప్రకారం షమీ దుబాయ్లో రెండు రోజులు గడపడం... పాక్ మహిళ అలీష్బా, ఇంగ్లండ్కు చెందిన మొహమ్మద్ భాయ్లతో ఉన్న సంబంధం గురించి తేల్చాలంటూ క్రికెట్ పరిపాలకుల కమిటీ (సీఓఏ) నీరజ్ను కోరిన విషయం తెలిసిందే. ఈ విషయంలో షమీని అనుమానించేందుకు ఏమీ లేదని నివేదికలో ఉన్నట్లు సమాచారం. ‘బీసీసీఐ యాంటీ కరప్షన్ కోడ్ ప్రకారం ఇక ముందు షమీపై ఎలాంటి చర్య తీసుకోరాదని సీఓఏ భావిస్తోంది. ఇదే కారణంగా బోర్డు షమీకి కాంట్రాక్ట్ అందజేస్తోంది’ అని బీసీసీఐ స్పష్టం చేసింది. షమీకి గ్రేడ్ ‘బి’ కాంట్రాక్ట్ దక్కింది. దీని ప్రకారం అతనికి ఏడాదికి రూ. 3 కోట్లు లభిస్తాయి. తాజా పరిణామంతో షమీ ఐపీఎల్ ఆడేందుకు మార్గం సుగమమైంది. ఆటపరంగా అతనికి ప్రస్తుతానికి సమస్య తప్పినా... మరో వైపు భార్య ఫిర్యాదుపై నమోదు చేసిన కేసుల విచారణ మాత్రం కొనసాగుతుంది. ఇది నాకో గొప్ప విజయం. మిగతా ఆరోపణల నుంచి కూడా నిర్దోషిగా బయటపడతా. నా వ్యక్తిత్వం, దేశభక్తిని శంకించడంతో వేదనకు గురయ్యా. బీసీసీఐ విచారణపై పూర్తి నమ్మకముంచా. 10–15 రోజులుగా తీవ్ర ఒత్తిడి అనుభవించా. నిర్దోషిగా ప్రకటించడంతో స్థైర్యం పెరిగింది. మళ్లీ మైదానంలో దిగేందుకు ప్రేరణగా నిలిచింది. నా కోపాన్నంతా సానుకూల ధోరణితో ఆటలో చూపిస్తా. ఇకపై నా బౌలింగ్ గురించే మాట్లాడుకునేలా చేస్తా. నేనే తప్పు చేయలేదని తెలుసు. బీసీసీఐకి ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే – మొహమ్మద్ షమీ -
దినేశుని నవోదయం
ఎప్పుడో 2004లో జాతీయ జట్టులోకి వచ్చాడు.2006లో భారత్ ఆడిన తొలి అంతర్జాతీయ టి20లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అతడే.ఇంగ్లండ్ గడ్డపై 2007లో టెస్టుల్లోనూ మెరిశాడు....అయినా ఇప్పటికీ ‘ఒక్క చాన్స్’ కోసం తపన...అటు సహచరులు, ఇటు కుర్రాళ్లతో పోరాటం...ఆత్మవిశ్వాసం కోల్పోకుండా అలుపెరగని పయనం...ఎట్టకేలకు తానేంటో నిరూపించుకున్న వైనం ...ఆ ఆటగాడు దినేశ్ కార్తీక్. తన ప్రస్థానం ఇలా... సాక్షి క్రీడా విభాగం : ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐపీఎల్, ఇంగ్లండ్ సిరీస్ ఇలా ప్రతి టోర్నీ నాకు ముఖ్యమే. ఒక్కదాంట్లో విఫలమైనా జట్టుకు దూరమవుతా. ఒత్తిడిని ఎదుర్కొంటూ అత్యున్నత స్థాయిలో ఆడుతూ పోవడమే నేను చేయగలిగినది’ నిదహస్ ట్రోఫీ ఫైనల్కు ముందు దినేశ్ కార్తీక్ వ్యాఖ్యలివి. వీటిని బట్టి జట్టులో చోటుపై అతడెంతటి ఊగిసలాటలో ఉన్నాడో చెప్పొచ్చు. అవును మరి... ఒకటా, రెండా? టీమిండియా తరఫున కార్తీక్ అరంగేట్రం చేసి 14 సంవత్సరాలు కావొస్తోంది. అది జట్టు మంచి వికెట్ కీపర్ బ్యాట్స్మన్ కోసం చూస్తున్న సమయం. అప్పటికి మహేంద్ర సింగ్ ధోని కూడా వెలుగులోకి రాలేదు. అయితే... ప్రతిభ ఉన్నా, అదృష్టం తోడు లేక, పెద్దగా అవకాశాలూ రాక సగటు ఆటగాడిగానే మిగిలిపోయాడీ తమిళ తంబి. ఓవైపు క్రీడా జీవితంలో తీవ్ర పోటీని ఎదుర్కొంటుంటే, మరోవైపు వ్యక్తిగత జీవితంలోనూ ఆటుపోట్లు ఎదురయ్యాయి. కానీ అతడు పోరాటం కొనసాగించాడు. తోటివారైన మనోజ్ తివారీ, అంబటి రాయుడు, ఇర్ఫాన్ పఠాన్ జాతీయ జట్టులోకి వచ్చి వెళ్లిపోయినా కార్తీక్ మాత్రం ఆత్మ విశ్వాసం కోల్పోలేదు. 31 ఏళ్ల వయసులో గత రంజీ సీజన్లో భారీగా పరుగులు చేసి మరోసారి సెలెక్టర్ల పిలుపు అందుకున్నాడు. ఇప్పుడు మన మహామహ క్రికెటర్లకూ సాధ్యం కాని రీతిలో చివరి బంతికి సిక్స్ కొట్టి, కప్నూ సాధించిపెట్టి ఒక్క మ్యాచ్తో హీరోగా మారిపోయాడు. ఈ అత్యద్భుత ఇన్నింగ్స్ అతడి స్థాయిని ఎక్కడికో తీసుకెళ్లింది. అది ఇకనైనా జట్టులో చోటును స్థిరం చేస్తుందా? ధోని కంటే ముందటివాడు... ఏళ్లుగా టీమిండియాలోకి వస్తూ పోతూ ఉన్న దినేశ్ కెరీర్ ఆసాంతం పడుతూ లేస్తూనే సాగింది. ధోని కంటే ముందే, చిన్న వయసులో (18 ఏళ్లు)నే జట్టుకు ఎంపికైనా అతడికి ఏమీ కలిసిరాలేదు. ఫామ్ కంటే నిలకడగా అవకాశాలు రాకపోవడమే తనను ఎక్కువగా దెబ్బతీసింది. ఈలోగా ధోని దూసుకెళ్లిపోయాడు. మహి తర్వాత కీపింగ్ నైపుణ్యంతో టెస్టుల్లో వృద్ధిమాన్ సాహా, ఎడమచేతి వాటం బ్యాటింగ్ కారణంగా పార్థివ్ పటేల్ చోటు కొట్టేశారు. ఇక వన్డేలు, టి 20ల్లో ధోనికి తోడు రిషభ్ పంత్, సంజూ శామ్సన్ వంటి కుర్రాళ్లు. ఇలా ఎటుచూసినా పోటీనే. ఇలాంటి నేపథ్యంలో రాకరాక అవకాశం వచ్చినా కార్తీక్కు అది కత్తి మీద సాములాంటిదే. ఏ మాత్రం విఫలమైనా చోటు మళ్లీ గల్లంతే. అందుకే అతడు పైవిధంగా వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడేం చేయాలి? అటు పూర్తిస్థాయి కీపర్గా కాక, ఇటు స్పెషలిస్ట్ బ్యాట్స్మన్గానూ పరిగణించలేక ఇప్పటివరకు దినేశ్ కార్తీక్ కెరీర్ డోలాయమానంలో ఉండేది. కానీ... నిదహస్ ట్రోఫీ ఫైనల్లో బంగ్లాదేశ్పై మెరుపు ఇన్నింగ్స్లో అతడి చక్కటి క్రికెటింగ్ షాట్లు బ్యాట్స్మన్గా ఎంతటి పరిపూర్ణుడో చాటాయి. ఫైనల్లో దినేశ్ కొట్టిన కొన్ని షాట్లను తానూ ఆడాలనుకుంటున్నట్లు రోహిత్ శర్మ చెప్పడమే దీనికి నిదర్శనం. ప్రస్తుతానికి ప్రపంచకప్ జట్టులో ధోనికి స్టాండ్బై కీపర్గా ఇతడికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనంతరం మహి రిటైరైనా దినేశ్ వైపే మొగ్గు ఉంటుందనడంలో సందేహం లేదు. ఈలోగా మరిన్ని అవకాశాలిస్తూ అతడిలో ఆత్మవిశ్వాసం పెంచాలి. అవసరమైతే స్పెషలిస్ట్ బ్యాట్స్మన్గా నాలుగో స్థానంలో ఆడించే ప్రయోగం చేయాలి. కార్తీక్ ఈ ఐపీఎల్ సీజన్లో కోల్కతాకు సారథ్యం వహించనున్నాడు. కెప్టెన్గానూ నిరూపించుకుని మరో మెట్టు ఎక్కడానికి అతడికిదో చాన్స్. ఇకపై తన క్రీడా ప్రయాణం సాఫీగా సాగాలని... ఫినిషర్గా భారత్కు మరిన్ని విజయాలు అందించాలని ఆశిద్దాం. ఆ సిక్స్ నేను చూడలేదు... 13వ ఓవర్లో నేను అవుటయ్యాక తనను బ్యాటింగ్కు పంపనందుకు దినేశ్ కార్తీక్ నొచ్చుకున్నాడు. కానీ మ్యాచ్ తర్వాత చాలా సంతృప్తిగా కనిపించాడు. ఆత్మవిశ్వాసం నిండుగా ఉన్న, ఎప్పుడైనా, ఎక్కడైనా బ్యాటింగ్ చేయగల అతడి అవసరం చివర్లో చాలా ఉంటుందనే ఇలా చేశాం. మ్యాచ్ను నువ్వే ముగించాలని అతడికి చెప్పా. ఇలాంటి ఆటగాడి అవసరం జట్టుకు చాలా ఉంది. అయితే చివరి బంతికి దినేశ్ కార్తీక్ కొట్టిన సిక్స్ షాట్ను నేను చూడలేదు. మ్యాచ్ ఫలితం సూపర్ ఓవర్లో తేలుతుందేమోనని భావించి ప్యాడ్లు కట్టుకునేందుకు డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్లాను. –రోహిత్శర్మ, భారత కెప్టెన్ ఫైనల్ ఇన్నింగ్స్ జీవిత కాలం గుర్తుంటుంది. ఏడాదిగా జట్టుతో ఉంటున్నా. మేం చాలా శ్రమించాం. చివరకు టోర్నీని గెలిచాం. బౌలర్లు వేసే బంతులకు తగ్గట్లు నా స్టాన్స్ మార్చుకున్నా. దీనికి ప్రతిఫలం దక్కింది. ప్రేక్షకుల నుంచి మాకు అనూహ్య మద్దతు లభించింది. బ్యాటింగ్లో అది నాకు ఊపునిచ్చింది. – దినేశ్ కార్తీక్ వ్యక్తిగత జీవితంలోనూ... అదేంటో కాని... దినేశ్ కార్తీక్ క్రీడా కెరీర్లాగే వ్యక్తిగత జీవితంలోనూ ఒడిదొడుకులున్నాయి. 2007లో 22 ఏళ్ల వయసులోనే చిన్ననాటి స్నేహితురాలు నిఖితను పెళ్లి చేసుకుని ఆశ్చర్యపర్చిన అతడు 2012లో ఆమెతో విడిపోవాల్సి వచ్చింది. తర్వాత నిఖిత తమిళనాడుకే చెందిన భారత క్రికెటర్ మురళీ విజయ్ను వివాహమాడింది. అనంతరం కార్తీక్... భారత స్టార్ స్వా్కష్ క్రీడాకారిణి దీపికా పల్లికల్ను 2015లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరిప్పుడు అన్యోన్యంగా ఉంటున్నారు. అభిషేక్ నాయర్ అండతో... ప్రతి ఆటగాడికి కొంతకాలం దుర్దశ ఉంటుంది. దినేశ్ కూడా ఆ దశను చవిచూశాడు. 2016 ఐపీఎల్ వేలంలో అతడి విలువ రూ.9 కోట్ల నుంచి రూ.2 కోట్లకు పడిపోయింది. రంజీల్లోనూ విఫలమయ్యాడు.ఈసారి విఫలమైతే ఇక అంతే అనే పరిస్థితుల్లో ఆటతీరు మెరుగుకు ముంబై వెళ్లిన అతడు అభిషేక్ నాయర్ ఇంట్లోని చిన్న గదిలో ఉండాల్సి వచ్చింది. కనీస వసతులు లేని ఆ గదిలో ఉండేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ప్రవీణ్ ఆమ్రే, అమిత్ పగ్నిస్, అపూర్వ్ దేశాయ్ వంటివారి వద్ద శిక్షణ పొందాడు. నాయర్ కూడా కొంత తోడ్పడ్డాడు. అక్కడ నేర్చుకున్న సాంకేతిక అంశాలతో దినేశ్ ఆట పూర్తిగా మారింది. తర్వాతి రంజీ సీజన్లో 14 ఇన్నింగ్స్ల్లో 50పైగా సగటుతో 704 పరుగులు చేశాడు. చాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టుకు ఎంపికయ్యాడు. దాదాపు ఏడాదిన్నరగా స్థిరంగా జట్టులో కొనసాగుతున్నాడు. ►దక్షిణాఫ్రికాపై 2006లో టీమిండియా ఆడిన తొలి టి20లో దినేశ్ కార్తీక్ జట్టు సభ్యుడు. ఈ మ్యాచ్తోనే టి20ల్లో అరంగేట్రం చేసిన ఇతడు 28 బంతుల్లో 31 పరుగులు చేసి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గానూ నిలిచాడు. -
శ్రీలంకకు పయనమైన భారత జట్టు
ముంబై: ముక్కోణపు టి20 టోర్నీలో పాల్గొనేందుకు రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు ఆదివారం శ్రీలంక బయల్దేరి వెళ్లింది. మంగళవారం మొదలయ్యే ఈ టోర్నీ తొలి మ్యాచ్లో భారత్... శ్రీలంకతో తలపడనుంది. మూడు జట్లు ప్రత్యర్థితో రెండేసి మ్యాచ్లు ఆడనున్నాయి. ఫైనల్ సహా ఈ మ్యాచ్లన్నిటికీ కొలంబోలోని ప్రేమదాస స్టేడియమే వేదిక కానుంది. -
‘యువీ ఇప్పటికీ మ్యాచ్ విన్నరే’
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ డాషింగ్ బ్యాట్స్మన్ వీరేందర్ సెహ్వాగ్ మరోసారి యువరాజ్ సింగ్కు మద్దతు ప్రకటించాడు. మిడిలార్డర్లో యువరాజ్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని అన్నాడు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో యువీ అద్భుతాలు చేస్తాడని కితాబు ఇచ్చాడు. జట్టులోకి యువరాజ్ త్వరలోనే పునరాగమనం చేస్తాడన్న నమ్మకాన్ని సెహ్వాగ్ వ్యక్తం చేశాడు. యువరాజ్ ఇప్పటికీ మ్యాచ్ విన్నరే.. అందులో సందేహపడాల్సిన అవసరం లేదన్నాడు.భారత జట్టులోకి మళ్లీ యువరాజ్ లాంటి ఆటగాడు ఇప్పట్లో వస్తాడన్న నమ్మకం తనకు లేదన్నాడు. యోయోలో 36 పాయింట్లు సాధించిన యువీని.. త్వరలోనే టీమిండియా జెర్సీలో చూడొచ్చని చెప్పాడు. -
ఫైనల్లో భారత్, పాక్
అజ్మాన్ (యూఏఈ): డిఫెండింగ్ చాంపియన్ భారత క్రికెట్ జట్టు తమ జోరు కొనసాగిస్తూ అంధుల వన్డే వరల్డ్ కప్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బంగ్లాదేశ్తో బుధవారం జరిగిన సెమీఫైనల్లో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బంగ్లాదేశ్ 38.5 ఓవర్లలో 256 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో దుర్గా రావు మూడు వికెట్లు పడగొట్టగా... ప్రకాశ్, దీపక్ రెండేసి వికెట్లు తీశారు. 257 పరుగుల లక్ష్యాన్ని భారత్ 23 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి అధిగమించింది. గణేశ్ (112) సెంచరీ సాధించగా... దీపక్ (53), నరేశ్ (40) రాణించారు. మరో సెమీఫైనల్లో పాకిస్తాన్ 156 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది. ఈనెల 20న షార్జాలో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య ఫైనల్ జరుగుతుంది. లీగ్ దశలో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో భారత్ ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. -
పేస్ 'పవర్' సరిపోతుందా!
సాక్షి క్రీడా విభాగం : కోహ్లి పూర్తి స్థాయి కెప్టెన్గా మారాక భారత జట్టు ఉపఖండంలో లేదంటే వెస్టిండీస్ గడ్డపైనే టెస్టు మ్యాచ్లు ఆడింది. మారిన పరిస్థితుల నేపథ్యంలో విండీస్ వేదికలు కూడా పేస్కు అనుకూలించకుండా నిర్జీవంగా మారాయి. కాబట్టి భారత్లోని మైదానాలకు, అక్కడి పిచ్లకు పెద్ద తేడా లేకుండా పోయింది. ఇలాంటి చోట మన పేస్ బౌలర్లకు ఎప్పుడూ పరీక్ష ఎదురు కాలేదు. వికెట్లు తీయాలంటూ వారిపై పెద్దగా అంచనాలు లేకపోవడంతో పాటు ఒక క్రతువు నిర్వహించినట్లే కొన్ని ఓవర్లు వేసి తప్పుకోవడం రొటీన్గా మారిపోయింది. ఆ తర్వాత అశ్విన్, జడేజాలు మ్యాచ్ను తమ చేతుల్లోకి తీసుకొని విజయంవైపు సాగిపోవడం మనకు దాదాపు అన్ని సిరీస్లలో కనిపించిన ఒకే తరహా దృశ్యం. తాము విఫలమైనా స్పిన్నర్లు ఆదుకోగలరనే ధీమాతో పేస్ బౌలర్లపై ఒత్తిడి కూడా పెరగలేదు. విదేశాల్లో స్పిన్నర్ల వల్ల సాధ్యం కాని చోట ప్రధాన బాధ్యతను మోయలేక మన ఫాస్ట్ బౌలర్లు గతి తప్పారు. ఫిట్నెస్ సమస్యలు, చివరి సెషన్కు వచ్చే సరికి ఓపిక లేక డస్సిపోయి కనీస ప్రదర్శన కూడా ఇవ్వలేకపోయారు. విదేశాల్లో గత కొన్ని టెస్టులు చూస్తే ఇది అర్థమవుతుంది. జొహన్నెస్బర్గ్లో దక్షిణాఫ్రికాపై 136 ఓవర్లు... వెలింగ్టన్లో న్యూజిలాండ్పై 210 ఓవర్లు వేసినా ఆలౌట్ చేయలేక పోవడం... నాటింగ్హామ్లో ఇంగ్లండ్ ఆఖరి వికెట్కు ఏకంగా 198 పరుగులు జోడించడం... బ్రిస్బేన్లో చివరి నలుగురు ఆసీస్ బ్యాట్స్మెన్ కలిసి 195 పరుగులు జత చేసి టీమ్ స్కోరును రెట్టింపు చేయడం దానికి ఉదాహరణలు. ఈ అన్ని సందర్భాల్లోనూ భారత్ గెలిచే అవకాశమున్నా... దానిని కోల్పోయింది. కోహ్లి భిన్నంగా... ధోని కెప్టెన్సీలో భారత్ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాలలో కలిపి 2 టెస్టులు గెలిచి 13 ఓడింది. ఇందులో ఒక్క 2010 డర్బన్ టెస్టులో మాత్రం భారత్ పూర్తిగా పేస్ బౌలింగ్ సత్తాతో గెలిచింది. 2014 లార్డ్స్ టెస్టులో ఇషాంత్ బాగా బౌలింగ్ చేసినా... అదంతా ధోని చలవే! సరిగ్గా చెప్పాలంటే ఆ ఇన్నింగ్స్లో ఇషాంత్ను చిన్న పిల్లాడిలా మార్గనిర్దేశనం చేస్తూ బంతి బంతికీ ఒక్కో వ్యూహంతో ధోని ఇంగ్లండ్ ఆట కట్టించాడు. వీటిని మినహాయిస్తే మిగతా సందర్భాల్లో పేస్ బౌలింగ్ పరంగా అద్భుతాన్ని ఆశిస్తూ ధోని ప్రేక్షక పాత్రకే ఎక్కువగా పరిమితమయ్యాడు. బౌలర్లు ప్రభావం చూపించాల్సిన చోట కూడా బ్యాటింగ్నే నమ్ముకోగా... మన పేసర్లు అతి సులువుగా, ధారాళంగా పరుగులు ఇచ్చేవారు. అందరూ కలిసి సుదీర్ఘ ఓవర్లు వేసే ప్రయత్నం చేసినా ప్రతీ సిరీస్లో ఎవరో ఒకరు గాయపడ్డారు. 2011–12 ఆస్ట్రేలియా సిరీస్లో జహీర్ చివరి వరకు కొనసాగినా అతి పేలవ ప్రదర్శన కనబర్చాడు. కానీ ఇప్పుడు కోహ్లి అలా వేచి చూసే వ్యక్తి కాదు. సరిగ్గా చెప్పాలంటే ధోని తన ఆటగాళ్లు తమంతట తాముగా కొంత బాధ్యత తీసుకోవాలని, సొంతంగా ఆలోచించాలని భావించేవాడు. కానీ విరాట్ మాత్రం దానిని డిమాండ్ చేస్తున్నాడు. తనకు ఎలా కావాలో గట్టిగా చెప్పి చేయించుకునే రకం అతను. కాబట్టి ఎంతటి కఠినమైన పరిస్థితుల్లోనైనా బౌలింగ్ చేసేందుకు, సుదీర్ఘ స్పెల్స్కు బౌలర్లు సిద్ధంగా ఉండాల్సిందే. ఆట మార్చుకోవాల్సిందే... ఐదేళ్ల క్రితం 2012 సీజన్లో సొంతగడ్డపై భారత్ మ్యాచ్లు ఆడిన సమయంలో ఫాస్ట్ బౌలర్ల ఉనికే దాదాపుగా కనిపించలేదు. టీమ్ ఆడిన సగం మ్యాచుల్లో కూడా ఏ ఒక్క పేసర్ బరిలోకి దిగలేదు. అశ్విన్ వేసిన ఓవర్లలో నాలుగో వంతు కూడా ఒక పేసర్ వేయలేదు. ఆ తర్వాతి విదేశీ పర్యటనల్లో ఇదే జట్టును దెబ్బ తీసింది. ఇప్పుడు సుదీర్ఘంగా సొంతగడ్డపై ఆడిన తర్వాత వరుసగా విదేశీ టూర్లకు భారత్ సిద్ధమవుతోంది. అయితే గతంతో పోలిస్తే ఇటీవల మన పేసర్లు కూడా ఎక్కువగా బౌలింగ్ చేయడం కొంత మెరుగైన విషయం. ఇప్పుడు మన పేసర్లలో అనుభవం పెరగడమే కాదు ఫిట్నెస్ కూడా చాలా బాగుంది. రనప్ సమస్య చక్కదిద్దుకున్న తర్వాత షమీలో సత్తా పెరిగింది. దక్షిణాఫ్రికా గడ్డపై షమీ నుంచి కోహ్లి ఎంతో ఆశిస్తున్నాడు. అయితే అతను తన ఫిట్నెస్ను కాపాడుకోవడమే కీలకం. బౌలింగ్ చేసే తీరులో చిన్న మార్పు మన పేసర్లకు మరింత అనుకూలంగా మార్చవచ్చు. భారత్లో సాధారణంగా నేరుగా స్టంప్స్పైకి బంతులు విసిరి మనోళ్లు ఎక్కువగా వికెట్లు రాబట్టారు. మన పేసర్లు పడగొట్టిన వికెట్లలో 45.5 శాతం బౌల్డ్ లేదా ఎల్బీడబ్ల్యూ కావడం దీనికి నిదర్శనం. ఇక్కడి నెమ్మదైన పిచ్లపై అది పని చేసింది. అదే దక్షిణాఫ్రికాలో పరిస్థితి భిన్నం. గత పదేళ్లలో దక్షిణాఫ్రికాలో అలాంటి బౌలింగ్కు 28 శాతం మాత్రమే వికెట్లు లభించాయి. అక్కడ ఎక్కువగా ఆఫ్ స్టంప్పై దాడి చేయాల్సి ఉంటుంది. బయటికి వెళుతూ బ్యాట్ ఎడ్జ్ తీసుకునేలా బంతులు సంధించాలి. దాని కోసం బౌలర్లు లెంగ్త్ను మార్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మనకు తగిన ఫలితాలు లభిస్తాయి. తుది జట్టులో షమీ, ఇషాంత్ ఖాయం కాగా... మూడో స్థానం కోసం భువనేశ్వర్, ఉమేశ్ యాదవ్ల మధ్య పోటీ ఉంది. జస్ప్రీత్ బుమ్రా జట్టులోకి ఎంపికైనా ఆడే అవకాశాలు తక్కువే. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది అన్ని విధాలా మెరుగైన పేస్ బౌలింగ్ దళమే. అయితే తమపై ఉన్న ఒత్తిడిని అధిగమిస్తే సఫారీ సిరీస్ మనకు చిరస్మరణీయం కాగలదు. తొలి టెస్టులో స్టెయిన్కు నో చాన్స్! గాయం నుంచి కోలుకొని పునరాగమనం చేసిన దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ డేల్ స్టెయిన్ బరిలోకి దిగడం మరింత ఆలస్యం కానుంది. భారత్తో శుక్రవారం నుంచి కేప్టౌన్లో జరిగే తొలి టెస్టు తుది జట్టులో అతనికి అవకాశం లభించకపోవచ్చని స్వయంగా కోచ్ ఒటిస్ గిబ్సన్ వెల్లడించారు. స్టెయిన్ ఫిట్గానే ఉన్నా ముగ్గురు పేసర్లతో కూడిన తమ జట్టు కూర్పులో అతనికి స్థానం కష్టమని ఆయన చెప్పారు. దాదాపు ఏడాది తర్వాత వస్తున్న స్టెయిన్ తొలి టెస్టులో ఏదైనా జరిగి మధ్యలోనే తప్పుకునే ప్రమాదం కూడా ఉందన్న గిబ్సన్... పేస్కు అనుకూలించే తర్వాతి రెండు టెస్టు వేదికలపై మాత్రం స్టెయిన్ ఉంటాడని సంకేతమిచ్చారు. -
అన్నింటా ఫస్ట్క్లాస్...
‘శతక్కొట్టి... చితగ్గొట్టింది’... ‘అజేయంగా... అద్వితీయంగా’... ‘మరో సిరీస్లోనూ దంచేసింది’... ‘ర్యాంకింగ్స్లో నంబర్వన్’... ఇవన్నీ ఈ ఏడాది టీమిండియా ఘన విజయాల పతాక శీర్షికలు. నిజమే లైవ్లో చూసినా, ‘లైక్’ కొట్టి చూసినా... క్రికెట్ అభిమానులకు మాత్రం ఈ ఏడాది కనుల పండువగా సాగింది. నిజంగా ఈ సంవత్సరం ఓ గెలుపు వసంతంగా మిగిలిపోయింది. ఏ జట్టు ఎదురైనా విజయం మాత్రం కోహ్లి సేనదే. విరాట్ పూర్తిస్థాయి సారథ్యం... భారత్ అజేయ నేపథ్యం... 2017ను క్రికెట్ జాతి గుండెల్లో ఎవరెస్టంత ఎత్తులో నిలిపింది. –సాక్షి క్రీడా విభాగం ఈ ఏడాది మొదట్లో ‘బాహుబలి–2’ కోసం బాగా ఎదురు చూశాం. కానీ ఏడాదంతా కూడా భారత్తో బాగా ఆడిన ప్రత్యర్థినే చూడలేకపోయాం. తీరం దాటిన తుఫాను తెలుసు. కానీ టీమిండియాను దాటిన ప్రత్యర్థే లేదు. హరికేన్లు, టోర్నడోల బీభత్సం గురించి విన్నాం. కానీ భారత్ సిరీస్ పరాజయం వార్తే వినలేకపోయాం. టీమిండియా సాఫల్యం గురించి ఒక్క మాటలో చెబితే చాలదు. ఒక్క మైదానంతో ఆగలేదు. ఒక్క మ్యాచ్తో పొంగిపోలేదు. ఒక్క సిరీస్తో అలసిపోలేదు. ఓవరాల్గా... భారత్ చేరిన ఏ జట్టును విడిచిపెట్టలేదు. నేర్పుగా ఆడింది. ఓర్పుగా కాచుకుంది. తీరిగ్గా ఓడించింది. గెలుపు మలుపును ఆసాంతం ఆస్వాదించింది. ఈ ఏడాది భారత్ ఆడిన మ్యాచ్లు 54. వీటిలో విజయాలు 37. దీనిని శాతాల్లోకి మారిస్తే 68.51. అంటే మన జట్టు ఫస్ట్ క్లాస్లో పాసైనట్లు. చిత్రమేమంటే... 2017లో టెస్టుల్లో ఆధిపత్యం సాగించినట్లు కనిపించినా, విజయ శాతం (72.41) మాత్రం వన్డేల్లోనే అధికంగా ఉండటం. ఎక్కువ సంఖ్యలో మ్యాచ్లు ఆడటమూ ఇందుకు కారణం కావొచ్చు. అయితే... శ్రీలంకతో స్వదేశంలో తాజాగా ముగిసిన సిరీస్లో రెండు మ్యాచ్లు డ్రా కాకుంటే టెస్టు శాతం మెరుగ్గా ఉండేది. ఇక టి20ల్లో 64.28 గెలుపు శాతం నమోదైంది. గణాంకాలు, ఆటగాళ్ల ప్రదర్శన పరంగా 2017 భారత జట్టుకు అద్వితీయంగా సాగింది. అన్ని ఫార్మాట్ల కెప్టెన్గా విరాట్ కోహ్లి... ఆకాశమే హద్దుగా చెలరేగి 2,818 పరుగులు సాధించాడు. చరిత్రలో ఇది మూడో అత్యధికం కావడం విశేషం. వన్డేల్లో 31వ శతకంతో... ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ను అధిగమించాడు. శ్రీలంకపై రెండు వరుస ద్విశతకాలతో ఆరు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక కెప్టెన్గా రికార్డు నెలకొల్పాడు. ఐసీసీ వన్డే ర్యాంకుల్లో నంబర్వన్గా, టెస్టు ర్యాంకుల్లో రెండో స్థానంలో నిలిచాడు. శ్రీలంకను టెస్టుల్లో వారి సొంతగడ్డపై 3–0తో ఓడించిన భారత జట్టు విదేశాల్లో 50 ఏళ్ల తర్వాత వరుసగా మూడు టెస్టులు గెలిచిన ఘనత దక్కించుకుంది. చేజారిన ఆ ఒక్కటి...: చాంపియన్స్ ట్రోఫీ లీగ్ దశలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై అలవోకగా విజయం సాధించి... దక్షిణాఫ్రికానూ మట్టికరించి... సెమీస్లో బంగ్లా గండం దాటిన భారత్కు... ఫైనల్లో మాత్రం పాక్ చేతిలో అనూహ్య ఓటమి ఎదురైంది. ఈ పరాజయం వన్డే జట్టు కూర్పుపైనా ప్రభావం చూపింది. స్పిన్లో వైవిధ్యం చూపాలన్న ఆలోచనతో తదనంతర పరిణామాల్లో అశ్విన్, జడేజాలు జట్టులో స్థానం కోల్పోయారు. అయితే.. వీరిద్దరూ ఈ ఏడాది అత్యధిక వికెట్లు తీసిన టెస్టు బౌలర్లలో రెండు, నాలుగో స్థానాల్లో నిలిచి జట్టు అగ్రస్థానం అందుకోవడంలో తమవంతు పాత్ర పోషించారు. మణికట్టు మాయాజాలం... ఏ ఫార్మాట్లో అయినా... మొన్నటివరకు భారత స్పిన్ ద్వయం అంటే గుర్తొచ్చింది అశ్విన్, జడేజాలే. కానీ 2017లో వారికి వన్డే, టి20 ద్వారాలు క్రమంగా మూసుకుపోయాయి. అనూహ్యంగా తెరపైకి వచ్చిన యజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్ ఇప్పుడు పరిమిత ఓవర్ల క్రికెట్లో ప్రధాన అస్త్రాలుగా మారారు. దీనికి తగ్గట్లే చహల్ 44, కుల్దీప్ 34 వికెట్లు తీసి తమ ఎంపికకు న్యాయం చేశారు. రో‘హిట్మ్యాన్’ అయ్యాడు అపార ప్రతిభావంతుడిగా పేరున్నా... అందుకు తగిన న్యాయం చేయలేడని అపవాదున్న రోహిత్ శర్మ ఈ ఏడాది దానిని దాదాపు చెరిపేశాడు. వన్డేల్లో మూడో ద్విశతకం, టి20ల్లో వేగవంతమైన శతకంతో పాటు టెస్టుల్లో అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడు. సారథ్య బాధ్యతలనూ చేపట్టి జట్టును నడిపించాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ ఏడాది అతడికి దక్కిన బిరుదు ‘హిట్మ్యాన్’. వ్యాఖ్యాతల నోళ్లలో నానిన ఈ పేరు భారీ షాట్లు కొట్టే రోహిత్కు సరిపోయేదే. ఇకపై అభిమానులూ అలానే పిలుచుకునేలా ఇన్నింగ్స్లు ఆడాలని ఆశిద్దాం. ‘జంబో’ వైదొలిగాడు... అనిల్ కుంబ్లే... ప్రపంచ క్రికెట్లో దిగ్గజం. భారత్ ఆణిముత్యం. టీమిండియా కోచ్గా అతడి నియామకాన్ని అన్ని వర్గాల వారూ హర్షించారు. సరైన వ్యక్తిని ఎంపిక చేశారంటూ కొనియాడారు. కానీ... ఈ జెంటిల్మన్ జట్టులో కొందరికి ‘హెడ్మాస్టర్’లా కనిపించాడు. అతడి క్రమ‘శిక్షణ’, ఆలోచనలు అర్థం చేసుకోలేకపోయారు. ఆస్ట్రేలియాతో సిరీస్ ఫలితం తేల్చే ధర్మశాల టెస్టులో చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ను ఆడించడం దగ్గర మొదలైన అభిప్రాయ భేదాలు చాంపియన్స్ ట్రోఫీ వరకూ కొనసాగాయి. తర్వాతి వెస్టిండీస్ పర్యటనకూ కుంబ్లే కోచ్గా ఉంటాడని తొలుత ప్రకటించినా... దిగ్గజ ఆటగాళ్లు కోచ్గా ఇమడలేరని మరోసారి నిరూపిస్తూ ‘జంబో’ వైదొలిగాడు. ఓడారు... కానీ పోరాడారు వరల్డ్కప్ ప్రయాణానికి ముందు... ముంబై బాంద్రాలోని ఓ ఇండోర్ అకాడమీలో భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్, కోచ్ తుషార్ విలేకరుల సమావేశం. హాజరైన విలేకరులు వేళ్లమీద లెక్కబెట్టగలిగినంత. దీనికి తగ్గట్లే సమావేశం కూడా కొద్దిసేపే సాగింది. వరల్డ్కప్ ముగిసిన అనంతరం... విమానాశ్రయంలో బ్యానర్లతో వేలాదిమంది అభిమానులు. ఈసారి విలేకరుల సమావేశం అయిదు నక్షత్రాల హోటల్లోని ఓ పెద్ద గదిలో. లెక్కకు మిక్కిలి మీడియా సిబ్బందితో ఆ గది నిండిపోయింది. ...అదే జట్టు. అదే కెప్టెన్. అదే కోచ్. కానీ 45 రోజుల వ్యవధిలో అంతా మారిపోయింది. 2017లో భారత మహిళల క్రికెట్ గురించి చెప్పుకోవాల్సి వస్తే ఈ తేడానే ప్రముఖంగా పేర్కొనాలి. ప్రపంచకప్లో వారి రన్నరప్ ప్రదర్శన అంత ప్రభావం చూపింది మరి. ఫైనల్లో ఓడినా...భారత మహిళల జట్టుకు స్వదేశంలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ మ్యాచ్లను ప్రత్యక్ష ప్రసారం చేయడంతో మరింత క్రేజ్ వచ్చింది. ఓవరాల్గా మహిళల క్రికెట్ జట్టుకు ఇది శుభ సంవత్సరమే. ఆడిన మూడు టోర్నీల్లోనూ ఫైనల్కు చేరి రెండింటిలో టైటిల్ నెగ్గింది. మొత్తం 20 మ్యాచ్ల్లో 16 గెలిచింది. -
రోజు 100 రన్స్ కొట్టలేం.. జీవితం కూడా అంతే..!
క్రికెట్లో ఒక మెయిన్ అంపైర్ ఉంటాడు.బౌలర్ వైపు వికెట్ వెనకాల నిలబడి ఉంటాడు.లెగ్ అంపైర్ ఉంటాడు.రైట్ హ్యాండ్ బ్యాట్స్మన్కు ఎడమవైపు నిలబడతాడు.వీరిద్దరూ కలిసి ఒక నిర్ణయం తీసుకోలేనప్పుడువీళ్లు సంప్రదించే మూడో అంపైర్నేథర్డ్ అంపైర్ అంటారు.క్రికెట్ ఆటకి ఈ ముగ్గురూ అంతిమ నిర్ణేతలు.మరి ఈ ఫోర్త్ అంపైర్ ఏంటి?తెలియని ఫోర్త్ డైమెన్షన్లో ఉన్న వ్యక్తి కాదు. ఫోర్త్ అంపైర్ మీలో ఉంటాడు.అదే మీ అంతరాత్మ.మంచా? చెడా? నిర్ణయించేది ఫోర్త్ అంపైర్.. మన అంతరాత్మ. గోల్ఫ్ క్లబ్లో ఆయన్ను చూసినప్పుడు హాబీగా ఆ క్రీడను ఎంచుకున్న వ్యక్తి కనపడడు. ప్రొఫెషనల్ గోల్ఫ్ క్రీడాకారుడే కనిపిస్తాడు. డ్రైవర్ ఉన్నప్పటికీ బ్యాటరీ కార్ను తనే డ్రైవ్ చేస్తూ గోల్ఫ్ మైదానంలో స్టీరింగ్ని తిప్పే ఆ చేతుల్ని చూస్తే... శ్రమించడం వాటికి అలవాటైపోయిందేమో అనిపిస్తుంది. బ్యాటరీ కార్ డ్రైవ్ చేస్తూనే సాక్షి ప్రతినిధితో కపిల్ సంభాషించారు. తన అనుభవసారాన్ని పంచారు. క్రికెట్ అనే ఆట భారతీయులకు ఇంత చేరువ అవడానికి కారణం అతను. దాదాపు మూడున్నర దశాబ్దాల క్రితమే ప్రపంచ కప్ను భారతదేశానికి తీసుకొచ్చాడాయన. యావద్భారతావనికి హీరో అయ్యాడు. తానెంతో ప్రేమించే, తను శ్వాసించే, జీవించే క్రికెట్ ఆయనకు ఎంత పేరు తెచ్చిందో అంతే బాధపెట్టింది. మ్యాచ్ ఫిక్సింగ్ ముద్రవేసి అందరి ముందూ కన్నీళ్లు పెట్టించింది. క్రికెట్కు పేరు ప్రఖ్యాతులు, ఇంత డబ్బు, ఇంత ఆదరణ లేని రోజుల్లో ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకుని ఆ ఆటను ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లిన ఈ ప్రపంచపు మేటి ఆల్రౌండర్తో విధి అంతకు మించిన ఆట ఆడుకుంది. అయినప్పటికీ ఆయన ఎప్పటికప్పుడు దాన్ని ఎదిరిస్తూనే ఉన్నాడు. అనితరసాధ్యమైన స్ఫూర్తిని భావితరాలకు అందిస్తూనే ఉన్నాడు. ఈ రోజున మనం చూస్తున్న ఎందరో క్రికెట్ వీరుల భవిష్యత్తుకు రాచబాట వేసిన ఆయన ‘దైవం’ ఎవరు? ఆయన నమ్మేది? కొలిచేది ఎవరిని? కృష్ణపట్నం పోర్టు గోల్ఫ్ చాంపియన్ షిప్ పోటీల కోసం హైదరాబాద్కు వచ్చిన కపిల్దేవ్.. సాక్షి ‘నాదైవం’ శీర్షిక కోసం తన మనోభోవాలు పంచుకున్నాడు. మా సాక్షిలో నా దైవం అని ఒక కాలమ్ ఉంది సార్... దాని గురించి మీరు మాట్లాడాలి... కపిల్: దైవం అనేది పూర్తిగా వ్యక్తిగతం. దాని గురించి ఎవరితోనైనా ఏం పంచుకుంటాం? అది మానసికం కదా. మీరు దేవుడ్ని నమ్ముతారా? ఐ డోంట్ నో... దిసీజ్ వెరీ ట్రిక్కీ క్వశ్చన్. (గమ్మల్తైన ప్రశ్న) నమ్ముతా అంటే మీరు చూశారా అనే ప్రశ్న వేస్తారేమో. ఎందుకంటే నేను అమ్మానాన్నలను చూశా కానీ దేవుడ్ని చూడలేదు. నేనే కాదు నాకు తెలిసి ఇంత వరకూ దైవాన్ని ఎవరూ చూడలేదు. కాకపోతే అదొక నమ్మకం. జీవితంలో నమ్మకం అనేది చాలా ముఖ్యమైన విషయం. దేవుడు ఉన్నాడో లేదో కానీ ఆ నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకం మనకు బలాన్ని అందిస్తే అది చేసే మంచి ఉంటుంది చూశారూ... అది చాలు. మీ బయోగ్రఫీ పుస్తకం పేరులో కూడా దేవుడి ప్రస్తావన ఉంది... బై గాడ్స్ డిక్రీ...గురించా? నా జీవితం మీద ఇప్పటికి 3 బయోగ్రఫీలు వచ్చాయి. అందులో ఒక బయోగ్రఫీ రాసిన ఓ రచయిత పెట్టుకున్న పేరది. అది నా పర్సెప్షన్ కాదు. మీ చిన్నతనంలో నమ్మకాలెలా ఉండేవి? వూ....చిన్నవయసులో ఉన్నప్పుడు నువ్వేం చేస్తున్నావో నీకు తెలీదు. చాలా వరకూ నువ్వేంటో నీకే తెలీదు. తొలి 20ఏళ్లలోపు జనం నీ గురించి ఏమంటున్నారో అదే నమ్ముతావు. అక్కణ్ణుంచే నిదానంగా నిన్ను నువ్వు తెలుసుకోవడం మొదలుపెడతావు. ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకుంటావు. అన్నింటి గురించి ముఖ్యంగా నీ గురించి నువ్వు తెలుసుకున్నాక జీవితం చాలా డిఫరెంట్ గా మారుతుంది. అది జీవితానికి చాలా ముఖ్యమైన దశ. ఎప్పుడైతే నిన్ను నువ్వు తెలుసుకుంటున్నావో అక్కడి నుంచి నీ లైఫ్ చాలా కొత్తగా మారుతుంది. అయితే అందరికీ అది ఒకే వయసులో జరగాలని లేదు. ఒక్కొక్కరికి ఏ వయసులో అయినా జరగొచ్చు. ఊహ తెలిశాక...ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్... నీ ఆలోచనా ధోరణి మారుతూ ఉంటుంది. ప్రపంచం అంతా తిరుగుతుంటావు. ఎందరినో కలుసుకుంటావు. ఎప్పుడైతే నువ్వు ఎవరో నువ్వు తెలుసుకున్న దశ... అదే తర్వాతి జీవితానికి సరైన దిశ చూపుతుంది. ప్రేమ గురించి... ఇది కూడా నమ్మకమే. నీ పిల్లలు నిన్ను ప్రేమిస్తున్నారని, నీ ఫ్యామిలీ నీకు ఉందని నమ్ముతావు. నీ కుటుంబం నిన్ను ప్రేమిస్తుందని నమ్ముతావు. నమ్మకం అనేది జీవితంలో చాలా ముఖ్యమైన విషయం. ఆలయాలను సందర్శిస్తుంటారా? ఎందుకు వెళ్లను? చాలా సార్లు ఆలయాలకు వెళ్లాను. మరోసారి చెబుతున్నాను. ఈ లోకంలో కళ్లారా చూడకపోయినా నమ్మే విషయం దైవం ఒక్కటే. దేవుడున్నాడు అనే నమ్మకం మీద ఎంతో మంది శక్తివంతంగా మారుతున్నారు. అందులో సందేహం లేదు. తొలిసారి ఎవరిని పూజించారో గుర్తుందా? హహహ... తొలిసారి చూసిన, ప్రార్థించిన దైవం అంటే చెప్పలేను. ఎవరైనా అలాంటిది గుర్తుంచుకుంటారని అనుకోను. ఏ దేవుడంటే అమితమైన ఇష్టం... హిందూ కుటుంబాల్లో ఒక దేవుడు లేడు. ఎందరో ఉన్నారు. రాముడు, కృష్ణుడు, జీసస్, అల్లా, గురునానక్ దేవ్జీ... వీళ్లందరినీ మనం పూజిస్తాం. ఎవరైనా సరే గాడ్ ఈజ్ గాడ్. అయితే వీరంతా మానవులుగానే పుట్టారు. జీవితాన్ని తెలుసుకున్నారు. వీరంతా దేవుళ్లు అని మనం నమ్ముతాం. అనుసరిస్తాం. నేను ఏవేవో కావాలని కోరుకుంటూ ప్రార్ధన చేయను. మంచి మనిషిగా ఉండటానికి ప్రయత్నిస్తాను. అంతే. కుటుంబ విషయంగా చెప్పాలంటే... మేం గురునానక్ని పూజిస్తాం. బాగా జోవియల్గా ఉంటున్నారు... పరిస్థితులు మిమ్మల్ని ఇలా మార్చాయా? ఇంతకుముందు నన్నెప్పుడైనా మీరు కలిశారా? కలిస్తే నాతో ఎంత సమయం ఉన్నారు? అలాంటిదేమీ లేదు కదా! మరి నేను ఇప్పుడే నవ్వుతూండటాన్ని అలవాటు చేసుకున్నానని ఎందుకు అనుకుంటున్నారు?.... జోవియల్గా ఉంటాను. అయితే అవసరమైనప్పుడు సీరియస్గా కూడా ఉంటాను. సరే... మానసిక ప్రశాంతతకి ఏం చేస్తారు? అసలు అందరూ పీస్ ఆఫ్ మైండ్ గురించి ప్రత్యేకంగా ఎందుకు మాట్లాడతారో నాకు అర్ధం కాదు. మనం చేసే పనుల ద్వారా అది మనకు అందదా! ప్రస్తుతం శని, ఆదివారాల్లో గోల్ఫ్ ఆడతాను. అది మాత్రమే కాదు నేను చేసే ప్రతి పనీ మానసిక ప్రశాంతతతోనే చేస్తాను. గడిపే ప్రతిక్షణాన్ని ప్రశాంతంగానే ఆస్వాదిస్తాను. లైఫ్లో చేదు అనుభవాలెన్నో ఎదుర్కొన్నారు. అలాంటి సందర్భాల్లో దైవాన్ని తలచుకున్న ఘటన.. ఇది జీవితం.. అన్నీ బావుంటాయని ఎప్పుడూ అనుకోలేం. అనుకోకూడదు కూడా! ఏ పిచ్ మీద అయినా ప్రతి రోజూ 100 రన్స్ కొట్టలేం. జీవితం కూడా అంతే. నాకు సంబంధించి జీవితంలో ఏవీ కష్టాలు కావు. అదొక జర్నీ. బ్యూటిఫుల్ జర్నీ. అంతే. దైవ ప్రార్థన అనేది... ఆటలో నైతిక బలం ఇస్తుందా? తప్పక ఇస్తుంది. ఆటలో అడుగు పెడుతున్నప్పుడల్లా దేవుడు ఎప్పుడూ నీకు తోడున్నట్టు భావించుకోవాలి. ఎందుకంటే క్రికెట్లో ఒక్క బాల్ చాలు. ఆ మ్యాచ్ని మన నుంచి దూరం చేయడానికి. ఉపవాసాలూ... వంటివి... దేవుడ్ని నమ్ముతాను. అయితే 24 గంటల పాటూ అది చేయకు, ఇది చేయకు అని చెప్పే ఛాందస ధోరణుల్ని నమ్మను. ఒకసారి నా సోదరుడితో ఈ రోజు నాన్వెజ్ తినకూడదురా అంది మా అమ్మ. దానికి మా వాడు ఎందుకు? అని ప్రశ్నించాడు. అంటే... ఇది దేవుడి రోజు అంది. అదేమిటి? అయితే మిగిలిన రోజులు దేవుడివి కావా? అని ప్రశ్నించాడు. మరి నిజంగా అయితే ప్రతి రోజూ దేవుడిదే కదా. – ఎస్.సత్యబాబు -
ఆసీస్ జట్టు సన్నాహాలు షురూ
చెన్నై: వరుస విజయాలతో ఫుల్ జోష్లో ఉన్న భారత క్రికెట్ జట్టును సొంతగడ్డపై ఎదుర్కొనేందుకు ఆస్ట్రేలియా జట్టు తమ సన్నాహాలను ప్రారంభించనుంది. ఇక్కడికి రాకముందు బంగ్లాదేశ్తో రెండు టెస్టులు ఆడి వచ్చిన ఆసీస్.. వన్డే ఫార్మాట్కు అలవాటు పడేందుకు నేడు బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టుతో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. భారత్తో జరగబోయే ఐదు వన్డేల సిరీస్కు ముందు స్పిన్లో తగిన ప్రాక్టీస్కు ఈ మ్యాచ్ను ఉపయోగించుకోనుంది. స్మిత్, వార్నర్, మ్యాక్స్వెల్ ఆసీస్ జట్టులో కీలకం కానున్నారు. ఇక బోర్డు ఎలెవన్లో ఆసీస్ను ఎదుర్కొన్న అనుభవం ఒక్క కెప్టెన్ గుర్కీరత్ సింగ్ మాన్కు మాత్రమే ఉంది. చాలామంది ఆటగాళ్లు దులీప్ ట్రోఫీలో ఆడుతుండటంతో ఎక్కువగా తృతీయ కేటగిరీ క్రికెటర్లను ఎంపిక చేశారు. ఐపీఎల్లో మెరిసిన రాహుల్ త్రిపాఠి, నితిష్ రాణా, వాషింగ్టన్ సుందర్ పటిష్ట జట్టుపై తమ సత్తా చూపించేందుకు ఎదురుచూస్తున్నారు. -
‘నైకీ’ నచ్చడం లేదు!
∙ టీమ్ కిట్పై భారత ఆటగాళ్ల ఫిర్యాదు ∙ కొత్త దుస్తులు పంపించిన నైకీ ముంబై: మైదానంలో అద్భుతమైన ఆటతో చెలరేగిపోతున్న భారత క్రికెట్ జట్టు ఇప్పుడు తమకు సంబంధించిన ఒక కొత్త ఫిర్యాదును ముందుకు తెచ్చింది. అధికారిక అపెరల్ పార్ట్నర్ ‘నైకీ’ తమకు అందజేస్తున్న కిట్లపై ఆటగాళ్లు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ప్రపంచంలోనే అత్యుత్తమ స్పోర్టింగ్ బ్రాండ్గా అగ్రస్థానంలో ఉన్న ‘నైకీ’ 2006 నుంచి భారత క్రికెట్ టీమ్కు భాగస్వామిగా వ్యవహరిస్తోంది. గత కొన్ని నెలలుగా వివిధ మ్యాచ్లలో తాము ధరిస్తున్న జెర్సీలు ‘నాసిరకంగా’ ఉన్నాయని కెప్టెన్ కోహ్లి సహా ఇతర ఆటగాళ్లు బీసీసీఐకి తెలియజేశారు. భారత క్రికెట్ జట్టుతో 2020 సెప్టెంబర్ వరకు కాంట్రాక్ట్ ఉన్న ‘నైకీ’... అందుకోసం గత ఏడాది బోర్డుకు రూ. 370 కోట్లు చెల్లించింది. మొత్తంగా తమ బ్రాండ్ను ధరిస్తున్నందుకు కాంట్రాక్ట్ అమల్లో ఉన్న సమయంలో జరిగే ఒక్కో అంతర్జాతీయ మ్యాచ్కు నైకీ దాదాపుగా రూ. 87 లక్షల 34 వేలు బీసీసీఐకి చెల్లిస్తోంది. భారత ఆటగాళ్ల ఫిర్యాదు గురించి తెలుసుకున్న ‘నైకీ’ వెంటనే స్పందించింది. తమ బ్రాండ్కు చెందిన కొత్త జెర్సీలు, ఇతర దుస్తులను బెంగళూరు నుంచి హడావిడిగా పంపించింది. పల్లెకెలె మైదానంలో మంగళవారం క్రికెటర్ల ఆప్షనల్ ప్రాక్టీస్ సమయానికి కిట్లు మైదానం చేరుకున్నాయి. నలుగురు సభ్యుల ‘నైకీ’ బృందం టీమిండియా ఆటగాళ్లు, అధికారులతో కూడా అక్కడే చర్చించింది. ధోని, రోహిత్ శర్మలు కొత్త జెర్సీలను పరిశీలించిన తమ అభిప్రాయాలు, సూచనలు వారికి తెలియజేశారు. కోహ్లి కోసమేనా... భారత కెప్టెన్గా, నంబర్వన్ ఆటగాడిగా శిఖరాన ఉన్న విరాట్ కోహ్లి ఇప్పుడు ఏం చేసినా, చెప్పినా అది చెల్లుబాటయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇటీవల కోచ్గా కుంబ్లేను తొలగించడం అలాంటి పరిణామమే. తాజాగా ‘నైకీ’ గురించి ఆటగాళ్లు గళమెత్తడం వెనక కూడా కోహ్లినే కారణమని వినిపిస్తోంది. బయటికి నాణ్యతాలోపం గురించి చెప్పినా అసలు విషయం కోహ్లి బ్రాండ్ ‘పూమా’కు ప్రయోజనం చేకూర్చే ప్రయత్నం చేస్తున్నట్లుగా అంతర్గత సమాచారం. ‘పూమా’తో గత ఫిబ్రవరిలో కోహ్లి రూ. 110 కోట్ల భారీ మొత్తానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇటీవలే అది అమల్లోకి వచ్చింది. అయితే ఉసేన్ బోల్ట్ సహా పలువురు స్టార్ ఫుట్బాలర్లు ‘పూమా’కు అంబాసిడర్లుగా ఉన్నా...నైకీ, అడిడాస్లతో పోలిస్తే ఆ బ్రాండ్ మార్కెట్ భారత్లో చాలా తక్కువ. దానిని పెంచుకునే ప్రయత్నంలోనే అది కోహ్లిని ఎంచుకుంది. భారత్లో ఎక్కువ మందికి చేరువ కావాలంటే క్రికెట్తో జత కట్టాల్సిన అవసరాన్ని ‘పూమా’ గుర్తించింది. నంబర్వన్ బ్రాండ్ను పదేళ్లకు పైగా వాడుతున్న తర్వాత జెర్సీల నాణ్యత గురించి ఆటగాళ్లు ప్రశ్నించడం నిజంగా ఆశ్చర్యకరం. ఈ సాకుతో ఒప్పందంలో ఉన్న ‘అవసరమైతే కాంట్రాక్ట్ను రద్దు చేయవచ్చు’లాంటి క్లాజ్ను ఉపయోగించించి ఇప్పుడు నైకీని కూడా పక్కన పెడతారా, ఆ తర్వాత కోహ్లి కోరితే పూమాను ముందుకు తెస్తారా అనేది చూడాల్సిందే. -
ఒలింపిక్స్కు దూరమే!
►ఆసక్తి చూపించని బీసీసీఐ ►సీఓఏతో సమావేశంలో చర్చ ►ఇక నుంచి సెలక్టర్లకూ నగదు ప్రోత్సాహకాలు న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు ఒలింపిక్స్లో పాల్గొనే అవకాశాలు దాదాపుగా లేనట్లే! భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పెద్దలకు ఇది ఇష్టం లేకపోవడమే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. బుధవారం జరిగిన బీసీసీఐ ఆఫీస్ బేరర్లు, క్రికెట్ పరిపాలకుల కమిటీ (సీఓఏ) సమావేశంలో దీనిపై విస్తృతంగా చర్చ జరిగినా సభ్యులు ఎలాంటి నిర్ణయానికి రాలేకపోయారు. త్వరలో జరిగే బోర్డు సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలని మాత్రం ఈ భేటీలో తీర్మానించారు. అయితే బోర్డు వర్గాల సమాచారం ప్రకారం... ఒలింపిక్స్లో పాల్గొనకూడదనే తమ ఆలోచనలో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చని తెలుస్తోంది. ‘ఒలింపిక్స్లో పాల్గొనాలంటే ఒలింపిక్ చార్టర్ను ఆమోదించాల్సి ఉంటుంది. అప్పుడు ప్రభుత్వ పరిధిలోని ఒక జాతీయ క్రీడా సమాఖ్యగా బీసీసీఐ మారిపోవాలి. పైగా నిబంధనల ప్రకారం ‘వాడా’ పరిధిలోకి కూడా రావాలి. దీనికి మన క్రికెటర్లు కూడా వ్యతిరేకం. ఇలాంటి సమస్యల మధ్య మేం ఒలింపిక్స్లో భాగం కావాలని అనుకోవడం లేదు’ అని బోర్డు ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. చాలా కాలంగా ఒలింపిక్స్లో క్రికెట్ను చేర్పించేందుకు ఐసీసీ ప్రయత్నం చేస్తున్నా కేవలం బీసీసీఐ అనాసక్తి కారణంగా ఈ అంశం లో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. రూ. 15 లక్షల చొప్పున... బీసీసీఐ–సీఓఏ సమావేశంలో మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇటీవల చాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్కప్లలో ఫైనల్కు చేరుకున్న పురుషుల, మహిళల జట్లను ఎంపిక చేసిన సెలక్షన్ కమిటీలకు కూడా నగదు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు. కమిటీలలోని ఒక్కో సభ్యుడికి రూ. 15 లక్షల చొప్పున నజరానా అందజేస్తారు. దేశవాళీ ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులు పెంచే అంశంపై బోర్డు కోశాధికారి విధి విధానాలు రూపొందిస్తున్నారని సీఓఏ సభ్యురాలు డయానా ఎడుల్జీ వెల్లడించారు. ఐపీఎల్ ముగిసిన తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ల కోసం కనీసం 15 రోజుల విరామం ఉండేలా చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు. భారత ‘ఎ’, అండర్–19 జట్లకు ప్రత్యేకంగా మేనేజర్ను ఎంపిక చేయాల్సిన అవసరం లేదని భావించిన బీసీసీఐ... పేసర్ శ్రీశాంత్కు సంబంధించి కేరళ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల అంశంలో న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలని నిర్ణయించింది. మరోవైపు వ్యాఖ్యాతలుగా భారీ ఆదాయం పొందుతున్న సునీల్ గావస్కర్, సంజయ్ మంజ్రేకర్, మురళీ కార్తీక్, హర్షా భోగ్లే తాము లోధా కమిటీ సిఫారసుల ప్రకారం ‘కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్’ పరిధిలోకి రావడం లేదని స్వయంగా హామీ పత్రం అందజేయాలని కూడా ఈ సమావేశంలో తీర్మానించారు. అజహర్ అంశం జనరల్ బాడీకే... బీసీసీఐ నుంచి తనకు రావాల్సిన బకాయిలు, ఆర్థిక పరమైన ప్రయోజనాలు అందజేయాలంటూ మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్ రాసిన లేఖపై బుధవారం బోర్డు సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగింది. అయితే దీనిపై కూడా బీసీసీఐ–సీఓఏ ఎలాంటి నిర్ణయానికి రాలేకపోయింది. ‘అజహర్ అంశాన్ని మేం తీవ్రంగా చర్చించాం. మా న్యాయ నిపుణులు కూడా తమ సూచనలు ఇచ్చారు. అయితే దీనిపై తుది నిర్ణయం సర్వసభ్య సమావేశంలోనే తీసుకోవాలని తీర్మానించాం’ అని బోర్డు తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా చెప్పారు. వినోద్రాయ్, డయానా ఎడుల్జీ -
హైదరాబాద్లో టి20, వైజాగ్లో వన్డే
►నాలుగు నెలల్లో స్వదేశంలో 23 అంతర్జాతీయ మ్యాచ్లు ►షెడ్యూల్ ప్రకటించిన బీసీసీఐ కోల్కతా: సొంతగడ్డపై కొత్త సీజన్లో భారత క్రికెట్ జట్టు ఫుల్ బిజీ బిజీ! ప్రస్తుతం కొనసాగుతున్న శ్రీలంక పర్యటన ముగిసిన వెంటనే సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు భారత్లో విరామం లేకుండా క్రికెట్ హోరెత్తించనుంది. ఈ నాలుగు నెలల కాలంలో భారత్లో ఏకంగా 23 అంతర్జాతీయ మ్యాచ్లు జరగనున్నాయి. ముందుగా ఆస్ట్రేలియా, ఆ తర్వాత న్యూజిలాండ్ పరిమిత ఓవర్ల సిరీస్లలో పాల్గొనేందుకు మన వద్దకు రానుండగా... ఆ తర్వాత వన్డేలు, టి20లతో పాటు టెస్టులు ఆడేందుకు శ్రీలంక ఇక్కడ అడుగు పెడుతుంది. దీనికి సంబంధించి పూర్తి షెడ్యూల్ను మంగళవారం బీసీసీఐ టూర్స్ అండ్ ఫిక్చర్స్ కమిటీ ప్రకటించింది. ఇందులో భాగంగా భారత్, ఆస్ట్రేలియాల మధ్య ఒక టి20 మ్యాచ్కు హైదరాబాద్ నగరం వేదిక కానుండగా... భారత్, శ్రీలంక మధ్య వన్డే మ్యాచ్కు విశాఖపట్నం ఆతిథ్యం ఇస్తుంది. కొత్తగా నిర్మించిన బర్సపర (గువా హటి), తిరువనంతపురం స్టేడియాలకు కూడా ఒక్కో మ్యాచ్ను కేటాయించారు. ఈ మ్యాచ్లకు సంబంధించిన తేదీలపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. దేశవ్యాప్తంగా వేర్వేరు నగరాల్లో మ్యాచ్లు ఉన్నాయని... స్థానిక పండుగలు, సెలవు దినాలువంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని తర్వాత తేదీలు ఖరారు చేస్తామని బోర్డు తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి వెల్లడించారు. రంజీ ట్రోఫీ ఫార్మాట్లో మార్పులు భారత దేశవాళీ క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీ నిర్వహణకు సంబంధించి బీసీసీఐ కొన్ని కీలక మార్పులు చేసింది. సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని సాంకేతిక కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. గత ఏడాది నిర్వహించిన తటస్థ వేదికల పద్ధతిపై తీవ్ర విమర్శలు రావడంతో దానికి స్వస్తి చెప్పారు. గతంలోలాగే కొన్ని హోం మ్యాచ్లు, కొన్ని బయటి మ్యాచ్ల పద్ధతితో టోర్నీని నిర్వహిస్తారు. అయితే నాకౌట్ మ్యాచ్లు మాత్రం తటస్థ వేదికల్లోనే జరుగుతాయి. అక్టోబర్ 6న రంజీ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు 28 జట్లతో మూడు గ్రూప్లలో మ్యాచ్లు నిర్వహించారు. ఈసారి దీనిని మారుస్తూ మొత్తం జట్లను నాలుగు గ్రూప్లు ఎ, బి, సి, డి లుగా విభజిస్తున్నారు. ఒక్కో గ్రూప్లో 7 జట్లు ఉండగా, ప్రతీ జట్టు లీగ్ దశలో ఆరు మ్యాచ్లు ఆడుతుంది. ప్రతీ గ్రూప్లో టాప్–2 టీమ్లు క్వార్టర్ ఫైనల్స్కు అర్హత సాధిస్తాయి. ఈ ఫార్మాట్ వల్ల రంజీ ట్రోఫీ మొత్తం మ్యాచ్ల సంఖ్య తగ్గనుంది. మరోవైపు ఈ సారి కూడా దులీప్ ట్రోఫీ మ్యాచ్ను గులాబీ బంతితోనే నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. -
అన్నీ మరచి ఆటపై దృష్టి!
-
అన్నీ మరచి ఆటపై దృష్టి!
►ఇటీవలి పరిణామాలు జట్టుపై ప్రభావం చూపించవు ►ఫలితాలు సాధించడమే కీలకం: భారత కెప్టెన్ కోహ్లి ►కోచ్ల కంటే ఆటగాళ్లు ముఖ్యం: రవిశాస్త్రి ►శ్రీలంక చేరిన భారత జట్టు చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఘోర పరాజయం తర్వాత భారత క్రికెట్ జట్టుకు సంబంధించిన వార్తల్లో క్రికెట్ వెనక్కి వెళ్లిపోగా... వివాదాలు, విమర్శలు వెల్లువలా వచ్చి పడ్డాయి. ఒకవైపు ఎవరూ పట్టించుకోకుండా విండీస్ సిరీస్ సాగిపోగా... మరోవైపు కెప్టెన్, కోచ్ విభేదాలు, అనిల్ కుంబ్లే అనూహ్య రాజీనామా అనంతరం కొత్త కోచ్ ఎంపిక ప్రహసనంలాంటి అంశాలతో అంతా గందరగోళంగా సాగింది. సరిగ్గా నెల రోజుల పాటు సాగిన ఈ పరిణామాలను మరచి ఇప్పుడు ఆట వైపు మళ్లాల్సిన సమయం ఆసన్నమైంది. కెప్టెన్ కోరుకున్న కోచ్, కోచ్ కోరుకున్న సహాయక బృందంతో కలిసి భారత్ ఇప్పుడు శ్రీలంక పర్యటన నుంచి కొత్త ఆరంభం దిశగా అడుగులు వేసేందుకు సిద్ధమైంది. ముంబై: భారత క్రికెట్లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలతో తనపై ఎలాంటి అదనపు ఒత్తిడి ఉండదని కెప్టెన్ విరాట్ కోహ్లి వ్యాఖ్యానించాడు. మైదానం బయట చోటు చేసుకునే ఘటనలు జట్టుపై ప్రభావం చూపించవని అతను స్పష్టం చేశాడు. మూడు టెస్టులు, ఐదు వన్డేల సిరీస్ కోసం బుధవారం భారత జట్టు శ్రీలంకకు వెళ్లింది. ఈ నెల 26 నుంచి భారత్, శ్రీలంక మధ్య తొలి టెస్టు జరుగుతుంది. జట్టు బయల్దేరడానికి ముందు కోహ్లి మీడియాతో ముచ్చటించాడు. ‘కొన్ని సార్లు ఏం జరగాలో అది కచ్చితంగా జరిగి తీరుతుందని నేను నమ్ముతాను. ఇలాంటి వాటి వల్ల నాపై అదనపు ఒత్తిడి ఏమీ ఉండదు. ఒక జట్టుగా ఏం సాధించాలనే దానిపైనే మేం దృష్టి పెడతాం. గతంలోనూ అందరూ క్లిష్ట పరిస్థితులను అధిగమించారు. విమర్శలకు గురి కావడం మాకు కొత్త కాదు. నా బాధ్యతలను నేను ఎప్పుడూ భారంగా భావించను’ అని కోహ్లి స్పష్టం చేశాడు. తాను కెప్టెన్గా ఉన్నంత వరకు ఎలాంటి బాధ్యత ఇచ్చినా దానిని నెరవేరుస్తానని, పాత విషయాలను మనసులోంచి తుడిచేసి ముందుకు సాగాల్సిన అవసరం ఉందని అతను అన్నాడు. కుంబ్లేతో విభేదాల గురించి నేరుగా వ్యాఖ్యానించకపోయినా... పరోక్షంగా తన వ్యాఖ్యలతో కోహ్లి ‘సమన్వయం’ ఎలా ఉంటుందో గుర్తు చేయడం విశేషం. ‘ఇద్దరు వ్యక్తుల మధ్య అవగాహన అనేది ఆటలోనే కాదు జీవితంలో కూడా బాగా పని చేస్తుంది. నేను దానిని పాటిస్తాను. ప్రతీ ఒక్కరికి జీవితంలో సంబంధాలు కొనసాగించే విషయంలో ఈ తరహా అనుభవాలు ఎదురయ్యే ఉంటాయి. సహకారం, సమన్వయం ఎంత కీలకమో అప్పుడే తెలుస్తుంది’ అని విరాట్ విశ్లేషించాడు. 2015లో శ్రీలంకతో ఆడిన సిరీస్ నుంచే భారత్ వరుస విజయాల జోరు మొదలైంది. నాటితో పోలిస్తే ఈ రెండేళ్లలో ఆటగాళ్లు మరింత పరిణతి చెందారని, తమపై తాము విశ్వాసం ఉంచడం వల్లే ఈ ఫలితాలు వచ్చాయని కోహ్లి అభిప్రాయపడ్డాడు. సచిన్ కూడా కావాలన్న శాస్త్రి! భారత సహాయక సిబ్బంది ఎంపికకు సంబంధించి రవిశాస్త్రి, బీసీసీఐ ప్రత్యేక కమిటీ మధ్య జరిగిన చర్చల గురించి ఒక ఆసక్తికర అంశం తాజాగా వెలుగులోకి వచ్చింది. జట్టు సలహాదారుడిగా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఉంటే బాగుంటుందని ఈ సమావేశంలో శాస్త్రి సూచించారు. అదే జరిగితే సచిన్ ‘కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్’ పరిధిలోకి వచ్చే అవకాశం ఉండేది. తాత్కాలిక ప్రాతిపదికన కొద్ది రోజుల కోసం సలహాదారుడిగా పని చేసినా... సచిన్ ఐపీఎల్ సహా తన ఇతర అనేక ఒప్పందాలకు దూరం కావాల్సి ఉంటుంది. దాంతో ఈ ప్రతిపాదనకు బీసీసీఐ కమిటీ బ్రేక్ వేసింది. నేను చాలా మారిపోయాను.... హెడ్ కోచ్ హోదాలో రవిశాస్త్రి కూడా తొలిసారి మీడియాతో మాట్లాడి తన అభిప్రాయాలు వెల్లడించారు. భారత క్రికెట్ వ్యవస్థలో ఎంతో మంది వచ్చి వెళుతుంటారని, వారికంటే ఆట ముఖ్యమని ఆయన అన్నారు. కోచ్లకంటే కూడా ఆటగాళ్లు కీలకమని గుర్తు చేశారు. ‘ఇటీవలి ఘటనల బరువును నా నెత్తిన పెట్టుకొని నేను రాలేదు. గత మూడేళ్లుగా భారత జట్టు చాలా బాగా ఆడుతోంది. గొప్పతనమంతా ఆటగాళ్లదే. రవిశాస్త్రి కావచ్చు, కుంబ్లే కావచ్చు ఎవరైనా వచ్చి వెళుతుంటారు. భారత్ నంబర్వన్ అయిందంటే అది ఆటగాళ్ల శ్రమ వల్లే తప్ప కోచ్ల వల్ల కాదు. ఎవరు ఉన్నా లేకున్నా భారత క్రికెట్ స్వరూపంలో మార్పుండదు’ అని శాస్త్రి వ్యాఖ్యానించారు. గతంలో శ్రీలంకలో పర్యటించడంతో పోలిస్తే తనలో చాలా మార్పు వచ్చిందని, గత మూడు వారాల్లో అయితే తాను మరింత పరిణతి చెందానని ఆయన చెప్పారు. తాను పట్టుబట్టి తీసుకున్న బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్పై శాస్త్రి ప్రశంసలు కురిపించారు. ‘దాదాపు పదిహేనేళ్లు ఆయన కోచింగ్లోనే గడిపారు. ఇండియా ‘ఎ’, అండర్–19 స్థాయిలో అరుణ్ మంచి ఫలితాలు సాధించారు. 2015 వరల్డ్ కప్లో మన బౌలర్లు ఎనిమిది మ్యాచ్లలో 77 వికెట్లు తీశారు. ఆటగాడిగా చెప్పుకోదగ్గ రికార్డు లేకపోవడం వల్లే ఆయనను ఎవరూ పట్టించుకోవడం లేదు. లేకపోతే అతని గురించి గొప్పగా చెప్పేవారు. నేను చెప్పడంకంటే అంతా అతడి పనితీరును చూస్తే బాగుంటుంది’ అని హెడ్ కోచ్ సమర్థించారు. శాస్త్రి నాకు సరి జోడి! హెడ్ కోచ్ రవిశాస్త్రితో కలిసి పని చేయడంలో తనకు ఎలాంటి ఇబ్బంది ఎదురు కాకపోవచ్చని కోహ్లి అన్నాడు. గతంలోనూ తమ మధ్య మంచి సమన్వయం కొనసాగిందని అతను గుర్తు చేశాడు. ‘2014 నుంచి 2016 వరకు వరుసగా మూడేళ్ల పాటు కలిసి పని చేశాం. కాబట్టి మంచి అవగాహన ఉండటం సహజం. కొత్తగా నేను ఆయనను అర్థం చేసుకోవడానికేమీ లేదు. ఒకరి నుంచి మరొకరం ఏం ఆశిస్తున్నామో, అందుబాటులో ఎలాంటి వనరులు ఉన్నాయో ఇద్దరికీ బాగా తెలుసు. సమన్వయం కోసం కొత్తగా ప్రయత్నించాల్సిన అవసరం లేదు’ అని కోహ్లి తన భావాన్ని ప్రకటించాడు. -
కుంబ్లే ‘శిక్షణ’ ముగిసింది
⇔ హెడ్ కోచ్ పదవికి రాజీనామా ⇔ విండీస్ పర్యటనకు దూరం ⇔ పంతం నెగ్గించుకున్న కోహ్లి భారత క్రికెట్ జట్టులో నివురుగప్పిన నిప్పులా ఉన్న వివాదం చివరకు మంటలు రేపింది. ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవని నిరూపిస్తూ కెప్టెన్, కోచ్ కలహాల కాపురం ఏడాది కాలానికే ముగిసింది. విభేదాలు లేవంటూ గత మూడు వారాలుగా మాటలతో సాగదీసినా, చివరకు పరిస్థితి చేయి దాటిపోయే స్థాయికి అవి చేరిపోయాయి. కోచ్ అనిల్ కుంబ్లేతో కలిసి ముందుకు వెళ్లలేనంటూ కెప్టెన్ కోహ్లి కుండ బద్దలు కొట్టిన మూడు రోజులకు అనివార్య పరిణామం చోటు చేసుకుంది. తనను కాదనుకునే వారితో తానూ కొనసాగలేనంటూ కుంబ్లే కోచ్ పదవి నుంచి తప్పుకున్నారు. తన కాంట్రాక్ట్ ముగియడంతో రాజీనామా చేస్తున్నట్లు బోర్డుకు సమాచారమిచ్చారు. కుంబ్లేను కొనసాగించాలంటూ సలహా కమిటీ సభ్యులు సచిన్, గంగూలీ, లక్ష్మణ్లు సిఫారసు చేసినా తన వల్ల కాదంటూ అనిల్ కుంబ్లే తప్పుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ముంబై: ఒకరు సూపర్ స్టార్ హోదా ఉన్న కెప్టెన్... మరొకరు దిగ్గజ ఆటగాడు... వీరిద్దరు కలిస్తే అద్భుతాలు ఖాయమని అంతా భావించారు. నిజంగానే ఫలితాలు అదే తరహాలో వచ్చాయి. కానీ వాటి వెంట వీరిద్దరు సొంత ‘అహం’ కూడా మోసుకొచ్చారు. ఫలితంగా ఇద్దరు కలిసి పని చేయలేని పరిస్థితి వచ్చేసింది. చివరకు కెప్టెన్ పంతమే నెగ్గింది. కోచ్ తప్పనిసరిగా తప్పుకోవాల్సి వచ్చింది. భారత జట్టు హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కాంట్రాక్ట్ ప్రకారం ఆయన పదవీ కాలం ముగుస్తున్న మంగళవారం రోజే కుంబ్లే తన నిర్ణయాన్ని వెల్లడించారు. కుంబ్లే ఇష్టపడితేనే విండీస్ పర్యటనకు వెళతారని ఇటీవలే సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ వెల్లడించారు. నిజంగానే కుంబ్లే కొనసాగేందుకు ఆసక్తి చూపించలేదు. దాంతో కోచ్ లేకుండా టీమిండియా విండీస్ పయనమైంది. ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్గా ఉన్న కుంబ్లే, ఈ నెల 23 వరకు సాగే ఆ సమావేశాల్లో పాల్గొనేందుకే విండీస్ వెళ్లడం లేదని మొదట్లో భావించినా... అది అసలు కారణం కాదని ఇప్పుడు అర్థమైంది. కుంబ్లే రాజీనామాను నిర్ధారించిన బీసీసీఐ, విండీస్ పర్యటనలో జట్టును పర్యవేక్షించేందుకు మేనేజర్గా హైదరాబాద్ మాజీ రంజీ క్రికెటర్ డాక్టర్ ఎంవీ శ్రీధర్ వెళుతున్నట్లు ప్రకటించింది. ఈ సిరీస్కు బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్, ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ జట్టుతో పాటు ఉంటారు. మున్ముందు కొత్త కోచ్ ఎంపిక విషయంలో కూడా క్రికెట్ సలహా కమిటీ సూచనలు తీసుకుంటామని బోర్డు వెల్లడించింది. పరిణామాలు వేగంగా...: భారత జట్టు చాంపియన్స్ ట్రోఫీకి బయల్దేరే ముందే కోచ్, కెప్టెన్ మధ్య విభేదాలు ఉన్నాయంటూ వార్తలు వచ్చాయి. కుంబ్లే ‘శైలి’ శిక్షణ తమకు చాలా ఇబ్బందికరంగా మారిందని జట్టులో కొందరు ఆటగాళ్లు ఫిర్యాదు చేశారు. కనీసం పది మంది కుంబ్లేకు వ్యతిరేకంగా ఉన్నట్లు వినిపించింది. దీనిని బీసీసీఐ పెద్దలతో పాటు కోహ్లి కూడా ఖండించాడు. సరిగ్గా టోర్నీకి ముందు కొత్త కోచ్ కోసం బోర్డు దరఖాస్తులు ఆహ్వానించడం కూడా అనుమానాలు రేకెత్తించింది. అయితే టోర్నీ మొదలయ్యాక అందరి దృష్టి ఆటపైనే నిలిచింది. ప్రాక్టీస్ సెషన్ల సమయంలో ఇద్దరి మధ్య పెద్దగా మాటలు లేకున్నా ఫోకస్ అంతా సన్నద్ధతపైనే సాగింది. అయితే టోర్నీ ముగిశాక మరోసారి ముందుకొచ్చిన ఈ అంశం కుంబ్లే నిష్క్రమణ దాకా సాగింది. శనివారం కోహ్లితో సమావేశమైన సలహా కమిటీ సభ్యులు, బోర్డు అధికారులు సోమవారం కుంబ్లేతో కూడా మాట్లాడారు. ఈ భేటీలో కుంబ్లే ఆసాంతం ‘నాకు, కోహ్లికి మధ్య ఎలాంటి సమస్యా లేదు’ అనే చెబుతూ వచ్చారు. అయితే కోహ్లి తమతో చెప్పిన విషయాలన్నీ కుంబ్లే ముందు ఏకరువు పెట్టడంతో కథ మారిపోయింది. అంతా విన్న తాను ఇక కొనసాగలేనంటూ తేల్చి చెప్పినట్లు సమాచారం. ఇప్పుడు కొత్త కోచ్ వేటలో అందరి దృష్టి మరో మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్పై నిలిచింది. విధ్వంసకర ఆటగాడిగా గుర్తింపు ఉన్నా, కోచ్గా అతను ఏ మాత్రం పనికొస్తాడో చెప్పలేం. టామ్ మూడీ, లాల్చంద్ రాజ్పుత్, రిచర్డ్ పైబస్, దొడ్డ గణేశ్ కూడా కోచ్ రేసులో ఉన్నారు. ఎవరికి నష్టం? కోచ్ జాన్రైట్తో కలిసి చక్కటి ఫలితాలు సాధించిన కెప్టెన్ గంగూలీకి గ్రెగ్ చాపెల్తో మాత్రం ఎందుకు పడలేదు? సచిన్, కపిల్ల మధ్య సమన్వయం ఎందుకు కుదరలేదు? రైట్తో పోలిస్తే చాపెల్ దిగ్గజ బ్యాట్స్మన్లలో ఒకడు. గంగూలీకంటే అద్భుతమైన రికార్డు అతనిది. రైట్ సర్దుకుపోగా... చాపెల్తో ‘ఇగో’ సమస్యలు వచ్చాయి. సచిన్, కపిల్ విషయం కూడా ఇంతే. ఇద్దరు అగ్రశ్రేణి వ్యక్తులు కలిసి పని చేస్తే ఎదురులేని ఫలితాలు సాధించవచ్చని అనిపిస్తుంది. కానీ దాంతోపాటు సర్దుబాటు సమస్య కూడా ఉంటుంది. కోచ్, కెప్టెన్లలో ఇద్దరికీ సొంత ఆలోచనలు ఉంటాయి. ఒకరికి సరైనదిగా అనిపించింది మరొకరికి తప్పుగా తోచవచ్చు. విభిన్న అభిప్రాయాలు ఉండటంలో తప్పు లేదు అంటూ ఇద్దరూ గొడవ లేకుండా పని చేసే ప్రయత్నం చేస్తారు. కానీ రాన్రానూ అది అసాధ్యంగా మారిపోతుంది. కోహ్లి, కుంబ్లే మధ్య కూడా అదే జరిగింది. కోహ్లి ఆటగాళ్లకు స్వేచ్ఛను కోరుకునే రకం. అందుకే అతను ‘ఫ్రెండ్లీ’ రవిశాస్త్రిలాంటి వ్యక్తిని కోచ్గా కావాలనుకున్నాడు. కానీ ఏ స్థాయి ఆటగాడైనా శ్రమించేందుకు వెనుకాడవద్దనేది కుంబ్లే తత్వం. అందుకే ఆటగాళ్లంతా కలిసి అతడిని ‘హెడ్ మాస్టర్’గా చిత్రీకరించారు. ఆ కఠోర సాధన తమ వల్ల కాదని చేతులెత్తేశారు. ఈ మైదానంలోని అంశాలు కాకుండా ఇద్దరి మధ్య విభేదాలకు ‘వ్యక్తిగత’ కారణాలు ఏమైనా ఉన్నాయేమో ప్రస్తుతానికైతే తెలీదు. మధ్యలో అగ్నికి ఆజ్యం పోసినట్లుగా బీసీసీఐ అధికారులు తమ పాత్ర పోషించారు. కోచింగ్తో సరిపెట్టకుండా ఆటగాళ్ల ఫీజు పెంచడంవంటి అంశాల్లో దూకుడుగా ముందుకు వెళ్లటం వారిలో చాలా మందికి నచ్చలేదు. దాంతో రోగి కోరిందే వైద్యుడు ఇచ్చాడు అన్నట్లుగా... ఇటు తన మాటే చెల్లుబాటు కావాలనుకుంటున్న కోహ్లి వ్యతిరేకతకు బోర్డు ఆలోచన కూడా తోడై కుంబ్లేను సాగనంపారు. క్రికెట్లో కోచ్ పాత్ర తక్కువే కావచ్చు... కానీ ఆటగాడిగా, కెప్టెన్గా ‘జెంటిల్మెన్’ ఇమేజ్ సంపాదించిన కుంబ్లే కోచ్గా ఉండటం జట్టుకు కచ్చితంగా మేలు చేసే విషయం. అతని సేవలను కోల్పోతే నష్టపోయేది కుంబ్లే మాత్రం కాదు. మాజీ క్రికెటర్ బిషన్ సింగ్ బేడి తాజా పరిణామాన్ని విశ్లేషిస్తూ ‘ఆత్మగౌరవం ఉన్న కుంబ్లే లాంటి వ్యక్తి అక్కడ పని చేయలేడు. అతనిపై తిరుగుబాటు చేస్తున్నవారంతా కృతజ్ఞత లేనివారే. చివరకు భారత క్రికెట్టే నష్టపోతుంది’ అని వ్యాఖ్యానించడం కుంబ్లే విలువను చూపిస్తోంది. –సాక్షి క్రీడావిభాగం కోచ్గా కుంబ్లే రికార్డు టెస్టుల్లో... ఆడినవి: 17 గెలిచినవి: 12 ఓడినవి: 1 ‘డ్రా’: 4 వన్డేల్లో... ఆడినవి: 13 గెలిచినవి: 8 ఓడినవి: 5 టి20ల్లో... ఆడినవి: 5 గెలిచినవి: 2 ఓడినవి: 2 ఫలితం తేలనివి: 1 -
భారత్, పాక్ మ్యాచ్పై ఐసీసీ ప్రకటన
బర్మింగ్హామ్: లండన్లో ఉగ్రదాడి అనంతరం బర్మింగ్హామ్లో భారత క్రికెటర్లు బస చేస్తున్న హోటల్ను బ్రిటన్ పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. హోటల్ మీదుగా వెళ్లే ట్రాఫిక్పై కూడా ఆంక్షలు విధించారు. దాదాపు రెండేళ్ల తర్వాత భారత్-పాకిస్తాన్ మ్యాచ్ వీక్షించేందుకు అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఐసీసీ భారత్-పాకిస్తాన్ కచ్చితంగా జరుగుతుందని తేల్చి చెప్పడంతో ఛాంపియన్స్ ట్రోఫీ భారత్-పాక్ మ్యాచ్పై అనుమానాలన్నీ పటాపంచలైపోయాయి. అభిమానులు ఆందోళన చెందనక్కర్లేదని ఐసీసీ స్పష్టం చేసింది. మ్యాచ్ నిర్వహణకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వివరించింది. -
జియో చీర్ కు అనూహ్య స్పందన
హైదరాబాద్ : దేశీయ అతిపెద్ద ఎల్టీఈ నెట్ వర్క్ అయిన రిలయన్స్ జియో... ఆదివారం జరుగబోయే భారత-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ లో మన క్రికెట్ జట్టులో ఉత్సాహం నింపేందుకు అభిమానులకు స్వాగతం పలుకుతోంది. 'బిగ్గరగా సందడి చేద్దాం.. గర్వంగా నిలుద్దాం' అనే జియో క్రికెట్ థీమ్ తో డిజిటల్ ఉద్యమం ప్రారంభించింది. www.jiocheer.com లైవ్ ప్రొగ్రామ్ ను మొదలుపెట్టింది. ఈ లైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన 24 గంటల్లోనే 'చీర్ ఫర్ ఇండియా, జియ్ ఫర్ ఇండియా' నినాదం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమవుతోంది. ఇప్పటికే ఇది దాదాపు 90 లక్షల మంది అభిమానులను చేరింది. ఎంతో ఉత్కంఠభరితంగా సాగే భారత్-పాక్ మ్యాచ్ లో అభిమానులు ఆన్ లైన్ ద్వారా తమ బలమైన మద్దతును తెలిపేందుకు ఇది వేదికగా మారింది. జట్టుకు తమ మద్దతు తెలుపుతూ.. ఆటగాళ్లను ఉత్సాహపరిచేలా ఈ కార్యక్రమాన్ని జియో ప్రారంభించింది. అంతేకాక, ఫేస్ బుక్ పేజీ, ట్విట్టర్, టంబ్లర్ వంటి వాటిల్లో షేర్ చేయడం ద్వారా మిత్రులకు, సహోద్యోగుల నుంచి మరింత మద్దతును భారత జట్టుకు అందించవచ్చు. ఉత్సాహభరితమైన ఈ డిజిటల్ ఉద్యమంలో కోట్లమంది క్రికెట్ అభిమానులంతా ఏకమై అద్భుతమైన అనుభూతిని పొందేలా చేయడమే ఈ కార్యక్రమ ఉద్దేశ్యమని కంపెనీ చెబుతోంది. దీంతో పాటు భారత్ లో క్రికెట్ ను ప్రాణంగా ప్రేమించే అభిమానులను జియో చేరుకునేలా ఇది దోహదం చేస్తుందని తెలిపింది. జియో వినియోగదారులు దూరదర్శన్ లో మ్యాచ్ ను ప్రత్యక్ష ప్రసాదం ద్వారా ఆస్వాదించవచ్చని, ప్రయాణంలో జియోటీవీ యాప్ ద్వారా కూడా మ్యాచ్ ను వీక్షించవచ్చని కంపెనీ పేర్కొంది. -
వచ్చే నెలలో విండీస్లో భారత్ పర్యటన
న్యూఢిల్లీ: ఇంగ్లండ్లో జూన్ 1 నుంచి 18 వరకు జరిగే చాంపియన్స్ ట్రోఫీ వన్డే టోర్నమెంట్ ముగియగానే భారత క్రికెట్ జట్టు వెస్టిండీస్లో పర్యటించనుంది. జూన్ 23 నుంచి జూలై 9 వరకు జరిగే ఈ పర్యటనలో భారత జట్టు ఐదు వన్డేలు, ఒక టి20 మ్యాచ్ ఆడుతుందని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. వన్డే మ్యాచ్లు జూన్ 23న, 25న, 30న, జూలై 2న, 6న జరుగుతాయి. ఏకైక టి20 మ్యాచ్ జూలై 9న జరుగుతుంది. -
‘చాంపియన్స్’ తర్వాతే కుంబ్లేపై నిర్ణయం
న్యూఢిల్లీ: చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే సహా భారత క్రికెట్ జట్టు సహాయక సిబ్బందిని కొనసాగించడంపై చాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాతే బీసీసీఐ నిర్ణయం తీసుకోనుంది. కోచ్గా కుంబ్లే ఏడాది కాంట్రాక్ట్ వచ్చే జూన్తో ముగుస్తుంది. ‘గతంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం కోచ్గా కుంబ్లేకు చాంపియన్స్ ట్రోఫీనే ఆఖరి టోర్నీ అవుతుంది. అయితే ఆయనను కొనసాగించే అవకాశం కూడా లేకపోలేదు. టోర్నీ ముగిసిన తర్వాత జరిగే బోర్డు సర్వసభ్య సమావేశంలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటాం. అయినా ఈ విషయంలో సీఓఏ అనుమతి కూడా తప్పనిసరి’ అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. భారత కోచ్గా గత ఏడాది కాలంలో కుంబ్లే అద్భుత ఫలితాలు సాధించారు. మరోవైపు సెలక్షన్ కమిటీలో ముగ్గురే సభ్యులు ఉండటం పట్ల వస్తున్న సమస్యలను కొన్ని రాష్ట్ర సంఘాలు సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. -
మన దూకుడు ఇలాగే సాగాలి
జాతిహితం భారత క్రికెట్ సాధించిన ఆసాధారణ మెరుగుదలకు సంబంధించిన మధురమైన మలుపు 2000లో గంగూలీ కెప్టెన్ కావడం. ఆ పరంపరలో వచ్చిన ఆకలిగొన్న, దూకుడు ఆటగాళ్ల వల్ల మన క్రికెట్ ఉన్నత శిఖరాలకు చేరింది. గత కాలపు స్టార్ క్రికెటర్లకు భిన్నంగా నేటి క్రీడాకారులు ఓటమిని సహించరు. మన క్రికెట్ అలాగే ఉండాలి. కానీ మన కొత్త క్రికెట్ బోర్డు సదుద్దేశాలతోనే అయినా... క్రికెట్ ఆట ఇంకా పాతకాలపు పెద్దమనుషుల ఆటేనని పొరబడి దీన్ని వెనక్కు మరల్చాలని చూస్తోంది. ఎన్నికల ఫలితాల కోసం మీరు ఉదయాన్నే నిద్ర లేచేసరికే నేను చప్పుడు చేయకుండా, మన క్రికెట్ గురించి కొన్ని తీవ్రవ్యాఖ్యలను చేసేస్తాను. ఈ వ్యాఖ్యలు చేయడంలో నా ఉద్దేశాలు మాత్రం మన క్రికెట్కు మంచి చేసేటం తటి ఉదాత్తమైనవి. ‘‘సముచితమైన నడవడిక, స్నేహశీలత, మంచి పెంపకం ఉన్న’’ క్రీడాకారులతో కూడినదిగా ఉన్నంత కాలం మన క్రికెట్ జట్టు బంగ్లాదేశ్ జట్టు అంత బాగానే ఉండేదని నా మొదటి వ్యాఖ్య. ఆక్స్ఫర్డ్/స్టీఫెన్ కళాశాలల విద్యార్థుల తరానికి చెందిన ‘‘మంచివాళ్లు’’, ‘‘సొగసుగా ఓడి పోయే వారు’’ వైదొలగి.. చిన్న పట్టణాలకు చెందిన హెచ్ఎమ్టీ (హిందీ మీడియం టైపు) వారికి దారివ్వడంతో ‘‘చెడ్డవాళ్లు’’ వృద్ధి చెందడం ప్రారంభ మైంది. ఇది నా రెండో వ్యాఖ్య. ఆ తదుపరి మన క్రికెట్ క్రీడా నైపుణ్యాలు అసాధారణమైన రీతిలో మెరుగుపడ్డాయి. దేశ చరిత్రలో ఇంతవరకు ఆడిన క్రీడాకారులతో నేడు అత్యుత్తమ భారత జట్టును, 18 మంది క్రీడాకారులతోఎంపిక చేసి చూడండి. అందులో 1992కు ముందటి 25 ఏళ్ల కాలానికి చెందిన స్టార్ క్రీడాకారులు ముగ్గురికి మించి ఎంపిక కారు (గవాస్కర్, విశ్వనాథ్, కపిల్). ఈ ముగ్గురిలోకి పాత వాడైన విశ్వనాథ్ 1969లో తొలి టెస్ట్ ఆడారు. అంటే 1932–1969 మధ్య జరిగిన 115 టెస్టులలో ఆడిన వారెవరూ ఈ జట్టులోకి రాలేకపోయారు. గతంలో మన స్పిన్ చతుష్టయం (బిషన్సింగ్ బేడీ, ఎర్రపల్లి ప్రసన్న, బీఎస్ చంద్రశేఖర్, ఎస్ వెంకటరా«ఘవన్) అద్భుతమైనదే. కానీ ఇక ఎంత మాత్రమూ అది ఇంత వరకూ గడచిన కాలానికంతటికీ గొప్పది కాదు. ఈ వ్యాఖ్య బహుశా మరింత వివాదాస్పదమైనది కావచ్చు. వారి తర్వాత ఇటీ వలి కాలానికి చెందిన నలుగురు స్పిన్నర్లు... అనిల్ కుంబ్లే, హర్బజన్ సింగ్, రవిచంద్రన్ అశ్విన్, ఊపిరి బిగబట్టి వినండి సర్ రవీంద్ర జడేజా. నాటి దిగ్గజాల కంటే నేటి క్రికెటర్లే మిన్న ఈ వాదనలో నాకు ఇద్దరు తోడుగా ఉన్నారు. భారత అత్యుత్తమ క్రికెట్ గణాంక నిపుణుడు మోహన్దాస్ మీనన్, హార్పర్ కాలిన్స్వారి అద్భుతమైన కొత్త పుస్తకం ‘నంబర్స్ డు(నాట్) లై’. గణాంకాలను అద్భుతంగా విశ్లేషించే జట్టు ప్రభావ సూచీ ఈ పుస్తకంలో ఉంది. ఒకప్పటి మన టెస్ట్ క్రికెట్ ఓపె నర్, నేటి కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ఆ పుస్తకంలో దానిని వివరించారు. నా గణాంకపరమైన వివరాలన్నింటికీ ఆధారం మీనన్. పాత కథలు, గత జ్ఞాప కాల మక్కువలకు మించి ఒక క్రీడాకారుడిని గొప్పవాణ్ణి చేసేది ఏమిటో తేల్చే తర్కాన్ని ‘నంబర్స్ డు(నాట్) లై’ అందించింది. లేదంటే నేనిలాంటి వ్యాఖ్యలు చేసే వాడినే కాదు. రాజకీయ వ్యవస్థతో వాదనకు దిగడం వేరు. అదే క్రికెట్ విరాట్టులుగా ఆరాధనలను అందుకుంటున్నవారిని సవాలు చేయడం ఘోర అపచారం. 1932–67 మధ్య భారత్ తొలి 100 టెస్టు మ్యాచ్లను ఆడింది. ఇందులో కేవలం 10 సార్లు గెలిచి, 40 సార్లు ఓడిపోయింది. ఆ పురాతన కాలం నాటి మన జట్టు, నేటి బంగ్లాదేశ్ జట్టుకంటే మెరుగ్గా ఉండేదేం కాదు. అది 2000 తర్వాత ఇంతవరకు ఆడిన 98 టెస్టులలో 8 టెస్టులలో గెలిచింది. వినూ మన్కడ్, లాలా అమర్నాథ్, పాలీ ఉమ్రీగర్, పంకజ్రాయ్, సీకే నాయుడు, సుభాష్ గుప్తే, నారీ కంట్రాక్టర్, బాపూ నడకర్ణి, నవాబ్ ఆఫ్ పటౌడీ, చందు బోర్డె తదితరులపై మనకున్న ఆరాధనను పట్టించుకోకండి. దక్షిణాఫ్రికా జాతి వివక్షను పాటించడం వల్ల అప్పట్లో ఆ జట్టుపై నిషేధం ఉండేది. ఆ తదుపరి 25 ఏళ్లలో (1967–91) భారత విజయాల శాతం రెట్టింపైంది. 174 టెస్టు లలో 34 విజయాలు లభించాయి. ఆ తర్వాతి 25 ఏళ్లలో (1992–2017) విజయాలు మళ్లీ రెట్టింపై 39.2 శాతానికి చేరాయి. దీంతో మన జట్టు పరా జయాల శాతం కూడా తగ్గింది. గంగూలీ శకం... విజయ పథం భారత క్రికెట్లో వచ్చిన అసాధారణమైన మెరుగుదలలో మరో మధు రమైన మలుపు ఉంది. అది నవంబర్ 2000లో అసలు సిసలు ‘‘చెడ్డ అబ్బాయి’’ సౌరవ్ గంగూలీ మన క్రికెట్ జట్టుకు కెప్టెన్ కావడం. ఆ తదుపరి ఆడిన 177 టెస్టులలో మన గెలుపుల రికార్డు మరింతగా మెరుగుపడి, ఓట ములు పడిపోయాయి. వాస్తవానికి మీనన్ గుర్తుచేసినట్టుగా అప్పటి నుంచి మన జట్టు 43.5% విజయాల రికార్డుతో ఆస్ట్రేలియా(60.6%), దక్షిణాఫ్రికా (49%)ల కంటే మాత్రమే వెనుకబడి గౌరవప్రదమైన మూడో స్థానంలో ఉంది. ఇంగ్లండ్, శ్రీలంక, పాకిస్తాన్ల కంటే ముందుంది. ఈ గంగూలీ శకంలోనే దిక్కుమాలిన వివాదాలలో క్రికెట్ వాటా కూడా పెరిగిందని చెప్పడానికి గణాంకవేత్తలు అవసరం లేదు. గంగూలీ సంతో షంగా ముల్లును ముల్లుతోనే తీసే వైఖరిని అవలంబించేవాడు, ప్రత్యర్థుల ఏకాగ్రతను దెబ్బతీయడం కోసం దూషణలకు దిగడంలో ఆస్ట్రేలియా క్రీడా కారులను మించిపోయేవాడు. లార్డ్స్ మైదానం బాల్కనీలో చొక్కా విప్పి ఊపినవాడతను. తనకి ముందటి ప్రముఖ క్రీడాకారులు ఎవరూ వీటిలో దేనినీ ఆమోదించేవారు కారు. మధ్యాహ్నం పూట బీరు తాగే కొందరు ముసలాళ్లు, కుక్కలు తప్ప మరెవరూ చూడని మ్యాచ్లంటూ కౌంటీ క్రికెట్ను ఈసడించి, ఎమ్సీసీ ఆహ్వానాన్ని తిరస్కరించిన ఖ్యాతి సునీల్ గవాస్కర్కే దక్కుతుంది. కాకతాళీయంగా గంగూలీ ఎదుగుదలతో పాటే భారత క్రికెట్ సామాజిక పరివర్తన కూడా సాగింది. మొరటుదనం ఉన్న, చిన్న పట్టణాలకు చెందిన, ఇంగ్లిషు మీడియంలో చదువుకోని, కాలేజీ మొహం చూడని (సచిన్ టెండూ ల్కర్ కూడా అదే బాపతు) క్రీడాకారులు జాతీయ జట్టులోకి ప్రవేశించారు. మనేకా గాంధీ ఆధునిక ప్రయోగంగా తాజాగా వాడుకలోకి తెచ్చిన పద బంధాన్ని ఉపయోగించి చెప్పాలంటే ఇది నిజంగానే ‘‘హార్మోన్ల విస్ఫో టనం’’. ఇది కేవలం క్రికెట్కే పరిమితం కాలేదు. ఇదే కాలంలో భారత హాకీ వైఖరి, ఆట తీరు కూడా మారింది. రమేష్ క్రిష్ణన్ లేదా విజయ్ అమృతరాజ్ల నైపుణ్యంలో బహుశా ఒక భాగం మాత్రమే ఉన్న లియాండర్ పేస్ టెన్నిస్ టూర్లలో, డేవిస్ కప్ పోటీలలో మరిన్ని ఎక్కువ విజయాలను సాధించాడు. ఆ ఉరవడిలోనే నిర్దాక్షిణ్యమైన వ్యాపారవేత్తలు లేదా రాజకీయవేత్తలు బీసీసీఐ లోకి ప్రవేశించారు. ఇంగ్లండ్ను మెచ్చుకునే రాకుమారులు, బడా వ్యాపార వేత్తల శకం ముగిసిపోయింది. జగ్మోహన్ దాల్మియా, గంగూలీ, ఐఎస్ బింద్రా, లలిత్ మోదీ, ఎన్ శ్రీనివాసన్లు రంగ ప్రవేశం చేశారు. వారికీ, ఒక ప్పటి విజయ్ మర్చంట్, రాజ్సింగ్ దుంగార్పూర్, మాధవ్ రావ్ సింథియా, ఆర్పీ మిశ్రా, ఫతేసింగ్ రావు గేక్వాడ్, అందరిలోకీ అత్యుత్తమమైన పెద్ద మనిషి విజయనగరం మహారాజ్కుమార్ లేదా విజ్జీలకూ పోలికే లేదు. ఒక ఇంగ్లిషు జట్టును తమ రాజప్రాసాదాలకు తీసుకురావడమే వారికి గొప్ప. అడ్డూ అదుపూ లేకుండా బోరవిరుచుకుని, చొక్కాలు విడిచేసి తిరిగే శకంలోకి భారత్ ప్రవేశిస్తోంది. ఈ మార్పు మన క్రికెట్లోని సంప్రదాయవాదులకు, పాత వ్యవస్థ (ఇంగ్లండు–ఆస్ట్రేలియా)లకు వేరు వేరు కారణాలతో మింగుడు పడటం లేదు. నేటి స్పిన్నర్లు బేడీ/ప్రసన్న తరగతికి చెందవచ్చు, చెందకపోవచ్చు. కానీ వారు ఎన్నడూ చేసి ఎరుగని విధంగా వీరు తమ బంతిని బౌండరికి కొట్టినందుకు బ్యాట్స్మన్ను ప్రశంసించడం కనిపిస్తుంది. గంగూలీ పూర్వ కాలంలో మన మొదటి నిజమైన నాటురకపు, దూకుడు ఆటగాడిగా కపిల్ దేవ్ను చూశాం. 1992 పోర్ట్ ఎలిజెబెత్ టెస్ట్లో నాన్ స్రై్టకింగ్ బ్యాట్స్మన్గా ఉన్న పీటర్ కిర్స్టన్ బౌలర్ బంతిని వేయడానికి ముందే క్రీజును దాటి నందుకు కపిల్ రన్ ఔట్ చేశాడు (మాన్కేడింగ్). అందుకుగానూ కిర్స్టన్ తన బ్యాట్తో కపిల్ను కొట్టాడు. ఆ బహిరంగ అవమానాన్ని, శారీరకమైన బాధను కపిల్ దిగమింగాల్సి వచ్చింది. విరాట్ కోహ్లి, ఇషాంత్ శర్మ లేదా అశ్విన్లను అలా ఎవరైనా చేయగలరా? అది గతించిన గతం... ఇది క్రికెట్ విప్లవం పంజాబీ మాట్లాడే, బిడియంగా ఉండే పాకిస్తాన్ క్రికెట్ జట్టును ఇమ్రా న్ఖాన్ 1970లలో ప్రపంచ చాంపియన్లుగా మార్చాడు. ఇమ్రాన్ తమ క్రీడా కారుల భయాన్ని పోగొట్టి, విదేశీయులన్న భావనను దూరం చేశాడు. సూటు, టై «అలవాటులేకపోతే అధికారిక కార్యక్రమాల్లో సల్వార్–కమీజ్ వేసు కోండి, పత్యర్థులను ఎన్నడూ ‘‘సర్’’ అని పిలవకండి, దేనికైనాగానీ సారీ చెప్పకండి, అవసరమైతే శాపనార్థాలు పెట్టండి, ఇంగ్లిష్ రాకపోతేనేం, పంజా బీలో ఆ పని చేయండి, అయినా అది వాళ్లకు అర్థమౌతుంది అని వారికి బోధించాడు. గంగూలీ వచ్చాక భారత క్రికెట్లో కూడా అ విప్లవమే వచ్చింది. ఆకాశ్ చోప్రా రాసిన పుస్తకంలో కపిల్కు భారత దేశపు ప్రభావశీల క్రీడా కారులలో స్థానం దక్కలేదు. అయినా ఆ పుస్తకావిష్కరణకు కపిల్ పెద్ద మనసుతో వచ్చాడు. పాత ‘‘బోంబే స్కూల్’’ బ్యాటింగ్లో బ్యాట్స్మన్ బాల్ను బాదినప్పుడు ఫాస్ట్ బౌలర్ మొహంలోకి చూస్తే, ఎక్కడ అతనికి చిర్రెత్తుతుందోనని చూసేవాడు కాడని కపిల్ చెప్పాడు. ఇప్పుడు కోహ్లి బంతులను బౌండరీకి కొట్టి ‘‘పోయి తీసుకురా’’ అంటాడు బౌలర్లను. నేటి మన పెద్దమనిషి తరహా కొత్త క్రికెట్ బోర్డు సదుద్దేశాలతోనే అయినా... క్రికెట్ ఆట అంటే ఇంకా పాతకాలపు పెద్దమనుషుల ఆటేననే పొరబాటు నమ్మకంతో దీన్ని వెనక్కు మరల్చాలని చూస్తోంది. తాజా కలం : నేను చివరగా చేసిన వ్యాఖ్యపై రేగే దుమారం నుంచి తప్పించుకోవాలని చూడటం లేదు. మన అతి గొప్ప స్పిన్నర్లు ఎవరు? 52 రన్స్కు ఒక వికెట్ చొప్పున తీసిన అశ్విన్ 1945 తర్వాత ప్రపంచంలోనే అత్యధిక స్ట్రయికింగ్ రేట్ను నమోదు చేసిన స్పిన్నర్గా నిలిచాడు. మురళి (55), వార్న్ (57)లకంటే ముందున్నాడు. ఇండియాకువస్తే జడేడా, కుంబ్లేలు 62, 66 రన్స్తో వరుసగా అశ్విన్ తర్వాత నిలిచారు. పాత స్పిన్నర్ల చతు ష్టయం కుంబ్లే (66) తర్వాత ఉంది. ప్రసన్న (76), బేడీ (80), వెంకట్ (95)lవెనుకబడి ఉన్నారు. బజ్జీ (69) సైతంlవారికంటే ముందే ఉన్నాడు. అందువల్లనే వారెవరూ ప్రభావశీల సూచీ/ఆకాశ్ చోప్రా ప్రభావశీల క్రీడా కారుల జాబితాలో లేరు. అది ఎంతటి అపచారంగానైనా కనిపించొచ్చు నేటి భారత జట్టులోకి వారు ప్రవేశించలేరు. - శేఖర్ గుప్తా twitter@shekargupta -
అందరికీ మీరు ఆదర్శం
అంధుల టి20 ప్రపంచకప్ విజేత భారత జట్టుపై ప్రధాని ప్రశంసలు జట్టు సభ్యులతో భేటీ న్యూఢిల్లీ: అంధుల టి20 ప్రపంచకప్ను గెలుచుకున్న భారత క్రికెట్ జట్టు మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుసుకుంది. ఈ సందర్భంగా ఆయన జట్టును ప్రశంసలతో ముంచెత్తారు. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ‘టి20 ప్రపంచకప్ను గెలుచుకున్న భారత అంధుల క్రికెట్ చాంపియన్లతో గుర్తుండిపోయే విధంగా భేటీ జరిగింది. జాతీయ సీనియర్ జట్టు సాధించిన విజయాలతో ప్రేరణ చెందిన వీరంతా పాఠశాల స్థాయి నుంచే ఆటను కెరీర్గా మలుచుకున్నారు. ఈరోజు మనందరికీ ఆదర్శంగా నిలిచారు. భవిష్యత్లోనూ ఇలాగే రాణించి దేశానికి గర్వకారణంగా నిలవాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ క్రికెటర్లను ఎంతగానో ప్రోత్సహిస్తూ వచ్చిన వారి తల్లిదండ్రులు, కోచ్లు, స్నేహితులకు కూడా అభినందనలు తెలుపుతున్నాను’ అని ప్రధాని మోదీ అన్నారు. ఈ సందర్భంగా ఆయనకు తమ సంతకాలతో కూడిన బ్యాట్, బంతి, మోదీ పేరుతో ఉన్న టీమ్ జెర్సీని ఆటగాళ్లు బహూకరించారు. అలాగే ప్రధాని కూడా వారికి బ్యాట్, బంతిని అందించారు. అనంతరం ప్రతీ ఆటగాడితో ఫొటో దిగి ట్విట్టర్లో పెట్టారు. టి20 అంధుల క్రికెట్ ప్రపంచ్కప్లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన భారత జట్టు గత నెల 12న జరిగిన ఫైనల్లో పాకిస్తాన్ను ఓడించి మరోసారి విజేతగా నిలిచింది. చాంపియన్గా నిలిచిన భారత జట్టుకు ఆంధ్రప్రదేశ్ క్రికెటర్ అజయ్ కుమార్ రెడ్డి సారథ్యం వహించగా... దున్నా వెంకటేశ్వరరావు, దుర్గా రావు, ప్రేమ్ కుమార్ సభ్యులుగా ఉన్నారు. -
‘విరాట్ సేన’ వచ్చేసింది...
బంగ్లాదేశ్తో జరిగే ఏకైక టెస్టులో ఆడేందుకు భారత క్రికెట్ జట్టు సోమవారం హైదరాబాద్కు చేరుకుంది. నగరంలో అడుగు పెట్టిన వెంటనే కెప్టెన్ విరాట్ కోహ్లి, అతని సహచరులు సన్నాహాలు మొదలుపెట్టారు. మ్యాచ్ వేదికైన ఉప్పల్ స్టేడియానికి చేరుకొని మూడు గంటలపాటు జోరుగా హుషారుగా ప్రాక్టీస్ చేశారు. – సాక్షి, హైదరాబాద్ -
తప్పుకున్న భారత జట్టు ట్రైనర్!
ముంబై: భారత క్రికెట్ జట్టుకు స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్గా వ్యవహరిస్తున్న శంకర్ బసు అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేశారు. చెన్నై టెస్టు ముగిసిన తర్వాత ఈ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన బీసీసీఐకి లేఖ పంపించారు. గత ఏడాది శ్రీలంకతో సిరీస్కు ముందు జట్టుతో చేరిన బసు కారణంగానే ఇటీవల ఆటగాళ్ల ఫిట్నెస్ అద్భుతంగా మెరుగుపడింది. తమలో మార్పుకు బసునే కారణమంటూ కెప్టెన్ కోహ్లి కూడా తరచుగా ప్రశంసించాడు. అయితే జట్టులో కొంత మంది ఆటగాళ్లు గాయాలపాలు కావడానికి అదే కారణమని విని పించింది. తమ శారీరక స్థితిని పట్టించుకోకుండా బసు ట్రైనింగ్ చేయించారంటూ కొందరు ఆటగాళ్లు బోర్డుకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. శంకర్ బసు రాజీనామాను బీసీసీఐ ఇంకా ఆమోదంచలేదు. -
జవాన్లతో భారత క్రికెటర్లు
-
జవాన్లతో భారత క్రికెటర్లు
ఢిల్లీ: టీమిండియా క్రికెటర్లు, బీసీసీఐ చీఫ్ అనురాగ్ ఠాకూర్.. ఢిల్లీలో టెర్రిరోయల్ ఆర్మీ జవాన్లను కలిశారు. ఈ సందర్భంగా భారత క్రికెట్ బృందం జవాన్లతో ముచ్చటించింది. కొందరు క్రికెటర్లు ఆయుధాలను పరిశీలించారు. జవాన్లతో కలసి ఫొటోలు దిగారు. గురువారం ఢిల్లీలో న్యూజిలాండ్తో జరిగే రెండో వన్డేలో ఆడేందుకు భారత క్రికెట్ జట్టు వెళ్లింది. బుధవారం బీసీసీఐ చీఫ్ అనురాగ్ ఠాకూర్.. క్రికెటర్లను తీసుకుని టెర్రిటోరియల్ ఆర్మీ కార్యాలయానికి వెళ్లారు. టెర్రిటోరియల్ ఆర్మీ (టీఏ)లో ఠాగూర్ రెగ్యులర్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. మిలటరీ దళంలో చేరిన తొలి బీజేపీ ఎంపీ ఆయనే కావడం విశేషం. -
'టాలెంట్కే టీమిండియాలో చోటు'
-
'టాలెంట్కే టీమిండియాలో చోటు'
- 2019 వరల్డ్ కప్ టార్గెట్ - సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎంఎస్కే ప్రసాద్ తిరుమల: టీమిండియా క్రికెట్ జట్టులో ప్రాంతాలు, రాష్ట్రాలకతీతంగా టాలెంట్ ఉన్నవారికే చోటు లభిస్తుందని, భారత్ క్రికెట్ సెలక్షన్ కమిటీ నూతన చైర్మన్ ఎంఎస్కే ప్రసాద్ అన్నారు. ఆదివారం ఆయన కుటుంబ సభ్యులతో కలసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. రాబోయే మూడేళ్లలో ప్రణాళికలు సిద్ధం చేసుకుని, 2019 వరల్డ్ క్రికెట్ కప్ టార్గెట్గా ముందుకు సాగుతామన్నారు. బీసీసీఐలో ఏడాదిపాటు సభ్యుడిగా కొనసాగిన అనుభవం తాను చైర్మన్గా మరింత సమర్థవంతంగా పనిచేయటానికి దోహదపడుతుందన్నారు. పాత కమిటీ నిర్ణయాలతోపాటు సరికొత్త ప్రణాళికలతో జట్టును మరింత పటిష్టం చేస్తామన్నారు. శ్రీవారి ఆశీస్సులతో బాధ్యతలు తీసుకుని జట్టును విజయపథంలో నడిపించేందుకు కృషి చేస్తామని ఎంఎస్కే తెలిపారు. -
మార్పుల్లేవ్
* న్యూజిలాండ్తో సిరీస్కు * భారత టెస్టు జట్టు ప్రకటన * బిన్నీ, ఠాకూర్లకు నిరాశ ముంబై: న్యూజిలాండ్తో సొంతగడ్డపై టెస్టు సిరీస్లో తలపడే భారత క్రికెట్ జట్టును సెలక్షన్ కమిటీ సోమవారం ఎంపిక చేసింది. ఇటీవల వెస్టిండీస్తో జరిగిన సిరీస్లో ఆడిన జట్టునుంచి ఇద్దరిని తప్పించి 15 మంది సభ్యులతో జట్టును ప్రకటించారు. విండీస్ విదేశీ పర్యటన కావడంతో 17 మందితో వెళ్లిన భారత బృందంలో స్టువర్ట్ బిన్నీ, శార్దుల్ ఠాకూర్ మినహా మిగతా ఆటగాళ్లపైనే సెలక్టర్లు నమ్మకముంచారు. విండీస్తో జరిగిన నాలుగు టెస్టుల్లోనూ వీరిద్దరికి తుది జట్టులో స్థానం లభించలేదు. భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు ఈ నెల 22నుంచి కాన్పూర్లో జరుగుతుంది. సీనియర్ల పేర్లు పరిశీలించినా... టెస్టు సిరీస్లో పెద్దగా రాణించని శిఖర్ ధావన్, రోహిత్ శర్మలకు కమిటీ మరో అవకాశం ఇచ్చింది. ఓపెనర్లుగా ధావన్, విజయ్, రాహుల్ రూపంలో ముగ్గురు ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. వీరిలో తుది జట్టులో ఎవరిని తీసుకోవాలనేది టీమ్ మేనేజ్మెంట్ ఇష్టమని సెలక్షన్ కమిటీ చైర్మన్ సందీప్ పాటిల్ అన్నారు. రోహిత్ చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబర్చకపోయినా... అతనిలో మంచి ప్రతిభ ఉందని, రోహిత్కు తగినన్ని అవకాశాలు కూడా రాలేదని ఆయన గుర్తు చేశారు. గౌతమ్ గంభీర్ సహా కొందరు సీనియర్ల గురించి కూడా చర్చ జరిగిందని, అయితే విదేశాల్లో సిరీస్ నెగ్గిన జట్టునే కొనసాగించాలని తాము భావించామని పాటిల్ చెప్పారు. ధావన్ మళ్లీ రాణిస్తాడని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. జట్టు వివరాలు: విరాట్ కోహ్లి (కెప్టెన్), ధావన్, విజయ్, రాహుల్, పుజారా, రోహిత్, రహానే, సాహా, అశ్విన్, జడేజా, మిశ్రా, ఉమేశ్, షమీ, భువనేశ్వర్, ఇషాంత్. -
అమెరికన్లను ఆకట్టుకోగలిగామా..!
* టి20 మ్యాచ్లకు భారీగా ప్రేక్షకులు * అంతా భారత, ఆసియా సంతతివారే భారత క్రికెట్ జట్టు ఎక్కడ ఆడినా దానికి ఉండే క్రేజ్ వేరు. అభిమానులను ఆకట్టుకోవడంలో మన జట్టు తర్వాతే ఎవరైనా. అదే ఆలోచనతో ఐసీసీ కూడా తొలిసారి అమెరికాలో భారత జట్టు ఆడేందుకు ఏర్పాట్లు చేసింది. అధికారిక లెక్కల ప్రకారం ఇది బీసీసీఐ హోం సిరీస్! అంటే భారత్లో జరగాల్సిన సిరీస్కే యూఎస్ ఇప్పుడు వేదికైంది. మరి మన జట్టు భారత అభిమానుల మధ్య సొంతగడ్డపై ఆడుతున్న అనుభూతిని పొందిందా... ఒరిజినల్ అమెరికన్లను కొత్త అభిమానులుగా మార్చి వారిని ఆకట్టుకోవడంలో సఫలమైందా.. అంతా మనోళ్లే కారణమేదైనా రెండో టి20 మ్యాచ్కు మాత్రం జనం చాలా తక్కువ సంఖ్యలో వచ్చారు. అరుుతే అంతకు ముందు తొలి మ్యాచ్కు లాడర్హిల్ స్టేడియం పూర్తిగా నిండిపోయింది. ఎక్కడ చూసినా త్రివర్ణ పతాకాలే ఎగిరాయి. ఒక వైపు కొంత భాగం మాత్రం వెస్టిండీస్నుంచి వచ్చిన ఫ్యాన్స కనిపించారు. వీరంతా కొత్త క్రికెట్ ఫ్యాన్స కాదు. విండీస్లో జరిగే మ్యాచ్లకు కూడా రెగ్యులర్గా హాజరయ్యేవారే. యూఎస్లో మ్యాచ్కు వచ్చిన వారంతా కూడా అమెరికా ఇండియన్స తప్ప అసలు అమెరికన్లు కాదు! ఒక అంచనా ప్రకారం మొత్తం మైదానంలో ఐదు శాతం కూడా స్థానిక అభిమానులు లేరు. అయితే భారతీయులు లేదంటే ఉపఖండానికి చెందినవారే తమ హీరోలను చూసేందుకు వచ్చారు. కొందరు అమెరికన్లు మాత్రమే ఆట గురించి ఏమీ తెలియకపోయినా మొహమాటం కొద్దీ వచ్చామని చెప్పడం విశేషం. ఒకరికి క్లోజ్ఫ్రెండ్ ఇండియన్,.. ఇంకొకరికి ఆఫీసులో బాస్ ఇండియన్! అక్కడివారికి అవసరం లేదా..? అమెరికా మార్కెట్కు క్రికెట్ రుచి చూపించాలని బీసీసీఐ ప్రణాళికలైతే పెద్దగా వేసింది కానీ కనీస జాగ్రత్తలు తీసుకోలేకపోయింది. కేవలం భారత టీవీ ప్రేక్షకుల కోసం మనకు అనుకూలమైన సమయంలో మ్యాచ్లు నిర్వహించారు. వారాంతపు రోజుల్లో ఉదయం 10 గంటలకు క్రికెట్ చూసేందుకు ఎంత మంది అమెరికన్లు వెళ్లగలరు? టార్గెట్ అమెరికా అయినప్పుడు భారత వీక్షకుల గురించి అంతగా పట్టించుకోవాల్సిన అవసరం ఉందా! అన్నింటికీ మించి ఈ రెండు మ్యాచ్లు కూడా అమెరికా టీవీల్లో అసలు ప్రసారమే కాలేదు. భారతీయులకు సంబంధించిన కార్యక్రమాలను అందించే ఒక వెబ్సైట్లో మాత్రమే చూపించారు. దాంతో అమెరికాలో ఉండే భారతీయుల కోసమే ఈ క్రికెట్ తప్ప మన కోసం కాదు అనే భావన చాలా మంది అమెరికన్లలో కనిపించింది. యూఎస్ బాగుంది, మరిన్ని సిరీస్లు కూడా ఆడవచ్చని భారత కెప్టెన్ ధోని తన అభిప్రాయం చెప్పాడు. అరుుతే అక్కడ మార్కెట్ ఏర్పడాలంటే ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని తాజా పరిస్థితి చూపిస్తోంది. స్థానిక అమెరికన్లను భాగం చేస్తూ, వారిని క్రికెట్ వైపు ఆకర్షించే విధంగా ఐసీసీ ఏదైనా కొత్తగా ప్రయత్నించాల్సి ఉంది. లేదంటే ఏడాదికో సారి ఇలాంటి మ్యాచ్లు జరిగినా... అది భారత్లోని వేదికలకు కొనసాగింపుగా కనిపిస్తుంది తప్ప అక్కడ క్రికెట్ నిలబడటం కష్టం! - సాక్షి క్రీడావిభాగం -
చలో అమెరికా
►యూఎస్లో తొలిసారి భారత క్రికెట్ జట్టు ►శని, ఆదివారాల్లో విండీస్తో టి20 మ్యాచ్లు ►అగ్రరాజ్యం మార్కెట్పై ఐసీసీ దృష్టి ఎవరు ఆడితే క్రికెట్ అభిమానులు విరగబడి మ్యాచ్లు చూస్తారో... ఎవరి సిక్సర్ల కోసం ఎంత దూరమైనా వచ్చేస్తారో... ఎవరి మెరుపు బ్యాటింగ్ కోసం ఎంత టికెట్ అయినా ఖర్చు చేస్తారో... ఆ ఆటగాళ్లు ఇప్పుడు అమెరికాలో ఆటకు సిద్ధమైపోయారు. యూఎస్ఏలో ఉన్న భారతీయులు, ఆసియన్లను ఆకర్షించేందుకు ఐసీసీ వేసిన పెద్ద ఎత్తుగడ ఇది. ఆడితే బేస్ బాల్ లేదంటే బాస్కెట్బాల్... అప్పుడప్పుడు ఫుట్బాల్, వ్యక్తిగత క్రీడల్లో టెన్నిస్... అగ్రరాజ్యం అమెరికాకు చెందిన అభిమానులు ఆసక్తి చూపించే ఆటలు ఇవే. కామన్వెల్త్ క్రీడ క్రికెట్ ఇప్పుడిప్పుడే అక్కడ నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇలాంటి సమయంలో భారత జట్టు అడుగు పెట్టడం అమెరికాలో ఆట స్థాయిని పెంచుతుందా... అంతా ఆశిస్తున్నట్లుగా అక్కడ క్రికెట్కు కూడా తగిన ఆదరణ లభిస్తుందా! సాక్షి క్రీడా విభాగం : అమెరికాలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లు నిర్వహించడం ఇదేమీ తొలిసారి కాదు. గతంలో 2010లో న్యూజిలాండ్, శ్రీలంక మధ్య, ఆ తర్వాత 2012లో న్యూజిలాండ్, వెస్టిండీస్ జట్ల మధ్య రెండేసి టి20 మ్యాచ్ల సిరీస్లు జరిగాయి. ఇటీవల కరీబియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా ఆరు మ్యాచ్లు కూడా నిర్వహించారు. వీటికి ప్రేక్షకులు అంతంత మాత్రమే ఆసక్తి కనబరిచారు. అమెరికా అభిమానులను ఆకట్టుకోవడంలో మాత్రం అవి పెద్దగా విజయవంతం కాలేదు. అయితే గత ఏడాది నవంబర్లో సచిన్-వార్న్ కలిసి నిర్వహించిన ఆల్ స్టార్స్ క్రికెట్ మాత్రం ఒక్కసారిగా యూఎస్లో క్రికెట్కు ఉన్న క్రేజ్ను చూపించింది. న్యూయార్క్, హోస్టన్, లాస్ ఏంజెల్స్లో జరిగిన మూడు టి20 మ్యాచ్లకు అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు. సచిన్ పేరు ఈ ఆదరణకు కారణమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భారత మాజీలు ఆడితేనే ఇలా ఉంటే ఇక ప్రస్తుత భారత జట్టు బరిలోకి దిగితే ఎలా ఉంటుందనే ఆలోచనే అమెరికాలో ఈ సిరీస్కు కారణమైంది. సీన్ మారుతోంది లెక్క ప్రకారం చెప్పుకోవడానికి వందకు పైగా దేశాల్లో క్రికెట్ ఉన్నా, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నా... ఎక్కువ మంది అమెరికన్ల దృష్టిలో మాత్రం క్రికెట్ ‘మిస్టీరియస్ ఇంగ్లీష్ స్పోర్ట్’ మాత్రమే. అయితే ఆల్స్టార్స్ క్రికెట్కు సీఎన్ఎన్, సీఎన్బీసీ చానళ్లు పెద్ద ఎత్తున కవరేజీ ఇవ్వడం మారుతున్న ప్రాధాన్యాలను సూచిస్తోంది. బేస్బాల్ నేపథ్యంలో సాగిన ‘మిలియన్ డాలర్ ఆర్మ్’ అనే హాలీవుడ్ చిత్రంలో భారత క్రికెట్ గురించి కూడా చాలా చూపించారు. ఇటీవల బోస్టన్లో జరిగిన ప్రతిష్టాత్మక స్లోన్ క్రీడా సదస్సులో తొలిసారి క్రికెట్ను కూడా చేర్చడం విశేషం. ఇప్పటి వరకు ఇతర క్రీడలకే పరిమితమైన స్పోర్ట్స్ టెక్నాలజీ కంపెనీలు క్రికెట్లోనూ పని చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. 2013లోనే ఎన్బీఏ కమిషనర్ డేవిడ్ స్టెర్న్ ఐపీఎల్ వ్యాపారాన్ని అధ్యయనం చేసేందుకు భారత్కు రాగా... ఎన్బీఏ, ఎన్హెచ్ఎల్, ఎంఎల్ఎస్లాంటి టాప్ లీగ్లలో భాగస్వామ్యం ఉన్న ప్రముఖ స్పోర్ట్స్ వ్యాపారవేత్త స్టాన్ క్రోన్కే క్రికెట్లోనూ అడుగు పెట్టబోతున్నాడనేది తాజా వార్త. అమెరికాలో ఉన్న ఇండియన్స్నే కాకుండా అసలు అమెరికన్లను క్రికెట్ వైపు ఆకర్షితులు చేయడమే తమ లక్ష్యమని ఐసీసీ సీఈ డేవ్ రిచర్డ్సన్ చెప్పారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని దీర్ఘకాలిక వ్యవధి లక్ష్యాలతోనే ఈ రెండు టి20లకు ఓకే చెప్పినట్లు ఆయన వెల్లడించారు. అభిమానులు ఆశగా... అమెరికాలో భారత జట్టు ఆడే టి20 మ్యాచ్ల కోసం అక్కడి ఫ్యాన్స్ కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. దేశంలోని ప్రతీ పెద్ద నగరంనుంచి భారత అభిమానులు ఈ మ్యాచ్లు చూసేందుకు ఫ్లోరిడాకు వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా భారత జట్టు వెస్టిండీస్లో ఆడుతుంటేనే అక్కడికి వచ్చి మద్దతు ఇచ్చే అభిమానుల్లో ఎక్కువ మంది అమెరికన్లే ఉంటారు. యూఎస్లో పెద్ద సంఖ్యలో స్థిరపడిన భారతీయులు, ఇతర ఆసియా దేశాలకు చెందిన ఫ్యాన్స్ వల్ల ఈ రెండు టి20 మ్యాచ్లు సూపర్ హిట్ కావడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు. భారత్లో క్రికెట్కు ఉన్న విలువ, ఇక్కడి మార్కెట్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ప్రపంచానికి పెద్దన్నలాంటి అగ్ర రాజ్యంలో కూడా క్రికెట్ను సరిగ్గా మార్కెటింగ్ చేయగలిగితే ఐసీసీకి తిరుగుండదు. ఒక్కసారి అక్కడ నిలదొక్కుకోగలిగితే క్రికెట్ మరింతగా దూసుకు పోవడం ఖాయం. ‘అమెరికాలో ఉన్న క్రికెట్ ఫ్యాన్కు ఇంతకంటే మంచి మ్యాచ్ను చూసే అవకాశం రాదు’ అని మార్క్ జాన్సన్ అనే ఒక అభిమాని చెప్పగా... ‘క్రికెట్లో రాక్స్టార్లాంటి దేశం ఆడుతుంటే చూడటం అదృష్టం’ అని ఫ్లోరిడాలో స్థిరపడిన రిజ్వాన్ అనే మరో వ్యక్తి చెబుతున్నాడు. ఈ మ్యాచ్లకు కనీస టికెట్ ధర 75 డాలర్లు ఉండగా, అత్యధికంగా 150 డాలర్లు ఖరారు చేశారు. అన్ని మ్యాచ్లూ అక్కడే లాడర్హిల్ నగరం (ఫ్లోరిడా రాష్ట్రం)లోని సెంట్రల్ బ్రోవర్డ్ రీజినల్ పార్క్ స్టేడియం భారత్, విండీస్ టి20 మ్యాచ్లకు ఆతిథ్యం ఇస్తోంది. గతంలో నాలుగు అంతర్జాతీయ టి20 మ్యాచ్లూ ఇక్కడే జరిగాయి. అమెరికా మొత్తంలో ఐసీసీ అధికారిక గుర్తింపు ఉన్న క్రీడా మైదానం ఇదొక్కటే. 2007లో నిర్మించిన ఈ స్టేడియంలో అప్పుడప్పుడు కొన్ని ఎగ్జిబిషన్, బెనిఫిట్ క్రికెట్ మ్యాచ్లు జరిగాయి. అయితే క్రికెట్ ద్వారా చెప్పుకోదగ్గ ఆదాయం లేదని, నిర్వహణ భారంగా మారిందని చెబుతూ మూడేళ్ల క్రితం సిటీ మేయర్ ఐసీసీకి లేఖ రాసి మరీ దీనిని మల్టీపర్పస్ స్టేడియంగా మార్చేశారు. ఇప్పుడు క్రికెట్కంటే కూడా ఫుట్బాల్, రగ్బీ పోటీలు ఎక్కువగా జరుగుతుంటాయి. వాస్తవానికి నవంబర్ దాకా క్రికెట్ మ్యాచ్లు లేవని అప్పటి వరకు స్టేడియాన్ని బార్సిలోనా ఫుట్బాల్ క్లబ్ క్యాంప్ల కోసం అద్దెకు ఇచ్చేశారు. అయితే భారత్, విండీస్ బోర్డుల అభ్యర్థనతో ఆదివారం కార్యక్రమాలను రద్దు చేసి మరీ 20 వేల సామర్థ్యం గల ఈ స్టేడియాన్ని ప్రత్యేకంగా సిద్ధం చేయాల్సి వచ్చింది. ఆటగాళ్లు 14 మంది... అధికారులు 46 మంది! అమెరికా టి20లకు బీసీసీఐ భారీ బృందం ముంబై: భారత క్రికెట్ జట్టు తొలిసారి అమెరికాలో ఆడుతున్న సందర్భంగా దీనిని చిరస్మరణీయం చేసేందుకు బీసీసీఐ ‘భారీ’గా సిద్ధమైంది. మొత్తం 46 మంది అధికారులను ఈ మ్యాచ్లు చూసేందుకు బోర్డు సొంత ఖర్చులతో ఫ్లోరిడా పంపిస్తోంది. బీసీసీఐ గుర్తింపు ఉన్న ప్రతీ రాష్ట్ర క్రికెట్ సంఘంనుంచి ఒక్కో ప్రతినిధితో పాటు ఈశాన్య రాష్ట్రాల అధికారులకు కూడా యూఎస్ వెళ్లే అవకాశం కల్పించింది. ఇటీవలే జరిగిన బోర్డు ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒక క్రికెట్ సిరీస్కు ఆటగాళ్లకంటే అధికారులే ఎక్కువ సంఖ్యలో వెళ్లటం బహుశా ఇదే తొలిసారి కావచ్చు! ఇప్పటికే విండీస్లో ఉన్న సెలక్టర్లు కూడా అమెరికా వెళతారా లేదా అనేదానిపై ఇంకా స్పష్టత లేదు. రానూ పోనూ బిజినెస్ క్లాస్ టికెట్లతో పాటు రోజూవారీ ఖర్చుల కింద (మొత్తం ఆరు రోజులు) ఒక్కొక్కరికి 250 డాలర్లను బీసీసీఐ అందిస్తుంది. ఇందు కోసం ప్రత్యేకంగా రూ. 3 కోట్ల బడ్జెట్ను కేటాయించడం విశేషం. అమెరికాలో భారత జట్టు ఆడటం ఒక చారిత్రాత్మక ఘట్టమని, దీనికి సాక్షిగా నిలవాలనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు సీనియర్ అధికారి ఒకరు వివరణ ఇచ్చారు. -
కుంబ్లే-కోహ్లీ కాంబినేషన్ సూపర్
ముంబై: భారత క్రికెట్ జట్టు చీఫ్ కోచ్గా అనిల్ కుంబ్లేను నియమించడాన్ని ఆస్ట్రేలియా బ్యాటింగ్ దిగ్గజం ఆడం గిల్క్రిస్ట్ ప్రశంసించాడు. అనిల్ కుంబ్లే, టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కాంబినేషన్లో టీమిండియా విదేశీగడ్డపై టెస్టు క్రికెట్ రికార్డును మెరుగుపరుచుకుంటుందని, ఇప్పటికే ఆ సంకేతాలు వెలువడ్డాయని అన్నాడు. కుంబ్లే గౌరవనీయ క్రికెటర్గా భారత జట్టును సరైన దిశలో నడిపిస్తాడని గిల్క్రిస్ట్ చెప్పాడు. కుంబ్లే, కోహ్లీ కాంబినేషన్ బాగా పనిచేస్తుందని చెప్పడానికి.. వెస్టిండీస్ పర్యటనలో టీమిండియా సాధించిన విజయమే నిదర్శనమని అన్నాడు. హెడ్ కోచ్గా కుంబ్లే నియమితుడయ్యాక, కోహ్లీ సారథ్యంలో టీమిండియా టెస్టు సిరీస్ గెలిచిన సంగతి తెలిసిందే. వెస్టిండీస్ గడ్డపై భారత్ ఆ జట్టును ఓడించడంతో పాటు మళ్లీ నెంబర్ వన్ ర్యాంక్ను సొంతం చేసుకుంది. కోహ్లీకి మూడు ఫార్మాట్లలో జట్టు పగ్గాలు అప్పగించి ఒత్తిడి పెంచరాదని గిల్క్రిస్ట్ అభిప్రాయపడ్డాడు. 'పరిమిత ఓవర్ల కెప్టెన్గా ధోనీ ఉన్నాడు. కెప్టెన్గా అతన్ని తొలగించడానికి ఏ కారణం లేదు' అని అన్నాడు. -
అమెరికాకు పూర్తి స్థాయి జట్టు
విండీస్తో టి20 సిరీస్ న్యూఢిల్లీ: వెస్టిండీస్తో జరిగే రెండు టి20ల కోసం అమెరికాలో పర్యటించే భారత క్రికెట్ జట్టును బీసీసీఐ కార్యదర్శి అజయ్ షిర్కే ప్రకటించారు. ఈనెల 27, 28న జరిగే ఈ మ్యాచ్లకు ధోని నేతృత్వంలో 14 మందితో కూడిన పూర్తి స్థాయి జట్టును ఎంపిక చేశారు. గత మేలో జింబాబ్వే పర్యటనకు విశ్రాంతి తీసుకున్న 11 మంది రెగ్యులర్ ఆటగాళ్లు తిరిగి జట్టులోకొచ్చారు. ఆల్రౌండర్ స్టువర్ట్ బిన్నీ జట్టులో చోటు దక్కించుకోగా సీనియర్ ఆటగాళ్లు యువరాజ్ సింగ్, రైనా, హర్భజన్లకు మొండిచేయి ఎదురైంది. ఈ ముగ్గురు దులీప్ ట్రోఫీలో ఆడనున్నారు. టి20 జట్టు: ధోని (కెప్టెన్), కోహ్లి, రోహిత్, ధావన్, రహానే, రాహుల్, జడేజా, అశ్విన్, బుమ్రా, షమీ, భువనేశ్వర్, ఉమేశ్ యాదవ్, అమిత్ మిశ్రా, బిన్నీ. -
భారత జట్టు ముమ్మర ప్రాక్టీస్
నెట్స్లో శ్రమించిన ఆటగాళ్లు జమైకా: వెస్టిండీస్తో జరగబోయే రెండో టెస్టు కోసం భారత క్రికెట్ జట్టు తమ ప్రాక్టీస్ను ప్రారంభించింది. శనివారం నుంచి జరిగే రెండో టెస్టు కోసం మంగళవారం కింగ్స్టన్కు చేరిన కోహ్లి సేన సబీనా పార్క్ మైదానంలో చెమటోడ్చింది. ఇక్కడి వేడి వాతావరణానికి అలవాటు పడేందుకు కఠినంగా ప్రాక్టీస్ చేసింది. రెగ్యులర్ వ్యాయామంతో పాటు విభిన్న రీతిలో బ్యాటింగ్, బౌలింగ్ సాధన చేసింది. కీపర్ వృద్ధిమాన్ సాహా తన కీపింగ్ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నించగా ఓపెనర్ మురళీ విజయ్ తన బొటన వేలి గాయం కారణంగా తేలికపాటి వ్యాయామంతో సరిపుచ్చుకున్నాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ మాత్రం ఎక్కువ సమయం నెట్స్లో గడిపాడు. మరోవైపు తొలి టెస్టులో తన ప్రదర్శన సంతృప్తినిచ్చిందని లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా అన్నాడు. ప్రత్యర్థిపై ఒత్తిడిని పెంచే విషయంలో తాను విజయవంతమైనట్టు తెలిపాడు. ‘ప్రతీ మ్యాచ్లో కచ్చితంగా వికెట్లు తీస్తామని చెప్పలేం. బాగా బౌలింగ్ చేసి ప్రత్యర్థిని కట్టడి చేయడమే మన పని. ఈ ప్రయత్నంలో వికెట్లు అవే వస్తాయి. ఒక్కోసారి బౌలర్ల మధ్య భాగస్వామం కూడా ఫలితాన్నిస్తుంది. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో అశ్విన్ వికెట్లు తీస్తుండగా మరో ఎండ్లో నేను బ్యాట్స్మెన్పై ఒత్తిడి పెంచగలిగాను. ఇక రెండో టెస్టులో నేను మరిన్ని వికెట్లు తీయాలనుకుంటున్నాను’ అని మిశ్రా తెలిపాడు. -
భారత జట్టు కోచ్ రేసులోకి కుంబ్లే
దరఖాస్తు చేసిన దిగ్గజ స్పిన్నర్ ముంబై: భారత క్రికెట్ జట్టు కోచ్ ఎంపిక వ్యవహారం ఒక్కసారిగా ఆసక్తికరంగా మారిపోయింది. ఇటీవలి వరకు డెరైక్టర్గా చక్కటి విజయాలు అందించిన రవిశాస్త్రితో పాటు గతంలో కోచ్గా పని చేసిన సందీప్ పాటిల్ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని భావిస్తుండగా... ఇప్పుడు దిగ్గజ స్పిన్నర్, మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే కూడా అనూహ్యంగా ఈ రేసులోకి దూసుకొచ్చాడు. బీసీసీఐకి దరఖాస్తు చేసిన 57 మందిలో కుంబ్లే పేరు కూడా ఉన్నట్లు తెలిసింది. కుంబ్లే ప్రస్తుతం ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తున్నాడు. 18 ఏళ్ల కెరీర్ తర్వాత 2008లో రిటైర్ అయిన కుంబ్లే 132 టెస్టుల్లో 619 వికెట్లు, 271 వన్డేల్లో 337 వికెట్లతో భారత అత్యుత్తమ బౌలర్లలో ఒకరిగా నిలిచాడు. ఐపీఎల్లో బెంగళూరు జట్టుకు ఆటగాడిగా, మెంటార్గా పని చేసిన అనంతరం ముంబై ఇండియన్స్కు కూడా మెంటార్గా పని చేశాడు. బీసీసీఐ టెక్నికల్ కమిటీ చైర్మన్గా, కర్ణాటక క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా కూడా వ్యవహరించిన కుంబ్లే ఇప్పుడు జాతీయ జట్టుతో నేరుగా కలిసి పని చేయాలని ఉత్సాహంగా ఉన్నాడు. అధికారికంగా కోచ్గా ఎలాంటి అనుభవం లేకపోయినా కెరీర్ రికార్డే కుంబ్లే అతి పెద్ద బలంగా భావించవచ్చు. ధోని, కోహ్లిలతో కలిసి ఆడిన అనుభవం కూడా అతనికి కోచ్ ఎంపిక విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. -
కోచ్ పదవికి దరఖాస్తు చేశా: రవిశాస్త్రి
భారత క్రికెట్ జట్టు చీఫ్ కోచ్ పదవికి తాను దరఖాస్తు చేసినట్లు రవిశాస్త్రి తెలిపారు. 18 నెలల పాటు జట్టుకు డెరైక్టర్గా పని చేసిన ఆయన బోర్డు ప్రకటనలో కోరిన అన్ని డాక్యుమెంట్స్ను అందజేసినట్లు తెలిపారు. ‘కోచ్ పదవికి దరఖాస్తు చేయడం వరకే నా పని. ఆ తర్వాత నిర్ణయం నా చేతుల్లో లేదు. దీనిపై ఇంతకుమించి నేను వ్యాఖ్యానించను’ అని రవిశాస్త్రి అన్నారు. -
కోచ్ రేసులో సందీప్ పాటిల్
దరఖాస్తు చేసిన చీఫ్ సెలక్టర్ ముంబై: భారత క్రికెట్ జట్టు నూతన కోచ్ పదవిపై జాతీయ చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఈ బాధ్యతలు చేపట్టేందుకు తన పేరును పరిశీలించాల్సిందిగా ఆయన బీసీసీఐకి దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుత చీఫ్ సెలక్టర్ పదవీకాలం ఈ సెప్టెంబర్లో ముగుస్తుంది. అయితే అప్పటిలోగా ముఖ్య పర్యటనల కోసం జట్ల ఎంపిక పూర్తయ్యింది కాబట్టి ఈ పదవికి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా బీసీసీఐ ఆయనకు సూచించినట్టు సమాచారం. పాటిల్ 1996లో ఆరు నెలల స్వల్ప కాలం భారత జట్టుకు కోచ్గా వ్యవహరించారు. అలాగే 2003 ప్రపంచ కప్లో కెన్యా సంచలన ప్రదర్శనతో సెమీఫైనల్కు చేరిన సమయంలో ఆ జట్టుకు పాటిలే కోచ్గా ఉన్నారు. ఒకవేళ తను కోచ్గా ఎంపికైతే సెప్టెంబర్కన్నా ముందే చీఫ్ సెలక్టర్ పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. 2014లో డంకన్ ఫ్లెచర్ వైదొలిగిన అనంతరం జాతీయ జట్టు ప్రధాన కోచ్ లేకుండానే బరిలోకి దిగుతోంది. ఈ కాలంలో టీమ్ డెరైక్టర్ హోదాలో రవిశాస్త్రి దాదాపుగా కోచ్ బాధ్యతలు చేపట్టారు. ఇటీవలి టీ20 ప్రపంచకప్ వరకు ఇలాగే కొనసాగినా ఇక చీఫ్ కోచ్ నియామకం చేపట్టాలని బీసీసీఐ నిర్ణయించింది. అలాగే ఇప్పటి వరకు ఈ పదవి కోసం రవిశాస్త్రి, సంజయ్ బంగర్ కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఈనెల 10 వరకు అప్లికేషన్లకు గడువుండగా పాటిల్కు రవిశాస్త్రి నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది. -
టీమిండియా కోచ్ రేసులో మరో పేరు
న్యూఢిల్లీ: టీమిండియా కోచ్ పదవికి మరో పేరు తెరపైకి వచ్చింది. టీమిండియా యువ క్రికెటర్ విరాట్ కోహ్లీ.. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ డానియల్ వెట్టోరి పేరును కోచ్ పదవికి సూచించినట్టు సమాచారం. కాగా కోహ్లీ ప్రతిపాదనను భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) పరిశీలించిందా లేదా అన్న విషయం తెలియరాలేదు. ఐపీఎల్ ఫ్రాంచైజీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్గా కోహ్లీ వ్యవహరిస్తుండగా, ఆ జట్టు కోచ్గా వెట్టోరి పనిచేస్తున్నాడు. గతేడాది అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన వెట్టోరి గతంలో బెంగళూరు కెప్టెన్గా పనిచేశాడు. 2013లో వెట్టోరి కెప్టెన్సీ నుంచి వైదొలిగాక కోహ్లీకి బాధ్యతలు అప్పగించారు. టీమిండియా డైరెక్టర్గా రవిశాస్త్రి పదవీకాలం ముగిశాక కోచ్ పదవికి పలువురు పేర్లు వినిపించాయి. మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీకి కోచ్ బాధ్యతలు అప్పగించనున్నట్టు వార్తలు వచ్చినా.. కోచ్గా పనిచేసే తీరకలేదని దాదా స్పష్టం చేశాడు. మరో మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్తో పాటు విదేశీ మాజీ క్రికెటర్లు పేర్లు కూడా వినిపించాయి. తాజాగా కోహ్లీ.. వెట్టోరి పేరును ప్రతిపాదించాడు. బీసీసీఐ కోచ్గా ఎవరిని ఎంపిక చేస్తుందో చూడాలి. -
'మీ విజయం.. నాకు ఆరోగ్యాన్ని ఇస్తుంది'
చండీగఢ్: టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అండ్ కోకు ఊహించని వ్యక్తి నుంచి ఆశీస్సులు అందుకున్నారు. హాకీ లెజెండ్, మూడుసార్లు ఒలింపిక్స్ స్వర్ణపతకాలు సాధించిన భారత జట్టులో సభ్యుడు బల్బీర్ సింగ్ సీనియర్ (92).. మొహాలీ స్టేడియంలో భారత క్రికెట్ జట్టు సభ్యులను కలిశాడు. ఆదివారం ఈ వేదికపై ఆస్ట్రేలియాతో జరిగే టి-20 ప్రపంచ కప్ మ్యాచ్లో విజయం సాధించాలని అభినందనలు తెలిపాడు. ప్రపంచ కప్ను సాధించాలని ఆకాంక్షించాడు. తమకు ఆశీస్సులు అందించిన బల్బీర్ సింగ్కు భారత క్రికెటర్లు కృతజ్ఞతలు చెప్పారు. బల్బీర్ ఆరోగ్యం గురించి భారత క్రికెటర్లు వాకబు చేయగా, మీ విజయం తనకు ఆరోగ్యాన్ని ఇస్తుందని ఆయన నవ్వుతూ సమాధానమిచ్చాడు. 1948 నుంచి 1956 వరకు మూడు ఒలింపిక్ పసిడి పతకాలు సాధించిన భారత హాకీ జట్టుకు బల్బీర్ ప్రాతినిధ్యం వహించాడు. -
టీమిండియా ప్రాక్టీస్ లో గంగూలీ
కోల్ కతా: భారత్ క్రికెట్ జట్టు శుక్రవారం ఈడెన్ గార్డెన్ ముమ్మర సాధన చేసింది. సీనియర్, జూనియర్ ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్నారు. టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రి పర్యవేక్షణ ఆటగాళ్లు సాధన చేశారు. టీ20 ప్రపంచకప్ లో భాగంగా రేపు(శనివారం) జరిగే కీలక మ్యాచ్ లో భారత్-పాకిస్థాన్ తలపడనున్నాయి. మరోవైపు మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఈడెన్ గార్డెన్ లో టీమిండియా ప్రాక్టీస్ ను స్వయంగా పర్యవేక్షించాడు. ఆటగాళ్లకు సలహాలు ఇచ్చాడు. ఈ సందర్భంగా గంగూలీని యువరాజ్ సింగ్ అప్యాయంగా హత్తుకున్నాడు. అశిష్ నెహ్రా, హర్భజన్, యువరాజ్, రవిశాస్త్రితో గంగూలీ సమాలోచనలు జరిపాడు. -
ధోని వచ్చేశాడు...
బెంగళూరు : జాతీయ క్రికెట్ అకాడమీలో భారత క్రికెట్ జట్టు సందడి మొదలైంది. దక్షిణాఫ్రికాతో సిరీస్కు ముందు ప్రత్యేకంగా నిర్వహిస్తున్న సన్నాహక శిబిరంలో 30 మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారు. వన్డే, టి20లకు జట్లకు ఎంపిక కాని క్రికెటర్లు కూడా ఈ ప్రాబబుల్స్ బృందంలో ఉన్నారు. దాదాపు మూడు నెలల విరామం తర్వాత మళ్లీ జట్టుతో చేరిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని చాలా ఉత్సాహంగా కనిపించాడు. టెస్టు కెప్టెన్ కోహ్లి సహా గాయం నుంచి కోలుకుంటున్న ధావన్ కూడా క్యాంప్లో చేరాడు. టీమ్ డెరైక్టర్ రవిశాస్త్రితో పాటు ముగ్గురు సహాయక కోచ్ల నేతృత్వంలో ఆటగాళ్లు శిక్షణలో పాల్గొన్నారు. -
భారత జట్టు ఫిజియోగా ఫర్హర్ట్
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు కొత్త ఫిజియోగా ఆస్ట్రేలియాకు చెందిన ప్యాట్రిక్ ఫర్హర్ట్ ఎంపికయ్యారు. ఇటీవల వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసిన నితిన్ పటేల్ స్థానంలో ఫర్హర్ట్ను బీసీసీఐ నియమించింది. వచ్చే నెలలో జరిగే భారత్, శ్రీలంక టెస్టు సిరీస్నుంచి అతను బాధ్యతలు చేపడతాడు. ఫిజియోగా దాదాపు మూడు దశాబ్దాల అనుభవం ఉన్న ప్యాట్రిక్ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టుకు పని చేశాడు. టీమ్ మసాయర్గా అరుణ్ కనడేను ఎంపిక చేయగా, ఇటీవల జింబాబ్వే సిరీస్ నుంచే స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ నిపుణుడిగా శంకర్ బసు కూడా జట్టుతో చేరాడు. ఈ ముగ్గురికి బోర్డు ఏడాది కాంట్రాక్ట్ ఇచ్చింది. -
జింబాబ్వే చేరుకున్న టీమిండియా
హరారే: భారత క్రికెట్ జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లింది. అజింక్యా రహానె సారథ్యంలోని జట్టు హరారే చేరుకుంది. సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఈ విషయాన్ని ట్వీట్ చేశాడు. జింబాబ్వే పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు, రెండు టీ-20ల సిరీస్లు ఆడనుంది. 10 వ తేదీ నుంచి సిరీస్ జరగనుంది. ఈ పర్యటనకు సీనియర్లకు విశ్రాంతినిచ్చి రహానె నాయకత్వంలో యువ ఆటగాళ్లను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. -
భారత జట్టులో విభేదాలు లేవు: దాదా
కోల్కతా: భారత జట్టులో ఎటువంటి విభేదాలూ లేవని మాజీ కెప్టెన్, బీసీసీఐ సలహా మండలి సభ్యుడు సౌరభ్ గంగూలీ అన్నాడు. టీమిండియా ఓటమి చెందినపుడు, స్థాయి మేరకు ఆడనప్పుడు ఇలాంటి వార్తలు వస్తుంటాయని, ఇవి నిజంకాదని చెప్పాడు. టి-20, వన్డే కెప్టెన్ ధోనీ, టెస్టు కెప్టెన్ కోహ్లీల మధ్య విభేదాలున్నాయని, జట్టులో ఆధిపత్య పోరు నడుస్తోందని వార్తలు వచ్చాయి. బంగ్లాదేశ్తో వన్డే సిరీస్లో భారత్ ఓటమికి ఇవే కారణాలని కథనాలు రావడంతో దాదా స్పందించాడు. ఇవన్నీ ఊహాగానాలేనని కొట్టిపారేశాడు. టీమిండియా ఓడిపోవడం బాధాకరమని, అయితే బంగ్లాదేశ్ అద్భుతంగా ఆడిందని అన్నాడు. -
కెప్టెన్ X కెప్టెన్
‘కెప్టెన్సీలో ఎవరి శైలి వాళ్లది. ఎవరి ఆలోచనలు, వ్యూహాలు వాళ్లకుంటాయి. అందరూ ఒకేలా ఉండాలని ఆశించకూడదు’... బంగ్లాదేశ్తో టెస్టు తర్వాత కోహ్లి కెప్టెన్సీ గురించి ధోని వ్యాఖ్య ‘తొలి రెండు వన్డేల్లో నిర్ణయాలు తీసుకోవడంలో జట్టులో ఒకరకమైన సందిగ్ధత కనపడింది. అదే మైదానంలో ప్రతిఫలించింది. ఇది నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మ్యాచ్ చూసిన వాళ్లందరికీ అర్థమైంది’ మూడో వన్డేకు ముందు కోహ్లి వ్యాఖ్య ఇది. ఈ రెండు వ్యాఖ్యలు గమనిస్తే భారత క్రికెట్ జట్టులో అంతా సవ్యంగా ఉందని అనుకోగలమా..? టెస్టు, వన్డే సారథుల మధ్య విభేదాలున్నాయా? సాక్షి క్రీడా విభాగం: ఏ జట్టులో అయినా సహచరుడి గురించి అడిగినప్పుడు మొహమాటానికైనా ప్రతి క్రికెటర్ ప్రశంసిస్తూనే మాట్లాడతాడు. టెస్టుల నుంచి రిటైరైన ధోని... కోహ్లి గురించి అడిగినప్పుడు బాగా చేశాడనో, ఇంకా ఇలా చేయొచ్చనో చెబితే అయిపోయేది. కానీ సమాధానంలో కనీసం ధోని పేరు ప్రస్తావించకుండా మాట్లాడాడు. పదే పదే ఐదుగురు బౌలర్ల గురించి కోహ్లి మాట్లాడటం మహీకి నచ్చలేదు. తన శైలి ధోనికి భిన్నమని చెప్పే ప్రయత్నం టెస్టు సమయంలో కోహ్లి చేశాడు. మూడో వన్డేకు ముందు ఇంటర్వ్యూలో కోహ్లి మాట్లాడుతూ పరోక్షంగా ధోనిని విమర్శించాడు. పేరు చెప్పకపోయినా వ్యూహాల గురించి మాట్లాడటమంటే ధోని గురించే అని అందరికీ అర్థమైంది. వన్డేల్లో వ్యూహాల విషయంలో కోహ్లి మాటను లెక్క చేయకపోవడం, కలుపుకోకుండా పక్కకు బెట్టడం వల్ల ఇలా మాట్లాడి ఉంటాడనేది ఓ అంచనా. దీంతో కోహ్లి తన అసంతృప్తిని బాహాటంగానే వెలిబుచ్చాడు. విరాట్లో విశ్వాసం పెరిగింది! భారత క్రికెట్లో సమస్యలు, వివాదాలు వచ్చినా, వరుస పరాజయాలు వెంటాడినా గతంలో ఎవరూ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఆటలోనే కాకుండా మాటల్లో కూడా దూకుడుకు మారు పేరైన కోహ్లి.... ఇప్పుడు అనూహ్యంగా తన అసంతృప్తిని వెళ్లగక్కాడు. బంగ్లాతో సిరీస్లో ఆటగాళ్లు స్వేచ్ఛగా తమ ఆటను ప్రదర్శించలేకపోయారని, గతంలో ఇలా ఎప్పుడూ లేదని అతను అన్నాడు. తొలి సారి ధోని గైర్హాజరీలో టెస్టు జట్టుకు నాయకత్వం వహించిన వెంటనే కోహ్లినుంచి ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం. రవిశాస్త్రి అన్నింటా అండగా ఉండటంతో అతనిలో ఆత్మ (అతి) విశ్వాసం పాలు ఒకింత ఎక్కువగానే కనిపిస్తోంది. పైగా శ్రీనివాసన్ అండతో హవా చలాయించిన ధోనిపై గుర్రుగా ఉన్న బోర్డు పెద్దలు కొందరు కోహ్లికి మద్దతు ఇవ్వడం వల్లే ఇంత బహిరంగంగా అతను వ్యాఖ్యలు చేసి ఉండవచ్చు. స్వతంత్రంగా ధోని వరల్డ్కప్లో కీలక మ్యాచ్లలో విఫలమైనా... అంతకు ముందు బ్రిస్బేన్ టెస్టు సందర్భంగా ధావన్తో జరిగిన గొడవ విషయంలోనూ కోహ్లిని ధోని వెనకేసుకొచ్చాడు. గతంలో మైదానంలో సూచనలు, సలహాల విషయంలో కోహ్లి కూడా ధోనితో కలిసి చురుగ్గా పాల్గొన్నాడు. అయితే ఇప్పుడు పరిణామాలు మారాయి. దిగ్గజాలు జట్టులో ఉన్న సమయంలో కూడా టీమ్ను నడిపించిన మహీకి... తన సమక్షంలోనే కోహ్లి దూసుకుపోయే ప్రయత్నం రుచించట్లేదు. ముఖ్యంగా రెండో వన్డే కోసం అనూహ్యంగా చేసిన మూడు మార్పుల నేపథ్యంలోనే ఇద్దరి మధ్య దూరం పెరిగినట్లు సమాచారం. కలిసి పని చేస్తారా? సాధారణంగా కొత్త కెప్టెన్ ఎవరు వచ్చినా... తన వర్గాన్ని తయారు చే సుకోవడం, నమ్మిన బంటులుగా మార్చుకొని ప్రోత్సహించడం ఎప్పుడూ జరిగేదే. రైనా, అశ్విన్, జడేజా, మోహిత్ అలా ధోని గ్యాంగ్ అనే ముద్రతో ఉన్నారు. కొత్తగా కోహ్లి ఇదే ప్రయత్నంలో ఉన్నట్లున్నాడు. ఆ జోరులో కాస్త ‘అతి’ ప్రదర్శించబోతే ధోని అడ్డు పడినట్లు అతని వ్యాఖ్యల్లో కనిపిస్తోంది. ఈ ఏడాది భారత్ విరామం లేకుండా చాలా సిరీస్లు ఆడనుంది. వీరిద్దరి మధ్య ఎలాంటి సమన్వయం ఉంటుంది? కలిసి పని చేయగలుగుతారా అనే ప్రశ్నకు త్వరలోనే సమాధానం వస్తుంది. -
ప్రధాన కోచ్గా రవిశాస్త్రి?
బంగ్లా సిరీస్ తర్వాత పూర్తి బాధ్యతలు ఏడాదికి రూ.7 కోట్లు వేతనమంటూ కథనాలు ముంబై : భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవి గురించి నడుస్తున్న చర్చ దాదాపుగా ముగిసినట్లే. ప్రస్తుతం డెరైక్టర్ హోదాలో బంగ్లాదేశ్లో ఉన్న రవిశాస్త్రి ఆ తర్వాత పూర్తి స్థాయిలో హెడ్ కోచ్గా బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం. విరాట్ కోహ్లి అన్ని రకాలుగా మద్దతు పలకడం, శాస్త్రి కూడా స్వయంగా ఆసక్తి చూపించడంతో బీసీసీఐ మరో ప్రత్యామ్నాయం గురించి ఆలోచించడం లేదని తెలుస్తోంది. అదే జరిగితే 2000 తర్వాత ఒక భారతీయుడు జట్టుకు కోచ్గా వచ్చినట్లు అవుతుంది. ఇటీవల గంగూలీ, ద్రవిడ్లాంటి పేర్లు వినిపించినా వారికి ఇప్పటికే ఇతర బాధ్యతలు అప్పగించడంతో సందేహాలు తీరిపోయాయి. కోచ్గా ఎంపికైతే రవిశాస్త్రికి ఫీజుగా బోర్డు ఏడాదికి రూ. 7 కోట్లు చెల్లించనున్నట్లు సమాచారం. తద్వారా ప్రపంచ క్రికెట్లో అత్యధిక మొత్తం అందుకునే కోచ్గా ఈ మాజీ ఆల్రౌండర్ గుర్తింపు పొందుతాడు. గతంలో డంకన్ ఫ్లెచర్కు బోర్డు ఏడాదికి రూ. 4.2 కోట్ల చొప్పున చెల్లించింది. -
పరుగుల ‘వర్షం’
బంగ్లా బేబీలను భారత ఓపెనర్లు ఆటాడుకున్నారు. వన్డే తరహా ఆటతీరుతో శిఖర్ ధావన్ సంచలన సెంచరీతో చెలరేగితే... విజయ్ తన ‘శైలి’లో ఆకట్టుకున్నాడు. వెరసి... బంగ్లాదేశ్తో తొలి టెస్టులో భారత్ తొలి రోజే పట్టు బిగించింది. వర్షం కారణంగా ఓవర్లు నష్టపోయినా... ఓపెనర్ల పరుగుల వర్షంతో ఆ లోటు తెలియలేదు. రెండో రోజూ ఇదే దూకుడు కొనసాగిస్తే... కొత్త సీజన్ను కోహ్లి సేన విజయంతో ప్రారంభించొచ్చు. ఫతుల్లా : ఎంతో మెరుగుపడ్డామని చెప్పుకున్నా...టెస్టుల్లో భారత్ ముందు బంగ్లాదేశ్ బేబీలే అని మరో సారి స్పష్టమైంది. ఫలితంగా ఇరు జట్ల మధ్య ఏకైక టెస్టు మొదటి రోజే భారత్ పట్టు బిగించింది. వర్షం బారిన పడిన ఈ మ్యాచ్ తొలి రోజు బుధవారం ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 56 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 239 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (158 బంతుల్లో 150 బ్యాటింగ్; 21 ఫోర్లు), మురళీ విజయ్ (178 బంతుల్లో 89; 8 ఫోర్లు, 1 సిక్స్) అజేయంగా క్రీజ్లో నిలిచారు. వాన కారణంగా లంచ్కు ముందు మధ్యలో దాదాపు మూడు గంటలకు పైగా ఆట నిలిచిపోయింది. చివర్లో సెషన్ను పొడిగించినా కనీసం 34 ఓవర్లు తగ్గాయి. ఆటగాళ్లకంటే టాస్నే ఎక్కువగా నమ్ముకొని బ్యాట్స్మన్, పార్ట్టైమర్లతో జట్టును నింపేసిన బంగ్లా తగిన ఫలితం అనుభవించింది. రోజంతా ఆడినా కనీసం ఒక వికెట్ తీయలేని బలహీనత మళ్లీ బయటపడింది. స్కోరు వివరాలు: భారత్ తొలి ఇన్నింగ్స్ : విజయ్ (బ్యాటింగ్) 89; ధావన్ (బ్యాటింగ్) 150; ఎక్స్ట్రాలు 0; మొత్తం (56 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 239. బౌలింగ్ : షాహిద్ 12-2-52-0; సర్కార్ 2-0-7-0; షువగత 13-0-47-0; షకీబ్ 9-1-34-0; తైజుల్ 12-0-55-0; జుబేర్ 7-0-41-0; కైస్ 1-0-3-0. ధావన్ దరహాసం! శిఖర్ ధావన్ మరో సారి జట్టులో తన విలువేంటో చూపించాడు. తనకే సాధ్యమైన రీతిలో టెస్టులోనూ వన్డే శైలి ఆటతో చెలరేగి శతకం సాధించాడు. ప్రపంచకప్లో బాగా ఆడినా, ఆ తర్వాత ఐపీఎల్లోనూ రాణించినా ఈ టెస్టుకు ముందు తుది జట్టులో ధావన్కు స్థానం ఖాయం కాదు. ఆస్ట్రేలియాలో వరుస వైఫల్యాల తర్వాత సిడ్నీ టెస్టుకు దూరమైన అతను, కేఎల్ రాహుల్ గాయంతో తప్పుకోవడంతో చోటు దక్కించుకున్నాడు. ఇప్పుడు తనకు దక్కిన అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకున్నాడు. ధావన్ కెరీర్లో ఇది మూడో సెంచరీ. భీకరంగా దూసుకొచ్చిన తొలి టెస్టు సెంచరీ, తర్వాత న్యూజిలాండ్ గడ్డపై చేసిన శతకంతో పోలిస్తే ఇది గొప్ప కాకపోవచ్చు. కానీ దాదాపు సగం ఆట వర్షం కారణంగా కోల్పోయినా... ధావన్ దూకుడు తొలి రోజే భారీ స్కోరుకు బాటలు వేసింది. ఒక్క పరుగు వద్ద ఉన్నప్పుడు స్లిప్లోకి వెళ్లిన బంతి కాస్త వేగవంతమైన మైదానం అయితే నేరుగా ఫీల్డర్ చేతిలో పడేదే. అయితే ఇలా అదృష్టం కలిసొచ్చిన ప్రతీసారి అతను చెలరేగిపోయాడు. చూడచక్కని డ్రైవ్లు, ఫ్లిక్లతో ఏ మాత్రం తడబాటు లేకుండా సునాయాసంగా శిఖర్ పరుగులు రాబట్టాడు. బ్యాక్ఫుట్పై అతను ఆడిన కొన్ని షాట్లు కనువిందు చేశాయి. 73 పరుగుల వద్ద మరో సారి క్యాచ్ మిస్ అయిన తర్వాత అతని జోరు మరింత పెరిగింది. కొద్ది సేపటికే మిడ్ వికెట్ మీదుగా ఫ్లిక్ ప్లస్ స్వీప్ కలగలిపిన కొత్త తరహా షాట్తో సెంచరీ చేరిన తీరు డెరైక్టర్ రవిశాస్త్రిని కూడా అబ్బురపరచినట్లుంది. అందుకే డ్రెస్సింగ్రూమ్నుంచి అదే షాట్ను ఆడి చూపించి మరీ ధావన్ను అభినందించాడు! శతకం తర్వాత కూడా అతను తన ఏకాగ్రత కోల్పోలేదు. 56 ఓవర్ల ఆటకే 150 మార్క్కు చేరితే ...అదే మొత్తం ఆట జరిగితే డబుల్ సెంచరీ కూడా సాధ్యమయ్యేదేమో! అయినా శిఖర్ ముందు మరో అవకాశం ఉంది. రెండో రోజు ఇదే తరహాలో చెలరేగితే కొత్త రికార్డులు ‘గబ్బర్’ ఖాతాలో చేరడం ఖాయం. -సాక్షి క్రీడావిభాగం సెషన్ 1: ఓపెనర్ల శుభారంభం టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. సిడ్నీ టెస్టు ఆడిన జట్టులో ఒకే మార్పు జరిగింది. రాహుల్ స్థానంలో ధావన్కు చోటు దక్కగా... ఐదో బౌలర్ కోసం అనూహ్యంగా కోహ్లి... పుజారాను పక్కన పెట్టాడు. భారత జట్టులో ముగ్గురు పేసర్లు ఉండగా, బంగ్లా ఒక పేసర్కే స్థానం కల్పించింది. షాహిద్ వేసిన రెండో ఓవర్లో ధావన్కు అదృష్టం కలిసొచ్చింది. బ్యాట్ అంచుకు తగిలిన బంతి స్లిప్లో ఫీల్డర్ ముందు పడింది. అయితే ఆ తర్వాత ఎక్కడా తగ్గని శిఖర్ దూసుకుపోయాడు. షువగత ఓవర్లో 2 ఫోర్లు కొట్టిన అతను, షాహిద్ వేసిన తర్వాతి ఓవర్లో మూడు ఫోర్లతో చెలరేగాడు. ఈ క్రమంలో 47 బంతుల్లోనే అతని అర్ధ సెంచరీ పూర్తయింది. మరో వైపు నెమ్మదిగా ఆడిన విజయ్ తన 31వ బంతికి గానీ తొలి బౌండరీ కొట్టలేకపోయాడు. 73 పరుగుల వద్ద ధావన్కు మళ్లీ లైఫ్ లభించింది. తైజుల్ బౌలింగ్లో షార్ట్ మిడ్ వికెట్ వద్ద అతను ఇచ్చిన సునాయాస క్యాచ్ను షువగత వదిలేశాడు. ఆ వెంటనే భారీ వర్షంతో మ్యాచ్ నిలిచిపోయింది. చాలా సేపటి వరకు తగ్గకపోవడంతో ముందుగానే లంచ్ విరామం ప్రకటించారు. ఓవర్లు: 23.3, పరుగులు: 107; వికెట్లు: 0 సెషన్ 2: వర్షంతో రద్దు వర్షం ఏ మాత్రం తెరిపినివ్వలేదు. ఈ సెషన్ మొత్తం తుడిచి పెట్టుకుపోయింది. దాంతో అంపైర్లు టీ బ్రేక్ కూడా ఇచ్చేశారు. సెషన్ 3: అదే దూకుడు ఆట మొదలైన తర్వాత మరోసారి భారత్ పరుగుల వర్షం ఆరంభమైంది. ఏ మాత్రం పస లేని ప్రత్యర్థి బౌలింగ్ను అలవోకగా ఎదుర్కొన్న ధావన్, విజయ్ ధాటిగా ఆడారు. షాహిద్ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన విజయ్ 98 బంతుల్లో హాఫ్ సెంచరీని చేరుకున్నాడు. వీరిద్దరి ముందు బంగ్లా స్పిన్ ఏ మాత్రం పని చేయలేదు. ఈ క్రమంలో భాగస్వామ్యం 200 పరుగులు దాటింది. ధావన్, విజయ్ మధ్య 200కు పైగా పార్ట్నర్షిప్ నమోదు కావడం ఇది రెండో సారి. ఆఖరి బంతికి సింగిల్ తీసి ధావన్ 150 స్కోరుకు చేరిన అనంతరం వెలుతురులేమితో ఆటను నిలిపేశారు. ఇన్నింగ్స్లో కేవలం 3 మెయిడిన్ ఓవర్లే వేయగలిగిన బంగ్లాదేశ్, ఒక్క ఎక్స్ట్రా కూడా ఇవ్వకపోవడం విశేషం. ఓవర్లు: 32.3, పరుగులు: 132; వికెట్లు: 0 -
నా పాత్ర ఏమీ మారలేదు!
భారత జట్టు సభ్యుడిగా మ్యాచ్లు గెలిపించడమే లక్ష్యంగా ఆడతానని, కుంబ్లేలాంటి దిగ్గజాలతో కలిసి ఆడినప్పుడు, ఇప్పుడు సీనియర్గా కూడా జట్టులో తన పాత్ర ఏమీ మారలేదని స్పిన్నర్ హర్భజన్ సింగ్ వ్యాఖ్యానించాడు. గత 5-7 ఏళ్లలో తన ఆటతీరు మార్చుకోలేదని, పునరాగమనమే లక్ష్యంగా శ్రమించానని భజ్జీ చెప్పాడు. అశ్విన్తో తన భాగస్వామ్యం అద్భుతాలు చేస్తుందని ఆశిస్తున్నానన్నాడు. -
నేర్చుకుంది చాలు...ఇక గెలవడం ముఖ్యం!
♦ టెస్టు కెప్టెన్ కోహ్లి వ్యాఖ్య ♦ బంగ్లాదేశ్కు బయల్దేరిన భారత జట్టు భారత జట్టు పరాజయంపాలైన సందర్భాల్లో కెప్టెన్గా ధోని సాధారణంగా ఎప్పుడూ చెప్పే సమాధానం ఒక్కటే. ‘ఓటమి నుంచి కూడా పాఠాలు నేర్చుకోగలిగాం. ఎలా ఆడామన్నది కూడా ముఖ్యం. కాబట్టి ఫలితాలకంటే దానిని సాధించే క్రమంలో ప్రక్రియకు నా దృష్టిలో ప్రాధాన్యత’ అని అతను వివరణ ఇచ్చేవాడు. కానీ ఆటలోనూ, మాటలోనూ ధోనికి భిన్నంగా గుర్తింపు తెచ్చుకున్న విరాట్ కోహ్లి ఇప్పుడు కూడా తన ఆలోచనను కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. అదీ ధోని ధోరణికి పూర్తి విరుద్ధంగా! మ్యాచ్లో నేర్చుకోవడాన్ని తాను నమ్మనని, గెలుపే ముఖ్యమని అతను వ్యాఖ్యానించడం విశేషం. కోల్కతా : బంగ్లాదేశ్తో ఒక టెస్టు, మూడు వన్డేల సిరీస్లో పాల్గొనేందుకు భారత క్రికెట్ జట్టు ఆదివారం ఢాకా బయల్దేరి వెళ్లింది. బుధవారం నుంచి ఇరు జట్ల మధ్య ఏకైక టెస్టు మ్యాచ్ జరుగుతుంది. ఈ సందర్భంగా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి మీడియాతో మాట్లాడాడు. సిరీస్కు సంబంధించిన వివిధ అంశాలపై అతను తన అభిప్రాయాలు వెల్లడించాడు. విశేషాలు కోహ్లి మాటల్లోనే... సన్నాహాలపై : జట్టులోని ఆటగాళ్లంతా ఉత్సాహం గా ఉన్నారు. కొంత విరామం తర్వాత దీనిని కొత్త ఆరంభంగా చెప్పవచ్చు. మన జట్టుకు సంబంధించి ఫిట్నెస్ అనేది ఎప్పుడూ సమస్యే. శనివారం ఫిట్నెస్ టెస్టులో అంతా బాగుంది. ఇరు జట్ల మధ్య ప్రపంచకప్ క్వార్టర్స్ మ్యాచ్ ప్రభావం, ప్రతీకారం తీర్చుకోవడంలాంటిది ఇక్కడ ఏమీ ఉండదు. అదంతా గతం. కెప్టెన్సీపై : టెస్టు కెప్టెన్గా నేను కూడా ఎంతో ఉద్వేగంగా ఉన్నాను. వన్డేలు, టి20లతో పోలిస్తే టెస్టు కెప్టెన్సీ భిన్నం. కాబట్టి దానికి సంబంధించి నా దృష్టిలో భిన్నమైన వ్యూహాలు ఉన్నాయి. గతంలో కెప్టెన్సీ చేసిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి కొత్త కాదు. ఆస్ట్రేలియాలో నాయకత్వం వహించినప్పుడు చాలా నేర్చుకున్నాను. టీమ్ బాగుంది కాబట్టి అదే నిలకడను కొనసాగిస్తాను. భారత జట్టు భవిష్యత్తుపై : ఒక విషయం నేను స్పష్టంగా చెప్పదల్చుకున్నా. మనం ఇప్పటికే చాలా నేర్చుకున్నాం. నేర్చుకోవాలనే ఆలోచనతో మ్యాచ్ బరిలోకి దిగడం, నేర్చుకుంటూనే ఉండటం సరైంది కాదు. టీవీలో చూసి కూడా నేర్చుకోవచ్చు! మనం తగినన్ని టెస్టులు ఆడాం. ఇకపై ఆ ప్రతిభను ఉపయోగించుకోవాలి. కాబట్టి టెస్టులు గెలవడమే లక్ష్యంగా మైదానంలోకి దిగాలి. గత కొన్ని టెస్టుల్లో చాలా నేర్చుకున్నాం. ఇకపై ఫలితాలు సాధించడమే ముఖ్యమని నా అభిప్రాయం. డ్రెస్సింగ్ రూమ్లో వాతావరణంపై : నేను ఈ టూర్లో ఎలాంటి వ్యక్తిగత లక్ష్యాలు పెట్టుకోలేదు. అసలు అవి లక్ష్యాలు కావనే నేను చెబుతాను. మ్యాచ్ను గెలిపించలేని సెంచరీ వృథా. కాబట్టి ఆటగాళ్లు తమ సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకునే, వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించే వాతావరణం నేను కల్పిస్తాను. మ్యాచ్ గెలవాలంటే ముందుగా మైండ్సెట్ అలాగే ఉండటం అవసరం. ఇంకా ఎక్కువ కాలం ఉంటానేమో : రవిశాస్త్రి భారత జట్టుకు ప్రస్తుతం ముగ్గురు అసిస్టెంట్ కోచ్లు ఉన్నారని, ఈ పరిస్థితుల్లో హెడ్ కోచ్ లేకపోవడం సమస్య కాదని టీమ్ డెరైక్టర్ రవిశాస్త్రి వ్యాఖ్యానిం చారు. అవసరమైన సమయంలో తాను ఆ పాత్రలో ఒదిగిపోగలనని ఆయన అన్నారు. బంగ్లాదేశ్ పర్యటన తర్వాత కూడా తాను కొనసాగే అవకాశం ఉందని రవి చూచాయగా చెప్పారు. ‘బంగ్లా టూర్ తర్వాత బీసీసీఐ పెద్దలతో చర్చించాల్సి ఉంది. మీరు అనుకుంటున్న దానికంటే ఎక్కువ సమయం జట్టుతో ఉంటానేమో. ప్రస్తుతానికి నేను దేనినీ కొట్టిపారేయడం లేదు’ అని శాస్త్రి స్పష్టం చేశారు. -
బంగ్లా పర్యటన తర్వాతే స్పష్టత
టీమ్ డెరైక్టర్ పదవిపై రవిశాస్త్రి న్యూఢిల్లీ : బంగ్లాదేశ్ పర్యటన అనంతరం భారత క్రికెట్ జట్టుతో తన కొనసాగింపుపై పూర్తి స్థాయిలో స్పష్టత వస్తుందని టీమ్ డెరైక్టర్ రవిశాస్త్రి పేర్కొన్నారు. ‘ప్రస్తుతానికైతే నేను జట్టుతో పాటే ఉన్నాను. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది బోర్డుతో సమావేశమై చర్చించాక తెలుస్తుంది. ఇప్పుడు ఆ విషయం గురించి నేనేమీ ఆలోచించడం లేదు. నా దృష్టంతా బంగ్లా పర్యటన మీదే ఉంది. కోహ్లి నా గురించి మాట్లాడిన విధానం బాగుంది. విరాట్ ఏదైనా సూటిగానే మాట్లాడుతాడు. జట్టులోని ఆటగాళ్లంతా నిజాయితీగా ఉంటారు. 35 ఏళ్ల నుంచి బోర్డుతో అనుబంధం కొనసాగుతోంది. ఈ కాలంలో చాలామంది అధ్యక్షులు మారారు. నేనందరితోనూ బాగానే ఉన్నాను’ అని రవిశాస్త్రి అన్నారు. -
ఫిజియో నితిన్ రాజీనామా
న్యూఢిల్లీ : భారత క్రికెట్ జట్టుకు సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న ఫిజియో నితిన్ పటేల్ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే నితిన్ రాజీనామాను బీసీసీఐ ఇంకా ఆమోదించలేదు. 2007 ఇంగ్లండ్ టూర్ సమయంలో జాన్ గ్లోస్టర్ స్థానంలో నితిన్ను ఫిజియోగా నియమించారు. విదేశీ పర్యటనలకు టీమిండియా వెంట ప్రయాణించడంతో పాటు బెంగళూరులోని ఎన్సీఏలో కూడా తన సేవలందించారు. -
ఇండియా క్రికెటర్లు బిజిబిజి
-
ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది!
భారత కోచ్ పదవిపై ఠాకూర్ ముంబై : భారత క్రికెట్ జట్టు కోచ్ను ఎంపిక చేసే ప్రక్రియ వేగవంతంగా సాగుతోందని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. ప్రస్తుతం దీనికి అర్హులైనవారితో షార్ట్ లిస్ట్ తయారు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. అయితే ఫలానా తేదీలోగా అనేది ఇప్పుడు చెప్పలేమని ఠాకూర్ స్పష్టం చేశారు. వన్డే ప్రపంచకప్తో డంకన్ ఫ్లెచర్ కాంట్రాక్ట్ ముగిసిన సంగతి తెలిసిందే. ‘కీలక నిర్ణయాలు తీసుకునేందుకు కాస్త సమయం పట్టడం సహజం. కోచ్ను ఎంపిక చేసే ప్రక్రియ ఇప్పుడు తుది దశకు చేరుకుంది. అయితే సమర్థుడైన, రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు అందించగల కోచ్ రావడం మాత్రం ఖాయం’ అని ఠాకూర్ అన్నారు. క్రికెట్ సలహా కమిటీని కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తామని చెప్పిన ఆయన, మాజీ క్రికెటర్ల సేవలు వినియోగించుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని పునరుద్ఘాటించారు. ఆటకంటే ఆటగాళ్లు ఎవరూ గొప్ప కాదంటూ, కోహ్లి ఇకపై తప్పు చేయడంటూ ఆశాభావం వ్యక్తం చేసిన ఠాకూర్... వివాదరహితంగా ఈ ఏడాది ఐపీఎల్ విజయవంతం కావడం చాలా సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. -
భారత్ బాగా బిజీ...
ఏడాది పాటు వరుస సిరీస్లు ముంబై : బంగ్లాదేశ్తో ఒక టెస్టు, మూడు వన్డేల తర్వాత భారత క్రికెట్ జట్టు ఈ ఏడాది మొత్తం బాగా బిజీగా ఉండబోతోంది. భవిష్యత్ పర్యటన కార్యక్రమం (ఎఫ్టీపీ) ప్రకారం టీమిండియా విరామం లేని విధంగా సిరీస్లు, టోర్నీలలో పాల్గొననుంది. వచ్చే టి20 ప్రపంచకప్ భారత్లో జరగనున్న నేపథ్యంలో దానికి సన్నాహకంగా భారత్ వచ్చే పది నెలల కాలంలో 11 టి20 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడనుంది. జూన్ 10న ప్రారంభమయ్యే బంగ్లా పర్యటన 24న ముగుస్తుంది. ఆ తర్వాత భారత్ ఆడే వేర్వేరు సిరీస్ల జాబితా చూస్తే... జులై: జింబాబ్వేలో భారత్ (3 వన్డేలు, 2 టి20లు) ఆగస్టు: శ్రీలంకలో పర్యటన (భారత్ - 3 టెస్టులు) సెప్టెంబర్- నవంబర్: భారత్లో దక్షిణాఫ్రికా (4 టెస్టులు, 5 వన్డేలు, 3 టి20) డిసెంబర్: పాకిస్తాన్తో సిరీస్ (కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఖరారు చేయాల్సి ఉంది) 2016 జనవరి: ఆస్ట్రేలియాలో భారత్ (5 వన్డేలు, 3 టి20లు) ఫిబ్రవరి: భారత్లో శ్రీలంక (3 టి20లు) ఫిబ్రవరి: ఆసియా కప్ టి20 (వేదిక ఖరారు కాలేదు) మార్చి-ఏప్రిల్: టి20 ప్రపంచ కప్ (భారత్లో) -
భారత జట్టు ఎంపిక 20న
ముంబై : వచ్చే నెలలో బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లే భారత క్రికెట్ జట్టు ఎంపిక ఈనెల 20న జరుగనుంది. ఒక టెస్టు, మూడు వన్డేల కోసం సందీప్ పాటిల్ నేతృత్వంలోని జాతీయ సెలక్షన్ కమిటీ రెండు జట్లను ప్రకటించనుంది. జూన్ 10 నుంచి 14 వరకు ఫతుల్లాలో టెస్టు, 18 నుంచి 24 వరకు మిర్పూర్లో వన్డే సిరీస్ జరుగుతుంది. అయితే ఈ పర్యటన నుంచి తమను తప్పించాలంటూ కోహ్లి సహా పలువురు సీనియర్ ఆటగాళ్లు బోర్డును కోరినట్టు సమాచారం. -
కోచ్ ఎంపిక ‘త్రిమూర్తుల’ చేతుల్లో...
* కమిటీలో సచిన్, గంగూలీ, ద్రవిడ్ * బీసీసీఐ వర్కింగ్ కమిటీ నిర్ణయం కోల్కతా: భారత క్రికెట్ జట్టు కొత్త కోచ్ను ఎంపిక చేయడంలో ముగ్గురు మాజీ దిగ్గజాలు కీలక పాత్ర పోషించనున్నారు. డంకన్ ఫ్లెచర్ పదవీ కాలం ప్రపంచకప్తో ముగియడంతో బీసీసీఐ కోచ్ ఎంపికపై దృష్టి పెట్టింది. ఆదివారం ఇక్కడ సమావేశమైన బోర్డు వర్కింగ్ కమిటీ అందు కోసం ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భారత మాజీ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ సభ్యులుగా ఉంటారు. టీమిండియా శిక్షకుడిని ఎంపిక చేయడంపై వీరు ముగ్గురూ తమ సూచనలు, సలహాలు బోర్డు అధ్యక్ష, కార్యదర్శులకు అందజేస్తారు. దీంతో కోచ్ పదవికి గంగూలీ రేసులో ఉన్నట్లు ఇటీవల వచ్చిన వార్తలకు ఫుల్స్టాప్ పడినట్లే. త్వరలోనే భారత జట్టుకు కొత్త కోచ్ రానుండగా... అసిస్టెంట్ కోచ్లు సంజయ్ బంగర్, భరత్ అరుణ్, ఆర్. శ్రీధర్లు మాత్రం ఇకపై కూడా కొనసాగే అవకాశం ఉంది. ఆటను మరింతగా అభివృద్ధి చేసేందుకు మాజీ ఆటగాళ్లతో కూడిన సలహా కమిటీని కూడా ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. న్యాయ సలహా కోసం: చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తమ విలువను కేవలం రూ. 5 లక్షలుగా చూపడంపై వర్కింగ్ కమిటీలో తీవ్ర చర్చ జరిగింది. పలువురు సభ్యులు దీనిపై ఐపీఎల్ సీఓఓ సుందర్ రామన్కు అనేక ప్రశ్నలు సంధించారు. మార్కెట్ విలువ కనీసం రూ. 1500 కోట్లు ఉండే జట్టును ఏ లెక్క ప్రకారం రూ. 5 లక్షలుగా చూపించారని మాజీ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ గట్టిగా నిలదీశారు. అయితే ఈ అంశంపై బోర్డు ఎలాంటి చర్య తీసుకోలేదు. దీనిపై తాజాగా న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలని మాత్రం నిర్ణయించారు. ‘అర్జున’కు రోహిత్ పేరు ప్రతిపాదన: మరోవైపు కేంద్ర ప్రభుత్వ క్రీడా పురస్కారం ‘అర్జున’ అవార్డు కోసం 2015 సంవత్సరానికి రోహిత్ శర్మ పేరును ప్రతిపాదించాలని కూడా వర్కింగ్ కమిటీలో నిర్ణయం తీసుకున్నారు. వన్డేల్లో రెండు డబుల్ సెంచరీలు నమోదు చేసిన ఏకైక ఆటగాడిగా రోహిత్ గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల మృతి చెందిన క్రికెటర్లు అంకిత్ కేసరి, గౌరవ్ కపూర్లకు ఈ సమావేశంలో శ్రద్ధాంజలి ఘటించారు. బుకీతో బోర్డు కార్యదర్శి! ముంబై: బీసీసీఐ కార్యదర్శిగా ఇటీవలే ఎంపికైన అనురాగ్ ఠాకూర్ వివాదంలో చిక్కుకున్నారు. జాతీయ మీడియా కథనం ప్రకారం... కరణ్ గిల్హోత్రా అనే అనుమానిత బుకీతో ఠాకూర్ సన్నిహితంగా మెలిగినట్లు సమాచారం. ఒక పార్టీలో కరణ్కు స్వయంగా ఠాకూర్ కేక్ తినిపిస్తున్న ఫొటో ఒకటి బయటికి వచ్చింది. ఐసీసీ అవినీతి నిరోధక విభాగం (ఏసీఎస్యూ) వద్ద ఉన్న బుకీల జాబితాలో కరణ్ పేరు కూడా ఉండటం వివాదానికి కారణమైంది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ నాలుగు రోజుల క్రితం ఐసీసీ, బీసీసీఐకి ఘాటుగా లేఖ రాసినట్లు తెలిసింది. ఫిక్సింగ్ మాయలో పడకుండా ఆటగాళ్లు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెబుతూ బీసీసీఐ ఏసీఎస్యూ డెరైక్టర్ రవి సవాని 2014లో అన్ని ఐపీఎల్ జట్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో కూడా కరణ్ గిల్హోత్రాకు దూరంగా ఉండాలని సూచనలు ఉన్నాయి. అయితే ఐసీసీ లేఖ రాసి నాలుగు రోజులు దాటినా బీసీసీఐ దానికి స్పందించలేదు. శ్రీనివాసన్ గూఢచర్యం!: మరోవైపు ఐసీసీ చైర్మన్ శ్రీనివాసన్ గతంలో తాను బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బోర్డు సభ్యులపైనే గూఢచర్యానికి పాల్పడినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. సహచరుల ఫోన్లు ట్యాప్ చేసేందుకు, ఇ-మెయిల్స్ హ్యాక్ చేసేందుకు శ్రీనివాసన్ లండన్కు చెందిన ప్రైవేట్ ఏజెన్సీని ఉపయోగించుకున్నట్లు సమాచారం. ఇందుకోసం ఆయన దాదాపు రూ. 14 కోట్ల బోర్డు సొమ్మునే వాడినట్లు తెలుస్తోంది. దీనిపై బీసీసీఐ త్వరలో విచారణ జరిపే అవకాశం ఉంది. -
టెన్నిస్ బంతులతో టీమిండియా ప్రాక్టీస్
సిడ్నీ: ప్రపంచకప్ సెమీఫైనల్ కోసం భారత క్రికెట్ జట్టు ప్రాక్టీస్ ప్రారంభించింది. దీంట్లో భాగంగా కోచ్ డంకెన్ ఫ్లెచర్ ఎక్కువగా బ్యాట్స్మన్ సురేశ్ రైనాపై దృష్టి పెట్టారు. షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కోవడంలో రైనా బలహీనత తెలిసిందే. అయితే ఇప్పుడు ఆసీస్తో జరుగబోయే మ్యాచ్ కాబట్టి 45 నిమిషాల పాటు రైనాతో కోచ్ తడితో కూడిన టెన్నిస్ బంతులతో ప్రాక్టీస్ చేయించారు. నెట్స్లో ఓవైపు రాకెట్తో కోచ్ వేగంగా సర్వ్ చేస్తుంటే రైనా వాటిని ఆడాడు. పచ్చికతో కూడిన పిచ్పై ఈ బంతిని విసిరితే వేగంగా వెళుతుందనే ఉద్దేశంతో కోచ్ ఇలా ప్రాక్టీస్ చేయించారు. రైనా శరీరాన్ని లక్ష్యంగా చేసుకుని కొన్ని బంతులను విసరగా వాటిని హుక్ షాట్ ఆడబోయిన రైనా కొన్నిసార్లు మాత్రమే సక్సెస్ అయ్యాడు. అటు ధోని కూడా కొద్దిసేపు ఈ తరహా బంతులను రైనాకు విసిరాడు. అలాగే మిగతా బ్యాట్స్మెన్ పేసర్లు, స్పిన్నర్లను ఎదుర్కొంటూ తమ ప్రాక్టీస్ కొనసాగించారు. ప్రాక్టీస్కు షమీ దూరం: భారత పేసర్ షమీ సోమవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్ నుంచి విశ్రాంతి తీసుకున్నాడు. అయితే షమీ మోకాలి గాయంతో బాధపడుతున్నట్లు వినిపిస్తున్న కథనాలను టీమ్ మీడియా మేనేజర్ ఆర్ఎన్ బాబా ఖండించారు. ‘అతడు వంద శాతం ఫిట్గా ఉన్నాడు. సెమీస్ మ్యాచ్కు అందుబాటులో ఉంటాడు. మోహిత్, ఉమేశ్ నెట్స్లో పాల్గొన్నా తను మరో రోజు విశ్రాంతి కావాలన్నాడు. టీమ్ దానికి అంగీకరించింది’ అని బాబా చెప్పారు. -
సెంచరీ హీరో : ఇచ్చిన మాట ప్రకారమే..!
-
సిడ్నీ టెస్టు : ఇక మూడో రోజు ఆటే కీలకం!
-
భారత్-ఆస్ట్రేలియా మూడో టెస్టులో నాలుగో రోజు
-
ఆసీస్లో ఆడడం చాలా కష్టం: సచిన్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితిపై బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందించాడు. అక్కడ బ్యాటింగ్ చేయడం అంత సులువు కాదని చెప్పాడు. ‘అక్కడి పరిస్థితులు జీవితాన్ని కష్టతరం చేస్తాయి. ఆటగాళ్లు, మీడియా, గ్రౌండ్స్మెన్ ఇలా ప్రతి ఒక్కరు ఇందుకు తమ వంతు పాత్రను పోషిస్తారు. అయితే అక్కడ విశేషంగా రాణిస్తే మాత్రం అందరూ లేచి నిలబడి హర్షం వ్యక్తం చేస్తారు. వారిలో ఉన్న సుగుణం ఇది. ఇక వచ్చే ప్రపంచకప్లో బరిలోకి దిగే అవకాశం లేదు కాబట్టి బయటి నుంచి వీక్షిస్తాను. నేను ఆడలేని స్థితిలో ఉన్నప్పుడు కోచింగ్ చేయడానికి ఇష్టపడను. ఈసారి కూడా మనకే ఎక్కువ అవకాశాలున్నాయని నా నమ్మకం. ఈవెంట్పై దృష్టి పెట్టి ముందుకెళితే ఫలితాలు అవే వస్తాయి’ అని సచిన్ అన్నాడు. మరోవైపు దేశంలోని ప్రతీ గ్రామానికి విద్యుత్ సౌకర్యం ఉండేలా కృషి చేస్తానని రాజ్యసభ సభ్యుడు కూడా అయిన సచిన్ అన్నాడు. దీనికి అందరి మద్దతు అవసరమని చెప్పాడు. -
నేను ‘మర్యాద’ ఇవ్వను!
జాన్సన్పై విరుచుకుపడ్డ కోహ్లి భారత్ ఇన్నింగ్స్లో 83వ ఓవర్... జాన్సన్ బౌలింగ్లో కోహ్లి ముందుకొచ్చి నేరుగా షాట్ ఆడాడు. దానిని అందుకున్న జాన్సన్, కోహ్లిని రనౌట్ చేసేందుకు స్ట్రయికింగ్ ఎండ్ వైపు విసిరాడు. అయితే అది నేరుగా కోహ్లి వీపును తాకింది. వెంటనే ఆసీస్ బౌలర్ ‘సారీ’ చెప్పేశాడు. మరొకరైతే జాన్సన్ క్షమాపణను స్వీకరించేవారేమో! కానీ అలా చేస్తే అతను కోహ్లి ఎందుకవుతాడు? వెంటనే ప్రత్యర్థితో వాదనకు దిగాడు. ఈసారి స్టంప్ వైపు విసిరేందుకు ప్రయత్నించు. నా శరీరంపై కాదు అని ఘాటుగా సమాధానమిచ్చాడు. ‘నా ఉద్దేశ్యం కూడా చెప్పాలి కదా. మైదానంలో అర్థంపర్థం లేని మాటలు నేను మాట్లాడను. క్రికెట్ ఆడటం కోసం క్రీజులో ఉన్నాను. నాకు తగిన మర్యాద ఇవ్వని ఆటగాడికి నేను కూడా ఎలాంటి మర్యాద ఇవ్వాల్సిన అవసరం గానీ కారణం గానీ లేదు’ అని జాన్సన్ గురించి వ్యాఖ్యానించాడు. ఇద్దరి మధ్య ఈ చిటపటలు రోజంతా నడుస్తూనే ఉన్నాయి. ఒకసారైతే అంపైర్లు కూడా కలగజేసుకోవాల్సి వచ్చింది. తన బౌలింగ్లో కోహ్లి విరుచుకుపడ్డ తీరు కూడా జాన్సన్కు ఆగ్రహం తెప్పించి ఉంటుంది. అయితే తన ఆట ద్వారానే భారత స్టార్ బదులిచ్చాడు. జాన్సన్ బౌలింగ్లో 73 బంతులు ఎదుర్కొన్న విరాట్ 68 పరుగులు చేశాడు. అతను కొట్టిన 18 ఫోర్లలో 11 జాన్సన్ బౌలింగ్లోనే వచ్చాయి. ఎలాంటి ఒత్తిడి లేకపోవడం వల్లే గత మ్యాచ్లో జాన్సన్ బాగా బ్యాటింగ్ చేశాడని, తన ప్రధాన బాధ్యత అయిన బౌలింగ్లో 4.7 రన్రేట్తో పరుగులు ఇచ్చి వికెట్ తీయలేకపోయినా జాన్సన్ ఇలా ప్రవర్తించడాన్ని కోహ్లి ఎద్దేవా చేశాడు. ‘ఆసీస్ ఆటగాళ్లు నన్ను చెడిపోయిన పిల్లాడు అన్నారు. నేను నిజంగా అలాంటివాడినేమో. వారు నన్ను ద్వేషించడమే నాకిష్టం. నన్ను ఎన్ని మాటలు అన్నా అది నాకే లాభించింది. నా అత్యుత్తమ ప్రదర్శన బయటపడింది. అయినా వారు మారరు’ అని కోహ్లి చెప్పాడు. సిరీస్లో 2-0తో ఆధిక్యంలో ఉండటం వల్లే ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, 1-1తో సమంగా ఉన్నప్పుడు ఇలా మాట్లాడగలిగేవారా అని ప్రశ్నించిన కోహ్లి, భారత్లో ఉన్నప్పుడు ఇలాంటి మాటలు రావెందుకో అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. అయితే చివరకు జాన్సన్ బౌలింగ్లోనే కోహ్లి వెనుదిరగడం కొసమెరుపు. -
కోహ్లి, రహానే ‘జుగల్బందీ’
సెంచరీలతో చెలరేగిన బ్యాట్స్మెన్ రికార్డు భాగస్వామ్యం నమోదు మూడో రోజు భారత్ 462/8 మెల్బోర్న్ టెస్టులో ఆసీస్కు కంగారు కుర్రాళ్లు కుమ్మేశారు... దాదాపు నాలుగు గంటల అద్భుత భాగస్వామ్యంతో భారత జట్టు భవిష్యత్తు తమ చేతిలో ఉందని చూపించారు. ప్రత్యర్థి బౌలింగ్కు అదరక, మాటలకు బెదరక కోహ్లి, రహానే అలవోకగా పరుగులు సాధించారు. ఆడుతోంది ఆసీస్ గడ్డపైనా... లేక భారత్లోనా అన్నట్లు ఆసీస్కు ‘కంగారు’ పుట్టించారు. ఏకపక్షంగా మారుతుందనుకున్న మ్యాచ్లో జీవం తెచ్చి అభిమానులకు ఆనందాన్ని పంచారు. 24 గంటల్లో ఎంత మార్పు... మా ఆటకు భారత్ వద్ద జవాబు లేదన్న ఆస్ట్రేలియా కెప్టెన్కు మూడో రోజు నోటి మాట పడిపోయింది. ప్రత్యర్థి బ్యాట్స్మెన్ చెలరేగుతుంటే... తమ ప్రధాన బౌలర్లు ఏమీ చేయలేక నిస్సహాయులైపోతే... అలవాటైన దూషణ అక్కరకు రాకపోతే... ఎలా నిలువరించాలో తెలీక స్మిత్ తలపట్టుకున్న క్షణాన... టీమిండియా సత్తా కనిపించింది. అయితే అద్వితీయ ప్రదర్శన వెంటే భారత జట్టుకు కాస్త అలసత్వం వెంట వచ్చినట్లుంది. ఫలితమే 53 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు... ఇంకా మనకు ఆధిక్యం దక్కలేదు. అయితే ఆదివారం ఆట మాత్రం ఆసీస్ గడ్డపై టీమిండియా ఏ సవాల్కైనా సిద్ధమేనని చూపించింది. గతానికి భిన్నంగా, ప్రత్యర్థికి ఏ మాత్రం తగ్గకుండా ఆడగలమని మెల్బోర్న్లో సందేశం ఇచ్చినట్లయింది. మెల్బోర్న్: ఆస్ట్రేలియా గడ్డపై భారత యువ క్రికెటర్లు మెరిశారు. తీవ్రమైన ఒత్తిడిలో మైదానంలోకి అడుగుపెట్టి అద్భుత శతకాలతో టీమిండియాను మెరుగైన స్థితిలో నిలిపారు. విరాట్ కోహ్లి (272 బంతుల్లో 169; 18 ఫోర్లు), అజింక్య రహానే (171 బంతుల్లో 147; 21 ఫోర్లు) భారీ సెంచరీలతో మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత్ 126.2 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 462 పరుగులు చేసి ప్రత్యర్థికి దీటుగా సమాధానం ఇచ్చింది. కోహ్లి, రహానే ధాటిగా ఆడి నాలుగో వికెట్కు 262 పరుగులు జోడించడం విశేషం. భారత్ ఇన్నిం గ్స్ను నడిపించిన కోహ్లి, చివరి ఓవర్లో అవుట్ కావడం కాస్త నిరాశపరచింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి జట్టు మరో 68 పరుగులు వెనుకబడి ఉంది. ప్రస్తుత స్థితిలో భారత్ చివరి 2 వికెట్లు ఆధిక్యాన్ని ఎంతవరకు తగ్గించగలవో చూడాలి. నాలుగో రోజంతా స్మిత్ సేన బ్యాటింగ్ చేసి భారత్కు సవాల్ విసిరితే టెస్టు ఆసక్తికరంగా మారవచ్చు. లేదంటే ‘డ్రా’కే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 530; భారత్ తొలి ఇన్నింగ్స్: విజయ్ (సి) మార్ష్ (బి) వాట్సన్ 68; ధావన్ (సి) స్మిత్ (బి) హారిస్ 28; పుజారా (సి) హాడిన్ (బి) హారిస్ 25; కోహ్లి (సి) హాడిన్ (బి) జాన్సన్ 169; రహానే (ఎల్బీ) (బి) లయోన్ 147; రాహుల్ (సి) హాజల్వుడ్ (బి) లయోన్ 3; ధోని (సి) హాడిన్ (బి) హారిస్ 11; అశ్విన్ (సి) అండ్ (బి) హారిస్ 0; షమీ (బ్యాటింగ్) 9; ఎక్స్ట్రాలు 2; మొత్తం (126.2 ఓవర్లలో 8 వికెట్లకు) 462 వికెట్ల పతనం: 1-55; 2-108; 3-147; 4-409; 5-415; 6-430; 7-434; 8-462. బౌలింగ్: జాన్సన్ 29.2-5-133-1; హారిస్ 25-7-69-4; హాజల్వుడ్ 25-6-75-0; వాట్సన్ 16-3-65-1; లయోన్ 29-3-108-2; స్మిత్ 2-0-11-0. ఆ రెండు క్యాచ్లు... భారత్ ఇన్నింగ్స్కు ఊపిరి పోసిన కోహ్లి, రహానేలు కీలక సమయాల్లో ఇచ్చిన క్యాచ్లను ఆసీస్ నేలపాలు చేసింది. రహానే 70 పరుగుల వద్ద లయోన్ తన బౌలింగ్లోనే నేరుగా వచ్చిన సునాయాస క్యాచ్ను అందుకోలేకపోయాడు. కోహ్లి 88 పరుగుల వద్ద జాన్సన్ బౌలింగ్లో స్లిప్లో వాట్సన్ వదిలేశాడు. అది కీపర్కు అందాల్సిన క్యాచ్ కాగా, వాట్సన్ అత్యుత్సాహం ప్రదర్శించాడు. మన బ్యాట్స్మెన్ ఆ తర్వాత ఆయా స్కోర్లకు దాదాపు రెట్టింపు పరుగులు చేయడం విశేషం. రాహుల్ క్యాచ్ను సిడిల్ వదిలేసినా, తర్వాతి బంతికే అవుట్ కావడంతో ఆసీస్పై దాని ప్రభావం పడలేదు. 2 గవాస్కర్ (1977) తర్వాత ఆసీస్ గడ్డపై ఒకే సిరీస్లో మూడు సెంచరీలు చేసిన రెండో భారత ఆటగాడు కోహ్లి. 9 కోహ్లి కెరీర్లో ఇది 9వ సెంచరీ. ఆస్ట్రేలియాపైనే ఐదోది. ఈ మ్యాచ్లో తన అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు (169) కూడా సాధించాడు. 4 గత పదేళ్లలో ఉపఖండం బయట భారత్కిదే (262) అత్యుత్తమ భాగస్వామ్యం. నాలుగుసార్లు మాత్రమే భారత్ 250కి పైగా భాగస్వామ్యాలు నమోదు చేసింది. 4 టెస్టుల్లో 250కి పైగా వికెట్లలో భాగం పంచుకున్న నాలుగో ఆస్ట్రేలియా వికెట్ కీపర్గా హాడిన్ నిలిచాడు. ఓవరాల్గా 9వ కీపర్. 1వందకు పైగా పరుగులిచ్చి కనీసం 2 వికెట్లు కూడా తీయకపోవడం జాన్సన్ కెరీర్లో ఇదే తొలిసారి. సెషన్-1: కోహ్లి నిలకడ ఓవర్నైట్ స్కోరు 108/1తో భారత్ ఆట ప్రారంభించింది. అయితే రెండో బంతికి పుజారా (25)ను హారిస్ అవుట్ చేశాడు. ఆ తర్వాత విజయ్ (68) కూడా ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. ఈ దశలో జత కలిసిన కోహ్లి, రహానే ఇన్నింగ్స్ను నిలబెట్టారు. రహానే రావడంతోనే దూకుడుగా ఆడగా, చక్కటి నియంత్రణతో బ్యాటింగ్ చేసిన కోహ్లి 86 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఓవర్లు: 29, పరుగులు: 116, వికెట్లు: 2 సెషన్-2: సూపర్ జోడి లంచ్ తర్వాత భారత ద్వయం అసలు జోరు చూపించింది. 60 బంతుల్లో రహానే అర్ధ సెంచరీ మార్క్ను చేరుకున్నాడు. ఏ ఆసీస్ బౌలర్ కూడా ఈ జంటపై ప్రభావం చూపించలేకపోయాడు. ఆఫ్, ఆన్సైడ్ తేడా లేకుండా... పాయింట్, కవర్స్, స్క్వేర్ లెగ్ భేదం లేకుండా మైదానమంతా వీరు షాట్లతో చెలరేగారు. ఆసీస్ ఆటగాళ్లు క్యాచ్లు వదిలేయడం కూడా ఈ ఇద్దరికి కలిసొచ్చింది. క్రీజ్లోకి తర్వాత వచ్చినా... రహానే ముందుగా 127 బంతుల్లో, ఆ తర్వాత కోహ్లి 166 బంతుల్లో సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఈ సెషన్లో భారత జంట పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఓవర్లు: 29, పరుగులు: 112, వికెట్లు: 0 సెషన్-3: కోలుకున్న ఆసీస్ విరామం తర్వాత కూడా కోహ్లి, రహానే తగ్గలేదు. జాన్సన్ వేసిన ఒక ఓవర్లో కోహ్లి వరుసగా మూడు ఫోర్లు బాదగా, మరో ఓవర్లో రహానే మూడు ఫోర్లు కొట్టాడు. చివరకు లయోన్, రహానేను ఎల్బీగా అవుట్ చేసి ఈ భారీ భాగస్వామ్యాన్ని విడదీశాడు. తొలి టెస్టు ఆడుతున్న లోకేశ్ రాహుల్ (3) అవకాశాన్ని వృథా చేసుకున్నాడు. అనవసరపు స్వీప్ షాట్కు ప్రయత్నించి వెనుదిరిగాడు. ఆ తర్వాత ధోని (11), అశ్విన్ (0) అవుటయ్యారు. చివర్లో కోహ్లి వికెట్ తీసి ఆసీస్ రోజును సంతృప్తిగా ముగించింది. ఓవర్లు: 31.2, పరుగులు: 126, వికెట్లు: 5 ‘ఈ రోజు మా ఆటతో గర్వంగా ఉన్నా. నేను, రహానే మా సహజ శైలిలో ఆడాలని భావించి ఒకరినొకరు ప్రోత్సహించుకున్నాం. ఒక పెద్ద భాగస్వామ్యం వస్తేనే నిలబడగలం. భారీ సెంచరీ చేయాలని కూడా పట్టుదలగా ఆడా. వచ్చేసారి దీనిని డబుల్ సెంచరీగా మారుస్తా. జాన్సన్పై రహానే దూకుడు ప్రదర్శించడం నన్నూ చాలా ఆశ్చర్యపరి చింది. ఫీల్డింగ్లో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పిన ఆసీస్ ఇలా క్యాచ్లు వదిలి, సునాయాసంగా సింగిల్స్ ఇవ్వడం అరుదు. ఇంత నిలకడలేమితో వారు ఎప్పుడు ఆడారో గుర్తు లేదు. నేను చివర్లో అవుట్ కాకుండా ఉండాల్సింది. అయితే నాలుగో రోజు మరి కొన్ని పరుగులు జత చేసి, 2-3 వికెట్లు తీయగలిగితే మ్యాచ్ ఆసక్తికరంగా ఉంటుంది.’ -విరాట్ కోహ్లి, భారత బ్యాట్స్మన్ ‘మా ఫీల్డింగ్ నాసిరకంగా ఉంది. ఆ క్యాచ్లు పట్టుంటే పరిస్థితి భిన్నంగా ఉండేది. మేం కొన్ని సార్లు మంచి బౌలింగ్ చేయగలిగినా... కోహ్లి, రహానే చాలా బాగా ఆడారు. తగిన వ్యూహాలతో ఆ సమయంలో మేం చేయగలిగిందంతా చేసినా లాభం లేకపోయింది. కోహ్లిలాంటి ఆటగాడిని మేం గౌరవిస్తాం. మైదానంలో కొన్ని సార్లు మాటలు అనుకుంటారు. అదేమీ వ్యక్తిగతం కాదు. ఆటలో భాగం మాత్రమే. కోహ్లి ఆ విషయం గురించి ఎంత మాట్లాడితే అది అతనిపై అంత ప్రభావం చూపించిందనేగా అర్థం.’ -ర్యాన్ హారిస్, ఆసీస్ బౌలర్ -
దీటుగా జవాబిచ్చిన ధోని సేన
-
దీటుగా జవాబిచ్చిన ధోని సేన
మెల్ బోర్న్: అజింక్య రహానే, విరాట్ కోహ్లి సెంచరీలు సాధించడంతో మూడో టెస్టులో ఆస్ట్రేలియాకు భారత్ దీటుగా జవాబిచ్చింది. తొలి ఇన్నింగ్స్ లో 8 వికెట్లు కోల్పోయి 462 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా కంటే 68 పరుగులు వెనుకబడింది. 108/1 ఓవర్ నైట్ స్కోరుతో మూడో ఆట ప్రారంభించిన టీమిండియా వెంటవెంటనే మురళీ విజయ్(68), పూజారా(25) వికెట్లు కోల్పోయింది. తర్వాత కోహ్లి, రహానే ఆచితూచి ఆడి జట్టు స్కోరు పెంచారు. ఈ క్రమంలో ఇద్దరూ సెంచరీలు సాధించారు. రహానే 147, కోహ్లి 169 పరుగులు చేసి అవుటయ్యారు. ధోని(11), రాహుల్(3) నిరాశ పరిచారు. ఆట ముగిసే సమయానికి మహ్మద్ షమీ 9 పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో హరీస్ 4 వికెట్లు నేలకూల్చాడు. లియాన్ 2 వికెట్లు తీశాడు. జాన్సన్, వాట్సన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. -
టెస్టుల్లో మొదటిసారి 150 పరుగులు చేసిన కోహ్లి
మెల్ బోర్న్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో భారత్ 434 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయింది. అజింక్య రహానే, విరాట్ కోహ్లి సెంచరీలు సాధించారు. 147 పరుగులు చేసిన రహానే నాలుగో వికెట్ గా అవుటయ్యాడు. తొలి టెస్టు ఆడుతున్న రాహుల్ 3 పరుగులు మాత్రమే చేశాడు. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కూడా ఎక్కువ సేపు క్రీజ్ లో నిలబడలేకపోయాడు. 11 పరుగులు చేసి ఆరో వికెట్ గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన ఆశ్విన్ డకౌటయ్యాడు. మురళీ విజయ్ 68, ధావన్ 28, పూజారా 25 పరుగులు చేసి అవుటయ్యారు. కోహ్లి 152 పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. కోహ్లి టెస్టుల్లో మొదటిసారి 150 పరుగులు సాధించాడు. -
సెంచరీలతో చెలరేగిన కోహ్లి, రహానే!
-
రహానే, కోహ్లి సెంచరీలు
మెల్ బోర్న్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో భారత బ్యాట్స్ మన్ అజింక్య రహానే, విరాట్ కోహ్లి సెంచరీలు సాధించారు. ముందుగా రహానే సెంచరీ కొట్టాడు. 127 బంతుల్లో 13 ఫోర్లు శతకం పూర్తి చేశాడు. టెస్టుల్లో అతడికిది మూడో సెంచరీ. తర్వాత కోహ్లి కూడా సెంచరీ సాధించాడు. 166 బంతుల్లో 11 ఫోర్లతో సెంచరీ పూర్తి చేశాడు. టెస్టుల్లో అతడికిది 9వ సెంచరీ. 108/1 ఓవర్ నైట్ స్కోరుతో మూడో ఆట ప్రారంభించిన టీమిండియా 147 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. మురళీ విజయ్(68) మూడో వికెట్ గా వెనుదిరిగాడు. అంతకుముందు పూజారా(25) అవుటయ్యాడు. టీ విరామ సమయానికి టీమిడింయా 3 వికెట్లు కోల్పోయి 336 పరుగులు చేసింది. -
కోహ్లి, రహానే అర్థ సెంచరీలు
మెల్ బోర్న్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత్ నిలకడగా ఆడుతోంది. 108/1 ఓవర్ నైట్ స్కోరుతో మూడో ఆట ప్రారంభించిన టీమిండియా 147 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. మురళీ విజయ్(68) మూడో వికెట్ గా వెనుదిరిగాడు. అంతకుముందు పూజారా(25) అవుటయ్యాడు. తర్వాత విరాట్ కోహ్లి, అజింక్య రహానే అర్థ సెంచరీలు సాధించడంతో టీమిండియా కుదురుకుంది. ముందుగా కోహ్లి హాఫ్ సెంచరీ చేశాడు. టెస్టుల్లో అతడికి ఇది 10వ అర్థ సెంచరీ. తర్వాత రహానే టెస్టుల్లో 7వ అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రహానే 60 బంతుల్లో 6 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. కోహ్లి(88), రహానే(78) క్రీజ్ లో ఉన్నారు. డ్రింక్స్ విరామ సమయానికి భారత్ స్కోరు 279 పరుగులు చేసింది.