
కోచ్ రేసులో సందీప్ పాటిల్
భారత క్రికెట్ జట్టు నూతన కోచ్ పదవిపై జాతీయ చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ ఆసక్తి ప్రదర్శిస్తున్నారు.
దరఖాస్తు చేసిన చీఫ్ సెలక్టర్
ముంబై: భారత క్రికెట్ జట్టు నూతన కోచ్ పదవిపై జాతీయ చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఈ బాధ్యతలు చేపట్టేందుకు తన పేరును పరిశీలించాల్సిందిగా ఆయన బీసీసీఐకి దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుత చీఫ్ సెలక్టర్ పదవీకాలం ఈ సెప్టెంబర్లో ముగుస్తుంది. అయితే అప్పటిలోగా ముఖ్య పర్యటనల కోసం జట్ల ఎంపిక పూర్తయ్యింది కాబట్టి ఈ పదవికి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా బీసీసీఐ ఆయనకు సూచించినట్టు సమాచారం. పాటిల్ 1996లో ఆరు నెలల స్వల్ప కాలం భారత జట్టుకు కోచ్గా వ్యవహరించారు. అలాగే 2003 ప్రపంచ కప్లో కెన్యా సంచలన ప్రదర్శనతో సెమీఫైనల్కు చేరిన సమయంలో ఆ జట్టుకు పాటిలే కోచ్గా ఉన్నారు.
ఒకవేళ తను కోచ్గా ఎంపికైతే సెప్టెంబర్కన్నా ముందే చీఫ్ సెలక్టర్ పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. 2014లో డంకన్ ఫ్లెచర్ వైదొలిగిన అనంతరం జాతీయ జట్టు ప్రధాన కోచ్ లేకుండానే బరిలోకి దిగుతోంది. ఈ కాలంలో టీమ్ డెరైక్టర్ హోదాలో రవిశాస్త్రి దాదాపుగా కోచ్ బాధ్యతలు చేపట్టారు. ఇటీవలి టీ20 ప్రపంచకప్ వరకు ఇలాగే కొనసాగినా ఇక చీఫ్ కోచ్ నియామకం చేపట్టాలని బీసీసీఐ నిర్ణయించింది. అలాగే ఇప్పటి వరకు ఈ పదవి కోసం రవిశాస్త్రి, సంజయ్ బంగర్ కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఈనెల 10 వరకు అప్లికేషన్లకు గడువుండగా పాటిల్కు రవిశాస్త్రి నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది.