చెపాక్ వేదికగా అఫ్గానిస్తాన్తో జరిగిన మూడో వన్డేలో 9 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయాన్ని అందుకుంది. దీంతో మూడు వన్డేల సిరీస్ను 3-0 తేడాతో టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. 219 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 28.4 ఓవర్లలో చేధించింది.
ఓపెనర్ యశస్వి జైశ్వాల్(110) అజేయ శతకంతో మ్యాచ్ ఫినిష్ చేశాడు. అతడితో పాటు మరో సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 219 పరుగుల లక్ష్య ఛేదనలో హిట్మ్యాన్ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. 69 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్లతో 79 పరుగులు చేశాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
వన్డేల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన మూడో భారత ఆటగాడిగా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ను రోహిత్ అధిగమించాడు. రోహిత్కు ఇది 95వ హాఫ్ సెంచరీ. ద్రవిడ్ తన వన్డే కెరీర్లో 94 ఆర్ధ శతకాలు నమోదు చేశాడు. ఈ జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (145) టాప్ ప్లేస్లో కొనసాగుతుండగా.. విరాట్ కోహ్లి(131) రెండో స్ధానంలో ఉన్నాడు.
అదేవిధంగా వన్డే క్రికెట్ చరిత్రలో టీమిండియా తరపున హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా రోహిత్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. 39 ఏళ్ల 51 రోజుల వయస్సులో వయస్సులో అతడు ఈ ఫీట్ సాధించాడు. అంతకుముందు ఈ రికార్డు భారత మాజీ క్రికెటర్ మొహిందర్ అమర్నాథ్ పేరిట ఉండేది. అమర్నాథ్ 1989లో పాకిస్తాన్పై 39 ఏళ్ల 21 రోజుల వయసులో ఆర్ధ శతకం నమోదు చేశాడు. తాజా మ్యాచ్తో అమర్నాథ్ ఆల్టైమ్ రికార్డు హిట్మ్యాన్ బ్రేక్ చేశాడు.
చదవండి: IND vs AFG: భారత వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారి


