గ్రీన్ కార్డ్ హోల్డర్లకు ట్రంప్‌ సర్కారు బిగ్ షాక్! | Trump Administration Proposes 75 Hike in US Citizenship Fees, Ends Waivers | Sakshi
Sakshi News home page

గ్రీన్ కార్డ్ హోల్డర్లకు ట్రంప్‌ సర్కారు బిగ్ షాక్!

Jun 23 2026 12:22 PM | Updated on Jun 23 2026 1:11 PM

Trump Administration Proposes 75 Hike in US Citizenship Fees, Ends Waivers

వాషింగ్టన్‌: అమెరికా పౌరసత్వం కోసం కలలు కంటున్న విదేశీయులకు డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. యూఎస్ పౌరసత్వ దరఖాస్తు రుసుములను ఏకంగా 75 శాతం మేరకు పెంచడంతో పాటు, వలసదారులకు ఇచ్చే ఫీజు మినహాయింపులను (ఫీజ్ వైవర్స్) పూర్తిగా రద్దు చేయాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్‌) ప్రతిపాదించింది. వలసలపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్ యంత్రాంగం చట్టబద్ధమైన పౌరసత్వ ప్రక్రియను మరింత కఠినతరం చేసే దిశగా ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా తక్కువ ఆదాయం ఉన్న దరఖాస్తుదారులపై ఈ నిబంధనలు తీవ్ర ప్రభావం చూపనున్నాయి. 

ఫీజుల మోత.. ఎంత పెరగనుంది?
యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ విడుదల చేసిన ప్రతిపాదనల ప్రకారం సాధారణ పేపర్ ఫైలింగ్ (Form N-400) ఫీజు ప్రస్తుతమున్న $760 నుండి ఏకంగా $1,330(రూ.64,000 నుండి రూ.1,13,050)కి పెరగనుంది. ఆన్‌లైన్ దరఖాస్తు ఫీజు కూడా $710 నుండి $1,280(రూ.59,000 నుండి రూ. 1,09,000)కి చేరనుంది. వీటితో పాటు, అప్పీల్ బోర్డు ముందు పునఃపరిశీలన కోరేందుకు సమర్పించే ఫామ్ (Form N-336) ఫీజు సైతం $830 నుండి $1,475 కి, అంటే సుమారు 77.7 శాతం పెంచాలని ప్రతిపాదించారు. దరఖాస్తుల స్క్రీనింగ్, వెట్టింగ్ ప్రక్రియలకు అయ్యే పూర్తి ఖర్చును దరఖాస్తుదారుల నుంచే వసూలు చేయాలన్నది ట్రంప్ ప్రభుత్వ ఆలోచనగా అధికారులు చెబుతున్నారు.

ఫీజు మినహాయింపులకు శాశ్వతంగా చెక్
ఇప్పటివరకు తక్కువ ఆదాయం ఉన్నవారికి, ప్రభుత్వ ప్రయోజనాలు పొందుతున్నవారికి అందుబాటులో ఉన్న ‘ఫీజ్ వైవర్స్’ (రుసుము మినహాయింపులు) విధానాన్ని ఈ కొత్త రూల్ పూర్తిగా రద్దు చేయనుంది. అలాగే ఫెడరల్ పేదరిక మార్గదర్శకాలకు లోబడి ఉన్నవారికి వర్తించే $380 తగ్గింపు ఫీజు (Reduced fee) సౌకర్యం కూడా ఇకపై ఉండదు. ఉచిత లేదా తక్కువ ఫీజులు ఉండటం వల్ల అర్హత లేనివారు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని డీహెచ్‌ఎస్‌ వాదించింది. అయితే, చట్టప్రకారం యూఎస్ సాయుధ దళాలలో పనిచేస్తున్న వారికి మాత్రం ఈ ఫీజుల నుండి మినహాయింపు కొనసాగుతుంది.

ట్రంప్ కొత్త నిర్ణయం.. లక్షల మంది ఇండియన్లకు షాక్

అమలు ఎప్పటి నుండి..
ఈ ప్రతిపాదిత నిబంధనలు తక్షణమే అమలులోకి రావు. ఈ ముసాయిదాపై ప్రజలు తమ అభిప్రాయాలను, అభ్యంతరాలను తెలియజేయడానికి 60 రోజుల సమయం ఉంటుంది. ఆ తర్వాతే తుది నిర్ణయం వెలువడుతుంది. కాగా, గత నెలలోనే గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులు దేశం విడిచి వెళ్లి తమ స్వదేశాల్లో ప్రక్రియ పూర్తి చేయాలంటూ జారీ చేసిన మెమో ఇప్పటికే వలసదారులను కలవరపెట్టగా, తాజా ఫీజుల పెంపు ప్రతిపాదన వారిని మరింత ఆందోళనలోకి నెట్టింది. తరతరాలుగా వలసలను ప్రోత్సహించిన అమెరికా, ఇప్పుడు దానికి భిన్నమైన వ్యూహాన్ని అనుసరిస్తోందని నిపుణులు విమర్శిస్తున్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement