రెండు రోజుల కిందటే రహస్యంగా అమెరికాకు..
డీఎస్సీ కుంభకోణంపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహావేశాలు
అవేమీ పట్టనట్టు విదేశాలకు చెక్కేయడంపై విమర్శలు
సాక్షి, అమరావతి: సీఎం తనయుడు, ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ మళ్లీ మాయమయ్యారు. రెండు రోజుల క్రితమే ఆయన రాష్ట్రాన్ని వీడి రహస్యంగా అమెరికా వెళ్లినట్లు తెలిసింది. డీఎస్సీలో మెగా కుంభకోణానికి పాల్పడిన కూటమి ప్రభుత్వంపైన, ఆ శాఖ మంత్రి లోకేశ్పైనా రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్న విషయం తెలిసిందే. డీఎస్సీలో అక్రమాలకు బాధ్యత వహిస్తూ లోకేశ్ రాజీనామా చేయాలనే డిమాండ్ రాష్ట్ర వ్యాప్తంగా ఊపందుకున్న వేళ ఆయన విదేశాలకు వెళ్లడం గమనార్హం. తన శాఖలో జరిగిన అతిపెద్ద కుంభకోణంపై ప్రజలకు జవాబు చెప్పాల్సిన మంత్రి, ఇలా వ్యవహరించడాన్ని సర్వత్రా తప్పుపడుతున్నారు.
లోకేశ్కు రహస్య విదేశీ పర్యటనలు కొత్తేమీ కాదు. నెలకోసారి ఆయన విదేశీ పర్యటనలకు వెళుతున్నారు. అయితే దీనిపై పార్టీలో ముఖ్యులకూ సమాచారం ఉండడం లేదు. సాధారణంగా ప్రభుత్వ అధికారులు, మంత్రులు హెడ్ క్వార్టర్ వీడి పక్క రాష్ట్రం వెళ్లినా ప్రభుత్వం అధికారికంగా జీఓ జారీ చేస్తుంది. ముఖ్యమంత్రి అయినా సరే అన్ని పర్యటనల గురించి జీఓ జారీ చేయాల్సిందే. లోకేశ్ గత రెండేళ్లుగా ఇప్పటికి చాలాసార్లు అసలు ఎక్కడికి వెళుతున్నారో కూడా తెలియకుండా అదృశ్యమైపోతున్నారు. ప్రభుత్వ ఖర్చుతో ప్రత్యేక విమానాల్లో విదేశాలకు రహస్యంగా చెక్కేస్తున్నారు.


