స్లాక్హోమ్: డిజిటల్ విప్లవానికి మారుపేరుగా నిలిచిన స్వీడన్ తాజాగా దేశ విద్యావ్యవస్థలో ఊహించని యూటర్న్ తీసుకుంది. క్లాస్రూమ్లలో ల్యాప్టాప్లు, టాబ్లెట్లను విరివిగా ఉపయోగించి ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన ఈ దేశం, ఇప్పుడు మళ్లీ పాత కాలం నాటి ప్రింటెడ్ పుస్తకాల వైపు అడుగులు వేస్తోంది. స్క్రీన్ల వాడకం వల్ల విద్యార్థుల్లో ఏకాగ్రత లోపించడం, చదువుల్లో వెనుకబడటం వంటి తీవ్రమైన సమస్యలు తలెత్తుతుండటంతో స్వీడన్ ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.
డిజిటల్ చదువుల దుష్ప్రభావాలు
2010 నుంచి స్వీడన్.. దేశంలోని పాఠశాలల్లో డిజిటల్ పరికరాల వాడకాన్ని విపరీతంగా పెంచింది. అయితే 2018 నుండి 2022 మధ్య కాలంలో ఒలింపియాడ్ తరహా అంతర్జాతీయ పరీక్ష ఫలితాల్లో దేశంలోని విద్యార్థుల రీడింగ్, మ్యాథ్స్ స్కోర్లు దారుణంగా పడిపోయాయి. డిజిటల్ పరికరాలపై ఎక్కువ సమయం గడపడం వల్ల పిల్లల మెదడు ఎదుగుదల దెబ్బతింటుందని, దృష్టి కేంద్రీకరించే సామర్థ్యం (కాన్సంట్రేషన్) తగ్గుతుందని న్యూరో సైంటిస్టులు, పీడియాట్రిక్ నిపుణుల పరిశోధనలో తేలింది. ‘గ్యాడ్జెట్స్లో చదవడం వల్ల తలనొప్పి వస్తోందని, భౌతిక పుస్తకాలతోనే బాగా చదవగలుగుతున్నామని’ అక్కడి విద్యార్థులు స్వయంగా చెబుతున్నారు.
బడ్జెట్లో భారీ కేటాయింపులు
ఈ తీవ్ర పరిణామాలను గమనించిన స్వీడన్ ప్రభుత్వం 2023లో తన విద్యా విధానాన్ని పూర్తిగా మార్చేసింది. ముఖ్యంగా చిన్న పిల్లలకు డిజిటల్ స్క్రీన్లను దూరం చేసి, పేపర్ ఆధారిత బోధనను ప్రోత్సహిస్తోంది. ఇందుకోసం కేవలం ప్రింటెడ్ పాఠ్యపుస్తకాలు, ఇతర బోధనా సాగ్రి కొనుగోలు కోసమే ఏటా 65.8 కోట్ల నుండి 75.5 కోట్ల క్రోనార్ల (భారతీయ కరెన్సీలో వందల కోట్లు) భారీ బడ్జెట్ను 2025 వరకు కేటాయించింది. జపాన్ వంటి కొన్ని దేశాలు డిజిటల్ టెక్స్ట్బుక్స్ వైపు అడుగులు వేస్తున్న తరుణంలో, స్వీడన్ మాత్రం మళ్లీ పేపర్ పుస్తకాలకే పెద్దపీట వేయడం గమనార్హం.
ఇతర కారణాలు.. సమతుల్యత
అయితే విద్యార్థుల మార్కులు తగ్గడానికి కేవలం టెక్నాలజీ మాత్రమే కారణం కాదని కొందరు పరిశోధకులు వాదిస్తున్నారు. 2015 నుండి సిరియా, ఆఫ్ఘనిస్తాన్, ఆఫ్రికా దేశాల నుండి పెద్ద సంఖ్యలో వలస వచ్చిన శరణార్థుల పిల్లలు స్థానిక భాష, విద్యా విధానాన్ని అందుకోవడంలో ఇబ్బంది పడటం కూడా ఒక కారణమని చెబుతున్నారు. సాంకేతికతను పూర్తిగా నిందించకుండా, డిజిటల్ స్క్రీన్లకు, సాంప్రదాయ పుస్తక పఠనానికి మధ్య సరైన సమతుల్యతను సాధించడమే దీనికి సరైన పరిష్కారమని అక్కడి విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.
ఇది కూడా చదవండి: అమెరికాపై చైనా ప్రతీకారం.. 46 కంపెనీలపై నిషేధం


