మహా రాజకీయం.. ఉద్ధవ్‌కు బిగ్‌ షాక్‌ | All six rebel Sena UBT MPs to join Shinde's Shiv Sena today | Sakshi
Sakshi News home page

మహా రాజకీయం.. ఉద్ధవ్‌కు బిగ్‌ షాక్‌

Jun 22 2026 7:07 AM | Updated on Jun 22 2026 10:28 AM

All six rebel Sena UBT MPs to join Shinde's Shiv Sena today

ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన(UBT)కు చెందిన ఆరుగురు లోక్‌సభ ఎంపీలు సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని శివసేనలో అధికారికంగా చేరనున్నట్లు సమాచారం. ఈ పరిణామం ఉద్ధవ్ వర్గానికి భారీ రాజకీయ ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. మహారాష్ట్రలో కొన్ని రోజులుగా సాగుతున్న ‘ఆపరేషన్ టైగర్’కు ఇది కీలక మలుపుగా భావిస్తున్నారు.

గత కొన్ని రోజులుగా శివసేన (యూబీటీ)లో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఎంపీలు వరుసగా షిండే వర్గంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఆ ప్రక్రియ తుది దశకు చేరుకోవడంతో ఆరుగురు ఎంపీలు.. ఏక్‌నాథ్‌ షిండే సమక్షంలో పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. షిండే వర్గంలో చేరుతున్న వారిలో ఎంపీలు సంజయ్ దినా పాటిల్, సంజయ్ దేశ్‌ముఖ్, సంజయ్ జాధవ్, భౌసాహెబ్ వక్చౌరే, నాగేశ్ పాటిల్ అష్టికర్, ఓంప్రకాశ్ రాజే నింబాల్కర్ ఉన్నట్లు సమాచారం. వీరిలో కొందరు ఇప్పటికే బహిరంగంగా షిండే నాయకత్వానికి మద్దతు ప్రకటించగా, మరికొందరు తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసం అధికార పక్షంతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.

ఇటీవలే ఎంపీ ఓంప్రకాశ్ రాజే నింబాల్కర్ అధికారికంగా షిండే శివసేనలో చేరడం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. ఆ వెంటనే మరికొందరు ఎంపీలు కూడా అదే బాట పట్టడంతో ఉద్ధవ్ థాక్రే వర్గంలో ఆందోళన నెలకొంది. లోక్‌సభ ఎన్నికల్లో మంచి ప్రదర్శన కనబరిచిన యూబీటీకి ఇది ఊహించని పరిణామంగా విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు మహారాష్ట్ర అధికార కూటమి ఈ పరిణామాన్ని తమ రాజకీయ విజయంగా ప్రచారం చేస్తోంది. అధికార పక్షంతో ఉంటేనే ప్రజల సమస్యలను సమర్థంగా పరిష్కరించగలమనే అభిప్రాయంతో పలువురు ప్రజాప్రతినిధులు ముందుకు వస్తున్నారని పలువురు మంత్రులు చెబుతున్నారు.

అయితే ఉద్ధవ్ థాక్రే వర్గం మాత్రం ఈ పరిణామాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. పార్టీ నాయకుడు సంజయ్‌ రౌత్‌ మాట్లాడుతూ.. కొందరు అసంతృప్త ఎంపీలు ఇంకా తమతోనే సంప్రదింపులు జరుపుతున్నారని, పార్టీని వీడిన వారిలో కొందరు తిరిగి వచ్చే అవకాశమూ ఉందని చెప్పారు. శివసేన (యూబీటీ) బలహీనపడలేదని, కార్యకర్తల మద్దతు తమకే ఉందని ఆయన స్పష్టం చేశారు.

2022లో జరిగిన శివసేన చీలిక తర్వాత మహారాష్ట్ర రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. అప్పట్లో ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలో పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయగా, ఇప్పుడు అదే తరహాలో ఎంపీల స్థాయిలోనూ వలసలు కొనసాగడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ తాజా చేరికలతో మహారాష్ట్రలో షిండే వర్గం మరింత బలోపేతం అవుతుండగా, ఉద్ధవ్ థాక్రే వర్గం ముందు కొత్త సవాళ్లు నిలుస్తున్నాయి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ఈ పరిణామాలు మహారాష్ట్ర రాజకీయ సమీకరణాలపై గణనీయ ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement