మిథున్రెడ్డి(ఫైల్ఫోటో)
ఢిల్లీ: ఏపీలో పంటల బీమా పథకం పడకేసిందనే విషయం లోక్సభ సాక్షిగా తేటతెల్లమైంది. 2025-26 లో కేవలం 18.88 లక్షల మంది రైతులు మాత్రమే ఎన్రోల్ అయిన విషయం వెలుగు చూసింది. ఏపీలో పంటల బీమా పథకం గురించి వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి అడగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి రామ్నాథ్ ఠాకూర్ సమాధానం ఇచ్చారు.
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం అమలు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది. రైతులకు సంబంధించి పంట దిగుబడి డేటాను రాష్ట్ర ప్రభుత్వం అందజేయాలి. డేటా అందిన 21 రోజులలో బీమా కంపెనీల ద్వారా క్లైమ్ పరిష్కారం అవుతుంది.
అంటే చంద్రబాబు సర్కారు.. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం పై దృష్టి పెట్టలేదనే విషయం కేంద్ర మంత్రి ఇచ్చిన సమాధానం సాక్షిగా బయటపడంది.
ఈ పథకం ఎందుకో తెలుసా..?
ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) అనేది ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్లు లేదా అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఆర్థిక భద్రత కల్పించే కేంద్ర ప్రభుత్వ పంట బీమా పథకం. రైతులు తక్కువ ప్రీమియంతో తమ పంటలకు పూర్తి రక్షణ పొందేలా ఈ పథకాన్ని రూపొందించారు.
ఇది చంద్రబాబు సర్కారు అలసత్వం..
మరి ఈ పథకాన్ని వినియోగించుకోవడంలో ఏపీ ప్రభుత్వం చూపిన అలసత్వం ఏమిటన్నది తాజాగా రుజువైంది. చంద్రబాబు సర్కారుకు రైతు సమస్యలపై దృష్టి లేదనడానికి ఇదొక ఉదాహరణ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అదే వైఎస్ జగన్ హయాంలో..
ప్రజా సంక్షేమాన్ని కానీ వారి సమస్యలను కానీ అత్యంత ఎక్కువ శ్రద్ధ పెట్టిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైఎస్ జగన్ నేతృత్వంలోని గత ప్రభుత్వం. అందుకు ఈ గణాంకాలే ఉదాహరణం. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో 2022-23లో 123.87 లక్షలు, 2023-24 లో 132.55 లక్షల మంది రైతులకు పంట బీమాకు ఎన్రోల్ అయ్యారు. మరి ఇప్పుడు ఆ సంఖ్య 18.88 లక్షలకు పడిపోయి చంద్రబాబు సర్కారు వైఫల్యానికి నిదర్శనంగా నిలిచింది.


